రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, మార్చి 2016, శనివారం

షార్ట్ రివ్యూ!





దర్శకత్వం : కుమార్ నాగేంద్ర
తారాగణం : నారా రోహిత్‌, లతా  హెగ్డే , కబీర్‌  సింగ్‌, అలీ, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, సుదర్శన్‌, పూజిత తదితరులు
కథ : ఏ.ఆర్‌. మురుగదాస్‌, సంగీతం : సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం : ఎం.ఆర్‌. పళనికుమార్‌
బ్యానర్‌ : శ్రీ కీర్తి ఫిలింస్‌, నిర్మాతలు : అశోక్‌ బాబా, నాగార్జున్‌
కథనం, దర్శకత్వం: కుమార్‌ నాగేంద్ర
విడుదల తేదీ: మార్చి 11, 2016
         ***
      తమిళంలో మురుగ దాస్ కథ రాసిన ‘మాన్ కరాటే’ ( ప్రాణాలకు తెగించేవాడు) అనే హిట్ ని తెలుగు సినిమా రాజ్యాంగం ప్రకారం ఆవారా మాస్ గానే  టైటిల్ వుండి తీరాలి  కాబట్టి, ‘తుంటరి’ పేరుతో  నారా రోహిత్ హీరోగా  రీమేక్ చేశారు. ‘గుండెల్లో గోదారి’, ‘జోరు’ అనే సినిమాలు తీసిన కుమార్ నాగేంద్ర దీని దర్శకుడు. మరి రెండేళ్ళ క్రితం మురుగదాస్ తమిళంలో హిట్ చేసుకోగలిగిన తక్కువ కథని నాగేంద్ర తెలుగులో ఎలా తీశాడు? మురగ దాస్ హిట్ చేసుకోవడానికి కేవలం తన తక్కువ కథ మీదే ఆధార పడలేదు - మరి నాగేంద్ర కూడా ఇదొక తక్కువ కథ అని గుర్తు పట్టి,  దీని మీదే ఆధారపడకుండా మురుగ దాస్ చేసిన లాంటి కాస్టింగ్ గిమ్మిక్కులతో  ‘తుంటరి’ ని నిలబెట్ట గలిగాడా, లేక ఆ గిమ్మిక్కులున్న సంగతే తెలుసుకోకుండా ఘోర పొరపాటు చేశాడా ఓసారి చూద్దాం...
కథ
        ఓ ఐదుగురు ఐటీ ఉద్యోగులు పిక్నిక్ చేసుకుందామని అడవికి వెళ్తారు. అక్కడో సాధువుని  కలుస్తారు. అతనొక దినపత్రికని సృష్టించి ఇస్తాడు. అది నాల్గు నెలల తర్వాత రాబోయే పత్రిక. అందులో రాజు అనే వాడు ఒక బాక్సింగ్ పోటీల్లో ఐదు కోట్లు గెలుచుకుంటాడని వార్త  వుంటుంది. వెంటనే ఆ రాజు (నారా రోహిత్) ని వెతికి పట్టుకుంటారు. అతను తుంటరి ఆవారాగా తిరిగే బేవార్సు.  ఇతను బాక్సింగ్ లో ఐదు కోట్లు గెలవబోతున్నాడంటే నమ్మ బుద్ధిగాదు.

         అయినా ధైర్యం చేసి రాజుతో ఒప్పందం కుదుర్చుకుంటారు ఐటీ ఫ్రెండ్స్. ఈ బాక్సింగ్ కి సిద్ధపడితే ఖర్చులూ భరిస్తామంటారు. కానీ రాజు సిరి ( లతా హెగ్డే) అనే ఒకమ్మాయితో ప్రేమలో ఉంటాడు. వీళ్ళ బాక్సింగ్ గోలని పట్టించుకోకుండా ఆ అమ్మాయి వెంట పడుతూంటాడు.

         అప్పుడు ఐటీ ఫ్రెండ్స్ కి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తమక్కావలసిన రాజు వీడు కాదనీ, ఇంకో రాజు వేరే ఉన్నాడనీ, అతను పక్కా   ప్రొఫెషనల్ బాక్సర్ అనీ తెలుస్తుంది. భవిష్యత్ వార్త ప్రకారం మ్యాచ్ గెల్చి ఐదు కోట్లు కొట్టేసే వాడు వీడే (కబీర్ దాస్) నని తెలుస్తుంది. ఈ రెండో రాజు జోలికెళ్ళ లేక,  మొదటి రాజునే దువ్వుతూ  శిక్షణ ఇప్పించి,  బరిలోకి రెండో రాజు మీదికి తోసేస్తారు. ఇప్పుడు ఈ మొదటి ఆవారా రాజు,  రెండో వస్తాడు రాజుతో తలపడి ఎన్ని తిప్పలు పడ్డాడు, గెలిచాడా లేదా, దీంతోనే  ముడిపడి వున్న ప్రేమని కూడా గెలుచుకున్నాడా  లేదా అనేది మిగతా కథ.

ఎలావుంది కథ
        కొత్తగా వుంది. చిత్తశుద్ధి వుంటే కమర్షియల్ కథల్ని కూడా కొత్తగా ఎలా ఆలోచించవచ్చో తెలియజేసేలా వుంది. మనం ఆలోచించమనీ, ముందుగా తమిళంలో ఎప్పుడాలోచిస్తారా అని పడిగాపులు గాస్తామనీ, వాళ్ళు ఆలోచించగానే అప్పనంగా రీమేక్ చేసుకుని కాలరెగరేస్తామనేలా వుంది. ఏ పాపమూ చేసుకోలేదు ఈ తక్కువగా వున్న తమిళ కథ.  ఈ కొట్టొచ్చినట్టు తక్కువగా కన్పిస్తున్న తమిళ కథని రీమేకైనా ఎలా చేసుకోవాలో తెలియరాక తీవ్ర అపచారం చేశాడు తెలుగు దర్శకుడు. కాబట్టి కొత్తగా వున్నఈ  తమిళ కథ తెలుగులో  స్వచ్ఛ భారత్ ఉద్యమానికి పనికొచ్చేలా పరిణామం చెందింది.

ఎవరెలా చేశారు
        నారా రోహిత్ తుంటరి మాస్ పాత్ర చేద్దామనుకున్నాడుగానీ, తన టాలెంట్ కి ఇది సరిపోలేదు.  ఇంకా ‘అసుర’ లో పెరిగిన అదే శరీరంతో అవస్థలు పడాల్సి వచ్చి పాత్ర కంట్రో ల్లోకి రాలేదు. ఇలాటి పాత్ర తన డిపార్ట్ మెంట్ కాదని తేలిపోయింది. స్థూలకాయం హీరో అర్హత కాదు, అనర్హత.

        హీరోయిన్ లతా హెగ్డే  గ్లామర్ పరంగానూ, నటనాపరంగానూ పనికిరాలేదు. సినిమాకొక
హీరోయిన్ వస్తున్నారు. పేర్లు కూడా గుర్తుండడం లేదు. తనూ ఇంతే.

       వెన్నెల కిషోర్, షకలక శంకర్, అలీలు వంటి వాళ్ళ కామెడీల్లో కొత్తదనం లేదు.
రెండో రాజుగా కబీర్ దాస్ ఒక్కడే నటన అంటే ఏమిటో  తెలుసుకుని పాత్రని నిలబెట్టినవాడు.

       కెమెరా పనితనం వరకూ బాగానే వున్నా, సంగీతం సహా సకల ప్రొడక్షన్ విలువలు అంతంత మాత్రమే. దర్శకత్వమూ డిటో.

చివరికేమిటి
          మురుగ దాస్ తన కథకి తగ్గ ఇమేజీ ఫిజిక్కూ వుండే అతి సాధారణంగా కన్పించే శివకార్తి కేయన్ ని  తీసుకున్నాడు. అలాగే ఇలాటి ఇంత సామాన్యుడు ఒక క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడ్డమనే ట్రాక్ కి డైనమిక్స్ కోసం టాప్ హీరోయిన్ హన్సికని దింపాడు. దీంతో ఇదొక క్రేజీ కాంబినేషన్  వున్న కాస్టింగ్ అయ్యింది. తక్కువ కథ వున్న సినిమాని నిలబెట్టుకోవడానికి ఈ కాస్టింగ్ ప్లస్ అయ్యింది. తెలుగు రీమేక్ లో ఈ గిమ్మిక్కుల్ని పూర్తిగా మర్చిపోయాడు దర్శకుడు నాగేంద్ర- లేక గిమ్మిక్కులున్న సంగతే  పసిగట్టాడో లేదో- కేవలం గంటన్నర పాటూ కథే లేని కథకి నారా రోహిత్ కుండే ఫాలోయింగ్ మీద ఆధారపడి ప్రయాణం సాగించాడు. ఈ పాత్రకి నారా రోహితూ సరిపోక, హీరోయినూ పనికిరాక – ఇద్దరు డమ్మీస్ తో దమ్ములేని రీమేక్ చేసేశాడు!
పైగా ‘డెస్టినీ  వర్సెస్ హార్డ్ వర్క్’ అని టాగ్ లైన్ ఒకటి పెట్టుకుని చెప్పిందేమిటో  ఎంత ఆలోచించినా అంతుచిక్కని  రహస్యం!


-సికిందర్



8, మార్చి 2016, మంగళవారం

షార్ట్ రివ్యూ!






రచన, దర్శకత్వం : ప్రవీణ్‌ సత్తారు
తారాగణం:
 నరేష్‌, సిద్ధు జొన్నలగడ్డ,  రష్మీ గౌతమ్‌,
శ్రద్ధా దాస్‌
, మహేష్‌ మంజ్రేకర్‌, రాజా రవీంద్ర, రఘుబాబు తదితరులు
సంగీతం : శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం : రామ్‌రెడ్డి
బ్యానర్‌ : ఆర్‌.కె. స్టూడియోస్‌,  నిర్మాత : రాజ్‌కుమార్‌ 
విడుదల :  4 మార్చి, 2016
***
నిజానికి అడల్ట్ మూవీస్ అని కేవలం సెక్స్ కంటెంట్ వున్న సినిమాలనే అంటారు – ‘త్రిష లేదా నయనతార’ అని ఇటీవల వచ్చిన సినిమా ఇలాటిదే. పూర్తి సెక్స్ కంటెంట్ కాకుండా క్రైం ఎలిమెంట్ కలిసి  వుంటే అది ఎరోటిక్ థ్రిల్లర్ అవుతుంది.  కానీ పూర్తిస్థాయి క్రైం ఎలిమెంట్ తో కూడి వున్న ‘గుంటూర్ టాకీస్’ ని థ్రిల్లర్ అనే మాటే లేకుండా అడల్ట్ మూవీగా ప్రచారం చేసుకున్నారు. దీనివల్ల సినిమా ఏమాత్రమైనా ఆడడానికి బ్రేకులు వేసుకున్నట్టయ్యింది. ఈ రోజుల్లో అడల్ట్ మూవీ అంటూ థియేటర్లకి ప్రేక్షకుల్ని రప్పించగలరా- డైరెక్ట్ పోర్న్ కంటెంటే  సెల్ ఫోన్ల నిండా దొరుకుతున్నాక? ఎరోటిక్ థ్రిల్లర్ అయిన ‘మర్డర్’ ని అడల్ట్ మూవీగా ప్రచారం చేసివుంటే ఆ రేంజిలో హిట్టయ్యేదా?


       సలు సినిమాల్లో సెక్స్ చూడాలనో, అద్భుత ప్రేమలు చూడాలనో ప్రేక్షకులు వస్తున్నారా? ఈ రెండిటినీ క్రైం ఎలిమెంట్ తో కలిపి ఎరోటిక్ థ్రిల్లర్స్ గానో, రోమాంటిక్ థ్రిల్లర్స్ గానో తీసి చూపిస్తే వస్తున్నారు. ఇప్పుడున్న మార్కెట్ తీరు ఇది. 


        దర్శకుడు ప్రవీణ్ సత్తారు ‘చందమామ కథలు’ తీసి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆ ఎనిమిది కథల సినిమాని సరిగ్గా తీయలేదని  రాసినందుకు రివ్యూ రైటర్లకి క్లాసు తీసుకున్నాడు. జాతీయ అవార్డుల కమిటీ అవార్డులిస్తుందే గానీ ఆ సినిమా తీసి చేతులు కాల్చుకున్నందుకు నష్టపరిహారమివ్వదుగా?  కాబట్టి అవార్డులకీ ఆర్ధిక లాభ నష్టాలు బేరీజు వేసే రివ్యూలకీ లంకె పెట్టనవసరం లేదు. ‘చందమామ కథలు’ లాంటి జాతీయ అవార్డు స్థాయి సినిమా తీయగల్గిన తను ఇప్పుడు అశ్లీలాన్ని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది- కమర్షియల్ సక్సెస్ కోసమేగా? అయినా  ‘అడల్ట్ మూవీ’ అనే ప్రచారంతో తీసిన ఈ ఫన్నీ ఎరోయిటిక్ థ్రిల్లర్ కూడా చతికిలబడాల్సి వచ్చింది.




కథ

       నడివయసులో వున్న గిరి (నరేష్), కోడెవయసులో వున్న హరి (సిద్ధూ జొన్నలగడ్డ) గుంటూరులో ఓ మెడికల్ షాపులో పని చేస్తూంటారు. ఇంటి దగ్గర హరి పక్కింటి ఆంటీతో సంబంధం పెట్టుకుంటాడు. ఆ అంటీ పిన్నికూతురు సువర్ణ ( రష్మీ గౌతమ్) కి లైనేస్తూంటాడు. గిరి భార్య సరీగ్గా పోషించడం లేదని ఐదేళ్ళ క్రితం ఇద్దరు పిల్లల్ని కూడా వదిలేసి చీరల షాపువాడితో లేచిపోయింది. ఆ ఇద్దరు పిల్లలకీ, తన రోగిష్టి తల్లికీ చాకిరీ చేయలేక తిట్టుకుంటూ వుంటాడు గిరి. హరికి కూడా పూర్వ కథ వుంటుంది. ఒక సెక్స్ పిచ్చిగల రివాల్వర్ రాణి (శ్రద్ధా దాస్) సెక్స్ కోసం ప్రాణాలు తోడేస్తూంటే ఆమెదగ్గరే కొంత అప్పు తీసుకుని పారిపోయి గుంటూరొచ్చాడు.


        ఇక్కడ హరి-గిరిలు పని చేస్తున్నమెడికల్ షాపు ఓనర్ (సుదర్శన్) పెద్ద కంత్రీ. వాడిచ్చే జీతం చాలక రాత్రిపూట షాపు కట్టేసి వస్తూ ఇళ్ళల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూంటారు. ఒకరాత్రి తెలుసుకోకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ (రఘుబాబు) సొంతింట్లో ఒకరు, సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఉంచుకున్న దాని ఇంట్లో మరొకరూ దొంగతనానికి వెళ్తే చెరి ఐదు లక్షలు దొరుకుతాయి. ఒకరికి చెప్పుకోకుండా ఒకరు ఆ డబ్బుతో జంప్ అయిపోతారు. తల్లినీ పిల్లల్నీ వేసుకుని గిరి సొంతూరు పారిపోతే, సువర్ణని లేపుకుని గోవా ఉడాయిస్తాడు హరి.



        అక్కడ ఎంజాయ్ చేస్తూంటే ఓ గ్యాంగ్ వచ్చేసి పట్టుకుంటుంది. కొట్టేసిన డబ్బులు కాదు, ‘ఆ డబ్బా’ ఇమ్మంటుంది. ఏ డబ్బా? ఏమిటి దాని కథ? అదెక్కడుంది? ఇద్దర్లో ఎక్కడ ఎవరి దొంగతనంలో అది మాయమయింది? హరి మాయం చేశాడా, గిరి మాయం చేశాడా? ఆ డబ్బా కావాల్సిందే ఇప్పుడు గుంటూరు డాన్ జాకీ (మహేష్ మంజ్రేకర్) కి! లేపోతే ఏం బావోదు...


 ఎలా వుంది కథ 
   ఓవరాల్ గా చూస్తే ఇదొక ఫన్నీ థ్రిల్లరే. అనవసరమైన అశ్లీలాన్ని పూశారు. పూస్తే పూశారు, ఆ అశ్లీల కంటెంట్ ని కనీసం సెకండాఫ్ లో  హీరోయిన్ తో ఒక సీన్లో పాటతో కలిపి చూపించినట్టు క్లాస్ గా - ఎరోటిక్ గా చూపించి వుంటే,  సేఫ్ గా  ‘U/A’ గ్రేడ్ ఎరోటిక్ థ్రిల్లర్ అయ్యేదేమో. ఫస్టాఫ్ లో చూపించుకొచ్చిన అశ్లీలం వల్ల - రాయడానికి వీల్లేని ఒక పదాన్ని పదేపదే వాడడం వల్ల - దీనికిచ్చిన  ‘A’ సెన్సార్ సర్టిఫికేట్ కంటే, గ్రేడు ఇంకా తగ్గించి కొత్తగా ‘A2  అని క్రియేట్ చేసి సత్కరించాలి. ఈ సినిమాకి పిల్లల్ని తీసుకురావద్దనీ, సున్నిత మనస్కులు చూడొద్దనీ సినిమా ప్రారంభంలో చెప్పారు. నిజానికి ప్రధాన కథతో సంబంధం లేని ఈ సెక్స్ కంటెంట్ ని కావాలని పూసుకున్నట్టుంది గానీ, ఇది లేకపోతే అందరూ చూడదగ్గ కథే. ప్రేక్షకులు ఒక హాస్యభరితమైన న్యూవేవ్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయనివ్వకుండా దీనికేదో అడల్ట్ మూవీ అంటూ బిల్డపిచ్చి తప్పుదోవ పట్టించారు.





ఎవరెలా చేశారు 

      సిద్ధూ జొన్నలగడ్డది మాస్ సినిమాల్లో కన్పించే మాస్ పాత్రకంటే- స్లమ్ డాగ్ కంటే  నీచ పాత్ర. ఏ విలువలూ, వ్యక్తిత్వం, నీతీ లేని క్రిమినల్ పాత్ర. అతడికి ప్రేమ తెలీదు, దొరికిన ఆడాళ్ళని అనుభవించడమే తెలుసు. ఆ దృష్టితోనే చూస్తాడు. ఆంటీతో సంబంధం పెట్టుకుంటూనే ఆమె పిన్ని కూతుర్ని అనుభవించడానికి ప్రయత్నిస్తూంటాడు. దొంగతనాలు చేసి ఆ డబ్బుతో మజా చేస్తూంటాడు. కుక్కలా బతుకుతాడు, పిచ్చి కుక్కలా తన్నులు తింటూనే ఉంటాడు. ఇలా ఈ దర్శకుడి స్వైర కల్పనలు ఎందుకు అఫెన్సివ్ గా వున్నాయి? ఇది కళా మర్యాదకి ఎందుకు దూరం? 


        2014 లో ఐదు ఆస్కార్ నామినేషన్లు పొందిన ‘ది వుల్ఫ్ ఆఫ్ వాల్  స్ట్రీట్’ అనే బ్లాక్ కామెడీకి దర్శకుడు  ది ఫేమస్ మార్టిన్ స్కోర్ససీ (Martin Scorsese). ఇందులో హీరో వచ్చేసి మరెవరో కాదు, పాపులర్ స్టార్ లియోనార్డో డీ కాప్రియో. ఇందులో ఇతడిది చాలా నీచపాత్ర. అమ్మాయిలతో చాలా అసహ్యమైన పనులు చేస్తాడు. ఆఫీసులో అందరి ముందూ అలాటి పనులే  చేస్తాడు. స్టాక్ బ్రోకర్ గా చాలా నీచమైన పనులు చేస్తాడు. అవడానికి మల్టీ మిలియనీర్ అయినా వూర కుక్కలా తిరుగుతాడు. హీరో కాదుకదా, విలన్ కూడా చేయలేని చేష్టలకి పాల్పడతాడు. 



        ఆస్కార్స్ లో  ఈ సినిమా ప్రదర్శన ముగిశాక, ఒక రచయిత దర్శకుడు స్కోర్ససీని పట్టుకుని నిలదీశాడు- మీరు మీరేనా? ఇలా ఎలా తీస్తారు? ఏవగింపుగా వుంది మిమ్మల్ని చూస్తూంటే!- అంటూ అరిచాడు. అసలు విషయం అతడికి తెలీదు. ఈ సినిమా జోర్డాన్ బెల్ఫోర్ట్ అనే పేర్గాంచిన స్టాక్ బ్రోకర్ జీవిత చరిత్ర అని. కాబట్టే స్కోర్ససీ అలా తీయాల్సి వచ్చింది. డీ కాప్రియో అలా నటించాల్సి వచ్చింది. ఆ సీన్లన్నీ తీసేస్తే సినిమాకి అర్ధమే లేదు.

        ప్రవీణ్ సత్తారు తీసింది ఇలాటి జీవిత చరిత్ర కాదు. ఇలాంటప్పుడు ఇలాటి కల్పిత పాత్రతో ఆశుద్ధాన్ని గ్లామరైజ్ చేయడం  కళా మర్యాద అన్పించుకోదు. అలాటి క్రిమినల్ పాత్ర నిజవితంలో ఎవరైనా వుంటే, ప్రేక్షకులకి బాగా తెలిసి వుంటే అప్పుడు ఓకే. అయినా కూడా ఎక్కడో నార్త్ లో జరిగిన నిజకథ అని చెప్పి   ‘కీచక’ అనే హార్డ్ కోర్ రేపుల సినిమా ఇటీవలే తీశారు. అయినా అదీ ఒక్కరోజు కూడా ఆడలేదు. 

        యాంటీ హీరో పాత్రకైనా హద్దులుంటాయి. ఈ హద్దులు కూడా చేరిపేస్తామంటే అదేదో ప్రయోగం అన్పించుకోదు, పెర్వర్షన్ అన్పించుకుంటుంది. యాంటీ హీరోని సెక్స్ యావ తగ్గిస్తూ పచ్చి క్రిమినల్ గా ‘అండర్ డాగ్’ గా చూపించవచ్చు. ఇతను తలపడే ‘టాప్ డాగ్స్’ తో ఎప్పుడూ తన్నులు తినొచ్చు. యాక్టివ్ పాత్ర కాకపోయినా ఫర్వాలేదు. గేమ్ లో చిట్టచివరికి గెలిచాడంటే, ఆ ముగింపు ‘టాప్ డాగ్స్’ కి దిమ్మతిరిగేట్టు వుంటుంది. 

        అయితే ఈ సినిమా ఒక హీరో కథ కాదు- ఇద్దరి కథ. అందుకని ఇది ‘అందరూ దొంగలే’ లాంటి  ‘బడ్డీ మూవీ’. హాలీవుడ్ లో ఒకప్పుడు బడ్ స్పెన్సర్- టెరెన్స్ హిల్స్ కలిసి ఎన్నో క్రైం- కామెడీ – అడ్వెంచర్  కలగలిసిన ‘బడ్డీ మూవీస్’ లో నటించారు. ఇలాటి ‘బడ్డీ’ పాత్రలే నరేష్- సిద్ధూ జొన్నలగడ్డలవి యిక్కడ. అయితే సిద్దూతో పాటూ నరేష్ పాత్ర కూడా అశ్లీలాన్ని డామినేట్ చేసే క్యారక్టరైజేషన్స్ కావడంతో, బ్యాడ్ టేస్ట్ అన్పించుకుని తెల్లారిపోయాయి ఆ నటనలు ఫస్టాఫ్ లో.

        2000 లో యూత్ సినిమాలంటూ వెల్లువెత్తిన కాలంలో వచ్చిన ‘బ్యాచిలర్స్’ లో మొట్టమొదటిసారిగా స్టూడెంట్స్ ని తాగుబోతులుగా చూపించారు. అది అందరి ఛీత్కారాలకీ గురయ్యింది. కానీ అక్కడ్నించీ అవే తాగుళ్ళు మరింకొన్ని యూత్ సినిమాల్లో కంటిన్యూ అయ్యాయి. అలా అలా క్రమంగా చిన్న పెద్దా తేడా లేకుండా అందరు హీరోల సినిమాల్లో మందు సీన్లు సర్వసాధారణమైపోయి అలవాటు పడిపోయారు ప్రేక్షకులు. మందు సీన్లకి అలవాటుపడినట్టు పెర్వర్షన్ కి కూడా క్రమంగా అలవాటు పడ్డానికి ‘బ్యాచిలర్స్’ లాగే ఇదింకో బీజం వేస్తోందా- దీన్ని ఫాలో అవుతారా ఆవేశపడి దర్శకులు? 

        ఫస్టాఫ్ లో డామినేట్ చేసిన అశ్లీల ఎలిమెంట్ సెకండాఫ్ లో క్రైం ఎలిమెంట్ కారణంగా సమసిపోయాకే, సిద్ధూ నరేష్ లు ఎంటర్ టైన్ చేయడం మొదలెడతారు. అండర్ డాగ్స్ గా రక్తి కట్టించడం మొదలెడతారు. 

        ఇంకో రివాల్వర్ రాణి అనే సెక్స్ పిచ్చిగల పాత్రతో అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే సెక్స్ కి కామెడీ తోడవుతుందో అప్పుడది పాసయిపోతుంది. అమీర్ ఖాన్  ‘పీకే’ లో కారు లోపల జంటవల్ల ‘కారూగుతూంటే’ అమీర్ ఖాన్ వాళ్ళ బట్టలు కొట్టేయడం లాంటి రెండు సీన్లు ఇలాటివే. అలాగే ‘శంకరాభరణం’ లో అంజలి పోషించిన బందిపోటు పాత్ర తన అనుచరురాళ్ళని పెట్టించి పృథ్వీని సీరియల్ రేప్ చేయించే సీను కూడా. ఇలాగే ‘గుంటూర్ టాకీస్’ లో రివాల్వర్ రాణి శ్రాద్ధాదాస్ తో  ‘కారు ఊగే’  సీన్లు, ఫస్టాఫ్ లో సిద్ధూని రేప్స్ కి వాడుకునే సీన్ల వరకూ కామెడీ కిందే చెల్లిపోయాయి.  శ్రద్ధాదాస్ సెకండాఫ్ లో మొత్తం టాప్ డాగ్స్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకునే థ్రిల్లింగ్ సీన్స్ లో పాత్రకి ఆమె సరీగ్గా సరిపోయింది. 

        టాప్ డాగ్స్ అయిన డాన్ జాకీగా మహేష్ మంజ్రేకర్, అతడి గ్యాంగ్ లో  రవిప్రకాష్, ఫిష్ వెంకట్ లు కూడా సీన్లని ఫన్ తో నింపేశారు -  సీఐగా రఘుబాబు, ఎస్సైగా రాజారవీంద్ర, కానిస్టేబుల్ గా జోగినాయుడు సహా. 
        కెమెరా, సంగీతం మాత్రం ఒక వ్యూవేవ్ థ్రిల్లర్ కుండాల్సిన స్టయిలిష్ నేచర్ తో లేవు. 


చివరికేమిటి 

      దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి క్రైం సబ్జెక్టు మీద కూడా మంచి పట్టువుంది సందేహం లేదు, అక్కడక్కడా కొన్ని లాజిక్కులు తప్పితే. ఐదేళ్ళ క్రితం మొదటిసారిగా నరేష్ దొంగగా పట్టుబడినప్పుడు టౌన్లో ఏ ఎస్సై (రాజారవీంద్ర) ఉన్నాడో అతనే  ఇంకా కొనసాగడం, ఇప్పుడు తాజాగా ఐదు లక్షలు కొట్టేసిన నరేష్ ఫోటోని  కూడా గుర్తుపట్టక గోవా దాకా వెళ్ళడం లాంటి ఇల్లాజికల్ సీన్స్ వున్నాయి. అలాగే ‘ఆ డబ్బా’ ఇస్తానని టాప్ డాగ్స్ ని నరేష్ తన ఇంటికి వెంట బెట్టుకొస్తూంటే, అక్కడే వున్న ఎస్సై నరేష్ ని పట్టుకుంటాడు. పోలీసుల్ని చూసి టాప్ డాగ్స్ పారిపోతారు. తర్వాత టాప్ డాగ్స్ ‘ఆ డబ్బా’ కోసం నరేష్ ఇంట్లోకి జొరబడి వెతకొచ్చుగా? ఆ పని చేయకుండా  ఎక్కడెక్కడో తిరుగుతూంటారు.


        ఇలాటి లోపాల్ని సవరిస్తూ, ఆంటీ గీంటీ ఇంకో పెళ్ళాం లాంటి చీప్ పాత్రల్ని తీసేసి- నీటైన ఎరోటిక్ త్రిల్లర్ గా దీన్ని తీసివుంటే రెగ్యులర్ కమర్షియల్ అయ్యేది.


-సికిందర్


7, మార్చి 2016, సోమవారం

షార్ట్ రివ్యూ!

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రకాష్ ఝా

తారాగణం : ప్రియాంకా చోప్రా, ప్రకాష్ ఝా, మానవ్ కౌల్,        

నినద్ కామత్, కిరణ్ కర్మాకర్, మురళీ శర్మ తదితరులు 

సంగీతం : సలీం మర్చంట్- సులేమాన్ మర్చంట్ఛా, 

ఛాయాగ్రహణం : సచిన్ కృష్ణ్
బ్యానర్ : ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్ – ప్లే ఎంటర్ టిన్ మెంట్ని

నిర్మాత : ప్రకాష్ ఝా

విడుదల : 4 మర్చి, 2016

ప్పుడూ సామాజిక సమస్యల మీద దృష్టి పెట్టే బీహారీ బాబు ప్రకాష్ ఝా, వెట్టి చాకిరీ మీద  ‘దాముల్’ తీసి, లింగవివక్ష మీద ‘మృత్యుదండ్’ తీసి, ‘దిల్ క్యా కరే’  అనే బోరు ప్రేమ కథ తీసి, ‘రాహుల్’ అనే బెటర్ సెంటిమెంటల్ తీసి, ‘గంగాజల్’ తో కాన్వాస్ పెంచి, సామాజిక దురాగతాల తీవ్రత ఎంత పెరిగిపోయిందో చూపించుకొస్తున్నాడు...అందులో భాగంగా 1980 లో బీహార్ లోని భాగల్పూర్ లో ముప్ఫై ఒక్కమంది క్రిమినల్స్ కళ్ళల్లో యాసిడ్ పోసి తీవ్ర సంచలనం సృష్టించిన పోలీసుల  దురాగాతంపై 2003 లో ‘గంగాజల్’ ( అంటే ఇక్కడ యాసిడ్ అని వ్యంగం)  అనే సంచలనాత్మకం తీసి దర్శకుడుగా ఇంకో మెట్టు పైకెక్కాడు. మళ్ళీ బీహార్ కిడ్నాప్ మాఫియాలమీద ‘అపహరణ్’, దేశరాజకీయాల మీద ‘రాజనీతి’, రిజర్వేషన్ సమస్య మీద ‘ఆరక్షణ్’, మావోయిస్టు సమస్య మీద ‘చక్రవ్యూహ్’, స్కాముల మీద ‘సత్యాగ్రహ’ మొదలైనవి తీస్తూ తీస్తూ ఇలాటి సోషియో – పొలిటికల్  థ్రిల్లర్స్ జోన్ లో తనది ఏక ఛత్రాధిపత్యమని అనిపించుకుంటున్నాడు. ప్రకాష్ ఝా సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేలా చేస్తున్నాడు 64 ఏళ్ల ఈ మాస్టర్ మైండ్.

చేస్తున్నాడు 64 ఏళ్ల ఈ మాస్టర్ మైండ్.

 

          యితే ఈ క్రమంలో ఓ మూడు సినిమాలతో భయపెట్టకా పోలేదు. ‘రాజనీతి’ ని మహాభారతంతో పోలిక పెట్టి డజన్ల సంఖ్యలో క్యారక్టర్లతో  ఏం చెప్పాడో  మనకి అర్ధంగాక పోతే,  మళ్ళీ  ‘ఆరక్షణ్’లో ఎత్తుకున్న రిజర్వేషన్ల సమస్య ఇంటర్వెల్ తర్వాత వదిలేసి, విద్యా సంస్థల కార్పొరేటీకరణ అంటూ ప్లేటు ఫిరాయించడంతో మనకి మతులుపోయాక,  ‘సత్యాగ్రహ’ లో బోలెడు స్కాములు మాత్రమే చూపించి, ఒక్క పరిష్కారమూ  చెప్పలేక విరక్తి కల్గించిన ఝా-  ఈసారి మళ్ళీ ఏ భయానకం చూపిస్తాడోనన్న భయాందోళనలకి గురికావడం సహజం.
          అయితే మాస్టర్ మైండ్ మాస్టర్ మైండే - ఒకటీ అరాసార్లు గతి తప్పుతాడంతే!


ఉరితాళ్ళ ఉద్యమం

   వ్యంగంగా ‘గంగాజల్’ ని యాసిడ్ అనుకున్నట్టే, ‘జై గంగాజల్’ అంటే ఉరితాళ్ళు అనుకోవాలి. ‘గంగాజల్’ లో  పోలీసుల దురాగతమైతే, ‘జై గంగాజల్’ లో ప్రజలతో కుమ్మక్కయిన పోలీసుల ప్రాయశ్చిత్తం. కాస్సేపు ప్రజాస్వామ్య మూలస్థంభాలలో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ అనే రెండు మూలస్థంభాలు చూసీ చూడనట్టు ఉండిపోతే - ఈ రెండిటినీ చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని సర్వ నాశనం చేస్తున్న, కుళ్ళిపోయిన  రాజకీయవ్యవస్థ అనే మూడో మూలస్థంభాన్ని, ప్రక్షాళన చేసేస్తారు పోలీసులూ ప్రజలూ కలిసి! 


          అయితే ఇందుకు ప్రజలు  సిద్ధమే, మరి ఎందరు పోలీసులు ముందుకొస్తారు?
          ఇక్కడే స్పీడ్ బ్రేకులు ఆ సీఐ కి...


          ఆ వూళ్ళో సీఐ గా ఉంటున్న బీఎన్ సింగ్ ( ప్రకాష్ ఝా) కి ఆ ప్రమోషన్ ఎమ్మెల్యే బబ్లూ పాండే తమ్ముడు డబ్లూ పాండే  పెట్టిన భిక్షే. డబ్లూ పాండే (నినద్ కామత్) ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద టెర్రర్. అతడి టెర్రర్ తనాన్ని చూసీ చూడనట్టు వుంటూ, అవసరమైతే తొత్తుగా పనిచేస్తూ బంగళాలూ బంగారాలూ కొనుక్కుని సుఖపడతాడు సర్కిల్ ఇన్స్ పెక్టర్  సింగ్. లఖీసరాయి అనే గ్రామం శివారులో వున్న భూముల మీద ఓ పవర్ ప్లాంట్ కంపెనీ  కన్ను పడుతుంది. దీంతో డబ్లూ పాండే రంగంలోకి దిగిపోయి రైతుల నుంచి భూములు లాక్కోవడం మొదలెడతాడు. రైతులు ప్రతిఘటిస్తారు. ఒక ఐఐటీ టాపర్ -కమ్- పీహెచ్ డీ స్కాలర్ పవన్ (రాహుల్ భట్) అమెరికాలో లక్షల డాలర్లు వచ్చే ఉద్యోగం వదులుకుని సామాజిక కార్యకర్తగా ఇక్కడ ఉంటాడు. ఈ భూదోపిడీకి వ్యతిరేకంగా ఆందోళనలు  చేస్తూంటాడు. సీఐ సింగ్ తనకి ప్రజల్లో చెడ్డ పేరు రాకుండా, అటు డబ్లూ తోనూ చెడకుండా డబుల్ యాక్షన్ చేస్తూ పరిస్థితిని డీల్  చేస్తూంటాడు. 


బబ్లూ పాండే 
      అది ఎన్నికలు దగ్గర పడ్డ కాలం.  ఈ లఖీసరాయి గ్రామం వున్న బంకిపూర్ జిల్లా కొత్త ఎస్పీగా ఆభా మాథుర్ ( ప్రియాంకా చోప్రా ) ని నియమిస్తూ ఉత్తర్వులిస్తాడు హోంమంత్రి చౌదరి (కిరణ్ కర్మాకర్). హోంమంత్రి చౌదరితో అధికార పార్టీ ఎమ్మెల్యే బబ్లూ పాండే (మానవ్ కౌల్) సన్నిహితంగా ఉంటూ పోలీసుల్ని తన గుప్పెట్లో వుంచుకుంటాడు. కొత్త ఎస్పీ ఆభా మాథుర్ చార్జి తీసుకున్న వెంటనే సీఐ  సింగ్ మొహం చూసే వీడొక కేడీ అని కనిపెట్టేస్తుంది. ఇది తెలిసికూడా సింగ్ అలాగే డబుల్ యాక్షన్ చేస్తూంటాడు ఈమెతో కూడా. డబ్లూ గ్యాంగ్ లో ఒక టక్కరి అయిన నపుంసకుడు మున్నా మర్దానీ (మురళీ శర్మ) ఉంటాడు. వీడు కొరియర్ లాగా పనిచేస్తూంటాడు డబ్లూబాబుకి.

          లఖీసరాయి వూళ్ళో డబ్లూబాబు  గ్యాంగ్ ఓ అమ్మాయి మీద కన్నేసి లాక్కుపోతూంటే పోలీసులు నిస్సహాయంగా చూస్తూంటారు. ఎస్పీ ఆభా వచ్చేసి గ్యాంగ్ ని తన్ని అమ్మాయిని కాపాడుకోవడంతో ఈ విషయం అటు డబ్లూబాబు అన్న ఎమ్మెల్యే బబ్లూకీ,  అట్నుంచి  హోంమంత్రికీ తెలిసి ఆమెని మందలిస్తారు. ఎస్పీ ఆభా అహం దెబ్బ తింటుంది. ఇది వాళ్ళిద్దరితో  ప్రచ్ఛన్న యుద్ధానికి బీజం వేస్తుంది. 

డబ్లూ పాండే 
       అటు వూళ్ళో డబ్లూ రైతులకి పంట రుణాలు కూడా అందకుండా  చేస్తూండడంతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకొందరు రైతులు భయంతో వచ్చిన కాడికి భూములు అమ్మేసుకుంటారు. బెదిరింపుల్ని తట్టుకోలేక ఇంకో రైతు కూడా అమ్ముకోవడానికి సిద్ధ పడుతూంటే, అతడి  పంతొమ్మిదేళ్ళ కూతురు సునీత ( వేగా తమోటియా) అడ్డుకుంటుంది. రైతులందరూ అమ్మేసుకున్నారు- మధ్యలో వున్న తమ  రెండెకరాల పొలాన్ని  చచ్చినా అమ్ముకునేది లేదని చెప్పేస్తుంది సునీత.  ఆమె తండ్రిని బ్యాంకు ఋణం కేసులో ఇరికించి వేధిస్తారు. అతను  పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన  సీఐ సింగ్ కి  నిద్ర పట్టకుండా చేస్తుంది. విపరీతమైన అపరాధ భావంతో అంతరాత్మ మేల్కొంటుంది. ఇప్పుడు అతడికి డబ్లూబాబు అనేవాడు నీచాతి నీచుడుగా కన్పిస్తాడు. 

         అటు ఎస్పీ అభాకి పైనుంచి చెడితే, ఇటు సింగ్ కి డబ్లూతో చెడుతుంది. అయినా ఎస్పీ ఆభా సీఐ సింగ్ ని నమ్మక పోవడంతో వాళ్ళిద్దరికీ ఎడం పెరుగుతుంది.

       ఇక పొలం అమ్మని సునీతని డబ్లూ ఎత్తుకుపోయి రేప్ చేసి చంపి వాళ్ళ  పొలంలోనే  చెట్టుకి వేలాడదీస్తాడు. సునీత పదేళ్ళ తమ్ముడు ఈ దృశ్యం చూసి చలిస్తాడు. సీఐ సింగ్ వాణ్ణి చేరదీస్తాడు. వూళ్ళో కొచ్చిన డబ్లూని సింగ్ ఎడాపెడా తన్ని అరెస్ట్ చేయబోతూంటే ఘర్షణ జరిగి, కింద పడ్డ డబ్లూ మెడకి బెల్టు తీసి బిగించేస్తాడు సునీత తమ్ముడు. కసిగా డబ్లూని నేలమీద అలా ఈడ్చుకుపోతాడు. ఊపిరాడక ఛస్తాడు డబ్లూబాబు. వెంటనే పోలీసులూ జనం కలిసి డబ్లూబాబు  అనుచరుల్ని కూడా ఉరితీసేసి, సెంటర్లో చెట్టుకి వేలాడదీసేస్తారు డబ్లూబాబు  శవం సహా. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారని రిపోర్టు చేస్తారు. 


          బబ్లూ వచ్చి చూసుకుని తన తమ్ముణ్ణి చంపిన సునీత తమ్ముణ్ణి  పట్టుకుని, ఈ సెంటర్లో ఈ చెట్టుకే వురి తీస్తానని శపధం చేస్తాడు. డబ్లూబాబు  అండ్ గ్యాంగ్ ‘ఆత్మహత్యల’ కేసులో ఎస్పీ ఆభా కి ప్రజలెవరూ సహకరించరు. చివరికి ఈ ‘ఆత్మహత్యల’ బాధ్యత సీఐ సింగ్ తనే తీసుకుని- ఇదే న్యాయమంటాడు. ఇంకా ప్రజల సహకారంతో ఇలాటివి జరగాలంటాడు. ఎస్పీకి మండిపోతుంది. ఇద్దరికీ ఇంకా చెడుతుంది. ఇలా వుంటే శత్రువు టార్గెట్ గా సునీత తమ్ముడు ప్రమాదంలో ఉంటాడు...      


          ఇదీ సమస్య.  ఇక ఇక్కడ్నించీ  చట్టం కోసం ఎస్పీ- సీఐలకి మధ్య, అటు సునీత తమ్ముడి కోసం  సీఐ – బబ్లూలకి మధ్యా  సంఘర్షణ ఎలా కొనసాగిందన్న మిగతా కథ కోసం వెండితెరని ఆశ్రయించాల్సిందే.  


ఎలావుంది కథ 

     లోచనాత్మకంగా వుంది. ఆచరణలో సాధ్యంగాక పోయినా ప్రజల మనోభావాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా  వుంది. ఇది చాలా ముఖ్య లక్షణం కథకి : ప్రజల / ప్రేక్షకుల మనోభావాలకి ప్రాతినిధ్యం వహించడం. ఇలా జరగడమే న్యాయమన్పించే  పరిస్థితి  రాజకీయ వ్యవస్థ కల్పిస్తున్నదే. పోలీసులతో మమేకమైన మూకస్వామ్యమే ప్రజల బాధలన్నిటికీ పరిష్కారమనే స్పష్టతతో హెచ్చరిక పంపేలా వుంది. పవర్ ప్లాంటూ, ల్యాండ్ మాఫియా, వీటికి  వ్యతిరేకంగా పోరాటాలూ పాత కథే. చాలా సినిమాల్లో చూసి వున్నదే. ఇక్కడ పాయింటు ఇది కాదు, పాయింటు కుళ్ళిన రాజకీయ వ్యవస్థకి మరమ్మత్తు. ఈ వ్యవస్థతో విసిగిన పోలీసులూ ప్రజలూ కలిసి తీసుకునే చర్యకి నేపధ్యం కోసం మాత్రమే భూదోపిడీ అనే రొటీన్ కథ తీసుకున్నారు. ఈ రొటీన్ కథల్లో ఉంటున్న ఎవరూ పట్టించుకోని  చికిత్సకి  ఏర్పాటు చేసిన పాయింటే  కొత్తగా వుంది. ఇందువల్ల ఈ కథ మొత్తం కొత్తగా  మారిపోయింది.  కథలో ‘వురేసుకుని’ మరికొన్ని ‘ఆత్మహత్యలు’ జరుతాయి రాజకీయ నాయకులు బెంబేలెత్తేలా. కాకపోతే ఇక్కడ కొత్త నినాదం- రైతుల ఆత్మహత్యలకి కారకులైన వాళ్ళు కూడా ‘ఆత్మహత్యలు’ చేసుకోవాలన్నదే-  ‘జో జనతా కో లూటేగా ఉస్కా సూసైడ్!’ అని.  ఈ మొత్తం కథ ఒక  పవర్ఫుల్ సోషల్ కామెంట్.


ఎవరెలా చేశారు 


        ఇది ప్రియాంకా చోప్రాతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనుకుంటారందరూ. కానీ ఒక విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది- ఇందులో ప్రియాంకా చోప్రా ఎస్పీ పాత్రని, ప్రకాష్ ఝా సీఐ పాత్ర మింగేస్తుంది. ప్రత్యర్ధులతో ప్రత్యక్ష పోరాటం చేస్తూ నానా హింస పడేది, చావుదాకా వెళ్లి వచ్చేదీ   ప్రకాష్ ఝా పాత్రే. ప్రియాంకా చోప్రా పాసివ్- రియాక్టివ్ పాత్రగా వుంటుంది. శాంతి భద్రతల పరిస్థితి తలెత్తినప్పుడే ఆమె రియాక్టివ్ గా చక్కదిద్దడానికి ప్రయత్నించేది, ఈ క్రమంలో పై నాయకులతో పాసివ్ గా ప్రచ్ఛన్న యుద్ధం, ఇంతవరకే. ఆమెకో లక్ష్యమంటూ లేదు. తనకి వ్యతిరేకంగా వున్న ప్రకాష్ ఝా పాత్ర కూడా తనకి లక్ష్యం కాలేదు. అతడి ఉరితాళ్ళ ఆశయంతో తన చట్ట బద్ధమైన సంఘర్షణ అంతలోనే సునీత తమ్ముణ్ణి కాపాడే అతడి సంఘర్షణలో భాగమైపోతుంది.  


          కథలో ప్రకాష్ ఝా కారణంగా  ఓ మేజర్ సంఘటన జరిగినప్పుడల్లా సమాచారమందుకుని రావడమనే రొటీన్ సీన్లు  ఆమెకున్నాయి. ఒక సంఘటన జరుగుతూంటే ఇప్పుడామెకి సమాచారం అందుతుందని, కుయ్ కుయ్ మంటూ కారులో వచ్చేస్తుందని మనం అనుకోగానే ఆమె వచ్చేస్తుంది. ఇలా సెకండరీ క్యారక్టర్ గా ఉండిపోయింది. మరొకటేమిటంటే, ఓవర్ గా మేకప్ చేసుకోవడం. ఒక ఎస్పీగా హుందాతనం ఉట్టిపడే ముఖవర్ఛస్సుతో వుండాల్సింది పోయి  రోమాంటిక్ హీరోయిన్ లా వుంటుంది. ఈ సినిమాలో రోమాన్సు  కూడా లేదు.


          నటనని పాత్రచిత్రణతో కలిపి చూడకుండా సర్టిఫికేట్ ఇచ్చేస్తే పాత్రనే అవమానించిన వాళ్లవుతాం. ఈ దృష్ట్యా ప్రియాంకా చోప్రా తన తిరుగు లేని టాలెంట్ తో ఎంత గొప్పగా నటించినా,  అది తామరాకు మీద నీటి బొట్టల్లే  వుండిపోయింది.


         ఈ సినిమా దర్శకుడు, నిర్మాత, కథకుడు, స్క్రీన్ ప్లే కారకుడు, మాటల రచయితా ప్రకాష్ ఝా తొలిసారిగా నటించాడు. నటింపజేసే దర్శకుడికి రాయడం రాకపోయినా ఫర్వాలేదుగానీ, నటనే రాకపోతే నవ్విపోతారు కాబట్టి, ఝా ఇందులోనూ ఒక ‘డర్టీ హేరీ’ క్లింట్ ఈస్ట్ వుడ్ అన్పించుకున్నాడు. పోలీస్ పాత్రని పరమోన్నత స్థాయికి చేర్చిన  ఈస్ట్ వుడ్ లాగే,  సీఐ సింగ్ నీ దేశంలో అందరు సీఐలకీ ఆదర్శం అన్నట్టుగా నటించి పెట్టాడు. లంచగొండిగా  ఎలా సుఖపడి, అంతరాత్మ మేల్కొని ఎలా సంఘర్షించి, ఎలా పరిణతి చెందాడో క్యారక్టర్ బయోగ్రఫీ అంతా ఒక ట్రాకులో తనకే వుంది. చాలా విచిత్రమైన పాత్ర ఇది. పై అధికారి ఎస్పీ ఆభాతో డిసిప్లిన్డ్ గా వుంటాడు. ఆమె పీకే క్లాసులన్నీ వింటాడు. కానీ ఒక్క మాటా ఎదురు మాటాడడు. సెల్యూట్ కొడతాడు. బయట చేసేది చేస్తూంటాడు. ఆమె సస్పెండ్ చేస్తే సస్పెండ్ అవుతాడు. కస్టడీలోకి  తీసుకుంటే కస్టడీలో వుంటాడు. కానీ ఆమె ఇంటరాగేట్ చేస్తే నోరు విప్పడు. ఆమె మటాడుతూంటే తను నోరు విప్పకూడదన్నది తన డిసిప్లిన్! ఆమెకి పిచ్చెక్కుతుంది. 


          రైతు కూతురు సునీత మరణంతో కథలో లక్ష్యం ఝా పాత్రకే ఏర్పడింది. అక్కడ్నించీ ప్రధాన సంఘర్షణంతా  సునీత తమ్ముణ్ణి కాపాడడం గురించే. ఈ యాక్టివ్ పాత్రలో ఝా ఆద్యంతం తనెవరో తెలియని ప్రేక్షకులని కూడా రెండు గంటలా 38 నిమిషాలూ కట్టిపడేస్తాడు- యాక్షన్ సీన్స్ సహా! 


          ఇక్కడ ప్రశ్న – ప్రియాంకా చోప్రా పాత్రని తగ్గిస్తూ, కొత్తగా నటిస్తున్న  ప్రకాష్ ఝా ఎందుకు తన పాత్రని ప్రధానం చేసుకున్నాడన్నదే. ఈ పాత్రలో ఏ అజయ్ దేవగణ్  నో తీసుకుని వుంటే అదివేరు. అప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ లుక్ సినిమాలో లేకపోయినా, పెద్ద స్టార్ గా అజయ్ ఉంటాడు కాబట్టి ఈ సినిమా అతడిదే అనుకుని తృప్తి చెందవచ్చు. ఇలా కాకుండా ఝా పెద్ద రిస్కు తీసుకున్నాడు. హీరోయిన్ ఓరియెంటెడ్ జానర్ కి కొత్త నిర్వచనం చెప్పాడు. ఇంతవరకూ ఇలాటిది భారతీయ సినిమాల్లో జరగలేదు- సహాయ పాత్రే ప్రధాన పాత్ర కావడం, దాంతో సినిమా విజయవంతం కావడం. రూల్స్ ని బ్రేక్ చేయడమంటే ఇదేనేమో. కానీ రూల్స్ ని బ్రేక్ చేయాలంటే కూడా అసలంటూ రూల్స్ తెలిసి వుండాలి. ఇది తెలుసేమో  ఝాకి.



చివరికేమిటి 





       ఒక కొత్త కమర్షియల్ ప్యాకేజీగా పవర్ఫుల్  మెసేజితో ఈ సినిమా వచ్చింది. కొత్త కమర్షియల్ ప్యాకేజీ అనడమేమిటంటే, ఇందులో లవ్- రోమాన్సుల్లేవు, పాటల్లేవు, కామెడీ ఆర్టిస్టుల్లేరు, చీప్ డైలాగుల్లేవు, నీచమైన తాగుడు సీన్లు లేవు, సిక్స్ ప్యాక్- హైపర్ యాక్షన్ సీన్స్ లేవు. జీవితం ఎలా వుంటుందో, అందులో ఉద్రిక్తత లెలా వుంటాయో అవే సహజత్వంతో వున్నాయి. కొట్టుకున్నా, కాల్చుకున్నా అంతా రియలిస్టిక్కే- ఒక్క చివర్లో ప్రియాంకా  వైర్ వర్క్ యాక్షన్ సీన్ తప్ప. ఇందులో హైలైట్ అనదగ్గ సీన్లన్నీ యాక్షన్ తో కూడుకున్నవే కావడం గమనార్హం. వీటిలో ఎమోషన్స్ వర్ణనాతీతం. సునీత తమ్ముడు డబ్లూ మెడకి బెల్టు బిగించి లాగే సీను, సీఐ సింగ్ ని మురిక్కాల్వలో పడేసి బబ్లూ చావదన్నే సీను, డబ్లూ అండ్ గ్యాంగ్ శవాల్ని చెట్టుకి వేలాడదీసే సీను, డబ్లూని సింగ్ బజార్లో ఈడ్చి ఈడ్చి తన్నేసీను,  ఎస్పీ ఆభా లాఠీచార్జి జరిపి అమ్మాయిని కాపాడే సీను, సునీతని లారీలో తిప్పుతూ దొరక్కుండా డబ్లూ రేప్ చేస్తూంటే ఆ లారీని పట్టుకోవడం కోసం ఆభా, సింగ్ లు వేదన పడే సీను, సునీత తమ్ముణ్ణి  బబ్లూ పట్టుకుని ఉరి తీయబోయే సీను... ఇలా లాండ్ మార్క్ సీన్స్ ఎన్నో. ఇక ఏ స్థాయి పోలీసుల్ని కూడా యూనిఫామ్స్ లేకుండా జీన్సు షర్టు లేసి ఫ్యాషన్ షో బొమ్మల్లాగా చూపించలేదు. పక్కా ప్రొఫెషనలిజం ఇక్కడ!


          ఒక ఎమోషనల్ ట్రావెల్ ఈ సినిమా  - కరుడుగట్టిన మాస్టర్ మైండ్ ప్రకాష్ ఝా చేతిలో.

 

 

-సికిందర్ 

5, మార్చి 2016, శనివారం

షార్ట్ రివ్యూ!







కథ, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం : బి.వి. నందినీ రెడ్డి

తారాగణం : నాగశౌర్య, మాళవికా నాయర్‌, పర్ల్‌ మానే, రాశి,  ఆనంద్‌,  ఐశ్వర్య,  రాజ్‌ మదిరాజు, తాగుబోతు రమేష్‌, మిర్చి హేమంత్‌, జెమిని సురేష్‌, ప్రగతి తదితరులు
మాటలు, పాటలు : లక్ష్మీభూపాల్‌, సంగీతం : కళ్యాణ్‌ కోడూరి, ఛాయాగ్రహణం : జి.వి.ఎస్‌. రాజు, కూర్పు: జునైద్‌ సిద్ధిఖీ
బ్యానర్‌ :
 శ్రీ రంజిత్‌ మూవీస్‌, నిర్మాత : కె.ఎల్‌. దామోదరప్రసాద్‌
విడుదల :  4 మార్చి,  2016
***
       2011 లో బివి నందినీ రెడ్డి  ‘కొత్త దర్శకురాలి ఉత్తమ తెలుగు చిత్రం’ కేటగిరీ కింద ‘అలా మొదలైంది’ కి నంది అవార్డు, దీనికే ఉత్తమ దర్శకురాలిగా ఫిలింఫేర్ నామినేషనూ పొంది ఒక స్థానం సంపాదించుకున్నాక, ‘జబర్దస్త్’  అనే ఫ్లాప్ తీసి, దాన్ని ‘బ్యాండ్ బాజా బరాత్’ నుంచి కాపీకోట్టారని యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి లీగల్ నోటీసు కూడా అందుకుని ప్రతిష్ట కోల్పోయాక- చాలా కాలంపాటు  ఇంకో సినిమా కోసం విఫలయత్నాలు చేసి, ఇప్పుడు ‘కళ్యాణ వైభోగమే’ అంటూ ముందుకొచ్చారు. 

       ధునిక దృక్పథం గల ఫిమేల్ డైరెక్టర్ గా తను ‘జబర్దస్త్’  లాంటి మెల్ డైరెక్టర్ ల ఆటస్థలమైన మాస్ మసాలా జోలికి వెళ్ళాల్సింది కాదు. ఓ యాభై మాస్ మసాలాలు కూడా తీసిపారేసి విజయాలు సాధించిన ఫిమేల్ డైరెక్టర్ విజయనిర్మల దరిదాపులకి తెలుగులో ఇంకో ఫిమేల్ డైరెక్టర్ రాలేకపోయారు ఇంతవరకూ. ఒక విషయాన్ని లేదా సమస్యని మేల్ డైరెక్టర్లు వాళ్ళ పురుష దృక్కోణం లోంచి చూసే పధ్ధతి వేరు, ఫిమేల్ డైరెక్టర్లు వాళ్ళ సహజాతం (ఇన్ స్టింక్ట్) తో చూసే పరిస్థితి వేరు. కమర్షియల్ సినిమాల పేరుతో వెలువడుతున్న కాలుష్యం బారినుంచి  ప్రేక్షకుల్ని పక్కకు తీసి, వాస్తవ జీవితాన్ని దగ్గరగా చూసే క్లోజప్ కథలతో తమదైన స్త్రీ వాయిస్ ని విన్పించే ప్రయత్నం చేసినపుడే ఫిమేల్ డైరెక్టర్లంటే ఏమిటో తేడా తెలుస్తుంది. 

        గతవారం చునియా అనే దర్శకురాలు ‘పడేసావే’ అనే మేల్ డైరెక్టర్లు వాడేసిన విషయాన్ని తీసుకుని తనుకూడా  మేల్ వాయిస్ నే విన్పిస్తూ తన జెండర్ ఐడెంటిటీని ప్రదర్శించుకునే బంగారు అవకాశాన్ని కోల్పోవడం పరిస్థిని తెలియజేస్తోంది.


        కానీ ఇప్పుడు నందినీ రెడ్డి ఈ లోటు తీర్చడానికా అన్నట్టు ‘కళ్యాణ వైభోగమే’ అన్న కొత్తతరం ప్రేమకథని తన జెండర్ ఐడెంటిటీతో డిఫరెంట్ గా చూపిస్తూ ముందుకొచ్చారు. అయితే ...అయితే... అయితే...అన్ని నదులూ వెళ్లి సముద్రంలోనే కలుస్తాయన్నట్టు, అంతలోనే  వెళ్లి వెళ్లి తనూ మేల్ డైరెక్టర్ల మెగలోమేనియాలో పడిపోయారు! 

        దర్శకురాలు దర్శకుడు అన్పించుకోవాలన్న మోజు ఎందుకో!

        అనేక ఫ్లాపులతో సతమతమవడమే తప్ప తెరిపిన పడ్డం తెలియకుండా పోతున్న హీరో నాగశౌర్య ఎట్టకేలకు ఈ సినిమాతో విజయతీరాలకి చేరుకున్నట్టే  కొలంబస్ లా. ఇక్కడ్నించీ ఈ పయనం ఇంకే తీరాలకో ఇక ముందు గానీ తెలీదు. నటించగల టాలెంట్ వుండీ  తీరాలు వెతుక్కునే తంటాలు ఇకనైనా తప్పుతాయా? చాలా మంది కొత్త హీరోలు మాస్ అనుకుంటూ మునకలేస్తున్నారు, తనొక్కడైనా  ఈ ‘కవైభో’ లాంటి యూత్ ఐడెంటిఫై చేసుకోగల  జనరేషన్- జెడ్ తరహా ఫ్రెష్ క్యారక్టర్లని  తన స్పెషాలిటీగా  గుప్పెట పట్టుకుని బ్రాండ్ అంబాసిడర్ అవగలడా? 

        ‘కవైభో’ ఇలాటి దానికి కావలసినంత పునాది వేస్తోంది మరి...

పెళ్లి పెటాకుల ప్యాకేజీ 
        శౌర్య (నాగ శౌర్య) యుక్త వయస్సుని సంపూర్ణంగా, స్వేచ్చగా అనుభవించే ఏకైక లక్ష్యంతో జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాడు. అందులోభాగంగా అమెరికాలో సెటిలయ్యేందుకు  ప్రణాళిక వేసుకుంటాడు. కానీ ఇంట్లో పెళ్లిగోల. 

        ఇంకో చోట దివ్య (మాళవికా నాయర్‌) డాక్టరుగా పనిచేస్తూ ఏ బాదరబందీ లేని జీవితాన్ని హాయిగా గడిపెయ్యాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఇంట్లో పెళ్లిగోల. 

        అటు శౌర్యకీ ఇటు దివ్యకీ పెళ్ళంటే వైముఖ్యం లేదు, కానీ ఇంకా పాతిక కూడా  నిండని జీవితాలకి ఆ గుదిబండ తగిలించుకోవడం ఇష్టం లేదు. 

        ఇలాటి అపరిచయస్థులైన  ఇద్దరూ పెద్దవాళ్ళ బలవంతంతో పెళ్లి చూపులకి సిద్ధమవుతారు. అక్కడే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పరస్పరం ఇష్టపడలేదని ప్రకటించేసి బయట పడతారు. ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్లి పోయి ఎంజాయ్ చేస్తూంటారు.

       కానీ  పెద్ద వాళ్ళు వదలరు. ఇంకా సంబంధాలు తెస్తూ పెళ్లి చూపులకి చంపేస్తూంటారు.  ఈ వరస పెళ్ళిచూపులతో అలసిపోయి ఇద్దరూ ఒక ఆలోచన చేస్తారు. ఈ గోల తప్పాలంటే తామిద్దరూ పెళ్లి చేసుకుని పెద్ద వాళ్ళ కోరిక తీర్చి, ఆర్నెల్లయ్యాక విడాకులతో విడిపోయి తమ కోరిక తీర్చుకుందామని మరో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు.

        అలా పెళ్ళవుతుంది. వెంటనే రహస్యంగా విడాకులకి అప్లై చేసుకుని ఫ్రెండ్స్ తో ఆటా పాటలతో డివోర్స్ సెలెబ్రేషన్ కూడా జరుపుకుంటారు. శౌర్యతో ఎక్కడో నగరంలో కాపురం పెట్టిన దివ్య ఇక కలిసివుండడంలో అర్ధం లేదని సామాన్లు సర్దుకుంటుంది. ఫ్రెండ్స్ సహాయంతో ఆమెని ఆపి,  ఎప్పుడైనా వచ్చే పేరెంట్స్ కోసమైనా ఫ్రెండ్స్ గా ఒకే ఫ్లాట్ లో కలిసి ఉందామని ఒప్పిస్తాడు శౌర్య. 

        ఇక హోటల్ రూమ్ లా ఫ్లాట్ ని వాడుకుంటూ, వచ్చిపోతూ, ఎవరిదారిన వాళ్ళు తిని పడుకుంటూ వుంటారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి జీవితాలు ఏఏ మలుపులు తిరిగాయన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ?
        నేటి యువసమాజం ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా వుంది. వెంటనే యూత్ కి కనెక్ట్ అయ్యే జీవన శైలితో వుంది. ఇప్పడు ప్రపంచం ఒక కుగ్రామమైతే, జీవితం  విశ్వమంత విస్తరించి కూర్చుంది. దీని అంతు చూడకుండా మడిగట్టుకు కూర్చోవాలని ఏ ఉడుకు రక్తమూ అనుకోదు. ఇలాటి యూత్ ఐడెంటిఫై చేసుకోగల రెండు పాత్రలతో ఒక ఫ్రెష్ నెస్ ని మోసుకొస్తూ, ఇప్పటి మూవీ మార్కెట్ లో జోరుగా అమ్ముడయ్యే నవీన ఉత్పత్తిలా వుంది. కానీ చివరి కొచ్చేటప్పటికి  యూటర్న్ తీసుకుని, ఈ జోరుకి కళ్ళేలు వేయాలన్న ఆందోళనతో, లేకపోతే  ‘కన్హయ్యా కుమార్’  లా  ‘స్వేచ్ఛ ఎక్కువైపోయి’  సోకాల్డ్ సమాజానికి తీవ్ర హానికలుగుతుందన్న మోరల్ పోలీసింగ్ కి పాల్పడింది! ఓ రచయిత కథలో మోరల్ పోలీసింగ్ వుంటే పోనీలే మగ దురహంకారం అనుకోవచ్చు. రచయిత్రుల కథలు కూడా మగ దురహంకారంతో  వుంటాయా?

 ఎవరెలా చేశారు 
        ప్రతీ ఒక్కరూ ఈ రోమాంటిక్ కామెడీలో ప్రేక్షకులు ప్రేమించే పాత్రలుగానే తారసపడతారు. ఎవర్నీ తీసెయ్యడానికి లేదు. ఇంత మంచి పాత్రల సంకలనం రెండేళ్ళ క్రితం ‘మనం’ తర్వాత ఇదే. ఫ్యామిలీ స్టోరీస్ అంటూ సాంతం నరుక్కునే రాక్షసుల కుటుంబాల కథలే చూపించే దౌర్భాగ్యంతో తెలుగు సినిమాలుంటున్న కాలంలో, ఈ సినిమా ఒక చెంప పెట్టు. నరుక్కునే రాక్షాసుల్ని మన జీవితాల్లో చూడం. ఎక్కడో వున్నట్టు వింటూంటాం. తెల్లారి లేస్తే మన చుట్టూ కన్పించేది  సాత్విక ప్రపంచమే, సామాన్య మనుషులే, మనిషితనంతో వుండే  మామూలు కుటుంబాలే. ఇవే ఈ సినిమాలోనూ కన్పిస్తాయి. ఒక్కటి కూడా నెగెటివ్ పాత్ర లేకుండా తమతమ పాజిటివ్ దృక్పథాలతో ఒక డ్రీమ్ వరల్డ్ ని సృష్టిస్తాయి. సున్నిత హాస్యాన్ని ఒలకబోస్తాయి. హీరో హీరోయిన్ల దగ్గర్నుంచీ వాళ్ళ ఫ్రెండ్స్ గా నటించిన వాళ్ళ వరకూ, హీరో హీరోయిన్ల పేరెంట్స్ గా నటించిన వాళ్ళ దగ్గర్నుంచీ సిక్కు కుటుంబమూ వాళ్ళ పిల్లల వరకూ, ప్రతీ ఒక్కరూ జనరంజకం చేశారు దృశ్యాల్ని. 

        నాగశౌర్య తల్లిగా నటించిన ఐశ్వర్య ఒక అయోమయపు క్యారక్టర్ అయితే, తండ్రిగా నటించిన రాజ్ మాదిరాజు ‘గొప్ప’ ఆలోచనా పరుడు. హీరోయిన్ మాళవికా నాయర్ తల్లి దండ్రులుగా నటించిన రాశి, ఆనంద్ డీసెంట్ జంటే- కానీ పైకి కనపడని దూరాలతో సతమతమవుతున్న జీవులు వాళ్ళు. మాళవికా నాయర్ పెద్ద అందగత్తె  కాకపోయినా సరీగ్గా ఆ  పాత్ర స్వభావానికి సరిపోయే ఫీచర్స్ తో, నటించగల స్తోమతతో కన్పిస్తుంది. పెళ్ళికి ముందు రాత్రి తల్లీ కూతుళ్ళుగా మాళవికా- రాశీల మధ్య వైవాహిక జీవితం గురించిన సింపుల్, మెచ్యూర్డ్  సంభాషణతో కూడిన దృశ్యం- దాని ఫీల్ కి తగ్గట్టు మెస్మరైజింగ్ లైటింగ్ తో చిత్రీకరణా ఒక గొప్ప ఎచీవ్ మెంట్ అనొచ్చు.  గర్ల్ ఫ్రెండ్ గా వైదేహి అనే విచిత్ర పాత్రలో వచ్చిపోయే పెర్ల్ మానే కూడా ఎక్సెలెంట్. 

        ఇక మ్యారేజ్ బ్రోకర్ గా సూటు బూటు వేసుకుని,  బాబ్డ్ హెయిర్ తో విగ్గు పెట్టుకుని గుర్తుపట్టకుండా వుండే ప్రగతి,  తనది కార్పొరేట్ లుక్ అనడం రాక  కార్పోరేషన్ గెటప్ అనే అమాయకత్వంతో చేసే కామెడీ తన టాలెంట్ ఏ ఏ రకాలుగా విస్తరించగలదో మరొక్క సారి గా నిరూపించుకునే అవకాశాన్ని దక్కించుకుంది- మొన్నే ‘మలుపు’ లో గమ్మత్తయిన తల్లి పాత్ర వేసి తన స్పెషాలిటీని చాటుకున్నాక.

        ఇలా ప్రతీ చిన్నా పెద్దా పాత్రా ఏదీ వృధాగా లేదు సినిమాలో. చివర్లో వస్తారు తాగుబోతు రమేష్, ఆశీష్ విద్యార్ధి లు. ఇక హీరో నాగశౌర్య కళాపోషణ గురించి ముందే చెప్పుకున్నాం. 

        టెక్నికల్ గా చూస్తే  ఈ కథ మొత్తాన్నీ- ఇది ప్రతిపాదిస్తున్న భావజాలపు నీడల్నీ కెమెరా జీర్ణించుకుని  తెరమీద దృశ్యమానం చేస్తున్నట్టుంది కెమెరా పనితనం. ఛాయాగ్రాహకుడు జివీఎస్ రాజు దీని కర్త. ఒక వండర్ఫుల్ రంగుల ప్రపంచాన్ని సృష్టించాడు. ఇదొక ‘క్లోజప్ కథ’ అనుకుంటే, అంతే క్లోజ్ గా అది హృదయాలకి హత్తుకుపోయే ఎజెండా పెట్టుకున్నట్టు దృశ్యాల చిత్రీకరణ జరిపాడు. కేవలం సినిమాలో ‘విషయం’ మాత్రమే మార్కెట్ ఫ్రెండ్లీగా వుంటే చాలదు, దాని ప్రెజెంటేషన్ లోనూ ఆ మార్కెట్ స్పృహ కనపడాలనేది ఇక్కడ ఇలా షూట్ చేసి చూపించారు.

        కళ్యాణ్‌ కోడూరి  సంగీతం, పాటలు కూడా ఈ క్లోజప్ కథా మర్యాదని దాటి విశృంఖల విహారం చేయలేదు. చాలా మెలోడియస్ గా, స్మూత్ గా స్వరాలు కూర్చి సమన్వయం సాధించాడు. పబ్ లో మొదటి పాట ‘జైబోలో జవానీ మళ్ళీ రాదనీ...’ ఇందుకొక ఉదాహరణ. మాటలు రాసిన లక్ష్మీ భూపాలే అన్ని పాటలకీ మంచి సాహిత్యాన్ని అందించాడు. సున్నిత హాస్యంతో మాటలు చాలా ఉన్నతంగా వున్నాయి. మాటలు రాయడం వెనుక చాలా ఆలోచన జరిగినట్టు కన్పిస్తోంది. క్వాలిటీ రైటింగ్ మాత్రమే కాదు, ఇంటలిజెంట్ రైటింగ్ కి కూడా ముందూ వెనుకా చూడకుండా పట్టం గట్టారు.

        నందినీ రెడ్డి దర్శకత్వ విలువలూ చాలా డీప్ స్టడీ తో కూడుకుని కన్పిస్తాయి. ప్రతి ఫ్రేములోనూ ఆవిడ మేధస్సు కన్పిస్తుంది. స్క్రిప్టు దగ్గర్నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ఈ మాధ్యమం పై తనకి గల కమాండ్ మామూలుదేం కాదని ఇట్టే తెలిసిపోతుంది సినిమా చూస్తూంటే. అయితే తన కమాండ్ ని ఈ ఫ్రేములోనే వుంచి –జీవితాలకి దగ్గరగా వుండే ఇలాటి ఫోటో ఫ్రేమ్- క్లోజప్ కథలు తీస్తూంటే తనకో బ్రాండ్ నేమ్ వస్తుందనేది మాత్రం ఖాయం.


చివరికేమిటి? 

        పెళ్లి గురించి నేటి అర్బన్ యూత్ ఆలోచనలెలా ఉంటాయో వాళ్లెలాటి సాహసాలకి ఒడిగడతారో చాలా ఫన్నీగా, ఫ్రెష్ గా చూపించుకొచ్చారు. ఎంతవరకూ? ఇక ఈ అడ్వెంచర్ ని ఎలా కొలిక్కి తేవాలన్నంత వరకే. ఇంతవరకూ మ్యాచ్ ఫిక్సింగ్ తో పెళ్లి చేసుకున్న ఇద్దరూ వెంటనే విడాకులకి పెట్టుకోవడం సంచలనాత్మక ఆవిష్కరణ. విడాకులు మంజూరవడానికి ఆర్నెల్లు పడుతుంది. అంతకాలం సహజీవనం కాని సహజీవనం చేస్తున్నారు. అయితే పక్కలో బల్లెంలా ఈ ప్లాట్ డివైస్ గా పెట్టుకున్న విడాకుల అంశం పే ఆఫ్ అయ్యే సంగతి కూడా కథకురాలు దృష్టిలో పెట్టుకోవాలి. దాన్నే  ప్లే చేసి వాళ్ళ ఆటకట్టించే ప్రయత్నం చేయాలి. కానీ ఇంత  బలమైన ప్లాట్ డివైస్ ని డైల్యూట్ చేసేసి కథంతా అయిపోయాక ముందుకు తెచ్చారు. అక్కడ కథని ఇంకా పొడిగిస్తూ పొడిగిస్తూ పోవడానికే అది  ఉపయోగపడింది.

        ఓ యాభై నిమిషాల్లో విడాకులకి అప్లయి చేయడంతో ఇంటర్వెల్ వేసేసినప్పుడు, సెకండాఫ్ ఇంకో గంటకి మించదు అనుకుంటాం. కానీ గంటదాటిపోయి  గంటా నలభై ఏడు నిమిషాల వరకూ సాగుతుంది! మొత్తం ఈ సింపుల్ సినిమా స్టోరీ నిడివి రెండు గంటలా 37 నిమిషాలుంది!! 

        సెకండాఫ్ లో గంట గడుస్తోందనగా ఒకటొకటే వ్యాధి లక్షణాలు బయట పడుతూ వస్తాయీ కథలో. అది గర్ల్ ఫ్రెండ్ వైదేహి రాకతో దివ్యకి జెలసీ పుట్టడం ద్వారామొదలై, దివ్య ఊరెళ్ళి నప్పుడు శౌర్య ఆమె లేని లోటుని ఫీలవ్వడం దగ్గరికొచ్చినప్పుడు- ఓహో ఇంతా చేసి ఈ కథ వీళ్ళని కలపడానికి రొటీన్ ఫార్ములా బారిన పడుతోందన్న మాట అని భయపడతాం. ఇలా ఒక దశ కొచ్చేటప్పటికి ఫీలింగ్స్ తో బరువైన సన్నివేశాలు వచ్చి, హీరో హీరోయిన్లు కలిసిపోవడమే కదా రొటీన్ మూస ప్రేమకథల బాట? ఇదే ఇక్కడా జరుగుతోంది. 

        ఇక్కడితో ఆగకుండా ఇది మరింత నాటు వ్యవహారంలోకి తిరగబెట్టింది. అది విడాకుల విషయం పెద్దలకి తెలిసిపోవడంతో! ఇక ఇక్కడ్నించీ మొదలు కథంతా రచ్చ అవడం! పెళ్ళీ గిళ్ళీ సాంప్రదాయమూ  గొప్ప గొప్ప విలువలంటూ ఆ పెద్దల రొటీన్  లెక్చర్లు! వీళ్ళు తలలు వంచుకోవడం! మామ అల్లుడ్ని ఫెడీ మని బాదడం! విడాకులు మంజూరైపోతే, కూతురికి  మరో పెళ్లి చేసేయబోవడం!...హీరోగారు వెళ్లి ఓ ఆత్మహత్యా ప్రయత్నంలో ఇరుక్కోవడం! హీరోయిన్ పెళ్లి మానుకుని వచ్చేసి కాపాడుకోవడం...అంతా రచ్చరచ్చ! ఇదంతా దాదాపు యాభై నిమిషాలు టార్చర్! ఇదిగో... ఇక్కడ అయిపోతుందనుకుంటే,  ఇంకా ఇంకా సాగడం, సహనానికి పెద్ద పరీక్ష పెట్టడం. 

        దర్శకురాలు తన ఫిమేల్ వాయిస్ ని నొక్కేసుకుంటూ మేల్ డైరెక్టర్ గా యూటర్న్ తీసుకోవడం వల్ల ఈ సమస్య. ఇలాటి పాత చింతకాయ మూస ప్రేమ కథలు మేల్ డైరెక్టర్లే తీస్తారు. అంతవరకూ సమస్యకి ఫిమేల్ డైరెక్టర్ వెర్షన్ గా ఫ్రెష్ గా, పాత మూస ధోరణులకి దూరంగా, న్యూవ్ వేవ్ సబ్జెక్టుతో ట్రెండీ గా ఉంటూ వచ్చిన విషయం, తీరా పరిష్కరించే దగ్గర జానర్ మర్యాద తప్పి –మేల్ డైరెక్టర్ ని ఆవాహన చేసుకుని చివరికి ఆ సముద్రంలోనే కలిసిపోయింది! యూ టూ మేడమ్ నందినీ రెడ్డీ? అన్న షేక్స్ పియరిన్ షాక్ లో మనం! 

        యూత్ తమ సమస్యలకి తామే పరిష్కారాన్ని కనుక్కోలేరా? ఎంత క్యాజువల్ గా కామెడీగా పెళ్ళీ, ఆ తర్వాత విడాకుల పథకమేసుకున్నారో- అంతే క్యాజువల్ గా కలిసిపోయే చిలిపి ఆలోచన ఒకటి చేయలేరా? శౌర్య అన్న ఒక్కమాటతో అతడి అంతరంగం తెలుసుకుని గర్ల్ ఫ్రెండ్  వైదేహి అంత సింపుల్ గా బై చెప్పేసి వెళ్లి పోయిందే - అంత సింపుల్ గానూ  శౌర్యా దివ్యలు విడాకులతో వేసుకున్న తమ పథకం బెడిసికొట్టే పరిస్థితి వచ్చి- దీనికంటే మొగుడూ పెళ్ళాలు గా శోభనం చేసుకోవడమే  బెటర్రా బాబో అని మొత్తుకుని,పథకమేసినంత క్యాజువల్ గానూ, కామెడీగానూ  కలిసిపోయి ఆడియెన్స్ కి కిక్కివ్వలేరా? అలాటి క్రేజీ టర్నింగ్ పాయింటుని క్రియేట్ చేయకూడదా ఇంత చేసుకొచ్చిన దర్శకురాలు, ఇది పెద్దవాళ్ళతో  సంబంధం లేని రోమాంటిక్ కామెడీ అయినప్పుడు? 

        ఈ పెద్దలెవరు ఇంకా పాత లెక్చర్లిచ్చి సినిమాని నాశనం చేయడానికి. రొమాంటిక్ కామెడీలో వీళ్ళకేం పని మోరల్  పోలీసింగ్ చేయడానికి.  యూత్ వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ విలువలేవో వాళ్ళు కనుగొంటారు. ఆ విలువలతో ఇబ్బందులుంటే తప్పకుండా మార్చుకుంటారు. సినిమాగా కథలో చూపించాల్సింది స్వయంగా వాళ్ళు పరిణతి చెందిన విజయాన్నే. పెద్దలెవరో క్లాసు తీసుకుంటే తలలూపి లొంగిన  అపజయాలు కాదు. అప్పుడు ఏమీ నేర్చుకున్నట్టు కాదు. బేసిగ్గా సినిమా కథంటేనే ఇగోని స్వయం ప్రతిపత్తితో మెచ్యూర్డ్ ఇగోగా మార్చే దిశగా పాత్రని ప్రయాణింపజేయడం కాదా?


        ఈ సినిమా రచ్చ అవడానికి ముందు కొత్తదనంతో నీటుగా సాగుతున్న విషయాన్ని- పాత్రధారులూ, వాళ్ళ ప్రవర్తనలూ మాటలతో సహా- తల్లి పాత్రలతో కూడా కలిపి- పై తరగతి నుంచీ కింది తరగతుల వరకూ ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేశారో, రచ్చ రచ్చ అవడం మొదలవగానే అంత సైలెంట్ అయిపోయారు.




-సికిందర్ 
http://cinemabazaar.in