రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, ఫిబ్రవరి 2016, మంగళవారం

స్పెషల్ ఆర్టికల్




హైదరాబాద్ నగర ప్రధాన కూడళ్ళ లో మల్టీప్లెక్సులు ఉన్నత వర్గాలనే టార్గెట్ చేస్తూ వెలుస్తున్నాయి. ఇక్కడ టికెట్ రేట్లని బట్టే ఇది తెలుసుకోవచ్చు. పంజాగుట్ట, అమీర్ పేట, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్ లవంటి సంపన్న వర్గాలుండే  ఏరియాల్లో మల్టీప్లెక్స్ టికెట్ ధరలు రూ. 150 నుంచి 250 వరకూ వుంటాయి. సామాన్యులు ఇంతంత పెట్టి ఇక్కడ సినిమాలు చూడలేరు. అయితే వంద రూపాయల టికెట్ ధర సామాన్యులకి పెద్ద భారం కాదు.  నగర శివార్లలో మియాపూర్, కొంపల్లి, ఉప్పల్, ఎల్బీ  నగర్ ల వంటి ఏరియాల్లో వెలుస్తున్న మల్టీప్లెక్సుల్లో ఇందుకే టికెట్ ధర 100 రూపాయలకి మించి వుండడం లేదు. ఇక్కడ మధ్యతరగతి, ఇంకా కింది తరగతి ప్రజానీకాన్ని టార్గెట్ చేసి మల్టీప్లెక్సులు నిర్మిస్తున్నారు. 
థియేటర్లు విజయవంతంగా నడుసున్నాయి. ఇంతేకాక ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ కల్చర్ ఇతర పట్టణాలకి కూడా వ్యాపిస్తోంది. వరంగల్, విజయవాడ, వైజాగ్, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఈ రంగంలోకి కార్పొరేట్ సంస్థలైన  ఐనాక్స్, సినీ పొలిస్, క్యాపిటల్ సినిమాస్, బిగ్ సినిమాస్, పీవీఆర్ వంటివి మల్టీప్లెక్సుల్ని ప్రారంభించాయి.  విజయవాడ గాంధీ నగర్లో ఒకప్పుడు వున్న రంభ- ఊర్వశి- మేనక థియేటర్ల సముదాయం  ఐనాక్స్ మల్టీప్లెక్స్ గా అవతరించింది.

పోతే  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐమాక్స్  థియేటర్ల ని  కూడా రాష్ట్రానికి తీసుకు వస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరు- విజయవాడ మార్గం లో ఒకటి, తిరుపతి లో ఒకటి, వైజాగ్ లో మరొకటి ఐమాక్స్  థియేటర్ల కి స్థలాలు కేటాయించే పనిలో వున్నారు. ఇదేగాక రాష్ట్రంలోని  13 జిల్లాల్లో జోరుగా మల్టీ ప్లెక్సులు నిర్మించేందుకు ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందాయి.

ఈ ట్రెండ్ ఇలా ఉధృతం అవడాన్ని చూస్తే, ఇక జిల్లాల్లో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగై పోయే ప్రమాదం కన్పిస్తోంది. సింగిల్ స్క్రీన్  థియేటర్లతో నేటి యువతకి సెంటిమెంట్లు అంతగా ఉండకపోవచ్చు. వాళ్ళు మల్టీ ప్లెక్స్ తరంగా ఎదిగి వస్తూంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ కీ, ఇంకా వెనుకటి తరానికీ సింగిల్ స్క్రీన్ థియేటర్లతో జ్ఞాపకాలుంటాయి. అవి లాండ్ మార్క్ ప్రదేశాలు, పాపులర్ సెంటర్లు. చిన్నప్పట్నించీ వాటిలో సినిమాలు చూసిన అనుభవాల్నీ ఏనాటికీ  మర్చిపోలేరు. జీవితాల్లో ఒక భాగమైపోయి వుంటాయవి. 

ఇలాటి ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ని పదేళ్ళ క్రితం అన్యాయంగా కూలగొట్టేశారు. సికిందరాబాద్ కింగ్స్ వేలో ఒక లాండ్ మార్క్ ప్రదేశంగా వున్న సంగీత్ థియేటర్ని కూలగొట్టేస్తూంటే విలవిలలాడాయి ప్రాణాలు. వందలాది ఆ థియేటర్ అభిమానులు తాళలేక పత్రికలకి ఉత్తరాలు రాసి బాధని వ్యక్తం చేసుకున్నారు. ప్రతీ హిందీ సినిమాకీ, ప్రతీ ఇంగ్లీష్  సినిమాకీ ఆ థియేటర్ కి బుక్కయి పోయే అభిమానులు దాంతో జీవితకాల బాంధవ్యాన్ని పెంచుకున్నారు. అందులో సినిమా చూడకపోతే పిచ్చెక్కిపోవడమే. అలాటి థియేటర్ని కూలగొట్టి అన్యాయం చేశారు. చేయడమేగాక తామూ అన్యాయమైపోయారు యజమానులు. థియేటర్ని కూలగొట్టి పదేళ్ళ  క్రితం సింగపూర్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రారంభించిన  మల్టీప్లెక్స్  - కం - మాల్ వెంచర్ నిర్మాణం ఆగిపోయి మొండి గోడలతో ఇప్పటికీ వెక్కరిస్తోంది! ఈ వెంచర్  జోలికి వెళ్ళకుండా ఉండుంటే  ‘సంగీత్’ ఇంకా తియ్యటి స్వరాలు మీటుతూ వుండేదికదా అభిమానుల హృదయాల్లో?

మల్టీప్లెక్సుల హవాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆధునీకీకరణ చెందడం అత్యవసరమే. తక్షణం యాజమాన్యాలు మేల్కోకపోతే మల్టీప్లెక్సుల పోటీలో శాశ్వతంగా మూతబడిపోవడమే. ఒక్కో  సింగిల్ స్క్రీన్ థియేటర్ మూతబడి పోవడమంటే బాధాకరంగా అపురూపమైన ఒక్కో 70 ఎంఎం స్క్రీన్ కనుమరుగవడమే. హైదరాబాద్ ఆబిడ్స్ సెంటర్లో లాండ్ మార్క్  రామకృష్ణ జంట థియేటర్లలోని 35 ఎం ఎం థియేటర్ని బాలీవుడ్ నిర్మాత సుభాష్ ఘాయ్ ప్రారంభించిన ముక్తా సినిమాస్ సంస్థ  లీజుకి తీసుకుని, వెండితెర సైజుని అలాగే వుంచి మల్టీప్లెక్స్ లెవెల్ లో ఆధునీకీకరించింది. సీటింగ్, సౌండ్, ప్రొజెక్షన్ ఇప్పుడు మల్టీప్లెక్స్ లని తలదన్నేలా వున్నాయి. స్క్రీన్బు మల్టీప్లెక్స్కిం కంటే పెద్దది. బుకింగ్  కౌంటర్స్ దగర్నుంచీ ప్రతీదీ మల్టీప్లెక్స్ ని గుర్తుకు తెచ్చేలా వున్నాయి. కానీ టికెట్ ధరలు మాత్రం పాత ధరలపై  స్వల్ప పెంపుదలతో రూ 80, 70, 30 లు మాత్రంగానే  వుంచారు!  ఇక మళ్ళీ ఒకప్పటి ధనిక, పేద వర్గాలు ఎగబడుతున్నారు ఈ థియేటర్లో సినిమాలు చూసేందుకు!

సినిమాలు ఎలావున్నా అవి ఆడాలంటే థియేటర్ల స్థితి గతులు కూడా బావుండాలి. ఇందుకే ఒకప్పుడు సినిమాలకి దూరమైన ప్రేక్షకులని అత్యాధునిక మల్టీప్లెక్సు లొచ్చేసి  పెద్ద స్థాయిలో మళ్ళీ సినిమాలవైపు ఆకర్షించగలుగుతున్నాయి ప్రేక్షకుల్ని.

సినిమా చూసే అనుభవానికి సింగిల్ స్క్రీన్ థియేటర్ని మించింది లేదు. సింగిల్ స్క్రీన్  థియేటర్లో సినిమా చూస్తే వచ్చే మజా మల్టీ ప్లెక్స్ లో ఎప్పుడూ రాదు. మల్టీ ప్లెక్స్ ఒక అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ లాంటిది. ఫ్లాట్స్ లో ఎవరిలోకంలో వాళ్ళు డిటాచ్డ్ గా జీవిస్తూంటారు మనుషులు. ఇలాటిదే మల్టీప్లెక్స్ లో సినిమా చూసే  వ్యవహారం. ఆధునిక జీవనశైలికి అలవాటుపడ్డ ప్రేక్షకులు ఇక్కడ రిజర్వుడుగా కన్పిస్తారు. సినిమాల్ని విరగబడి ఎంజాయ్ చేయరు. కనీసం గట్టిగా నవ్వలేరు. తమలో తాము ముసిముసిగా నవ్వుకుంటారు. బిగుసుకుపోయి మొక్కుబడిగా చూసినట్టు సినిమా చూసి వెళ్ళిపోతారు ఎవరికివాళ్ళు.  

సింగిల్ స్క్రీన్ థియేటర్ ఒకపెద్ద కాలనీ లాంటిది. అందరూ పలకరించుకుంటూ   తిరిగే సోషల్ గేథరింగ్ లాంటిది. ఇక్కడ నానాజాతి ప్రేక్షకులు వుంటారు. తాహతుని బట్టి పది రూపాయల టికెట్ కూలీ వాళ్ళ నుంచీ, 30 రూపాయల టికెట్ ఇంకాస్త మెరుగ్గా బతుకుతున్న వాళ్ళ దగ్గర్నుంచీ, 50 రూపాయల టికెట్ మధ్యతరగతి మందహాసుల దగ్గర్నుంచీ, 70 రూపాయల టికెట్ బాగా బతికే వాళ్ళ వరకూ నానాజాతి సమితితో మొత్తం ఇండియా అంతా ఇక్కడ హాజరవుతుంది. క్లాస్ - మిడిల్ క్లాస్ - మాస్! ఈ వెరైటీ థియేటర్ లకి ఇంకెక్కడ దొరుకుతుంది?

వీళ్ళందరూ ఏ భేషజాలూ లేకుండా, ఏ బింకాలకీ పోకుండా, తమ ఎమోషన్స్ ని పబ్లిక్ గా ప్రకటిస్తూ సినిమాల్ని ఎంజాయ్ చేస్తారు. చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు, పగలబడి గట్టిగా నవ్వేస్తారు -  విజయవాడ లాంటి చోట్లయితే సీన్లు ఏడ్చి నట్టుంటే నవ్వొచ్చే రన్నింగ్ కామెంటరీలు  కూడా ఇస్తూంటారు – రెచ్చిపోయే సీన్లకి పైకి కాగితం ముక్కల్ని విసురుతారు, డాన్సులు కూడా వేస్తారు. నానా హంగామా చేసి, థియేటర్ని పూర్తి స్థాయిలో వాడుకుని వదిలిపెడతారు.

విడుదలైన ఓ సినిమా వివిధ వర్గాల ప్రేక్షకుల్లోకి ఎలా వెళ్తోందో తెలుసుకోవాలంటే సింగిల్ స్క్రీన్  థియేటర్లని  మించింది లేదు. ఇక్కడంతా కలెక్టివ్ కాన్షస్ నెస్ వ్యాపించి వుంటుంది. సినిమాల్ని విశ్లేషించే వాళ్ళు ఇక్కడ కూర్చోకుండా,  హైటెక్ గా ఒక వర్గం రిజర్వుడు ప్రేక్షకుల మధ్య మల్టీప్లెక్సుల్లో కూర్చుని,  డిటాచ్డ్ గా సినిమాలు చూస్తూ, లాప్ టాప్ లో వెబ్సైట్ ఆఫీసుకి క్షణక్షణం అప్ డేట్స్ పంపించడం నిజమైన జర్నలిజం కానేకాదు. 

యువత మల్టీప్లెక్సు లవైపు మొగ్గడం సహజం. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వుండే పెద్ద సైజు వెండి తెరల మీద సినిమాల్ని చూసే అనుభవాన్ని వీళ్ళు పూర్తిగా కోల్పోతున్నారు. పెద్దసైజులో 70 ఎంఎం స్క్రీన్ లు  సింగిల్ స్క్రీన్ థియేటర్ లలోనే వుంటాయి. మల్టీ ప్లెక్సుల్లో 35 ఎంఎం కంటే ఇంకా చిన్న సైజు స్క్రీన్లే వుంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు వెయ్యి సీట్లతో వుంటే, మల్టీ ప్లెక్సులు 250 – 400 సీట్లతో మాత్రమే వుంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల టికెట్ల ధరలు పెద్దనగరాల్లో సైతం రూ. 20 - 50 - 70 రేంజిలోనే ఎవరికైనా అందుబాటులో వుంటాయి. అసలు సినిమా అనే వినోదాన్ని వీలైనంత పెద్ద తెరల మీద చూడాలన్న కాన్సెప్టే సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణాలకి మూలం. అలాటిది తక్కువ స్థలంలో ఎక్కువ మినీ థియేటర్ లనే కాన్సెప్ట్ తో,  తెరల సైజుని తగ్గించేసి సినిమాల్ని ఆనందించమనడంలో అర్ధమే లేదు.

కానీ తాజా నివేదికల ప్రకారం  దేశంలో మల్టీప్లెక్సులు పట్టణాల్లో కూడా కలుపుకుంటే ఏటా పది శాతం చొప్పున పెరుగుతున్నాయి. 2004- 2014 మద్య ఈ పెరుగుదల స్థిరంగా వుంది. 2008-09 లో ఆర్ధిక మాంద్యం వెంటాడినప్పటికీ. పీవీఆర్ సంస్థ భారీ ఎత్తున ఇంకా నగర- పట్టణ ప్రాంతాల్లోకి మల్టీప్లెక్సులతో చొచ్చుకు పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  

కాబట్టి ఈ వేగంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగైపోతే సినిమా నిర్మాణాల్లో జరుగుతున్న వినూత్న ఆవిష్కరణలకి తగిన విశాల ప్రదర్శన శాలలే లేకుండా పోతాయి. వాటిని కూడా మల్టీ ప్లెక్స్ చిన్న తెరలపైనే చూసి సరిపెట్టుకోవాలి. వర్చువల్ రియాలిటీ సినిమా అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. కానీ  70 ఎం ఎం తెరలే లేకపోతే ఇలాటి కాన్సెప్టు లకి అన్యాయమే జరుగుతుంది. ప్రేక్షకులు కూడా వాళ్లకి అందాల్సిన పూర్తి ఆనందాన్ని పొందలేకపోతారు.


మల్టీ ప్లెక్సులకి దీటుగా పైన చెప్పుకున్న రామకృష్ణ 35 ఎంఎం థియేటర్ శైలిలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ని  రెండు రాష్ట్రాల్లో ఆధునీకీకరించుకోవడానికి ప్రభుత్వాలే యాజమాన్యాల వెన్నుతట్టి తగిన ఆర్ధిక వనరులు సమకూర్చాలి. సింగిల్ స్క్రీన్ థియేటర్లని చచ్చిపోనివ్వకూడదు. ఉత్తరాది కార్పొరేట్  సంస్థలు ఇక్కడి సింగిల్ స్క్రీన్  థియేటర్లని  దెబ్బ తీసి, మల్టీ ప్లెక్సులు కట్టుకుని వ్యాపారాలు చేసుకుంటూ  లాభాలు తరలించుకు పోతూంటే పోనివ్వొచ్చు, దీన్నాపలేరు గనుక. అయితే ఇదే సమయంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ లకి పునర్జన్మని ప్రసాదించడానికి ఏం చెయ్యాలో ప్రభుత్వాలు అది చెయ్యకపోతే- ఇవి కనుమరుగైపోవడానికి ప్రభుత్వాలే కారణమౌతాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ లని కనుమరుగు చేసుకోవడమంటే, సినిమా కళని కుదించి, 'బాహుబలి', 'బాజీరావ్ మస్తానీ' లాంటి మెగా సినిమాల వైభవాల్ని కూడా బెత్తెడు స్క్రీన్ల మీద చూసుకోండి పోండని తరిమికొట్టడమే. 

-      -సికిందర్ 
http://www.filmyfreak.com






స్క్రీన్ ప్లే సంగతులు!







‘అన్యాయాలకి గురయ్యే వాళ్లకి న్యాయం చేయాలన్న ఒకే  ఆశయం గల  పాత్ర స్వభావాన్ని  తప్ప ఆ టీవీ షో ( ‘ఈక్వలైజర్’  టైటిల్ తో 1980 లలో ప్రసారమైన టీవీ సిరీస్) నుంచి మేం ఇంకేమీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. ఈ పాత్రని కూడా ఎలా మల్చాలా అని ఆలోచిస్తున్నప్పుడు, అనుకోకుండా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ లో ఒక ఆర్టికల్ చూశాను : 2007 -2008 లలో నిర్వహించిన ఒక పోలింగ్ కి సంబంధించిన ఆర్టికల్ అది. జీవితం సుఖవంతంగా ఉండాలంటే అమెరికన్లు ఏం కోరుకుంటారనే దానిపై నిర్వహించిన పోలింగ్ అది. సంపద కంటే, ఆరోగ్యం కంటే కూడా, జీవితం సుఖవంతంగా ఉండాలంటే, అన్నిటా న్యాయం లభించాలని ఎక్కువగా కోరుకున్నారు అమెరికన్లు ఆ పోలింగ్ లో. దీన్నుంచి ఐడియాని డెవలప్  చేశాను. న్యాయం లభించక  ఆల్లాడే వారిని, లేదా అన్యాయానికి గురవుతున్న వాళ్ళని కాపాడే ఆపద్భాందవుడి పాత్ర అలా క్రియేట్ అయ్యింది. ఇది పాత ఫార్ములా పాత్రే సందేహంలేదు, కానీ దీనికో గతాన్ని కూడా ఇవ్వడం వల్ల ఆసక్తికరంగా తయారయ్యింది...’  
    
          మిటా గతం? 1995 లో  రజనీకాంత్ ‘బాషా’ దగ్గర్నుంచీ కంటిన్యూ చేస్తున్న
తప్పనిసరి ఫ్లాష్ బ్యాక్ తో గతమేదో చెప్పడం లాంటిదేనా?  కాదు-  ఆ మాట కొస్తే హీరో కి ఇతమిత్ధంగా ఓ ఫ్లాష్ బ్యాక్ అంటూ ఇవ్వలేదనీ, అతగాడి గతాన్ని చూచాయగా చెప్పేసి వదిలేశామనీ చెప్పుకొచ్చాడు పై వివరణ ఇంచ్చిన రచయిత రిచర్డ్ వెంక్.

         2014 లో విడుదలైన డెంజిల్ వాషింగ్టన్ యాక్షన్  థ్రిల్లర్ ‘ఈక్వలైజర్’ రచయిత ఇతను. 60 ఏళ్ల ఈయన ‘ఈక్వలైజర్’ తో బాటు, ‘ఎక్స్ పెండబుల్స్- 1, 2’ ; ‘మెకానిక్’ వంటి ఏడు సినిమాలు రాశాడు. ఇప్పుడు ‘ఈక్వలైజర్ -2’, ‘జాక్ రీచర్ : నెవర్ గో బ్యాక్’, ‘మ్యాగ్నిఫిషెంట్ సెవెన్’ అనే మూడు సినిమాలు రాస్తున్నాడు. ఈయన స్క్రిప్టులు చదివితే యాక్షన్, డైలాగ్స్ షార్ప్ గా వుంటాయి.

‘ఈక్వలైజర్’ లోంచే ఫస్టాఫ్ కోసం కథని, పాత్రని సంగ్రహించి  తెలుగులో ‘బాషా’ మోడల్ ‘డిక్టేటర్’ గా రాశారు – తెలుగు సినిమా కథల కోసం విదేశీ సినిమాల వైపు బాగా చూసే కోన- మోహన్ రైటర్ల జంట. అసలు విదేశీ సినిమాల్ని కథలు కాపీ కొట్టడం కోసం కాకుండా, వాటి కథన రీతుల కోసం, ఆ టెక్నిక్స్ కోసం చూస్తే రైటర్స్ గా ఎంత బాగా ఎదగొచ్చు!

పై  హాలీవుడ్ రచయిత టీవీ సిరీస్ ని ఆధారం చేసుకున్న పాత్రని, నేటి ప్రేక్షకుల  మనోభావాలతో కనెక్ట్ చేయడం కోసం వర్తమాన అమెరికన్ సమాజంలోకి తొంగి చూసి, వాళ్ళేం కోరుకుంటున్నారో ఆ ప్రకారం పాత్రని, కథని తయారు చేశాడు.  తెలుగులో ఈ పరిశీలన పక్కన పెట్టి, బాలయ్య = బాషా బ్రాండ్ స్క్రీన్ ప్లే ఓన్లీ అని ఒక తరం క్రితం శంఖుస్థాపన చేసిన శిలాశాసనానికి శిరస్సు వంచి నమస్కరించక తప్పలేదు.

ఇంత మాత్రాన ‘ఈక్వలైజర్’ గొప్ప సినిమా అని కాదు, దీని బలహీనతలు పాత్రతో, కథతో దీనికున్నాయి.

అయితే దీని తలని తెచ్చి మొండెంగా మార్చడంతోనే ‘డిక్టేటర్’ ఒక వింత ఆకారాన్ని సంతరించుకుంది.

స్టోరీ డిక్టేషన్
     చందు అనే అతను అత్తారింట్లో ఉంటూ ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తూంటాడు. భార్య  కాత్యాయిని ఉద్యోగరీత్యా వేరే ఊళ్లోనే వుండాల్సి వచ్చిందని చెప్పి ఇక్కడి కొచ్చి సూపర్ మార్కెట్ లో పని చేస్తూంటాడు. తన పనేమిటో తనేమిటో తప్ప వేరే విషయాలు పట్టించుకోడు.  అప్పుడప్పుడు మావయ్యతో ఫోన్లో భార్యతో మాట్లాడిస్తూ ఉంటాడు. అయితే  ఆ మాట్లాడుతున్నది కూతురు కాత్యాయని అని మావయ్యకి తెలీదు. వేరే శృతి అనే అమ్మాయితో అలా మాట్లాడిస్తూంటాడు చందూ.
ఇలా వుండగా ఒక సినిమా ప్రయత్నాల్లో వున్న ఇందూ అనే అమ్మాయి పరిచయమవుతుంది చందూకి.  ఈమెని విక్కీ అనే వాడి గ్యాంగ్ వేధిస్తూంటుంది. ఈ డ్రగ్ మాఫియా ఓ ఎస్సైని  చంపడాన్ని ఈమె అన్న కళ్ళారా చూశాడు. వీళ్ళు చంపేస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇతడి ఆచూకీ కోసం బెదిరిస్తున్న గ్యాంగ్ ఓ రోజు ఈమెని కిడ్నాప్ చేసి హింసిస్తారు. దాంతో ఆ డెన్ కి చందూ వెళ్లి  మొత్తం గ్యాంగ్ అందర్నీ హతమార్చి ఆమెని విడిపిస్తాడు.

 ఈ చనిపోయిన గ్యాంగ్ లో ఢిల్లీ డ్రగ్ మాఫియా తమ్ముడితో బాటు, ఓ మంత్రి కొడుకు కూడా వుంటారు. దీంతో ఈ చంపిన వాడెవరో తెలుసుకుని మట్టు బెట్టాలని అటు పోలీసుల్నీ, ఇటు ముఠానీ పురమాయిస్తారు మంత్రీ, మాఫియా.

ఇలా వుండగా, సూపర్ మార్కెట్ లో  మేనేజర్ కూతురి పెళ్లాగి పోతూంటే చెప్పకుండా ఓ అయిదు లక్షలు రహస్యంగా తీసుకుంటాడు. ఇది బయటపడేసరికి ఆ నింద  తన మీదేసుకుని అరెస్టవుతాడు చందూ.  పోలీసు అధికారి ఈ చందూయే గ్యాంగ్ ని హతమార్చిన వాడని  మంత్రికీ, మఫియాకీ  సమాచారమందిస్తాడు. మరోవైపు ఇది ఛానెల్స్ లో కూడా వస్తుంది. ఆ  దృశ్యాలు చూసి ఢిల్లీ లో రాజశేఖర్ అనే అతను రియాక్ట్ అవుతాడు. వెంటనే బయల్దేరి వచ్చేసి పోలీసులూ గ్యాంగూ చందూని ఎన్ కౌంటర్ చేయకుండా కాపాడుకుంటాడు.

ఇప్పుడు చందూ  మరెవరో కాదనీ, ‘డిక్టేటర్’  గా ఢిల్లీ ఎక్స్ టార్షన్ ( బలవంతపు వసూళ్ల)  మాఫియా గుండెల్లో నిద్రపోయిన, ధర్మా గ్రూపాఫ్ కంపెనీస్ ఛైర్మన్ చంద్రశేఖర ధర్మాయేననీ వెల్లడిస్తాడు.

చంద్రశేఖర ధర్మా దేశ ఆర్ధిక వ్యవస్థనే శాసించే బిగ్ షాట్. ఎక్స్ టార్షన్ మాఫియా నుంచి బడా పారిశ్రామిక వేత్తలెందరికో రక్షణ. ఈ మాఫియాకి రాణి మహిమా రాయ్. ఈమెని ఢీకొంటాడు ధర్మా.

అక్కడే తన కంపెనీలోనే పని చేసి కాత్యాయినీతో ప్రేమలో పడతాడు. ఆమెని పెళ్లి చేసుకుంటాడు. మాఫియా మహిమారాయ్ ఒక మిల్లు మీద  కన్నేస్తుంది. ధర్మా ఆమెని అడ్డుకుంటాడు. ఇది పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది. ధర్మా కుటుంబ సభ్యులకి ప్రాణసంకటంగా మారుతుంది. పైగా భార్య కాత్యాయిని కూడా గాయపడుతుంది. ఇక ధర్మాతో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటారు కుటుంబ సభ్యులు. వీళ్ళందరి క్షేమం కోసం మహిమాతో యుద్ధాన్ని వదిలి ధర్మా దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ వెళ్ళడం హైదరాబాద్ లో అత్తారింటికే వెళ్లి, భార్య గురించి అబద్ధం చెప్పి,  అక్కడే సెటిలై సూపర్ మార్కెట్ లో పని చేస్తూంటాడు.

ఇదీ జరిగింది. ఇదయ్యాక ఇక అంతిమ పోరాటానికి తరలి వచ్చేస్తారు  మహిమా- మంత్రీ- మాఫియా...ఆ దుష్ట శిక్షణ చేసి సుఖాంతం చేస్తాడు ధర్మా.  ఢిల్లీ హాస్పిటల్లో కోలుకుంటున్న కాత్యాయినిని ఆమె  తల్లిదండ్రులు కలుసుకుంటారు.

2-1-3 సమస్య
         పై కథని  బాషా బ్రాండ్ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో చూపించారు. ఈ మోడ్ లో బాలకృష్ణ సినిమా కథలు 1999 లో  ‘సమరసింహా రెడ్డి’  దగ్గర్నుంచీ అదేపనిగా వస్తున్నాయి. యాక్షన్ హీరోగా ఆయన నటిస్తున్న సినిమా కథలకి ఇంతకంటే గత్యంతరం లేనట్టుంది. కానీ ఈ పద్ధతి ఎప్పుడో అరిగిపోయి  ప్రేక్షకులు తలలు బాదుకుంటున్నారు. తెలిసిపోయే  ఒకే పోతలో పోసినట్టుండే ఈ కథల శారీరక నిర్మాణం ఎలాంటిదంటే - తల నుంచి, కాళ్ళ నుంచి, మొండేన్ని నరికి వేరుచేస్తారు.  ముందుగా  ఈ మొండేన్ని చూపించుకుంటూ వస్తారు. ‘బాబూ నువ్విక్కడున్నావా?’ అన్న ఒకానొక గోల్డెన్ మూమెంట్ రాగానే, మొండెం కింద తల తెచ్చి అతికిస్తారు. తల ద్వారా ఆ బాబు ఎవరో ఐడెంటిఫై చేసి, బయోగ్రఫీ అంతా చెప్పి ముగించాక,  ఆ తల కింద కాళ్ళు తెచ్చి అతికించి, ఫైనల్ గా విలన్ని తన్నించి చావగొడతారు. ఇలా మొండెం - తల - కాళ్ళు అనే  డిసెక్షన్ చేసి ప్యాచ్ వేసే విధానాన్ని అమలుపరుస్తున్నారు.   

        ఇదే 2 - 1 - 3 నాన్ లీనియర్ స్ట్రక్చర్. అంటే  జంబ్లింగ్ చేసిన ఆదిమధ్యాంతాలు ‘మిడిల్- బిగినింగ్- ఎండ్’  అన్నమాట. మధ్యలో వచ్చే ‘బిగినింగ్’ అంతా ఫ్లాష్ బ్యాకే. అసలు ‘బాషా కంటే ముందు, 1984 లో ‘ఫస్ట్ బ్లడ్’ ఆధారంగా కోదండ రామిరెడ్డి – చిరంజీవిల  కోసం పరుచూరి బ్రదర్స్ రాసిన ‘ఖైదీ’ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఇదే. కానీ ఇదొక ట్రెండ్ కాలేదు. ’89 లో వచ్చిన ‘శివ’ తో వేరే ట్రెండ్ లో పడి బిజీ అయిపోయారు. ఇంకో ఐదేళ్ళ తర్వాత రజనీకాంత్ ‘బాషా’తో గానీ  బాగా ఇన్స్పైర్ కాలేదు మనవాళ్ళు.  

        హీరో ఎక్కడో చిన్నపనేదో చేసుకు బతుకుతోంటే,  ఒకానొక అమృత ఘడియలో ఒకరెవరో వచ్చి,  హీరోని గుర్తుపట్టి-  ‘బాబూ నువ్విక్కడున్నావా?’ అని ఆశ్చర్యపోవడం - దాంతో ఈ బాబు ఇక్కడెందుకున్నాడో తెలిపే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభం కావడం – అందులో విలన్ తో వైరం చూపించడం, ఫ్లాష్ బ్యాక్  అయిపోగానే మొదటికొచ్చి ఫైనల్ గా విలన్ పని బట్టడం...

        ఇలా ‘డిక్టేటర్’ సెట్ అయింది.  ఫస్టాఫ్ కథలో  హీరో సూపర్ మార్కెట్ లో పని చేయడం దగ్గర్నుంచీ మొదలు పెట్టి,  ఇంటర్వెల్లో అతను బిగ్ షాట్ అని రివీల్ చేయడం, ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి, బిగ్ షాట్ గా అతడి జీవితం, విలన్లతో సమస్య చూపించి, ఏ విధంగా అజ్ఞాతం లోకి వెళ్ళాడో చెప్పి, వర్తమానంలో కొచ్చి- తాజాగా అతడి మీద కత్తులు దూస్తున్న ప్రత్యర్ధుల్ని మట్టు బెట్టించి ముగించడం.

        ఈ విధానంలో ఇప్పుడింకా సస్పెన్స్, థ్రిల్ ఏమైనా ఉంటున్నాయా అంటే, ఏమీ వుండడం లేదు. అదంతా ఈ విధానం ప్రారంభమైన మొదట్లో ఫీలయ్యేవాళ్ళు ప్రేక్షకులు.  కానీ ఆశాజనకంగా ఈ కథ ఫస్టాఫ్ లో, సస్పెన్స్  థ్రిల్  రెండూ వున్నాయి. పాత్రకి క్యారక్టర్ ఆర్క్ కూడా ఏర్పాటయ్యింది. టైం అండ్ టెన్షన్ గ్రాప్ కూడా పైపైకి పోసాగింది. గమ్మత్తయిన విషయమేమిటంటే, క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్, సస్పన్స్, థ్రిల్ ఈ నాలుగూ హీరో పాల్పడే చర్యల్నే అల్లుకుని వుంటాయి. హీరో పాల్పడే చర్యల్లేకపోతే ఇవేవీ లేవు. ఇవిలేక కథనం కూడా లేదు. చర్యలే మొత్తం అన్నిటికీ మూలం. 

        ఈ కథ ఫస్టాఫ్ లో మొదట హీరో కిడ్నాపైన సెకండ్ హీరోయిన్ని విడిపించడం కోసం, ఒక సుడిగాలి సంఘటన సృష్టిస్తాడు. డెన్ కి వెళ్లి ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ లా తలుపు గొళ్ళెం పెట్టి, మొత్తం దుండగలందర్నీ హతమారుస్తాడు. కాస్సేపు మనం ‘బాషా’ మోడ్ ని  మర్చిపోయి,  ఇది స్ట్రెయిట్  నేరేషన్ లో 1-2-3 లాగా సాగుతున్న కథే  అనుకుని చూస్తూంటే, హీరో పాల్పడిన ఈ తీవ్ర చర్య ప్రజల్లో, పోలీసుల్లో సంచలనం సృష్టిస్తుంది. కానీ హీరోయే  చంపాడనీ ఎవరికీ  తెలీదు. కానీ ఒకమ్మాయికోసం హీరో ఇంత పనీ  చేయడంతో అతడి వ్యక్తిత్వ చాపం అంటే - క్యారక్టర్ ఆర్క్ అమాంతం ఊర్ధ్వ ముఖం పట్టింది. అదే సమయంలో తను  చంపిన వాళ్ళ బాసులు యాక్టివేట్ అవడంతో టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ – అంటే వెండితెర మీద నడుస్తున్న కథ కాలం గడుస్తున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ పోవడం- కూడా క్రియేటయ్యింది.  అటు బాసుల యాక్టివేషన్ కి కాంట్రాస్ట్ గా ఇటు  హీరో ఏమీ ఎరుగని వాడిలా మామూలుగా తన పని తానూ చేసుకోవడంతో ఇప్పుడేం  జరుగుతుందన్న సస్పెన్స్, థ్రిల్ మొదలయ్యాయి. ఇలా ఈ నాలుగు  ఎలిమెంట్సూ కేవలం హీరో డెన్ లో డెత్ సీన్ కి పాల్పడిన చర్యలోంచే పుట్టుకొచ్చాయి.

ప్లాట్ పాయింట్ వన్నే!  
      సింపుల్ గా  చెప్పాలంటే హీరో పాల్పడిన ఆ చర్య స్ట్రెయిట్ నేరేషన్ కథనాల్లో వచ్చే  ప్లాట్ పాయింట్ - 1 అనే మజిలీయే. ఇందుకే ఇందులో పైన చెప్పుకున్న  4 ఎలిమెంట్స్  వున్నాయి. ఈ సంఘటన కూడా స్ట్రెయిట్ నేరేషన్ కథనాల్లో బిగినింగ్ విభాగం ముగింపు కి తగ్గట్టు 18 వ సీన్లో వస్తుంది. ఇది మొదటి మూలస్థంభం. దీన్ని అల్లుకుని వుండే 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. గోల్ అనే మరో 4  ఎలిమెంట్స్ కూడా ఇందులో స్ట్రెయిట్ నేరేషన్ కథనాలకి తగ్గట్టే వున్నాయి : ‘కోరిక’ -  ఆపదలో వున్న వాళ్ళని ఆదుకునే గుణం, ‘పణం’ – 18 మంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ని  అంతమొందిచడం కోసం తన ప్రాణాల్నే పణంగా పెట్టడం, ‘పరిణామాల హెచ్చరిక’ – ఈ గ్యాంగ్ ని  చంపితే తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ రేపడం, ‘గోల్’ – పరిణామాలేవైనా ఒంటి చేత్తో చిత్తు చేయాలన్న కసి పుట్టడం.

        ఇదయ్యాక, సూపర్ మార్కెట్ లో మేనేజర్ ని కాపాడేందుకు ఆ నేరం తన మీదేసుకుని అరెస్టవడం కోరి తెరవెనుక విలన్ల చేతుల్లోకి వెళ్లి పోవడమే...దీంతో క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్  రేఖలు, సస్పన్స్, థ్రిల్ మరింత పెరిగి, దొరికిపోయిన తను ఎన్ కౌంటర్ అయిపోయే ఇంటర్వెల్ పాయింటుకి చేరింది కథ..

        ఇప్పుడేమిటి? ఈ పద్మ వ్యూహం లోంచి ఎలా బయట పడతాడు? అన్న ప్రశ్నలు మన ముందు నిల్చాయి.

        కాస్సేపు మనం ‘బాషా’ మోడ్ ని  మర్చిపోయి,  ఇది స్ట్రెయిట్  నేరేషన్ లో 1-2-3 లాగా సాగే కథే  అనుకుని  చూద్దామనుకున్నామా ఇందాకా?  కాస్సేపు అనుకోవడమేమిటి, పక్కగా ఇది స్ట్రెయిట్ నేరేషన్ కథే!  1-2-3 స్ట్రక్చర్ లో  నడుస్తున్న స్క్రీన్ ప్లేనే!  పైన చెప్పుకున్న ఎలిమెంట్స్, ప్లాట్ పాయింట్, దీని తర్వాత ప్రారంభమైన మిడిల్ విభాగం ..ఇంటర్వెల్ దగ్గర ఎన్ కౌంటర్ ప్లాన్ వరకూ ఈ కథా నిర్మాణమంతా దీన్నే  ధృవపరుస్తోంది- ఇది 2 - 1 - 3 తరహా కథ కాదనీ, చక్కగా స్ట్రెయిట్ నేరేషన్ కథనాలకి మల్లే  సాగుతున్న 1 - 2 - 3 కథే ననీ!

        ఇంత వరకూ మనం ఫస్టాఫ్ లో చూస్తూ వచ్చింది స్ట్రెయిట్ నేరేషన్ లో 18 వ సీను దగ్గర డెన్ లో కిల్లింగ్స్ తో ముగిసిన బిగినింగ్, ఆ తర్వాత ఇంటర్వెల్ వరకూ కొనసాగిన మిడిల్ విభాగపు మొదటి భాగమే తప్ప మరేం కాదు!  2 - 1 – 3 లో ఫస్టాఫ్ కథనం ఇలాటి బిజినెస్ తో వుండదు.

        బాషా బ్రాండ్ 2 - 1 - 3 తో వచ్చిన ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహా నాయుడు’, ‘ఇంద్ర’... ఇలా ఏది తీసుకున్నా  ఫస్టాఫ్ లో హీరో సాధారణ జీవితం గడుపుతూంటాడే తప్ప, 18 వ సీన్లోనో, 25వ సీన్లోనో ఆ నడుస్తున్న కథని మలుపు తిప్పే చర్యకి పాల్పడడు. ప్లాట్ పాయింట్ – 1 ని ఏర్పర్చడు.  

        ఇలా స్ట్రెయిట్ నేరేషన్ లో నడుస్తున్న కథ కాస్తా అకస్మాత్తుగా ఇంటర్వెల్ దగ్గర  ప్లేటు ఫిరాయిస్తుంది. ఏదో హడావిడి, బిల్డప్, ఢిల్లీ నుంచి హుటా హుటీన హీరో సోదరుడు రావడం, అరెస్టయి ఎన్ కౌంటర్  అవడానికి రెడీ అవుతున్న హీరో  మనం అనుకుంటున్న సాదాసీదా వ్యక్తి కాదనీ, ఫలానా డిక్టేటర్ గా ఢిల్లీ మాఫియాని గడగడ లాడించిన పెద్ద బిజినెస్ మాన్ అనీ రివీల్ చేయడం!  ఫస్టాఫ్ కథతో, 1 – 2 – 3 స్ట్రక్చర్ తో  ఏమాత్రం సంబంధం లేని బ్యాంగ్ ని తెచ్చి మోగించడం!

        ఫస్టాఫ్ ని పకడ్బందీగా ఉంచుతూ, ఆసక్తిని పెంచుతూ వచ్చిన స్ట్రక్చర్, ఎలిమెంట్స్ అన్నీ కొలాప్స్ అవడం! అంతకంతకూ  పెరుగుతూ పోయిన  ఫస్టాఫ్ ఉష్ణోగ్రత మైనస్ కి పడిపోయి, గడ్డ కట్టుకుని  ఫస్టాఫ్ అక్కడిక్కడే చలనం లేని ముద్ద అవడం!

        ఎందుకిలా జరిగింది? ఒక హాలీవుడ్ సినిమాని కాపీకొడితే స్ట్రక్చర్, దాంతో ఆకథకి మూలమైన భావమూ మారిపోతాయా? హాలీవుడ్ సినిమాలోని బిగినింగ్ విభాగం కాపీ కొడితే తెలుగులో మిడిల్ విభాగమై పోతుందా? హాలీవుడ్ సినిమాలోంచి తలని మాత్రమే తెచ్చుకుని  దాన్ని మొండెంగా చూపిస్తారా? తల మొండెం అయిపోతుందా? అవయవాల్ని  ఖండించే డాక్టర్లు తామేం చేస్తున్నామో అవగాహన లేకుండా ఆపరేషన్లు చేస్తారా?

       ఏ హీరోకి కథయినా ఆ హీరోని విలన్ ఇంట్లోకి ప్రవేశపెట్టి  ‘కన్ఫ్యూజ్’  కామెడీ చేయించే  ‘సింగిల్ విండో స్కీమ్’ అను  ఓకే స్క్రీన్ ప్లేలో  కూర్చినట్టు, ఏ హాలీవుడ్ కథైనా ‘బాలయ్య = బాషా బ్రాండ్ స్క్రీన్ ప్లే ఓన్లీ’  లోకి తెచ్చి పెట్టేస్టారా?

        తెలుగు సినిమాలకి  కథలకి రెండే అచ్చులున్నాయా- ఒకటి సింగిల్ విండో స్కీమ్, రెండు బాలయ్య = బాషా బ్రాండ్ స్క్రీన్ ప్లే ఓన్లీ ? ఏ కథనైనా  ఈ అచ్చుల్లో పడేసి తీస్తే వాటికవే తయారైపోతాయా? తెలుగు సినిమా కథా రచన  ఇంత శ్రమ లేని సుఖవంతమైన పనైపోయిందా!

ఈక్వలైజర్ ఈకలు
       హాలీవుడ్ ‘ఈక్వలైజర్’  ఈకలు మాత్రమే తెచ్చుకుని ‘డిక్టేటర్’ కిరీటాన్ని ఉత్సాహపడి అలంకరించారు. ‘ఈక్వలైజర్’ గుండె కాయని కోసి తెచ్చుకున్నా ఎవరూ పట్టుకునే వాళ్ళు కాదు. ఉన్నదంతా ఆ గుండె కాయలోనే వుంది. ఈ సినిమా దర్శకుడు ఆంటాయిన్ ఫుఖ్వా 16 సినిమాల దర్శకుడు. 2001 లో తను తీసిన ‘ట్రైనింగ్ డే’  లో నటించిన డెంజిల్ వాషింగ్టన్ ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డు నందుకున్నాడు. ఇదే వాషింగ్టన్ తో  2014 లో ‘ఈక్వలైజర్’  తీశాడు. మళ్ళీ వాషింగ్టన్ తోనే ప్రస్తుతం  ‘మ్యాగ్నిఫిషెంట్ సెవెన్’  అనే మల్టీ స్టారర్ తీస్తున్నాడు.

        ‘ఈక్వలైజర్’  లో హీరో పూర్వం ఇంటలిజెన్స్ కోవర్టుగా వున్నప్పుడు ఆ ఉద్యోగరీత్యా చేయరాని పాపాలు చేస్తాడు. దీనికి ప్రాయశ్చిత్తంగా రిటైరై ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేసుకుంటూ సామాన్య జీవితం గడుపుతూంటాడు. ఈ  సామాన్య జీవితాన్ని పరోపకారం కోసం వినియోగిస్తూంటాడు. అన్యాయానికి గురైన వాళ్లకి న్యాయం చేసి పెడుతూంటాడు. న్యాయ అన్యాయాల హెచ్చు తగ్గుల్ని సమం చేస్తాడు కాబట్టే అతను ఈక్వలైజర్.  భార్య ఎప్పుడో చనిపోయింది. చనిపోతున్నప్పుడు పాత జీవితాన్ని వదిలేస్తానని మాటిచ్చాడు. ఆమెకో కోరిక వుండేది. జీవితంలో చదివి తీరాల్సిన వంద పుస్తకాల్ని చదవాలని. ఆ కోరిక పూర్తిగా తీర్చుకోకుండానే చనిపోయింది. ఆమె కోరికని పూర్తి  చేయడం కోసమే  మిగిలిన పుస్తకాలు చదువుతూంటాడు. ఇలా మానసికంగా, శారీరకంగా అతడికి రెండు ఎమోషన్స్ వున్నాయి : మానసికంగా భార్య కోరిక పూర్తి  చేయాలన్న తాపత్రయం, శారీరకంగా ఆపన్నులని ఆదుకోవాలన్న తపన. ఇలా మెంటల్ గా, ఫిజికల్ గా అంతర్ బాహ్య రూపాలతో అతను సజీవ పాత్రలా అన్పిస్తాడు. ఉదాత్తమైన మెంటల్ యాక్షన్ – ఫిజికల్ యాక్షన్ లనే ఈ ద్వంద్వాలతో ఒక అర్ధవంతమైన జీవితానికి ప్రతీకలా ఉంటాడు. దీన్నే  ముందుగా హీరో పట్ల ప్రేక్షకులకి ఇష్టం పెరగడానికి చేసే పాత్ర చిత్రణ అంటారు.

    ఇలాటి హీరో సూపర్ మార్కెట్లో  వర్కర్లతో స్నేహంగా ఉంటాడు. ఒక ట్రైనీ సెక్యూరిటీ గార్డ్ పరీక్ష పాసవడానికి తోడ్పడతాడు. ఇంకా ఇలాటి గాంధీ గిరీలు కొన్ని చేస్తున్నాక, ఒకమ్మాయి పరిచయమవుతుంది. ఇలా బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయ కార్యక్రమం అనే మొదటి టూల్ ని, కథానేపధ్యం ఏర్పాటు అనే రెండో టూల్ నీ  ప్రయోగించాక; ఇక మూడవ టూల్ అయిన సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనగా, ఆ అమ్మాయి డ్రగ్ మాఫియా చేతిలో గాయపడుతుంది. దీన్నంది  పుచ్చుకుని  నాల్గవ టూల్ అయిన కథకి సమస్య – లేదా ప్లాట్ పాయింట్ -1 లేదా  మొదటి మూలస్థంభం  -  ఏర్పాటుకి హీరో వెళ్లి  ముందుగా మాఫియా గ్యాంగ్ తో బేరమాడి చూసి, విన్పించుకోకపోతే తన పూర్వ జీవితంలోని క్లోజ్ కంబాట్ టెక్నిక్ తో తన్నడం, చంపడం మొదలెడతాడు - ఆ అమ్మాయి పట్ల జరిగిన తీవ్ర అపచారం దృష్ట్యా.

        ఈ యాక్షన్ సీన్ క్లాసిక్ క్రియేషన్ గా నిలిచిపోతుంది. కథలో మొదటి మూలస్థంభాన్ని ఏర్పాటు చేసే ఘట్టాన్ని హాలీవుడ్ లో బలంగా రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే, కథకి ఇది ప్లాట్ పాయింట్- 1 గనుక, కథలో సాధించేందుకు ఏర్పాటు చేస్తున్న సమస్య ఇదేగనుక ప్రేక్షకుల మనసుల్లో బలంగా ముద్ర వేసేట్టు చూస్తారు. ఇదే జరిగిందిక్కడ. దీంతో మాస్కోలో మాఫియా బాస్ రియాక్టయి ఈ చంపిన వాడెవడో తెలుసుకుని  చంపెయ్య మని అనుచరుణ్ణి పంపుతాడు. ఇక్కడ్నించీ మిడిల్ విభగంలో పడుతుంది కథ. హీరో తిరిగి తన మామూలు జీవితంలో కొచ్చేస్తాడు. మామూళ్ళ కోసం వేధిస్తున్న ఓ పోలీసుని శిక్షిస్తాడు. మఫియాకి తానెవరో తెలిసిపోతాడు. వాళ్ళ నుంచి తప్పించుకుంటూ సమాజసేవ చేస్తూనే ఉంటాడు. ఇంకో దుష్ట పోలీసు అధికారి ప్రాణం తీస్తాడు. ఇలా సాగిపోతూంటుంది కథనం... అమాయకుల్ని రక్షిస్తూనే మాస్కో వెళ్లి మాఫియాని అంతమొందిస్తాడు.

      ఈ క్యారక్టర్ గతాన్ని చెప్పడం కోసం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళలేదు. పొడిపొడి మాటల్లో అతడిచేతే చెప్పిస్తారు. దీనివల్ల ఓ వెలితి వెన్నాడుతూంటుంది మనల్ని. గతంలో ఉద్యోగ రీత్యా అతను చేసిన పాపాలేమిటో  దృశ్య రూపంలో ప్రత్యక్షంగా చూపించి వుంటే,  ఇప్పుడు అతను  చేసుకుంటున్న ప్రాయశ్చిత్తానికి మనకి ఎనలేని సానుభూతి కలిగే అవకాశం .కానీ ఈ పాత్ర గురించి ఏమీ చెప్పకూడదని నిర్ణయించామని రచయిత రిచర్డ్ వెంక్ వింతగా చెప్పాడు. ఇది టిపికల్ యాక్టర్ మూవీ కాదనీ, అతను సూపర్ హీరో కూడా కాదనీ, కానీ  ఏది తప్పో ఏది ఒప్పో అంతరాత్మకి తెలిసిన వాడనీ చెప్పుకొచ్చాడు. ఇది ఎంత వరకు కరెక్టో గానీ,  గతంలో 2005 లో రాం గోపాల్ వర్మ నిర్మించిన ‘జేమ్స్’ అనే యాక్షన్ సినిమాలో కూడా హీరో ఎవరో, ఎక్కడ్నించీ వచ్చాడో, ఏమీ చెప్పకుండా నానా యాక్షన్ హంగామా చేయించారు. ఈ అట్ట ముక్క పాత్ర చూళ్లేక మొహం చాటేశారు ప్రేక్షకులు.

        పోతే, ‘ఈక్వలైజర్’  మిడిల్ ఒక దశ దాటాక డొల్లగా మారడమూ జరుగుతుంది. సాగుతున్న కొద్దీ కథ విస్తరించకుండా, కొత్త విషయాలు బయటపడకుండా,  అదే హీరో- మాఫియా ఫ్లాట్ యాక్షన్ గా వెళ్లి ముగుస్తుంది.

        ఇలా 1 - 2 -3 స్ట్రక్చర్ లో వున్న ‘ఈక్వలైజర్’ కథని,  ‘డిక్టేటర్’ లో 2 - 1 - 3 కి  తీసుకుంటున్నప్పుడు,  ‘ఈక్వలైజర్’  లోని  1 ని ( బిగినింగ్ ని) మాత్రమే తీసుకుని, ‘డిక్టేటర్’ లో 2 గా ( మిడిల్ గా )  పెట్టేసుకున్నారు! తలకాయని తెచ్చి మొండెం స్థానంలో పెట్టేశారు!!

        బిగినింగ్ ని  తెచ్చి మిడిల్ స్థానంలో పెట్టేస్తే, మరి మిడిల్ ఏమయినట్టు? ఏమీ కాలేదు. అదే బిగినింగ్, అదే మిడిల్ అనుకోవాలి మనం.  చాలా కన్ఫ్యూజన్ గా వుంది కదూ- అసలేం జరిగిందా అని కనిపెట్టడానికీ, ఆ కనిపెట్టిన కనీవినీ ఎరుగని ఈ మహా కొత్త గందరగోళాన్ని ఒక దారిలో పెట్టి రాసుకు రావడానికీ కొన్ని రోజులు పట్టింది! సంక్రాంతికి మొదలెడితే శివరాత్రి వచ్చేట్టుంది. బాలయ్య దెబ్బ అంటే మాటలా! జీవితంలో ఇక తెలుగు సినిమాల జోలికి పోకూడ దన్నట్టు తయారయ్యింది.

    మళ్ళీ మొదటి కొద్దాం. కాస్సేపు మనం ‘బాషా’ మోడ్ ని  మర్చిపోయి,  ఇది స్ట్రెయిట్  నేరేషన్ లో 1-2-3 లాగా సాగుతున్న కథే  అనుకుని  చూద్దాం అనుకున్నాం కదా పైన? అలాగే చూద్దాం. అప్పుడు ‘ఈక్వలైజర్’ పాత్ర టీవీ సిరీస్ నుంచి వచ్చినా, కాలానికి తగ్గట్టు దాన్ని నవీకరిస్తూ, వోటింగ్ లో న్యాయం పట్ల అమెరికన్ ప్రజానీకం వెలిబుచ్చిన  మనోభావాలని - సామాజిక డిమాండ్ ని తీర్చే కథా నాయకుడుగా ఒక పరిశీలనతో హీరో పాత్ర వెలసింది. డిక్టేటర్ లో ఈ సామాజిక స్పృహతో కూడిన మూలాలు లేనందుకు కూడా క్షమిచేద్దాం. తెలుగు సినిమా కథలు సమాజంలోంచి రాకుండా, ఇతర విదేశీ సినిమాల్లోంచి రావాలి కాబట్టి, మూలకణాలు తీసేసిన  ఫారిన్ పాత్రగానే ‘డిక్టేటర్’ ని చూద్దాం. ‘ఈక్వలైజర్’  పాత్రచిత్రణలో హీరో పుస్తక పఠనానికి ఒక నేపధ్యం వుంది. ‘డిక్టేటర్’ లో ఈ అలవాటు దేనికున్నట్టో... దీన్ని కూడా ఉపేక్షిద్దాం. ‘ఈక్వలైజర్’ పాత్ర దాని గత జీవితంలో పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పరోపకారం చేస్తున్న కోణం కూడా ‘డిక్టేటర్’ లో లేకపోయినా  ఓకే అనుకుందాం. పరోపకారం చేయడానికీ, మానవత్వం చూపడానికీ కారణాలు వెతుక్కోనవసరం లేదు- అది మనిషి సహజాతం.  

        ఇలా 1 – 2 – 3 స్ట్రెయిట్  నేరేషన్ లో హీరో పాత్ర స్వతంత్రంగా ఎస్టాబ్లిష్ అయి, గోల్ ఏర్పడి, స్వతంత్ర కథగా సాగుతున్నప్పుడు,  ఇంటర్వెల్లో పాలలో కుంకుడు రసం పోసి విరిచేసినట్టు- ఇతను ఇతను కాదూ, ఇతను వేటే, ఇనద్తికి వేరే కథ వుండీ...అన్య్యడంతో ఇంతవరకూ చూపించిన స్వతర కథ ఆటో మేటిగ్గా రద్దయిపోయింది. రసభంగంతో వేరే కథ ఎత్తుకున్నట్టయింది ఇంటర్వెల్ నుంచీ..ఇది సెకండాఫ్ సిండ్రోం. ఫస్టాఫ్ ఒక కథ- సెకండాఫ్ ఇంకో కథ అనే సమస్య తో మధ్యకి ఫ్రాక్చరై ముక్కలైన  స్క్రీన్ ప్లే.  1-2-3 ని  బలవంతంగా 2 - 1 – 3 లోకి ఇరికించాలని చూసే ప్రయత్నం. అసలు ఫస్టాఫ్ 1-2-3 గా సెట్ చేశామని తెలీకపోవడం వల్ల ఈ గందరగోళం.

        ఇదంతా ఎవరిక్కావాలి, సినిమా హిట్టయ్యిం దనొచ్చు. కానీ ఇలా తలని మొండెం గా చూపించి తీయడానికి- రాయడానికీ -  బిగ్ నేమ్సే  అవసరం లేదన్నది ఇక్కడ పాయింటు. ఓ పాతిక వేలు రాయడానికిచ్చి, ఇంకో లక్ష తీయడానికిస్తే,  లోకల్ టాలెంట్స్  ఎందరో వున్నారు టాలీవుడ్ లో. ఇది చేదు నిజం. భారీ మొత్తాలు కాదు ప్రధానం, బిగ్ నేమ్స్ అన్నపుడు పేరు ప్రతిష్టల కోసమైనా, కొన్నాళ్ళు కెరీర్ నిలవడం కోసమైనా  అడ్డగోలు తనం మానుకోవాలిగా.

అప్పుడేం చేయాలి

     ‘క్వలైజర్’ లోంచి తీసుకున్న బిగినింగ్ విభాగాన్ని ‘డిక్టేటర్’  లో బిగినింగ్ విభాగం గానే పెట్టుకోవాలి. అంటే ఫ్లాష్ బ్యాక్ గా పెట్టుకోవాలి. ‘డిక్టేటర్’ లో చూపించిన ఫ్లాష్ బ్యాక్ అంతా కథకి బిగినింగ్ విభాగం. ఫ్లాష్ బ్యాక్ లో బిగినింగ్, మళ్ళీ ఫస్టాఫ్ లోనూ బిగినింగ్ ఎలా వుంటాయి? బిగినింగ్ విభాగంలో జరిగే బిజినెస్, మిడిల్ విభాగంలో జరిగే బిజినెస్ వేర్వేరు అన్నది జనరల్ నాలెడ్జీయే. మిడిల్ విభాగమే  లేకుండా సినిమా అంతా  రెండు బిగినింగ్ విభాగాలే ఎలావుంటుంది ఎక్కడైనా?

        ఇందుకే ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన హీరో పాత్రకీ, ఫస్టాఫ్ లో చూపించిన హీరో పాత్రకీ పొంతన లేకుండా పోయింది. ఎలాగంటే,  ఫ్లాష్ బ్యాక్ లో గాయపడ్డ భార్యకి తను మారుతానని మాటిస్తాడు. కానీ ఈ నేపధ్యంలోంచి వచ్చిన వాణ్ణి ఫస్టాఫ్ కథనంలో చూస్తే,  గొడవల్లో తల దూరుస్తూంటాడు, మూకుమ్మడిగా గ్యాంగ్ నే చంపుతాడు...

‘ఈక్వలైజర్’ లో పాత జీవితాన్ని మానేస్తానని భార్యకి మాటిస్తాడు. ఆ ప్రకారమే కోవర్టుగా లేడు. సామాన్యుడిలా  బతుకుతూ కోవర్టుగా చేసిన పాపాలకి ఇప్పుడు  పాపుల్ని శిక్షిస్తున్నాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. ఇదీ మారడమంటే.

        అసలు ఇంత గందరగోళం ‘ఈక్వలైజర్’  ని కాపీ కొట్టి తీరాల్సిందేననీ తీర్మానించుకున్నప్పుడు, దాని మేకింగ్ వెనుక వున్న స్పిరిట్ ఏమిటి, రచయిత ఎక్కడ్నించి ఇన్స్పైర్ అయ్యాడు, ఏ భావజాలాన్ని ప్రజల్లోంచే తీసుకున్నాడు వగైరా సమాచారంతో కూడిన ఇంటర్వ్యూ లనీ, సినిమా  విడుదలయ్యాక వచ్చిన రకరకాల రివ్యూలనీ, ఇతర ముఖ్య సమాచారాన్నీ చదవడం పరమబోరు అనుకోకుండా చదివి, శిఖరాగ్ర సమావేశాలు జరుపుకుని వుంటే బావుండేది. సక్సెస్  కి షార్ట్ కట్స్ వుండవు కదా?  



-సికిందర్ 
http://www.cinemabazaar.in/

31, జనవరి 2016, ఆదివారం

క్లాసిక్!






రచన –దర్శకత్వం : సత్యజిత్ రే
తారాగణం : సుబీర్ బెనర్జీ, కానూ బెనర్జీ, ఉమా దాస్ గుప్తా, కరుణా బెనర్జీ, చునిబాలా దేవీ, తులసీ చక్రవర్తి తదితరులు
కథ : బిభూతీ భూషణ్ బందోపాధ్యాయ్ నవల ‘పథేర్ పాంచాలీ’ ఆధారం.
సంగీతం : పండిట్ రవిశంకర్, ఛాయాగ్రహణం : సుబ్రతా మిత్రా, కూర్పు : దులాల్ గుహ
నిర్మాణం : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
విడుదల : 26 ఆగస్టు 1955
***
   త్యజిత్ రే ని పరిచయం చేయడమంటే సూరుణ్ణి పరిచయం చేయడం లాంటిదే. ఈ లోకానికి  సూర్యుడెంతో, సమాంతర సినిమా జగత్తుకి సత్యజిత్ రే అంత. తమ ఆలోచనల కోసం, విధానాల కోసం, కళ కోసం సత్యజిత్ రే వైపు చూడని ప్రపంచ  సినిమా కళాకారులు లేరు. అంతగా ఆయన జాతీయ,  అంతర్జాతీయ చలన చిత్ర రంగాలని ప్రభావితం చేశారు. ఆయన ప్రారంభమయింది 1955 లోనే. అదీ ‘పథేర్ పాంచాలి’  అనే సమాంతర సినిమాతోనే. సమాంతర సినిమానే  వాస్తవిక సినిమా అనో, ఆర్ట్ సినిమా అనో అంటున్నాం. ‘పథేర్ పాంచాలి’  అంటే పాటల బాట అని అర్ధం. నిజంగానే ఆయన ఈ కళా సృష్టితో తనకూ, సినిమా లోకానికీ  ఒక పాటల  బాటనే  ఏర్పర్చారు. సినిమాని ప్రజల్లోకి శక్తివంతంగా తీసుకువెళ్ళా లంటే  అనుసరించాల్సిన బాటలెన్నింటినో ఆయనిందులో పొందుపరచారు. అది భావోద్వేగాల ప్రకటన కావొచ్చు, సంగీతం కావొచ్చు, ఛాయాగ్రహణం కావొచ్చు, నటనలూ కావొచ్చు. అమెరికాలో ఎనిమిదేళ్ళ వయసులో ఓ కుర్రాడు   ‘పథేర్ పాంచాలి’ ని  చూసి తీవ్రంగా కదిలిపోయాడు. అది అతణ్ణి సినిమా దర్శకుడు అయ్యేంతవరకూ వెంటాడింది. అలాటి  సత్యజిత్ రే ప్రభావంతో  ఆయన ‘టాక్సీ డ్రైవర్’ ‘రేజింగ్ బుల్’ , ‘డిపార్టెడ్’  వంటి అద్భుత చలన చిత్రాల్ని రూపొందించాడు. ఆయనే హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కార్సేస్...

    సత్యజిత్ ‘పథేర్ పాంచాలి’ నిర్మించాలకున్నప్పుడు  డబ్బు లేదు. ఎందరో నిర్మాతల్ని ప్రయత్నించారు. అదేం కథ అనేవాళ్ళు. ఇన్ని కష్టాలు చూపిస్తే ఎవరు చూస్తారనే వాళ్ళు. ఒక నిర్మాత ముందుకొచ్చి కొంత పెట్టుబడి బాగానే పెట్టినా, ఇంకేదో వ్యాపారంలో దివాలా తీశాడు. డబ్బందక  సినిమా ఆగిపోయింది. సత్యజిత్ భార్య నగలు అమ్మి మళ్ళీ షూటింగ్ చేశారు. ఆ డబ్బు కూడా అయిపోగానే మళ్ళీ షూటింగ్ ఆగిపోయింది. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి  బిధాన్ చంద్ర రాయ్ సినిమా ముగింపుని  సుఖాంతం చేయాల్సిందిగా కోరారు. సత్యజిత్  ఒప్పుకోలేదు. సీఏం చేసేదిలేక సరేనన్నారు. కానీ అప్పట్లో సినిమాలకి ప్రభుత్వం ఫైనాన్స్ చేసే విధానం లేదు. సత్యజిత్ కి రుణం ఇస్తే ఏ పద్దు కింద ఇవ్వాలో అర్ధం కాలేదు. చివరికి రోడ్లు భవనాల శాఖ ద్వారా రుణం  ఇప్పించారు. ఎందుకలా చేశారంటే,  సినిమా టైటిల్ లో ‘బాట’  అనే మాట వుంది. బాట అంటే రోడ్డే కదా? కాబట్టి ఇది రోడ్లకి సంబంధించిన సినిమాగా ఒక పద్దు సృష్టించి, ఆర్ అండ్ బీ శాఖ నుంచి డబ్బులు ఇప్పిస్తూ పోయారు!

పేదరికపు కోరలు 
   పశ్చిమ బెంగాల్లోని ఓ  కుగ్రామంలో నల్గురు సభ్యులున్న ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబపు కథ ఇది. హరిహర రాయ్ ( కానూ బెనర్జీ )  ఆ కుటుంబ పెద్ద.  పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూంటాడు. తనకి ఓ కల వుంటుంది. తనొక ప్రసిద్ధ రచయితనై పోవాలని. భార్య సర్బజయ ( కరుణా బెనర్జీ) భర్త ఇంటికి  తెచ్చే బొటాబొటీ సంపాదనతో అతి కష్టంగా కుటుంబాన్ని గడుపుకొస్తూంటుంది.  వీళ్ళకి దుర్గ అనే కూతురు, అపూర్వ అనే కొడుకు వుంటారు. ఇంకో బాగా వయసు ముదిరినావిడ రాయ్ బంధువొకామె వుంటుంది. పిల్లలు ఈవిణ్ణి ఆంటీ అని పిలుచుకుంటారు.

    సినిమా  ప్రారంభ దృశ్యాలో ఇరవై నిమిషాల పాటు, కొడుకు అపూర్వ అంటే అప్పూ పుట్టక ముందు రాయ్ కుటుంబ పరిచయం కొనసాగుతుంది. ప్రసిద్ధ రచయిత నవ్వాలన్న కోరిక రాయ్ వెలిబుచ్చడం, నీ సంపాదన ఇంటి ఖర్చులకే  చాలడం లేదని భార్య ఈసడించుకోవడం, ఎనిమిదేళ్ళ వయసున్న దుర్గ  తోటలో  పళ్ళు దొంగిలించుకు రావడం, ఆ తోటమాలి వచ్చి, పిల్లల్ని పెంచడం నీకు చేతగాదంటూ  దుర్గ తల్లిని దూషించడం వగైరా జరుగుతాయి.

    దొంగిలిచిన పళ్ళు తెచ్చి ముసలి ఆంటీ  కిస్తూంటుంది దుర్గ.  ఓ రోజు ఆ తోట యజమాని భార్య వచ్చి తన మెడలో హారం దుర్గా కొట్టేసిందని తగాదా పెట్టుకుంటుంది. దుర్గ తనకేం తెలీదని అంటుంది. ఇక అప్పూ పుట్టాక అక్కగా వాణ్ణి అల్లారు ముద్దుగా చూసుకుంటుంది దుర్గ. వాడు పెద్దవుతూంటే  ఇద్దరి మధ్యా ఆత్మీయతాను బంధాలు కూడా బలపడతాయి. చెట్ట పట్టాలేసుకుని గ్రామమంతా తిరిగొస్తారు. బయస్కోపులో బొమ్మలు చూసి ఆనందిస్తారు. ఓ చెట్టు కింద కూర్చుని ఆలోచనలో ఉండిపోతారు. జాతర కెళ్ళి అక్కడి ప్రదర్శనల్ని ఎంజాయ్ చేస్తారు. ప్రతీ సాయంత్రం ఎక్కడ్నించో  రైలు కూత విన్పిస్తూంటుంది. అలా కూత వేసుకు వెళ్ళే రైలుని ఒక్కసారైనా చూడాలన్పిస్తుంది. పరిగెత్తుకుని గ్రామం విడిచి చాలా దూరం వెళ్లి ఆ రైలు వస్తున్నప్పుడు చూసి ఆనందిస్తారు. తిరిగి ఇంటి కొచ్చి చూస్తే ఆంటీ చనిపోయి వుంటుంది. ఒక్కసారి విషాదం.

    ఇంకా కొన్ని పరిణామాలు  ఇంట్లో చోటు చేసుకుంటాయి. రాయ్ కుటుంబ ఆదాయం పెంచుకోవాలని  పౌరోహిత్యం మానేసి నగరానికి వెళ్ళిపోతాడు. అతనలా వెళ్లిపోవడంతో కుటుంబం మరిన్ని కష్టాల పాలవుతుంది. భార్య సర్బజయకి దిక్కు తోచదు. తినడానికి తిండి వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంతలో వర్షా కాలం వచ్చి కూతురు దుర్గ జబ్బున పడుతుంది. వైద్యానికి కూడా డబ్బులుండవు. ఆ  జ్వరం పెరిగిపోతూ ఓ రోజు హఠాన్మరణం చెందుతుంది.

      అక్క చనిపోవడంతో అప్పూ తల్లడిల్లిపోతాడు. ఒంటరి వాడైపోయినట్టు బాధ పడతాడు. హరిహర రాయ్ నగరం నుంచి సంతోషంగా తిరిగి వస్తాడు. నగరంలో తను సంపాదించిన డబ్బుతో ఏమేం కొన్నాడో చూపిస్తాడు గర్వంగా. ఏమనాలో తోచక దిక్కు చూస్తున్న సర్బజయ, అతడి కాళ్ళ మీద పై గట్టిగా ఏడ్పు లంకించుకుంటుంది. అప్పుడు గానీ అర్ధం గాదు అతడికి కూతురు చనిపోయిందని...

    ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతాడు. ఇక వూళ్ళో ఉండ బుద్ధి కాదు. ప్రయాణం కట్టిస్తాడు. అప్పూ సామాన్లు సర్దు తూంటే ఒక హారం దొరుకుతుంది. అది తోట యజమానురాలి దగ్గర అక్క కొట్టేసిందే. వెంటనే దాన్ని చెరువులోకి విసిరి పారేస్తాడు. రాయ్, సర్బజయ, అప్పూ ముగ్గురూ ఎడ్ల బండెక్కి భారంగా ప్రయాణం కడతారు.. జీవితాల మీద ఇంకేదో కొత్త తావులు  వెతుక్కుంటూ వెళతారు...

కాలదోషం పట్టని వాస్తవం 
    ఈ సత్యజిత్ అద్భుత సృష్టికి కాలదోషం పట్టలేదు. ఇది పాతబడి పోవడమంటూ వుండదు. ప్రపంచమున్నంత కాలం ఎక్కడైనా పేదరికం వుండేదే. అరవై ఏళ్ల క్రితం సత్యజిత్ దీన్ని సృష్టించినప్పుడు దేశంలో పేదరికం ఏ పరిస్థితుల్లో ఉండేదో ఇప్పుడూ అదే పరిస్థితుల్లో వుంది, అవే దృశ్యాలని మనకి చూపిస్తూ. పేదరికంలో మగ్గుతున్న మనుషులు నరకప్రాయమైన ఇలాటి నేపధ్యంలోనే ఇప్పటికీ బతుకుతున్నారు. ఏ కుల, మత, ప్రాంతాలూ దీనికి అతీతం కావు. ఇందుకే ఈ సర్వకాల సార్వజనీన శాశ్వత సత్యానికి ప్రపంచ దేశాలు ఉలిక్కి పడి కళ్ళు  తెరిచాయి. సత్యజిత్ కి నివాళులు అర్పించాయి. నిన్నగాక మొన్న, జనవరి 30 వ తేదీన లండన్ లోని ‘ఫిఫ్త్ ఎవెన్యూ సినిమా’ థియేటర్లో తాజాగా ప్రదర్శించడం మొదలెట్టారంటే ఈ కళా సృష్టి  ప్రశస్తి ఎంతో అవగతమవుతుంది.

        పేదరికం పగబట్టి వెంటాడినా  అందులోనే చిన్న చిన్నఆనందాల్ని వెతుక్కోవాలని, ఈ జీవన బాటని సంతోషాల పాటలా మల్చుకోవాలనీ  సందేశమిచ్చే ఈ చలన చిత్రం, ఒక కొత్త దర్శకుడిగా సత్యజిత్ రే కళాభినివేశానికి నిదర్శనం. పేదరికాన్ని హృదయ విదారకంగా చూపిస్తూనే, సాంకేతికంగానూ ప్రపంచ దర్శకులకి మార్గదర్శి అయ్యాడు. షాట్లు తీసే విధానంలో గానీ, భావోద్వేగాల్ని ప్రకటించే పద్ధతుల్లో గానీ కెమెరా మాన్  సుబ్రతా మిత్రా, సంగీత దర్శకుడు పండిట్ రవిశంకర్, ఎడిటర్ దులాల్ గుహల సహకారంతో సత్యజిత్ ఒక రీసెర్చి వనరులా దీన్ని అందించాడు.


      దారిద్ర్యంతో ఎక్కువ సంఘర్షణకి లోనయ్యేది స్త్రీలేనని ఈ కళాఖండం చూస్తే మనకి అర్ధమవుతుంది. భర్త ఏదో ఇంత సంపాదన తెచ్చి పడేసి తన బాధ్యత తీరినట్టు చేతులు  దులుపుకుంటాడు. పిల్లలు వాళ్ళ ఆటా పాటల్లో వాళ్ళుంటారు. ఇంట్లో ముసలివాళ్ళు నిస్సహాయంగా వుంటారు. ఆ గృహిణి చేతిలో వున్నఆ  అరకొర డబ్బుతో కడుపులు ఎలా నింపాలా అని దుఖాన్ని దిగమింగుకుంటూ తీవ్ర  మానసిక సంఘర్షణకి లోనవుతుంది. ఇంట్లో అందరికీ పెట్టి అర్ధాకలితో తనే వుంటుంది.   ఈ నరకం అనుభవిస్తున్న నిరుపేద గృహిణులకి చెరిగిపోని ఇమేజిలా సర్బజయ పాత్ర – ఆ పాత్రలో కరుణా బెనర్జీ మనల్ని వెంటాడుతారు. ప్రభుత్వాల్నీ వెంటాడుతారు, వెంటాడుతూనే వుంటారు...కసితో కాదు, కారుణ్యంతో. ఎంత పేదదైనా గృహిణి అన్నంపెట్టే కరుణామయే కదా...

-సికిందర్
http://www.filmyfreak.com






30, జనవరి 2016, శనివారం

వీకెండ్ కామెంట్

       ఏర్ లిఫ్ట్’ లిఫ్ట్ చేసిందెవర్ని? 
    నిజమే..’ఏర్ లిఫ్ట్’  సినిమా చూస్తున్నంత సేపూ కువైట్ సంక్షోభంలో భారత ప్రభుత్వపు ఉనికి కోసం అడుగడుగునా వెతుక్కోవాల్సి వస్తుంది...1990 లో కువైట్ మీద ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ దాడికి ఆజ్ఞాపించిన చారిత్రక ఘట్టంలో అక్కడ చిక్కుకుని అల్లల్లాడిన లక్షా డెబ్బై వేలమంది భారతీయుల్ని, సినిమా క్లయిమాక్స్ వరకూ  వాళ్ళ ఖర్మానికి వదిలేసి, భారత ప్రభుత్వం ఏం చేస్తోందా అన్న సందేహం మనల్ని పీడించక మానదు.

కేవలం దర్శకుడు రాజా కృష్ణ  మీనన్ సృష్టించిన  కల్పిత పాత్ర అయిన రంజిత్ కటియాల్ ( అక్షయ్  కుమార్ ) మొత్తం బాధ్యతనంతా తన భుజానేసుకుని, అక్కడ చిక్కుకున్న  భారతీయుల్నందర్నీ ఇండియాకి తరలించే బృహత్ ప్రణాళిక రచించినట్టు చూపించారు. చిట్ట చివర్లోనే  భారత ప్రభుత్వపు రెడ్ టేపిజం కొలిక్కివచ్చి విమానాల్ని పంపినట్టు చూపించారు. విదేశాంగ మంత్రిని చాలా సోమరి వ్యక్తిలా, కువైట్ సంక్షోభం కంటే ఇంకా చాలా ముఖ్యమైన పనులేవో పెట్టుకుని  ఫీలయ్యే  వ్యక్తిలా చూపించారు. ఈ శాఖ ఉన్నతాధికారి అయిన జాయింట్ సెక్రెటరీని  చూపించిన తీరైతే చాలా హాస్యాస్పదంగా వుంది. అతనొక పెద్ద హాల్లో ఎందరో ఉద్యోగుల సమూహంలో, ఫైళ్ళ గుట్టల మధ్య గుమస్తాలా లంచ్ బాక్సుతో, కప్పులో చాయ్ తో  పనిచేసుకుంటూ కూర్చుని ఉంటాడు. టేబుల్ మీద టెలిఫోన్ కూడా వుండదు. మంత్రిని కలవాలనుకుంటే చేతులు  కట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తాడు. ఇలాటి వెన్నో భారత ప్రభుత్వానికి సంబంధించిన చిత్రీకరణలు బ్యాడ్ టేస్టుతో వున్నాయి -  ఏర్ ఇండియా పైలట్స్  స్పందించిన తీరు సహా. నిజానికి కువైట్ సంక్షోభం ప్రారంభమైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పట్లో అధికారంలో వున్నది ప్రధాని విపి సింగ్ ప్రభుత్వం. అప్పటి విదేశాంగ మంత్రి ఐకె గుజ్రాల్. ఈయనే 1997 లో ప్రధానమంత్రి అయ్యారు.

        ఈ సినిమాలో తమ శాఖని ఇంత హీనంగా చూపించడాన్ని తీవ్ర  అవమానంగా భావించిన మాజీ రాయబారి ఒకరు, మాజీ విదేశాంగ శాఖాధికారులు కొందరూ,  ప్రస్తుత విదేశాంగ ప్రతినిధి సహా నిన్న శుక్రవారం ధ్వజమెత్తారు. అమెరికా మాజీ రాయబారి నిరుపమా రావ్ అయితే, ఈ సినిమాలో విదేశాంగ శాఖని చూపించిన తీరు ‘లాఫింగ్ గ్యాస్’ అని హాస్యమాడారు. ప్రస్తుత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్, అప్పట్లో తమ శాఖ క్రియాశీలంగా వ్యవహరించిందనీ, విదేశాల్లో వున్న భారతీయుల రక్షణకి తమ శాఖ మొదటి ప్రాధాన్య మిస్తుందనీ, ఈ సినిమాలో అనవసరంగా చాలా సృజనాత్మక స్వేచ్చ తీసుకున్నారనీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దౌత్యాధికారులు ఈ సినిమా వాస్తవాలకి దూరంగా వుందని విమర్శించారు.

        కువైట్  సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా తరలించడంలో కీలక పాత్ర పోషించిన రాయబారి కెపి ఫేబియన్, చాలా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. అప్పటి మంత్రి ఐకె గుజ్రాల్ నేతృత్వంలోని విదేశాంగ శాఖతో బాటు, ఏర్ ఇండియా, పౌరవిమానయాన శాఖా సమన్వయంతో పనిచేసి చరిత్రలో ఎన్నడూ చోటు చేసుకోని మహా ప్రజా సమూహ తరలింపు యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాయని  చెప్పుకొచ్చారు. టర్కీలో, జోర్డాన్ లో వున్న విదేశాంగ శాఖాధికారులు  కూడా అహర్నిశలు శ్రమించారని చెప్పారు.

        స్వయంగా విదేశాంగ మంత్రి ఐకె గుజ్రాల్ ఇరాక్ వెళ్లి సద్దాం హుస్సేన్ తో  చర్చించారనీ, ఫలితంగానే భారత్ తో సత్సంబంధాల్ని కొనసాగిస్తున్న సద్దాం,  టిప్పు సుల్తాన్ నౌక ని కువైట్ పంపించారనీ, విమనాల్లోనే కాకుండా ఆ నౌకలో కూడా భారతీయుల్ని తరలించామనీ వెల్లడించారు. ( సినిమాలో దీన్ని హీరో కష్టాల కోసం వక్రీకరించారు. హీరో బాగ్దాద్ వెళ్లి ఇరాక్ విదేశాంగ మంత్రి తారీక్ అజీజ్ ని కలిసి అభ్యర్ధించినట్టు చూపించడాన్ని మనం క్షమించగల్గినా; అజీజ్ నౌకని పంపడం, తీరా ప్రజలు ప్రయాణానికి తరలి వస్తున్నప్పుడు  ఆ నౌక రద్దయిందని ప్రకటించి  హీరో కష్టాలు  పెంచడమనే  సృజనాత్మక స్వేచ్ఛ సరైనదేనా - టిప్పు సుల్తాన్  కూడా ఇండియాకి కువైట్ భారతీయుల్ని మోసుకొచ్చినప్పుడు?).

        ఫేబియన్ ఇంకా చెప్పుకొస్తూ, కువైట్ మీద సద్దాం దాడిని ఖండించాల్సిందిగా  అమెరికా నుంచి ఎంత వొత్తిడి వచ్చినప్పటికీ విదేశాంగ శాఖ తలొగ్గలేదనీ.  కువైట్ లో చిక్కుకున్న భారతీయుల కోసం అమెరికా మాటనే పక్కన బెట్టామనీ, కానీ సినిమాలో భారతీయుల్ని తరలించడానికి విదేశాంగ శాఖ అయిష్టంగా వున్నట్టు చూపించారనీ, దర్శకుడు విదేశాంగ శాఖ ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేదనీ విమర్శించారు.

        దర్శకుడు రాజా కృష్ణ మీనన్ కొన్నేళ్ళ పాటు రీసెర్చి చేశామన్నారు. అయితే నిన్న  శుక్రవారం రాత్రే  ‘టైమ్స్ నౌ’ ఛానెల్ న్యూస్ అవర్ ప్రోగ్రాం లో పాల్గొన్న మాజీ విదేశాంగ అధికారులూ, జర్నలిస్టులూ,  యాంకర్ అర్ణాబ్ గోస్వామీ సహా,  దర్శకుడు తప్పే చేశారని మెత్తగా మందలించారు. దర్శకుడు ఇచ్చుకున్న వివరణలేవీ చర్చకి నిలబడలేదు.

        జరిగిన చరిత్రని పక్కన పెట్టి సినిమా చూస్తే దర్శకుడు మీనన్ చేసింది గొప్ప కృషే. కళారూపంగా అది గొప్ప సినిమానే. గొప్ప కలెక్షన్లు సాధిస్తున్నదే. ఒక మాజీ విదేశాంగ అధికారి అన్నట్టు, ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత  ఈ సినిమా చూసే ఎక్కువ మంది ప్రేక్షకులు కువైట్ ఉదంతం జరిగినప్పుడు పుట్టి వుండరు. వారికి  తప్పుడు సమాచార మివ్వడమే అవుతుంది- చరిత్రలో ఒక పార్శ్వాన్ని పూర్తిగా ఇలా ఉపేక్షించి. పైగా విదేశాంగ శాఖని ఇలా చిత్రించడం విదేశాల్లో ఆ శాఖ ప్రతిష్టకే భంగకరం. స్థానిక  ప్రేక్షకుల్లో దర్శకుడు ఈ సినిమా ద్వారా క్లయిమాక్స్ లో గొప్ప దేశ భక్తిని  రగిలించాడు సరే, అదే సమయంలో ఇలా తీసి విదేశాల్లో విదేశాంగ శాఖ ఇమేజిని  దెబ్బతీయడం కూడా చేసినట్టే. దేశభక్తే కాదు, విదేశాంగ భక్తి కూడా అవసరం.  


        చరిత్రని కాల్పనికం చేసి కమల్ హాసన్ కూడా ‘హేరామ్’  తీశారు. అందులో మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే కి సమాంతరంగా కమల్ సృష్టించిన కాల్పనిక పాత్రయిన తమిళ బ్రాహ్మణ యువకుడు,  గాడ్సేకి సమాంతరంగా పథకమేస్తూ,  బిర్లా మందిర్ లో గాంధీ ఎదుటకి వచ్చేస్తాడు. అయితే రెప్పపాటు కాలంలో అతడి పథకం తలకిందులై, గాడ్సే తుపాకీ పేల్చేస్తాడు గాంధీ మీదకి.

        ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీ- గాల్ మీద అక్కడి టెర్రరిస్టు సంస్థ ఒక విఫల హత్యాయత్నం చేయడం చరిత్ర. నవలా రచయిత ఫ్రెడరిక్ ఫోర్సిత్ దీనికి కల్పన జోడించి,  రెండో హత్యా ప్రయత్నంగా ‘డే ఆఫ్ ది జాకాల్ ‘ అనే బెస్ట్ సెల్లర్ రాశారు. ఇదే పేరుతో దీన్ని సినిమాగా కూడా తెశారు. 


ఈ రకంగా చరిత్రలో కాల్పనిక పాత్ర సృష్టించడం ఒకెత్తు. దీంతో అభ్యంతరాలుండవు. కానీ చరిత్రలో గాడ్సే నే తీసేసి, ఇంకెవరో హత్య చేశారని చూపిస్తే ఎలా వుంటుంది. అలాగే వుంది ‘ఏర్ లిఫ్ట్’  లో విదేశాంగ శాఖని డమ్మీని చేసి కాల్పనిక హీరోపాత్రకి ఆ క్రెడిట్ అంతా కట్ట బెట్టడం.


        దర్శకుడు ఒకటి చేయాల్సింది- తన రిసెర్చి ద్వారా నాటి కువైట్ సంక్షోభంలో కీలకపాత్ర పోషించిన అధికారి ఒకరిని  గుర్తించి, ఆయన్నే పాత్రగా చేసి, ఆ పాత్రకి ఎంత కల్పన జోడించినా, అతిశయోక్తులు చూపించినా ఇబ్బంది వుండేది కాదు. కాకపోతే ఆ అధికారి కృషిని ప్రభుత్వం గుర్తించి వుండాలి.


-సికిందర్
http://www.cinemabazaar.in/