రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, డిసెంబర్ 2015, గురువారం

టెక్నాలజీని కమ్మేసిన కళ!





రచన- దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ

తారాగణం : రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా, తన్వీ అజ్మీ, మహేష్ మంజ్రేకర్, వైభవ్ తత్వావ్దీ తదితరులు 
సంభాషణలు :
 ప్రకాష్ కపాడియా, సంభాషణలు-తెలుగు  : మదన్ కర్కే, పాటలు : రామజోగయ్య శాస్త్రి, సంగీతం :సంజయ్ లీలా భన్సాలీ, శ్రేయాస్ పురాణిక్ ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ, కూర్పు : రాజేష్ పాండే శబ్దగ్రహణం : బిశ్వదీప్ ఛటర్జీ, కళ : సలోనీ ధత్రక్, శ్రీరాం అయ్యంగార్, సుజీత్ సావంత్ఆహార్యం : మాక్సిమా బసు, అంజూ మోడీ,పోరాటాలు : శ్యాం కౌశల్, విజువల్ ఎఫెక్ట్స్ : ప్రైమ్ ఫోకస్

బ్యానర్ : సంజయ్ లీలా భన్సాలీ ఫిలిమ్స్
నిర్మాత :
 సంజయ్ లీలా భన్సాలీ
విడుదల :
 18 డిసెంబర్, 2015 
 ***

         వెండి తెర మీద సునాయాసంగా తైలవర్ణ చిత్ర లేఖనాలు చేసే విజువల్ మాంత్రికుడు మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు మరోసారి విచ్చేశాడు. మరాఠా చారిత్రకాన్ని మహా దృశ్య- కావ్య వైభవ విలాసంగా మల్చి, హృదయాల్ని మెలితిప్పే  కళాత్మకతతో భావోద్వేగాల సమాహారం చేశాడు. భాండాగారాల్లో  నిక్షిప్తమైపోయిన శతాబ్దాల నాటి ప్రేమచరిత్రకి చిత్రిక పట్టి అజరామరమయ్యే శిల్పంలా చెక్కాడు. బాజీరావు- మస్తానీల స్మృతిని వెనకటి- ఇప్పటి- ఇంకా ముందటి తరాలన్నిటికీ ఒక జ్ఞాపకంలా  దృశ్యమానం చేసిపెట్టాడు.   


        సంజయ్ లీలా భన్సాలీ- ఈ  పేరు వింటేనే  నాటి ఖామోషీదగ్గర్నుంచీ మొన్నటి  రామ్ లీలా’  వరకూ కళ్ళప్పగించి  చూసే అద్భుత, అనిర్వచనీయ  లోకాలే కన్పిస్తాయి. సంగీత సాహిత్య సౌరభాల గుచ్చాలే ఆహ్వానిస్తాయి. అతని విజన్ వేరు, ఆలోచనవేరు, దృశ్య మాధ్యమపు నిర్వచనం పూర్తిగా వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే, దేశంలోనే అతణ్ణి  మించిన మహోజ్వల చిత్రరాజాల రారాజు లేడనొచ్చు

        బాలీవుడ్ సూపర్ స్టార్లతో గ్లామరస్ గా బాజీరావు మస్తానీతెలుగు వెర్షన్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్లామరస్ గా ఆనడమెందుకంటే, ఇది నిఖార్శయిన ప్రేమ కథ అయినందుకే. అదికూడా అతి సరళంగా చెప్పి పామరుల నుంచీ పండితుల దాకా అందర్నీ సంలీనం చేయగలనందుకే. కింది క్లాసు మాస్ మహాజనులు ఎంత తదాత్మ్యంతో దీన్ని అక్కున జేర్చుకోగలరంటేసౌండ్ మిక్సింగ్ లోపాల వల్ల మొనోలో స్పష్టత కోల్పోయి  సంభాషణలు విన్పిస్తే, పదేపదే అలజడి రేపే దాకా!  మాస్ ప్రేక్షకులు సీరియస్ గా ఇన్వాల్వ్ అయి చూసేందుకు క్లాస్ మాస్ సినిమాలంటూ తేడాల్లేవని తెలిపే దాకా!

       రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా ల నట నాట్య భావప్రకటనా  విన్యాస విలాసాలకి  నిజానికి ఇంకా విస్తృత కాన్వాస్ అవసరం. భన్సాలీ కూర్చిన కథాప్రపంచం కూడా కురచనైపోయి-  ఈ ప్రతిభాశాలులు  పాత్రల్లో పాత్రలకి మించి ఎదిగిపోయారు. రాజు కంటే ధర్మం గొప్పదని పలికించిన ఒక సంభాషణలాగాతమ ఇమేజులకంటే పాత్రలు గొప్పవైపోయాయి!

        చరిత్రని భావజాలాల కళ్ళద్దాలతో చూస్తే డాక్యుమెంటరీలు చూసుకోవాలి. చారిత్రక ఆధారాలన్నిటినీ ససాక్ష్యంగా ముందుపెట్టి నిజాయితీని చాటుకోవడం సినిమా లక్షణం కాదు. సినిమా అనేది కళ, డాక్యుమెంటరీ అనేది సమాచారం. చరిత్రని జనబాహుళ్యానికి నాటకీయంగా మల్చి చూపడమే సినిమాకళ కర్తవ్యం. ఆ నాటకీయత అవధులు దాటితే దానికదే ఆ సినిమా అభాసు అవుతుంది. నాటకీయత కోసం కొన్ని సృజనాత్మక స్వేచ్ఛలు తీసుకోవడం కూడా  అవసరం. ఈ సృజనాత్మక స్వేచ్ఛ ఉద్దేశించిన సారాన్ని ఎలా ఎత్తి పట్టిందని మాత్రమేచూడాలి. అలా చూస్తే, భన్సాలీ ఉద్దేశించిన సారం కేవలం ప్రేమకథకి సంబంధించిందైనప్పుడు, పాత్ర రాజకీయ జీవితానికి సంబంధించిన అసంగతాలు అప్రస్తుతమైపోతాయి.

కథ
      18 వ శతాబ్దపు మరాఠా వీరుడు బాజీరావు (రణవీర్ సింగ్) ఢిల్లీ లో మొఘల్ రాజుల్ని పదవీచ్యుతుల్ని చేసి, భారత దేశమంతటా హిందూ రాజ్యాన్ని స్థాపించాలని  యుద్ధాలు చేస్తూంటాడు. ( హిందూ రాజ్యం కంటే మరాఠా రాజ్యం లక్ష్యంగా కొనసాగాడనీ,  అందుకే ఇతర సంస్థానాల రాజులు వ్యతిరేకమయ్యారనీ ఇంకో వాదం వుంది).  ఇలావుండగా,  మరాఠా సామ్రాజ్య చక్రవర్తి ( మహేష్ మంజ్రేకర్), తదుపరి  పీష్వా ( ప్రధాని) గా వారసుడి ఎంపిక కోసం అన్వేషిస్తున్నప్పుడు  బాజీరావు పరీక్షకి సిద్ధపడతాడు. ఆ పరీక్షలో నెగ్గి,  సేనాపతి అవుతాడు. ఈ సమయంలో బుందేల్ ఖండ్ రాజు ఛత్రశాల్ తన రాజ్యాన్ని ముట్టడించ డానికి సిద్ధమైన ముస్లిం సైన్యాలనుంచి కాపాడాల్సిందిగా రహస్య సందేశం  పంపిస్తాడు. ఆ సందేశ హరిణి మరెవరో కాదు, యువరాణి మస్తానీ (దీపికా పడుకొనే). ఈమె  కత్తి యుద్ధంలో, గుర్రపు స్వారీలో, నాట్యంలో, గానంలో అసమాన ప్రతిభగల పడతి. ఆమె కోరడంతో బాజీరావు బుందేల్ ఖండ్ వెళ్లి శత్రువుల్ని సంహరిస్తాడు. ఈ సందర్భంగా మస్తానీ  అతడితో  ప్రేమలో పడుతుంది. బాజీరావు కూడా ప్రేమలో పడిపోతాడు.

        బాజీరావుని  సాగనంపాక, మస్తానీ మనసులో మాట తల్లిదండ్రులకి చెప్తుంది. రాజపుత్ర వంశీయుడైన  బుందేల్ ఖండ్ రాజు ఛత్రశాల్,  రుహానీ బేగం అనే ముస్లిం ని చేసుకున్నాడు ( ఈమె అప్పటి నిజాం దర్బారులో నాట్యగత్తెగా వుండేది). మస్తానీ మాట కాదనలేక ఆమెని బాజీరావు దగ్గరికి పూనా పంపిస్తారు తల్లిదండ్రులు.

        అలా కోటలోకి ప్రవేశించిన మస్తానీకి తెలుసు, బాజీరావుకి కాశీ బాయి ( ప్రియాంకా చోప్రా)  అనే భార్య వుందని. అయినా తెగువతో ఇలా వచ్చేయడంతో బాజీరావు గొప్ప సంయమనం పాటించి ఆమెకి కోటలో స్థానం కల్పిస్తాడు. మొదట నాట్యగత్తె  అనుకున్న మస్తానీ తర్వాత భర్త  ప్రియురాలే  అని తెలియంతో  హతాశురాలవుతుంది కాశీబాయి. బాజీరావు తల్లి ( తన్వీ అజ్మీ), తమ్ముడు (వైభవ్ తత్వావ్దీ)  బాజీరావుకి వ్యతిరేకులవుతారు. రాజపుత్రులు - మొగలులు పెళ్లి సంబంధాలు చేసుకోవడమేమో గానీ, బ్రాహ్మణులైన మేము ఈ సంబంధాన్ని ఒప్పుకోబోమని చెప్పేస్తారు. దీంతో మొదలవుతుంది బాజీ -మస్తానీల ప్రేమలో సంక్షోభం. ఈ ప్రేమ ఇక్కడి నించీ ఏఏ మలుపులు తిరిగి ఏ దరికి చేరిందో ఇక వెండితెర మీద చూసి తరించాల్సిందే.


ఎవరెలా చేశారు.
      బాజీరావుగా రణవీర్ సింగ్ లో ఇంత నటనా పటిమ ఉంటుందని ఎవరూ ఊహించరు. బాజీరావంటే తను తప్ప ఇంకెవరూ వుండరనేంతగా ప్రాణ ప్రతిష్ట చేశాడు. యుద్ధ నైపుణ్యం తెలిసిన వీరుడిగా, కానీ  పరస్త్రీని ప్రేమించకుండా ఉండలేని బలహీనుడిగా- అతివలిద్దరి మధ్యా  సంధి కుదిర్చే తెలివిమంతుడిగా, పోనుపోనూ భగ్నప్రేమికుడిగా, ఇంకాతర్వాత మతిస్థిమితం కోల్పోయిన వాడిగా....రణవీర్ అభినయ చాతుర్యం పాత్రని సజీవం చేసింది. తన భావోద్వేగాల్ని, భావ ప్రకటనల్నీ అమోఘంగా అదుపులో ఉంచుతూ అండర్ ప్లే చేసిన రణవీర్ నటుడిగా ఇంత ఎదిగి ధన్యుడ వుతాడని కూడా ఎవరూ ఊహించరు.

        దీపికా  పడుకొనే మస్తానీ పాత్రని అజరామరం చేసింది. తను వీరనారియే కావొచ్చు,  కానీ ప్రేమలో పడ్డాక సౌమురాలై పోతుంది. అనేక అవమానాల్ని సైతం ప్రేమకోసం ఎదుర్కొనే ధీరత్వం ఆ సహజ వీరత్వం లోంచే వచ్చినట్టు,  తన వీరనారీతనం బెర్పినట్టు లోపలా బయటా సంఘర్షణ తాలూకు ఇరు పార్శాలని సమున్నతంగా ప్రదర్శించింది.

         ఇక ప్రియాంకా చోప్రా ఎలాటి పాత్రనైనా సునాయాసం గా అభినయించేయ గలదని బర్ఫీలోనే నిరూపించింది. ఇప్పుడు కాశీబాయి పాత్ర ఎంత సంక్లిష్ట పాత్రయినా సమర్ధవంతంగా నిర్వహించుకుపోయింది. ఇటు భర్తతో- అటు మస్తానీతో లవ్ –హేట్ రిలేషన్ షిప్ ఆమెది. అయినా మాటల్లో గానీ, చూపుల్లో గానీ పాత్ర  స్థాయినీ, హూందాతనాన్నీ నిలబెడుతూ హృద్యమైన నటనని పోషించింది.
ఈ ముగ్గురూ తమ తమ పాత్రభినయాలతో చిరకాలం మనల్ని వెంటాడుతారు. బాలీవుడ్ కి, ఆ మాటకొస్తే భారతీయ సినిమా తెరకి ఒక పరిపక్వ ప్రేమకథకి శాశ్వత తత్త్వం కల్పించిన స్టార్లు గా గుర్తుండిపోతారు.


భన్సాలీయే సారథి

           న్సాలీ సారధ్యం లేకుండా ఇంత  క్లాసిక్ చారిత్రక  ప్రేమ కథని ఊహించలేం. సంగీతం తనే నిర్వహించాడు,  అది చాలా తోడ్పడింది. చారిత్రక సినిమాలని కూడా టెక్నాలజీ మోజుతో డిజైనర్ చరిత్ర  సినిమాలుగా రుచీ పచీ వుండని కళావిహీన సరుకుగా అమ్మేస్తున్న ఈ రోజుల్లో, ఇలాటి సినిమాల నిర్మాణాలకి భన్సాలీ ఒక పాఠ్య పుస్తకాన్నే  ఇచ్చాడు, చరిత్రతో, చరిత్ర నాటి కాలంతో అతనెక్కడా రాజీ పడలేదు. 18 వ శతాబ్దపు కాలాన్నీ, వాతావరణ పరిస్థితుల్నీ, నిర్మాణాల్నీ, మనుష్యుల్నీ, కళల్నీ, సంగీతాన్నీ అచ్చుగుద్దినట్టు ఆ కాలంలోకి దిగుమతి చేశాడు. మరాఠా  సంస్కృతీ సాంప్రదాయలు ఉట్టిపడే శాస్త్రీయ సంగీత (దేశవాళీ వాద్య  పరికరాలతో) సాహిత్య గుబాళింపు లతో నింపేశాడు.  కాలంలో వెనక్కి  ప్రయాణిం జేయడమంటే ఇదే. ఎక్కడా గ్రాఫిక్స్ చేసినట్టూ అన్పించని అద్భుత కళాఖండాన్ని కళ్ళ ముందు నిలబెట్టాడు. రంగుల్ని కూడా రూపకా లంకారాలుగా  వాడుకున్నాడు. రెండు మతాలకి చెందిన కాషాయ, ఆకుపచ్చ రంగులతోనూ కథ చెప్పాడు, భావాల్నీ చెప్పాడు.  యుద్ధ దృశ్యాల చిత్రీకరణ అయితే ఒక ఆర్టు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూనే కథా కథనాలనీ, పాత్ర చిత్రణల్నీ అపూర్వంగా, సమర్ధవంతంగా  నిర్వహించుకొచ్చాడు. భారతీయ కమర్షియల్ సిన్మాకి భన్సాలీ ఒక ఆన్సర్.

        ఈ తెలుగు డబ్బింగ్ తో ఇంకో విషయం తేటతెల్ల మవుతోంది. చాలా  సరళమైన  ప్రేమకథని  అంతే సున్నితంగా, ఏ దృశ్య శబ్ద కాలుష్యాలకీ చోటులేకుండా, అదుపు చేసిన భావోద్వేగాలతో ఇంత బలంగానూ  చెప్ప వచ్చనేది. అలాగే  ఇలా బాజీరావు మస్తానీ’,  ‘కంచె’  లాంటి అర్ధవంతమైన క్వాలిటీ కథల సినిమాలు ఇంకో పది వరసగా వచ్చి మీద పడితే- మంచి సినిమాల్ని కుదురుగా కూర్చుని చూడలేని, అభిరుచి పట్టని, రసాస్వాదన తెలీని ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు పధ్ధతి మార్చుకునే  వీలుంటుంది.


-సికిందర్ 






22, డిసెంబర్ 2015, మంగళవారం

స్మాల్ సెన్స్!






ప్రతి ఏడాదీ సగటున యాభై 
మంది కొత్త దర్శకులు తెలుగులో పరిచయ మవుతున్నారు.  మొత్తం తెలుగు సినిమాల్లో సగం సినిమాలు వీళ్ళే తీస్తున్నారు. ఆ సగానికి సగమూ అపజయాల పాల్జేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇంకో యాభై మంది కొత్తగా వస్తున్నారు. వాళ్ళూ ఓ యాభై ఫ్లాపులిచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్లి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఓ రెండు శాతమే వుంటుంది. అలా వచ్చి రెండో సినిమా కూడా ఫ్లాపే ఇస్తున్నారు. 2014 లో 70 మంది కొత్త దర్శకులు వచ్చారు. 64 ఫ్లాపులిచ్చారు. 2015 లో కొత్త దర్శకుల సంఖ్య 48 కి తగ్గింది.  వీళ్ళు 39 ఫ్లాపులిచ్చారు. అసలు ఎవరు వీళ్ళంతా,  వీళ్ళతో సినిమాలు తీస్తున్న నిర్మాత లెవరనీ చూస్తే,  నిర్మాతలు కొత్త వాళ్ళు, దర్శకులు కొత్త వాళ్ళే.  ఎన్నాళ్ళ నుంచో స్ట్రగుల్ చేస్తూ ఓ అవకాశం పొందిన వాళ్ళు. కొందరైతే సినిమాలు  తీయడంలో ఏ అనుభవమూ లేకుండానే కొత్త నిర్మాతల్ని పట్టేస్తున్న వాళ్ళు.

అగ్ర నిర్మాతలు తీసే భారీ సినిమాలూ,  పది కోట్ల లోపు సినిమాలు తీసే ఇతర నిర్మాతలూ  మొత్తం  కలిపి తీసేవి ప్రతీ సంవత్సరం ఇరవైకి మించవు. మిగతా లో- బడ్జెట్ చిన్నాచితకా సినిమాలే భారీ సంఖ్యలో  వుంటాయి. ఒక విధంగా ఇవి తీసే కొత్త నిర్మాతలు అంతా పోగొట్టుకుని టెక్నీషియన్లనీ, కార్మికుల్నీ  పోషిస్తున్నట్టే. కానీ థియేటర్లలో క్యాంటీన్ వాళ్ళనీ, పార్కింగ్ వాళ్ళనీ కలెక్షన్లు  లేక తెగ ఏడ్పిస్తూంటారు. ప్రొడక్షన్ రంగంలో అందరికీ కామెడీగా వుంటే, ప్రదర్శనా  రంగంలో అందరికీ ఈ సినిమాలతో ట్రాజెడీయే. పల్లీలమ్ముకునే వాడుకూడా బతకలేడు. ఇదంతా  ఛోటా నిర్మాతల గ్రేట్ టాలీవుడ్ షో గా ప్రతీ సంవత్సరమూ రన్  అవుతూంటుంది సగర్వంగా. ఈ ఛోటా నిర్మాతలకి కావలసినంత  ‘కీ’ ఇచ్చి వదిలేది కొత్త కొత్త దర్శకులు. దీని తర్వాత ఈ నిర్మాతలూ వుండరు, కొత్త దర్శకులూ వుండరు. ఈ వెళ్ళిపోయినా యాభై మంది కొత్త దర్శకుల, కొత్త నిర్మాతల స్థానాన్ని భర్తీ చేస్తూ, ఇంకో యాభై మంది కొత్త నిర్మాతలూ దర్శకులూ వచ్చేసి, ఆ ఏడాదికి ఫ్లాపుల కాష్టాన్ని ఆరకుండా మండించడం మొదలెడతారు. ది షో మస్ట్ గో ఆన్- అన్నట్టు రావణ కాష్టం మండుతూనే వుంటుంది. ఎప్పటికపుడు ఓ యాభై – అరవై చెత్త చెత్త సినిమాలు భస్మీపటలం అవుతూనే  వుంటాయి.



 వీళ్ళు తీస్తున్న  సినిమా లేమిటీ  అని చూస్తే మాత్రం,  నూటికి తొంభై శాతం చెత్త ప్రేమ సినిమాలే. ఒకటీ అరా హార్రరో మరోటో వుంటాయి. ఇవన్నీ  మళ్ళీ ముక్కూ మొహం తెలీని ఆ ఒక్క సినిమాతో ఖతం అయిపోయే కొత్త కొత్త హీరో హీరోయిన్లతోనే  తీస్తారు. ఆ కథలూ బావుండవు, హీరో హీరోయిన్లూ నటించలేరు, దర్శకుడూ సరీగ్గా తీయలేడు.  అర్ధం పర్ధం లేని ప్రేమలు, వాటికి చాలా ఇమ్మెచ్యూర్డ్ కథనాలు, ఇంకా మాటాడితే అవే  మూస ఫార్ములా షోకులూ... ఇవే ఈ నయా దర్శకుల పాలిట యమ పాశా లైపోతున్నాయి.    

        ‘నువ్వు నేను ఒకటవుదాం’ అని ఒక కొత్త దర్శకుడు తీస్తాడు. ఇంకో కొత్త దర్శకుడు ‘గాయకుడు’ అని తీస్తాడు. మరొకతను వచ్చేసి  ‘ భం భోలే నాథ్’ అంటూ ఏదో తీస్తాడు. వీళ్ళ ఉద్దేశంలో ఇలాటి సినిమాలన్నీ చూడాల్సింది యువ ప్రేక్షకులే. కానీ ముక్కూ మొహం తెలీని కొత్త కొత్త  హీరో హీరోయిన్లని యువ ప్రేక్షకులు అసలే కేర్ చెయ్యరని వీళ్ళకి తెలీదు. థియేటర్ వైపు కూడా తొంగి చూడరని తెలుసుకోరు. ఇక ఇవి తీసే కొత్త దర్శకుణ్ణి  ఏ యువ ప్రేక్షకులూ అసలే పట్టించుకోరనీ గ్రహించరు. ఇక తయారైన ఇలాటి సినిమాల్ని ఏ బయ్యరూ కొనడు. మళ్ళీ నిర్మాతలే డబ్బులు పెట్టుకుని విడుదల చేసుకోవాలి. విడుదల చేస్తే ఓపెనింగ్సే వుండవు. డబ్బుల్లేక పోతే విడుదలే కావు. 

        ఇక్కడ కొత్త దర్శకులకి అర్ధం కాని ఇంకో సంగతేమిటంటే, కొత్త కొత్త హీరో హీరోయిన్లని ఏ అగ్ర దర్శకుడో లేదా ఏ ప్రముఖ బ్యానరో  పరిచయం చేస్తే తప్ప యువ ప్రేక్షకుల్లో సినిమాకి గ్లామర్ రాదనేది. ఒకప్పుడు యువప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజా,  ఎవర్ని పెట్టి సినిమా తీసినా యువ ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఇప్పుడు తేజ క్రేజ్ తగ్గిపోయాక, ఆయన కొత్త వాళ్ళని పెట్టి ఎంత గట్టిగా సినిమా తీసినా ఆయన్నీ, ఆయన ప్రెజెంట్ చేస్తున్న కొత్త హీరో హీరోయిన్లనీ కనీసం కన్నెత్తి చూడడం లేదు యువ ప్రేక్షకులు.  ఇదే కొత్త దర్శకుల విషయంలోనూ జరుగుతోంది. నువ్వే  కొత్తయి నప్పుడు నువ్వు పెట్టే కొత్త మొహాలెవరికి అవసరం? రెండోది
,  యువ ప్రేక్షకులు గ్లామరస్ గా వుండే బిగ్ ఈవెంట్ నే కోరుకుంటారు. ఫీల్డులో పేరున్న కుటుంబాల నుంచి ఏ  కొత్త హీరో వస్తున్నా ఒక గ్లామర్ తో, ఒక సెలెబ్రేషన్ తో మొదట్నించీ దృష్టి పెడతారు యువ ప్రేక్షకులు. వాళ్ళ సినిమాలకి ఓపెనింగ్స్ ఇస్తారు. బావుంటే హిట్ కూడా చేస్తారు.




అంతే  గానీ ఒక కొత్త నిర్మాత ఎవరో వచ్చేసి,  నా కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తానని అంటే,  నీ కొడుకెవరు? మెగా స్టార్ వారసుడా? రామానాయుడు మనవడా? అసలు నువ్వెవరు? నీ కొడుకుతో సినిమా తీస్తే ఎవరు విడుదల చేస్తారు? ఎవరు చూస్తారు? ..అనే ఈ ప్రశ్న లేవీ వీళ్ళ మీద పనిచెయ్యవు. ఇలాటి బాపతు వ్యక్తులు కూడా ఈ  మధ్య ఎక్కువైపోయారు. వీళ్ళని చూసి స్వాభిమానం వున్న కొత్త దర్శకులు పారిపోవడమో, వచ్చిన  అవకాశమే గొప్పనుకున్న వాళ్ళు అలాగే పెట్టి ఆ సినిమా చుట్టి పారేసి తప్పించుకోవడమో  చేస్తున్నారు.

ఈ సంవత్సరం  కొత్తగా వచ్చిన దర్శకుల్లో  కిషోర్ కుమార్ ( గోపాల గోపాల), అనిల్ రావిపూడి ( పటాస్), క్రాంతి మాధవ్ ( మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), నాగ్ అశ్విన్ ( ఎవడే సుబ్రహ్మణ్యం), రాధాకృష్ణ కుమార్ (జిల్).. ఈ ఆరుగురు మాత్రమే సక్సెస్ అవగల్గారు. ( డిసెంబర్ 25 న విడుదల కానున్న ‘భలే మంచి రోజు’ తో మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య రిజల్ట్  ఇంకా తేలాల్సి వుంది). ఈ కొత్త దర్శకులందరూ స్టార్స్ తో తీసి సక్సెస్ అయిన వాళ్ళే. అలాగే బాలకృష్ణ తో ‘లయన్’ తీసినప్పటికీ సత్య దేవ్ అనే కొత్త దర్శకుడు రాణించలేక పోయాడు. సుధీర్ తో ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసిన ఏఎన్ బోస్, నారా రోహిత్ తో ‘అసుర’ తీసిన కృష్ణ విజయ్, సుమంత్ అశ్విన్ తో ‘కొలంబస్’ తీసిన సామల ఆర్, కోనవెంకట్ నీడన నిఖిల్ తో ‘ శంకరాభరణం’ తీసిన ఉదయ్ లాంటి కొత్త దర్శకులు ఫ్లాప్ అయితే, సుకుమార్ పంచన ‘కుమారి 21 ఎఫ్’  తీసిన సూర్య ప్రతాప్ హిట్టయ్యాడు. 

ఇక గతంలో కొత్త దర్శకుడుగా ‘రిషి’ అనే ఫ్లాప్ తీసిన రాజ్ మాదిరాజు, మళ్ళీ తిరిగి వచ్చి ఈ సంవత్సరం ‘ఆంధ్రాపోరి’ తీసి రెండో సారి కూడా చతికిలబడ్డాడు. కొత్త దర్శకుడుగా ‘రారా స్వామీ’ అనే న్యూవేవ్ సూపర్ హిట్ తీసి ప్రామిజింగ్ గా కన్పించిన సుధీర్ వర్మ, నాగచైతన్యతో ‘ దోచేయ్’ అనే పాత మూసకి పాల్పడి మోసపోయాడు. ఇంకో కొత్త దర్శకుడు రాజ కిరణ్ తిరిగి రెండో సినిమాతో వచ్చాడు. ఈయన ‘గీతాంజలి’ తో సక్సెస్ అయి, రెండో సినిమా ‘త్రిపుర’ తో ఫ్లాపయ్యాడు.



కొత్త దర్శకులందరికీ పెద్ద అవకాశాలు రావు. ఓ చిన్న బడ్జెట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ఫోన్ కాల్స్ రావచ్చు. కానీ ఈ ప్రూవ్ చేసుకునే ఆలోచన ఎంతమంది కొత్త దర్శకులు చేస్తున్నారు. అలాటి ఉన్నతమైన ఆలోచనలు చేస్తే ఏటా యాభై అరవై చిన్న సినిమాల్ని గంగలో ఎందుకు కలుపుతున్నారు. వాటి మొత్తం విలువ ఎన్ని వందల కోట్లు వుంటుంది? వందలాది  కోట్లతో ఏం చూసుకుని ఆటలాడుతున్నారు? పోనీ ఓ ‘కంచె’ లాంటి  భిన్న ప్రయోగం చేసీ చేయరాక, హిందీ లో ఓ ‘తిత్లీ’ లాంటి రియలిస్టిక్ ఫిక్షన్ లాంటిది ప్రయత్నించీ చేతులెత్తేసి, ఈ వందలాది  కోట్ల రూపాయల్నీ  ముంచేస్తున్నారా?  ఇలా చేస్తే ఆ మునిగినా కొత్త దర్శకుడికీ, కొత్త నిర్మాతకీ మంచి పేరైనా వస్తుంది- సోదిలోకి రాని చెత్త ప్రేమకథలే  తీస్తూ కూర్చుంటే  పేరూ డబ్బులూ రెండూ పోతాయి కదా?

గడ్డి పోచ దొరకనట్టు ప్రవాహంలో కొట్టుకు పోవడం కాదు, గడ్డి పోచని కనిపెట్టడం తెలుసుకోవాలి. దాన్ని పట్టుకుని విజయవంతంగా ఒడ్డున పడడం నేర్చుకోవాలి. కొరియన్ సినిమాల కట్ అండ్ పేస్ట్ కృత్రిమ పనులు పనికి రావు, సమాజాన్ని తెలుసుకోవాలి. సమాజంలోకి చూపు సారించినప్పుడు, యూత్ అసలేం కోరుకుంటున్నారో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే యూత్ తో కనెక్ట్ అవగల్గి, బలమైన కథాకథనాల్ని సృష్టించగల్గుతారు. కోటి రూపాయలతో తీసిన సిన్మా సొంత క్రియేటివిటీ తో కళకళ లాడితే థియేటర్లు కిటకిట లాడతాయి. ఈ పనికి మనస్కరించని మందబుద్ధులైన కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలూ రంగం నుంచి తప్పుకోవాలి. ఏటేటా ఇంత ట్రాష్ తో టాలీవుడ్ సుగంధాల్ని మాత్రం వెదజల్లడం లేదు. 

-సికిందర్


18, డిసెంబర్ 2015, శుక్రవారం

సెన్సిబిలిటీ అడగొద్దు!






రచన – దర్శకత్వం : పూరీ జగన్నాథ్

తారాగణం : వరుణ్ తేజ్, దిశా పటానీ, రేవతి, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, అలీ, సప్తగిరి, ధన రాజ్ తదితరులు
సంగీతం : సునీల్ కాశ్యప్,  ఛాయాగ్రహణం : పి.జి. విందా
బ్యానర్ : సికె ఎంటర్  టెయిన్ మెంట్స్, శ్రీ శుభ శ్వేతా ఫిలిమ్స్
నిర్మాత : సి. కళ్యాణ్

విడుదల : 17 డిసెంబర్ 2015
***
తెలుగు సినిమాల రొటీన్ ని బ్రేక్ చేస్తూ ‘కంచె’ లాంటి డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నవయువ హీరో వరుణ్ తేజ్, ఈ సారి అందరు స్టార్ల లాగే తనుకూడా ఓ పక్కా మాస్ పాత్ర చేస్తే, లెక్క బ్యాలెన్స్ అవుతుందని  కాబోలు, పూరీ జగన్నాథ్ కి ఓకే అనేసి మాస్ టైటిల్ తో ‘లోఫర్’ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇలా యూటర్న్ తీసుకోవడం మంచిదా  కాదా  ప్రేక్షకులే నిర్ణయిస్తారు. అయితే స్టార్లతో మాస్ సినిమాలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగల్గేవిగానే ఉంటూ వస్తున్నాయి - వాటి జయాపజయాల సంగతెలా వున్నా. కానీ వరుణ్ తేజ్ తో పూరీ బ్రాండ్ మాస్ అనేసరికి ఈసారి చాలా భిన్నంగా, రొటీన్ ని బ్రేక్ చేసే  మాస్ మూవీగా  ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘లోఫర్’. ఈ భిన్నత్వమేమిటో, రొటీన్ ని ఎలా బ్రేక్ చేసిందో ఈ కింద తెలుసుకుందాం.

కథాకమామీషు
        స్తీలో బతికే లక్ష్మి ( రేవతి), మురళి ( పోసాని) పోట్లాడుకుని విడిపోవాలనుకుంటారు. మూడేళ్ళ కొడుకు ని మురళి తీసుకెళ్ళి పోబోతే అడ్డు పడుతుంది లక్ష్మి. లోఫర్ గా తిరిగే భర్త చేతికి కొడుకుని ఇవ్వకూడదనుకుంటుంది. మురళి బలవంతంగా తీసికెళ్ళి పోయి తనలాగే లోఫర్ బుద్ధులన్నీ నేర్పి  దొంగగా తయారు చేస్తాడు. తండ్రితో కలిసి దొంగతనాలు చేస్తూంటాడు రాజా ( వరుణ్ తేజ్).

        అటు వూళ్ళో తండ్రి (ముఖేష్ రిషి) బలవంతపు పెళ్లి చేస్తున్నాడని తప్పించుకొచ్చిన మౌని ( దిశా పటానీ), రాజా కి తారసపడుతుంది. రాజా ఈమెని ప్రేమించడం మొదలెడతాడు. దీనికి తండ్రి మురళి అడ్డు పడతాడు. రాజాకి అతడి తల్లి గురించి చెడుగా చెప్పివున్నాడు మురళి.  కామెర్లు వచ్చి చనిపోయిందని అబద్ధం కూడా చెప్పాడు. ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాదని నూరి పోశాడు. ఇప్పుడు రాజా మౌని తో ప్రేమలో పడడంతో సమస్యై పోతాడు రాజాకి. ఇలా వుండగా, మౌని అన్నదమ్ములు ఆమెకోసం ముఠాతో వచ్చిపడతారు. మౌని కి పూర్వం నుంచే రాజా తల్లి లక్ష్మితో వూళ్ళో పరిచయముంటుంది. ఆమె కబురు చేసేసరికి లక్ష్మి కూడా వచ్చేస్తుంది. ముఠా బారి నుంచి మౌని ని కాపాడుతున్న రాజాని చూసి, వీడు నీకు తగ్గ వాడు కాదని మౌనిని లాక్కెళ్ళి పోతుంది లక్ష్మి. అతను  తన కొడుకని గుర్తు పట్టదు. 

        కానీ ఇంట్లో తల్లి ఫోటో పెట్టుకున్న  రాజా ఆమెని గుర్తు పడతాడు. కానీ కొడుకని చెప్పుకోలేని పరిస్థితి.  ఇక ఆమెకోసం ఊరెళ్ళి పోతాడు. అక్కడ తనని గుర్తు పట్టని తల్లికి దగ్గరవడం గురించి, మౌని కి బలవంతపు పెళ్లిని తప్పించడం గురించీ ప్రయత్నాలు మొదలెడతాడు. అప్పుడేం జరిగింది?  రాజాయే తన కొడుకని లక్ష్మి తెలుసుకుందా? రాజాకీ మౌని కుటుంబానికీ వున్న సంబంధమేమిటి?  తనని తల్లి నుంచి దూరం చేసి  చేసి ఇద్దర్నీ ఏడ్పించిన తండ్రి కెలా బుద్ధి చెప్పాడు ?...ఇవీ  మిగతా సినిమా చూస్తే తెలిసే విషయాలు.

ఎలావుంది కథ
        బస్తీమే సవాల్ గా వుంది. దర్శకుడు తను అతిగా ప్రేమించే మాస్ ప్రేక్షకుల్ని కూ డా ఈసారి విభజించుకుని, అక్షరాస్యతా తెలివితేటలూ వుండని అన్ ఎడ్యుకేటెడ్స్ కి మాత్రమే అన్నట్టు వాళ్లకి స్థాయికి తగ్గ  కథకథనాలు చూసుకుని, ఇతర వర్గాల  ప్రేక్షకులకి నమస్కారం పెట్టేయడం విచారకరం. ఇలా యూత్ కి గానీ,  మిగతా ఫ్యామిలీస్ కి గానీ  కనెక్ట్ అయ్యే అంశాలేవీ లేకపోవడం ఇక్కడ ఈ మూవీ సొంతం చేసుకున్న భిన్నత్వమన్న మాట.  యూత్ లో కూడా అబ్బాయిలు తప్ప అమ్మాయిలూ ఈ దర్శకుడి సినిమాలు చూడడం ఎప్పుడో మానేశారనేది ఇంకో వాస్తవం. గత రెండు ‘టెంపర్’, ‘జ్యోతి లక్ష్మి’  అనే అడల్ట్ కంటెంట్ వున్న వయొలెంట్ మూవీస్ కైతే ప్రేక్షకుల్లో అమ్మాయిలే లేరు. ఇలా తనకున్న యువ ప్రేక్షకుల్ని కూడా జెండర్ ఆధారం గా విభజించుకుని కథలు తయారు చేసుకుంటున్న  తను, ఈసారి  యూత్ లో అబ్బాయిల్ని కూడా దూరం చేసుకుంటూ - మాస్ సినిమాల రొటీన్ తత్వాన్ని బ్రేక్ చేయడం మరో ప్రత్యేకత! ఏదో రెండు సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న యువహీరో వరుణ్ తేజ్ పేరు చూసి కొందరు యూతబ్బాయిలు  ఈ సినిమాకి  ఏకైక పోషకులుగా మిగలొచ్చు.


స్క్రీన్ ప్లే సంగతులు       వాస్తవానికి స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకునేంత స్థాయి సినిమా కాదిది. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టు బస్తీమే సవాల్ గా తీసిన లెక్కా పత్రం, కథా కార్ఖానా పట్టని సినిమా ఇది. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో గ్రామ కక్షల సినిమాల్లోలాంటి పురాతనమైన కథకి కనీసం దర్శకత్వ విలువలు, విజువల్స్ లో, ఎడిటింగ్ లో చూపాల్సిన టెక్నికల్ విలువలూ పట్టని ‘సినిమా చుట్టేయడం’ అనే పద్దతిని పాటించిన విధానమిది. గ్రామ కక్షల సినిమాల్లో నైనా కొన్ని విలువలకి అర్ధవంతమైన చిత్రణలుండేవి. ఆత్మీయతలు, అనుబంధాలు, ఎడబాట్లు, త్యాగాలు వంటివి సాగదీసినా వాటికి పునాదులంటూ ఉండేవి. తల్లినే చంపే  రాక్షస కొడుకులూ, అందుకు పురిగొల్పే తండ్రులూ వంటి పాత్రలకి చోటుండేది గాదు. 

        మదర్ సెంటి మెంటు తో కథ అన్నాక ఆ పాయింటు  గల్లంతయ్యే వయొలెంట్ చిత్రణలుంటే, అదొక సెంటి మెంటు అని ప్రచారం చేయడంలో అర్ధమే లేదు. సెకండాఫ్ లో హీరోయిన్ తండ్రి ఇంట్లో బందీ అయిపోతే పాపం హీరోగారికి రోమాన్స్ కి వీల్లేక డ్రైగా వాళ్ళ మీదా వీళ్ళ మీద పడి కథ లాగించెయ్యాల్సిన పరిస్థితి. పెళ్లి ఇష్టం లేని పిల్ల ఇంట్లోంచి పారిపోతే, దానికోసం ముఠా వెంటపడ్డం అనే ట్రాక్ ఇంకా ఇంకా హీరోయిన్ కి  పెట్టారంటే, కొత్తగా కథ ఆలోచించాలన్న ఓపిక లేకపోవడమే ఇది. 

        ఇదే ‘లోఫర్’  టైటిల్ తో ధర్మేంద్ర – ముంతాజ్ లు నటించిన 1973 నాటి సూపర్ హిట్ మూవీ వుంది. తెలుగువాడైన  ఎ. భీమ్ సింగ్ దీని దర్శకుడు. 1954- 78 మధ్యకాలంలో, ఈయన మొత్తం  తన 53 ఏళ్ల జీవితంలో తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, కన్నడ సినిమాలు అన్నీ కలిపి 67 వరకూ దర్శకత్వం వహించాడు. దర్శకుడే గాక ఈయన నిర్మాత, రచయిత, ఎడిటర్ కూడా. హిందీలో ‘లోఫర్’ తో బాటు, ‘మై చుప్ రహూంగీ’, ‘జోరూకా గులాం’, ‘రాఖీ’ వంటి పన్నెండు హిట్సే గాక, దిలీప్ కుమార్- సైరాబానూ లతో ‘గోపీ’ అనే అతిపెద్ద మ్యూజికల్  సూపర్ హిట్ కూడా ఇచ్చిన వాడు. తెలుగులో ‘మనసిచ్చిన మగువ’, ‘బంగారు మనిషి’, ‘ఒకే కుటుంబం’ లాంటి 9 సినిమాలకి దర్శకత్వం వహించాడు. 



        భీమ్ సింగ్ ‘లోఫర్’ ని మూస ఫ్యామిలీ సెంటిమెంట్లూ అంటూ చాదస్తాలకి పోకుండా, ట్రెండ్ ని బట్టి ఒక రోమాంటిక్ థ్రిల్లర్ లా కొత్తగా తీశాడు. చిన్నప్పుడే ధర్మేంద్ర స్కూల్లో ఆకతాయి కుర్రాడు. తనవల్ల ప్రమాదవశాత్తూ తోటి స్టూడెంట్ స్కూలు భవనం మీంచి పడి చనిపోతాడు. ధర్మేంద్ర రైలెక్కి బాంబే  పారిపోతాడు. అక్కడ అంకుల్ అనే గ్యాంగ్ స్టర్ కంటబడతాడు. అంకుల్ దగ్గర నేరస్థుడిగా మారిపోతాడు. అంకుల్ ప్రత్యర్ధికి ఆటంకంగా మారతాడు. దీంతో హీరోయిన్ ముంతాజ్ రంగంలో కొస్తుంది. ఈమె ఎవరు? ఇంకా తెలుగు సినిమాల్ని వదల బొమ్మాళీ అంటూ పట్టి పీడిస్తున్న ‘ఇంటి దగ్గర పెళ్లి తప్పించుకు పారిపోయిన, ముఠా వెంటబడుతున్నఅర్భక హీరోయిన్ పాత్ర’  లాంటిది మాత్రం చస్తే కాదు నీచంగా.  అంకుల్ ప్రత్యర్ధి ధర్మేంద్ర మీద నిఘా కోసం నియమించిన ఏజెంట్ ఆమె. ధర్మేంద్ర ని చంపేందుకు తగిన సమయం చూసి చెప్పాలామె. ఇదికదా యాక్టివ్ హీరోయిన్ క్యారక్టర్ అంటే? 

        చాలా మలుపులు తిరుగుతుంది ఈ కథ. ఒక పెద్ద వజ్రాల దోపిడీలోకి తిరగబెడుతుంది. ధర్మేంద్ర ని రోమాంటిక్ గా ఎంత స్పీడుగా ముంతాజ్ వెంటాడుతూంటుందో, ధర్మేంద్రని  చిన్ననాటి  రహస్యం ( స్టూడెంట్ మరణం) అంతే  కరకుగా వెన్నాడుతూంటుంది. మనిషి అన్నాక మనస్సాక్షిని చంపుకుని ఎక్కువ కాలం మనలేడు.. ఆ చనిపోయిన పిల్లాడు మరెవరి కొడుకో కాదు...

        పాడిందే పాడరా ..అన్నట్టు ఇలాగే లోఫర్లూ, డాఫర్లూ అంటూ తెలుగులో స్లమ్ డాగ్ సినిమాలు తీసుకుంటూ పోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. మన కభ్యంతరం లేదు. ఈ చాదస్తాలకి ప్రామిజింగ్ గా తెరపైకొచ్చే హీరోలు బలైపోతున్నారనేదే సమస్య. ఈ బానిస శృంఖలాల్ని వరుణ్ తేజ్ ఎంత త్వరగా తెంచుకు  బయటపడితే అంత మంచింది సెన్సిబుల్ సినిమాలతో...

-సికిందర్ 

సాంకేతికం

       
   శరవేగంగా టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు సినిమా రంగానికి ఎప్పటికప్పుడు అనేక సవాళ్ళు విసురుతున్నాయి. హోం థియేటర్లు, హెచ్ డీ స్క్రీన్లు, ఆన్ లైన్ పైరసీ మొదలైన టెక్నాలజీ పరమైన సవాళ్ళకి తోడూ సెల్ ఫోన్లలో సైతం షార్ట్ ఫిలిమ్స్ చూసుకునే సౌకర్యం ఏర్పడడంతో, ఇంకా వీడియో గేమ్స్ వంటి కాలక్షేపాలతో ప్రేక్షకులు థియేటర్ల మొహం చూడ్డం  మానేస్తున్నారు. ఇలాటి ప్రేక్షకుల్ని నిత్యం థియేటర్లకి రప్పించే ప్రయత్నాలు టెక్నాలజీ పరంగా జరుగుతూనే వున్నాయి.
తాజాగా దక్షిణ  కొరియా దిగ్గజం సామ్ సంగ్ వర్చువల్ రియాలిటీ మూవీ ప్రొజెక్షన్ ని ప్రవేశ పెట్టింది. దీంతో సినిమా చూసే అనుభవం- వూహ కందని ప్రపంచంలో మనం ఉన్నట్టుగా చూపించే అద్భుత విన్యాసంతో - అదీ థియేటర్లలో మాత్రమే అభించే అనుభవంగా మారబోతోంది.  

దక్షిణ కొరియాలో స్థానిక సినిమా నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు 3డీ,  4డీ  సినిమా ప్రదర్శనలకంటే  ఇంకా హై ఎండ్ 5 డీ  వీ ఆర్’ ( వర్చువల్ రియాలిటీ ) ప్రదర్శనలకి అప్ డేట్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఈ దృష్ట్యా వర్చువల్ రియాలిటీ ని వినూత్న ప్లాట్ ఫాం గా పరిచయం చేయదలచుకున్నామని సామ్ సంగ్ సీ ఈ ఓ  జేకే షిన్ చెప్పారు.
        అప్పుడే జియాన్ వూ- యెల్ అనే దర్శకుడు  మొట్ట మొదటి కొరియన్ వీ ఆర్ మూవీ గా టైం పారడాక్స్’  అనే షార్ట్ ఫిలిం ని రూపొందించారు. ఇది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంకా వీ ఆర్ వీడియో గేమ్స్ ని డెవలప్ చేయాలంటే చాలా ఏళ్ళు పడుతుందనీ, కానీ వీఆర్ సినిమాలు నిర్మించాలంటే చాలా తక్కువ సమయం పడుతుందనీ దర్శకుడు జేయోన్ చెప్పారు. ఈయన మరో నాల్గు వీ ఆర్ మూవీస్ పై వర్క్  చేస్తున్నారు.
     వీఆర్ టెక్నాలజీ థియేటర్ ఒనర్లని కూడా ఆకర్షిస్తోంది. దక్షిణ కొరియాలో అతిపెద్ద థియేటర్  నెట్ వర్క్ సంస్థ  సిజె- సిజివి  స్క్రీన్ ఎక్స్’  అనే సరికొత్త వెండి తెరని ఏర్పాటు చేసింది.  దీన్ని కొరియా అడ్వాన్స్ డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించింది.
        ప్రపంచంలో మొత్తం నాల్గు దేశాల్లో ఇంతవరకూ 84 స్క్రీన్ ఎక్స్ వెండి తెరలు ఏర్పాటయ్యాయి. రానున్న మాసాల్లో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. చైనాకి చెందిన అతిపెద్ద థియేటర్ల గ్రూప్ వాండా గ్రూప్’  ఈ బృహత్కార్యానికి పూనుకుంటోంది. చైనాలో వాండా సినిమా గ్రూప్, ఉత్తర అమెరికాలో ఎ ఏం సీ, ఆస్ట్రేలియాలో హైట్స్ అనే  పేర్లతో ఈ సంస్థ థియేటర్ లని  నిర్వహిస్తోంది. 2020 నాటికల్లా వెయ్యి  థియేటర్లని వీ ఆర్ థియేటర్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
      దక్షిణ కొరియాలో వీ ఆర్ ఫార్మాట్ లో కాయిన్ లాకర్ గర్ల్అనే థ్రిల్లర్ హిట్టయింది. వాండా గ్రూప్ సినిమా నిర్మాణం లో కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వీ ఆర్ ఫార్మాట్ లో  ది ఘౌల్స్’  అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించింది.
        ‘ఇళ్ళల్లో కూర్చుని సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్న కాలంలో వీ ఆర్ టెక్నాలజీ ప్రేక్షకుల్ని తప్పకుండా థియేటర్ల వైపుకు లాగుతుంది. వీ ఆర్ ఫార్మాట్ లో సినిమాలు చూస్తే  ఆ అనుభవమే వేరు. దీనికి ఇంకేదీ సాటి రాదుఅని వాండా గ్రూప్ ప్రతినిధి చెప్పారు.

-సికిందర్


17, డిసెంబర్ 2015, గురువారం

వరల్డ్ మూవీ





కొన్ని గొప్ప సినిమాలు చాలా సింపుల్ గా వుంటాయి. భారీ బడ్జెట్లు కూడా అవసరం లేదు. కానీ భారీగా ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకుని చిరకాలం ఉండిపోతాయి. చర్చకి దారితీస్తాయి. ప్రపంచంలో- ఆ మాటకొస్తే దగ్గరి సమాజంలో ఒక కదలిక తెస్తాయి. ఆలోచింపజేస్తాయి. మనిషి ఎలా వుండాలి, వుంటే ఎలా సమాజంలో కొంత చోటు లభిస్తుంది, అలా లేని మనిషికి  సమాజం ఏ విలువ ఇస్తుందీ ఇత్యాది అంశాలన్నీ ఇలాటి చిన్న చిన్న కథా చిత్రాలే దృశ్యం కట్టి చూపిస్తాయి. అలాటి  ఒక ఒంటరి స్త్రీ సంఘర్షణ ని  సమగ్రంగా  చిత్రించిందే కెనడాకి చెందిన మిలానీఅనే మూవీ. 1982 లో విడుదలైన ఈ  మూవీ ఎందరికో అభిమాన చలనచిత్రంగా ఇప్పటికీ ఇళ్లల్లో  చోటు సంపాదించుకుంటోంది డీవీడీ ల రూపంలో.

కెనడా కి చెందిన రెక్స్ బ్రామ్  ఫీల్డ్  టీవీ / మూవీ  రచయిత, దర్శకుడు. 1977 నుంచీ 2004 వరకూ లవ్ ఫస్ట్ సైట్’, ‘టులిప్స్’, ‘హోం ఈజ్ వేర్ ది హార్ట్ ఈజ్’, ‘కెఫే రోమియో’, ‘ది వైల్డ్ గయ్స్’ , ‘మిలానీఅనే ఏడు సినిమాలకి దర్శకత్వం వహించినా, ‘మిలానీతోనే గుర్తింపు పొందాడు. దీనికి ఉత్తమ దర్శకుడుగా ఒక అవార్డు కూడా పొందాడు. ఈయన సోదరులు వల్రీ బ్రామ్ ఫీల్డ్, లూయీస్ బ్రామ్ ఫీల్డ్ లు ప్రముఖ కమెడియన్లు.

ఐతే స్వయంగా రచయిత అయిన దర్శకుడు రెక్స్ బ్రామ్ ఫీల్డ్,  ‘మిలానీకి రచన చేయలేదు. మైకేల్ గ్రీన్ అనే స్క్రీన్ రైటర్ రాసిన కథ ఆకర్షించి  దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. స్క్రీన్ ప్లే కూడా తను రాయకుండా రచయితలు  రిచర్డ్ పలాక్- రాబర్ట్ గుజాలకి అప్పజెప్పాడు. ఈ కథలో ప్రధాన పాత్రలో గ్లిన్నిస్ ఓ కానర్ ని అనే నటీమణి ని తీసుకున్నాడు. ఈవిడ అమెరికన్ నటి. అతి తక్కువగా సినిమాల్లోనూ, ఎక్కువగా టీవీ సీరియల్స్ లోనూ నటించింది.  కెనడా సినిమా మిలానీలో నటించాకే పేరు సంపాదించుకుంది. మిలానీలో నటించేటప్పటికి ఈవిడ వయసు 26 ఏళ్ళు.

ఒక నిరక్షరాస్యురాలైన యువతి తన ఆరేళ్ళ కొడుకుని పొందడం కోసం పడే పాట్లే మిలానీ కథ. అవిద్య అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వుంది.  అమెరికాలోని ఆర్కాన్సాస్ లో జాస్పర్ అనే చిన్న గ్రామంలో కొడుకు టైలర్ తో నివసిస్తూ వుంటుంది మిలానీ. చదువు లేకపోవడం వల్ల భర్త సంపాదన మీద ఆధార పడుతుంది. ఆ భర్త కార్ల్ కాలిఫోర్నియాలో సైన్యం లో ఉంటాడు. అతడిదీ అంతంత మాత్రం చదువే. అతడికి కొడుకు భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆందోళన వుంటుంది. రెండేళ్లుగా అతను ఇంటికి రాలేదు. దురదృష్టవశాత్తూ తన వల్ల మిలానీ గర్భవతి కావడం వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది గానీ లేకపోతే చదువురాని ఈమెని  చేసుకునే వాడు కాదేమో. ఇప్పుడు కొడుకు ఆమెతోనే గనుక వుంటే ఆమెలాగానే నిరక్షర కుక్షి అవుతాడని భయపడుతూంటాడు. అందుకని ఒక రోజు ఇంటికి వచ్చి కొడుకుని తీసుకుని కాలిఫోర్నియా పారిపోతాడు.

చదువు లేకపోయినా మిలానీది ఎంతయినా మాతృ హృదయమే. ఆమె తల్లడిల్లి పోతుంది. కొడుకు లేకుండా క్షణం ఉండలేదు. జీవితంలో ఈ గ్రామం విడిచి ఎక్కడికీ తను వెళ్ళలేదు. వెళ్తే జనంలో కలిసి తిరిగితే ఎక్కడ తను అన్ ఎడ్యుకేటెడ్ అని తెలిసిపోతుందో నని భయం. ఇప్పుడు కొడుకు కోసం సాహసించి  ఏకంగా కాలిఫోర్నియాలాంటి అత్యాధునిక ప్రజలుండే మహానగరానికి ప్రయాణం కట్టక తప్పలేదు...

కాలిఫోర్నియాలో కష్టాలు
కాలిఫోర్నియా చేరుకున్న మిలానీ చిన్ననాటి స్నేహితురాలు రొండా ఇంటికి వెళ్తుంది. రొండా రాక్  సింగర్ అయిన రిక్ తో కలిసి ఉంటోంది. ఇతను తాగుబోతు. సింగర్ గా తన  స్థానం  కోల్పోయిన తను ఆ స్థానాన్ని తిరిగి పొందేందుకు స్ట్రగుల్ చేస్తూంటాడు. ఇతడికి వాల్టర్ అనే న్యాయవాది  సహాయ పడుతూంటాడు. మిలానీని రిక్ కి ఇతనే పరిచయం  చేస్తాడు. అదే సమయంలో ఆమె సమస్య విని సానుభూతితో సాయం చేసేందుకు ముందుకొస్తాడు. కొడుకుకోసం లీగల్  గా కోర్టులో పోరాడేందుకు సన్నాహాలు చేస్తాడు. అయితే కోర్టు నుంచి కొడుకు కస్టడీ పొందాలంటే మిలానీకి అక్షర జ్ఞానం  వుండాలని సలహా ఇస్తాడు. కొడుకుని పొందడం కోసం ఏమైనా చేయగల మిలానీ, చదువు నేర్చుకోవడం ప్రారం భిస్తుంది.

మిలానీని చూసి మొదట్లో  పల్లెటూరి బైతు అని పట్టించుకోడు రిక్. కానీ ఆమె చల్లని హృదయం చూసి దగ్గరవుతాడు. పరస్పరం తమ సమస్యల్లోంచి బయట పడేందుకు ఇద్దరూ సహకరించుకోవడం మొదలెడతారు. అక్షరాలు  నేర్చుకుని భర్త దగ్గర్నుంచి కొడుకు కస్టడీ పొందాలనుకున్న మిలానీ, ఇక అలాటి భర్త మీద ఆధారపడదాల్చుకోక,  తన కాళ్ళ మీద తను నిలబడి కెరీర్ డెవలప్ చేసుకోవాలని సమాయత్త మవుతుంది. రాయడం, చదవడం నేర్చుకుంటుంది.

ఇదే సమయంలో భర్తతో పొందలేకపోతున్న ప్రేమని రిక్ నుంచి పొందుతూ సంతృప్తిగా వుంటుంది. అయితే భర్త  కార్ల్ అనుకుంటున్నది వేరు. ఎట్టి పరిస్థితిలోనూ కొడుకుని వదులుకోకూడదన్న పట్టుదలతో ఉంటాడు. అవసరమైతే మిలానీ ని చంపెయ్యడానికీ దానికీ వెనుకాడ కూడదనుకుంటాడు. మిలానీ అందరి సహకారంతో భార్తమీద ఎలా న్యాయ పోరాటం చేసి కొడుకుని సంపాదించుకున్నదీ మిగతా కథ.

గ్లిన్నిస్  ది గ్రేట్
ఒక మాతృ హృదయపు బాధ, ఒక నిరక్షరాశ్యురాలి పోరాటం అనే రెండు పార్శ్వాలున్న మిలానీ పాత్రలో గ్లిన్నిస్ ఓ కానర్ మనల్ని చూస్తున్నంత సేపూ కదలకుండా కట్టిపడేస్తుంది. చదువు రాని వాళ్ళు  ప్రపంచంలో ఎక్కడైనా వుంటారు. మనమధ్య కూడా వుంటారు. అందువల్ల ఇది నేటివిటీ సమస్య ఉత్పన్నం కాని  సార్వజనీన పాత్ర అయ్యింది. చదువు ప్రాముఖ్యం గురించి అంతర్లీనంగా సందేశమిచ్చే దృశ్య మాధ్యమంగా కథ తోడ్పడింది.

ఈ పాత్రని అతిగా భావోద్రేక ప్రదర్శన చేస్తూ కాకుండా,  అతి సున్నిత ధోరణిలో నటించింది గిన్నిస్ ఓ కానర్. చదువురాని  స్త్రీల తత్త్వం,  ప్రవర్తనా  ఎలా ఉంటాయో కూలంకషంగా అధ్యయనం చేసినట్టే వుందామె నటన. అక్కడక్కడా కళ్ళు చెమర్చే సన్ని వేశాలతోబాటు, నవ్వించే ఘట్టాల్నీ  అలవోకగా నిర్వహించుకొచ్చింది.

ఈమె తర్వాత చెప్పుకోవాల్సింది సింగర్ గా నటించిన  బర్టన్ కమ్మింగ్స్ గురించి. అప్పట్లో ఇతను నిజజీవితంలో కెనడాలో సింగర్, కంపోజర్ కూడా. నటించిన సినిమా మాత్రం ఇదే. ఇతడి నిజ జీవిత అనుభవం ఈ సినిమాకి  బాగా ఉపయోగ పడింది. ఇందులో తను కంపోజ్ చేసి  పాడిన పాటలు కూడా వున్నాయి. పాత్ర పరంగా ఇవి అవసరమే.  చాలా వరకూ మాంటేజెస్ లో ఈ పాటలు వస్తాయి.  నటనకి కొత్తే అయినా అది బయట పడకుండా సంఘర్షణాత్మక పాత్రని పోషించాడు బర్టన్ కమ్మింగ్స్. క్లోజింగ్ టైటిల్స్ మీద  వచ్చే  యూ సేవ్డ్  మై సోల్’  అనే పాట బాగా గుర్తుండి పోతుంది మనకి.

లాయర్ వాల్టర్ గా పాల్ సాల్వినో అద్భుతంగా నటిస్తాడు. రొండా గా ట్రూడీ యంగ్ నటిస్తే, కొడుకుగా జేమీ డిక్, భర్తగా డాన్ జాన్సన్ నటించారు. అమెరికాలోని టొరంటోలో నిర్వహించే జినీ అవార్డ్స్ లో ఈ సినిమాకి  ఉత్తమ దర్శకుడి అవార్డు రెక్స్ బ్రామ్  ఫీల్డ్ పొందితే , ఉత్తమ విదేశీ నటి అవార్డు ని గ్లిన్నిస్ ఓ కానర్ సొంతం చేసుకుంది. అలాగే  ‘యూ సేవ్డ్  మై సోల్నే పాటకి ఉత్తమ గాయక- సంగీత దర్శకుడి అవార్డుని బర్టన్ కమ్మింగ్స్ పొందాడు. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్  ప్లే రచయితలుగా  రిచర్డ్ పలాక్- రాబర్ట్ గుజా అవార్డు పొందారు గానీ అది వెనక్కి వెళ్ళిపోయింది. అడాప్టెడ్ స్క్రీన్  ప్లే కి వీళ్ళు  తీసుకున్న మైకేల్ గ్రీన్ రాసిన కథ ప్రచురితం కాలేదు కాబట్టి, అవార్డుకి అర్హం కాదని కమిటీ వెనక్కి తీసుకుంది.

కేవలం నాల్గు మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మించిన మిలానీ’  చిన్న సినిమాగా పెద్ద ప్రభావం చూపింది అప్పట్లో. చూస్తే ఇప్పటికీ దీనికి కాలదోషం పట్టలేదని తెలుస్తుంది.


-సికిందర్