రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, సెప్టెంబర్ 2015, సోమవారం

వన్ బై టూ!

రచన- దర్శకత్వం: ప్రేమ్‌సాయి

తారాగణం: నితిన్‌, యామీ గౌతమ్‌, అశుతోష్‌ రాణా, నాజర్‌, రాజేష్‌,
హర్షవర్ధన్‌, సప్తగిరి, సురేఖావాణి తదితరులు
సంగీతం: కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌, సందీప్‌ చౌతా ( నేపధ్య సంగీతం)
ఛాయాగ్రహణం: సత్య పొన్మార్
బ్యానర్ : ఫోటాన్ కథాస్
నిర్మాతలు : గౌతమ్ మీనన్, వెంకట్ సోమసుందరం, రేష్మా ఘటాలా  

విడుదల : సెప్టెంబర్‌ 17, 2015
***

మిళం నుంచి కొత్త దర్శకుడు, ప్రభుదేవా అసిస్టెంట్, ప్రేమ్ సాయి రావడం రావడం ఒకేసారి తెలుగు- తమిళ ద్విభాషా చిత్రాల్ని భుజాన్నేసుకుని, మూడేళ్ళ పైగా అష్టకష్టాలు పడి పూర్తి చేశాడు. తెలుగులో నితిన్ తో, తమిళంలో జయ్  తో తీశాడు. అప్పటికి (2012 నాటికి) నితిన్ కొత్త మేకోవర్ తో ‘ఇష్క్’ అనే సూపర్ హిట్ లో నటించి కొత్త అధ్యాయం ప్రారంభించాడు. డజను ఫ్లాపుల అనుభవంతో ‘ఇష్క్’ విజయాన్నుంచి చాలా నేర్చుకుని, ఇక ముందు తన సినిమాల తీరు తెన్నులెలా ఉండాలో గట్టి నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఐతే  ‘ఇష్క్’ తర్వాత వెంటనే అదే సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ కి అంతలోనే  కష్టాలు మొదలయ్యాయి...

          సహజంగానే ఈ సినిమా మీద ‘ఇష్క్’ ఇమేజి ప్రభావముంటుంది. దీంతో ఇటు నితిన్ కొత్త రోమాంటిక్ లుక్ కీ,  అటు నితిన్ జానర్ కాని థ్రిల్లర్ కీ రెండిటికీ న్యాయం చేయాల్సిన బాధ్యత అప్పుడే కొత్త దర్శకుడి లేత భుజాల మీద పడింది. ఇన్ని కష్టాలు- ద్విభాషా చిత్రాలు- నితిన్ కొత్త ఇమేజి బ్యాలెన్సింగ్, ఎప్పుడు పూర్తవుతుందో తెలీని నిర్మాణం - ఇవన్నీ కోరి ఈ కొత్త దర్శకుడే తెచ్చుకున్నాడు. ఐతే ఇలా చేసి ఇతర కొత్త దర్శకులందరికీ ఓ హెచ్చరికలా నిల్చినందుకు మాత్రం అభినందించాలి! బలిదానాలతోనే భావితరాలు బాగుపడతాయి. 
          ఇంకో ప్రమాదం కూడా తన దాకా వచ్చే అవకాశం లేకపోయినా- ఈ సినిమాకోసం తను కాపీ చేసిన హాలీవుడ్ సినిమాయే అసలు తన నవల్లోంచి కాపీ చేశారని, 2011 లోనే ఓ రచయిత కేసేశాడు. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’  నిర్మాణానికి పూనుకుంటున్న సమయంలోనే, 2012 జులైలో ఆ కేసు కొట్టేశారు!
          సినిమా కంటే కూడా దర్శకుడి అనుభవాలు థ్రిల్లింగ్ గా వున్నాయి. వివరాల్లోకి వెళ్దాం...

సగాలు రెండు ఒకటైతే..

        ళ్యాణ్ ( నితిన్) బియ్యే చదువు మధ్యలో మానేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు. అతడికి అక్కా  బావలుంటారు ( హర్షవర్ధన్, సురేఖా వాణి). ఇంకో మిత్రుడు ( సత్యం రాజేష్) ఉంటాడు. ఇతను కొరియర్ బాయ్ గా పనిచేస్తూంటాడు. ఒకరోజు ఓ ఖాదీ భండార్ కి లెటర్ డెలివరీకి తను వెళ్ళ లేక కళ్యాణ్ కిచ్చి పంపిస్తాడు. ఆ లెటర్ తో అక్కడికి వెళ్ళిన కళ్యాణ్, ఆ అడ్రెస్సీ కావ్య ( యామీ గౌతమ్) కి అందించి, పనిలో పనిగా ప్రేమలో పడతాడు. ఇక రోజూ కలిసేందుకు, ఉత్తుత్తి కొరియర్ బాయ్ అవతారమెత్తి, రోజుకో కవరు సృష్టించి ఆమెకి డెలివరీ చేయడానికి వస్తూంటాడు. ఇది పసిగట్టిన ఆమె తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనీ, అతణ్ణి పెళ్లి చేసుకోబోతున్నాననీ చెప్పేస్తుంది. 

          ఇదిలా వుండగా, ఓ సైంటిస్ట్ (ఆశుతోష్ రాణా) ఓ  మెడికల్ స్కాంకి తెరతీస్తాడు. అతడికి మూలకణాలు (స్టెమ్ సెల్స్) అవసరం. వాటిని డబ్బున్న పేషంట్లకి అమ్ముకుంటాడు. ఇందుకోసం  గర్భవతుల్ని టార్గెట్ చేస్తాడు. వాళ్ళు గర్భం ధరించిన వెంటనే మాత్రలతో అబార్షన్లు చేయించి, అప్పుడే ఏర్పడిన తాజా పిండాల్ని కాజేస్తూంటాడు. వాటిలోంచి మూలకణాల్ని సేకరించి, స్మగ్లింగ్ చేస్తూంటాడు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొందరు డాక్టర్లని లోబర్చుకుని దందా చేస్తూంటాడు. అమాయక గర్భవతులు బలై పోతూంటారు. కళ్యాణ్ అక్క కూడా గర్భవతి అయితే ఆమెని  అలాటి ఒక డాక్టర్ దగ్గరికి తీసికెళ్తాడు కళ్యాణ్. ఆ డాక్టర్ ఆ మాత్రలే ఇస్తాడు. 


          ఈ డాక్టర్ భాగోతం పసిగట్టిన వార్డ్ బాయ్ ఈ విషయం రాస్తూ, ఆ మాత్రలున్న బాటిల్ని మానవ హక్కుల నేత సత్యమూర్తి (నాజర్) కి కొరియర్ లో పంపించి తను పారిపోతాడు. ఇది తెలుసుకున్న డాక్టర్ సైంటిస్టుకి చెప్తే, వెంటనే సైంటిస్టు గ్యాంగుని దింపుతాడు. ఆ కొరియర్ సత్య మూర్తికి చేరకుండా చేజిక్కించుకోవడానికి గ్యాంగ్ బయల్దేరుతుంది. అప్పటికే కొరియర్ బాయ్ గా ఉద్యోగంలో చేరిన కళ్యాణ్ చేతికే ఆ కొరియర్ వస్తుంది. అతను సత్యమూర్తికి డెలివరీ చేయగలిగాడా లేదా, అసలీ స్కాం గురించి ఎప్పుడు తెలుసుకున్నాడు, అక్కకూడా దీనికి బలవకుండా  కాపాడుకున్నాడా, సైంటిస్టుని ఎలా శిక్షించాడూ ..మొదలైనవి ఇక్కడ్నించీ సాగే కథ ద్వారా తెలుస్తాయి.

        విచిత్రంగా ప్రేమ కథ ఎక్కడో ఆగిపోయి, మూల కణాల గొడవ ప్రారంభమయినట్టు లేదూ? ఈ రెండు కథల రోమాన్సు గురించి స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.
 ఎవరెలా చేశారు       మార్పు లేకుండా నితిన్ తనకి పునర్జన్మ నిచ్చిన అదే  ‘ఇష్క్’ బ్రాండ్ లవర్ బాయ్ పాత్రలో  ఫస్టాఫ్, కాస్త యాక్షన్ జోడించిన మార్పుతో సెకండాఫ్ శ్రమ లేకుండా నటించేశాడు. తనని కష్టపెట్టే దృశ్యాలేం లేవు, కొన్ని ఫైట్లు తప్ప. పైగా ఎప్పుడో ఒప్పుకున్న సినిమా కాబట్టి, ఏ సైంటిస్టో దీనికి చాలా సార్లు ‘అబార్షన్లు’  కూడా చేశాడు కాబట్టి, పదేపదే ‘మూలకణాలు’ మాయమైపోయిన ఈ సినిమాలో తను చేయగలిగింది ఇంతకంటే వుండదు. ఈ గంటా 42 నిమిషాల మాత్రమే నిడివిగల సినిమా విడుదల, దర్శకుడికి ఇంకో సినిమా పట్టుకోవడానికే అవసరంగానీ, మరెవరికీ అవసరం లేదు. Nitin has already moved on, you know!

          కాకపోతే ఈ సినిమా అనుకున్నట్టు ముందే విడుదలై వుంటే, మంచు విష్ణు ‘డైనమైట్’ చేయడానికి అంత బాడీ బిల్డింగ్ చేసేవాడు కాదేమో. తను మెమరీ కార్డు తో పరిగెత్తాడు, నితిన్ కొరియర్ తో పరుగెత్తాడు. మధ్యలో 2014 లో న్యూవేవ్ థ్రిల్లర్ నిర్వచనానికి పక్కా నిదర్శనంగా, ‘రన్ రాజా రన్’ తో శర్వానంద్ పరుగెత్తేసి గెలిచేశాడు!

          హీరోయిన్ యామీ గౌతమ్ గ్రేస్ ఫుల్ నటి. చూడ్డానికి చక్కగా వుంటుంది. పాత్ర సరిగ్గా లేక ఈ సినిమాలో ఖాదీ భండార్ కీ, పాటలకీ పరిమితమై పోయిన షోపీస్ గా మిగిలిపోయింది. ఆశుతోష్ రాణా, నాజర్ ల పాత్రలు కూడా సరీగ్గా డెవలప్ కాని పాత్రలు. 

        సింగర్ కార్తీక్ ఈ సినిమాకి సంగీత దర్శకుడవడం అనే నావెల్టీ కూడా కాలాతీతమైన విడుదలతో కాలగర్భంలో కలవక తప్పలేదు. ఇతనూ, అనూప్ రూబెన్స్ ఇచ్చిన విడి విడి పాటలు హైలైట్ ఈ సినిమాకి. సందీప్ చౌతా నేపధ్య సంగీతం ఎప్పటిలాగే రణగొణ ధ్వని.  సత్య పొన్మార్ ఛాయాగ్రహణం ఇంకా స్టన్నింగ్ గా వుండాల్సింది. ఒకసారి ఈవారమే విడుదలైన హిందీ ‘కట్టీ బట్టీ’ లో తుషార్ కపూర్ విజువల్ వైభవం చూడండి. లైటింగ్ ఎఫెక్ట్స్ తెలియడమే కెమెరా మాన్ కి విజయం. 

          కొత్త దర్శకుడు ప్రేమ్ సాయి సినిమా తీయడంలో విఫలమవలేదు, సినిమా రాయడంలో దెబ్బతిన్నాడు. దీన్ని పక్కనబెడితే, దర్శకుడిగా టాలెంట్ వుంది. పైగా పూర్తిగా హాలీవుడ్ సినిమానే  కాపీ చేయకుండా, తనదంటూ కొత్త విషయాన్ని జోడిస్తూ అందుకవసరమైన రీసెర్చి చేశాడు. ఇంతమంచి రీసెర్చి నిష్ఫలమైపోవడానికి కారణం బ్యాడ్ రైటింగ్ అనే అలవాటే. ముందు రాత బావుంటే దాంతో తీత బావుంటుంది. 

          రెండోది, ఒక స్టార్ ని చూపించే విధానంలో ఎక్కడా లోపం జరక్కుండా చూసుకోవాలి. ఇది కూడా రైటింగ్ లో భాగమే. ఎక్కడో బుఖారెస్ట్ లో విలన్ కి అంత అట్టహాసంగా బిల్డప్ ఇచ్చి చూపించిన సీన్లు, అదే ఫారిన్ కంట్రీలో స్టార్ అయిన నితిన్ మీద కూడా వుండాలి. ఇవి కమర్షియల్ సినిమా లెక్కలు. గతంలో ఒక సారి ఎమ్జీఆర్ ఒక సినిమాలో విలన్ చేతిలో పదిహేను సార్లు ఏకబిగిన కొరడా దెబ్బలు తిని, తిరిగి అదే కొరడాతో ఆ విలన్ ని కొట్టినప్పుడు తక్కువ కొట్టాడు. ఇది గుర్తు చేసుకుని మర్నాడు మళ్ళీ అదే సీను షూటింగు పెట్టించి, పాతిక సార్లు ఛెళ్ళు ఛెళ్ళు మన్పించాడు ఆ విలన్ వొళ్ళంతా. లేకపోతే  విలన్ ఎన్నిసార్లు కొట్టాడు, తమ ప్రియతమ పురచ్చి తలైవార్ ఎన్నిసార్లు కొట్టాడూ అని అభిమానులు లెక్కెట్టు కుంటారని తర్వాత వివరణ ఇచ్చాడు.

స్క్రీన్ ప్లే సంగతులు

        ఇది మరో ఫ్రాక్చర్ అయిన బాపతు స్క్రీన్ ప్లే. నడుస్తున్న కథ మధ్యకి విరిగి, ఇంకో కథ మొదలయి నట్టుండడం. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథగా ప్రారంభమై నడుస్తున్న ప్రేమ కథకి,  ఇంటర్వెల్ ముందు అకస్మాత్తుగా బ్రేకు పడి, జానర్ మారిపోయి -మెడికల్ స్కాం కథ మొదలవడం. 

       కొరియన్ సినిమా ‘ఫోన్’ లో చైల్డ్ సెక్స్ స్కాం ని కనుగొన్న జర్నలిస్టు తో నడుస్తున్న థ్రిల్లర్ కథ కాస్తా,  ఆమె ఫోన్ని ఆత్మ ఆవహించడంతో, సూపర్ నేచురల్ హార్రర్ అనే వేరే కథగా (జానర్ గా) మారిపోయినట్టూ..

          బ్రిటిష్  సినిమా “హాట్ ఫేజ్’  లో పోలీస్ సినిమాలపై పేరడీగా గా నడుస్తున్న కథ కాస్తా, సెకండాఫ్ లో సీరియల్ కిల్లర్ సినిమాలపై పేరడీ గా మారిపోయినట్టూ..

          బాలీవుడ్ సినిమా ‘హవా’ లో, తల్లి కథగా నడుస్తున్న కథనం కాస్తా- ఆమె కూతురి కథగా కథనం మార్చుకుని అలాగే ముగిసినట్టూ..   ‘తెరేనామ్’ లో కూడా కొనసాగుతున్న హీరో హీరోయిన్ల  ప్రేమలతో అస్సలు సంబంధంలేని ఇంకో కథతో అతుకుపడినట్టూ..

          టాలీవుడ్ సినిమా  ‘దొంగోడు’ కథా ప్రారంభంలో హీరో చిన్నప్పటి విషాదకర జీవితంతో అదొక కథాత్మగా ఏర్పడ్డ సర్కిల్ ఆఫ్ బీయింగ్’ అనే స్క్రిప్టింగ్ టూల్ ని అందిపుచ్చుకుని అటుపైన కొనసాగాల్సి వుండగాహీరో పెద్దయ్యాక దీని ఊసే లేక ఆ కథాత్మ తెగిపోయినట్టూ..

           ‘థమ్’ లో నల్గురు యువకుల ప్రేమల్ని చక్కబర్చే హీరో కథగా నడుస్తున్న కథనం కాస్తాపాత ప్రియురాలు కన్పించగానే హఠాత్తుగా వీళ్ళని వదిలి పారేసిఆమెతో ఆ హీరో ప్రేమాయణంగా కథ ప్లేటు ఫిరాయించి నట్టూ..

            తాజాగా  జ్యోతి లక్ష్మిలో వేశ్యని  ప్రేమించి పెళ్ళాడిన కథగా నడుస్తున్న పెళ్లి కథ కాస్తా, దాన్ని వదిలేసి పక్కా వేశ్యాగృహపు యాక్షన్ కథలోకి మారిపోయినట్టూ..
          ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’  కూడా అలా ప్లేటు ఫిరాయించిన కథతో ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లేనే!

***
.
      రెండు గంటల లోపు నిడివి వున్న తెలుగు సినిమా ఎప్పుడూ సక్సెస్ అవలేదు. అది నేటివ్ నిడివి కాదు. దాన్ని కమర్షియల్ సినిమాగా ఫీలవలేరు తెలుగు ప్రేక్షకులు. తెలుగు సినిమా అంటే రెండు గంటలూ -  ఆపైన ఉండాల్సిందే. అలాంటిది  నితిన్ లాంటి  పాపులర్ స్టార్ తో గంటా ముప్పావు లోపు బుడ్డి సినిమా అంటే సాధారణ ప్రేక్షకులే కాదు, ఏ తెలుగు సినిమా ట్రేడ్ పండితుడూ దాన్నో కమర్షియల్ సినిమాగా భావించలేడు- ఎంతో బలమైన కథతో కూడుకున్నదై  వుంటే తప్ప. తెలుగు సినిమా అంటే ఫుల్ మీల్స్ లా రెండుగంటల పైబడి ఉండాల్సిందే.

          కానీ ఈ సినిమా దర్శకుడు ఇది రెండుగంటల పైబడిన నిడివి గల సినిమాయే  అన్నట్టు పొరబడి-- ఉన్న గంటా ముప్పావులో గంట సేపూ హీరోని కొరియర్ బాయ్ గానే దింపకుండా, సంబంధంలేని -కథకి తోడ్పడని-   ప్రేమ కథతోనే వృధా చేస్తే ఏమనాలన్నట్టు?

          ఇలా చేయడంవల్ల ఇంకో నష్టం కూడా జరిగింది. క్లయిమాక్స్ లోనే హీరో కి ఆ స్కాం గురించి తెలియాల్సి రావడమేనే సీన్ల పేర్పు అనివార్యమై, దాంతో బిగినింగ్ విభాగం సెకండాఫ్ తర్వాత కూడా తెగ సాగి- మరో మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలా కూడా తయారయింది! ఫ్రాక్చరైన స్ట్రక్చర్ కి తోడు  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే!

          సెకండాఫ్ కూడా దాటిపోయి   క్లయిమాక్స్ వరకూ సాగే ఈ బిగినింగ్ విభాగంలో, మొదట బుఖారెస్ట్ లో విలన్ స్కాం సూచనప్రాయంగా ఓపెన్ చేసి,  హైదరాబాద్ లో హీరో మీదికి వస్తారు. ఇక్కడ పూర్తి నిడివి ( అంటే రెండు గంటల పైబడి నిడివి వున్న)  సినిమాల్లో చూపించినట్టే, తీరుబడిగా మొదటి నుంచీ హీరో చరిత్రంతా చెప్పుకొస్తారు. తిరుపతిలో అతను ఎలా కవర్లు తయారు చేసే కుటీర పరిశ్రమలో పని చేశాడు, అది నచ్చక ఎలా హైదరాబాద్ లో అక్కాబావల దగ్గర చేరాడు, బియ్యే పూర్తి చెయ్యని అతను  బావ సలహాలతో ఏఏ ఉద్యోగ ప్రయత్నాలు ఎంత కామెడీగా చేశాడు, అప్పుడు కొరియర్ బాయ్ గా పనిచేస్తున్న తన ఫ్రెండ్ ఇచ్చిన కవరు తో ఎలా హీరోయిన్ కి పరిచయమై ప్రేమలో పడ్డాడు, పడ్డాక ఎలాగెలా కొరియర్ బాయ్ గా నటిస్తూ కామెడీగా ఆమెని పొందాలని చూశాడు, అతడి వ్యవహారం అర్ధమైన ఆమె ఎందుకు తనని కాదంటే ఇంకేం చేశాడూ...ఇదంతా నార్మల్ నిడివి సినిమా కథనం లాగా చాంతాడంత చేసుకు పోయారు. దీంతో పుణ్యకాలం కాస్తా గడిచి పోయింది. 

          ఇంకా దీనికి సమాంతరంగా హైదరాబాదుకి మకాం మార్చిన విలన్ ఇక్కడేం చేస్తున్నాడో చూపిస్తూ, ఆస్పత్రుల కొచ్చిన గర్భిణులకి అబార్షన్ లు కావడమనే ఒకలాటి సస్పెన్స్ తో బ్యాక్ డ్రాప్ ( ఇవి సబ్ ప్లాట్ సీన్లుగా పొరబడకూడదు, ముందు ముందు ఈ సీన్లే ప్రధాన కథ!)  సీన్లు వేస్తూ పోయారు. ఇలా ప్రేమ కథ- గర్భిణుల కథ విడివిడిగా సాగిసాగి- ఇంటర్వెల్ కి ముందు సడెన్ గా- ఆ గర్భస్రావాల రహస్యం విప్పుతూ,  డాక్టర్లతో విలన్ పెట్టే  మీటింగు పదినిమిషాలంతా సైంటిఫిక్ గా వివరిస్తూ, క్లిప్పింగ్స్ వేస్తూ గొప్ప హడావిడి చేశారు. దీంతో సినిమా స్వరం (టోన్)  పూర్తిగా మారిపోయి రస భంగమవడమే గాక- పిడుగుపాటులా ఇంకో కథ వచ్చి మీద పడినట్టయ్యింది.   

          ఇక్కడ్నించీ ఇక రహస్యం కొరియర్ ద్వారా బయటి కెళ్ళి పోయిందని విలన్ గ్యాంగ్ వేట మొదలవుతుంది. ఈ వేట కూడా ఎందుకో అర్ధంగాదు, ఆ కవరు సత్యమూర్తికి అందుతుందని తెలిసినప్పుడు సత్యమూర్తి ఇంటి దగ్గరే కాపేసి- సింపుల్ గా కొరియర్ బాయ్ వచ్చినప్పుడు తన్ని లాక్కోవచ్చు. ఇలా చేస్తే గంట ముప్పావు కూడా మిగలక గంటకే సినిమా ముగిసిపోతుందని కాబోలు- బుఖారెస్ట్ బిల్డప్ విలన్ ని ఉల్ఫా గాణ్ణి చేసి ఆడుకున్నాడు దర్శకుడు. 

          ఆ కొరియర్ కూడా వెంటనే హీరో చేతికి రాదు. దీని కోసం కూడా ఆడియెన్స్ ఇంకా వెయిట్ చేయాలి. ఆ కొరియర్ డెలివరీ తీసికెళ్ళిన ఫ్రెండ్ కి మరోసారి కోర్టు పని పడుతుంది. ఫస్టాఫ్ లో ఒకసారి ఇదేపని పడి హీరోకి కవరిస్తే, దాంతో  హీరో వెళ్లి హీరోయిన్ తో ఎటాచ్ అయిపోయాడు. ఇప్పుడు కృతకంగా కథనంలో మళ్ళీ హీరోకే కవరిచ్చే రిపీటీషన్. అంతసేపూ గ్యాంగ్ తన వెంట పడుతున్నారని కూడా ఆ ఫ్రెండ్ కి తెలీదు. ఆ కవరందుకున్న హీరో కూడా ఎవరో గ్యాంగ్ తన వెంట ఎందుకు పడుతున్నారో తెలుసుకోడు. తీరా సత్యమూర్తికి డెలివరీ ఇచ్చేటప్పుడు అతడితో మాట్లాడుతూ ఆ గ్యాంగ్ అక్కడే వుంటారు. వాళ్ళు అక్కడుండి ఎందుకు మానవ హక్కుల నేత సత్యమూర్తి దృష్టిలో పడాలి? అపార్ట్ మెంట్ బయటే కాపేసి హీరో మీద దాడి చేసి కవరు లాక్కోవచ్చుగా? 

          హీరో కవరు ఫ్లాట్ లో సత్యమూర్తికి డెలివరీ చేస్తే, ఇది కనిపెడతారు అక్కడే కూర్చున్న గ్యాంగ్. హీరో వెళ్ళిపోతాడు. సత్యమూర్తి ఆ కవరు విప్పిచూడకుండా-  అందులో బాటిల్ వుండి  ఎత్తుగా వున్నా కూడా- దాన్ని టీపాయ్ మీద పెట్టేసి గ్యాంగ్ తో మాటల్లో పడతాడు. నిత్యం అపాయాల మధ్య జీవించే మాన హక్కుల నేత సత్యమూర్తి లాంటి వాడు, ఈ వచ్చిన  వాళ్ళు  తనతో పనుండి  వచ్చిన పెద్దమనుషులు కాదని ఎందుకు పసిగట్టలేడో కూడా అర్ధంగాదు. పైగా వాళ్ళల్లో ఒకడు దగ్గు నటించి మంచి నీళ్ళు అడిగితే  తేవడానికి వెళ్లి పోతాడు. గ్యాంగ్ ఆ కవరు తీసేసుకుంటుంది. ఇంతలో హీరో తిరిగి వచ్చి ఘర్షణ పడతాడు. కవరు తిరిగి హీరో చేతికే వస్తుంది. మళ్ళీ వేట మొదలవుతుంది. ఇలా మొత్తం ఫాల్స్ డ్రామాతో ఈ థ్రిల్లర్ ని రక్తి కట్టించాలని చూశారు. 

          హీరోకి అప్పటికీ స్కాం గురించి తెలీదు- కానీ ఇంటర్వెల్లోనే ప్రేక్షకులకి తెలుసు. ఇలాటి దయనీయ detached కథనంతో పరుగు సాగిసాగి- ఆ కవరు హీరో విప్పి చూసేసరికి క్లయిమాక్స్ వచ్చేస్తుంది. ఇలా ఈ క్లయిమాక్స్ దాకా నడిచిన కథనమంతా అసలు విషయం తెలీని హీరోతో బిగినింగ్ విభాగమే! మిడిల్ మటాషే. ఇక్కడ్నించీ ఓ ఇరవైనిమిషాల వ్యవధిలోనే మిడిల్- ఎండ్ రెండూ ఇరుక్కుంటాయి. సినిమా ముగుస్తుంది. 

          ఫస్టాఫ్ లో ఎక్కడో ఆగిపోయిన హీరోయిన్ ఈ క్లయిమాక్స్ దాకా కన్పించదు.  క్లైమాక్స్ లో హీరో కోసం ప్రయత్నాలు చేస్తూంటుంది. తనకి వేరే బాయ్ ఫ్రెండ్ లేడట, అలా చెప్పడం హీరోని ఏడ్పించడానికేనట. మరి రేపు తన పెళ్లి వుందని ఖాదీ భండార్ ఒనరుకి చెప్పి సెలవుతీసు
కున్నది? హీరోకి ఎప్పుడు చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంది? అసలు విషయమేమిటంటే,  ఆమె బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతోందన్నట్టు సెలవు తీసుకుంటే -గొప్ప సస్పెన్స్ ఏర్పడి ప్రేక్షకులు కంగారు పడతారని దర్శకుడి అయిడియా. ఇలా ఫాల్స్ డ్రామాలతో థ్రిల్లర్ వర్కౌట్ అవుతుందా?

***
           ఈ కథ మొత్తాన్నీ దారిలో పెట్టాలంటే, ఇక్కడ దేని బ్యాక్ డ్రాప్ లో ఏది నడవాలో తెలుసుకోవాలి. తెలుసుకోనందుకే దారితప్పి ఈ పాట్లన్నీ. 
          మొట్ట మొదట ఓపెన్ చేసిన మెడికల్ స్కాం బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథ నడపాలా? లేకపోతే ప్రేమకథ బ్యాక్ డ్రాప్ లో మెడికల్ స్కాం నడిపించాలా? ఇది తెలుసుకుంటే ఈ కథ ఇంత గజిబిజిగా వుండదు. ముందు ఈ స్పష్టత లేకపోవడం వల్లే విడిగా ఒక ప్రేమ కథ- విడిగా మళ్ళీ ఒక స్కాం కథా నడిపించుకొచ్చి- ఏం చేయాలో అర్ధంగాక- ప్రేమకథ మీదికి స్కాం కథ ఎక్కించేసి తొక్కించేశారు. తట్టుకోలేక మొత్తం స్క్రీన్ ప్లేనే మధ్యకి విరిగింది. 

          దర్శకుడు ఈ సినిమా ద్వారా రొమాంటిక్ కామెడీతో ప్రేమకథ అస్సలు చూపించదల్చుకోలేదనీ, కేవలం ఒక థ్రిల్లర్ గా మెడికల్ స్కాం  కథే చెప్పాలనుకున్నాడనేది స్పష్టం. 

          అంటే  మెడికల్ స్కాం బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథని నామమాత్రం చేసి నడిపించాల్సిన సినిమా ఇది. ఒక బ్యాక్ డ్రాప్ లో ఇంకో కథ నడుస్తోందంటే బ్యాక్ డ్రాప్ లో వున్న కథే ప్రధాన కథవుతుంది. ఇది గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోనందు వల్లే మహేష్ బాబు నటించిన ‘బాబీ’ లో హీరో హీరోయిన్ల మాఫియా తండ్రులిద్దరి పోరాటాలతో, బ్యాక్ డ్రాప్ లో భీకరంగా సాగుతున్న కథ కంటే - వీళ్ళ ప్రేమకథ ప్రధానమైపోయి నడుస్తుంది. బ్యాక్ డ్రాప్ లో తండ్రులిద్దరూ నగరాన్ని అట్టుడికిస్తున్నా, అదేమీ పట్టించుకోకుండా  వారస రత్నాలు ప్రేమించుకుంటూ పాడుకుంటూ వుంటారు. నిజానికిది మాఫియాల బ్యాక్ డ్రాప్ లో నడుస్తున్న ప్రేమ కథ. అంటే మాఫియాలది ప్రధాన కథ. ప్రేమ కథ దానికి తోడ్పడే ఉపకథ. అలా ఈ ప్రేమ కథ వెళ్లి మాఫియా కథతో ఢీకొనడమో, మాఫియా కథే  ప్రేమ కథలో జోక్యం చేసుకోవడమో జరిగి- రెండూ ఒకటై ఒకే పట్టాల మీదికి రావాల్సిన వ్యవహారం. ఇలా బ్యాక్ డ్రాప్ తో ఉపకథ స్పర్శించనందుకే, లేదా ఉప కథతో బ్యాక్ డ్రాప్ స్పర్శించనందుకే  ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’  స్క్రీన్ ప్లే ఫ్రాక్చరై పోయింది.

            ‘శివ’ లో అది కాలేజీ కథ బ్యాక్ డ్రాప్ లో నడిచే మాఫియా కథా, లేకపోతే మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే కాలేజీ కథా? రెండోదే చూస్తాం. మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే కాలేజీ కథ. అంటే బ్యాక్ డ్రాప్ లో ఉన్నదే ప్రధాన కథ కాబోతోందని సూచనలిచ్చారు. ఈ బ్యాక్ డ్రాప్ లో వున్న పాత్రలు కాలేజీ కథలో వేళ్ళు పెడుతున్నాయి. చూసి చూసి హీరో తిరగబడ్డంతో, అరగంటలోనే బిగినింగ్ విభాగం ముగిసిపోయి- కాలేజీ ఉపకథ మాఫియా బ్యాక్ డ్రాప్ తో స్పర్శించింది.  మాఫియాతో పోరాటానికి పట్టాలెక్కేసింది.  

          కానీ ‘ఇష్క్’ సక్సెస్ తో మారిపోయిన నితిన్ ఈక్వేషన్స్ కి న్యాయం చేయాలన్న ఆదుర్దాతోనో ఏమో, కథ డిమాండ్ చేస్తున్న బ్యాక్ డ్రాప్ ప్రాధాన్యాన్ని నిర్లక్ష్యం చేసి- లవర్ బాయ్ గా సగం సినిమా ప్రేమకథతో తో ప్రేక్షకుల్ని సంతృప్తిపర్చేద్దా మనుకుని, మిగతా సగం యాక్షన్ హీరోగా స్కాం  కథ చెప్పేసి ముగిద్దా మనుకున్నట్టుంది చూస్తే.

***
           ఓసారి ఈ కథ ఎలా వుంటే బావుండేదో సరదాగా చూద్దాం.. ఒకరి కథలో లోపాలుంటే చెప్పుకోవచ్చు. కానీ ఆ కథ మొత్తం ఇలా వుండాలని చెప్పడం మాత్రం సబబు అన్పించుకోదు. అయినా చొరవ తీసుకుని లూజ్ లూజ్ గా చూసేద్దాం..
            ఈ షార్ట్ కమర్షియల్ సినిమాకి సంబంధించి మన కామన్ సెన్స్ ఏం చెబుతోందంటే, ఓ మెడికల్ స్కాంతో  సినిమా ఓపెనయ్యాక, ఇటు హీరోని చూపిస్తే అతను ఆల్రెడీ కొరియర్ బాయ్ గా పని చేస్తూనే వుండాలి. అతడి జీవిత చరిత్ర అనవసరం. సమయాభావంవల్ల ఈ కథనానికి వీలైనంత క్లుప్తత అవసరం. ఇక అదే కంపెనీలో హీరోయిన్ కూడా కొరియర్ గర్ల్ గా పని చేస్తూండాలి. ఎందుకంటే, ఒక పక్క స్కాం కి బలైపోతున్న సామాన్య మహిళల్ని చూపించుకొస్తూనే  మరో పక్క- దీంతో తనకేం సంబంధం లేనట్టు, సాటి మహిళ అయిన హీరోయిన్ స్థాయిలో వున్న పాత్రని, మేకప్ చెక్కు చెదరకుండా, ఎప్పటికప్పుడు కొత్తకొత్త  కాస్ట్యూమ్స్ తో, ముట్టుకుంటే కందిపోయే అందచందాలతో, ఇంకేదో లోకంలో జీవిస్తున్న దొరసానిలా చూపించడం సంస్కారం లేని కథనమే అవుతుంది కాబట్టి.  

          రెండోది, పోరాటానికి సిద్ధం చేసేముందు సమీకరణల సంగతి. కురుక్షేత్ర మహా సంగ్రామంలో సమీకరణ లెలా వున్నాయి? ఇక్కడ కూడా పెద్ద తలకాయలతో బిగ్ స్కాం జరుగుతోంది- బలవుతున్నది అమాయక సగటు మహిళలు. దీనికి ప్రతిగా సగటు జీవుల పోరాటమే వుండాలి. హీరో సగటు యువకుడే అయినట్టు, అలాటి కొరియర్ పని చేసే సగటు యువతిగానే హీరోయిన్ కూడా వుండాలి. అప్పుడే ఈ ఎదురెదురు పోరాట శక్తుల సమీకరణలు విజువల్ గా కంటికింపుగా వుంటాయి. ఒకవైపు బిగ్ షాట్స్- మరోవైపు ఆమ్ ఆద్మీలు. ఇలా పాత్రల్ని సమీకరించాలి. లేదనుకుంటే హీరోయిన్ ఆ బిగ్ షాట్ విలన్ కూతురైపోవాలి. ఎటూ కాని గ్లామర్ పాత్రగా మాత్రం ఈ కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ లో చోటు లేదు. థ్రిల్లర్ లో వున్న ప్రతీదీ దానికి తోడ్పడేదే అయి వుండాలి- మూసఫార్ములా నాన్సెన్సులు ఇందులో జొరబడాల్సిన అవసరం లేదు. 

          అలా కొరియర్ వృత్తిలో ఇద్దరూ కలిసిసాగే కథనంలో, వాళ్ళు ఆల్రెడీ ప్రేమికులని చెప్పేయా లి. ఇలా హాఫ్ వేలో చెప్పేయడం వల్ల సమయం కలిసివస్తుంది. ఆ ప్రేమ సరదాల మధ్య మధ్యే స్కాం కి సంబంధించిన సీన్లు రావాలి. హీరో తన అక్కని కూడా డాక్టర్ దగ్గరికి తీసేకెళ్తే, ఆ డాక్టర్ అలాటి మాత్రలే ఇవ్వడాన్ని ఇక్కడే చూపించాలి. ఇలా కథా నేపధ్యం ఏర్పాటయ్యింది, పాత్రల పరిచయం జరిగింది. ఇక సమస్యకి ( సంఘర్షణ కి ) దారి తీసే పరిస్థితుల కల్పనగా ఓ ఆస్పత్రిలో వార్డ్ బాయ్ ని ఓపెన్ చేసి- ఆ స్కాం సీక్రెట్ వున్న కవర్ని తీసుకుని  కొరియర్ ఆఫీసుకు వచ్చే సీను వేయాలి. ఆ కొరియర్ డెలివరీ ఇవ్వడానికి ఏరియా ప్రకారం హీరోయిన్ చేతికి రావాలి. ఈలోగా కొరియర్ సత్యమూర్తికి వెళ్లిపోతోందని పసిగట్టిన విలనూ అతడి గ్యాంగూ, ఆ  వార్డ్ బాయ్ ని చంపి-  కొరియర్ ని చేజిక్కించుకోవడానికి హీరోయిన్ వెంట పడాలి- ఈ ఘట్టమే కథలో సమస్య- లేదా సంఘర్షణ ఏర్పాటుకి కారణమై, బిగినింగ్ విభాగం ఓ అరగంటలో ఇక్కడే ముగిసిపోవాలి. ముగిసి, సంఘర్షణతో మిడిల్ విభాగం ప్రారంభం కావాలి. 

          ఈ మిడిల్ లో విలన్ తో ప్రారంభమైన సంఘర్షణలో భాగంగా, హీరోయిన్ ని రక్షిస్తూ హీరో ఆ కొరియర్ ని హీరో తీసుకుని, ఆటని తను టేకోవర్ చేయాలి. హీరోయిన్ కూడా తోడుంటే ఉండొచ్చు. గ్యాంగ్ వెంటపడతారు.  వాళ్ళని ఎదుర్కొంటూ వీలుచూసుకుని హీరో ఇదంతా అసలెందుకు జరుగుతోందని, రూల్స్ కి విరుద్ధమైనా, ఆ కొరియర్ విప్పి చూసెయ్యాలి. అలా అప్పుడే హీరో ఏదో స్కాం జరుగుతోందని పసిగట్టాలి. కవర్లో ఆ మాత్రలున్న బాటిల్ ని గుర్తు పట్టి -అక్క గుర్తుకి రావాలి. ఆమెకీ ఇలాటి మాత్రలే ఇచ్చాడు డాక్టర్. వెంటనే ఎలర్ట్ అయి అక్కని అప్రమత్తం చేయాలి. అప్పటికే ఆమె చాలా మాత్రలు వాడేసి వుండాలి. ఇలా  మిడిల్ విభాగం ప్రారంభమైన పదిహేను నిమిషాల్లోపు  పించ్ - 1 పాయింటుకి కథనం చేరుకుని,  ఇక్కడ హీరో కవరు విప్పి చూసెయ్యాలి.  ఈ పించ్-1 పాయింటే ఇంటర్వెల్ కి దారి తీసే పరిస్థితిని సృష్టిస్తుంది. 

          బిగినింగ్ ముగిస్తున్నప్పుడు, అంటే మిడిల్ ని ప్రారంభిస్తున్నప్పుడు,  హీరో చేతికి ఆ కవరొచ్చింది- పించ్ 1 దగ్గర ఆ కవరులో ఏముందో చూశాడు, నెక్స్ట్ దీన్ని పట్టుకుని అసలీ స్కాం దేని గురించో తెలుసుకుందామని,  మిడిల్ మిడ్ పాయింటుకి-  అంటే ఇంటర్వెల్ సీను కేసి  హీరో సాగిపోవాలి. 

            పించ్- 1 వరకూ ఈ ముప్పావు గంట సేపూ కథనంలో ప్రేక్షకులకి సూచన ప్రాయంగా తెలుస్తున్న స్కాం, ఇప్పుడు హీరోకి కూడా సూచన ప్రాయంగానే తెలిసింది. పూర్తి స్పష్టత రాలేదు. ప్రేక్షకులతో పాటు హీరో ఒకే ట్రాకులోకి వచ్చేశాడు. ప్రేక్షకులకి రిలీఫ్. ఇంతసేపూ ప్రేక్షకులకి ఒక తహతహ వుంటుంది. అసలా సబ్ ప్లాట్ లాగా  ముక్కలు ముక్కలుగా చూపిస్తున్న స్కాం ఏమిటో, అదెందుకు జరుగుతోందో తెలుసుకోవాలన్న తహతహ. ఈ తహతహని  దర్శకుడెప్పుడు, ఎలా తీరుస్తాడా అని ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు (చూసేట్టు చెయ్యాలి) -ఇప్పటికి హీరో కూడా తమ ట్రాకులోకే వచ్చెయ్యడంతో హమ్మయ్యా అనుకుంటారు. తమలాగే ఇక్కడ హీరోకి కూడా సూచనప్రాయంగా ఏదో స్కాం వుందని తెలిసిపోయిందని అర్ధం జేసుకుంటారు. కాబట్టి ఇతనే ఆ స్కాం ని పూర్తిగా వెల్లడించి, తమ తహతహ తీర్చే దేవుడని ఉబలాటపడతారు. 

          ఇంత సన్నివేశ బలం వున్నఈ కీలక పించ్ - 1 దగ్గర్నుంచీ ఇంకెక్కడా హీరో ప్రేక్షకుల్ని వదిలెయ్యకుండా, తన వెంటే తీసుకుపోతూండాలి. తను తెలుసుకుంటున్నవి వాళ్ళకీ తెలిసేలా చేస్తూ ఏకకాలంతో వాళ్ళూ థ్రిల్, ఎక్సయిట్ మెంట్, షాక్ మొదలైన భావోద్వేగాలకి లోనయ్యేట్టు చేయాలి. స్కాంకి  సంబంధించి బిగినింగ్ విభాగం లో ప్రేక్షకులతో కనెక్ట్ కాలేదు హీరో. ఇంకాలస్యం చేయకుండా ఈ మిడిల్ విభాగపు పించ్  -1 దగ్గర ఆడియెన్స్ తో కనెక్ట్ అయిపోవాలి. దీనివల్ల నత్తనడక నడవకుండా కథనంలో వేగం పెరుగుతుంది. హీరో యాక్టివ్ పాత్రగా మారతాడు. బ్యాక్ డ్రాప్ ని స్పర్శిస్తున్నాడ న్న ఆశాభావం కథనం రేకెత్తిస్తుంది. 

          ఇప్పుడు ఇంటర్వెల్ దగ్గరలో విలన్ ( సైంటిస్టు) డాక్టర్లతో మీటింగు పెట్టి, తన స్కాం సాంతం ఓపెన్ చేసి ట్రైనింగ్  ఇస్తూంటే,  హీరో చాటున గమనిస్తూండాలి. కథకి గుండెకాయ అనదగ్గ సీను. ఇది కథలో హిడెన్ ట్రూత్. ఇక్కడే హీరోతో బాటు ఆడియెన్స్ కూడా గుండెలు చెదిరే రహస్యం తెలుసుకుంటున్నారు. ఆడియెన్స్  కూడా మొట్ట మొదటి సారి విలన్ దుర్మార్గపు పథకం గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు కాబట్టి- మూలకణాల వ్యాపారం గురించి విలన్ ఇస్తున్న సైంటిఫిక్  డేటాతో బాటు, గర్భస్రావాలు ప్లానూ చెబుతూంటే సీను ఓకే బిగ్ బ్యాంగ్ ఇచ్చి బ్లాస్ట్ అవ్వాలి. 

          పిండాలని చంపుతూంటే పుట్టాలనుకుంటున్న పిల్లల ఆర్తనాదాలతో, స్త్రీల రోదనలతో  బిజిఎం లో మెలోడ్రామా హోరెత్తి పోవాలి. హీరోకి తన అక్క కూడా ఎంత ప్రమాదంలో పడిందో అప్పుడే తెలిసిరావాలి- వెంటనే ఆమె కి ఫోన్ చేసేందుకు పరిగెత్తబోతూంటే విలన్ చూసెయ్యాలి. స్వయం గా విలనే వచ్చి ఒక్క తన్ను తన్నాలి. హీరో చేతిలో సెల్, కవరూ ఎటో ఎగిరిపోవాలి. అతను కుప్ప కూలాలి. స్టాప్ మోషన్ లో ఇంటర్వెల్.

***
       ఇప్పుడొక సారి చూద్దాం...బిగినింగ్ ముగిసే చోట మొదటి మూలస్థంభం దగ్గర, కొరియర్ అనే ప్లాట్ డివైస్ కథలోకి రావడం, పించ్-1 దగ్గర అందులో ఏముందో హీరో చూడ్డం, మిడ్ పాయింట్ ఇంటర్వెల్ దగ్గర, ఆ కొరియర్ తాలూకు స్కాం మొత్తాన్నీ హీరో కళ్ళారా చూడ్డం.. ఇలా కథకి లంగరేసి పట్టి ఉంచే ఈ మూడు కీలక పాయింట్లలో, స్టెప్ బై స్టెప్  ఒక్కో విషయం రివీలవుతూ, రివీలవుతున్న కొద్దీ  పరిస్థితి తీవ్రత పెరుగుతూ, టైం అండ్ టెన్షన్ ఎలిమెంట్ అమలవుతూ పోతోంది. దీంతో బాటే, బిగినింగ్ విభాగంలో ఇంకా బ్యాక్ డ్రాప్ తో స్పర్శలేక పాసివ్ గా వున్న హీరో, ఇప్పుడు మిడిల్లో  ఆ స్పర్శతో పూర్తిగా యాక్టివ్ గా మారిపోయి- క్యారక్టర్ ఆర్క్ పైపైకి సాగుతోంది. అతడి ఫిజికల్ గోల్ స్కాంని బద్దలు చేయడమైతే, ఎమోషనల్ గోల్ అక్కని కాపాడుకోవడంగా ఎష్టాబ్లిష్ అయ్యింది ఇంటర్వెల్ కొచ్చేసి. ఇలా కథలో జరగాల్సినవి సకాలంలో జారుతూ స్ట్రక్చర్ పక్కాగా వుంది. 
          ఇప్పుడు  ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ప్రారంభంలో, అంటే మిడిల్ విభాగం తరవాయి భాగంలో-  విలన్ హీరో సెల్ ఫోన్ లో వీడియో చూస్తూండాలి. అది ఇందాకా చాటుగా హీరో తీసిందే. అప్పుడు కింద కుప్పకూలిన హీరో లేచి విలన్ని ఒక్క తన్ను తన్నాలి. జామా ఖర్చు బరాబర్- ఎమ్జీఆర్ స్టయిల్లో.  ఎగిరిపోయిన సెల్ నీ, కవర్నీ క్యాచ్ పట్టి హీరో పారిపోవాలి. 

          సినిమాలో అక్క పాత్ర పన్నెండేళ్ళుగా సంతానవతి కాలేక- ఇప్పుడు అవబోతున్నట్టు  చూపించారు. ఇదే నేపధ్యంలో ఆ మాత్రలవల్ల ఆమె గర్భం పోగొట్టుకుని, భర్తకి మొహం చూపించలేక ప్రాణాలు తీసుకోవాలి. హీరో వచ్చేసరికి ఇదీ పరిస్థితి.

          ఇది మిడిల్ విభాగపు కథనం. ఇక్కడ కథనం బిగినింగ్ విభాగపు లాంటి తేలికదనంతో  వుండకూడదు. మొత్తం సంఘర్షణాత్మకంగా, సీరియస్ నెస్ తో రగిలిపోతూ వుండాలి.  హీరోకి ఇలాటి వ్యక్తిగత నష్టమే జరగాలి. అప్పుడే  గోల్ కి ఎనలేని బలం, ఎమోషన్, పరిణామాల పట్ల వెరవని తెగింపూ వచ్చేస్తాయి. అంతేగాక విలన్ దుర్మార్గాలు పెరుగుతూంటే, అది టైం అండ్ టెన్షన్ స్థాయిని  పెంచుతూ, హీరోని ఉక్కిరిబిక్కిరి చేస్తూంటుంది. 

          అక్క పరిస్థితి చూశాకా అక్కడ్నించీ హీరో పవర్ఫుల్ సత్యమూర్తికి ఆ కవరందించేసి, విషయం చెప్పెసేందుకు వెళ్లిపోవాలి. విలన్ గ్యాంగ్ ద్విముఖ వ్యూహంతో వుండాలి. ఒక గ్రూపు కవరు కోసం హీరోని వెంటాడుతూంటే, ఇంకో గ్రూపు సత్యమూర్తి ఇంటి దగ్గర పొంచివుండాలి. హీరోకి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితి ఏర్పడాలి. వెంటాడుతున్న గ్రూపుని తప్పించుకుని సత్యమూర్తి ఇంటి కొస్తే, ఇక్కడ ఆ రెండో గ్రూపు కవరు కోసం ఎటాక్ చేయాలి. ఈ గొడవకి బయటి కొచ్చి అడ్డు పడిన సత్యమూర్తి అనూహ్యంగా చనిపోవాలి. గ్యాంగ్ పారిపోవాలి. సత్యమూర్తి మరణంతో హీరోకి ఇంకో నష్టం జరిగిపోవాలి. హీరోకి దారులన్నీ మూసుకుపోతూండాలి. 

          అయితే బిగినింగ్ విభాగంలో ప్రేక్షకులు చూసిన, హీరో చూడని సంఘటన లున్నాయి. అవి గర్భ స్రావాలైన స్త్రీల పరిస్థితి. ఒకరిద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఇవి కూడా హీరో కళ్ళారా చూస్తేనే- తను తెలుసుకున్న స్కాం పరిణామాలెలా ఉండబోతాయో అర్ధమవుతుంది. అలాటి దృశ్యాలు రెండు మూడు ఇప్పుడు హీరోకీ అనుభవం కావాలి.           ఇక ఈ సమస్యకి పరిష్కారంగా పోలీసుల దగ్గరికెళ్ళి పోవాలనుకోవాలి. కానీ ఇక్కడ అసలుకే మోసం వచ్చే పరిస్థితి వుందని తెలుసుకోవాలి. వ్యవస్థలన్నీ ఇలాగే ఉంటాయనీ, వాళ్ళ చేతిలో తను ఆధారాలు పెడితే వాళ్ళే ప్రయోజనం పొందుతారని అర్ధమైపోయి - ఇక ఒకే ఒక్క పనికి- సోషల్ మీడియాలో ఈ స్కాం రట్టు చేసేందుకు సిద్ధమైపోవాలి.

          అయితే విలన్ హీరో కంటే ఒకడుగు ముందుండాలి. హీరోయిన్ని కిడ్నాప్ చేసెయ్యాలి. హీరో ఆ ఆధారాల్ని సోషల్ మీడియాలో బట్టబయలు చేయకుండా, ఈ కిడ్నాప్ తో చెక్ పెట్టాలి. గర్భిణులతో నా వ్యాపారాన్ని నువ్విలా మూయించేస్తే, నీతో నీ హీరోయిన్ గర్భమే ధరించకుండా  గర్భ సంచీనే  తీయించేస్తా-  అని బెదిరించాలి. దీంతో  మిడిల్ విభాగం ముగిసి ఎండ్ (క్లయిమాక్స్) విభాగంలో పడుతుంది కథ. 

          ఇలా హీరోయిన్ కిడ్నాప్ తో ఇక్కడ రెండో మూల స్థంభం ఏర్పాటయింది. ఇదెలా ఏర్పడింది? రెండో మూల స్థంభం మిడిల్ విభాగం లో పించ్- 2 అనే పాయింటు వల్ల ఏర్పడుతుంది. హీరో పోలీస్ స్టేషన్ కెళ్ళడం పించ్-2. అక్కడ్నించే పరిస్థితులు కిడ్నాప్ కి దారి తీ శాయి. అలా కిడ్నాప్ తో కథ మలుపు తిరిగి మిడిల్ ముగుస్తూ రెండో మూల స్థంభం ఏర్పాటయింది. అంటే ఫస్టాఫ్ లో పించ్ -1 ఇంటర్వెల్ కి దారి తీసే పాయింటైతే,  సెకండాఫ్ లో  పించ్- 2 క్లయిమాక్స్ కి దారి తీసే పాయింటని గుర్తు పెట్టుకోవాలి.

ఇప్పుడొకసారి చూద్దాం.. 

          ఫస్టాఫ్ లో మొదటి మూలస్థంభం లేదా ప్లాట్ పాయింట్- 1 : కథలోకి కొరియర్ ప్రవేశించడం. 
పించ్ -1 : కొరియర్ లో ఏముందో హీరో తెలుసుకోవడం.
మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) :  స్కాం సంగతి హీరో కళ్ళారా చూడ్డం.
సెకండాఫ్ లో  పించ్- 2 : హీరో పోలీస్ స్టేషన్ కెళ్ళడం.
రెండో మూల స్థంభం లేదా ప్లాట్ పాయింట్ -2 : హీరోయిన్ కిడ్నాప్.

          ఇదీ  స్ట్రక్చర్. ఈ అయిదు పిల్లర్స్ స్క్రీన్ ప్లేని పకడ్బందీగా నిలబెట్టాయి. స్క్రీన్ ప్లేలో ఈ ఐదు పిల్లర్సూ ఒకదాని పర్యవసానంగా మరొకటి ఏర్పడుతూపోయి కథని సమగ్రంగా ముందుకు నడిపించాయి.
***
           డేవిడ్ కెప్ పేరు వినే వుంటారు. జురాసిక్ పార్క్, మిషన్ ఇంపాసిబుల్, మెన్ ఇన్ బ్లాక్-3 వంటి 30 భారీ సినిమాలకి రచన చేసిన టాప్ -5 హాలీవుడ్ స్క్రీన్ రైటర్లలో ఒకడు. ఈయన రచన చేసిన సినిమాలు 2.3 బిలియన్ డాలర్ల కలెక్షను సాధించాయి. 2012 లో ‘ప్రీమియం రష్’ అనే స్క్రిప్టు రాసుకుని దర్శకుడయ్యాడు. 
          ఇందులో యంగ్ హీరో న్యూయార్క్ లో ఒక పెద్ద నెట్ వర్క్ గా వుండే 1500 మంది సైకిల్ మెసెంజర్ బాయ్స్ లో ఒకడు. అక్కడ మెసెంజర్ బాయ్స్ ( కొరియర్ బాయ్స్) ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించేందుకు, తద్వారా స్పీడ్ డెలివరీ చేసేందుకు సైకిళ్ళ మీదే  విన్యాసాలు చేస్తూ దూసుకుపోతారు (ఈ వ్యవస్థ ఒకప్పుడు ఉండేదనీ, ఇంటర్నెట్ వచ్చాక అంతరించిపోయిందనీ అంటారు).  ఈ సినిమాని డేవిడ్ నేటి యువతరం ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని న్యూవేవ్ థ్రిల్లర్ గా తీశాడు. ఇందుకు ఈ కథని  ‘టైం లాక్’ స్టోరీ లిమిట్ లో పెట్టి నడిపాడు. కథాకాలం కేవలం 93 నిమిషాలు. గంటన్నరలో అంటే 90 నిమిషాల్లో హీరో కొరియర్ డెలివరీ చేయాలి. దాటితే ఉపయోగం వుండదు. ఈ గంటన్నరలో ఫటాఫట్ గా ఏమేం జరిగాయన్నదే కథ. 
 
          ఈ టైం లాక్ లోనే కథ కొన్ని పొరలుగా వుంటుంది. ఒక్కో పొరలో ఒక్కో ఫ్లాష్ బ్యాక్ ఓపెనవుతుంతుంటుంది.  ఈ ఫ్లాష్ బ్యాకులు కేవలం అంతకి ముందు గంట క్రితమో, గంటన్నర క్రితమో జరిగిన సఘతనలే అయ్యుంటాయి తప్ప- పెద్ద దుకాణం పెట్టి చరిత్రలు చెప్పుకొచ్చే సోదిగా వుండవు. అలా చేస్తే గంటన్నరలో టైం లాక్ తో స్పీడుగా సాగుతున్న ప్రస్తుత కథ దెబ్బతింటుంది. స్క్రీన్ మీద టైం తెలియడానికి డిజిటల్ క్లాక్ రన్ అవుతూ వుంటుంది. అవసరమున్న సమయంలో ఇది కన్పిస్తూ వుంటుంది. ఫ్లాష్ బ్యాక్ పడ్డప్పుడు టైం వెనక్కి రన్ అవుతుంది.

          ఇందులో హీరో చదువు మానేసిన వాడే. అయితే అందుకో కారణం వుంటుంది. లా చదివి లాయరై ఎవరివో గొడవలు పరిష్కరిస్తూ జీవితం గడిపెయ్యలేనని తెలుసుకుని, చదువు మానేసి మరో థ్రిల్లింగ్ గా వుండే వృత్తికోసం చూస్తూంటే, సైకిళ్ళ మీద సాహసోపేతమైన మెసెంజర్ బాయ్స్ ఆకర్షిస్తారు....ఇది చెప్పడానికి ఫ్లాష్ బ్యాక్ ఏమీ వేయరు. డైలాగుల్లో వచ్చేస్తుంది.. 

          హీరోయిన్ కూడా మెసెంజర్ గర్ల్ గానే వుంటుంది. ఆల్రెడీ ఇద్దరూ ప్రేమలో వున్నారని మనకి తెలుస్తూంటుంది. పదినిమిషాల్లో బిగినింగ్ ముగించేసి- ఒక యూనివర్సిటీలో చదివే చైనీస్ అమ్మాయి, హీరోకి కొరియర్ అందించి, అర్జెంటుగా దాన్ని చైనా టౌన్ లో ఒకరికి డెలివరీ చేయాలని చెప్పడంతో మిడిల్ ప్రారంభమవుతుంది. 

          ఆ కొరియర్ కోసం ఒక పెద్దమనిషి వెంటబడతాడు. అతడి కారూ- హీరో సైకిలూ ఛేజింగ్స్ మొదలవుతాయి. తనని చంపేసేట్టు  ఉన్నాడని, కారు నంబర్ ఫోటో తీసుకుని పోలీస్  స్టేషన్ కి చేరుకుంటాడు  హీరో. ఆ పెద్ద మనిషి అక్కడే ఉంటాడు పోలీసు అధికారిగా.

          హీరో తప్పుకుని దాక్కుని,  అసలా కొరియర్ లో ఏముందో  చూస్తేస్తాడు. ఇది స్క్రీన్ ప్లేలో 28 వ నిమిషంలో వస్తుంది.  

          ఆ కొరియర్ లో ఒక టికెట్ వుంటుంది. చైనా నుంచీ  ఓడలో మనుషుల్ని అమెరికాకి స్మగుల్ చేసే టికెట్. ఆ అమ్మాయి తన తల్లినీ కొడుకునీ ఇలా అక్రమ మార్గంలో అమెరికాకి రప్పించుకోవాలనుకుంటోందికుంది.. 

          ఇది ముందే ఏజెంట్ ద్వారా తెలుసుకున్న ఆ పోలీస్ అధికారి- ఆ టికెట్ కొట్టేయాడానికి వెంట బడుతున్నాడు. ఆ టికెట్ అమ్ముకుంటే 50 వేల డాలర్లు వస్తాయి. ఈ డబ్బు ఎందుకనే దానికి క్లాక్ లో టైం మధ్యాహ్నం  3.37  గంటలకి వెనక్కి చూపించి- అప్పుడేం జరిగిందో ఫ్లాష్ కట్ పడుతుంది. గత కొంతకాలంగా గ్యాంబ్లింగ్ లో భారీగా బకాయి పడుతూ వస్తున్న ఆ పోలీసు అధికారి,  ఎంతకీ ఆ బాకీ తీర్చకపోవడంతో చిత్తుగా తన్నులు తిన్నాడు. ఇక లాభం లేదని ఆ బాకీ తీర్చెయ్యడం కోసం ఈ టికెట్ మీద కన్నేశాడన్నమాట...

          చాలా కథ చిన్నదే, కానీ కథనం గొప్పది. యూత్ ని ఎలా కట్టిపడెయ్యాలో అలా కట్టిపడేసే టెక్నిక్ డేవిడ్ కెప్ ది, దీన్ని తెలుగు తమిళాల్లో దింపాలనుకున్న దర్శకుడు  కొరియర్ వెనుక కథ మార్చేసి మెడికల్ స్కాం పెట్టడం గొప్పతనమే- కానీ కథ చేసుకోవడం దగ్గరే వచ్చింది సమస్య!  స్క్రీన్ ప్లే నిరక్షరాస్యత దర్శకత్వాల్ని పట్టి పల్లార్చుతోంది...


సికిందర్ 







         



                     



         





         

 






17, సెప్టెంబర్ 2015, గురువారం

నాటి సినిమా!



ఎందరో దేవదాసులు- ఒక్కరే అక్కినేని నాగేశ్వర రావు. ఒక పురాతన
నవలా పాత్ర తరానికి నాల్గేసి సార్లు భిన్న రూపాల్లో వెండి తెరల కెక్కెతూ,
జన హృదయాల్ని దోచుకోవడం ఒక్క ‘దేవదాసు’ విషయంలోనే జరిగింది.
ఆ భిన్నరూపాలన్నీ ఒక్క అక్కినేనికే ఉపగ్రహాలయ్యాయని
ప్రపంచమే ఆయనకి  మోకరిల్లింది..


          క్కినేని నాటికి శరత్ బాబు జీవించి వుంటే, తన దేవదాసుకి అక్కినేని అభివ్యక్తికి సంభ్రమాశ్చర్యాలకి లోనై  నవలని పదేపదే తిరగరాసుకుందుకు విఫలయత్నాలు చేసి వుండేవాడేమో. పాత్రని సృష్టించిన తనకే అందని ఉన్నత శిఖరాలకి చేర్చిన అక్కినేని  అభినయ కౌశలానికి అస్త్ర సన్యాసం కూడా చేసి వుండే వాడేమో. నటన వచ్చేసి ఇలా సాహిత్యాన్ని శాసిస్తే ఆ నటనకే ఎనలేని గౌరవం. ఇందుకే దేవదాసు పాత్ర పోషణ మీద గుత్తాధి పత్యాన్నంతా ఒక్క మహానటుడు అక్కినేనికే కట్ట బెట్టేసి, జేజేలు పలుకుతోంది క్లాస్ మాస్ ప్రేక్షక లోకమంతా ఒక్కటై.

          ఒక నడిచే నరకం దేవదాసు. కొన్ని నగ్న సత్యాల్ని తెలుసుకోవాలంటే ఇలా జీవితాన్ని కాల్చుకోవాలేమో. నాటి మూకీల నుంచీ నేటి డీటీఎస్ ల దాకా, నాటి రేకుల టూరింగ్ టాకీసుల నుంచీ  నేటి ఏసీ మల్టీప్లెక్సుల దాకా, అన్ని పరిణామ దశల్లోనూ క్రమం తప్పకుండా వివిధ భాషల రీమేక్స్ ల రూపం లో ఉంటూ, ప్రచండ దేవదాసు వేస్తున్న దండోరా ఒక్కటే- పారాహుషార్ అంటూ ఒక్కో తరంలో ప్రేమించే హృదయాలకీ తస్మాత్ జాగ్రత్త చెబుతూ వస్తున్న దొక్కటే-  అది ఇప్పటి తరాని కొచ్చి - భగ్న ప్రేమంటే యాసిడ్ దాడి కాదురా బేవకూఫ్- నీ మందు సీసా! తను కాదన్నదని  పొడవడం కాదురా- నువ్వు చావడం! నరకమంతా నువ్వనుభవించడం- నీ స్వయంకృతం కదా!- అంటూ. 
ఇలా ముందింకెన్నో తరాలకీ కాలాన్ని బట్టి దండోరా వేస్తూనే ఉంటాడు దేవదాసు-  ది పాషనేట్ లవర్.

         
        జగమే మాయ బ్రతుకే మాయా - అన్నాడు...కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - అని కూడా అన్నాడు దేవదాసు- ఇలా తెలుగు అక్కినేని దేవదాసు ఆధునిక యోగి వేమన అనడానికి ఇక సందేహించ నక్కర్లేదు. లేకపోతే తెలుగులో దీనికి సాటి రాగల తత్త్వాలు ఇంకే రీమేక్ లో పాడుకున్నాడు గనుక దేవదాసు. వేమన వైరాగ్యం వేరు- అతను  వ్యవస్థ బాధితుడు కాదు. దేవదాసుది వ్యవస్థ తెచ్చి నెత్తినేసిన వైరాగ్యం. తన ప్రేమకి సాంఘిక కట్టుబాట్లు అడ్డు గోడలైనప్పుడు, వాటిని ఎదుర్కోలేని బాధితు డతను. 1900 నాటి సాంఘిక వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. కుల మత ప్రాంతీయ తత్వాలు, ధనిక పేద వర్గ విభేదాలూ ఇవన్నీ ఈ ప్రపంచమున్నంత కాలమూ ఎక్కడికీ పోవు. వీటిని ఆసరాగా చేసుకుని ఏదో ఒక రూపంలో ఆనర్ కిల్లింగ్స్ అంటూ ఒక తంతు యదేచ్ఛగా జరిగిపోతూ వుంటుంది. ఓ జంటని వెలివేయడం కూడా ఒకరకమైన ఆనర్ కిల్లింగే. అంతస్తుల తేడాలు చూపించి దేవదాసు తండ్రి చేసిందీ ఇలాటి ఆనర్ కిల్లింగే. కాకపోతే పెళ్ళే  చేసుకోకుండా చాలా అన్యాయంగా ఆ ఆనర్ కిల్లింగ్ కి బలయ్యాడు దేవదాసు. అమానుషమైనది. గుండెల్ని పిండేసే పెను విషాదమిది. ఇంత విషాదాన్ని భరించినందుకే అన్నికాలాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని వర్గాల్లో అంత ఆరాధ్యుడయ్యాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో సైతం రీమేక్స్ జరుపుకుని నివాళు లందుకున్నాడు.


        ఇలా ఒక విషాద గాథ చరిత్రయ్యింది. తెలుగులో కళా ఖండమయ్యింది. 1953 లో వినోదా సంస్థ నిర్మించింది. దేవదాసు తండ్రి హోదా కారణంగా ప్రేమించిన పార్వతికి దూరమై తాగుడు మరిగాడు. ముసలి జమీందారుని కట్టుకున్న పార్వతి వాడి గంపెడు సంతానంతో సతమత మవుతూ వుంది. దేవదాసు విషాదాన్ని తెలుసుకున్న పట్నపు చంద్రముఖి వేశ్యావృత్తి మానేసి అతడి సేవలో తరించింది. చెడ తాగుడు దేవదాసు ఆరోగ్యాన్ని తినేసి, పార్వతికిచ్చిన మాట ప్రకారం ఆఖరి ఘడియల్లో ఆమె వూరికి చేరుకున్నాడు. దిక్కు లేని శవంగా అతనక్కడ పడుంటే, చూద్దామని రివ్వుమని  పరిగెత్తుకొచ్చిన పార్వతి- ధడాలున మూసుకున్న జమీందారీ తలుపులు తగిలి పడిపోయింది. దేవదాసు కట్టె  చితిమంటలకి ఆహుతైపోయింది.


          చావెదురైనా మూఢాచారాలు మనిషి పట్ల ఎలాటి దయనూ  చూపనే చూపవని చెప్పే ఈ కథలో, దేవదాసు తండ్రిగా ఎస్వీ రంగారావు, మిత్రుడు భగవాన్ గా పేకేటి శివరాం కన్పిస్తారు. పార్వతిగా సావిత్రి, ఆమె తండ్రిగా దొరస్వామి, భర్తగా సీఎస్ఆర్ ఆంజనేయులూ కన్పిస్తారు. చంద్రముఖిగా లలిత నటించింది. మరణమో రామచంద్రా అంటూ ప్రవాహంలో కొట్టుకు పోవడమే తప్ప, ఒక్క  చిన్న గడ్డి పోచ పట్టుకోవాలన్న సంఘర్షణ జోలికే వెళ్ళని పాత్ర ప్రయాణంలో, అక్కినేని జీవం- ప్రాణం -లాంటి అశాశ్వత అంశాలు కాదు- శాశ్వతంగా నిలిచిపోయే ఆత్మనే పట్టి పోశారు. 


          సాత్వికాభినయానికి పెద్ద పీట వేశారు. అన్ని అభినయాల్లోనూ సాత్వికాభినయం ఉత్కృష్టమైనదని అంటారు. అదే సమయంలో కష్టసాధ్యమైనదని కూడా అంటారు. నటుడి మొహంలో హావభావాలే పలక్క పోతే ఏ మేకప్ మ్యానూ, ఇంకే ఛాయాగ్రాహకుడూ ఏమీ చేయలేరు. హావభావాల తో సాత్వికాభినయాన్ని వర్కౌట్ చేయాలంటే ముందు నటుడు మానసికంగా నిర్మలంగా వుండాలి. మామూలుగానే ఇది కష్టం. కరుణ రసంతో మరీ కష్టం. ముందుగా శుష్కించి పోయిన మొహం ఎఫెక్టు రాబట్టేందుకు, అక్కినేని ఏ డైటింగూ చేసి ఫిజిక్ ని చెడగొట్టుకోలేదు, అమెరికాలో ఏ లిపో సక్షన్ సర్జరీనో  చేయించుకుని, బక్కచిక్కి గ్లామర్ తగ్గిపోయి  రాలేదు. కేవంలం ఎన్నో నిద్రలేని రాత్రులు మాత్రమే గడిపి ఆ ఫలితాలు సాధించారు.  ‘జగమే మాయ’ పాట ఎఫెక్టు కోసం ఘంటసాల ఏకంగా 41 రోజులు ఉపవాసాలుండి నీరసించారు. అలాంటి ఘంటసాల విషాద గాత్ర విన్యాసానికి అతికిపోవాలంటే అక్కినేని ఎంత అతలాకుతలమైపోయి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆ ఘంటసాల గాత్ర విన్యాసమూ, అక్కినేని భావప్రకటన సామర్ధ్యమూ చరిత్ర పుటల్లో నిల్చి పోయిన  విశేషాలు. తాగబోతుగా పలికించిన బాధతో కూడిన ప్రతి ఒక్క భావమూ ఆ నిర్మల స్థిరచిత్తంలోంచి  పెల్లుబికినవే. నటుల ప్రతిభకి సాత్వికాభినయమే గీటు రాయైతే, దేవదాసు పాత్రభినయంతో అక్కినేని నూటికి నూరు పాళ్ళూ మించిపోయి తానే ఒక గీటురాయి అయ్యారు. సాత్వికాభినయానికి పర్యాయ పదమయ్యారు. అందుకని దేవదాసూ అక్కినేనీ - ఒకే ఆత్మ రెండు శరీరాలు!


       దేవదాసు పాత్రలో జాలువారే కరుణరసం విజువల్. పైకి కన్పించిపోతుంది. సావిత్రి నటించిన పార్వతి పాత్రది సబ్ టెక్స్టు- అంటే ప్రేక్షకుల ఊహకి వదిలేసిన అమూర్త అంతర్మధనం. మౌన విలాపం. ముఖ కవళికలతోనే ప్రతిభావంతంగా దీన్ని పోషించారామె.
          ఇదే, ఇలాటి పరస్పర వైరుధ్యాలే కథకి వెన్నెముక అనదగిన ఈ సినిమా కథనానికి బలాన్ని చేకూర్చి పెట్టాయి. పైన చెప్పుకున్న దేవదాసు, పార్వతిల విజువల్ - నాన్ విజువల్ రస పోషణలతో బాటు; దేవదాసు, భగవాన్ పాత్రల పరస్పర విరుద్ధ దృక్పథాలు, దేవదాసుకి సేవకురాలిగా మిగిలిపోవాలన్న పార్వతి కోరిక తీరకుండా, ఆ భాగ్యానికి చంద్రముఖి నోచుకునే యాంటీ ప్లే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డైనమిక్స్. 

          పోతే, నిండు చంద్రుడికి మచ్చే తప్పనట్టు, నిఖిల ప్రేమాస్పదుడు దేవదాసూ కొన్ని నఖక్షతాల్ని మోస్తున్నాడు. దేవదాసు పిరికివాడని ముందే చెప్పేస్తే సరిపోయేది. బాల్యంలో ఏమాత్రం తండ్రి భయం లేని, చదువంటే కూడా ఏమీ పట్టని ఆకతాయిగా, చదువు చెప్పే పంతుల్ని ఏడ్పించే ఘటంగా, సాంప్రదాయాల వ్యతిరేకిగా చూపించుకొస్తూ, తీరా పార్వతిని చేపట్టాల్సి వచ్చేసరికి ఉత్త పిరికివాడిలా చిత్రించారు. అలాటి అతడి బాల్యపు ధిక్కార పార్టు అదే పళానా యవ్వనపు చాప్టర్లోకి బదలాయింపు కాకపోవడం వల్లే ఇలా జరిగింది. అసలు పాత్ర చిత్రణల్లో పార్వతీ దేవదాసుల బాల్యమే ఘోరంగా విఫలమయిందని ఎంవీ రమణారెడ్డి తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. 



         ఇదలా ఉంచితే, ఆపదలో ఉన్న పార్వతి అర్ధరాత్రి పూట దేవదాసుని ఆశ్రయించి పెళ్ళడిగితే, దేవదాసు కంగారు పడిపోవడం, ఇంట్లో అడిగి చెప్తాననడం, ఇంకేవేవో పిరికి చేష్టలకి పోవడం, సరీగ్గా కథకి ఉద్దేశించిన పిరికి పాత్రనే తయారు చేశాయా- బాల్యం సంగతి పక్కన పెడితే?
          

           13 వ శతాబ్దపు సూఫీ మహాకవి, మేధావి జలాలుద్దీన్ రూమీ అన్నట్టు- ‘ప్రేమని పొందడం నీ కర్తవ్యం కాకూడదు, కేవలం ఆ ప్రేమకి వ్యతిరేకంగా నీకై నీవు కల్పించుకున్న మానసిక నిషేధాల్ని తెలుసుకోగలగడమే నీ కర్తవ్యం  కాగలగాలి- అన్నది దేవదాసుకి సరిగ్గానే సరిపోతుంది. ఇదొక్కటి చాలు తను పలాయనం చిత్తగించడానికి బహానాగా. అతడి మానసిక నిషేధం తండ్రే అయినప్పుడు ఈ ఒక్క స్పష్టతతో, ఆ ఒక్క కారణంతో వుంటే చాలు. తండ్రి నడిగి చెప్తానని చెప్పేసి- ఆ తండ్రితో చివాట్లు తిని, మళ్ళీ పార్వతికి కనపడకుండా పారిపోతే సరిపోతుంది. సమయం మించిపోయినప్పుడే పార్వతి కోసం తిరిగి వచ్చి, ఆమె పరాధీన అయిపోయిందని తెలుసుకుంటే చాలు. 


       ఇలా కాకుండా ఆలోచిస్తాననడం, ఎటూ తేల్చుకోలేక ఇంట్లో అడిగి చెప్తాననడం, తండ్రి నడిగి భంగపడి అప్పుడు పారిపోవడం, తననిక మర్చిపొమ్మని పార్వతికి లేఖ రాయడం, మిత్రుడు భగవాన్ కోప్పడితే మళ్ళీ పార్వతి కోసం రావడం, అప్పటికి సమయం మించిపోవడం...ఇదంతా పాత్రని మరీ పలచన చేసే డొంక తిరుగుడే అయింది. 

          ఎక్కడైతే కథనంలో లోపాలతో దొరికిపోతామని అన్పిస్తుందో- అక్కడే తెలివిగా ఏదో గిమ్మిక్కు చేసైనా తప్పించుకో గల్గాలి. ఇక్కడ ఇది జరగలేదు. నవల రాయడం ఒక్కోసారి ఎలా వుంటుందంటే-  దృశ్యాల్లో ఆ రాస్తున్న వాక్యాల్ని  విజువలైజ్ చేసి చూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళకపోతే, దృశ్యాలు అసహజంగా తయారయ్యే ప్రమాదముంది. సినిమా దర్శకులు రచయిత చెప్తున్నదంతా విజువలైజ్ చేసుకుంటూ వింటూంటారు. విజువల్ గా సీను బావుండకపోతే వినడం ఆపేస్తారు. శరత్ బాబు ఈ సీన్ని ఇలాగే రాసేసి వుంటారు. దీన్నే కళ్ళకద్దుకుని పదేపదే రీమేక్ చేస్తూపోయారు. దేవదాసు కమర్షియల్ పాత్ర రూపంలో వున్న ఆర్టు సినిమా
( పాసివ్ )  పాత్ర మాత్రమే. ఇందులో తప్పు లేదు, ఇది ట్రాజడీ కాబట్టి. అయినంత మాత్రాన పాసివ్ పాత్ర నడకలో కూడా కథకుడు జోక్యం చేసుకోకూడదు. 



వేదాంతం రాఘవయ్య 
       పాత్రకి ఇలాటి నఖ క్షతాలతో వేదాంతం రాఘవయ్య  ( 1919-71) దర్శకత్వం సాగుతుంది. అయితే కూచిపూడి నర్తకుడూ, డాన్స్ మాస్టారూ కూడా అయిన రాఘవయ్య దర్శకత్వ ప్రతిభకి ఒక్క పార్వతిని దేవదాసు కొట్టే దృశ్యం చాలు. పార్వతి అన్న ఓ మాటకి దేవదాసు చిరుకోపంతో, అసంకల్పితంగా చిన్న కట్టె పుల్లతో చటుక్కున కొట్టేస్తాడు. అంతసేపూ చేతిలో కన్పించని ఆ కట్టెపుల్ల అకస్మాత్తుగా ఫ్రేము లోకొచ్చి, అంతపనీ చేసి పోతుంది- ప్రేక్షకుల మీద దీని షాక్ వేల్యూ అమోఘం!

          2002 సెప్టెంబర్ లో హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు నిర్వహించిన ‘దేవదాసు’ చలన చిత్రోత్సవంలో, 1935 నుంచీ  2002 దాకా వివిధ భాషల్లో తీసిన ‘దేవదాసు’ మొత్తం 12 రీమేకుల్ని ప్రదర్శించారు. వీటిలో ప్రసిద్ధ దర్శకుడు బిమల్ రాయ్ హిందీలో దిలీప్ కుమార్ తో తీసిన ‘దేవదాసు’ లో,  పైన చెప్పుకున్న సీను వచ్చేసరికి- దిలీప్ కుమార్ ఇంతలావు కర్రుచ్చుకుని, ఫటేల్మని తనివితీరా వైజయంతీమాల మాడు పగలగొట్టేసి, టపటపా రెండుసార్లు దాంతో తొడమీద కొట్టుకుని, వీరోచితంగా రెండు ముక్కలుగా విరిచేసి అవతల పారేస్తాడు.  నవ్వొచ్చే ఓవర్ డ్రామా! ప్రేమిస్తున్నాడా, ప్రేమించిందని  ఇరగదీస్తున్నాడా? శరత్ బాబు ఏమైపోవాలో!



బి ఎస్ రంగా 
         2002 లో మరో సుప్రసిద్ధ దర్శకుడు శక్తి సామంతా తీసిన బెంగాలీ ‘దేవదాసు’లో ప్రసేన్ జిత్ సేన్, అర్పితాపల్ ని కొట్టాలా వద్దా అని ముందూ వెనకలాడుతూ, ఎలాగో స్టామినా కూడదీసుకుని, కర్రెట్టి ఘోరంగా చావబాదేసి-  హమ్మయ్యా ఓపనై పోయింది అన్నట్టు చూస్తాడు. రేపు పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇదేనేమో! శరత్ కి ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు. 

          ఇదంతా చాలా న్యూసెన్స్ రాఘవయ్య ప్రతిభ ముందు. 


          అలాగే తెలుగు ‘దేవదాసు’ లో తెలుగుదనం లేదనే వాళ్ళు ఇంకోటి తెలుసుకోవాలి. కేదార్ శర్మ డైలాగులు రాసిన, సైగల్ నటించిన- ‘దేవదాసు’
( 1936)  సినిమా సాంతం ఉర్దూ భాషలో ఏ మొఘలే ఆజమో  చూస్తున్నట్టు వుంటుంది. ఆఖరికి దేవదాసు పార్వతికి రాసే లేఖ కూడా ఉర్దూలోనే వుంటుంది.



సి ఆర్ సుబ్బరామన్ 
       తెరవెనుక రాఘవయ్యతో బాటు వున్న సంగీత దర్శకుడు సీఆర్ సుబ్బరామన్ గురించి ఇంకా చెప్పేదేముంది. ఆయనిచ్చి పోయిన పాటల బొచ్చె, లోకంలో ప్రేమ బిచ్చగాళ్ళు వున్నంత కాలమూ వుంటుంది. ఇంతకంటే ఆయన వేసే భిక్ష ఇంకేం కావాలి? అలాగే బీఎస్ రంగా ఛాయాగ్రహణం. ఇక మాటలు, పాటలు రాసిన సముద్రాల రాఘవాచార్య సరేసరి. 

          మరోసారి రూమీని ఉటంకించుకుంటే
- ‘ధాతువుగా నశించి మొక్కనై పుట్టా, మొక్కనై గిట్టి జంతువై జనించా, జంతువుగా చాలించి మనిషినై అవతరించా. నాకెందుకూ మరణమంటే భయం? మరణం తో నేనేమీ నిమ్నస్థాయికి చేరుకోవడం లేదే?’



          ఎస్, మరణాన్ని కోరి నిమ్నుడవలేదు దేవదాసు, అమరుడయ్యాడు.
          అక్కినేని అతడికి దేవుడి పటాన్నిచ్చారు.



సికిందర్
(ఆగస్టు 2009, సాక్షి -‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)

         
         
         
         
         


          

15, సెప్టెంబర్ 2015, మంగళవారం

సాంకేతికం- పబ్లిసిటీ

సినిమా పబ్లిసిటీలో కీలక ఘట్టం లోగో విడుదల. తమ అభిమాన హీరో కొత్త సినిమా లోగో ఏ విధంగా వుంటుందో నన్న ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తూంటారు ఫ్యాన్స్. విడుదలైన లోగోని చూసి చర్చోప చర్చలు కూడా జరుపు కుంటారు. టైటిల్ ఆదిరిందా ఎగిరి గంతెయ్యడమే. సినిమా హిట్ అని అప్పుడే ప్రచారంకూడా చేసుకుంటారు. టైటిల్ డిజైన్ డల్ గా ఉందా- ఈసురోమని నీరసపడి పోవడమే.
       పబ్లిసిటీ ఆర్టిస్టు పని ముందుగా లోగోని హిట్ చేయాలన్న తీవ్ర కసరత్తుతో ప్రారంభమవుతుందని చెప్పారు సుప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే. దీనికోసం నిద్రాహారాలు మాని కృషి చేస్తామన్నారు. ఇదేదో కంప్యూటర్ లోంచి ఊడిపడే ఇన్ స్టెంట్ అద్భుతం కాదన్నారు. సాఫ్ట్ వేర్స్ లో వుండే పరిమిత ఫాంట్స్ టైటిల్ డిజైనింగ్ కి పనికొచ్చేవి కావనీ,  బ్రష్ పట్టుకుని స్వ హస్తాలతో చిత్రించాల్సిందే ననీ అన్నారు.  బ్రష్  పట్టుకోవడం తెలీని ఫోటో షాప్ పబ్లిసిటీ ఆర్టిస్టులు కూడా వుంటారనీ, వాళ్ళు బయట లోగోలు వేయించుకో వచ్చునేమోగానీ, ఫోటో షాప్ తో వాటికి  న్యాయం చేయడం కష్టమే అవుతుందన్నారు. ఎందుకంటే, ఫోటో షాప్ లో నటీనటుల అప్పీయరెన్సుల్ని  మెరుగులు దిద్దాలన్నా, ఆర్టిస్టుకి ఆత్మ తెలియాలి. అది బ్రష్ తో బొమ్మలేసిన అనుభవంతోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇదీ ధని అనుభవ సారం ( 1997-98 ప్రాంతాల హైదరాబాద్ శాంతి శిఖర అపార్ట్ మెంట్స్  గ్రౌండ్ ఫ్లోర్ లో కేవలం బ్రష్, స్ప్రే గన్ ఈ రెండే పట్టుకుని పోస్టర్స్ డిజైన్ చేస్తూ కన్పించేవారు ధని- చాలా ఫ్రెండ్లీ మనిషి). 


            ఇప్పుడు రంగంలో వున్న చాలా కొద్ది మంది పబ్లిసిటీ ఆర్టిస్టుల్లో ధని ఏలే ఒకరు. ఈయన అన్న- గ్రేట్ ఆర్టిస్టు లక్ష్మణ్ ఏలే గురించి తెలీని వాళ్ళు లేరు. ఇంటర్ చదువుతున్నప్పుడే ధని పాకెట్ మనీ కోసం దుకాణాలకి సైన్ బోర్డులు రాసే పని చేపట్టారు. నల్లగొండ జిల్లా కదిరేని గూడెం నుంచి హైదరాబాద్ వచ్చి ‘తారా యాడ్స్’ లో కొన్నాళ్ళు పనిచేసి, ‘సితార’ సినిమా వార పత్రికలో లే అవుట్ ఆర్టిస్టుగా చేరారు. అప్పుడే సినిమాలకి పోస్టర్స్ వేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఉద్యోగం కూడా వదిలేసి సొంత స్టూడియో పెట్టుకున్నారు. చిన్న చిన్న సినిమాలతో చాలా స్ట్రగుల్ చేసి, ఆఖరికి పూరీ జగన్నాథ్ తీస్తున్న, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘బద్రి’ తో భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకున్నారు. అక్కడ్నించీ ఇక జైత్ర యాత్రే. ‘బుజ్జి గాడు మేడ్ ఇన్ చెన్నై’ వరకూ పూరీ సినిమాలన్నిటికీ పబ్లిసిటీ సమకూరుస్తూ  వస్తున్నారు. అందరు అగ్ర హీరోల, దర్శకుల సినిమాలకి కూడా సేవలందించారు. ఇప్పటి దాకా 150 సినిమాలకి పబ్లిసిటీ డిజైనింగ్ చేశారు. వీటిలో ‘పోకిరి’, ‘ఖలేజా’, ‘సింహ’, ‘గగనం’, ఈ నాలుగు సినిమాల లోగోలు,  వీటి పబ్లిసిటీ డిజైన్లూ  తనకి బాగా పేరు తెచ్చాయన్నారు.
          ‘ పబ్లిసిటీ ఆర్టిస్టు పని సినిమా విడుదలకి మెటీరియల్ రూపొందించడంతోనే అయిపోలేదు..ఆ తర్వాత కూడా కొత్త కొత్త పోస్టర్స్ తో సినిమాని ప్రమోట్ చేస్తూ రెండవ వారం, మూడవ వారం, అర్ధ శత దినోత్సవం, శత దినోత్సవం...ఇలా కొనసాగైతూనే ఉంటుంది’ అన్నారు.


          ఈ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి చెబుతూ, తొలితరం ప్రసిద్ధ కళాకారుడైన ఈశ్వర్ తో తనకి పరిచయముందన్నారు. ఆ రోజుల్లో బ్లాక్ మేకింగ్ ఉండేదనీ, ఫోటోలని కత్తిరించి, అతికించి, జెరాక్స్ తీసి, ఇండియన్ ఇంకుతో టైటిల్స్ వేసి, పోస్టర్లు రూపొందించేవారనీ, తర్వాత కలర్ పోస్టర్స్ వచ్చాక, బ్రష్ తో బ్యాక్ గ్రౌండ్ వేసేవారనీ వివరించారు. ఇక బ్రష్ తర్వాత స్ప్రే గన్ వచ్చింది. దీని తర్వాత సాఫ్ట్ వేర్లూ, ఫోటో షాపూ వచ్చినట్టు చెప్పారు.
          ఇలా డిజిటలీకరణ చెందాక బాగా ఖర్చు తగ్గిందన్నారు ధని. పైగా చిటికెలో కలర్ కరెక్షన్స్ చేయడంగానీ, ఆప్షన్స్ చూపించడం గానీ సాధ్యమవుతోందన్నారు. పోతే, ఒక సినిమాకి పబ్లిసిటీకి దేన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటారన్న ప్రశ్నకి, ఆ సినిమా కాన్సెప్ట్ ని తీసుకుంటామని చెప్పారు. కాన్సెప్ట్ ని దృషిలో పెట్టుకునే లోగో రూపకల్పనా, పోస్టర్స్ డిజైనింగూ చేస్తామన్నారు. బాలీవుడ్ లో అయితే సినిమా రషెస్ చూపించి పూర్తి అవగాహన కల్పిస్తారనీ, ఇక్కడా పధ్ధతి లేదనీ అన్నారు. ఇంకా బాలీవుడ్ లో సినిమా సినిమా స్టిల్స్ తో సంబంధం లేకుండా ఫోటో షూట్స్  చేసి పబ్లిసిటీకి వాడుకుంటున్నారన్నారు.  ఈ పధ్ధతి తెలుగులో ‘సొంతం’ అనే సినిమాతో ప్రారంభమైన సంగతి  గుర్తు చేస్తే, అసలలా షూటింగ్ పూర్తయిన తర్వాత ఫోటో షూట్స్ చేసి పబ్లిసిటీకి వాడుకోవడం ప్రేక్షకుల్ని తప్పు దోవ పట్టించడమే నన్నారు.

        ఇంటర్నెట్ నుంచి విదేశీ సినిమాల పోస్టర్ డిజైన్స్ ని కాపీ కొట్టే ధోరణి గురించి చెబుతూ, దానివల్ల చౌకబారు డిజైన్లు మాత్రమే తయారవుతాయన్నారు. ఇంటర్నెట్ ని విరివిగా ఉపయోగించుకునే వాళ్లకి ఈ కాపీ వ్యవహారాలు ఇట్టే తెలిసిపోతాయన్నారు.
          రికార్డు స్థాయిలో ఏడు సార్లు భరతముని ఉత్తమ పబ్లిసిటీ ఆర్టిస్టు అవార్డులని అందుకున్న ధని ఏలే, తాజాసినిమా ‘బ్రమ్మిగాడి లవ్ స్టోరీ’ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో బోయపాటి శీను తీస్తున్న ‘దమ్ము’, విజయేంద్ర ప్రసాద్  దర్శకత్వం వహిస్తున్న ‘రాజన్న’, రవితేజ నటిస్తున్న ‘నిప్పు’  శ్రీకాంత్ నటిస్తున్న ఇంకో సినిమా, మొదలైన వాటికి పబ్లిసిటీ సమకూరుస్తూ బిజీగా వున్నారు తను.
సికిందర్
( జులై 2011, ఆంధ్రజ్యోతి-‘సినిమా టెక్’ శీర్షిక)