రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, మార్చి 2015, సోమవారం

స్ట్రక్చర్ -4


సినాప్సిస్ తో మొదటే స్పష్టత!
తెలుగు సినిమా స్క్రీన్ ప్లే




డియాని విస్తరిస్తే సినాప్సిస్. దీన్నే అవుట్ లైన్ అనొచ్చు. నిజానికి ఈ సినాప్సిస్   హీరోకో, నిర్మాతకో పరిశీలనార్ధం పంపుకోవడం కోసం కాదు. అది హలీవుడ్ పద్ధతి. అక్కడ నిర్మాతలు, స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు మొదటే సినాప్సిస్ అడుగుతారు. వీళ్ళకంటే ముందు లిటరరీ ఏజెంట్ అడుగుతాడు. ఇతను నిర్మాతలకీ లేదా స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకీ,  రచయిత/దర్శకుడు తరపున మధ్యవర్తిగా ఉంటాడు. రచయిత/దర్శకుడు అందించిన సినాప్సిస్ ని ఆయా నిర్మాతలకి లేదా స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకి చూపిస్తాడు. అది ఆసక్తి కలిగిస్తే అప్పుడు వాళ్ళు స్క్రీన్ ప్లే అడగొచ్చు.  

       సినాప్సిస్ అంటే కథా సంగ్రహం లేదా క్లుప్తంగా కథ.  దీని రచనకి హాలీవుడ్ లో కొన్ని మార్గదర్శకాలున్నాయి. సినాప్సిస్ ఏ -4 సైజు పేజీల్లో వుండాలి. ఒక పేజీకి మించి వుంటే డబుల్ స్పేస్ లో, ఒక పేజీ మాత్రమే  వుంటే సింగిల్ స్పేస్ లో టైపు చేయాల్సి వుంటుంది. లెఫ్ట్ ఎలైన్ మెంట్  వుండాలి. వర్డ్ డీ ఫాల్ట్ మార్జిన్స్ ని మార్చకూడదు. పేరాలో మొదటి లైను అర ఇంచు ఇండెంట్ వుండాలి. ఫాంట్  టైమ్స్ న్యూ రోమన్ 12 పాయింట్ ఉండాలి. పాత్రల పేర్లు మొదటిసారి  ప్రస్తావించినప్పుడు వాటిని కేపిటల్ లెటర్స్ లో ఉంచాలి. పేజీ నంబర్లు హెడర్ కుడివైపు వేయాలి. సినాప్సిస్ అని టైటిల్ కింద డబుల్ స్పేస్ ఇచ్చి టైప్ చేయాలి. దీనికింద నాల్గు స్పేస్ లిచ్చి సినాప్సిస్ ని టైప్ చేయాలి. ఇలా ఇంకా చాలా నిర్దుష్ట  సాంకేతికాంశాలతో ముడిపడి వుంటుంది వ్యవహారం. స్క్రీన్ ప్లే స్క్రిప్టుకి కూడా ఇలాటి మార్గదర్శకాలు అనేకం వుంటాయి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా ఆ స్క్రీన్ ప్లేని, లేదా సినాప్సిస్ నీ అవెంత బాగున్నా మొదటే తిప్పికొట్టేస్తారు. వాటి కర్తని హీనంగా చూస్తారు.

         ఈ మార్గ దర్శకాలకి లోబడి సినాప్సిస్ పాఠాన్ని ఆకట్టుకునేలా రాయగల్గాలి. ఇది సొంత నైపుణ్యం మీద ఆధారపడుతుంది. దీనికి మార్గదర్శకాలు లేకున్నా, వివిధ స్క్రీన్ ప్లే కోర్సుల సంస్థలు సినాప్సిస్ రాయడంలో కూడా శిక్షణ నిస్తాయి. 12 అంశాలు ఆ కథా సంగ్రహంలో ప్రతిబింబించాలి. ప్రధాన పాత్ర పరిచయంతో బాటు దాని రోజువారీ జీవితం, ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్య, ఆ సమస్యతో సంఘర్షణ, పరిష్కారం కోసం వెతుకులాట, ఓ మినీ పరిష్కర మార్గం తో కొత్త ప్రయత్నం – ఓటమి, ఓటమిలోంచి కొత్త మార్గం, ఇక వెనక్కి రాలేని సంక్లిష్ట పరిస్థితి, నిరాశా నిస్పృహలు, మళ్ళీ కొత్త పరిష్కార మార్గం, దాంతో ముగింపు దిశగా అంతిమ పోరాటం, ముగింపూ.

       అన్ని పాత్రల్నీ ప్రస్తావించ కూడదు, మలుపుల గురించీ ఎక్కువ వివరాలు ఇవ్వకూడదు. అనవసర వర్ణనలు, వివరణలు ఉండరాదు. మొదటి పేరాలోనే మొదటి మలుపు వుండాలి. ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్యలో  తికమక వుండకూడదు,  ప్రధాన పాత్ర పఠిత కి కనెక్ట్ అవగల్గాలి. సినాప్సిస్ లో ఫీలింగ్, ఎమోషన్ వ్యక్తమవాలి...ఇలా ఎన్నో!

ఇక్కడి అవసరం వేరు!
        అక్కడ వ్రాతపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఈ రూల్సు. ఇక్కడ మౌఖికంగా నిర్మాతకి లేదా దర్శకుడికి కథ చెప్పాలి కాబట్టి వాళ్ళ కోసం సినాప్సిస్ రాసి పెట్టుకో నవసరం లేదు. సొంత అవసరాల కోసమే రాసుకోవాలి.  అనుభవజ్ఞులైన దర్శకులకి, రచయితలకి దీని అవసరముండక పోవచ్చు.  అనుభవజ్ఞులు నేరుగా వన్ లైన్ ఆర్డర్ లోకి వెళ్ళిపోగలరు. ఔత్సాహికులకి, దర్శకత్వ శాఖలో అంతగా అనుభవం లేని,  లేదా అసలు సినిమా రచయితగా / దర్శకుడుగా ఏ అనుభవమూ లేకుండా సినిమా రచయిత/ దర్శకుడు  కాగోరే అభ్యర్దులకి, సినాప్సిస్ అనే టూల్ ఎంతో ఉపయోగపడుతుంది. కొందరు గొప్ప దర్శకుల సినిమాలు చూస్తే, ఇలా నేరుగా వన్ లైన్ ఆర్డర్ లోకి వెళ్ళకుండా ముందుగా  సినాప్సిస్ రాసుకుని వుంటే, సినిమా ఇంత అభాసు అయ్యేది కాదేమో అన్పించే సందర్భాలు కూడా అనేకం. ఎందుకంటే, అనుభవమున్నంత మాత్రాన నేరుగా వన్ లైన్ ఆర్డర్ వేయగల సమర్ధులు  కావాలని లేదు. చాలా తరచుగా వీళ్ళ సినిమాలు ఫస్టాఫ్ కథ ఒకటీ, దారితప్పి సెకండాఫ్ లో నడిపించిన  కథ మరొకటిగా సౌష్టవం, సమగ్రత లనేవి లేకుండా తేలడం చూస్తూంటాం. ఇలాటి మొత్తం అనుకున్న కథకి మొదటే సినాప్సిస్ రాసుకుని చదువుకుంటే, మెదడుకి చాలా బ్రేకులు పడుతూంటాయి. అంటే ఆ కథ అతుకుల బొంతలా ఉందని మొదటే అర్ధమౌతుందన్న మాట. ఈ సంగతి నేరుగా వన్ లైన్ ఆర్డర్ కి వెళ్తే అందరికీ అర్ధమవాలని లేదు.

         వన్ లైన్ ఆర్డర్ అంటే ఏ సీను తర్వాత ఏ సీను వస్తుందో  నెంబర్లు వేసుకుంటూ ఒకటి రెండు లైన్లలో రాసుకోవడం. సినాప్సిస్ లేకుండా ఒక ఐడియాని మెదడులోనే కథగా ఊహించుకుని (విస్తరించుకుని), వన్ లైన్ ఆర్డర్ వేయగలిగే సామర్ధ్యం ఒక్క దర్శకుడుకి ఉంటే  సరిపోదు. అతను రాయించుకునే రచయితలకీ వుండాలి. ఒక సీనియర్ దర్శకుడు ఓపిగ్గా పెద్ద నోటు పుస్తకంలోనే నెలల తరబడి రాసుకున్న కథని చదువుకోండని రచయితల కిస్తారు. ఇదెంతో హాయైన పని. ఇంకో దర్శకుడు రచయితలు కథ చెప్పడానికొస్తే వినరు, సినాప్సిస్ రాసిమ్మంటారు. హిందీలో స్వర్గీయులు రాజ్ కపూర్- కె. ఎ. అబ్బాస్ ల వ్యవహార శైలి ఇంకా భిన్నంగా వుండేది. అబ్బాస్ మొత్తం కథని ఒక నవలగా 200 పేజీలు రాసుకొచ్చేవారు. రాజ్ కపూర్ దాన్ని పవిత్ర గ్రంధంలా తలమీద పెట్టుకు వెళ్లి, పూజ చేసి, దాంతో వచ్చి గట్టి ఉఛ్ఛారణతో ఏకధాటిగా మొత్తమంతా చదివేసే వారు. అప్పుడే  దాని మీద చర్చ ప్రారంభించే వారు.

      పై మూడు ఉదాహరణల్లో ఒక సామాన్యాంశం వుంది. ఇవన్నీ ముందుజాగ్రత్తగా కథకి అత్యంత ప్రధానమైన నిర్మాణ సౌష్టవాన్నీ, సమగ్రతనీ డిమాండ్ చేస్తున్నాయి. ఏదైనా రాస్తేనే స్పష్టత రావడమే గాక సమగ్ర రూపాన్ని సంతరించుకుంటుంది. ఒక ఐడియాని ఊహల్లోనే మొత్తం కథగా విస్తరించుకుని, ఆ పైన వన్ లైన్ ఆర్డర్ వేసుకు పోతే అది ముక్కలు ముక్కలు గా వచ్చే అవకాశముంది. ఊహల్లో చాలా వాటికి  స్పష్టత వుండదు. పైగా ఊహలు అతిశయోక్తులతో కూడుకుని వుంటాయి. ఆలోచననలతో బోధపడని కొన్ని విషయాలు, ఆచరణ సాధ్యం కాని  అతిశయోక్తులు రాసుకుంటూ పోతే తెలిసిపోతాయి. మెదడు పని చేసే విధానమే అలా వుంటుంది. దాని భావాలకి/ఆలోచనలకి భౌతిక రూపం ఏర్పడుతూ వుంటే, దాన్ని పట్టుకుని అది లంకె లేసుకుంటూ ముందు కెళ్ళి పోతుంది. చెక్కుతున్న శిల్పంలో ఎక్కడెక్కడ సౌష్టవం తాలూకు ఎగుడు దిగుళ్ళున్నా అన్నీ కవర్ అయిపోతాయి.

ఏమనాలి?
       ఒక అసోషియేటో, కో –డైరెక్టరో దర్శకుడు అవాలని కథ తయారు చేసుకున్నారను కుందాం. అది వన్ లైన్ ఆర్డర్ లోనే  వుంటుంది. అదేమిటో ఐదు నిమిషాల్లో చెప్పమంటే చెప్పలేని వాళ్ళే ఎక్కువ మంది వుంటున్నారు. గంట చెప్తాం, గంటన్నర చెప్తాం అంటారు. ఇలాటి ఇద్దరు ముగ్గురు గత పదేళ్లుగా ఒకటి రిజెక్ట్ అయితే ఇంకోటి తయారు చేసుకుని పదేపదే నిర్మాతల దగ్గర విఫలమౌతోంటే, అసలు సంగతేమిటా అని ఈ వ్యాసకర్త ఒకసారి స్వయంగా వెళ్లి చూస్తే, వాళ్ళు నిర్మాతలకి కథ విన్పించడం  లేదు. షాట్లు చెప్పి తలపోటు తెప్పిస్తున్నారు. చాలా షాకింగ్ సీన్!

     పరిస్థితి అర్ధమైపోయి, వాళ్ళని ఆపి ఐదు నిమిషాల్లో కథేమిటో చెప్పేస్తే, ‘ఇలా వీళ్ళెందుకు చెప్పరు?’ అని నిర్మాతల ఆవేదన. ఎందుకు చెప్పరంటే,  వాళ్ళకి అప్పుడే ప్రాజెక్టు ఓకే అయిపోయిందని అనుకుంటున్నారు, అందుకే రేపటి షూటింగుకి ఇప్పుడే షాట్స్ డిస్కషన్స్  చేస్తున్నారు మరి !
      అగ్ర దర్శకుల దగ్గర, అగ్ర హీరోల సినిమాలకి కో-డైరెక్టర్ గా అనుభవం సంపాదించిన ఒకరు దీటైన నేరేషన్ పవర్ తో, అవసరమైన చోట్ల ఫలానా ఫలానా కెమెరాలు, లైటింగ్ ఎఫెక్ట్స్ తో షాట్స్ ని బిల్డప్ చేస్తూ కళ్ళముందు సినిమా చూపించేస్తూ కథ చెప్పేస్తారు. ఇది పతాకస్థాయి విజువల్ నేరేషన్. ఇంత కాకపోయినా కనీసం నాటకీయంగా విజువల్ నేరేషన్ ఇవ్వగలిగితే చాలు. కానీ విచారకరంగా ఇది కూడా జరగడం లేదు.

     మహాకవి, సినిమా రచయిత స్వర్గీయ ఆరుద్ర దర్శకుడేం కాదు. కానీ ఆయన కృష్ణ నటించిన సూపర్ హిట్  కౌబాయ్ అడ్వెంచర్ ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్క్రిప్ట్ రాసిచ్చిన తర్వాత, దానికి ముగ్ధులైన నిర్మాతలు ఆయన్నే దర్శకత్వం వహించమని పట్టుబట్టారు. ఆయన తిరస్కరించారు, అది వేరే విషయం. రాయగల, రాసుకోగల సామర్ధ్యానికి ఇంతటి  మన్నన వుంటుందన్న మాట.

       షాట్స్ తో కథ చెప్పడం, లైన్ ఆర్డర్ తో కథ చెప్పడం ఇవన్నీ కథ మీద పట్టు లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. లైన్ ఆర్డర్ తో మాత్రమే  కథ చెప్పగలరు కాబట్టే గంట, గంటన్నర చెప్తా మంటారు. ఒక సినిమా చూసొచ్చి మనం కథెలా చెప్తాం? షాట్సో, వన్ లైన్ ఆర్డరో చెప్పం కదా? సినిమా రివ్యూలు చదువుతూంటాం. వాటిలో టూకీగా కథనెలా పరిచయం చేస్తారు? ఆ మాత్రంగానైనా  చూసిన ఒక సినిమా కథ చెప్పమంటే కూడా చెప్పలేని వాళ్ళు దర్శకత్వాల మీద మోజు పెంచుకుంటున్నారు. మరొక బలహీనత ఏమిటంటే, తమ సొంత కథని తప్ప, ఇతరుల కథల్ని విని అర్ధం చేసుకోలేకపోవడం. కానీ ఇతర సినిమాలు చూస్తే వాటిలోని ఆ ఇతరుల కథల్నే తిరిగి చెప్పలేకపోయినా, చక్కగా అర్ధం చేసుకోగల్గడం. అంటే ఇతరుల కథలు తెర మీద విజువల్ గా చూసినప్పుడు మాత్రమే  అర్ధమౌతున్నాయన్న మాట.  మళ్ళీ అదే తమ సొంత కథల్ని విజువల్ గా చెప్పలేక పోతారు. ఇలా అనుకుంటే పూర్వకాలంలో ఆ దర్శకులు ఇతరుల కథల్నీ, నవలల్నీ ‘ఓన్’ చేసుకుని ఎలా అన్నేసి విజయవంతమైన సినిమాలు తీయగలిగారో! కనుక ఇంత గందరగోళ వాతావరణంలో ఇప్పుడు మెజారిటీ సంఖ్యలో టాలీవుడ్ లో కథలు తయారు తున్నాయి. పద్ధతి ఇది కాదని చెప్పినా విన్పించుకోని వాళ్ళు అలాగే ముందు కెళ్ళి,  ఆ ఒక్క సినిమాతో  దర్శకులన్పించుకుని, నిర్మాతల్ని ముంచేసి, మళ్ళీ సినిమా అవకాశం రాక అక్కడితో ఆగిపోతున్నారు.

     మరి కొందరికి స్క్రీన్ ప్లే పుస్తకాల వ్యసనం వుంటోంది.  డబ్బు వృధా చేస్తూ పుస్తకాల మీద పుస్తకాలు  కొంటూంటారు. వాటిని చదివి ఏదీ అర్ధం చేసుకోరు. ముందు  బేసిక్స్ చదువుకుని, కథ తయారు చేసుకోవడం తెలుసుకుంటే, ఆ తర్వాత వివిధ కోణాల్లో క్రియేటివ్ ప్రక్రియల కోసం సవాలక్ష హయ్యర్ స్టడీస్ కి వెళ్ళవచ్చు. బేసిక్సే అర్ధం గానప్పుడు జేమ్స్ బానెట్ ని చదివి ఏం లాభం. ఈ చదవడాలతోనే కాలం గడిపేస్తూ అసలు పని ఎప్పుడు ప్రారంభిస్తారు. ఇంత చదువుతున్నారు కదాని ఓ వంద పేజీల సింపుల్ లవ్ స్టోరీ గల ఇంగ్లీష్ నవల ఇచ్చి వన్ లైన్ ఆర్డర్ వేసుకు రమ్మంటే- ఆ నవలతో పాటూ ఇంకెప్పుడూ కన్పించకుండా అంతర్ధానమైపోతే ఏమనాలి?

ఇంత  చేస్తుంది సినాప్సిస్!
       వన్ లైన్ ఆర్డర్ తోనే  ఒకటి కాదు, నాలుగు గంటలు కథ చెప్పినా, దానికీ ఓ పద్ధతుంటుంది. మొదట్లో చెప్పుకున్న హాలీవుడ్ సినాప్సిస్ రచనలో మొట్టమొదట ప్రధాన పాత్రని  పరిచయం చేసి, దాని రోజువారీ జీవితం గురించి చెప్పాలని ఎందుకన్నారు? కథ అలా ప్రారంభిస్తేనే ఒక ఫ్లో ఉంటుందనే కదా? అలా కాకుండా హీరో పాత్ర ఎవరో ఏమిటో, ఏం చేస్తూంటాడో, ఇతర ముఖ్య పాత్రలతో సంబంధా లేమిటో చెప్పకుండా, మొత్తం కథ ని బ్యాక్ డ్రాప్ లో పెట్టి  చెప్పడం ప్రారంభించకుండా, నేరుగా వన్ లైన్ ఆర్డర్ చెప్పేస్తూంటే ఏమర్ధమౌతుంది? ఆ మాటకొస్తే, ఈ బ్యాక్ డ్రాప్ కంటే ముందు మూడు ముక్కల్లో కథ పాయింటేమిటో చెప్పి అప్పుడు కథలోకి వెళ్తే శ్రోతకి ఎంత సౌకర్యంగా వుంటుంది? ఆ పాయింటు ప్రకారం కథ వెళ్తోందా లేదా  అని అతను ఆద్యంతం ఇన్వాల్వ్ మెంట్ తో  వినే అవకాశముంటుంది. 

    ఈ నేరేషన్ లోపలన్నిటికీ, ఆ పైన సినిమా  తీస్తే అది అట్టర్ ఫ్లాపవడానికీ మూలకారణం తమ కథేమిటో తమకి తెలియకపోవడం వల్లే. రాసుకున్న వందల పేజీల స్క్రిప్టుని ఐదు నిమిషాల్లో టూకీగా బలంగా చెప్పలేక పోవడం వల్లే. అంటే ఓ నాలుగు పేజీల సినాప్సిస్ తో మొట్ట మొదట కసరత్తు చేయకపోవడం వల్లే. వేసుకున్న వన్ లైన్ ఆర్డర్ లో ఏది బిగినింగ్, ఏది మిడిల్, ఎక్కడ్నించీ ఎండ్ చెప్పలేకపోతున్నారంటే, ఓ వెయ్యి పదాల సినాప్సిస్ తో కసరత్తు చేయకపోవడం వల్లే. మొత్తం కథకి స్ట్రక్చర్ లేదంటే, సినాప్సిస్ తయారీకి ఓ రెండు గంటలు శ్రమ చేయక పోవడం వల్లే.

      స్ట్రక్చర్ !

      ఎటుతిరిగీ ఇక్కడికే వస్తాం. ఐడియాలో స్ట్రక్చర్, లాగ్ లైన్ లో స్ట్రక్చర్, సినాప్సిస్ లో స్ట్రక్చర్!

      సినాప్సిస్ లో స్ట్రక్చర్ అంటే వన్ లైన్ ఆర్డర్ నుంచి మొదలెట్టి అంతిమంగా డైలాగ్  వెర్షన్ దాకా అవి చెదిరిపోకుండా లంగరేసి వుంచడం. సినిమా కథ  తయారు చేసుకోవడానికి సినాప్సిస్ ని మించిన బ్లూ ప్రింట్ లేదు. రూట్ మ్యాప్ లేదు. ఒక సర్టిఫికేట్ లేదు.

       ఇటీవల ఒక కథకి ఒక దర్శకుడితో కలిసి వేసిన లైన్ ఆర్డర్ గ్రూప్ డిస్కషన్స్ లో సవ్యంగా రాలేదన్పించి, అదే వన్ లైన్ ఆర్డర్ ని పెట్టుకుని సినాప్సిస్ రాసుకుంటూ పోతూంటే అన్ని లోపాలూ తొలగిపోయి, కొత్త డైనమిక్స్ తో, కొన్నిసీన్లు కూడా మారిపోయి, ఒక ఎడతెగని ఫ్లోతో సమగ్ర కథ తయారయ్యింది. అంతే కాదు,  ఆ వన్ లైన్ ఆర్డర్ ప్రారంభంలో హీరో గోల్ కి సంబంధించి పీడిస్తున్న అదేమిటో అర్ధంగాని అంతుచిక్కని అస్పష్టత కూడా (ఇది దర్శకుడూ ఆ యన గ్రూపూ అప్పటికింకా  పసిగట్టలేదు),  సినాప్సిస్ రాస్తూంటే, చిట్ట చివర పక్క పాత్ర ఒకటి అనే విధంగా యాదృచ్చికంగా రాసేసిన ఒక డైలాగుతో తీరిపోయింది! దాంతో ఆ డైలాగు పట్టుకుని మొదటి కొచ్చి,  హీరో  గోల్ తాలూకు ఆ ప్రకటనని ఆ మేరకు సవరిస్తే, అప్పుడు ఆ ప్రకటనకీ అతను చేసుకుపోతున్న పన్లకీ ఒక అర్ధం పర్ధం వున్న లింకు ఏర్పడింది. ఇంతకి ముందు చెప్పుకున్నట్టు ఒక ఫ్లోలో రాసుకుంటూ పోతేనే ఏదైనా క్లారిటీ వస్తుంది.  ఫలితంగా ఈ ముప్పై మూడు పేజీల సినాప్సిస్ నే దర్శకుడు ఫైనల్ కథగా డిక్లేర్ చేస్తే, దీని ఆధారంగా ఈసారి  అర్ధవంతమైన వన్ లైన్ ఆర్డర్ వేయడం మొదలు!

      ఇంత చేస్తుందన్నమాట  సినాప్సిస్!

      ఇంకో చోట సినాప్సిస్ ఇంకో రూపంలో వుంది. ఆ దర్శకుడితో కొంతకాలం అగ్ర హీరోకి కథ కోసం కసరత్తులు జరిగి (ఇక్కడ ఈయన గ్రూపు లేదు) చివరికి ఇప్పట్లో ఆ అగ్ర హీరో అందుబాటులో లేకపోవడంతో, ఓ థ్రిల్లర్ ఐడియా మీద వర్క్ ప్రారంభించాం. దానికి ఒక లైను మీద అంగీకారాని కొచ్చి రికార్డింగ్ చేసుకున్నాక, సింగిల్ హేండెడ్ గా ఆర్డర్ వేసేయమన్నారు. ఆ సబ్జెక్ట్ మీద కొంత రీసెర్చి చేసి, ఆ రికార్డింగ్ ఆధారంగా ఆర్డర్ వేస్తూంటే వారం రోజుల్లో అంతకంటే బెటర్ గా, అనూహ్యంగా తయారయ్యింది మొత్తం కథ. క్లైమాక్స్ కూడా మారిపోయింది. ఈ నేరేషన్ ని విని థ్రిల్లయిన ఆయన నిర్మాతల వేటలో పడ్డారు. ఇక్కడ సినాప్సిస్ ఆ రికార్డింగే. ఒకోసారి          సినాప్సిస్ కంటే వన్ లైన్ ఆర్డర్ బెటర్ గా రావచ్చని చెప్పేందుకే ఇది..ఐతే వన్ లైన్ ఆర్డర్ ని బేస్ చేసుకోవడానికి సినాప్సిస్ అంటూ ఒకటి వుండి తీరాలి.

      నిజానికి ఇలాటి విషయలు వెల్లడించ కూడదు. ప్రాక్టికల్ గా ఏం జరగవచ్చో చెప్పడానికి మాత్రమే మచ్చుకి పై రెండు ఉదంతాల్ని ప్రస్తావించక తప్పలేదు.  

      ఇంతకీ సినాప్సిస్ ఎలా వుంటుంది?  దీన్నెలా రాయాలి?

ఇదిగో ప్రయోజనం!
        ఓసారి ఈ కింద రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినాప్సిస్ ని చూద్దాం :

      ఓ కాలేజీ ఎదుట అనుచరులతో ఎదురుచూస్తున్న గణేష్, జేడీ  సైగతో ఓ విద్యార్థిని హత మారుస్తాడు.

    జేడీ ఒక విద్యార్థి నాయకుడు. కాలేజీ లో ఎదురు లేని వాడు. ఆ కాలేజీ స్టూడెంట్ యూనియన్ కి ఏకపక్ష ప్రెసిడెంట్. గణేష్ ద్వారా జేడీ కి ఆ ప్రాంతం మీద గుత్తాధిపత్యం చె లాయిస్తున్న భవానీ అనే పెద్ద గూండాతో పరిచయం ఉంటుంది. ఇలా విద్యార్థులతో ఏర్పడిన  ఈ సంబంధంతోనే, మాచిరాజు అనే రాజకీయనాయకుడి నేర కార్యకలాపాలకి విద్యార్థులని ఉపయోగించుకుంటూ, మాచిరాజుకి వెన్నుదన్నుగా ఉంటాడు భవానీ.

     ఈ కాలేజీలోనే స్టూడెంట్ గా చేరతాడు శివ. అక్కడ మల్లి అనే విద్యార్ధి తో, ఆశా అనే ఇంకో విద్యార్థినితో స్నేహం పెంచుకుంటాడు.  అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, లెక్చరర్లని అవమానపరచడం వంటి పన్లతో అల్లరి చేస్తున్న జేడీకి శివ తారసపడతాడు. మొదటిసారి స్నేహితులు చెప్పారని జేడీ ని క్షమించినా, మళ్ళీ ఈసారి ఆశా తో మిస్ బిహేవ్ చేయడంతో, రెచ్చిపోయిన శివ సైకిలు చైను లాగి, జేడీ నీ అతడి గ్యాంగునీ చితగ్గొట్టేస్తాడు. అన్నాళ్ళూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జేడీ, ఈ శివ తెగింపు చూసి నిశ్చేష్టుడౌతాడు.

      ఈ అనూహ్య సంఘటన మరో రెండు పర్యవసానాలకి దారి తీస్తుంది. మొదటిది జేడీ గణేశ్ ని రంగంలోకి దింపడం, రెండోది స్నేహితులు శివని ఎన్నికల్లో నిలబడమని ప్రోత్సహించడం. కానీ శివ తనకంటే అర్హత వున్న జగన్ ని ఎన్నికల్లో నిలబెట్టమని కోరతాడు. శివ చేస్తున్న ఈ ప్రయత్నాల్ని ఆపమని కోరతాడు గణేష్.  మా కాలేజీ వ్యవహారాల్లో వీధి రౌడీల జోక్యం అనవససరమని అంటాడు శివ.

     గణేశ్ బెదిరించే ప్రయత్నం చేస్తాడు. శివ అతడికీ దేహశుద్ధి చేస్తాడు. దీంతో వ్యవహారం ముదిరి భవానీ దాకా వెళుతుంది. భవానీ మొదట ఆగ్రహించినా, తర్వాత జేడీ కంటే శివయే తనకి బాగా పనికొస్తాడని గ్రహిస్తాడు. అలా పథకం ప్రకారం భవానీ జగన్ ని హతమారుస్తాడు. ఇక తప్పక శివ ఎన్నికల్లో నిలబడతాడు.

     కార్మిక నాయకుడు కృష్ణారెడ్డి ని భవానీ మోసం చేయడంతో అతను శివ పంచన చేరతాడు. మరో పక్క తనని ప్రేమిస్తున్న ఆశా నే శివ పెళ్లి చేసుకుంటాడు. ఇక భవానీ శివ మీద దాడులు ప్రారంభిస్తాడు. శివ వాటిని తిప్పికొట్టడంతో బాటు భవానీ గ్యాంగుని తన వైపు తిప్పుకుంటాడు. దీంతో మాచిరాజు కూడా భవానీ కి దూరమౌతాడు.

      దెబ్బతిన్న భవానీ శివ ఇంటి మీద దాడి చేస్తాడు. దీంతో అంతిమ పోరాటం మొదలై భవానీని వధించి, నగరానికి  దుష్టుడి పీడా వదిలిస్తాడు శివ. ఈ పోరాటంలో తన అన్న కుమార్తెని పోగొట్టుకుంటాడు.

      ఇదీ విషయం!

      ఇలా సినాప్సిస్ రాసుకుంటే, ఇందులో స్ట్రక్చర్ కన్పిస్తుంది. అంటే బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు వుంటాయి. పై పాఠం మొదటి మూడు పేరాలూ బిగినింగ్ ని సూచిస్తే, నాల్గు నుంచీ ఏడవ పేరా వరకూ మిడిల్ నీ, చివరి పేరా ఎండ్ నీ సూచిస్తాయి. మొదటి మూడు పేరాల్లో బిగినింగ్ తాలూకు సమస్య ఏర్పాటయింది. తర్వాతి మూడు పేరాల్లో మిడిల్ తాలూకు సంఘర్షణ ప్రారంభమయ్యింది, చివరి పేరాలో ఎండ్ తాలూకు పరిష్కారం చెప్పడం జరిగింది.

       వేటికవి ఈ మూడు విభాగాల్లో కథ కుదిరే వరకూ కసరత్తు చేయాల్సిందే. ఎవరి కథని బట్టి వాళ్ళు ఏఏ అంశాల్ని, సంఘటనల్నీ కూర్చితే ఆయా  మలుపులకి దారి తీస్తాయో వాటిని కనిపెట్టాల్సిందే. పై సినాప్సిస్ మొదటి మూడు పేరాల్లో బిగినింగ్ విభాగం సూత్ర ప్రకారం ఎలా ఏర్పాటయ్యిందంటే-
1. ప్రథాన పాత్రని, ఇతర ముఖ్య పాత్రల్ని పరిచయం చేసి, కథా నేపధ్యాన్ని సృష్టించడం
2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే  శక్తుల్ని చూపడం
3. సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన
4. సమస్య ఏర్పాటు.

      యాక్షన్, కామెడీ, ట్రాజెడీ, ఫ్యామిలీ, రోమాన్స్, థ్రిల్లర్, హార్రర్, జానపదం, పౌరాణికం- ఏ తరహా సినిమా కథకైనా బిగినింగ్ విభాగపు పరిధిని గుర్తించి చూస్తే,  పై నాలుగు అంశాలు ఆధారంగానే కథనం వుంటుంది.

      అలాగే  ‘శివ’ సినాప్సిస్ లోనూ  వుంది-

1. ప్రధాన పాత్ర శివతో పాటు, హీరోయిన్ ఆశానీ, ఇతర ఫ్రెండ్స్ పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ తో పాటు అతడి తాలూకు జేడీ,గణేష్, మాచిరాజు పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ పడగ నీడలో కాలేజీ వాతావరణం వున్నట్టు కథా నేపధ్యాన్ని సృష్టించడం...
2. ప్రధాన పాత్ర శివకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే శక్తులుగా  జేడీ, గణేష్ లని చూపడం
3.  జేడీ చేష్టలతో శివకి సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన
4.  సైకిల్ చైన్ లాగి జేడీ మీద తిరగబడ్డంతో శివకి భవానీతో సమస్య ఏర్పాటు అవడం
ఈవిధంగా బిగినింగ్  విభాగం స్పష్టమౌతోంది సినాప్సిస్ లో.

      ఇక మిడిల్ కొస్తే-

      మిడిల్ అనేది ప్రధాన పాత్రకి సమస్యతో పోరాటాన్ని ఎస్టాబ్లిష్  చేస్తుంది. ఈ సమస్య ఒక పరిస్థితి కావొచ్చు, లేదా భౌతికంగా ప్రత్యర్ధి పాత్ర కావొచ్చు.  ప్రధాన పాత్ర- వ్యతిరేక శక్తి పరస్పరం  పై చేయి సాధించడానికి యాక్షన్ –రియాక్షన్ గా సంఘర్షించుకుంటాయి. . ప్రధాన పాత్రకి ఒకోసారి పై చేయీ అంతలోనే ఓటమీ జరుగుతూ వచ్చి, ఒకానొక దశలో తీవ్ర నష్టానికి గురవుతుంది. ఈ నష్టంలోంచి ఫైనల్ గా ఓ పరిష్కార మార్గం తడుతుంది. ఇక్కడితో మిడిల్ ముగుస్తుంది.

       ‘శివ’ సినాప్సిస్ లో ఇదంతా చూడొచ్చు :

       శివ జేడీ ని కొట్టడంతో ఏర్పడిన పరిణామాలు అతణ్ణి భావానీతో పోరాటానికి సిద్ధం చేశాయి. భావానీయే సమస్య. దెబ్బలు తిన్న జేడీ గణేష్ ని రంగం లోకి దింపడం, గణేష్ ఎన్నికల్లో నిలబడొద్దని శివని బెదిరించడం, శివ అతణ్ణీ కొట్టడం, దీంతో భవానీ రంగంలోకి రావడం, తన ప్రయోజనం కోసం జగన్ ని చంపి శివాని ఎన్నికల్లో నిలబడక తప్పని పరిస్థితి కల్పించడం, గెలిచిన శివతో ప్రయోజనం నెరవేరక పోగా, తన అనుంగుడు కృష్ణా రెడ్డి శివ పంచన చేరడం, వ్యతిరేక మాఫియా గా ఎదిగిన శివ ఆశా  ని పెళ్లి చేసుకోవడం, శివ మీద భవానీ దాడులు మొదలెట్టడం, శివ ప్రతిదాడులు చేయడం, భవానీ గ్యాంగునే తన వైపు తిప్పుకోవడం, దీంతో మాచిరాజు కూడా భవానీకి దూరమై భవానీ ఇరుకున పడ్డమూ జరిగాయి..

      ఇలా మిడిల్ కి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఏర్పాటయ్యింది సినాప్సిస్ లో.

     ఎండ్ కొస్తే-

     మిడిల్ ముగింపులో ప్రధాన పాత్రకి ఫైనల్ గా అందే పరిష్కార మార్గం తో ఎండ్ విభాగం ప్రారంభమౌతుంది. ఇక వ్యతిరేక శక్తి పూర్తిగా ఆత్మ రక్షణలో పడుతుంది. అది కూడా ఫైనల్ గా తీవ్ర చర్యకి పాల్పడుతుంది. దీన్ని ఓర్చుకుంటూ ప్రధాన పాత్ర ఆ వ్యతిరేక శక్తిని శాశ్వతంగా అణిచి వేసి కథ ముగిస్తుంది.

    ‘శివ’ సినాప్సిస్ లో –

     చివరి పేరా ఇదే ప్రతిపాదిస్తుంది. మిడిల్ విభాగం ముగింపులో  భవానీ గ్యాంగ్ ని శివ తన వైపు తిప్పుకుని ఫైనల్ షో డౌన్ కి సిద్ధమైన నేపధ్యంలో, ఆత్మ రక్షణలో పడ్డ భవానీ శివ ఇంటి మీద దాడి చేయడం, శివ అన్న కూతుర్ని కిడ్నాప్ చేసి చంపడం, ఇదంతా  ఓర్చుకుని శివ భవానీ ని సంహరించి కథ ముగించడమూ జరిగాయి.

      ఇలా సినాప్సిస్ లో సమస్య- సంఘర్షణ- పరిష్కారం ఈ మూడూ ప్రస్ఫుటమైనప్పుడు కథకి సమగ్రత వస్తుంది. ఈ బ్లూప్రింట్ ని, రూట్ మ్యాప్ ని, సర్టిఫికేట్ ని అడ్డం పెట్టుకుని నేరేషన్ లో, వన్ లైన్ ఆర్డర్ లో ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. సమస్య ఏర్పడ్డానికి సృష్టించిన సీనేమిటి? పరిష్కార మార్గానికి సీనేమిటి? ముగింపు సీనేమిటి? ఈ మూడు సీన్లూ ఎప్పటకీ మారవు. నేరేషన్ లో, వన్ లైన్ ఆర్డర్ లో, స్క్రీన్ ప్లేలో, డైలాగ్ వెర్షన్ లో అవే ఉండిపోతాయి. ఉండి తీరతాయి. ఎందుకంటే అవే కథకి పట్టుగొమ్మలు, పిల్లర్స్. ఈ మూడు సీన్ల అవగాహన లేకపోతే, ఏం చేసీ కథకి ఓ అర్ధం పర్ధం రాదు.

      ఫైనల్ గా సినాప్సిస్ అంటే ఈ మూడు సీన్లని హైలైట్ చేస్తూ రూపొందించిన ఒక అడ్వర్టైజ్ మెంట్. ‘సరుకు’ అమ్మడానికి ఈ అడ్వర్టైజ్ మెంట్ ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నమాట!

     ఇలా స్పష్టాతి స్పష్టమైన సినాప్సిస్ చేతికొచ్చాక, దీన్నాధారంగా తర్వాతి టూల్ వన్ లైన్ ఆర్డర్ లోకి వెళ్దాం!

 సికిందర్









    

 
    
              

      

      
      

     
      















28, ఫిబ్రవరి 2015, శనివారం

శివ

కిటికీ లోంచి కొత్త సృష్టి!
శివ’ ఆధారంగా  తెలుగు సినిమా  స్క్రీన్ ప్లే  స్ట్రక్చర్  వ్యాసాల పరంపరలో  భాగంగా  ‘శివ’ గురించి ఈ సింహావలోకనం... 

రిత్రని మార్చేస్తూ మార్గదర్శకంగా నిలవాలంటే ఏం చేయాలి?

     పాతలో నెగెటివ్స్ ని చూసి, కొత్తని పాజిటివ్ గా ఆలోచించాలి. అలనాటి హాలీవుడ్ ఫన్నీ డైరెక్టర్ బిల్లీ వైల్డర్ సీను ఎలా వుంటే ఇంటరెస్టింగ్ గా మారుతుందో ఇలా చమత్కరిస్తాడు- ‘మామూలుగా పాత్ర తలుపు తీసుకుని లోపలికి  వచ్చిందనుకోండి, అది చప్పగా వుంటుంది ప్రేక్షకులకి. అదే ధబీల్మని కిటికీ దూకేసి వచ్చిందనుకోండి- చప్పున లేచి చూస్తారు ప్రేక్షకులు!’

      సింపుల్ గా ఎంత తేడా తలుపుకీ కిటికీకీ ప్రేక్షకుల రెస్పాన్సు లో!

      సరీగ్గా 1989 కి పూర్వం ఇలాగే ఉండేవి తెలుగు సినిమాలు. బద్ధకంగా తలుపు తీసుకుని వచ్చి అలసటగా కూర్చునేవి. ఈ రొటీన్ ఫార్ములా చూసి చూసి ఇదే కాబోలు సినిమా అంటే అనుకుని అలవాటు పడిపోయారు ప్రేక్షకులు. అప్పుడు 1989 లో అనుకోకుండా జరిగిందొక సంఘటన. అతను అక్కినేని నాగార్జున, ఇంకో అతను రామ్ గోపాల్ వర్మ. ఇద్దరూ కలిసి అదును చూసుకుని ‘శివ’ అనే సినిమాని దభీమని కిటికీ దూకించారు. అంతే, ఉలిక్కి పడి చూసిన ప్రేక్షకులు థ్రిల్లయి పోయారు. తెలుగు సినిమాలు ఎప్పుడైనా తలుపు తీయడమూ, లోపలికొచ్చి ఎక్కడ ప్రేక్షకులు పారిపోతారో నని గట్టిగా గడియ పెట్టేసుకోవడమే తప్ప, ఇలా డిఫరెంట్ గా డైనమిక్ గా  కిటికీ దూకేసి రావడమేమిటి? ఇంటా వంటా ఇలాంటిది లేదే - అనుకుంటూనే సీట్లకి అతుక్కుపోయి శివాలెత్తి పోయారు. ఇంతకాలమూ అమాయాకంగా తాము చూస్తూ ఉండిపోయిన సినిమాల్ని తల్చుకుని శివ శివా అనుకున్నారు. రాత్రికి రాత్రే నాగార్జునకి టాప్ హీరోగా పట్టం గట్టేశారు, రామ్ గోపాల్ వర్మ ని హాట్ దర్శకుణ్ణి చేసేశారు.


       అలా తెలుగు సినిమా రూపు రేఖల్ని పునర్నిర్వచించింది ‘శివ’. అప్పటికి రెండు స్వర్ణ యుగాలే (1931లో ‘భక్త ప్రహ్లాద’ నుంచీ 1950 లో ‘స్వప్న సుందరి’ వరకూ మొదటి స్వర్ణ యుగం;  1951 లో ‘మల్లీశ్వరి’ నుంచీ 1965 లో  ‘సుమంగళి’  వరకూ రెండో స్వర్ణ యుగం) తెలిసిన తెలుగు సినిమాకి, 1965 తర్వాత నుంచీ ఫక్తు వ్యాపార విలువల్ని జోడించుకుని కళని రెండో తరగతి పౌరురాలిగా మార్చేసుకున్న తెలుగు సినిమాకి- తను ఎటు ప్రయాణిస్తోందో దిశా దిక్కూ లేకుండా ఉన్న తెలుగు సినిమాకి- అప్పుడు 1989 లో గ్లాసుడు చల్లని నీళ్ళతో సేదదీర్చి, అక్కడో గీత గీసి ‘ఇదిగో నేనూ ‘శివ’ ని. ఇక్కడ్నుంచీ  తెలుగు సినిమాలు గీత కటు ‘శివ’ కి ముందు, గీత కిటు ‘శివ’ కి తర్వాతగా వుంటాయి. గీత కటే  నువ్వుండి  పోయి కాలగర్భంలో కలిసిపోతావో, దాటుకుని ఇటొచ్చి కాలంతో పాటూ ముందుకు సాగుతావో ఇక నీ ఇష్టం. వచ్చావా నాతో, గీత దాటించేస్తా. భయపడొద్దు, మాస్ ప్రేక్షకుల మెప్పు కూడా పొంది వచ్చాన్నేను. నాకు పనికొచ్చిన సరంజామా అంతా నీకే ఇచ్చేస్తా. బిల్డప్పులు, బ్యాంగులు, మాస్ డైలాగులు, ఓవరాక్షన్ లు, కామెడీ ట్రాకులూ ఉండక పోవచ్చు నా  సరంజమాలో. నేలకి దిగి వచ్చి నిజవితంతో కరచాలనం చేశా మరి. రా నాతో  చేయి కలిపి, నా విజయ రహస్యమూ జ్ఞానమూ నువ్వూ పంచుకుని తెలుగు సినిమాని కొత్త తావులకి తీసి కెళ్ళడంలో నువ్వూ భాగస్వామివి కా, కమాన్!’ అనేసి వెన్ను తట్టి ప్రోత్సహించింది.

     శివ’ కి ముందు ‘శంకరాభరణం’ వంటి ఆణి ముత్యాలున్నాయి, కాదనలేం. అవి ప్రతిష్టని నిలబెట్టాయి. ‘శివ’ చరిత్ర ని మార్చింది. కొత్తగా వచ్చే దర్శకుల్లో ఆవేశాన్ని రగిల్చింది. రిఫరెన్స్ పాయింట్ గా నిల్చింది. అభినయాలతో, కథా కథనాలతో కొత్త పుంతలు తొక్కుతూ, టెక్నికల్ విలువలకీ ఓ గైడ్ అయింది.   

   టెక్నాలజీ! మనిషి అంతరంగం ఎక్కడో ఊర్ధ్వలోకాల్ని తాకాలని ఉబలాట పడుతూంటుంది. ఈ ఉబాలాటాన్ని తీర్చేది టెక్నాలజీయే. సుదూరంగా వుండే వాటిని పసిగట్టే మానసిక శక్తులు ఆ రోజుల్లో ఋషుల కుండేవి. ఈ రోజుల్లో ఆ మానసిక శక్తుల పాత్ర టెక్నాలజీ వహిస్తూ ఉపగ్రహాల ద్వారా దూరతీరాల సమాచరం మనకందిస్తోంది. స్పిరిచ్యువాలిటీకి అచ్చమైన నకలు టెక్నాలజీ. ఈ టెక్నాలజీ సినిమాలో కలగలిసిపోయినప్పుడు ప్రేక్షకుడెంతో సేద తీర్తాడు. ఆ టెక్నాలజీ తానుంటున్న ప్రదేశపు మట్టి వాసనలతో మిళితమైనప్పుడు ఇంకింత రిలాక్సవుతాడు. అదే పాత  పద్దతుల్లో అదే మూస ఫార్ములా కథకి టెక్నాలజీ హంగులు సమకూర్చుకుని వచ్చి వుంటే  ‘శివ’ కింత సమ్మోహక శక్తి లభించేది కాదేమో. ‘శివ’ అనే యాక్షన్ సినిమా మొదటి సారిగా రియల్ లైఫ్ క్యారక్టర్ లతో, మన ప్రాంతంలో మన ముందే జరుగుతున్నట్టుండే వాస్తవిక సంఘటనలతో, అందునా ఎక్కువ మంది ఫీలయ్యే స్థానిక సమస్య కథాంశంగా వచ్చి ఉండడం వల్లే,  దీని టెక్నాలజీ హంగులైన శబ్ద, ఛాయాగ్రాహక ఫలితాల్ని అంతలా మైమరచి ఆస్వాదించ గల్గారు సగటు ప్రేక్షకులు సైతం.

      స్టడీ కామ్ ఈ విజువల్ ఫలితాల్ని సాధించింది. ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ ని పెంచే ఈ కెమెరాతో గ్యాంగ్ ని తప్పించు కుంటూ పిల్ల నెత్తుకుని నాగార్జున సందు గొందుల్లో పరుగెత్తే దృశ్యాలెంత థ్రిల్లింగ్ గా అన్పించాయో తెలిసిందే. నాల్గేళ్ళుగా  చెన్నైలో వృధాగా పడి ఉంటున్న ఈ  స్టడీ కామ్ ని పట్టుకొచ్చి, దేశంలో మొట్ట మొదటి సారిగా ‘శివ’ కి ఉపయోగించారు. ‘శివ’ విడుదలై ఏడాది తిరిగేసరికల్లా, అర్జెంటుగా ఇలాటి ముప్పయ్యారు కెమెరాలు దేశంలోకి దిగుమతి అయిపోయాయంటే పూర్వరంగంలో  ‘శివ’ సాధించిన గొప్పతనమేమిటో తెలుస్తోంది. 1976 లో గారెట్ బ్రౌన్ అనే నిపుణుడు కనిపెట్టిన ఈ కెమెరా  మోత బరువుంటుంది. ఈ బరువంతా ఆపరేటర్ తన నడుం  మీద మోయాల్సిందే. ఈ క్రమంలో షూట్ చేస్తూ కదుల్తూన్నా, పరిగెడుతూన్నా ఆ కుదుపు లన్నిటినీ  కౌంటర్ బ్యాలెన్స్ చేసుకుని స్టడీగా వుంటుందీ కెమెరా. ‘శివ’ కి దీని బరువు బాధ్యతల్ని ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల రెడ్డి దగ్గర ఆపరేటివ్ కెమరా మాన్ గా పనిచేస్తున్న రసూల్ ఎల్లోర్ ఎత్తుకున్నాడు.

        ఇలాటి గోపాలరెడ్డి విజువల్ విన్యాసాలతో దీపెన్ ఛటర్జీ శబ్ద గ్రాహక ప్రతిభ పోటీ పడింది. ఈ ఆడియో ఎఫెక్టు తెలుగు సినిమాల్లో మొట్ట మొదటి సారిగా  కృత్రిమ శబ్దం ‘డిష్యూం డిష్యూం’ ని పచ్చడి పచ్చడి చేసింది. ముష్టి ఘాతం తొలిసారిగా సహజ శబ్దంతో రక్తపోటు పెంచేసింది. బార్ సీన్ లో బ్రిజ్ గోపాల్ ని హీరో నాగార్జున కొడుతున్నప్పుడు పుట్టే ఆ శబ్ద ప్రకంపనలు ప్రేక్షకుల గుండెల్లో అలజడి రేపాయి. నేపధ్యంలో ఇంకే శబ్దాలు, అరుపులు, మూల్గులు, రీ- రికార్డింగూ విన్పించవు. ఇది శబ్దం లో నిశ్శబ్దం. శబ్దపు పొరల్ని విప్పుకుంటూ పోతూంటే  పోతూంటే భయంకర నిశ్శబ్దమే తేలుతుంది. అది కూడా శబ్దమే. అంతరంగం శోషించుకునే శబ్దం.

      ఇంకో చోట క్లైమాక్స్ లో రఘువరన్ ని కొడుతున్నప్పుడు కూడా ఇదే సౌండ్ టెక్నిక్. కాకపోతే రఘువరన్ రొప్పులు అందులో కలగలిసి వుంటాయి. నిశ్శబ్దం లో శబ్దం ఏమందిస్తుంది నిజానికి? ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు పొందిన మనదేశపు శబ్ద గ్రాహకుడు రసూల్ పోకుట్టి ఆస్కార్ సభలో ఏమని చెప్పాడు? నిశ్శబ్దం తర్వాత నిశ్శబ్దాన్నీ దాటుకుంటూ పోతూంటే, విన్పించేది చిట్ట చివర ఓంకార నాదమే! విశ్వ మానవాళికి ఇలాంటి పవిత్ర మంత్రాక్షరిని అందించిన దేశాన్నుంచీ వచ్చిన వాణ్ణి నేనూ అని చాటాడు. శ్రీశ్రీ ఆనంద మూర్తి దీన్నిలా వివరిస్తాడు : మౌన ముద్రలో మొదట క్రికెట్ ఆడుతున్నట్టు శబ్దాలు విన్పిస్తాయి. తర్వాత ఒక్కో అంచులో గజ్జెల శబ్దం, వేణువూదుతున్న శబ్దం, సముద్ర ఘోష, గణగణ గంటల శబ్దమూ విన్పించి, చిట్ట చివర్న స్థంభింప  జేసేదే ఓంకార నాదం! ఏమీ వుండదు దీనికావల. చెవులు పగిలే నిశ్శబ్దమే ఆవరించుకుని వుంటుంది. ఇప్పుడు ‘శివ’ ని తిలకిస్తున్న ప్రేక్షకోత్తముడి అంతరంగం ఏ శిఖరాలకి వెళ్లి తాకుతుందో సులభంగా ఊహించేసుకో వచ్చు. రుషుల్లేని ఈ కాలంలో టెక్నాలజీయే ఆత్మిక దాహాన్ని తీర్చే రుషి. ఇది గ్రహించక చాలా మంది దర్శకులు టెక్నాలజీని సవ్యంగా వినియోగించుకోలేకో, లేదా ఆ దివ్యౌషధం లాంటి టెక్నాలజీ కి దీటైన స్క్రిప్టులు తయారు చేసుకోలేకో అంతా కాలుష్యపు కాసారాలుగా మార్చేస్తున్నారు సినిమాల్ని.  

        పోతే, ‘శివ’ అంటే తలపండిన సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే నమూనా కూడా! ‘శివ’ ని చూడ్డం, సిడ్ ఫీల్డ్ ని చదవడం ఒకటే. స్క్రీన్ ప్లే పరంగా వియవంతమైన సినిమాల్లో ఉంటున్న ఒక సారూప్యాన్ని పసిగట్టిన  సిడ్ ఫీల్డ్,  దాని ఆధారం గా ఓ స్క్రీన్ ప్లే నమూనాని ఆవిష్కరించి ప్రచారం లోకి తెచ్చాడు. దీని ప్రకారం సినిమా కథల్లో వుండే మూడంకాలూ 1 : 2 : 1 నిష్పత్తిలో వుంటాయి. ‘శివ’ కూడా సరాసరి ఈ నిష్పత్తినే పంచుకుని, మొదటి అంకం 20 సీన్లు, రెండో అంకం 55 సీన్లూ, మూడో అంకం 25 సీన్లు గా స్క్రీన్ ప్లే సాగించుకుంటుంది. 


          ఈ అంకాల్లో ఏమేం జరుగుతాయో శాంపిల్ గా మొదటి అంకాన్ని తీసుకుని చూస్తే – ఇందులో జరిగే కార్యకలాపం లేదా బిజినెస్ ఎలా ఉంటుందంటే- ప్రధాన పాత్రని పరిచయం చేసి, కథ దేనిగురించో చెప్పడం; ఇతర పాత్రలతో ప్రధాన పాత్ర సంబంధాల్ని నిర్వచించడం, ప్రధాన పాత్ర చర్య తీసుకునేందుకు ప్రేరేపిస్తున్న శక్తులేవో చూపడం, ఇదంతా చేసుకొస్తూనే అంకం చివర ఏదైతే పాయింటు లేదా సమస్యని ఏర్పాటు చేస్తామో, దానికి దారి తీసే పరిస్థితుల కల్పనా పూర్తి చేసుకు రావడమూ జరుగుతుంది. ఇక్కడే కథలో మొదటి మలుపు అనేది ఏర్పడి అసలు కథ మొదలౌతుంది. అంటే రెండో అంకం ప్రారంభమౌతుంది.

      ‘శివ’ లో మొదటి అంకం ప్రారంభం లోనే ఓ స్టూడెంట్ ని గూండాలు గాయపరచడం ద్వారా కథ దేనిగురించి అయి వుంటుందో సూచించారు. అప్పుడు ప్రధాన పాత్రగా నాగార్జునని ప్రవేశపెట్టి, అతడి సహవిద్యార్థులుగా అమల, శుభలేఖ సుధాకర్, చిన్నా, విశ్వనాథ్ తదితరులతో పాటు నాగార్జున పాత్రని పరిచయం చేసి, వాళ్ళ సంబంధ బాంధవ్యాలని చూపారు. ఇంటి దగ్గర నాగార్జున అన్నా వదినెల్నీ, వాళ్ళ కూతుర్నీ పరిచయం చేసి, ఇంకా అటు అమల అన్నగా సీఐ పాత్రలో సాయిచంద్ ని చూపించారు.


          మరో వైపు కాలేజీలో జేడీ చక్రవర్తి బ్యాడ్ బ్యాచిని చూపిస్తూ, భవానీ అనే పెద్ద గూండాతో అతడికి సంబంధాలున్నట్టు చెప్పించారు. నాగార్జున వేసుకొచ్చే సైకిలు మీద ఘరానాగా జేడీ ని  కూర్చోబెట్టడం ద్వారా, ఓ బాయ్ ఫ్రెండ్ ని అతడి చేత కొట్టించడం ద్వారా, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని మెల్లగా చేసుకొచ్చారు.
      కాలేజీలో ఈ పరిస్థితులు ప్లస్ ఇంటి దగ్గర వదినతో ఇబ్బందులూ నాగార్జున చర్యకి పూనుకునేందుకు ప్రేరేపించే శక్తులుగా ఎష్టాబ్లిష్ చేశారు. పెద్ద గూండా భవానీకి మినిస్టర్ అండ ఉందని సాయిచంద్ తో చెప్పించి నాగార్జునకి రిస్కు తీవ్రతని పెంచారు. అప్పుడు ఫైనల్ గా 20 వ సీనుకల్లా, అంటే ఈ మొదటి అంకం ముగింపులో,  జేడీతో అమలకి డ్యాష్ కొట్టించి, ఇక తప్పని సరి పరిస్థితుల్లో నాగార్జున సైకిల్ చైన్ లాగేసి దాంతో  జీడీ మీదికి విజృంభింప జేయడం ద్వారా, కథని పూర్తిగా మలుపు తిప్పేసి రెండో అంకంలో పడేలా చేశారు.



       బ్యూటిఫుల్ క్రియేషన్. మంచి స్క్రీన్ ప్లే కి రిఫరెన్స్ బుక్. హైదరాబాద్ లో గొల్ల రవి (నాగార్జున పాత్ర), విజయవాడలో వంగవీటి రాధా ( రఘువరన్ పాత్ర) లని స్ఫూర్తిగా తీసుకుని, బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ డి డ్రాగన్’ ఆధారంగా కథ తయారుచేసుకున్నట్టు చెప్పొచ్చు వర్మ. కా నీ కథ నడక ‘ఎంటర్ ది డ్రాగన్’ లా వుండదు. ‘అన్ టచబుల్స్’ (1987) అనే హాలీవుడ్ సినిమా కథా నడకని పోలి వుంటుంది. అదే శైలి, సహజత్వం, మూడ్, ఫీల్, తక్కువ మాటలు, ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ . నేపధ్యంలో భవానీ తాలూకు టెన్షన్ వున్న విషయం గురించి సీన్లు వెర్బల్ గా పలకవు. ఏ హడావిడీ  లేని సబ్ టెక్స్ట్ ద్వారా ఆ టెన్షన్ పుడుతుంటుంది. కాకపోతే ఒకటే తేడా- ‘అన్ టచబుల్స్’ లో సీన్ కానరీ -  ‘వాడు కత్తి తీస్తే నువ్వు పిస్తోలు తీస్తావు. వాడు నీ మనుషుల్ని ఆస్పత్రి పాల్జేస్తె, వాడి మనుషుల్ని నువ్వు చంపుకుంటూ పోతావు. నేర ప్రపంచపు ఆనవాయితీయే ఇది, కాదనను. కానీ ఈ లెక్కన వాణ్ణసలు నువ్వెప్పుడు పట్టుకుంటావ్?’ అని నిలదీస్తాడు.  అప్పుడు కెవిన్ కాస్టనర్  ఆ రాబర్ట్ డీ నీరో పాల్పడుతున్న తీవ్ర హింసని ఎదుర్కొంటూనే, అవకాశం చూసుకుని పన్ను ఎగవేత స్కాం లో అతణ్ణి పట్టేసుకుని వెన్ను విరుస్తాడు పూర్తిగా!

     ‘శివ’ లో నాగార్జున రఘువరన్ కి పోటీ మాఫియాగా ఎదిగి, ‘ఇలాంటి వ్యవస్థని నాశనం చేయాలి. భవానీని చంపడం కాదు’ అని స్పష్టం చేసి ఆ రూటులో నరుక్కొస్తాడు 

    
      ‘శివ’ లో నాగార్జున రఘువరన్ కి పోటీ మాఫియాగా ఎదిగి, ‘ఇలాంటి వ్యవస్థని నాశనం చేయాలి. భవానీని చంపడం కాదు’ అని స్పష్టం చేసి ఆ రూటులో నరుక్కొస్తాడు

     క్లాస్ నీ, మాస్ నీ ఆకర్షించేదే నిజమైన కమర్షియల్ సినిమా. ‘శివ’ సహజ పాత్రలతో రియలిస్టిక్ గా వుంటూనే ఎంటర్ టైన్ చేస్తుంది. ‘ద్వారం’  సినిమాలెన్నో అయితే, ‘కిటికీ’ సినిమా ఒక్కటే!

సికిందర్

( జులై 2009, ‘సాక్షి’ కోసం)


రేపు : స్ట్రక్చర్ 4 – సినాప్సిస్ 

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

నాటి సినిమా..


సరి ‘గమ్యాల’ సరిత!

‘నా జీవితం అనేక విధాలా అంతులేని కథతో పోలి వుంటుంది’ అని జయప్రద అన్నప్పుడు అందువల్లే ఆ పాత్రకి అంత జీవం పోసిందేమో అన్పించక మానదు.
1.  తను హర్ట్ అయినప్పుడు పెల్లుబికే హావభావాలు
2. అనుకున్నది అవనప్పుడు ఎగిసిపడే రియాక్షన్స్
3. సెల్ఫ్ పిటీ అప్పడు  పాతాళం లోకి జారే శోక ముద్ర
4. త్యాగాలు చేసినప్పుడు ఆకాశాన్నంటే ఆనందం

      ముఖం ఒకటి – భావాలే మరీ కోటి. తెలుగు తెరకి మునుపెన్నడూ లేనంత సంకీర్ణ  స్త్రీ పాత్ర సృష్టి జయప్రద పోషించిన సగటు సరిత పాత్ర.  ఈ సినిమా నాటికి స్త్రీల వృత్తులు ఇప్పుడున్నంత పోటాపోటీగా లేవు. అప్పట్లో ఉద్యోగినులు, ఇప్పుడు వర్కింగ్ వుమెన్.  అప్పట్లో కెరీర్ నిచ్చెన మెట్ల గురించి పెద్దగా చింత లేని తనం, ఇంటి చుట్టూ ఆలోచనలతో సతమతం. తేడా అల్లా ఈ సినిమాలో ఆ ఇంటి బాధ్యతలు మీద పడ్డందుకే ఆక్రందనలు!
      వై? ఎందుకలా? 1976 లో ఆశా పూర్ణా దేవీ ( 1909 – 1995 ) రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా హిందీలో తారాచంద్ బర్జాత్యా తీసిన ‘తపస్య’ లో కథానాయిక ఇలా కాదే?  1974 లో కె. బాలచందర్ తమిళంలో సృష్టించిన సరిత అనే పాత్రతో ‘అవళ్ ఒరు తోడుర్కథాయ్’ తీసినప్పుడు అందులో అలవాటైన తన బ్రాండ్ యాంటీ హీరోయిజాల, యాంటీ క్లైమాక్సుల మోజు వెనుక వెలిగించిన అభ్యుదయ దీపమే, 1976 లోనూ తిరిగి తెలుగులో ‘అంతులేని కథ’ లో వెలుగులు జిమ్మింది.

      పాత కట్టుబాట్లూ,  కాలం చెల్లిన సాంప్రదాయాల సంకెళ్ళూ తెంచి పారెయ్యాలన్నదే బాలచందర్ ‘విజన్’  అయినట్లయితే, దీనికి ప్రతిగా ఆ పాత కట్టుబాట్ల,  సాంప్రదాయాల విలువలకే పట్టం గడుతూ, భారతీయ స్త్రీని శాంతీ సహనాలకీ, యుగాల కట్టుబాట్లకీ చిహ్నంగా చూపడమే ఆశా పూర్ణా దేవీ దృక్పథం అయింది. అయితే ఈవిడ చేసిన పాత్ర చిత్రణ తన వాదానికి బలం చేకూర్చినట్టుగా, బాలచందర్ సృష్టి కన్పించదు. కారణం, ఆయన అభ్యుదయవాదం కాస్తా అవగతమైన సాంప్రదాయవాదం లోకి తిరగ బెట్టడమే. ఆయన సృష్టించిన రివల్యూషనరీ సరిత పాత్ర కాస్తా ఏమీ సాధించలేని కౌంటర్ రివల్యూషనరీగా పలాయనం చిత్తగించడమే. ‘తపస్య’ లోని పాత  సాంప్రదాయ పాత్రలాగా స్థిరపడి పోవడమే. గాడ్, ఇంత దానికి ఈ డొంక  తిరుగుడంతా దేనికో?

       గమ్మత్తేమిటంటే ఆ సంవత్సరం విడుదలైన ఈ రెండూ సూపర్ హిట్సే!

      ‘అంతులేని కథ’ జయప్రదకి సుదీర్ఘమైన తిరుగు లేని సురక్షిత సినీ జీవితాన్ని ప్రసాదించింది. సావిత్రికి ‘చివరకు మిగిలేది’ ఎలాగో, జయప్రదకి ‘అంతులేని కథ’ అలాగ. ముక్కు పుటాలు కంపిస్తాయ్- తన మీద తనకే ఎందుకో కోపం; కోర చూపులు ప్రసరిస్తాయ్ - కసికసిగా ఇతరులంటే చిన్న చూపు; ముక్తసరి మాటలు ఉడుకుతాయ్- నత్తలా తనలోకి తాను  ముడుచుకోవడం...ఇప్పుడు ముప్పయ్యేళ్ళ తర్వాతయినా ఈ లెవెల్లో ఇంత ఫైర్ బ్రాండ్ సరితని మర్చిపోగలరా ఎవరైనా? కాస్త సహనవతి అయ్యుంటే ఎంత బావుణ్ణురా భగవంతుడా అని మగ ప్రేక్షక  ప్రపంచం మొర పెట్టుకుంటూనే ఉండొచ్చు ఇంకా.

      సహనం శాంతి సౌఖ్యాలూ అభ్యుదయం కాకుండా పోవు. ఈ గుణాలే అభ్యుదయమైతే తిరుగుబాట్ల తలనొప్పులే వుండవు. ఏదైతే అందదో, దాని గురించి తియ్యటి బాధ వుంటుంది. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రా ల్లాగా, ఏదో మంచి చేయడానికే సినిమాల్లో స్త్రీ పాత్రలకి ఆ నెగెటివిజాన్నేదో వండివార్చినట్లయితే, పొలోమని అప్పుడు వెంట పడుతుందేమో పురుష ప్రేక్షక దండు. ఈ సినిమా ఇంతటి శాస్వత తత్వాన్ని మూట గట్టుకోవడానికి ఈ మేల్ ఫ్యాక్టరే మంత్రంలా పని చేసిందేమో.

        పైకి నిరర్ధకంగా కన్పించే నెగెటివ్ పాత్ర సరిత. అది పాజిటివ్ గా మారే క్రమాన్నే మనం చూస్తాం. పాజిటివిజం తో ఎప్పుడూ భౌతిక  సుఖాలే ఉండక పోవచ్చు. అంతకి మించిన మాననసిక శాంతి, సంతృప్తీ తప్పక వుంటాయి. మనకి తెలిసిపోతూ తనకి తెలీకుండా సరిత ఇదే సాధిస్తుంది చివరికి. ‘నాలో వున్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు’ అని పాడుతుంది మొదట్లో. అది ఉత్త ట్రాష్. ఏం తెల్సని ఆమెకి? ‘నన్ను కూర్చో బెట్టి ఇంత అన్నం పెట్టే నాధుడు కావాలీ’  అనేనా? ఎప్పుడు ఈ ఇంటి బాధ్యతల పీడా వదిలి పెళ్లి కూతుర్నై కులుకుదామనేనా? పెళ్ళయితే చాలు, ఈ వెధవ ఉద్యోగం కూడా వదిలిపారేసి హాయిగా మొగుడు పెట్టింది తింటూ కూర్చో వచ్చనేనా? కాబట్టి ఈ అజ్ఞానానికి శాస్తి అన్నట్టుగానే ఇలాటి ఆమె కలలన్నీ పటాపంచలయ్యాయి చివరికి. ఇక పునీతురాలయింది. పాత్రలోకి వెళ్లి మనం చూస్తే ఈ సంగతే ఆమె తెలుసుకున్నట్టు వుండదు. మనం ఫీలవుతాం ఆమె ఫీలవ్వాల్సిన సంగతిని. ఇదింకో అజ్ఞాన పర్వానికి తెర తీయడం!

     వైజాగ్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూంటుంది సరిత. ఆ జాబ్ కి తగ్గట్టు స్లీవ్ లెస్ జాకెట్లు, పెదాలకి లిప్ స్టిక్, పాదాలకి హై హీల్స్, చదువుకోవడానికి ఇంగ్లీషు నవలలు; తన గదిలో విశ్రమించడానికి తనకంటూ ప్రత్యేక ఫోం బెడ్, ఫ్యానూ, సోఫా సెట్ ఎట్సెట్రా ...ఇది తన వాళ్ళ మీద కసితో ఏర్పాటు చేసుకున్న తన గొప్ప ప్రపంచం. చుట్టూ ఇంకో దిక్కుమాలిన ప్రపంచం. పోష్ లొకాలిటీని అనుకునే మురికి స్లమ్ వాడ వున్నట్టు...ఇందులో తన మీద ఆధారపడ్డ కన్న తల్లి, విధవరాలైన చెల్లి, ఎదిగిన మరో చెల్లెలు, అంధుడైన తమ్ముడు, ఆవారా అన్న, వదిన, వాళ్ళ ముగ్గురు పిల్లలూ..దిక్కుమాలిన సంత! వీళ్ళంతా ఏదో కతకడం, కటిక నేల మీద పడి కునుకు తీయడం, సరితమ్మ వుంటే కిక్కురుమనకుండా తొంగోవడం. ఆవిడ ఆఫీసుకి బయల్దేరిందే తడవు ఇల్లంతా పండగే పండగ చేసుకోవడం. ఆఫీసులోనూ ఆవిడ ఆడపులే. చాలా పొగరుబోతు. గయ్యాళి. కొరకరాని కొయ్య. గర్విష్టి పైగా. తండ్రేమో సన్యాసుల్లో కలసిపోయి, అన్నేమో బేవార్సుగా మారి, కుటుంబ పోషణంతా తన ఆడ ప్రాణం మీద పడి, ఎప్పుడు ఈ రొంపి లోంచి విముక్తి దేవుడా అని అలమటిస్తున్నట్టు ప్రవర్తించడం..

       అటు ప్రేమిస్తున్న తిలక్ (ప్రసాద్ బాబు) ని పెళ్ళాడాలంటే ఇంటి బాధ్యతల్ని విడిచి పెట్టాలి. ఇది కుదరదు. ఇక ఈమెతో లాభం లేదని విధవరాలైన ఈమె చెల్లెలితో ఇతను వరస కలుపుకోవడం. ఈ గుండె కోతని కూడా భరించి  ఆ చెల్లెల్ని (శ్రీప్రియ) ఈ ప్రేమిస్తున్న ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసేయడం.


    ఈ చెల్లెల్నే మూగగా ప్రేమిస్తున్న ఒక వికట కవి (నారాయణరావు) ఉంటాడు. ఇతడికి జీవితంలో దారి తప్పిన తన కొలీగ్ (ఫటాఫట్ జయలక్ష్మి) కిచ్చి పెళ్లి చేసేస్తుంది సరిత. ఇటుపైన సరిత జీవితం లో దేవుడు కరుణించా డన్నట్టుగా శుభాలే జరుగుతూంటాయి. ఆవారా బేకార్ అన్న( రజనీ కాంత్ ) కూడా కాస్త ప్రయోజకుడవుతాడు. హమ్మయ్యా అని జాబ్ మానేస్తుంది సరిత. ఈమె రాజీనామా  స్వీకరించిన బాస్ (కమల్ హాసన్) ఈమెతో పెళ్లిని ప్రతిపాదిస్తాడు. ఇక పెళ్లి పీట లెక్కడమే తరువాయి ఆ ప్రయోజకుడైన అన్న కాస్తా హత్యకి గురవుతాడు. సమాప్తం. ఖేల్ ఖతం. తిరిగి మొదటి కొచ్చింది కొలిక్కి రాబోయిన సరిత కథ..నీదొక అంతులేని వ్యధాభరిత గాథే సుమా అనేసి. 

       ఇక తన ఈ రెండో కాబోయిన వరుణ్ణి కూడా రెండో చెల్లెలికి త్యాగం చేసేసి, తిరిగి గానుగెద్దు జీవితం మొదలు ... మళ్ళీ పెదాలకి అదే దొరసాని లిప్ స్టిక్, వొంటికి అవే స్లీవ్ లెస్ షో పీసెస్, టిక్కు టిక్కు మని కాళ్ళకి హై హీల్స్, ఉద్యోగిని హోదా వెలగబెడుతూ చేత్తో లంచ్ బాక్స్- ‘అమ్మా ఆఫీసు కెళ్తాను’ అనేసి ఈసురోమని నడక బస్టాపు కేసి..

        కాకపోతే ఇప్పుడు వైధవ్యం ప్రాప్తించిన వదిన వుంది. ఇంట్లో ఈ మార్పు తో బాటు తనలో కూడా ఎంతో మార్పు. ఎంతో పరిపక్వత. భద్రకాళి సరిత కాదిప్పుడు. పాఠాలన్నీ ఎంచక్కా  నేర్చేసుకున్న ప్రౌఢ ఇప్పుడు. ఇంటి బాధ్యతలు ఎంతో అపురూపంగా కన్పిస్తున్న సహనవతి ఇప్పుడు.

 

      వృద్ధ కన్యలు ఆ కాలంలోనూ వున్నారు. పరిస్థితుల కారణంగా తోబుట్టువుల బాధ్యతలన్నీ తీర్చుకుని తెప్పరిల్లే సరికి వైవాహిక జీవితం కాస్తా ఎండమావులై పోయిన వాళ్ళున్నారు. సరిత లాగా కసిని పెంచుకుని వుండరు. తమ దయాదాక్షిణ్యాలతో కుటుంబ సభ్యులు ఇంత తిని చస్తున్నారన్న ఏహ్యభావంతో వుండరు. అలా జరిగితే ఆడతనానికి అర్ధమే ఉండదు. స్త్రీ సహజాతాన్ని ఏ స్త్రీ జయించ జాలదు. జెండర్ సమానత్వం గురించి మాట్లాడినప్పుడు సరితకి లాంటి పరిస్థితులు ఎదురైతే బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. ఎక్కడో నూటికో కోటికో ఎవరో ఉండొచ్చు. అలాటి అరుదాతి అరుదైన ఉదంతాల్ని తీసుకుని  సామాన్యీకరించలేం. హిందీ సినిమా ‘తపస్య’ లో హీరోయిన్ రాఖీ పోషించిన ఇలాటిదే పాత్ర సహజమైన పెద్దరికంతో,  అవివాహితగానే కుటుంబ బాధ్యతంతా మీదేసుకుని మహా సహనశీలీ, విశాల హృదయినీ అయి, ఎంతో శ్రమించి తోడబుట్టిన వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తే, వాళ్ళు తన్నేసి పోతారు. ప్రేమిస్తున్న ప్రియుడు (పరీక్షిత్ సహానీ) – ‘ఫర్వాలేదు, నీ ఇంటి బాధ్యత నేను తీసుకుంటానంటే, వద్దని వారిస్తుంది. స్త్రీ కుండే త్యాగ గుణానికీ, పురుషుడు కనబర్చాల్సిన ఓర్పుకీ  ప్రబల నిదర్శనం గా నిల్చి పోయిందీ చిత్రీకరణ.

    తెలుగులో దీన్ని కోదండ రామిరెడ్డి సుజాత తో ‘సంధ్య’ గా తీస్తే ఇదీ హిట్టయ్యింది.

      ఇలాంటి యాంటీ మిత్ / యాంటీ హీరోయిన్ లేదా హీరో పాత్రలు దేనికో టెంప్ట్ అయి, పతనాన్ని కొని తెచ్చుకోవడం మామూలే. అన్న ప్రయోజకుడయ్యాడని సరిత టెంప్ట్ అయి ఉద్యోగం వదిలెయ్యడమే మూర్ఖత్వ మన్పించుకుంది.

      ఈ సినిమాతో రజనీకాంత్, శ్రీ ప్రియ, నారాయణ రావులు పరిచయమయ్యారు. అప్పుడే రజనీకాంత్ సిగరె ట్టెగరేసే దృశ్యా  లిందులో వున్నాయి. ఆయన మీద జేసుదాస్ పాడిన సూపర్ హి ట్ ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ’ పాట చిత్రీకరణ కూడా వుంది. 

     జయప్రద మీద ఎస్. జానకి స్వరంలో ‘కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు’ గీతం ఓ సంచలనం అప్పట్లో. ఇక ఫటాఫట్ జయలక్ష్మి, నారాయణ రావులవి వెరైటీ పాత్రలనడం కంటే కల్ట్ పాత్రలనడం న్యాయం. ఫటాఫట్ అనే జయలక్ష్మి ఊతపదం ఇప్పటికీ పాపులరే. ఆమె మీద ఎల్లారీశ్వరి పాడిన ‘అరె ఏమిటీ లోకం పలుగాకుల లోకం’ పాట, నారాయణ రావు మీద మిమిక్రీతో ‘తాళి కట్టు శుభవేళ’ పాటా అంతే హిట్స్. పాటల, మాటల సృష్టికర్త ఆత్రేయ.


     స్వరకర్త ఎం.ఎస్. విశ్వనాథన్. బీ ఎస్ లోకనాథన్ ఛాయాగ్రాహకుడైతే, ఈ సినిమా ఘనవిజయం తర్వాత వెంటనే ‘మరో చరిత్ర ‘అనే ఇంకో సూపర్ హిట్ నిర్మించిన రామ అరణ్ణంగళ్  నిర్మాత. మద్రాస్ నెప్ట్యూన్ స్టూడియోలోనూ, వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ జరిపారు. 

     1982 లో తాతినేని రామారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ రేఖ హీరోయిన్ గా ‘జీవన్ ధారా’ అని హిందీలో రిమేక్ చేస్తే అదీ హిట్టయ్యింది.

సికిందర్
(జనవరి 2010, ‘సాక్షి’ కోసం)