రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, డిసెంబర్ 2015, మంగళవారం

స్ట్రక్చర్- 8








స్క్రీన్ ప్లే  స్ట్రక్చర్ లో మిడిల్ ని ఒక కథగా చూసినప్పుడు అది  ఏర్పడే విధం వేరు, అదే మిడిల్ ని మనిషి (ప్రేక్షకుల) మానసిక లోకం గా అర్ధంజేసుకుని దృష్టి సారించినప్పుడు జరిగే సృష్టి వేరు. మహోజ్వల భక్తి  సినిమా దగ్గర్నుంచీ నీచమైన బూతు సినిమా వరకూ దేనికైనా బేషరతుగా ఇది వర్తిస్తుంది. సర్వసాధారణంగా మొదటి పద్ధతిలోనే ఈ రోజుల్లో సినిమా కథల్ని చూడడం వల్ల 90 శాతం ఫ్లాపులు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. హిట్ కీ ఫ్లాపుకీ మధ్య ఏవరేజి అనే గౌరవం లేకుండా పోవడానికిదే కారణం. చిన్న సినిమాలే ఎక్కువగా నిర్మిస్తారు. ఈ నిర్మాణాలు కూడా ఇప్పుడు శాటిలైట్ హక్కులు రాకపోవడంతో సంక్షోభంలో పడ్డాయి. బాక్సాఫీసు దగ్గర ‘ఏవరేజీ’ అనే కాస్తయినా డబ్బులు మిగిలే అవకాశం వుంటే మళ్ళీ చిన్న సినిమాల నిర్మాణాలు వూపందుకోవచ్చు. అయితే చిన్నదైనా పెద్దదైనా ముందు వాటి కథల్ని చూసే దృక్కోణం లో మార్పు రావాల్సి వుంటుంది.
థగా చూస్తే మిడిల్ లో ఏమేముంటాయో చూద్దాం. మిడిల్లో వుండే ఎలిమెంట్స్, టూల్స్ ఏవైనా కావొచ్చు అవి ఇవీ :  చెరో పక్క ప్లాట్ పాయింట్ -1, ప్లాట్ పాయింట్-2, అనే రెండు మూల స్థంభాలు, ఈ మూల స్థంభాలని ఆశ్రయించి పించ్ -1, పించ్- 2 అనే రెండు ఉత్ప్రేరక కేంద్రాలు, మధ్యలో మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) అనే లంగరు, మొత్తం మిడిల్ అంతా వ్యాపించి ప్రధాన పాత్ర ( కథని బట్టి హీరో/ హీరోయిన్) కుండే లక్ష్యం, ఈ పాత్ర ఉత్థాన పతనాల చాపం ( క్యారక్టర్ ఆర్క్), టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, సంఘర్షణ, యాక్షన్ –రియాక్షన్ ల ఇంటర్ ప్లే, ఫోకస్, ట్విస్టులు, పాత్రకి రిస్క్, పాత్రకి అంతర్గత- బహిర్గత సంఘర్షణలు, ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్, స్పీడు, సబ్ ప్లాట్స్, పాటలు, కామెడీ, ఫీల్, షుగర్ కోటింగ్ వగైరా వుంటాయి. ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే,  ఇవన్నీ ఇంకా కొత్తగా ఏవైనా కలిస్తే అవీ,  మిడిల్ బలిమికి విటమిన్లని  సరఫరా చేస్తాయి. ఈ విటమిన్లతో  మిడిల్ అనే దేహాన్ని నిర్మించాలి—నిర్మించాలి- నిర్మిస్తూనే  వుండాలి- నిర్మించడం పైనే దృష్టి పెట్టాలి. నిర్మిస్తూ పోవడమంటే, ఈ అప్రతిహత నిర్మాణం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆతృతని పెంచడమే ప్రేక్షకులకి. మిడిల్ కథకి  గుండె కాయ లాంటిది. దీనికి పౌష్టికాహారం అందించడం గురించే ఆలోచించాలి. కథకి ఎదుగుదల కన్పించాలి.
మిడిల్ అంటే ప్రధాన పాత్ర ప్రయాణం కూడా. అంటే ఎప్పుడూ చలనం లో వుండేది.  స్తబ్దుగా పడుకుని బోరు కొట్టించడం మిడిల్ లక్షణం కాదు. గుండె నుంచి ప్రవాహంలా రక్త ప్రసరణ జరిగినట్టు, కథలో వుండే పై ఎలిమెంట్స్/ టూల్స్ అన్నీ కలిసి మిడిల్ ని చలనంలో ఉంచుతాయి.  ప్రయాణంలో మన కెన్నో అనుభవాలు ఎందుకు ఎదురవుతాయి?  ప్రయాణిస్తున్నాం గనుక. కనుక మిడిల్ లో ఒక ప్రయాణమంటూ మొదలయ్యాక అందులో అడుగడుగునా సంభ్రమాశ్చర్యాలకి గురి చేసే అనుభవాలే  ఎదురవుతాయి. మిడిల్  కన్నూ మిన్నూ కానని రొడ్డకొట్టుడు ప్రయాణం కూడా కాదు. మొదలెట్టింది లగాయత్తూ క్లయిమాక్స్ మీదే దృష్టి పెట్టుకుని ఒకటే పరుగుదీసే మారథాన్ కాదు. ప్రయాణమంటే పరుగుపందెం కాదు. మొత్తం క్లయిమాక్స్ దాకా  మిడిల్ నంతా  మీదేసుకుని రాయడం మొదలెట్టడం పరుగుపందెం లాంటిది. ఇక్కడ ప్రయాణమే వర్తిస్తుంది, పరుగెత్తడం కాదు. ఒక బస్సు  డ్రైవర్ హైదరాబాద్ నుంచి బస్సుని బయల్దేరదీసి, విజయవాడ వెళ్ళాలంటే, ఇంకేదీ పట్టించుకోకుండా,  ఐదు గంటల్లో చేరుకోవాల్సిన  గమ్యస్థానం విజయవాడని దృష్టిలో పెట్టుకుని అదేపనిగా జామ్మని దూసుకుపోడు. ముందు ఓ రెండున్నర  అరగంటల్లో సూర్యాపేట చేరతామా లేదా దాని మీద దృష్టి పెడతాడు. అక్కడ నుంచి  కోదాడ టైమింగ్ మీద దృష్టి పెడతాడు. కోదాడ నుంచి ఫైనల్ గా విజయవాడ టైమింగ్ ని టార్గెట్ చేస్తాడు. దూసుకుపోవడం ధూర్తుల లక్షణం. మిడిల్ నంతా ధ్వంసం చేసేస్తారు. వాళ్ళు క్లయిమాక్స్ కి షార్ట్ కట్స్ వెతుకుతారు. రచయిత అవడానికో, దర్శకుడు అవడానికో షార్ట్ కట్స్ ఉండొచ్చునేమో గానీ, స్క్రీన్ ప్లే కి అలాటి షార్ట్ కట్స్ ని ప్రకృతి ఏర్పాటు చేయలేదింకా. 
    ***

మిడిల్ అంటే ఒక ప్రయాణమని అర్ధం జేసుకున్నప్పుడు, ముందు ఆ మిడిల్ ప్రారంభమయ్యే ప్లాట్ పాయింట్ -1 దగ్గర్నుంచీ మిడ్ పాయింట్ ( ఇంటర్వెల్) వరకే దృష్టి పెట్టి కథని ఆలోచించాలి. ఇది ట్రీట్ మెంట్ అప్పుడో, డైలాగ్ వెర్షన్ అప్పుడో కాదు, సినాప్సిస్  రాసుకున్న తర్వాత మొదలెట్టే వన్ లైన్ ఆర్డర్ రాస్తున్నప్పుడే జరగాలి.  ఇక్కడ జరక్కుండా ఇంకెప్పుడో ట్రీట్ మెంట్ అప్పుడో, డైలాగులు రాసుకుంటున్న న్నప్పుడో చూద్దాం లే అనుకుంటే గందరగోళమే. అసలు పెన్ను ముందుకు కదలదు. ఎందుకంటే మొత్తం కథ నంతా ఒకే సారి మీదేసుకుంటారు కాబట్టి. ప్రారంభంలో పాత్రల పరిచయ సీన్లు రాస్తూంటే ఎప్పుడో వచ్చే ఇంటర్వెల్ మీదికో, సెకండాఫ్  మీదికో దృష్టిపోతుంది. మిడిల్ మొదలెట్టగానే ఎండ్ పైపు మనసు పరుగు దీస్తుంది. ఇలా మైండ్ నిలకడగా ఉండక, పనిజరక్కుండా చేస్తుంది. పనిని క్రమపద్దతిలో జరక్కుండా చేస్తుంది.

స్పష్టమైన బ్లూ ప్రింట్ లా సినాప్సిస్ రాసుకుని వుంటే అందులో బిగినింగ్ కథ, మిడిల్ కథ, ఎండ్ కథ చక్కగా రూట్ మ్యాప్ చూపిస్తూంటాయి. అప్పుడు క్లుప్తంగా రాసుకున్న ఆ సినాప్సిస్ లోని కథలో మొదట బిగినింగ్ భాగం వరకే  లైన్ ఆర్డర్ వేయడానికి తీసుకుని, అంతవరకే సీన్లు  ఆలోచించడం మొదలెట్టాలి. అంతకి మించి ఎలాటి ఆలోచనా రానివ్వద్దు. ‘హౌ టు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్’ అన్న ప్రసిద్ధ గ్రంధంలో డేల్ కార్నెగీ ఆనందం గా జీవించడం గురించి ఒక చోట ఒక చిట్కా ఇలా చెప్తాడు : గతం- వర్తమానం- భవిష్యత్తు అనేవి మూడు కంపార్ట్ మెంటు లనుకుంటే, ఇటు గతం తలుపు మూసేయండి, అటు  భవిష్యత్తు తలుపు కూడా మూసేయండి- మధ్య వర్తమానం కంపార్ట్ మెంటులో కూర్చుని ప్రస్తుతం, ఈ క్షణంలో  చేయాలో అది చెయ్యండి.. అని.  ఇదే వన్ లైన్ ఆర్డర్ వేయడం దగ్గర కూడా వర్తిస్తుంది. బిగినింగ్ ఆర్డర్ వేస్తున్నప్పుడు మిడిల్, ఎండ్ అనే కంపార్ట్ మెంటుల తలుపులు మూసేయండి. అప్పుడు బిగినింగ్ కంపార్ట్ మెంటులో కూర్చుని, రాసుకున్న  సినాప్సిస్ లో బిగినింగ్ విభాగం వరకే మార్క్ చేసి, దాని తాలూకు సీన్లు మాత్రమే ఆలోచించండి...అలాగే మిడిల్ ఆర్డర్ మొదలెట్టినప్పుడు  ఇటు బిగినింగ్, అటు ఎండ్ లకి తలుపులు గట్టిగా బిగించెయ్యండి. బేఫికరుగా మిడిల్ కంపార్ట్ మెంట్ లో బాసింపట్టు వేసుక్కూర్చుని,  సినాప్సిస్ లో మిడిల్ కి సర్కిల్ గీసి, ఆ ముగ్గులోనే మిడిల్ సీన్లు విస్తరించడం గురించి మల్లగుల్లాలు పడండి. ఈ కష్టం చూసి డ్రింక్ కొడుతూ రాద్దామనుకుంటే అంతా గల్లంతవుతుంది. డ్రింక్ కొడుతూ డైలాగులు రాయొచ్చేమోగానీ, లైనార్డర్, ట్రీట్ మెంట్ లు సవ్యంగా రాయలేరు. తెల్లారి చూసుకుంటే అసభ్యంగా కన్పిస్తాయి. ఆ రోజుకి కష్టపడ్డ తర్వాత హాయిగా రిలాక్స్ అవుతూ డ్రింక్ కొట్టొచ్చు. అప్పుడుండే ఆనందమే వేరు.

ఇంకలాగే, ఎండ్ కొచ్చినప్పుడు, బిగినింగ్- మిడిల్ రెండిటి  ద్వారబంధాలూ బంద్ చేసుకుని, సినాప్సిస్ లో ఎండ్ మీద దృష్టి పెట్టి సీన్లు రాసుకోండి..

ఐతే ఇక్కడ మళ్ళీ ఓ తిరకాసుంది. బిగినింగ్, ఎండ్ ల కంటే మిడిల్  సుదీర్ఘంగా సాగుతుంది. రెట్టింపు సీన్లు వుంటాయి. ఇంత లెన్త్ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకని ఈ మిడిల్ ని కూడా కంపార్ట్ మెంటలైజ్ చేయాలి. అదెలాగంటే ఇంటర్వెల్ కి ముందొకటి, ఇంటర్వెల్ తర్వాతొకటి. ప్లాట్ పాయింట్ -1  దగ్గర్నుంచీ ఇంటర్వెల్ వరకూ వుండే మిడిల్ భాగం, ఇంటర్వెల్ దగ్గర్నుంచీ ప్లాట్ పాయింట్ -2  వరకూ మిడిల్ భాగం..ఇలా రెండుగా చేసుకుంటే అప్పుడవి  ప్రీ ఇంటర్వెల్ మిడిల్, పోస్ట్ ఇంటర్వెల్  మిడిల్ గా రెండు భాగాలుగా వుండి  ఎటాక్ చేయడానికి సులభంగా వుంటాయి.
***

కథకి స్క్రీన్ ప్లే 60 సీన్లతో ఉందనుకుందాం : అప్పుడు బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సీన్ల పంపకం 15-30-15 గా వుంటుంది. కాబట్టి మిడిల్ కి దక్కే ఈ 30 సీన్లని ప్రీ ఇంటర్వెల్ కి 15 గానూ, పోస్ట్ ఇంటర్వెల్ కి 15 గానూ కేటాయించుకుంటే రెండు కంపార్ట్ మెంట్ లు ఏర్పడతాయి. మిడిల్ కి లైన్ ఆర్డర్ వేయడానికి సిద్ధ పడినప్పుడు,  15 సీన్లతో మొదటి కంపార్ట్ మెంట్ లో కూర్చుని, రెండో కంపార్ట్ మెంట్ కి తలుపు బిగించెయ్యాలి. అలాగే ఇటు బిగింగ్ కీ తలుపులేసెయ్యాలి.  అప్పుడు ఇటు బిగింగ్ కథా, అటు ఇంటర్వెల్ తర్వాత సీన్లేమిటా అనే ఆలోచనలూ  డిస్టర్బ్ చెయ్యవు. చేతిలో వున్న 15 సీన్లని పకడ్బందీగా ఇంటర్వెల్ కి చేర్చడమెలా అన్న దానిపైనే ఏకాగ్రత వుంటుంది. దీని తర్వాతే మిడిల్ పోస్ట్ ఇంటర్వెల్ ఆర్డర్ చేపట్టాలి. అప్పుడు ఇటు ఇంటర్వెల్ కీ, అటు ఎండ్ కీ తలుపులేసేసి ఆ 15 సీన్ల సంగతీ చూడాలి సినాప్సిస్ ప్రకారం. అలాగే ఎండ్ కొచ్చినప్పుడు బిగినింగ్, మిడిల్ ప్రీ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ అన్నిటి డోర్లు కూడా వేసేసి, చిట్ట చివరి 15 ఎండ్ సీన్లమీద దండయాత్ర చేయవచ్చు.  

స్క్రిప్టు రాయడానికి ఆచరణకి సులభతరమైన ప్లానింగ్ వుంటే ‘అఖిల్’, ‘సైజ్ జీరో’ ల్లాంటి ఆశాభంగాలు ఎదురుకావు.  మిడిల్లో పడ్డాక అసలు మిడిల్ ఎందుకు మొదలైందో మర్చిపోయి రాసుకుంటూ పోతే ఎలా? కాబట్టి ఇలా మనకి మనమే మిస్ లీడ్ అవకుండా ఉండాలంటే, ఎదురుగా గోడకి అసలు ముందు రాసుకున్న ఐడియా ఏమిటో, దాని సినాప్సిస్ ఏమిటో అంటించి పెట్టుకుంటే - నువ్వు మాకిచ్చిన మాట తప్పుతున్నావ్ రోయ్ - అని అవి ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూంటాయి.

నిజంగా మిడిల్ ఒక కీకారణ్యం. ఎటు వైపు ప్రయాణించాలో తెలీదు. ఎప్పుడు? రూట్ మ్యాప్ లేనప్పుడు. దాంతో కంపార్ట్ మెంటలైజ్ చేసుకోనప్పుడు. ప్లాట్  పాయింట్- 1 ని గుర్తించకపోతే, లేదా ప్లాట్ పాయింట్ -1 ఎప్పుడో ఏర్పడిందన్న స్పృహ లేకపోతే, మిడిల్ నిజంగా కీకారణ్యంలాగే కన్పించి ఎటు వైపు వెళ్ళాలో తెలియకుండా చేస్తుంది. ‘బెంగాల్ టైగర్’ లో సినిమా ప్రారంభమైన పదినిమిషాల్లోనే చక్కగా బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ -1 ఏర్పాటయితే, పెళ్లి చూపులప్పుడు ఆ అమ్మాయి నువ్వు ఫేమస్ కాదని హీరోని తిరస్కరించడంతో హీరోకి గోల్ ఏర్పడి మిడిల్ సంఘర్షణ ప్రారంభమైతే, ఇది గుర్తించకుండా ఇంటర్వెల్లో వచ్చిన టర్నింగే  కథకి మలుపు అనుకుని, వేరే పగాప్రతీకారాల కథ ఎత్తుకున్నారు. ‘సైజ్ జీరో’ ఇంటర్వెల్ దగ్గర ఆలస్యంగా ప్లాట్ పాయింట్ -1 ఏర్పడి బరువు తగ్గాలని నిశ్చయించుకున్న హీరోయిన్ ని,  ఇంటర్వెల్ తర్వాత ఆ సమస్యతో సంఘర్షించక, బోగస్ హెల్త్ సెంటర్ మీద పోరాటానికి ఒడిగట్టే హీరోయిన్ గా మార్చేశారు. మిడిల్ తో ఇంత కన్ఫ్యూజన్ అన్నమాట!  అదీ పెద్ద బడ్జెట్ సినిమాలకి!
***

మిడిల్ అంటే  ప్రధాన పాత్ర ప్రయాణమని చెప్పుకున్నాం గనుక- ఈ ప్రయాణంలో ప్రధాన పాత్ర చేసేపని తప్పని సరిగా తనకి ఏర్పడ్డ సమస్యతో పోరాటమే. ఈ పోరాటం ఎలాటిదైనా స్ట్రాంగ్ గా వుండాలి. కామెడీగా వుంటే,  ప్రధాన పాత్రకి ఆ ఎదురుదెబ్బలు కామెడీగానే అంత స్ట్రాంగ్ గా వుండాలి. ఆ పోరాటం యాక్షన్ గా వుంటే, ఆ యాక్షన్ తో ఎదురుదెబ్బలు  అంత స్ట్రాంగ్ గానే  వుండాలి. ఆ పోరాటం హార్రర్ గా వుంటే, హార్రర్ గా ఆ ఎదురు దెబ్బలూ అంత స్ట్రాంగ్ గానే వుండాలి. ఆ పోరాటం ప్రేమ కోసమైతే, ఆ ప్రేమలో ఎదురుదెబ్బలు అంత స్ట్రాంగ్ గానూ వుండాలి. సంఘర్షణలో ఎదురు దెబ్బ లెలాటివైనా అవి స్ట్రాంగ్ గా ఉంటేనే అది మిడిల్ అన్పించుకుంటుంది. అలనాటి ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు బిల్లీ వైల్డరే  అంటాడు- స్ట్రక్చర్ అంటే హీరోని చెట్టెక్కించి (బిగినింగ్) - రాళ్ళతో కొట్టి (మిడిల్) – కిందికి దించెయ్యడం (ఎండ్) అని!
రాళ్ళతో కొట్టడమనే కటువైన పదాన్ని వాడడంలోనే మిడిల్ లో ప్రధాన పాత్రని ఎంత నిర్దాక్షిణ్యంగా అణిచెయ్యాలో తెలుస్తోంది. మిడిల్లో ఏమాత్రం ప్రధానపాత్ర మీద దయ చూపినా, ప్రేక్షకులకి జాలి పుట్టదు. అయ్యో ఇదన్యాయమని  ప్రధాన పాత్ర పక్షాన చేరరు. దీని అంతరార్ధం ఇంకొకటుంది. దాని గురించి మానసిక లోకంగా మిడిల్ ని చూసే తర్వాతి సెక్షన్లో చెప్పుకుందాం.

మిడిల్లో ఎదురు దెబ్బలు తింటూ వాటిని జయిస్తూ వెళ్ళకపోతే ప్రధాన పాత్ర శభాష్ అనిపించుకోదు, క్యారక్టర్ ఆర్క్ కూడా ఏర్పడదు. ప్లాట్ పాయింట్ -1, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ - 2, ముగింపూ- ఈ మూడిటి దగ్గరా క్యారక్టర్ ఆర్క్ ఎలా ఏర్పడుతోందో, ఏర్పడకపోతే మార్పులేం చేయాలో చూసుకోవాలి. క్యారక్టర్ ఆర్క్ ఏర్పడుతోందంటే పాత్ర చిత్రణ సవ్యం గా ఉన్నట్టే. అంతే గాక టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ మెయింటెయిన్ అవుతున్నట్టే.

మిడిల్ ని  ఒక కథగా ఆలోచిస్తే ఇవన్నీ. ఇదొక విధానం. ఈ విధానం వల్ల చాలా వరకూ ఏమౌతోందంటే, ఇతర రకరకాల చేతులు పడి మిడిల్ చెదిరిపోతోంది. ఈ విధానంలో తయారైనవే ‘బెంగాల్ టైగర్’, ‘సైజ్ జీరో’, ‘అఖిల్’ మొదలైనవని అర్ధం జేసుకోవాలి. కథని కేవలం కథగా ఆలోచించడం బలహీనత. రామాయణ, మహాభారతాల్లాంటి పురాణాల్ని కేవలం కథలుగానే ఆలోచించి రాసి వుంటే అవి ఇంతకాలం నిలబడేవి కావు. దేవుళ్ళ కథలు కాబట్టి నిలబడ్డాయనుకోరాదు. ఆ దేవుళ్ళ కథలు దేన్ని బేస్ చేసుకుని, దేన్ని  టార్గెట్ గా చేసుకుని రాశారో అంతరార్ధం తెలుసుకోగల్గాలి. ఈ అంతరార్ధమే గొప్ప, ఉత్తమ కథలన్నిట్లో వుంటుంది. ఈ అంతరార్ధాన్ని, ఈ రహస్యాన్ని తెలుసుకుంటే మిడిల్, మిడిల్ తో బాటు మొత్తం కథా సురక్షితంగా వుంటాయి ఎన్ని చేతులు పడ్డా.
***

కొనే వాడికి రాసేవాడు లోకువ. ఏవో వంకలు పెడతారు. మార్చి పారేస్తారు. రాసే వాడూ కథగానే ఆలోచించాడు కాబట్టి,  ‘మేబీ నేను రాంగ్ కావచ్చులే’  అనుకుని తగ్గుతాడు. ఓ కథ కి చేసిన కథనం రైట్ అని చెప్పడానికీ, రాంగ్ అని చెప్పడానికీ బేస్ ఏమిటి,  దేన్ని బేస్ చేసుకుని  తీర్పు చెప్తున్నారు? సొంత అభిరుచులూ అభిప్రాయాలేగా? జిహ్వకో రుచి అన్నారు. పోనీలే కొనేవాడి జిహ్వచాపల్యం తీరుద్దామని రచయిత ఆ మేరకు రాజీపడి మార్చి రాసేస్తాడే అనుకుందాం- అవెంతవరకూ సక్సెస్ అవుతున్నాయో తెలిసిందే. చిరంజీవి 150 వ సినిమాకి పూరీ జగన్నాథ్ రాసిన కథ సెకండాఫ్ నచ్చలేదని చిరంజీవి తిరస్కరించారు. దీనికి బేస్ ఏమిటి? బేస్ లేకుండా ఎన్ని రకాలుగా మార్చి మార్చి రాసి చూపిస్తూ మెప్పించడానికి ప్రయత్నిస్తారు? మొట్టమొదట రచయితా/దర్శకుడు కథని- ముఖ్యంగా మిడిల్ ని కేవలం కథగానే చూసి రాయడం చేస్తే ఎదురయ్యే సంక్షోభాలివి. తప్పంతా రచయితల/ దర్శకుల దగ్గరే వుంది- హీరోలూ నిర్మాతలూ ఆల్వేస్ రైట్.

మనమిక్కడ మొత్తం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్  గురించి చెప్పుకోవడం లేదు. స్ట్రక్చర్ కి వెన్నెముక వంటిదైన  మిడిల్ విభాగపు బాగోగుల గురించే మాట్లాడుకుంటున్నాం. బిగినింగ్, ఎండ్ లు ప్రారంభ ముగింపులే కాబట్టి,  వాటిని కథగానే ఆలోచిస్తే వచ్చే ప్రమాదమేమీ లేదు. మిడిలే కీలకం. మిడిల్ ని కథగా చూడక, దాని నిర్మాణపు అంతరార్ధాన్నీ, రహస్యాన్నీ కనుగొని తయారు చేస్తే, దీని నీడన బిగినింగ్, ఎండ్ లు బతికిపోయే అవకాశాలున్నాయి ఎన్ని చేతులుపడ్డా. మిడిల్ దాని ఆత్మని పోగొట్టుకోకుండా దిట్టంగా నిలబడి వుంటుంది కాబట్టి.  ఏమిటా అంతరార్ధం? ఆ రహస్యమేమిటి? ఆదివారం తెలుసుకుందాం.

—సికిందర్








14, డిసెంబర్ 2015, సోమవారం

కొటేషన్ల కహానీ!




ర్శకులకీ, రచయితలకీ  ది బెస్ట్ కొటేషన్ గా నిల్చిపోయిన నా ఫేవరేట్ ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కొటేషన్ ఏమిటంటే, విసుగెత్తే  అంశాలన్నిటినీ  కత్తిరించేసిన నాటకీయతే నిజ జీవితమని! అలాగే మరొక కొటేషన్ జీన్ లక్ గోడార్డ్ చెప్పింది కూడా నా ఫేవరేట్ కొటేషనే : సినిమా అంటే సత్యంకోసం, లేకపోతే  సత్యాన్ని  కనుగొనే ప్రయత్నం కోసం, సెకనుకి 24 అసత్యాలని చెప్పే అబద్ధాల పుట్ట అని నేనల్లప్పుడూ చెబుతూ వచ్చాను- అనేది.

కొటేషన్స్ గురించి ఆలోచించండి. రెండూ వాస్తవాలే. ఉదాహరణకి, మీ క్యారక్టర్ ఒకటి ఒక ప్రదేశాన్నుంచీ  ఇంకో ప్రదేశానికి ప్రయాణించాలనుకుందాం. ఓ గంటో ఇంకా ఎక్కువ సేపో  ఆ  క్యారక్టర్ చేస్తున్న ప్రయాణాన్ని చూపిస్తూ పోనక్కర్లేదు. క్యారక్టర్  కారెక్కుతుంది, డ్రైవ్ చేసుకుంటూ పోతుంది, అలా వెళ్ళిన క్యారక్టర్ బహుశా తర్వాతి సీన్లో గమ్యం చేరుకున్నట్టు  మీరు చూపిస్తారు. ఈ పాయింటు దగ్గర్నుంచి నేరుగా  ఆ క్యారక్టర్ ఇంటి తలుపు కొడుతున్నట్టు మీరు చూపించ వచ్చు.  లేదా ఆ ఇంటి లోపల కూర్చుని కాఫీ తాగుతూ తను ఎవరికోసం వచ్చిందో వారితో మీ క్యారక్టర్ మాట్లాడుతున్నట్టు మీరు చూపించ వచ్చు.

అంతే గానీ మీ  క్యారక్టర్ కారు ఇంజన్  ఆఫ్ చేసి, కారు దిగి, అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఇంటి దాకా వెళ్లి నట్టు మీరు చూపించరు. ఉద్దేశపూర్వకగా ఒక పాయింటుని మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే తప్ప అలా డిటైల్డ్ గా చూపించరు. బహుశా మీ క్యారక్టర్ అబ్సెసివ్ కంపల్సివ్ రకం అనే పాయింటుని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు, అలా వివరంగా దాని చర్యల్ని ప్రధానం చేసి చూపించవచ్చు. కీ తిప్పి ఇంజన్ ఆఫ్ చేసి, డాష్ బోర్డు తుడిచి, అనుమానంతో మళ్ళీ కీ తిప్పి ఇంజన్ ఆన్ –ఆఫ్ చేసి, ఆఫ్ లోనే వుందని నిర్ధారించుకుని, అప్పుడు గానీ కారు  దిగినట్టు చూపించవచ్చు.

సినిమాలు అబద్ధాల పుట్టలని చెప్పడం  పూర్తిగా నిజం. ఎందుకంటే మొత్తం క్యారక్టర్ జీవితకాలాన్నీ ఓ రెండు గంటల్లో  చూపించేసి ముగించేస్తారు  గనుక.

రచయితలు  సర్వ సాధారణంగా చేసే పొరపాటు ఏమిటంటే, సీన్లు ముందుకు కదలకుండా అనేక వివరాలు ఇచ్చుకుపోవడం. ప్రతీ సీన్లో ఏదో క్యారక్టర్ రావడం, తనకి  హాబీ అయిన గేమ్ ఏదో ఆడడమో, ఇంకోటేదో చేయడమో చేసి, మంచినీళ్ళేదో తాగి, చెప్పాలనుకున్న డైలాగు చెప్పేసి వెళ్ళిపోవడం...ఇలాటివి!  ఇలా మీ క్యారక్టర్ ప్రవేశ  నిష్క్రమణాల్ని సవివరంగా చూపించే పని పెట్టుకో కూడదు. ఎందుకంటే సినిమా నిజ జీవితం కాదు. సినిమాల్లో రియల్ టైం లో సీన్లు నడవవు. వ్యర్ధమైన ఈ క్యారక్టర్ మూవ్ మెంట్స్ వల్ల, సీన్లు డైనమిక్స్ తగ్గి బోరు కొడతాయి.  హిచ్ కాక్ మాటల్లోనే  చెప్పుకుంటే, కత్తిరించి పారెయ్యదగ్గ  విసుగెత్తే అంశాలివి.

ఇదే సంగతి గోడార్డ్  ఇంకోలా చెప్పారు.  సినిమాలో జరిగిన క్రమం జరిగినట్టు స్పేస్ నీ , సమయాన్నీమింగేస్తూ చూపించడాన్ని అంతర్లీనంగానే కళ నిరోధించుకుంటూ పోతుంది. కనుక ఎమోషన్ ని పణంగా పెడుతూ  వాస్తవికత కోసం యమ కష్ట పడనవసరం లేదు. పకడ్బందీగా, డైనమిక్స్ తోనూ కూడినవిగా మీ  కథలుండాలంటే, వాస్తవికతని సర్దుబాటు చేసే భాష్యం వాటికి అవసరం. అప్పుడే కథలోని ఎమోషనల్ కోణం పట్టుబడుతుంది. ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని స్పర్శించగల్గడమే ఇక్కడ ముఖ్యం.  లేకపోతే అచ్చం వాస్తవికతనే ప్రతిఫలించే కథలు ప్రేక్షకుల ఇంద్రియాల్ని ఉత్తేజపరచే బదులు నిద్ర పుచ్చుతాయి.

విసుగెత్తే అంశాల కత్తిరింపు విషయానికొస్తే, మీ సినిమా కథని  వివరణ లిచ్చుకోవడంతో నింపెయ్య వద్దు. క్యారక్టర్స్  పనిలోకి దిగాలంటే, చాంతాడంత వివరణ ఇచ్చి దింపకూడదు. మీ కథలో క్యారక్టర్ చేసే జర్నీ ద్వారా,  ప్రతీ సీనులోనూ  ప్రేక్షకులని ఇన్వాల్వ్ చేయడమే ముఖ్యమని  గుర్తు పెట్టుకుంటే, విసుగెత్తే వివరణ జోలికి  మీరెళ్ళ లేరు. యాదృచ్ఛికంగా స్ట్రక్చర్ మీదా, కథ నడక మీదా దృష్టి పెట్టగల్గుతారు. ఇలా క్యారక్టర్, ప్లాట్ రెండిటి డెవలప్ మెంట్ తో కథమీద ఫోకస్ కూడా వుంటుంది.  ఈ సూత్రాల్ని పాటించడం వల్లే, సినిమా చరిత్రలో నిలిచి పోయిన ఉత్తేజభరితమైన సన్నివేశాల్నీ, కాల పరీక్షకి  తట్టుకుని నిలబడ్డ చలన చిత్రాలనూ రూపొందించగల్గారు హిచ్ కాక్,  గోడార్డ్ మహాశయులు.





వెండీ క్రామ్
(స్క్రీన్ రైటర్స్ కన్సల్టింగ్ కంపెనీ  నిర్వాహకురాలు)



దిగుమతులు -దుర్మతులు!







విలనంటే ఉత్తరాది నటుడే! ఆర్యన్ దేహాకృతితో తెల్లటి ఆరడుగుల కండలుతిరిగిన మొనగాడు ఉత్తారాదిలో ఎక్కడుంటే అక్కడ మన తెలుగు సినిమా వెళ్లి వాలిపోతుంది ...తెలుగు స్టార్ కి తగ్గ హీరోయినే కాదు, విలనూ దీటుగా ఉండేట్టు చూసుకుంటుంది. లేకపోతే ఆ సినిమా తేలిపోతుందని ఏదో భయం!
తెలుగు సినిమారంగం చుట్టూ తమిళ, కన్నడ, మలయాళ సినిమారంగాలుండగా, అక్కడ ఎందరో కొమ్ములు తిరిగిన విలన్లు వుండగా, తెలుగు సినిమాకి  వాళ్ళెవరూ తగరన్న అభిప్రాయం కొంతకాలంగా నెలకొంది. ఎనభైలలో రఘువరన్, దేవరాజ్ లాంటి తమిళ- కన్నడ విలన్లతో సరిపెట్టుకున్న తెలుగుసినిమా...ఇంకా మాట్లాడితే కోట శ్రీనివాసరావు లాంటి పక్కా తెలుగు ప్రతినాయకుడ్నీ ఆదరించిన తెలుగు సినిమా, వీళ్ళందర్నీ పక్కన పెట్టేసింది. మళ్ళీ గతంలోకి జారిపోయి, ఎనభైలలో ‘ఆఖరిపోరాటం’, ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ వంటి సినిమాలతో ఒక ఊపు ఊపిన అమ్రిష్ పురి  లాంటి ఉత్తరాది భయంకరాకారుల కోసం అన్వేషణ మొదలెట్టింది ...ఈ అన్వేషణలో మళ్ళీ దొరికిన హిందీ విలనాసురులే ముఖేష్ రుషి, ఆశీష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సాయాజీ షిండే, సోనూసూద్, దేవ్ గిల్, షావరలీ, కెల్లీ దోర్జీ, అభిమన్యు సింగ్ లవంటి కండ కావరమున్న గండర గండులు...

అయితే ఈ గండరగండులు కూడా  అరిగిపోయిన ముఖాలై పోవడంతో  మళ్ళీ తెలుగు సినిమా దక్షిణాదిలో షాపింగ్ చేస్తుందిలే అనుకుంటే  పొరపాటే...పొరపాటున కూడా అలాటి పని చెయ్యదు. ఇంకా ఏ హాలీవుడ్ వైపో చూస్తూం దేమో  గానీ, చచ్చినా  దక్షిణాన చూపు సారించదు. హాలీవుడ్ అంటే  హవ్వ అంటూ ఎవరైనా నవ్విపోతారని విధిలేక మళ్ళీ హిందీ వైపే చూడాలి!  తమిళ సినిమా కూడా ఆటే చూస్తోంది, కాబట్టి మళ్ళీ కొత్త కొత్త ముఖాలు హిందీ నుంచీ హాజరు ...అలాటి  తాజా ముఖాలే  ఈ ఆదిత్యా పంచోలీ, రవికిషన్, విక్రం సింగ్, బాబా సెహగల్  ప్రభృత ప్రతినాయక పాత్రధారులు...

హిందీ విలన్ తెలుగు సినిమాల్ని ‘నిన్నొదల బొమ్మాళీ’ అంటూ వెంటపడుతూనే వున్నాడు. ఎప్పుడో ఇరవై ఏళ్ల  క్రితం చిరంజీవి సినిమాకి ‘రూప్ తేరా మస్తానా’ అంటూ ఓం ప్రథమంగా తెలుగు హిట్ పాడిన హిందీ పాప్ సింగర్ బాబా సెహగల్ ఓ నాటికి విలనై తిరిగొస్తాడని ఎవరైనా ఊహిస్తారా? వచ్చాడు. నటిస్తున్నాడు. జయిస్తాడు. గాయకుడు కూడా విలనైపోయాక, హీరో అవక పోతే  ఎలా? అందుకని ఆనాటి తెలుగు హీరోయిన్ జరీనా వహాబ్ భర్త, ఒకప్పటి హిందీ హీరో ఆదిత్యా పంచోలీ సైతం విలనై పోయాడు. వీళ్ళ కుమారుడు సూరజ్ పంచోలీ హిందీలో అప్ కమింగ్ హీరోగా ఉంటూ,  సాటినటి జియాఖాన్ ని బలిగొన్న కేసులో ఇరుక్కుని నిజజీవితంలోనే విలన్ గా వార్తలకెక్కడం వేరే కథ. ఇక ప్రాంతీయ సినిమాకి మరో బాలీవుడ్ లా తయారైన భోజ్ పురి సినిమారంగాన్ని ఎంచక్కా హీరోగా – కాదు కాదు – ఏకంగా సూపర్ స్టార్ గా ఏలుకుంటున్న రవికిషనూ వెళ్లి వెళ్లి తెలుగులోకి విలన్ గా దిగుమతై పోవడం నమ్మశ్యక్యంగాని కథే ! మోడల్ గా ఉంటూ హిందీలో అరడజను పైగా సినిమాల్లో హీరోగా నటించిన తాజా స్టార్ విక్రం సింగ్ కూడా తెలుగులో దుష్ట పాత్రకి తెగబడ్డాడంటే...వీళ్ళకి తెలుగంటే ఏదో తెగులు వుందేమో ...తమలోని ఇంకో కోణంతో తెలుగువాళ్ళని  ‘చావగొట్టి’ వదలా లనేమో!


ఈ నయా పరాయి విలన్లు కండబలంతో హింస ప్రధానంగా చెలరేగడమే గానీ, గుర్తుంచుకోదగ్గ ఒక్క డైలాగుతోనూ ఆకట్టుకున్న, పాపులరయిన దృష్టాంతం కనబడదు. అరువు గొంతుకలతో కొన్నాళ్ళు రాయలసీమ యాసలో విలనీ ప్రదర్శించారే గానీ, ఒక ఎస్వీ రంగారావులా, ఒక నాగభూషణంలా, ఒక రావుగోపాలరావులా డైలాగ్ కింగ్స్ కూడా కాలేకపోయారు. అలనాడు ‘రైతు బిడ్డ’ లో మొదలైన విలన్ పాత్ర తన  పరిణామ క్రమంలో బడా భూస్వామిగా, చోటా పంచాయితీ ప్రెసిడెంటుగా, బడా రాజకీయ గూండాగా, బడా ఫ్యాక్షనిస్టుగా , బడా మాఫియాగా, ఇంకా బడా బడా అంతర్జాతీయ టెర్రరిస్టుగానూ  ఎగబ్రాకి  చాలా కర్కశ , పైశాచిక లక్షణాలతో  పరాకాష్టకి చేరుకున్నాడు. నవ్వించే విలనీకి పూర్తిగా దూరమైపోయాడు. హిందీ నుంచి వచ్చి నవ్వించే విలన్ పాత్రని పోషించిన ఘనత ఒక్క పరేష్ రావల్ కే దక్కింది. హిందీలో కొన్ని నవ్వించే విలన్ పాత్రలు పోషించిన దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ ని  తెలుగులో నటింప జేసుకున్నా అతడి విలక్షణ నటనా శైలిని పూర్తిగా  ఉపయోగించుకో లేకపోయారు.

కొత్తగా వచ్చిన  విక్రం జిత్ విర్క్ , రవి కిషన్, బాబా సెహగల్, విక్రం సింగ్, ఆదిత్యా పంచోలీలు కొత్త ట్రెండ్ ని స్థాపిస్తున్నారా అంటే అలాటిదేమీ లేదు. అవే సీ రియస్ ముఖాలతో రక్త పిపాసులైన జాతికి చెందిన అమల్లో వున్న పచ్చి విలనిజానికి నకళ్ళే ! రవికిషన్ – అల్లు అర్జున్ ప్రత్యర్ధిగా రాజకీయ నాయకుడి పాత్రలో  ‘రేసు గుర్రం’లో నటించగా, బాబా సెహగల్ – గుణ శేఖర్ త్రీడీ భారీ చారిత్రాత్మకం  ‘రుద్రమ దేవి’ లోనూ, రాజమౌళి మెగా మూవీ ‘బాహుబలి’ లోనూ విక్రం జిత్ విర్క్ నటించారు గానీ పెద్దగా ముద్ర వేయలేకపోయారు. విక్రం సింగ్  ‘వన్ - నేనొక్కడినే’ లో మహేష్ బాబుకి విలన్ గానూ  నటించారు. విక్రం సింగ్ –ప్రభాస్ నటించిన ‘రెబెల్ ‘ లోనూ విలన్ గా వేశాడు.  ఇక ఆదిత్యా పంచోలీ ఇ ‘ షాడో’ లో వెంకటేష్ కి విలన్ గా నటించాడు. ఇవన్నీ  పూర్తి స్థాయి  యాక్షన్ ఓరియెంటెడ్ సీరియస్ పాత్రలే. సీరియస్ విలనీ ని కూడా కొత్త తావులకి చేర్చిన సంజయ్ దత్, రిషీకపూర్ లవంటి స్టార్ల నుంచి నేటి విలన్ పాత్రధారులు నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోలూ  విలన్లుగా మారిపోయి, ఆ మధ్యే ‘అగ్నిపథ్’ తో ఎంత సంచలనం సృష్టించారో గమనించాం. తర్వాత మళ్ళీ రిషీ కపూర్ ‘డీ- డే’ లో దావూద్ ఇబ్రహీం పాత్ర ని అనితర సాధ్యంగా పోషించి మేధావుల ప్రశంసలు కూడా పొందాడు. విలన్ పాత్రల్ని హిందీలో ఎంతో సృజనాత్మకంగా తీర్చిదిద్దుతోంటే, తెలుగులో వైవిధ్యంలేని మన దర్శకులు అవే పాత చింతకాయ హింసోన్మాద రాక్షసులుగా తయారుచేసి వదిలిపెడుతున్నారు. 

ఈ నయా హిందీ విలన్లలో కూడా తెలుగులో బాగా పాపులరయిన ముఖేష్ రిషి, ఆశీష్ విద్యార్ధి, సాయాజీ షిండే, ప్రదీప్ రావత్ ల వంటి విలన్లు మళ్ళీ రాకపోవడం గమనార్హం. రాంగోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా ‘రక్త చరిత్ర’ ద్వారా పరిచయం చేసిన అభిమన్యు సింగ్ కూడా పాత హిందీ విలన్ల వారసత్వాన్ని అందుకోలేకపోయాడు. ‘అరుంధతి’ తో ఓ ఊపు ఊపిన సోనూ సూద్ తెలుగునుంచి కనుమరుగయ్యాడు. కెల్లీ దోర్జీ, షావరలీ, దేవ్ గిల్ లు ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయారు. కొత్త హిందీ విలన్ పాత్రధారులు ఇదివరకటిలా ఓ ముద్రవేసి నిలదొక్కుకునే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు.


అగ్ర హీరోలు తమకు తగ్గ హీరోయిన్లని ఎలా సెలెక్టు చేసుకుంటారో విలన్లని కూడా అంతే శ్రద్ధతో ఎంపిక చేసుకుంటున్నారు. అంతే కాదు కొందరు అగ్రహీరోలు ఎలాగైతే హీరోయిన్ ప్రాధాన్యాన్ని తగ్గించి సినిమా అంతా తమనే హైలైట్ చేసుకుంటున్నారో, అలా విలన్ పాత్రధారి విషయంలో కూడా చేస్తున్నారు. విలన్ కి మంచి డైలాగులు పెట్టనియ్యకుండా, ఆ పాత్రని సమగ్రంగా తీర్చి దిద్దనియ్యకుండా దర్శకుల్ని కంట్రోల్ చేస్తున్నారు. దీని వల్ల కూడా విలన్లు- ఆ విలన్ పాత్రలు పోషించే నటులూ ఆయా సినిమాల్లో నామమాత్రంగా మిగిలిపోతున్నారు. నిజానికి హాలీవుడ్ లెక్కలప్రకారం విలన్ ఎంత బలవంతుడైతే, తెలివిగల వాడైతే, హీరో అంత హైలైట్ అవుతాడు. కానీ టాలీవుడ్ హీరోలకి ఇది నచ్చదు. సినిమారంగాన్నే కాదు, సినిమా కథల్లోనూ ఏకఛత్రాధిపత్యాన్ని డిమాండ్ చేసి మరీ లాక్కుంటారు కాబట్టి విలన్ ఎంత కొత్తగా బాలీవుడ్ నుంచి దిగుమతయినా అతను ఓరగ బెట్టేదేమీ వుండదు. కిందటి తరం హీరోల కాలంలో  విలన్ పాత్రల విషయంలో ఇలా జోక్యం వుండేది కాదు. అప్పటి దర్శకులని శాసించే స్టార్లు కూడా వుండే వాళ్ళు కాదు. అందువల్ల అమ్రిష్ పురి, రఘువరన్ లలాంటి పరభాషా విలన్లు కేవలం అట్ట బొమ్మల్లా కాకుండా,  జవజీవాలతో అంత  శక్తివంతంగా ముద్ర వేయగలిగే వాళ్ళు. అలాటి విలన్ల కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా వుండే వాళ్ళంటే అతిశయోక్తి కాదు.

పోనీ ఇప్పుడు ఇన్ని ఆంక్షలతో స్టార్లు తాము సొంతంగా వన్ మాన్ షో తో హిట్లు కొడుతున్నారా అదీ లేదు. ఒకటొకటిగా సహాయ పాత్రల్ని ఎత్తి వేయించేస్తూ- సినిమా అంటే కేవలం స్టార్ షో గా మార్చేసిన కాలంలో – భారీ పబ్లిసిటీ తో ఎంత భారీ పరభాషా విలన్ ని తెచ్చామని చెప్పుకున్నా అది ప్రేక్షకుల్ని మభ్య పెట్టడమే అవుతుంది. తీరా సినిమాలో ఆ విలన్ ఏ ప్రత్యేకతా లేని వాడైనప్పుడు – ఏ రాయి అయితేనేం..అన్న సామెత చందంగా తయారవుతుంది. ఇంతోటి సినిమాలకి ఏ విలనయితేనేం అనేసి ఈపాటికే ప్రేక్షకుల నుంచి కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి  విలన్ ఎక్కడి వాడన్నది ప్రశ్న కాదు, సరుకు ఎంతన్నది పాయింటు!


- సికిందర్

12, డిసెంబర్ 2015, శనివారం

నో షుగర్ కోటింగ్ ?

(Dear Readers!
Extremely sorry for disappearing  from 

the scene for so many days.
At last  resuming the regular postings as usual. 
Welcome once again! ) 








రచన –దర్శకత్వం : సంపత్ నంది

తారాగణం : రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బోమన్ ఇరానీ, రావు రమేష్, సాయాజీ షిండే, పృథ్వీ, బ్రహ్మానందం, పోసాని, నాగినీడు తదితరులు.
సంగీతం : భీమ్ సిసీరీలియో, ఛాయాగ్రహణం : సౌందర రాజన్, ఎడిటింగ్ : గౌతం రాజు
బ్యానర్ : శ్రీ సత్య సాయి ఆర్ట్, నిర్మాత : కె కె రాధా మోహన్
విడుదల :  డిసెంబర్ 10, 2015

***
క్కటి మాత్రం నిజం : రవితేజ సినిమాల్ని చూసే ప్రేక్షకులు అదే రొటీన్ మసాలాని చూసేందుకు అడ్జెస్ట్ అయిపోయి వెళ్తారు కాబట్టి, రవితేజకి కూడా ఇంకెలాటి కొత్తదనాన్నీ ప్రయత్నించే అవసరం ఏర్పడ్డం లేదు. మరీ కిక్ -2’  లాంటి అట్టర్ ఫ్లాప్ ఎదురైనా సరే, అవే పాత్రల నుంచీ, అవే కథల నుంచీ ఆయన అంగుళం కూడా దూరం జరిగే ప్రసక్తే లేదు. ఈ సినిమాలో ఒకచోట అందరి కంటే నేను తేడాఅని తను డైలాగు పలికినట్టు, ఆ తేడా ఏ స్టార్ కీ లేనివిధంగా తన రొటీన్ని తను రొటీన్ని కంటిన్యూ చేయడమే నేమో!  సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్అనే  మరో రొటీన్ ని ఇంకోసారి ట్రై చేసి చూశాడు రవితేజ. మాస్ మహారాజా అన్పించుకుంటే సరిపోవడం లేదనేమో ఇలా రొటీన్ మహారాజా అనికూడా ముద్రేసుకుని ఇక దేని గురించీ పట్టించుకోవడం లేదు- కనీసం ఆ రొటీన్ అయినా పద్దతిగా ఉండేట్టు చూసుకోకపోవడం కూడా తన రొటీన్ లో భాగమేనేమో! 


కథ
మ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన ఆకాష్ నారాయణ్ (రవితేజ) రొటీన్ గా తూర్పు గోదావరి జిల్లా గ్రామంలో లో ఫ్రెండ్స్ ని వేసుకుని ఆవారాగా తిరుగుతూఇంటిమీదికి గొడవలు తెస్తూ తిట్లు తింటుంటాడు. పెళ్లి చేస్తే బాగు పడతాడని సంబంధం చూస్తారు. ఆ అమ్మాయి ఆకాష్ కి క్లాస్ పీకుతుంది- తను కోరుకునేది ఇతడి లాంటి లోకల్ క్యారక్టర్ ని కాదనీలోకమంతా తెలిసిన  సెలెబ్రిటీని  అనీ చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటుంది. దీంతో ఆకాష్ అహం దెబ్బతిని,  తను అర్జెంటుగా ఫేమస్ అయిపోవాలనుకుంటాడు. ఆ ఊరికొచ్చిన వ్యవసాయ మంత్రి ( సాయాజీ షిండే) మీదికి ఓ రాయి విసిరి మీడియా కెక్కుతాడు. ఆ మంత్రికి మొదట మండిపోయినాఆకాష్ తెలివి తేటలకి మెచ్చి తన అనుచరుడుగా నియమించుకుంటాడు. అలా హైదారాబ్ వెళ్ళిన ఆకాష్హోంమంత్రి ( రావు రమేష్) కూతురు శ్రద్ధ ( రాశీ ఖన్నా) ని కాపాడి మార్కులు కొట్టేసివ్యవసాయ మంత్రి  కి ఎగనామం పెట్టేసి హోం మంత్రి ఇంట్లో చేరిపోతాడు.


ఇతడి వాలకం చూసి శ్రద్ధ ఆకాష్ ఆకర్షణ పెంచుకుంటుంది. ఆమెకి వేరే సంబంధం ఖాయం చేస్తారు. అప్పటికి ఆ ఇంట్లో అందరికీ దగ్గరైన ఆకాష్, శ్రద్ధ సహా అందరూ ఆ సంబంధం వదులుకుని  తనని చేసుకునేలా చేస్తాడు. తీరా ముఖ్యమంత్రి ( బొమన్ ఇరానీ) సమక్షంలో హోం మంత్రి ఆకాష్ తో  సంబంధాన్ని ప్రకటించేసరికి, తను ప్రేమించింది వేరే అమ్మాయి నంటూ  ప్లేటు ఫిరాయిస్తాడు - ఆ అమ్మాయి ముఖ్య మంత్రి కూతురు మీరా ( తమన్నా) అని చెప్తాడు.  ముఖ్యమంత్రితో సహా అందరూ షాక్ అవుతారు. ఇంతకీ ఆకాష్ పథకం ఏమిటి? ఇలా  ముఖ్యమంత్రి కి దగ్గరయ్యేందుకు ఇన్ని ఎత్తుగడలు వేసిన ఆకాష్ అసలు గతం ఏమిటి? ముఖ్యమంత్రితో తనకున్న శతృత్వం ఏమిటి? ఇవన్నీ మిగతా కథలో తేలతాయి.

ఎలావుంది కథ?

మాస్ ప్రేక్షకుల్నే టార్గెట్ చేసిన కథ. మాస్ మహారాజా కాబట్టి మాస్ కి నచ్చితే చాలుననే విధంగా శ్రద్ధ పెట్టని కథ. కేవలం మాస్ ప్రేక్షకులు చూస్తే  50, 60 కోట్లు వచ్చేస్తాయా అన్నది బుద్ధి జీవులకి కలిగే సందేహం. మాస్ ప్రేక్షకులు థియేటర్లలో పైతరగతికి వెళ్తారా అన్నది కూడా మరో సందేహం. వీళ్ళు మాస్ జనం కాబట్టి  హోటళ్లలో అడ్డగోలు భోజనం పెడతారా, పెడితే వూరుకుంటారా అన్నాది మరో ప్రశ్న. అవే మాస్ సినిమాల్ని అదే అడ్డగోలుతనంతో ఎన్ని తీసినా ఎస్కేప్ అవచ్చు. మనకి  తెలిసి సినిమాలు రెండు రకాలు : కమర్షియల్, ఆర్ట్ అన్నవి. మొదటివి క్లాస్- మాస్ అనే తేడాల్లేకుండా ఆబాలగోపాలం అందరూ చూసేవి, రెండోవి ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే పరిమితమయ్యేవి. మధ్యలో ఈ మాస్ సినిమాలు అనే వర్గీకరణ ఎక్కడిదో అర్ధంగాదు. దీంతో మిగతా కమర్షియల్ ప్రేక్షకుల్ని దూరం చేసుకోవడమే. ఇలాగే వుంది ఈ సినిమా కథ కూడా. అలాగే మాస్ కోసమే తీశారు కాబట్టి సెకండాఫ్ కథ అంత బోలుగా వుంది.

ఎవరెలా చేశారు
వితేజ  కొత్తదనం జోలికి పోకుండా అవే రొటీన్ పాత్రలు పదేపదే  చేయడంవల్ల నటనలో కూడా కొత్తదనం ఈ సినిమాలో కూడా రొటీన్ గానే నిల్.  కాకపోతే  కిక్ – 2’  లో లాగా ఇది మరో ఓవర్ యాక్షన్ తో కూడిన హైపరాక్టివ్ క్యారక్టర్ కాదు కాబట్టి కాస్త బతికిపోతారు ప్రేక్షకులు. ఆశాజనకంగా తనది పాసివ్ సుడిగుండంలో పడని యాక్టివ్ పాత్రే. అయితే పగదీర్చుకునే పాత్రయి కూడా ఏ  రోషమూ, ఆవేశం లాటి భావోద్వేగాల ప్రదర్శన కూడా లేకపోవడంతో పాత్రతో బాటు  నటన కూడా పలచనయ్యాయి. మాస్ మహారాజా పాత్రకి క్రోధావేశాలుంటే మాస్ ప్రేక్షకులు ఒప్పుకోరనా? కేవలం కామెడీతోపోరాటాలతో సరిపెట్టేయడంతో పాత్రకి డెప్త్ లేకుండా పోయింది. పైగా ఇద్దరు పాపులర్ హీరోయిన్లు వున్నా వాళ్ళతో రోమాన్సు కూడా చేయకపోవడంతో పాత్రాదాంతో నటనా మరీ డ్రైగా తయారయ్యాయి. ఒక హీరోయిన్ ని ఉపయోగించుకుని హోం మంత్రి దగ్గరికి, ఆమెని వదిలేసి ఇంకో హీరోయిన్ ని ఉపయోగించుకుని ముఖ్యమంత్రి దగ్గరా  పాగా వేయడమే లక్ష్యంగా సాగే పాత్రగా రోమాన్స్ ని పట్టించుకోలేదు. ఇలాటి ధోరణి నెగెటివ్ లేదా యాంటీ హీరో పాత్రలకి వుంటుంది. తను ప్రేమించి వుంటే గ్లామర్ హీరోయిన్లతో చాలా  ఫన్నీ సీన్స్  వర్కౌట్ అయ్యేవి. వాళ్ళని వదిలేసి ఎంతసేపూ పక్క మగ పాత్రలతో కామెడీలతో సరిపెట్టేయడం వల్ల, అది కూడా సెకండాఫ్ లో కంటిన్యూ అయ్యే పరిస్థితి లేనందువల్లబాగా రిస్కులో పడింది బాక్సాఫీసు పరంగా రవితేజ పాత్ర. నడుస్తున్న కథలో హీరో లవ్ చేయడం  లేదు గనుకఆ లోటు తీర్చడానికా  అన్నట్టు- (డార్లింగ్ లో ప్రభాస్ క్యారక్టర్ లాగా) యూరప్ లో తమన్నాని రవితేజ  టీజ్ చేసే సాంగ్ పెట్టి, చివరికి ఇది కట్టు కథ మాత్రమే అని తేల్చేశారు.

ఇలా రవితేజ పాత్రకి ప్రేమే లేకపోతే, ఆ పాత్రతో హీరోయిన్లవి కూడా ఏకపక్ష ప్రేమలే. ఆ ప్రేమలతో వాళ్ళు కూడా ముందడుగు వెయ్యకుండా, హీరోని రెచ్చగొట్టకుండాడ్రీం సాంగ్స్ తో పాసివ్ గానే  సరిపుచ్చుకుంటారు. హీరోయిన్లు ఇష్టారాజ్యంగా అంగాంగ ప్రదర్శనలు చేసినంత మాత్రాన అది రోమాన్స్ అన్పించుకోదు, ఫ్యాషన్ పెరేడ్ అన్పించుకుంటుందేమో. హీరోలో రొమాంటిక్ యాంగిల్ చూపించడానికి ఒక కట్టుకథ, హీరోయిన్ల ప్రేమలు చూపించడానికి వాళ్ళ డ్రీం సాంగ్స్. అంతా ఉత్తుత్తిదే!  ప్రేమలు గల్లంతయిన పాత్రలు! ఇంత మాస్ సినిమాలో ప్రేమకి స్థానమే లేదు, పైగా సగం సినిమా ప్రేమ ఆధారంగానే నడుస్తుంది!  మాస్ ప్రేక్షకుల మెనూ లోంచి ప్రేమని కూడా కట్ చేశారు.

హీరోయిన్ల పాత్రలకి కథలో పనిలేకుండా నామమాత్రం చేశారు. దీంతో రాశీ ఖన్నా సంగతెలా వున్నా, తమన్నా సైతం యాక్టివ్ పాత్ర కాలేక తీవ్ర అసంతృప్తికి దారితీసేట్టు తయారయ్యింది. ఎంత అందాల ప్రదర్శనతో ఈ లోపాన్ని కవర్ చేయాలని చూసినా, బేసికల్ గా వున్న డొల్లతనం కనుమరుగైపోదు. హీరో ప్రేమించకుండా తమని ఎక్స్ ప్లాయిట్ చేస్తూంటే కనీసం చీమకుట్టినట్టు కూడా లేకపోడడం హీరోయిన్లిద్దరి స్పెషాలిటీ. వాళ్ళు ప్రేమల్ని బయట పడేసుకుని హీరోని  గెలిచే ప్రయత్నాలు చేసే లక్ష్యాల్ని  ఏర్పాటు చేసుకుని వుంటే, అది సెకండాఫ్ లో లేని కథ నడపడానికి సబ్ ప్లాట్ గానైనా  పనికొచ్చేది. హీరో సీఎం మీద వ్యక్తిగత పగతో యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగిపోతూంటే, ప్రేమపగలతో హీరోయిన్లు వెంటపడ్డం వల్ల, కనీసం  ఫస్టాఫ్ లో మిస్సయిన రొమాంటిక్ యాంగిల్ ఏర్పడి మూడు పాత్రలకీ డైమెన్షన్స్  ఉండేవి. సినిమా అంతా రవితేజ ఒన్ మాన్ షోగానే వుండాలనీసక్సెస్ క్రెడిట్ తానొక్కడికే దక్కాలనీ ఇతర పాత్రలకి ప్రాధాన్యం లేకుండా చేయడం, రోమాన్స్ ని కూడా నిలువునా నరికెయ్యడం సక్సెస్ ఫుల్ మాస్ సినిమా ఫార్ములా అనుకుంటే అది ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుంది.  అన్ని మసాలాలూ సమపాళ్ళల్లో మేళవించామంటారు. ఏంటదినాల్గు ఫైట్లు, ఆరుపాటలు, కామెడీ, ఇంకేదో ఎంటర్ టైన్ మెంట్, ఎక్స్ పోజింగ్, కొన్ని పంచ్ డైలాగులూ  వేసేసి సంతృప్తి పడ్డమేనా - వీటన్నిటికీ మూలాధారమైన భావోద్వేగాలూ ప్రేమలతో కూడిన పాత్రచిత్రణలు పట్టకుండానే? మాస్ మహారాజా మూవీ మేకింగ్ కి కొత్తగా ఇవి వ్యర్ధ పదార్ధాలయ్యాయా?

తనకి సరైన పాత్ర లేకుండానే తమన్నా ఈ సినిమా ప్రమోషన్ కోసం చాలా  శ్రమించింది. ఆమెపట్ల జాలిపడాల్సిందే. ఇలాటి సినిమాలకి ప్రమోషన్ కూడా  హీరోగారి ఒన్ మాన్ షోగానే వుంటే బావుంటుందేమో? కథకి అక్కర్లేని నటీమణులు సినిమాని అమ్మడానికి అత్యవసరం కావడం  ఐరనీయే.

బొమన్ ఇరానీ, సాయాజీ షిండే, రావురమేష్ దుష్ట పాత్రలైతే ఉన్నాయిగానీ, వీటికీ డెప్త్ లేదు. కామెడీ సెక్షన్ లో బ్రహ్మానందం, పోసాని, షకలక శంకర్, పృథ్వీ లలో పృథ్వీ ఒక్కరే మరోసారి ప్రేక్షకులకి దగ్గరయ్యారు. అయితే సినిమా స్టార్ కావాలన్న కోరికతో చేసే పన్లు సెకండాఫ్ లో కంటిన్యూ కాక ముగిసిపోయింది పాత్ర. హీరోయిన్లని వాడుకున్నట్టే రవితేజ పాత్ర ఈ పాత్రని కూడా వాడుకుని వదిలెయ్యడంతో ఇలా జరిగింది.

ఇక సంగీత దర్శకుడు  భీమ్స్ ఓ మూడు క్యాచీ సాంగ్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకున్నాడు. బెంగాల్ టైగర్’  అనే టైటిల్ సాంగ్  (రామజోగయ్య శాస్త్రి - శంకర్ మహదేవన్)  ఆసియా ఖండంలో..అనే డ్యూయెట్ (సంపత్ నంది- నకాష్ అజీజ్, నూతన), ‘రాయే రాయే’  అనే ఫోక్ సాంగ్ ( సుద్దాల అశోక్ తేజ- సింహా, మమతా శర్మ, ఉమా నేహా ) మూడూ క్యాచీ ట్యూన్సే.  అయితే బీమ్స్ ఏ పాటకైనా ఎక్కువగా ఫోక్ ఫ్లేవర్ ఇష్టపడుతున్నట్టుంది. సౌందర రాజన్ ఛాయాగ్రహణం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. డీఐ లో క్వాలిటీ చూపించాడో, కలర్ఫుల్ లొకేషన్ కి పెద్ద పీట వేశాడో- విజువల్ క్వాలిటీని సమున్నతం మాత్రం చేశాడు. దీన్ని దర్శకుడి కథాకథనాలు అందుకోలేకపోయాయి. రామ్ -  లక్షణ్ లు  యాక్షన్ కోరియోగ్రఫీకి ఇంకేదో కొత్తగా చూపించాలని తపన పడ్డారు.  రవితేజ నడుస్తూంటే బురదలోంచి శవాలు పైకి లేవడమనే దర్శకుడి అయిడియాని వూ హాతీతగంగా కంపోజ్ చేశారు. కానీ కొన్ని చోట్ల గొడ్డలితో పోయేదానికి గోటితో గోక్కుంటూ కూర్చోవడంలాగా, దర్శకుడి అయిడియా కథా సౌలభ్యం చూసుకుని ఒక్క తుపాకీ గుండు వాడితే సరిపోయేదానికి రవితేజ మీద ఖడ్గాలతో వెంటబడేలా లాజిక్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయాల్సి రావడం రామ్ లక్ష్మణ్ లని కుదేలు చేశాయి. సీఎం తన దగ్గర  హీరో వున్నప్పుడు చుట్టూ భయంకరంగా ఆధునిక తుపాకులతో వున్న సెక్యూరిటీతో చంపడానికే సిద్ధపడినప్పుడు- అదే హీరో అక్కడ్నించి  తప్పించుకుని పారిపోతున్నప్పుడు-  ఒక్క తుపాకీ కూడా లేకుండా ఖడ్గాలు తిప్పుతూ ముఠా వెంటాడడం హాస్యంగా వుంది. మాస్ సినిమాకి ఇలా కూడా లాజిక్ ఉండకూడదా? జనరల్ నాలెడ్జి లేకపోయినా చప్పట్లు కొట్టేసేంత  లో- క్యాటగిరీయా రవితేజ మాస్ ఫ్యాన్స్ ? పాపం మూగ జీవులు...’మాస్యావరణం’ మీద ‘రసా’ యన ప్రయోగం..

స్క్రీన్ ప్లే సంగతులు
నిజానికి ఇలాటి రొటీన్ మాస్  కథలకి స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడం కూడా రొటీన్ గా చెప్పుకునేదే. పాత సంగతుల్నే తిరగేసుకుంటే సరిపోతుంది. లేకపోతే పదేపదే ఎండ్ సస్పెన్స్ కథలు కమర్షియల్ సినిమాలకి, అందునా గ్రాహ్య శక్తి తక్కువ వుండే మాస్ ప్రేక్షకులు చూసే సినిమాలకి  పనికిరావని ఎన్నిసార్లు చెప్పుకుందాంఎండ్ సస్పెన్స్ కథలు, స్ట్రక్చర్ లో వుండని కథలు, సెకండాఫ్ సిండ్రోముల కథలు..వీటి గురించి ఇంకెన్ని సార్లు బోరుకొట్టించుకుంటూ  చెప్పుకుంటూ ఉందాం? ఈ లోపాల గురించి చెప్పుకోవడం నుంచి విముక్తి  వుండదా? వుంటుంది- మళ్ళీ ఒక మనంలాంటిదో, ఇంకోటేదో బ్యూటీ ఫుల్ రైటింగ్ తో వచ్చినప్పుడు ఆనందంగా పదేపదే చెప్పుకోవడానికి ఎంతైనా వుంటుంది. ఈ ఆశాభావంతో అప్పటి దాకా ఇదింతే!

స్ట్రక్చర్ గురించి ఎంత రాసినా  నోబడీ కేర్స్ స్ట్రక్చర్.  క్రియేటివిటీయే స్ట్రక్చర్  అనుకోవడం వల్ల. స్ట్రక్చర్ కి కొలమానా లుంటాయని తెలియకపోవడం వల్ల. క్రియేటివిటీనీ స్ట్రక్చర్ నీ ఒకే గాటన కట్టడం తప్పని తెలుసుకోక పోవడంవల్ల. స్ట్రక్చర్ మెదడు చూసుకునే పని అని గ్రహించకపోవడం వల్ల. క్రియేటివిటీ హృదయంతో జరిగే తంతు అని గమనించక పోవడం వల్ల. మెదడూ హృదయమూ రెండిటితో జరిగే కథా సృష్టిని అసలే కేర్ చేయకపోవడం వల్ల.  స్క్రిప్టు ఎలా వున్నా మాస్ మహారాజానో మరొకరో తమ భుజాల మీద ఏరు దాటిస్తార్లే అనుకోవడం వల్ల.

ఎండ్ సస్పెన్స్ ని అమలు చేయడం వల్ల స్ట్రక్చర్ గల్లంతై బెంగాల్ టైగర్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎప్పుడు గాండ్రించాలో, గాండ్రించాలో కూడదో తెలీక దీనం గా మాస్టర్ కేసి చూస్తున్న సర్కస్ పులిలా ఉండిపోయింది. ఎండ్ సస్పెన్స్ తో స్ట్రక్చర్ గల్లంతవడం వల్ల, మిడిల్ అనేది లేకుండా పోయి, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయ్యింది. అందుకే సెకండాఫ్ చూస్తూంటే డెప్త్ లేని ఫీలింగ్ ఇట్టే పట్టేసుకుంటుంది మనల్ని.  

ఎండ్ సస్పెన్స్ కథనం, షుగర్ కోటింగ్ బ్రేక్ అవడం ఈ రెండూ కథనంలో మరెన్నో లోపాల్ని తెచ్చిపెట్టాయి ...
***
1. ఎండ్ సస్పెన్స్ :  రవితేజ పాయింటాఫ్ వ్యూలో ఫ్లాష్ బ్యాక్ గా కథ ప్రారంభమవుతుంది. ‘టెంపర్’ ప్రారంభంలో  ఎన్టీ ఆర్ కదనరంగంలో అవిసిపోయి వున్న దృశ్యాన్ని గుర్తు చేసుకుంటే, అలాటిదే దృశ్యం   పిస్తోలు పట్టుకుని గట్టున  కూర్చున్న రవితేజని చూపిస్తూ ఓపెనవుతుంది. లేచి బురద గుంటలో నడుస్తూంటే ఒక్కో శవం కాళ్ళ కింద నుంచి  పైకి లేస్తూంటుంది.  ఇది కట్ అయి ఫ్లాష్ బ్యాక్ ప్రారంభ మవుతుంది. ఇది బిగినింగ్ విభాగం. దీనికి తగ్గట్టే వివిధ పాత్రల పరిచయం అయ్యింది. హాయిగా పది నిమిషాల వ్యవధిలోనే బిగినింగ్ విభాగం ముగిసిపోతూ హీరోకి సమస్య (మొదటి మూల స్థంభం) ఏర్పాటయింది- హీరోకి  పెళ్లి సంబంధం చూడ్డం, ఆ పెళ్లి చూపులప్పుడు అమ్మాయి తన కాబోయేవాడు ఫేమస్ అయి వుండాలని చెప్పడంతో పది నిమిషాల్లో బెటర్ గా బిగినింగ్ ముగుస్తుంది.  దీంతో కథ మిడిల్ విభాగం లో పడి, ఇగో దెబ్బతిన్న హీరో తను  ఫేమస్ అయ్యేందుకు మంత్రిని రాయి పెట్టి కొట్టి రక్తాలు కార్చడం, ఇక అలా అలా హోం మంత్రి దగ్గర మకాం వేసేదాకా పోవడం వగైరా చకచకా జరిగిపోతాయి...

మొదటి మూల స్థంభం దగ్గర, సమస్య ఏర్పాటు చేసినప్పుడు,  అందులో హీరోకి ఆమె మాటల వల్ల గోల్ ఏర్పడింది. ఆ గోల్ లో వుండాల్సిన ఎలిమెంట్స్ 1. కోరిక,  2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. ఈ విధంగా -  1. ఫేమస్ అవ్వాలన్న కోరిక పుట్టింది, 2. దీనికోసం తన సర్వస్వాన్నీ పణంగా పెట్టి రాయి పెట్టి మంత్రి మాడు పగులగొట్టాడు, 3. దీని పరిణామాలెలా  ఉంటాయోనన్న గాభరా పుట్టించాడు, 4. ఆమె మాటల వల్ల ఎమోషన్ దానికదే పుట్టింది.

అయితే ఆమె గొంతెమ్మ  కోరికలేవో చెప్పుకుంటే హీరో తానెందుకు ఫేమస్ అవ్వాలనుకోవాలి, ఆమె తనని చేసుకునే ప్రసక్తే లేనప్పుడు? రామ్ నటించిన సూపర్ హిట్  ‘కందిరీగ’ లో ఇలాటిదే సన్నివేశం : పెళ్లి  సంబంధాని కొచ్చిన ఆవారా హీరోని పట్టుకుని – టెన్త్ పాస్ కాలేని వాడివి నాతో నీకేంటి-  అనేస్తుంది కలర్స్ స్వాతీ. దీంతో బుద్ధి తెచ్చుకుని  డిగ్రీ సంపాదించుకోవాలని  వూరు వదిలి వెళ్ళిపోతాడు హీరో. డిగ్రీ వుంటే ఈ అమ్మాయి కాకపోయినా రేపు ఇంకే అమ్మాయైనా చేసుకోవచ్చు. ఇది అర్ధవంతంగా వుంది.  కానీ రవితేజ పాత్ర ఆమె చెప్పగానే ఫేమస్ అవ్వాలనుకోవడం ఎవరి కోసం? ఈమె ఎలాగూ  చేసుకోదు. ఇక వేరే అమ్మాయిలందరూ ఈమెలాగే కోరుకుంటారనా ఫేమస్ అవ్వాలని వెళ్ళడం? ఇది కన్విన్సింగ్ గా వుందా? కన్విన్సింగ్ గా లేకపోయినా హీరో ఇలాగే ట్రావెల్ అవుతాడు.

తలపగిలిన వ్యవసాయ మంత్రి,  హీరోలో అపారమైన తెలివి తేటల్ని చూసి హైదరాబాద్ తీసికెళ్ళి అనుచరుడిగా పెట్టుకుంటాడు. ఒకరోజు ఫారిన్ నుంచి వస్తున్న హోం  మంత్రి కూతురు (సెకండ్ హీరోయిన్ రాశీ ఖన్నా) ని రిసీవ్ చేసుకోవడానికి హీరోని  పంపుతాడు వ్యవసాయ మంత్రి. అలా వెళ్లి శత్రువుల బారి నుంచి ఆమెని కాపాడి ఇంటికి చేర్చిన హీరో,  హోం మంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. ఓ సుముహూర్తాన వ్యవసాయ మంత్రి కి అవమానకర పరిస్థితిలోకి నెట్టి గుడ్ బై కొట్టేసి,  హోం మంత్రి ఇచ్చిన భారీ ఆఫర్ తో వెళ్లి అక్కడ సెటిలై పోతాడు. అతడి మీద మనసు పడుతుంది సెకండ్ హీరోయిన్. పట్టనట్టే వుంటాడు. ఆమెకి వేరే అబ్బాయితో సంబంధం ఖాయమవుతుంది. తర్వాత ఆమె  ఆ సంబంధం వద్దని, హీరోనే చేసుకుంటానని అంటుంది. ఈ పరిస్థితి హీరో కల్పించేదే.  ఇక ముఖ్యమంత్రి సమక్షంలో హోం మంత్రి తన కూతుర్ని హీరోకిచ్చి పెళ్లి చేస్తున్నట్టు ప్రకటించినప్పుడు, హీరో  తను ప్రేమించింది ఈ సెకండ్ హీరోయిన్ని కాదనీ, ముఖ్యమంత్రి కూతురైన ఫస్ట్ హీరోయిన్ ( తమన్నా) ని అనీ ప్రకటించి సంచలనం సృష్టిస్తాడు. ఇప్పుడు అదే పార్టీలో వున్న ఫస్ట్ హీరోయిన్ మొట్ట మొదటిసారిగా తెరమీదికొస్తుంది.

హీరో ప్రకటనతో ముఖ్యమంత్రి సహా అందరూ షాకవుతారు. ముందుగా హీరో ఈ ప్రకటన చేయడానికి తటపటాయిస్తున్నప్పుడు, ఆ అమ్మాయి ఎవరైనా ఆమెతో నీ పెళ్లి జరిపిస్తాను చెప్పమంటూ ముఖ్యమంత్రి వొత్తిడి చేస్తాడు. ఆనక తనే ఇరుక్కుంటాడు. ఇదికూడా హీరో ప్లేనే. ఇక్కడ హీరోయిజం ఎలివేట్ అవుతూ- బిగ్ క్వశ్చన్ మార్కుతో ఇంటర్వెల్ పడుతుంది.

ఈ మొత్తం ట్రాక్ వల్ల ఏమర్ధమవుతోంది?  సీఎం కూతురైన ఫస్ట్ హీరోయిన్ ని ట్రాప్ చేయడానికే,  హీరో వ్యవసాయ మంత్రి తలకాయ అడ్డంగా పగులగొట్టి హోం మంత్రి ఇంట్లో చేరాడనీ, అక్కడ సెకండ్ హీరోయిన్ పెళ్లి సంబంధాన్ని ఎక్స్ ప్లాయిట్ చేసి, ముఖ్యమంత్రి కూతురికే టెండర్ పెట్టడమనే పథకం తెలివిగా పారించాడనీ  అర్ధమవుతోంది. ఈ ప్రయాణంలో తానేప్పుడో సెలెబ్రిటీ అయిపోయి ఎవరూ హాని చేయలేని డిఫెన్స్ ని  ఏర్పాటు చేసుకున్నాడు. అంటే, మొదట్లో పెళ్లి చూపులప్పుడు ఆ అమ్మాయి తను ఫేమస్ కాదని తిరస్కరించినప్పుడు,  అందులోంచి స్ఫూర్తి పొంది- నేను ఫేమస్ అయితే ఈ పల్లెటూరి మొహమేం ఖర్మ, ఏకంగా సీఎం కూతురే నాదవుతుందన్న గోల్ పెట్టుకుని ట్రావెల్ అయ్యాడనీ  తెలుస్తోంది. మొదటి మూల స్థంభం దగ్గర కన్విన్సింగ్ గా లేని హీరో ప్రవర్తనకి అర్ధం ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర క్లియర్ అవుతోంది.

చాలామంది అనుకోవచ్చు- ఇంటర్వెల్ దగ్గరే టర్నింగ్ వచ్చి ఇక కథ ప్రారంభమయ్యిందని, ఇంతవరకూ నడిచింది బిగినింగ్ విభాగమే నని. ఇలా అనుకుంటే ఇంటర్వెల్లో హీరో సమస్యలో పడాలి. కానీ పడలేదు. సీఎం ని ఇరికిస్తూ తనే గేమ్ ప్రారంభించాడు. ఇలాటి టర్నింగ్ మిడిల్ మధ్యలో వస్తుంది. హీరో సమస్యలో పడ్డం, బిగినింగ్ ముగియడం ఎప్పుడో సినిమా ప్రారంభమైన మొదటి పది నిమిషాల్లోనే జరిగిపోయిందని పైన చెప్పుకున్నాం. పైనే  చెప్పుకున్నట్టు బిగినింగ్ విభాగం ముగిస్తూ  హీరోకి గోల్ ఏర్పడింది.  అక్కడ్నించీ ఇంటర్వెల్ దాకా నడిచిం దంతా మిడిల్ విభాగమే. మిడిల్ బిజినెస్ ప్రకారం సీఎం కూతురనే గోల్ కోసం హీరో చేస్తున్న స్ట్రగులే అదంతా.  ఈ స్ట్రగుల్ లో భాగంగా  గోల్ ని సాధించడానికే తలకాయలు బద్దలు కొట్టడం, హోం మంత్రి ఇంట్లో చేరి ఆటాడుకోవడమూ, చివరికి సీఎం కూతుర్ని డిక్లేర్ చేసుకుని అందరికీ  షాకివ్వడ మూనూ.

మిడిల్లో హీరో స్ట్రగుల్లో భాగంగా ఇంటర్వెల్ ఘట్టం ఒక మజిలీ మాత్రమే. కథా ప్రారంభం కాదు. కథెప్పుడో సినిమా ప్రారంభమైన పది  నిమిషాలకే ప్రారంభమయ్యింది. ఇలా ఇంటర్వెల్ వరకూ ఉద్వేగభరితంగా ఉందికదా కథనం. హీరో ఆశ్చర్య పరచే చర్యలకి అనునిత్యం పాల్పడుతూ యాక్టివ్ క్యారక్టర్ గా కథని తనే ముందుకు నడిపిస్తున్నాడు. సంఘటనల్ని తనే తెలివిగా  సృష్టిస్తున్నాడు. తన క్యారక్టర్ ఆర్క్ నీ, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ నీ ఇంటర్వెల్ దాకా బలంగా సృష్టించుకున్నాడు.

ఇక్కడ్నించీ ఏం జరిగింది? సెకండాఫ్ ఎలా నడిచింది? సెకండాఫ్ ప్రారంభ దృశ్యాల్లో సెకండ్ హీరోయిన్ కి ఫస్ట్ హీరోయిన్ తో తన ప్రేమ గురించి హీరో చెప్పడం, తర్వాత ఫస్ట్ హీరోయిన్ నిలదీస్తే అదంతా కట్టు కథ అని తేలడం, ఐనా ఈ పొజిషన్ కి చేరుకున్న అతడి తెలివి తేటలకి మెచ్చి ఆమె లవ్యూ చెప్పేయడం, అవతల- సీఎం అసలీ హీరో ఎవరని ఆరాతీయడం, అప్పుడా హీరో ఫలానా వూళ్ళో ఫలానా పంచాయితీ ప్రెసిడెంట్ కొడుకని తెలియడం, సీఎం షాక్ అవడమూ జరుగుతాయి..

సీఎం హీరోని పరీక్షించడానికి పిలిపిస్తాడు. మీ నాన్న ఎలా చనిపోయారని అడుగుతాడు. పదిహేనేళ్ళ క్రితం చేప మందు పంపిణీ ప్రోగ్రాంలో  పాల్గొన్నప్పుడు చాలా మంది ఆ మందు వికటించి చనిపోయారనీ, దాంతో  ప్రజలు దాడి చేసి నాన్నని చంపేశారనీ  చెప్తాడు హీరో. సీఎం నెమ్మదిస్తాడు. హీరో మాటల్లో  తేడా వస్తే వెంటనే షూట్ చేసేందుకు రహస్య ఏర్పాటు చేసుకుంటాడు సీఎం. అందరూ నమ్ముతున్నదే హీరో కూడా నమ్ముతున్నాడని తెలిశాక, తన కూతురితో ప్రేమ గురించి అడుగుతాడు. 500 వందల కోట్లతో హీరోని కొనేసి కూతుర్ని కాపాడుకుంటాడు సీఎం. అంతకి ముందు హీరోని వెనకేసుకొచ్చిన కూతురు ఇప్పుడేమీ అనలేక పోతుంది. హీరో మాట తప్పుతాడు. పరస్పరం సవాళ్లు చేసుకుంటారు. దాని ప్రకారం ఇరవై నాలుగ్గంటల్లో  హీరోని తను గనుక చంపించెయ్యక పోతే, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని రాసిస్తాడు సీఎం.  సీఎం చంపగల్గితే, తన చావుకి తనే బాధ్యుణ్ణని హీరో కూడా రాసిస్తాడు. గేమ్ మొదలవుతుంది..

ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది తెలిసిందే అయినా, హీరో సీఎంతో  సమానంగా ఎదిగింది అతడి కూతురు కోసం కాదనీ, అతడి మీద పాత పగేదో  తీర్చుకోవడం కోసమనీ మనకి అర్ధమవుతుంది. సీఎం హీరో తండ్రిని చంపి వుంటే, ఎలా ఎందుకు చంపాడనేది క్లయిమాక్స్ ముందు వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ అవుతుంది. ఆ తర్వాత క్లయిమాక్స్- దుష్ట శిక్షణ- సుఖాంతం.

***
ఈ సెకండాఫ్ కథ ఎందుకు బోరు కొట్టింది? ఎందుకంటే, ఇది ఎండ్ సస్పెన్స్ కథనం అవడం వల్ల. ఎండ్ సస్పెన్స్ ఎలా అయ్యింది? అసలు గతంలో ఏం  జరిగిందో క్లయిమాక్స్ వరకూ మూసి పెట్టడంతో. ఒక హత్య జరిగినట్టు చూపించారనుకుందాం. ఆ హత్య ఎవరు చేశారో చివరి దాకా చెప్పకుండా ఎండ్ సస్పెన్స్ కథనం చేస్తే అది సినిమాకి పనికి రాదు. పాఠకుడు ఒక్కడే కూర్చుని తీరుబడిగా చదువుకుని ఎంజాయ్ చేసే   ప్రింట్ మీడియాకి పనికొస్తుంది. హంతకుణ్ణి చూపించేసి, ఇక వాణ్ణి ఎలా పట్టుకుంటారో రోమాంచిత కథనం చేస్తే అప్పుడది  సినిమా అనే దృశ్య మాధ్యమానికి వర్కౌటయ్యే ‘సీన్ – టు – సీన్ సస్పెన్స్’  కథనం అవుతుంది. మూసి పెట్టి కథనం చేస్తే హంతకుడెవరో తెలిసి చావక  గుడ్డెద్దు చేలో పడ్డట్టు  ప్రేక్షకులకి సహనపరీక్షగా కథనం తయారవుతుంది. హీరోగారికి విలన్ లేక ఏకనాధంలా ఏదేదో చేసుకుంటూ తిరుగుతూంటాడు. క్లయిమాక్స్ తో తప్ప హీరోకి విలన్ అనేవాడు ఏర్పాటు కాడు. చాలా పాత రోజుల్లో ‘గుండెలు తీసిన మొనగాడు’, ‘ఖానూన్’ లాంటి అనేక సినిమాలకి ఇది చెల్లిపోయింది. గత ఇరవయ్యేళ్ళుగా మాత్రం ఇలాటివి వర్కౌట్ కావడం లేదు. ఆ ఓపిక ప్రేక్షకుల్లో లేదు.  ఆ మధ్య ‘ఆ ఒక్కడు’, ఈ మధ్యే ‘జాదూగాడు’ లాంటివి అనేకం ఇలా వచ్చి ఫ్లాపయ్యాయి.  

ఒకవేళ ఎండ్ సస్పెన్సే తప్పకపోతే, దాన్ని దొంగాటలో చూపించినట్టుగా చేసుకోవచ్చు- కనీసం సెకండాఫ్ ప్రారంభం నుంచైనా మూసి పెట్టిన సస్పెన్స్ ని రివీల్ చేసి. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లో  అసలు చివరిదాకా నడిచింది ఎండ్ సస్పెన్స్ కథనమని తెలియకుండానే ఎండ్ సస్పెన్స్ కథనం నడిపి సక్సెస్ అయ్యారు.  ఇదెలా జరిగిందో తర్వాత ‘షుగర్ కోటింగ్’ సెక్షన్ లో తెలుసుకుందాం.

సంపత్ నంది దగ్గర క్రియేటివిటీ వుంది, స్ట్రక్చర్ స్పృహ కూడా వుండాలి. హీరో ఫాదర్ ఎలా హత్యకి గురయ్యాడో చిట్ట చివర్లో రివీల్ చేయడం స్ట్రక్చర్ నే దెబ్బతీసి మొత్తం సెకండాఫ్ కథనాన్ని డొల్లగా మార్చేసిందని  తెలుసుకోలేదు. తను ఆడుకుంది సినిమాకి పనికిరాని ఎండ్ సస్పెన్స్  కథనంతో అని గమనించలేదు.  హీరో అసలు సమస్య తండ్రి హత్యకి పగ తీర్చుకోవడం అయినప్పుడు,  ఆ విషయం  బిగినింగ్ ముగిపులోనే తెలియజేసి సమస్య ఇదీ అని చెప్పేయాలి. లేదా ఇంటర్వెల్లో సీఎం కూతుర్ని ప్రేమిస్తున్నట్టు చెప్పినపుడే, ఈ  హత్యగురించి కూడా సీఎం కి హింట్ ఇచ్చి డబుల్ షా కివ్వాలి. సెకండాఫ్ ఓపెనింగ్ లో వెంటనే సీఎం తను చేసిన పాపం తాలూకు ఫ్లాష్ బ్యాక్  వేసుకోవాలి. హీరో తండ్రిని తనెలా  చంపాడో చూపించెయ్యాలి. అక్కడ్నించీ తన మీద పగబట్టిన హీరోతో గేమ్  మొదలెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకోసం ఈ గేమ్  సాగుతోందో ప్రేక్షకులకి బోధపడి ఎంజాయ్ చేయగల్గుతారు.  ముందే ఆ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయడంతో,  హీరో పట్ల సానుభూతి కూడా ఏర్పడుతుంది ప్రేక్షకులకి. ఇంటర్వెల్లో నే హింట్ ఇచ్చాడు కాబట్టి,  ఇప్పుడు హీరో  ఎమోషన్స్ ఆ మేరకు డెవలప్ అయి  మళ్ళీ క్యారక్టర్ ఆర్క్ నీ, టైం అండ్ టెన్షన్ గ్రాఫునీ అందుకుని- సెకండాఫ్ లో  ఇప్పుడేం జరుగుతుందన్న సీన్ - టు - సీన్ సస్పెన్స్ మొదలైనవి ఏర్పడతాయి. ఇది వర్కౌట్ అవుతుందా? అస్సలు కాదు. మరెందుకు ఇదంతా చెప్పుకోవడం? దీని కింది సెక్షన్ లో చెప్పుకోబోయేది  అర్ధం గావడానికి. ఇదంతా కూడా ఎందుకు వర్కౌట్ కాదంటే...  ఇదంతా సెకండాఫ్ ని ఒకటే వయొలెంట్ యాక్షన్ గా మార్చేస్తుంది. ( సినిమాలో వున్నది ఇదే). ఫస్టాఫ్ తో హీరోయిన్లతో ఉన్న కథ – అక్కడేసిన ముడి, సెకండాఫ్ లో ఫ్లో కావు. అప్పుడు కథనం తెగి,  ఫస్టాఫ్ లో ఒకలా  వున్న కథ, సెకండాఫ్ లో మరొకలా మారిపోయి- సెకండాఫ్ సిండ్రోం అన్పించుకుంటుంది.  ఏ రసప్రధానంగా కథ మొదలెట్టారో, ఆ రస ప్రధానంగానే వినోదాత్మకంగా చెప్పుకు పోవాలి. ‘ముత్యాల ముగ్గు’ మూలంలో లో వున్న శోక రసాన్ని కప్పెట్టి, ఆద్యంతం అద్భుత రసంతో ఎంత వినోదాత్మకంగా నడిపారో తెలిసిందే. అలాగే ఫస్టాఫ్ అంతా ఒకరి తర్వాత ఒకరుగా హీరోయిన్లతో హీరో ఎత్తుగడలతో కట్టిపడేసిన  కథనం, ఇంటర్వెల్ దగ్గర  వాళ్ళతో హీరోకి పడ్డ  ‘ముడి’ తో, సెకండాఫ్ లో కూడా ఈ ముగ్గురి మధ్య కథనే ఆశిస్తారు ప్రేక్షకులు. మొదలెట్టిన ప్రధాన కథ ఇదే కాబట్టి. 

ఈ ముడి ని ఎలా విప్పుతారన్న రోమాంటిక్ కథనాన్నే కోరుకుంటారు తప్ప, ఇంకేదో మీదేసుకుని యాక్షన్ కథని కాదు. మరి హీరో పగ సంగతి? అది మరుగున వుండి చిట్టచివర్లో  పైకి తన్నుకొస్తుంది!!  స్ట్రక్చర్ ని పదిలంగా ఉంచుతూ క్రియేటివిటీని ప్రదర్శించడమంటే ఇదే. స్ట్రక్చర్ లేకపోతే క్రియేటివిటీకి అర్ధంపర్ధమే లేదు.

***
షుగర్ కోటింగ్ : దీని మీద జేమ్స్ బానెట్ ఒక చాప్టరే రాశాడు. షుగర్ కోటింగ్ అంటే లవ్, సాంగ్స్, రోమాన్స్, కామెడీలని  దట్టించడమే అనుకుని ఆ జోరుగా పనిమీద వుంటే అంతే సంగతులు. మొత్తం  కథకే షుగర్ కోటింగ్ అనేది ఒకటి వుంటుంది. పైన చెప్పుకున్న ‘ముత్యాల ముగ్గు’ లో శోకరసానికి  అద్భుత రసంతో ఇచ్చినట్టుగా. అలా కాకుండా ఒక ఏడ్పు చూపించి, లవ్ వేసి, ఇంకో ఏడ్పు చూపించి, ఫైట్ వేసి, ఇంకో ఏడ్పు సీను  తర్వాత సాంగ్ వేసుకుంటూ పోతే అది ‘ముత్యాల ముగ్గు’ అవదు- ‘బెంగాల్ టైగర్ ‘ సెకండాఫ్ అవుతుంది.

‘బెంగాల్ టైగర్’ సేకండాఫ్ షుగర్ కోటింగ్ ని బ్రేక్ చేసుకుని ప్రేక్షకుల మీద పడింది. పాయసం లాగేసుకుని చీప్ లిక్కర్ ఇచ్చింది. పాయసం లాంటి ఫస్టాఫ్ కథనమంతా షుగర్ కోట్ తో సింగారించిందని తెలుసుకోకుండా. ఇంటర్వెల్ వరకూ హీరో ఉద్దేశాల్ని దాచిపెట్టి నడిపిన కథనమంతా హీరోయిన్లతో హీరో చేసుకుపోయే షుగర్ కోటింగే. ఇంటర్వెల్లో ఈ షుగర్ కోటింగ్ మాటున దాగి వున్న అసలు విషయం చెప్పాడు. పనిలో పనిగా ఇది దాచిపెట్టిన ఎండ్ సస్పెన్స్ అయ్యింది. ఎండ్ సస్పెన్స్ అని తెలియకుండా ఎండ్ సస్పెన్స్ ని రివీల్ చేయడమంత క్రియేటివ్ పవర్ మరొకటి లేదు. మరి దీన్ని సెకండాఫ్ లో ఎందుకు అనుసరించకుండా ఎండ్ సస్పెన్స్ అని తెలిసిపోయే యాక్షన్ కథ నడిపి విషయం లేకుండా చేసుకున్నట్టు?

ఎప్పుడైతే ఇంటర్వెల్లో హీరోయిన్లతో ముడి పడిందో అప్పుడు విలన్ ని కెలుక్కోవడమే కొంపలు ముంచింది. అప్పుడు విలన్ తో కథయిపోయింది. కానీ కథ అది కాదు- ఇద్దరు హీరోయిన్లని మభ్య పెట్టి పై స్థాయికి చేరుకున్న హీరో కథ ఇదంతా. చర్యకి ప్రతిచర్య తప్పకుండా వుంటుంది. స్ట్రక్చర్ లో హీరోయిన్లని మభ్య పెట్టడమనే చర్యకి హీరో పాల్పడ్డాక ( సెటప్ ఏర్పాటు చేశాక), దీనికి హీరోయిన్ల ప్రతిచర్య ( పే ఆఫ్ )  లేకుండా అర్ధాంతరంగా ఎలా వదిలేస్తారు?  1 set up = 1 compulsory pay off అని కదా?

పనిమాలా హీరో పగ కథ కెలుక్కున్నారు. దాని గురించి ఆడియెన్స్ కి తెలీనే తెలీదు. అక్కర్లేదు కూడా. ప్రేక్షకులు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యింది- తను ఫేమస్ అయి పల్లెటూరి దాన్ని చేసుకునేదేంటి, సీఎం కూతురికే గాలం వేస్తా అనే అర్ధంలో ఇంటరెస్టింగ్ గా సాగుతున్న హీరో కథలో మాత్రమే.

గాలం వేశాకా ఈమెతో ఏం గేమ్ ఆడాడు, అప్పుడు మొదటి అమ్మాయి ఏం చేసిందనే మరింత పైస్థాయికి చేరే ట్రాయాంగులర్ రోమాంటిక్ గిమ్మిక్కుల్నే ఆశిస్తారు ప్రేక్షకులు. మధ్యలో సీఎం ని కూడా ఏడ్పిస్తూంటాడు హీరో. ఎందుకిలా చేస్తున్నాడో సీఎం కి కూడా అంతు చిక్కడు. ఆడియెన్స్ కి ఎదురయ్యే సందేహాల్ని అతను వ్యక్తపర్చుకుంటూ రిఫరెన్స్ క్యారక్టర్ లా ఉంటాడు. ఓ పక్క ఇతణ్ణి కూడా ఫాలో అవుతూ వుంటారు ప్రేక్షకులు.

ఈ మొత్తం కథంతా ఒక్క హీరో పగ కోసం పుట్టింది. దీన్ని దాచి పెట్టి షుగర్ కోటింగ్ వేయడమే పైన చెప్పుకున్న కథనం. పై అంచెలో నడుస్తున్న  కథనమంతా మొదటి నించీ కూడా హీరో- హీరోయిన్ల మధ్య బ్రేక్ అవని షుగర్ కోటింగ్ కథనంలా ఉంటూ- చిట్టా చివర్లో బ్త్ర్క్ అవుతుంది. అప్పుడు హిడెన్ ట్రూత్ బయటికి వస్తుంది. ఆ హిడెన్ ట్రూత్ హీరో తండ్రి హత్యా  దృశ్యంతో బ్లాస్ అవుతుంది. ఎలాగైతే ఇంటర్వెల్లో హీరో తన గేమ్ ని బ్లాస్ట్ చేశాడో- అంతవరకూ  కథనం ఎలా వేడెక్కుతూ  సాగిందో- అదే సెకండాఫ్ లో హీరోయిన్లతో వేడెక్కుతూ సాగి చివర్లో బ్లాస్ట్ అవుతుంది- అప్పుడు హిడెన్ ట్రూత్ బయట పడుతుంది. ఆ తర్వాత యాక్షన్ తో క్లయిమాక్స్.

ఇలాటిదే జరిగింది ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లో. సినిమాలకి సంబంధించి ఎండ్ సస్పెన్ కథలతో వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తూ ఎప్పుడో 1958 లో బ్రిటిష్ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడోఅనే బ్లాక్ అండ్ వైట్ థ్రిల్లర్ ద్వారా సెట్ చేసి పెట్టాడు. 1981 లో దీన్నే ధువాఁగా హిందీలో విజయవంతంగా ఫ్రీమేక్ చేశారు.

స్ట్రక్చర్ ఎక్కడైనా ఒక్కటే. క్రియేటివిటీ మాత్రం రకరకాలు. రకరకాల టెక్నిక్కులతో కథన సమస్యలకి పరిష్కారాలు.  టెక్నిక్కులు తెలుసుకోకపోతే క్రియేటివిటీకి కూడా విలువ లేదు. విజయవంతమైన సినిమాల్లోనే హిట్టయ్యే టెక్నిక్కులు వుంటాయి- ఫ్లాపయ్యే సినిమాల్లో  ఏమీ వుండవు. కావలసింది ఒక సినిమా ఏ టెక్నిక్ తో విజయవంతమయ్యిందని పసిగట్టడమే. దాన్ని అనుసరించడమే.



—సికిందర్