రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఫిబ్రవరి 2015, సోమవారం

క్యానన్ బ్లాస్టర్స్ ...



పేల్చేస్తారు క్యానన్ బ్లాస్టర్లు!
మోహన్ –కృష్ణ
నవరి 13, 1999 సంక్రాంతికి  తెలుగు తెర మీద  ఒక ఉద్విగ్నభరిత దృశ్యావిష్కరణ జరిగింది : ఒక్క పెట్టున టాటా సుమోలు పేలిపోయి పైకి లేచిపోవడం! సౌజన్యం : మోహన్- కృష్ణ ఫ్రం చెన్నై. ఆ సినిమా : సమరసింహా రెడ్డి.

     నాటి నుంచీ నేటి వరకూ ఏ సినిమాలో ఏ వాహనం పేలిపోయి ఎగిరి పడ్డా ఆ దృశ్య సృష్టికర్తలు వీళ్లిద్దరే. క్యానన్ బ్లాస్టర్స్ అంటారు వీళ్ళని. మొత్తం దేశంలో వీళ్ళిద్దరూ కాక మరొక్కరే  ఇలాటి టెక్నీషియన్ బాలీవుడ్ లో వున్నారు. మోహన్ కుమార్ తమిళియన్ అయితే, కృష్ణా రాథోడ్ గుజరాతీ. ఇరవై ఏళ్లుగా ఫీల్డులో వుంటున్నారు. చెన్నై  కేంద్రంగా పనిచేస్తున్న ఈ జంట బ్లాస్టర్స్ నిరంతర సంచారులు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, ముంబాయి ల చుట్టూ తిరుగుతూ, ఆయా  భాషా చిత్రాలకి సేవలందిస్తూ, ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడుంటారో తెలీనంత  బిజీగా గడుపుతూంటారు.

    క్యానన్ బ్లాస్టింగ్ – యాక్షన్ దృశ్యాల్ని ఎనర్జెటిక్ గా మార్చేసిన సరికొత్త యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆవిష్కరణ. ఇదింకో ముందడుగు కూడా వేసింది. ఆగి వున్న వాహనాన్ని పేల్చేసి ఆకాశమార్గం పట్టించడం దగ్గర్నుంచీ, ఇప్పుడు ఏకంగా నడుస్తున్న వాహనాన్నే బ్లాస్ట్ చేసి ఊర్ధ్వ ముఖయానం గావించే దశకి చేరుకుంది. మొదటి దాంట్లో అంతగా రిస్కు లేదంటారుకృష్ణ. రెండోది మాత్రం ప్రాణాలతో చెలగాటమే. కారణం, ఇందులో ఆ వాహన డ్రైవర్ (స్పెషల్ వర్కర్ లేదా జంపర్ అంటారు) ప్రాణాలకు తెగించి ఉంటాడు.

       అసలీ క్యానన్ బ్లాస్టింగ్ అంటే ఏమిటి- ఇది మన దేశానికి ఎలా వచ్చిందీ అంటే, బాలీవుడ్ నుంచీ సత్తూ పటేల్ అనే యాక్షన్ డైరెక్టర్ లండన్ వెళ్లి ఈ టెక్నిక్ నేర్చుకుని వస్తే, ఆయన దగ్గర తర్ఫీదు పొందారు మోహన్- కృష్ణ లు. వీళ్ళు ఒక  విషయాన్ని పొరపాటు లేకుండా రాయాలని మరీ మరీ కోరారు..ముంబాయిలో ఒక పాత్రికేయుడు ఇలాగే తమని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఈ క్యానన్ బ్లాస్టింగ్ ప్రక్రియని దేశానికి పరిచయం చేసిన ఘనత తామిద్దరిదే నని రాసేశారట!  ఇది చాలా తప్పనీ, తాము కేవలం ఇంజనీర్ల వంటి ఫైట్ మాస్టర్ల కింద పనిచేసే మేస్త్రీల వంటి వాళ్ళమేననీ స్పష్టం చేశారు మోహన్ – కృష్ణ లు. పేలుడు దృశ్యాల కొరియోగ్రఫీ అంతా ఫైట్ మాస్ట ర్లదే ననీ, సిలిండర్లతో వాహనాన్ని ఎంత ఎత్తుకి పేల్చాలి, ఆ వాహనం ఏ కోణంలో ఎక్కడ ఎగిరి పడాలి, కెమెరాలు ఏ  దూరాలలో ఎలా ఉంచాలి,  మొదలైన క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫైట్ మాస్టర్లే నిర్దేశిస్తారనీ చెప్పుకొచ్చారు.  

        ఇక్కడొకటి గమనించాల్సింది వుంది. క్యానన్ బ్లాస్టింగ్ లో నిజానికి బ్లాస్టింగేమీ జరగదు. కేవలం అధిక ఒత్తిడితో నైట్రోజన్ వాయువుని పంపి,  పిస్టన్స్ పనిచేసేట్టూ చేయడమే ఇక్కడ జరిగే అసలు మెకానిజం. ఈ పిస్టన్సే  సదరు వాహనాలని పైకెగరేస్తాయన్నమాట. అలా ఎగిరిన క్షణంలో,  టైమింగ్ తో వేరే టెక్నీషియన్స్ వాటి కింద పెట్రోల్ బాంబులు పేల్చేస్తారు. అదన్న మాట.

       ఎక్కడ వాహనాలని పేల్చాలో అక్కడ గోతులు తీసి నైట్రోజన్ సిలిండర్స్ ని  పాతిపెడతారు. వాటి  తీగెల్ని భూమి లోపలి నుంచి లాగి స్విచ్ బోర్డుకి అమర్చుకుంటారు. వాహనాల్లో ఇంజన్లు, ఇతర ముఖ్యమైన విడి భాగాలూ తీసేసి డొల్లగా తయారు చేస్తారు. చేతి కింద టీములో నల్గురైదుగురు వెల్డర్స్ మాత్రమే వుంటారు. ఇంతకి  మించి ఇంకెవరూ వుండరు. ‘ఇరవై శాతం పని, 80 శతం ఆలోచనగా మా వర్క్ వుంటుంది’ అన్నారు కృష్ణ.

      ఇక నడిచే వాహనాన్ని పేల్చే  విషయానికొస్తే, చాలా రిస్కు తీసుకుని కష్ట పడతామన్నారు కృష్ణ. నిజానికి పేలే సమయంలో ఆ వాహనం నడుస్తూ వుండదు. అలా పేల్చడం సాధ్యం కాదు కూడా. సిలిండర్స్ ని ఎక్కడైతే పాతిపెట్టారో,  ఆ చోటు మీది కొచ్చి వాహనం ఒక్క క్షణం ఆగాల్సిందే. ఆ రెప్పపాటు కాలంలోనే ఒకేసారి సిలిండర్స్ నీ, పెట్రోల్ బాంబుల్నీ పేల్చేస్తారు. అప్పుడు పెద్ద విస్ఫోటనం తో ఆ వాహనం పైకెగిరి కింద పడుతుంది. ఆ వాహనం నడుపుతున్న స్పెషల్ వర్కర్ లేదా జంపర్ కి నిలువెల్లా ఎటువంటి తాకిడి కైనా తట్టుకునే మందంతో ప్యాడింగ్ చేస్తారు. కనుక అతను సేఫ్ గా వుంటాడు. ఈ స్పెషల్ వర్కర్స్ లేదా జంపర్స్  కూడా దేశంలో ఇద్దరే,  అది కూడా బాలీవుడ్ లోనే వున్నారు. వీళ్ళే మన తెలుగు సినిమాలకి వచ్చి పని చేసి పోతూంటారు.

       సమరసింహా రెడ్డి, ఆది, చెన్నకేశవ రెడ్డి, అతనొక్కడే, సైనికుడు, ...ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జంట క్యానన్ బ్లాస్టర్లు పని చేసిన తెలుగు సినిమాలు 150 వరకూ వుంటాయి. మొత్తం అన్ని భాషలూ కలిపి 300 పైనే వుంటాయి. తెలుగులో ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ కి పని చేస్తున్నారు. చెన్నైలో యూనియన్ వుంది వీళ్ళకి. కానీ  హైదరాబాద్ లో తెలుగు ఫీల్డుకి సంబంధించి ఈ శాఖకి ఎలాటి గుర్తింపూ, యూనియన్ కూడా లేవన్నారు. ఫైట్ మాస్టర్లు తమ యూనియన్ లో వీళ్ళని కలుపుకోరు. ఇక్కడ యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్  టెక్నీషియన్ గా  చెన్నై నుంచి వచ్చి స్థిరపడ్డ  సాదిరెడ్డి రామారావు శిష్యులే మిగతా టెక్నీషియన్లందరూ.  వీళ్ళంతా 40 మంది వరకూ వుంటారు. యూనియన్ గా  ఏర్పడేందుకు వీళ్ళెవరూ సహకరించడం లేదు. రేపెప్పుడైనా వీళ్ళల్లో ఎవరైనా ఏదో ప్రమాదం చేసి పారిపోతే, వీళ్ళని ప్రోత్సహిస్తున్న నిర్మాతలు ఏం చేస్తారన్న ప్రశ్న వస్తోంది.  ఇంతేకాదు , ఎలాటి  గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో వీళ్ళకి పోలీసులతో సమస్యలు కూడా వస్తున్నాయి.

      కాలం మారుతున్నా, తరతరాలుగా సినిమా క్రాఫ్ట్స్ ఇరవై నాలుగే అని పరిశ్రమ పెద్దలు గిరిగీసుకుని వుండడం విడ్డూరమే!  



సికిందర్
(2011 జూన్, ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

బందిపోటు బాధ!

పంచ్,పెప్,కిక్,ఫట్ !

కథ-మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం :  మోహన కృష్ణ ఇంద్రగంటి 
తారాగణం :  అల్లరి నరేష్‌, ఈషా, శ్రీనివాస్ అవసరాల, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి, రావు రమేష్‌, చంద్రమోహన్‌, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్‌సప్తగిరి, సాయాజీ షిండే
కెమెరా
:  పి.జి. విందా, సంగీతం : కళ్యాణి కోడూరి, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల  
బ్యానర్ : ఈవీవీ సినిమా
నిర్మాత: రాజేష్ ఈదర
విడుదల : 20, పిబ్రవరి 2015,  సెన్సార్  U/A
***
      అల్లరి నరేష్ అల్లరి అంతా నానాటికీ అల్లరై పోతోంది. నవ్వుమీద తనకు తాను జీవితకాల నిషేధమేదో  విధించుకున్నట్టు, నవ్వించగల  డైరెక్టర్లని పక్కన  పెట్టేసి, రెగ్యులర్ దర్శకుల్నీ, వాళ్ళలోనూ క్లాస్ టచ్ గల సీరియస్ దర్శకుల్నీ ఏరికోరి మరీ,  వెరైటీ పేరుతో ప్రోత్సహిస్తూ, తను కొవ్వొత్తిలా కరిగిపోతూ చాలా త్యాగం చేసుకుంటున్నాడు సొంత కెరీర్ని. వరుసగా పదకొండో సినిమా కూడా సక్సెస్ కాకుండా చూసుకోవడానికి కంకణం కట్టుకున్నట్టు - కుండపోత కామెడీకి నిండుకుండ లాంటి దివంగత తండ్రి ఈవీవీ సత్యనారాయణ సొంత బ్యానర్ ‘ఈవీవీ సినిమా’ ద్వారా శుభమా అంటూ నిర్మించిన ఈ తొలి సినిమానూ త్యాగాల బాట పట్టించడమే కామెడీ యేమో! ‘అంతా నీ కోసం అందుకే ఈ వేషం చీకటిలో ఏదో కన్నాను’-  అని ఎన్టీఆర్ ‘బందిపోటు’ లో పాటలాగా, వేషభాషలు మార్చి, ‘అంతా మీకోసం అందుకే ఈ క్లాస్ వేషం పనికొస్తాను పెట్టుకోండిక  క్లాస్ హీరోగా’ – అంటూ ప్రమోట్ చేసుకోవడానికి పనికొచ్చే సినిమా తీసినట్టయ్యింది చివరికి –ఇదింకా కామెడీ! 


       దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, ఈసారి అల్లరి నరేష్ లాంటి ఏకైక టాప్ మాస్ కామెడీ హీరోతో నైనా తను తీసే కథా కథనాల స్థాయిని పై లెవెల్ కి తీసుకుపోతాడేమో అని మనం ఆశగా ఎదురుచూడ్డం కూడా, కామెడీ అయిపోవడం డబుల్ ఐరనీ ఇక్కడ. 

        తను సున్నిత హాస్యం పలికించే కోవకి చెందిన దర్శకుడైనప్పుడు- దానికి కమిటై వుండాల్సింది. హిందీలో ‘రంగీలా’, ‘ఎస్ బాస్’, ‘దౌడ్’ ఫేమ్ రచయిత సంజయ్ చెల్ దర్శకుడుగా మారి,  ఏకంగా సంజయ్ దత్ లాంటి హీమాన్ తో ‘ఖూబ్ సూరత్’ (1999) లాంటి సున్నిత హాస్య భరిత చలనచిత్రాన్ని ఎలా విజయవంతంగా తీయగాలిగాడో తెలుసుకోగలిగితే- ఈ జానర్ నిర్వచనం తెలుస్తుంది. న్యూయార్క్ లో స్క్రీన్ ప్లే కోర్సు చేసిన ఇంద్రగంటికి తానిప్పుడు తలపోసిన సినిమా కథ జానరేమిటో తెలిసే వుంటే- ఇదిలా ఎందుకు ఎటూ కాని కిచిడీ అయ్యిందో ఆలోచించాల్సిన అవసరముంది. 

        జానర్ జడ్జిమెంటులో స్పష్టత కొరవడ్డం ఈ ‘బందిపోటు’ కి పడ్డ ఓ అన్యాయపు శిక్ష!

బందిపోటా- బురిడీ మాస్టరా?
          దొరల వేషంలో వుండే  దొంగల్ని దెబ్బతీయడమే వృత్తి గా పెట్టుకున్న విశ్వ( అల్లరి నరేష్) ఒకసారి అలా కొందర్ని బకరాల్ని చేస్తూ  జాహ్నవి (ఈషా)  అనే అమ్మాయి కెమెరాకి చిక్కుతాడు. ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఓ ముగ్గుర్ని బకరా గాళ్ళని చేసి ఆటాడుకోవాలని అంటుంది. ఈ ముగ్గురూ మకరందరావు ( తనికెళ్ళ భరణి), శేషగిరి (రావు రమేష్), భలే బాబు (పోసాని కృష్ణ మురళి) లు తన తండ్రిని మోసం చేసిన పెద్దమనుషులు. వీళ్ళ ఫైనాన్స్ కంపెనీలో పని చేసిన  తన తండ్రి సత్యనారాయణ ( శుభలేఖ సుధాకర్)  వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్న తీరుకి తిరగబడితే, కుట్ర చేసి జైలుకి పంపారనీ; దీంతో తన తల్లి గుండె పోటుతో చనిపోయిందనీ; పదేళ్ళు శిక్ష అనుభవించి పక్షపాతంతో తండ్రి విడుదలై వచ్చాడనీ; ఇప్పుడా ఘరానా పెద్దమనుషుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనీ అంటుందామె. 


విశ్వ ఒప్పుకుని ఒక్కొక్కర్నీ ఒక్కో విధంగా  బకరాలు చేయడం మొదలెడతాడు. ముగ్గుర్నీ బకారాల్ని చేశాక్ జాహ్నవి మెప్పునీ  ప్రేమనూ పొందుతాడు. ఇదీ కథ!


ఎవరెలా చేశారు
           నరేష్ కిదో కష్టమైన పాత్రేం కాదు. కాస్ట్యూమ్స్ తో, బాడీ లాంగ్వేజ్ తో క్లాస్ గా కన్పిస్తూ అదికూడా పాత్రలో తగిన డెప్త్, ఎమోషన్ లేకపోవడంతో తక్కువ శ్రమతో నటించి సరిపుచ్చుకున్నాడు. ఇదే తన మార్కు వూర కామెడీ అయ్యుంటే చాలా పనుండేది తన టాలెంట్ తో. ప్రేక్షకులు తననుంచి ఆశించేది వూర కామెడీనే. బాపు తీసిన ‘సుందర కాండ’ తో, కె. విశ్వనాథ్ తీసిన ‘శుభప్రదం’  తో ఏం జరిగాయి? ఇప్పుడూ అంతకి మించి ఏమీ జరగదు. స్కూల్స్ పరంగా తూర్పు పడమరల్లాంటి ఇంద్రగంటీ నరేష్ ల కాంబినేషన్ సహజంగానే అతకలేదు.  ఇమేజి మేకోవర్ అంటే క్యారక్టర్ మేకోవర్ అని కూడా అర్ధం జేసుకోక పోవడం వల్ల ఇద్దరూ అభాసు అయ్యారు. క్యారక్టర్ మేకోవర్ అవసరాన్ని గుర్తించి వుంటే, క్లాస్ ఇమేజి మేకోవర్ కి సూటయ్యే క్లాస్ కామెడీయైనా ప్రేక్షకులకి మహాద్భాగ్యంగా దక్కేది. క్యారక్టర్ మేకోవర్ ని కూడా గుర్తించి వుంటే, కథ కూడా కిచిడీ జానర్ తో కాకుండా, సజాతి జానర్లతో ఏక సూత్రతతో సూటిగా హృదయాల్ని తాకేది. దీని గురించి వివరంగా కింది పేరాల్లో తర్వాత చూద్దాం. 


        హీరోయిన్ ఈషాకి  పెద్దగా పాత్రే లేదు. కానీ ఆమె ఎంట్రీలో ‘బందిపోటి’ అని పెద్ద బిల్డప్పిస్తూ లెటర్స్ వేసి ప్రేక్షకులకి ఆ పాత్ర పట్ల ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసి, ఆనక ఉస్సూరన్పించడమే జరిగింది. తన దృష్టిలో హీరో ఏదో ఒక ‘అద్భుతం’ చేయగానే,  కొత్త కాస్ట్యూమ్స్ పట్టుకుని పాటకోసం రెడీగా వుండడమే ఈమె ‘బందిపోటీ’ తనపు డ్యూటీ అయ్యింది. 

        దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల తనికెళ్ళ అనుచరుడిగా ఉత్తుత్తి తెగ బిజీ పాత్రలో ఏదో జరిగిపోతోందన్నట్టు హడావిడి చేస్తాడు. 

         తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని త్రయం ఎంతకీ ఎదగని తమ పాసివ్ పాత్రల్ని చూసుకుని విచారిస్తున్నట్టుగా, ఒకే ఎక్స్ ప్రెషన్స్ ని  రిపీట్ చేస్తూ పోయారు. పాత్రల లోతుపాతుల్ని బట్టే అభినయాలు కదా? హీరో అంత దెబ్బ తీసినా ఏమీ చేయకుండా ఏదో చేసేద్దామని పదేపదే ఆవేశపడే అవే దృశ్యాలతో అవే ఎక్స్ ప్రెషన్స్ కాక ఏం వస్తాయి? సాయాజీ షిండే పరిస్థితీ ఇంతే. కమెడియన్ సప్తగిరి కూడా ఛానెల్లో కూర్చుని అవే డైలాగుల్ని వల్లెవేయడం.

         సంపూర్ణేష్ బాబు ఎందుకున్నాడో అర్ధం గాదు.  
హీరోకి నేస్తం గా ఉంటూ ఏ పనీ చెయ్యకుండా, హీరో చేసే వాటికి బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ తనలో తానూ కిచకిచ నవ్వుకుంటూ ఉంటాడు. ట్రైన్ కూపే సీనులో హీరో పోసానీని బకరా చేస్తున్నప్పుడైతే,  అటక మీద కూర్చుని చూస్తూ ఈ నవ్వుల్నీ నవ్వుకోలేక మరీ  దయనీయ స్థితికి జారిపోయాడు సంపూర్ణేష్. పాపం దర్శకుడు విధించిన శిక్ష! పాపులర్ నటుల్ని కథలో ఇన్వాల్వ్ చేసి కథనీ, తద్వారా వాళ్ళ నటనలతో సినిమానీ  ఎలా ఎలివేట్ చేసుకోవచ్చో తెలియకపోవడం వల్ల ఇలా జరిగింది బహుశా.
   
         టెక్నికల్ గా విందా కెమెరా వర్క్ నీటుగా వుంది. కల్యాణీ కోడూరి పాటలకంటే కూడా నేపధ్య సంగీతమే బావుంది. ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల అనవసరంగా సాగిన సెకండాఫ్ లో ఎన్నికల ప్రహసనానికి  సాధ్యమైనంత కోత పెట్టి వుంటే బావుండేది.


స్క్రీన్ ప్లే సంగతులు

       ఓపెనింగ్ లో పాత తరం ప్రసిద్ధ క్రైం/డిటెక్టివ్  నవలా రచయితలైన రేమండ్ చాండ్లర్, ఎడ్గార్ వాలెస్ ల పేర్లు వేసి వాళ్లకి అంకిత మిచ్చాడు దర్శకుడు ఈ సినిమాని. దీంతో ఆ రచయితల స్థాయి కథని చూడ బోతున్నామన్న ఉత్కంఠ రేగుతుంది మనకి. దర్శకుడి ఉత్తమాభిరుచిపట్ల గౌరవం పెరుగుతుంది. ప్రారంభంలో ఒక సీనుతో హీరో డబ్బున్న దగాకోరుల్ని ఎలా బకరాలుగా చేస్తాడో చూపించేసి, ఆతర్వాత చప్పున పాయింట్ ఎస్టాబ్లిష్  చేసేస్తాడు దర్శకుడు. అంటే స్క్రీన్ ప్లే పరంగా ఇరవై నిమిషాల్లోపే  మిడిల్  విభాగంలో పడుతుందన్న మాట కథ. ఇది చాలా రిలీఫ్ మనకి! ఐతే అంతే చిక్కూ ఎదర వుంది ఈ కథని ఎంజాయ్ చేయడానికి. ఒక చోట రేమండ్ చాండ్లర్ అంటాడు- There is no trap so deadly as the trap you set for yourself  -  అని. మనకి మనం బిగించుకునే ఉచ్చు కంటే ప్రమాద కరమైన ఉచ్చు మరేదీ లేదని చాండ్లర్ భావం. ఆయన సౌజన్యంతో దర్శకుడు ఈ పనే చేసుకున్నాడు చేతులార. 


      అక్కడ ఎస్టాబ్లిష్ చేసే పాయింట్ ఏమిటంటే, హీరోయిన్ వచ్చేసి, హీరో సాయం కోరుతూ బ్లాక్ మెయిల్ చేస్తుంది- తన తండ్రిని మోసం చేసిన ముగ్గుర్నీ బకారాలుగా చేసి ఆడుకోవాలని. హీరో ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు? బ్లాక్ మెయిల్ కి భయపడా? తనలాంటి ఘరానా బురిడీ మాస్టర్ కి ఒక అమెచ్యూరిష్ పిల్ల చేసే బ్లాక్ మెయిల్ చేష్ట ఓ లెక్కా? కాకపోవచ్చు. ఐతే  ఒక కారణం తో ఈ ‘ప్రాజెక్టు’ (!)  ఒప్పుకుంటున్నా నంటాడు. ఆ కారణాన్ని సినిమా  చివరి వరకూ  రివీల్ చేయడు. ఇదొక అనవసర సస్పెన్స్. ఇంతా చేసి ఈ సస్పెన్స్ ఏమిటంటే, తన కుటుంబమూ  అటు  హీరోయిన్ నాన్న లాగే ఆ మోసగాళ్ళ కుట్ర కి బలయ్యిందని, అందుకే తనూ ఆమెలాగే ఫీలయ్యి ఈ ‘ప్రాజెక్టు’ (!)  చేపట్టానని చివరికి జస్టిఫై చేసుకుంటాడు. అంటే పదేళ్ళు దాటిపోయినా  హీరోయిన్  వచ్చి చెప్పే దాకా  తన కుటుంబానికి జరిగిన అన్యాయం తనకే గుర్తుకి రాలేదన్నమాట. కనుక ఈ  జస్టిఫికేషనూ, సస్పెన్సూ కూడా  పే-ఆఫ్ కాకుండా తేలిపోయాయి. ఆ హీరోయిన్ కూడా జరిగిన మోసానికి తల్లి చనిపోయి, తండ్రి జైలు పాలయ్యీ  పదేళ్ళు గడిచాక తీరిగ్గా ఇప్పుడే కళ్ళు తెర్చినట్టుంది!

         పాయింటుని ఎస్టాబ్లిష్ చేసే ఇలాటి కీలక ఘట్టంలో భలే ఆషామాషీ పాత్రలివి. ‘టెంపర్’ విజయాన్ని పురస్కరించుకుని రచయిత వక్కంతం వంశీ ఒక సరైన మాట చెప్పాడు : కథలు పైపైన చెప్పేస్తున్నారు, అది పనికి రాదనీ. పనికొస్తుందని ఇంద్రగంటి నిరూపించ దల్చుకున్నాడు. కనుక పాయింట్ ఎస్టాబ్లిష్ మెంట్ ఇంత పలచన. ఇప్పటి ప్రేక్షకులు పైపైన సినిమాలు చూసేయడానికి అలవాటు పడ్డారేమో గానీ, సినిమాల్ని మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఎంత లైటర్ వీన్ కామెడీ అయినా పైపైన తీసేసి ఆ ప్రేక్షకుల్నే మెప్పించడం సాధ్యమవుతుందా? 

          ఇంకా వుంది. జరిగిన మోసానికి హీరోయిన్ లాగే స్వీయానుభవంతో హీరో కూడా ఫీలయ్యినప్పుడు, ఆమె బ్లాక్ మెయిల్ బిల్డప్ అంతా అప్రస్తుతమై పోయిందిగా? హీరోయిన్ కి ఆ ట్రాకే అనవసరంగా? హీరో బందిపోటు అయితే, బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నంతో హీరోయిన్  ‘బందిపోటి’ అని పన్ గా లెటర్స్ వేయడం మిస్ లీడింగే కదా? ఇది రెండో లోపం. 

          ఇక మూడో లోపం : ఇది సినిమా. డిటెక్టివ్ నవల కాదు. హీరోయిన్ సమస్య తనదిగా  భావించి హీరో చేపట్టాలంటే ముందు కొంత టైం అండ్ స్పేస్ కావాలి. హీరోయిన్ తో పరిచయం, ఆమెతో ప్రేమ, ఎమోషనల్ బాండింగ్- ఆ తర్వాతే ఆమె సమస్య తెలిసి రియాక్ట్ అవడం.  ‘ఊసరవెల్లి’ లో సెకెండ్ హీరోయిన్ తమన్నా సమస్య తీసుకుని  పోరాడ్డానికి ఎన్టీఆర్ కి ఆమెతో అసలు ఇలాటి బాండింగ్ లేకపోయింది. అందుకే ఆ సినిమా ఫలితం అలా వచ్చింది.  తాజాగా  ‘టెంపర్’ లో కూడా సెకెండ్ హీరోయిన్ మధురిమ సమస్యకి రియాక్టై పోరాడుతాడు ఎన్టీఆర్. ఇక్కడ ప్రేమిస్తున్న మెయిన్ హీరోయిన్ కాజల్ కాబట్టి, ఆమె అల్టిమేటం ఇవ్వడంతో ఆమె కోసమే- అంటే తన లవ్ ఇంటరెస్ట్ కోసం - మధురిమ  సమస్యేమిటో చూస్తాడు. తీరా చూస్తే, ఈ సమస్య తన నిర్లక్ష్యం వల్లే ఉత్పన్నమయ్యింది. దీంతో ఆడియెన్స్ కి ఈ పాయింట్ ఎస్టాబ్లిష్ మెంట్, తద్వారా ఎన్టీఆర్  చేసే పోరాటం బలంగా కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుత సినిమా కథలో హీరో హీరోయిన్ల మధ్య ముందుగా ఎలాటి బలీయమైన అనుబంధం లేదు. ఇందుకే ఆడియెన్స్ కనెక్ట్ ఆమడదూరంలో ఉండిపోయింది.
        నిజమే, ‘బందిపోటు’ దర్శకుడు అభిమానించే రేమండ్ చాండ్లర్ ఏ నవల్లోనైనా ఆడపాత్ర వుందంటే, ఆమె  డిటెక్టివ్ ఫిలిప్ మార్లో తో  ఎలాటి పూర్వ పరిచయం లేకుండానే  వచ్చి తన సమస్య చెప్పుకుని సాయం కోరుతుంది. అది డిటెక్టివ్ కథ కాబట్టి సమస్య సెటప్ అలాగే వుంటుంది. ఆ జానర్ నియమాల ప్రకారం వాళ్ళిద్దరి మధ్య డిటెక్టివ్- క్లయంట్ సంబంధమే ఉండాలి తప్ప మరో ప్రేమ సంబంధం డెవలప్ కాకూడదు కాబట్టి అలాటి కల్పన వుంటుంది. ఆ డిటెక్టివ్ కూడా క్లయంట్ మీద ప్రేమ పుట్టో, లేదా తన వ్యక్తిగత సమస్య కూడా అలాగే ఉండో కేసు తీసుకోడు. కేవలం తన ప్రొఫెషనల్ బాధ్యత అనే చట్రం లో ఫీజు మాట్లాడుకుని పూనుకుంటాడు. ఈ సెటప్ ని  సినిమాలో క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందంటే, ‘బందిపోటు’ సినిమాలో లాగా అర్ధవిహీనంగా వుంటుంది. డిటెక్టివ్ కథ కాకపోతే, సినిమాల్లో హీరోయిన్ కోసం హీరో వూరికే పరోపకారి పాపన్న పాత్ర పోషించడు. నిన్ను ప్రేమిస్తాను, చెయ్- అని ఆమె అంటే కుప్పిగంతులేసుకుంటూ చేసుకుంటూ పోతాడు. దటీజ్ సినిమాటిక్ క్రియేషన్. 

         నాల్గవది : సమస్యలో వున్న సరుకు. ఒక ఫైనాన్స్ కంపెనీ మోసం చేయడం. ఇది దృశ్య మాధ్యమమైన సినిమాకి ఎంత మాత్రమూ చాలని సమస్య. చాలా కురచ కాన్వాస్. గతంలో కృషి బ్యాంకు ఉదంతం దరిమిలా అలాటి మోసం పాయింటుగా పెట్టుకుని అనేక స్క్రిప్టులు వచ్చి పడ్డాయి. అవేవీ తెరకెక్కలేదు. కారణం, సినిమాకి చాలని అత్తెసరు సరుకు కావడం. సబ్ ప్లాట్ గా పనికొస్తుందేమో.

        ఐదవది : జానర్ మిస్ మ్యాచ్. ఇప్పుడు అమెరికన్ పాపులర్ సాహిత్యంలో యూత్ ని దృష్టిలో పెట్టుకుని, రియలిస్టిక్ ఫిక్షన్ అనే కొత్త జానర్ పరిచయమౌతోంది. ఇందులో మిల్స్ అండ్ బూన్స్ టైపు సాఫ్ట్ రోమాన్స్ కి తావుండదు. తియ్యటి కలల ప్రపంచంలో స్వైర విహారం వుండదు. అలాటి చాప్టర్లు చొరబడితే పబ్లిషర్ ఆ వర్క్ ని తిరస్కరిస్తాడు. జానర్ స్పష్టత కి అక్కడ సాహిత్యంలోనే కాదు, సినిమాల్లోనూ కట్టుబడి వుంటారు. కానీ మనం మాత్రం నవరసాల పోషణ అనే శాస్త్రాన్ని ప్రపంచానికి  ఇచ్చికూడా-వాటిని పట్టించుకోకుండా సొంత పైత్యాల్ని రుద్దుతూంటాం. 
  
        దర్శకుడు ఎస్టాబ్లిష్ చేసిన పాయింటు ఫైనాన్స్  కంపెనీ చేసిన మోసం, దానికి బలైన హీరోయిన్ తండ్రి జీవితం. ఈ పాయింటులో హాస్యరసం లేదు, కరుణ రసముంది. కరుణ రసం సీరియస్ యాక్షన్ ( అద్భుత, వీర లేదా రౌద్ర రసాల) కథనాన్ని  కోరుతుంది. కరుణ రసానికి హస్యరసపు కథనం అభాసు అవుతుంది. అద్భుత రసం (అడ్వెంచర్/థ్రిల్లర్) తో హాస్యరసం (కామెడీ) పండుతుంది. కనుక ఇక్కడ నేపధ్యంలో తల్లిదండ్రులతో విషాదకర  పాయింటు వున్న  హీరోయిన్,  కామెడీగా విలన్లని ఆటలు పట్టించి వినోదించాలనుకోవడమే, దానికి హీరో వంత  పాడడమే రసాల మిస్ మ్యాచ్ అయిపోయింది- బత్తాయి రసంలో కుంకుడు రసం పోసినట్టు.

          బాపు తీసిన ‘ముత్యాలముగ్గు’ పాయింటులో  కరుణ-శోక రసాలున్నాయి. చాలా రిస్కీ అటెంప్ట్. శ్రీధర్- సంగీత ల వైవాహిక జీవితంలో రావు గోపాల రావు రూపంలో విలన్ విషపు చుక్కలు చిమ్మి విడదీసే కరుణ- శోక రసాల ఉత్పత్తి. దీనికి తగుమాత్రం షుగర్ కోటింగ్ వేయకపోతే వినోదభరితం చేయడం కష్టం. అందుకని ఈ చేదు మాత్రని ఇంటర్వెల్ కి జరిపేసి,  ప్రథమార్ధమంతా అన్ని పాత్రల ఆనందమయ జీవితాలతో, అద్భుత రస ప్రధానంగా హాస్య రసపు ఆధరువుతో ఓలలాడించారు. అప్పుడు విశ్రాంతి ఘట్టంలో ఆ శోక- కరుణ రసాలతో లాకులు బార్లా తెరిచేశారు. మళ్ళీ ఈ రసాల ఉప్పెనలో ఎత్తుకున్న అసలు కథనం కొట్టుకు పోకుండా, ద్వితీయార్ధంలో తిరిగి దాని అద్భుత – హాస్య రసాల ట్రాకులో యధాతధంగా ఆ కథనాన్ని పెట్టేశారు. ఎలా పెట్టారనేది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఇదిక్కడ అప్రస్తుతం. ఇక్కడ దృష్టికి తెస్తున్న దేమిటంటే, ఇలా కాకుండా ‘బందిపోటు’ కథా  నేపధ్యంలో వున్న కరుణ రసాన్ని మొదటే ఓపెన్ చేసేశారు! దీంతో కథనం కామెడీ – థ్రిల్లర్ ల మధ్య ఎటూ సర్దుబాటు కాలేక ఇలాటి మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉండాల్సిన పంచ్, పెప్, కిక్కూ సర్వం మటాషై పోయాయి.
         కేవలం బిగినింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఓ పాయింటు పట్టుకుని ఇంత పోస్ట్ మార్టం అవసరమా అంటే, తప్పకుండా అవసరం. ఎందుకంటే, అనారోగ్యమంతా ఇక్కడే వుంది గనుక. చాండ్లర్ చెప్పిన ఉచ్చులో ఇక్కడే ఇరుక్కోవడం జరిగింది గనుక. పాయింటు కథకి పునాది వేస్తుంది. ఈ పునాది ఎఫెక్టు మొత్తం కథా సౌధం మీదా పడుతుంది. ఎప్పుడైతే కథ బిగినింగ్ విభాగపు చివర్న ఎస్టాబ్లిష్ చేసే పాయింటు,  లేదా సమస్య బలంగా ఉండదో, అప్పుడా కథ నడక కూడా అంతే నత్త నడక నడవడంతో బాటు, ఎండ్ విభాగం- అంటే,  క్లైమాక్స్ కూడా బలహీనంగా తేలి పోతుంది. బలహీన పాయింటు ఎస్టాబ్లిష్ మెంట్ = బలహీన ముగింపు! ఇదొక జగమెరిగిన రూలు. సినిమా కథని మొదటే స్ట్రక్చర్ లో పెట్టి ఆలోచించడం ఎంత అవసరమో, దాని పాయింటు అనే బీజం విఛ్ఛిత్తి జరిగినప్పుడు అదెలాగెలా శాఖోప శాఖలుగా విస్తరించగలదో  ముందే చూసుకోవడం అంతే అవసరం. ఈ కథలో పాయింటు విఛ్ఛిత్తి జరిగినప్పుడు దీని శాఖలు ఇలా విస్తరించాయ్-


1. అర్ధం లేని హీరో గోల్ గా..

2. అర్ధంలేని హీరోయిన్ బ్లాక్ మెయిల్ గా.. 
3. సినిమాటిక్ కాని హీరో- హీరోయిన్ల మధ్య ప్రపోజల్ గా..
4. సినిమా కథకి చాలని ఫైనాన్స్ కంపెనీ మోసంగా.. 
5. కరుణ- అద్భుత- హాస్య రసాలు- జానర్ మిస్ మ్యాచింగ్ గా..
ఇలా ఈ చీడ పట్టిన శాఖలతో కథావృక్షం వోరిగిపోయింది. 
**

సెటప్స్ అండ్ పే- ఆఫ్స్ 
      ఈ స్క్రీన్ ప్లే పొడవునా కొట్టొచ్చే ఇంకో ధోరణి ఏమిటంటే, ఆసక్తి రేపుతూ వివిధ అంశాల్ని  సెటప్ చేయడం, తీరా వాటిని  పే- ఆఫ్ చేసే సమయం వచ్చేసరికి అవి చెల్లని చెక్కులై పోవడం. ‘బందిపోటి’ బిల్డప్ తో హీరోయిన్ ఏమైందో, హీరో ’ప్రాజెక్టు’ (!) ఒప్పుకోవడానికి కారణం చెప్తానని ఎలా చివరికి జస్టిఫై చేశాడో పైన చూశాం. ఇంకా ‘బందిపోటు’ అనే టైటిల్ సెటప్ కీ, అలాటి బందిపోటే కాని హీరో పాత్రతో పే-ఆఫ్ కూడా ఇంతే. ఇంటర్వెల్లో రావు రమేష్ ఆకాశంలో చూడకూడని దేదో చూశాడని హడావిడి చేసి, ఆడియెన్స్ ని టెన్షన్ పెట్టేసి తీరా అదేమిటో చూపించకుండా విశ్రాంతి కార్డు వేయడం సెటప్స్ అండ్ పే- ఆఫ్స్ నిర్వాకానికి పరాకాష్ఠ! ఏమిటో అర్ధం కాని ఇంటర్వెల్ తో మన మతులుపోవడమే.


            ఇంటర్వెల్ అయ్యాక అదేమిటో చూపించినప్పుడు – హీరో ప్లే చేసిన పాత మూసఫార్ములా ట్రిక్కుగా తేలి, పే-ఆఫ్ అవుటాఫ్ క్వశ్చన్ అయింది. తనికెళ్ళ గోతిలో చితగ్గొట్టినట్టు చూపించిన టేప్ రికార్డర్, తర్వాత సప్తగిరి తీసి చూసినప్పుడు చెక్కు చెదరకుండా వుంటుంది. హీరోయిన్ ఇంట్లో దండ వేసిన ఆమె తల్లి ఫోటో చూపిస్తారు. ఆవిడ (పదేళ్ళ క్రితమే) పైలోకాలకి చేరుకుందని తెలిసిపోతున్నా, ‘ఆవిడిప్పుడు లేదు!’ అని హీరోయిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది!

        చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బద్ధ శత్రువులైన రావు రమేష్ – తనికెళ్ళ భరణి ఒకటై తమని దెబ్బ తీసిన హీరోని చంపెయ్యాలని నిర్ణయించుకుంటారు. తీరా హీరో ఇంకో తమ శత్రువు పోసానీని బకరా చేస్తూంటే చంపడం మానేసి చూసి ఆనందిస్తూంటారు. హీరోకి ఎక్కడా ఆటంకాలు ఏర్పడని వన్ వే పోకడతో కథనమే పాసివ్ అయ్యింది, అదలా ఉంచుదాం. కానీ మొదటి ఇద్దరు విలన్లతోనే హీరోకి ఇలా dead – lock లేదా mexican stand-off  సిట్యుయేషన్ ఏర్పడినప్పుడు, కనీసం దీన్నయినా ఎక్సైటింగ్ గా క్లైమాక్స్ కి తీసి కెళ్ళడం లో విఫలమయ్యాడు దర్శకుడు. ఇలాటి వెన్నో.


         అల్లరి నరేష్ ఇమేజి మేకోవర్ సరే, కానీ పాత్రకి ఆ మేకోవర్ లేక విలన్లని బురిడీ కొట్టించడానికి పాల్పడిన ట్రిక్కులు అన్నీ చాలాచాలా సినిమాల్లో వచ్చేసిన పాత మూసఫార్ములా బాపతు వ్యవహరాలేగా? ఇక ఇమేజి మేకోవర్ దేనికి?

           తన బ్రాండ్ వూర కామెడీతో మూస క్యారక్టర్లే ది బెస్ట్ అని అల్లరి నరేష్ తెలుసుకుంటే మంచిదేమో.  బెటర్ లక్ నెక్స్ట్ టైమ్!


సికిందర్



17, ఫిబ్రవరి 2015, మంగళవారం

16, ఫిబ్రవరి 2015, సోమవారం

టెంపర్..

Social cause Returns!
రచన- దర్శకత్వం: పూరీ జగన్నాథ్
తారాగణం : ఎన్టీఆర్, కాజల్, మధురిమ, ప్రకాష్ రాజ్, పోసాని, కోటా శ్రీ నివాసరావు, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి, పోసాని, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, రమాప్రభ, కోవై సరళ  తదితరులు
కథ ; వక్కంతం వంశీ,  సంగీతం : అనూప్ రూబెన్స్, నేపధ్య సంగీతం : మణి శర్మ, ఛాయాగ్రహణం : శ్యాం కె నాయుడు, కూర్పు : ఎస్ ఆర్ శేఖర్,
బ్యానర్ :  పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్
 నిర్మాత : బండ్ల  గణేష్
విడుదల : 13 ఫిబ్రవరి, 2015 ,  సెన్సార్ : U/A
***



       మధ్య కాలంలో బిగ్ స్టార్స్ తో తెలుగు కమర్షియల్ సినిమా ఎదుర్కొంటున్న విషయపరమైన వెలితి, తద్వారా అపజయాల పరంపర, ఇంకేం చేయాలో తోచని స్థితి, ఇవన్నీ అనివార్యంగా మర్చిపోయిన మూలాల వైపు తిరిగి చూసేలా చేయడంలో ఆశ్చర్యంలేదు. దీన్ని ఎవరైతే ముందు గుర్తిస్తారో, వాళ్ళు ఈ ప్రతిష్టంభనని బద్దలు కొట్టగల్గుతారు. రొటీన్ యాక్షన్ కామెడీలతో ప్రేక్షకుల హనీమూన్ కూడా ఎప్పుడో ముగిసిపోయింది. తమని సంతృప్తి పర్చడమంటే ఇప్పుడు మాటలు కాదు. బిగ్ స్టార్ ఇప్పుడు ఇంకా ఎక్కడో తమని తాకాలి. నేలకు దిగి రావాలి. చుట్టూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంతు  చిక్కని సమస్యలు అనేకం వేధిస్తున్నాయి. వాటికి సమాధానాలు చెప్పాలి. తదాత్మ్యం చెందేలా చేయాలి. అప్పుడుగానీ బ్రహ్మరధం పట్టడం సాధ్యంగాదు.
      ఇదే జరుగుతోందివ్వాళ. ఈ ప్రతిష్టంభనని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. ఐతే దీన్ని బ్రేక్ చేయడానికి నానా తిప్పలు పడ్డ మాట కూడా వాస్తవం. ఈ బిగ్ స్టార్ తో ఇంకా ఏదో అభద్రతా భావం వెంటాడినట్టు, చెప్పాలనుకున్న బలమైన పాయింటు చెప్పడానికి పూరీ జగన్నాథ్ సైతం  నానా హైరానా పడాల్సివచ్చింది. మొత్తానికి కిందామీదా పడి మసకబారిన ఇద్దరి ప్రతిష్టనీ తిరిగి వెలిగించుకున్నారు.
      విషయపరంగా నేలవిడిచి సాము చేయనవసరం లేని బిగ్ కమర్షియల్ సినిమాకి, శైశవ దశలో వున్న ఒక నమూనా  ‘టెంపర్’! ఈ నమూనా ఓకే అన్పించుకుంది గనుక ఇప్పుడిక ధైర్యంగా దీన్ని పెంచి పోషించుకో వచ్చు కొన్నాళ్ళపాటు. 

దయలేని దయా 
       అడ్డగోలు అవినీతి పోలీసు అధికారి దయా శంకర్ (ఎన్టీఆర్) కథ ఇది. తిండి లేని అనాధగా చిన్నప్పుడు ఒక పోలీసు అవినీతిని  చూసి అలాటి తను కూడా పోలీసు వాడై బాగా  సంపాదించుకోవాలన్న దుర్బుద్ధితో  పెరిగి డిపార్ట్ మెంట్ లో చేరతాడు. కేసులు చూడకుండా డబ్బులు వసూలు చేసుకోవడమే పని. ఎక్కడో వైజాగ్ లో వాల్తేర్ వాసు అనే ముఠాకోరు ఉంటాడు. అతడి గ్యాంగ్ లో నల్గురు తమ్ముళ్ళు. అతడికి అర్జెంటుగా తనకి సహకరించే పోలీసు వాడు అవసరపడ్డాడు. హైదరాబాద్ లో వున్న అలాటి నీచమైన ఎస్సై దయాని వైజాగ్ ట్రాన్స్ ఫర్ చేసి వాల్తేర్ వాసు పట్ల తన బాధ్యత తీర్చుకుంటాడు హోం మంత్రి( జయప్రకాష్ రెడ్డి). వైజాగ్ చేరిన దయా, వాసుతో చేతులు కలిపి అక్రమాలకి తెరలేపి తన కమిషన్ తను పుచ్చుంటూ ఉంటాడు. నిర్లజ్జగా పాల్పడుతున్న ఇతడి అవినీతిని చూసి అసహ్యించుకుంటూ ఉంటాడు నారాయణ మూర్తి (పోసాని) అనే హెడ్ కానిస్టేబుల్. స్టేషన్ కి ఒకావిడ వచ్చి తన కూతురు తప్పిపోయిందని ఆందోళన చెందుతున్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు దయా.

       వైజాగ్ లోనే జంతు ప్రేమికురాలైన శాన్విఅనే ఒక ఎన్జీవో ( కాజల్ అగర్వాల్) తల్లి (కోవై సరళ), అమ్మమ్మ (రమాప్రభ) లతో వుంటుంది. ఈమెని ని చూసి ప్రేమిస్తాడు. ఈ ప్రేమ కొనసాగుతూండగా వాసు గ్యాంగ్ పొరపాటున ఈమెని కిడ్నాప్ చేయబోతారు. దీంతో ఈమె దయాకి కనువిప్పు కల్గిస్తుంది- తనుకాకపోతే ఇంకెక్కడో ఇంకెవరో అమ్మాయి ఈ గ్యాంగ్ బారిన పడబోతోందనీ, వెళ్లి కాపాడమనీ అల్టిమేటం ఇస్తుంది.
       ఆ అమ్మాయి లక్ష్మీ ( మధురిమ) అనే ఎన్నారై. ఈమెని కిడ్నాప్ చేయకుండా దయా అడ్డుపడడంతో, వాసుకీ ఇతడికీ వైరం మొదలవుతుంది. వాసు బారినుంచి లక్ష్మిని కాపాడిన దయాకి షాకింగ్ రహస్యం తెలుస్తుంది. దీంతో అంతర్మధనం మొదలౌతుంది. ఆనాడు కూతురు కన్పించడం లేదని స్టేషన్ కి వచ్చి మొర  పెట్టుకున్నావిణ్ణి పట్టించుకోకుండా ఘోర తప్పిదం చేశాడు. దాని ఫలితం ఈ దారుణం. దీనికి తనే కారకుడన్న పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు దయా..

        ఇక్కడ్నించీ అతడిలో మార్పు, దుష్ట శిక్షణ అనే బాధ్యతా మొదలై వాసునీ- అతడి గ్యాంగ్ నీ శిక్షించేందుకు ఎంతదూరమైనా పోతాడు దయా.
ఎన్టీఆర్ దండయాత్ర  
           తమాషాగా మారిన తెలుగు కమర్షియల్ సినిమా తీరుతెన్నులపై దండయాత్ర ఈ ఎన్టీఆర్ పాత్ర. చాలా బిగ్ కమర్షియల్స్ వచ్చాయి- స్టార్ కి మేకోవర్ అనీ, మేకప్ ఛేంజ్ అనీ, హేర్ స్టయిల్ డిఫరెంట్ అనీ, సిక్స్ ప్యాక్ అనీ..ఇలా! సినిమాలో అసలంటూ విషయం లేకుండా ఈ బిల్డప్పులతో స్టార్లు ఎంత అనుభవించాలో అంతా అనుభవిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడదే హై ఫ్యాషన్ తో వచ్చాడు. కఠిన వర్కౌట్లు చేసి బాడీని టోనప్ చేసుకున్నాడు. షర్టు తీసి సిక్స్ ప్యాక్ ప్రదర్శించాడు. వివిధ రకాల స్పైక్స్ తో కొత్త హేర్ లుక్, లెదర్ జాకెట్స్ లేని రఫ్ లుక్ గల డిజైనర్ కాస్ట్యూమ్స్, మొదటిసారి ట్రిమ్ చేసిన మీసం..వీటన్నిటినీ మంచి ఈజ్ తో, పవర్ఫుల్ గా క్యారీ చేసే ఇగో- డిఫెన్సివ్ యాటిట్యూడ్..ఈ మేకోవర్ అంతా మళ్ళీ పటాటోపంగా మారకుండా, ఎండమావులతో నరకం చూపిస్తున్న తెలుగు సినిమా కథా కథనాలని, నడిచే బాంబు లాంటి క్యారక్టర్ అనే వెపన్ తో అడ్డదిడ్డంగా వధించేస్తూ-  కొత్త కథా ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. 

        ఈ హై ఓల్టేజ్ డ్రామాలో ఎన్టీఆర్ దొక ఆథర్ బ్యాక్డ్ క్యారక్టర్. ఒక్కోసారి రచయిత మిగతా సినిమా దినుసులన్నిటినీ పక్కనపెట్టి పాత్రలో లీనమైపోయి- అది డ్రైగా మారుతున్నా సరే, దాని సహజ జీవితాన్ని కెలుకుతూ దాని కథే అల్లుకుంటూ కూర్చుంటాడు. దీన్నిసౌమనస్యంతో అర్ధం జేసుకోగలిగితే,  ఆ దర్శకుడు వీలైనంత యధాతధంగా తెరకెక్కించి సక్సెస్ అవుతాడు. ఇలా ఆధర్ బ్యాక్డ్ క్యారక్టర్ – అంటే రచయిత బ్రహ్మరధం పట్టిన పాత్రని - ఏ ఇగోలూ లేకుండా చేపట్టినప్పుడే ఆ స్టార్ కూడా సక్సెస్ అవుతాడు. కథా రచయిత వక్కంతం వంశీతో ఎవరూ ఇగోలకి పోకపోవడం జరిగిన మేలు. మొదటిసారి పరాయి కథకి దర్శకత్వం వహించేందుకు ముందుకొచ్చిన పూరీ కూడా ఒక లక్. లేకపోతే నాలుగేళ్ళుగా మరుగునపడి వున్న ఈ ఆ ఆధర్ బ్యాక్డ్ క్యారెక్టర్ కథ వెలుగు చూసేదే కాదు. 
       ఎన్టీఆర్  ఫ్యాన్స్ కూడా ఇంకెప్పుడూ  గొంతెమ్మ కోర్కెలు కోరి తమ అభిమాన స్టార్ ని ఎక్కడేసిన గొంగళి చేయకుండా వుంటే మంచిది.
        కాజల్ అగర్వాల్, మధురిమ లు కథని మలుపులు తిప్పడానికి  తోడ్పడ్డారు తప్పితే కథా నడకతో వాళ్ళకేం సంబంధం లేదు. పోసాని ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేసే ఉత్ప్రేరక పాత్ర పోషించాడు. ప్రకాష్ రాజ్ సైకోతనపు విలనీతో మరోసారి విజృంభించాడు. తనికెళ్ళ ఒకే ఒక్క  చెంప పెట్టుతో కళ్ళు చెమర్చేలా సినిమా ఈక్యూని అమాంతం పెంచేశాడు. ఇక అలీ-సప్తగిరి-వెన్నెల కిషోర్ త్రయం హాస్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఇంత హారిబులా?
        గత సృష్టి ‘హార్ట్ ఎటాక్’ లో నిలబెట్టుకున్న నిర్మాణ విలువలు, క్వాలిటీ మేకింగ్ ఈ సారి పూరీ  పట్టుతప్పి చాలా హారిబుల్ గా మారాయి. మూవీ అంతా బి, సి గ్రేడ్ బాపతు లౌడ్ నెస్ తో శబ్ద కాలుష్యమే. అరిచి తప్ప మామూలుగా మాట్లాడుకోలేని ఆర్టిస్టులు,  విధ్వంసం తప్ప సున్నితత్వం లేని మణిశర్మ నేపధ్య సంగీతం – ఎన్టీఆర్ తను అనాధకానని ఎమోట్ అయ్యే సీను సైతం ఈ అరిగిపోయిన విధ్వంస బాణీల్లో  కొట్టుకుపోవడం- ఫ్రెష్ నెస్ లేని అదే పాత తరహా శ్యాం కె. నాయుడు ఛాయాగ్రహణం, విజయ్ కి బడ్జెట్టే చాలనట్టు ‘లో- రేంజి’  ఫైట్లు..ఇలా మేకింగ్ పరంగా ఏ విలువలూ పాటించకుండా లాగించేశారు. అదేమిటో గానీ సరుకులేని సినిమాలకి మేకింగ్ అద్భుతంగా ఉంటోంది. టెక్నీషియన్లు వారెవ్వా అన్పించుకుని- విషయంలేక దర్శకులు టెక్నీషియన్ల ముందు వెలవెలబోవడం. ఈసారి ఈ సాంప్రదాయం తిరగబడింది. అనూప్ రూబెన్స్ సంగీతంలోని పాటలే రిలీఫ్. 
స్క్రీన్ ప్లే సంగతులు 
    ముందుగా  చెప్పుకున్నట్టు- ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న అంత బలమైన బాక్సాఫీసు విన్నింగ్ పాయింటు చెప్పడానికి నానా హైరానా పడ్డారు. అదృష్టవశాత్తూ కలిసివచ్చిన అధర్ బ్యాక్డ్ పాత్ర మీద  పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, ప్రేక్షకులమీద నమ్మకం కుదరనట్టే కన్పిస్తోంది. అందుకే ఫస్టాఫ్ ని అరిగిపోయిన పాత మూస ఫార్ములా అనే సేఫ్ జోన్నే  చూసుకున్నట్టుగా  అన్పిస్తారు. ఈ సేఫ్ జోన్ లో కూడా సిన్సియారిటీ లోపించడంతో మొత్తం కథ కిచిడీ పాకంలా తయారయ్యింది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో వున్నట్టు- ఈ సినిమా కథ ప్రాణమంతా ముగింపు సన్నివేశాల్లో పెట్టుకుని, అంతవరకే సినిమా అన్నట్టు బిగదీసుకుని, మిగతా భాగాన్ని గజిబిజిగా వదిలేశారు. 

           సినిమా ప్రారంభమైన  సుమారు గంటా పదినిమిషాల సుదీర్ఘ కాలం తర్వాత -  మిస్టేకెన్ ఐడెంటిటీ తో కాజల్ ని కిడ్నాప్ చేసే ప్రయత్నంతో మొదటి మలుపు వచ్చి కథ మిడిల్లో పడుతుంది.    మేరకు ఈ బిగినింగ్ విభాగానికి ఇటువంటి మలుపు గమ్యం ఐనప్పుడు- ఈ గమ్యానికి చేరవేసే సంబంధిత దృశ్యాల కూర్పు సరిగ్గా లేకపోవడం ఫస్టాఫ్ బ్యాడ్ అనుకోవడానికీ, బోర్ కొట్టడానికీ కారణమయ్యింది. ఒక ముక్కోణం వుంటుంది : రచయిత/దర్శకుడు - కథ- ప్రేక్షకులు అనే ముక్కోణం. ఈ ముక్కోణంలో రచయిత/దర్శకుడు ఏకకాలంలో కథ తోనూ, ప్రేక్షకులతోనూ రోమాన్సులో ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తూ ఈ రోమాన్సుని సినిమా ముగింపు సన్నివేశాల్లో మాత్రమే ప్రారంభించాడు ఇక్కడ రచయిత/దర్శకుడు.
           మొదట్లో పాత్రపరంగా విలన్ చేతిలో హీరో కీలు బొమ్మ నిజమే, అంత వరకూ ఆ పాత్ర సహజమైన పాసివ్ తనాన్ని ఒప్పుకోక తప్పదు. ఐతే కాజల్ టర్నింగ్ తో నైనా విలన్ మధురిమ కోసం అసలెందు కోసం ప్రయత్నిస్తున్నాడో తెలుసుకుని, హీరో యాక్టివ్ పాత్రగా మారితే  – అలా సినిమా సక్సెస్ కి చాలా అవసరమైన యాక్టివ్ పాత్రగా మారి, ఆ రహస్యం తెలుసుకున్న వాడై,  దాంతో విలన్ ని ఛాలెంజి చేసివుంటే- ఇంటర్వెల్ సీను కూడా అలా ఉత్త అమ్మాయి కోసం ఉత్తుత్తి పెడబొబ్బల ప్రహసనం కాకుండా వుండేది. విలన్ చేసిన అసలు కుట్రేమిటో తెలుసుకోకుండా, హీరో ఎన్ని పాసివ్ అరుపులు అరిచి ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే మాత్రం ఏం ఎలాభం? ఇంకా హీరో గోల్ ఏమిటో తెలియకపోతే ఎలా?
          సస్పెన్స్ తో ముడిపడి వుండే ఏ అంశానికైనా  రెండు పార్శ్వలుంటాయి : ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేవి. ఈ రెండూ మూసిపెట్టి కథ నడిపిస్తే అర్ధంగాదు, బోరు కొడుతుంది. కచ్చితంగా అందులో ఒక పార్శ్వాన్ని విప్పి చూపాల్సిందే. రసపోషణ  కోసం అనివార్యంగా అది మొదటి పార్శ్వ్యమే అవుతుంది- ఏం జరిగింది?అనేది. ఇది ఓపెన్ చేసి కథ నడుపుతూ, అదెలా జరిగింది? అన్నది మాత్రం గుప్పెట్లో ఉంచుకున్నప్పుడే  అదొక సస్పెన్స్ కథవుతుంది.
          ఆ ఏం జరిగిందనే రహస్యం హీరో తెలుకుని ఇంటర్వెల్లో బయట పెడితే  కథ చెడుతుంది నిజమే. ఎందుకంటే అది చేదు మాత్ర. సెకండాఫ్ లో తగు సమయం వరకూ దాన్ని ముట్టుకోకుండా షుగర్ కోటింగ్ తోనే నడపాలి. ఐతే సినిమా మొదట్నించీ కూడా ఈ షుగర్ కోటింగ్ ని పట్టించుకోలేదు. లేకపోతే ఇలా కిచిడీ లా వుండదు. చేదు మాత్రైతే వుంది. కనీసం అది హీరోకి తెలుసనే అర్ధంలో ఇంటర్వెల్ కి వెళ్ళినా సస్పెన్స్ క్రియేట్ అయ్యేది. 
           ఇంటర్వెల్ కైనా హీరో యాక్టివ్ అవ్వాలి, తన గోల్ ఏమిటో తెలుసుకోవాలి. లేకపోతే  అతను ఇంటర్వెల్ ని ఏం చేసీ నిలబెట్ట లేడు. కథని బట్టి దీన్నెలా సాధించాలో అలా సాధించి తీరక తప్పదు. ఈ రెండూ ఇక్కడ ఎష్టాబ్లిష్ చేయకపోతే  అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఫస్టాఫ్ తీయడం పూర్తిగా వేస్ట్.
          ‘ద గుడ్-ద బ్యాడ్-ద అగ్లీ’, ‘ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్’,  ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ది వెస్ట్’ వంటి కౌబాయ్ క్లాసిక్స్ తీసిన దర్శకుడు సర్జియో లియోన్, 1971 లో ‘ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డైనమైట్’ అనే మరో కౌబాయ్ అడ్వెంచర్ తీశాడు. దీని ఇంటర్వెల్ సీన్లో హీరో రాడ్ స్టీగర్, ఒక టెర్రి ఫిక్ కాల్పుల సీను చూస్తాడు. సమూలంగా అతడి జీవితాన్ని మార్చివేసే సీను. తనగురించి తానొక నిర్ణయం తీసుకునేందుకు పురిగోల్పే సీను. ఒక కరుడుగట్టిన, క్రూరుడైన బందిపోటుగా బతుకుతున్న తను, ఇక  పెద్ద దోపిడీ ఒకటి చేసేసి తన బంగారు కలలు నేరవేర్చుకోవాలన్న నేర బుద్ధి నుంచి పరివర్తన చెందే సీను. తత్పలితంగా పరివర్తనతో తన నేస్తం జేమ్స్ కోబర్న్ ఆశయాల కోసం ఫ్రీడమ్  ఫైటర్ గా కంకణ బద్ధుడయ్యేందుకు దారి తీయించే సీను.. 
          ‘టెంపర్’  హీరో కూడా అరాచక వాదియే ఐనప్పుడు, అతను మారడం కోసమే కథ నడిపినప్పుడు- కాజల్ అల్టిమేటం అప్పుడే ఆ మార్పు వచ్చినప్పుడు, అది కేవలం  వెర్బల్ గా కాకుండా- పైన ఉదహరించిన సినిమాలోలా విజువల్ గా వస్తే ఇంటర్వెల్లో అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయేవి. ఆ చేదు మాత్ర తాలూకు  విజువల్స్ ని షుగర్ కోటింగ్ చెడకుండా ఎలా ప్రొజెక్ట్ చేయాలన్నది దర్శకుడి ఇష్టం. 
            ఇక విలన్స్ తో హీరో యాక్షన్ ప్లాన్ విషయానికొస్తే, వాళ్ళని వెంటాడి పట్టుకుని అరెస్టు చేసి , కోర్టులో కేసు పెట్టడం పూర్తిగా ఆ హీరో పాత్ర ప్రవృత్తికి  విరుద్ధమే. ఎవరైనా అతనున్న స్థానంలో కాల్చి పారేస్తారు. ఎందుకటే ఒక అవినీతి పరుడైన ఎస్సైగా  వ్యవస్థ ఎలా వుంటుందో అతడికి తెలిసే వుంటుంది. అదే జరిగింది కూడా. కోర్టులో సాక్ష్యం తెల్లబోయేలా చేసింది. సినిమాటిక్ గా చూపించిన ఈ  కథనంలో కూడా, అంత విలువైన సాక్ష్యాన్ని కాపీలు తీసి ఉంచుకోకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరం ఎలా చేస్తాడు? కాపీలు తీసి వుండాల్సిందని తర్వాత బాధపడేలా చేయడం దర్శకుడు కథనంలో లోసుగుల్ని కవర్ చేయడానికి చేసే ప్రయత్నమే. ఈ ప్రయత్నంలో హీరో పాత్ర అసమర్ధంగా తయారయ్యింది. తను మంచి వాడుగా మారినా  అసమర్దుడైతే ఏం లాభం? ఇది సినిమాటిక్ లిబర్టీ సంగతి. ఇక లాజికల్ గా అయితే ఆ సీడీ మీద ఫోరెన్సిక్ రిపోర్టు తీసుకుని పకడ్బందీ సాక్ష్యంగా కోర్టుకి సమర్పిస్తారు. ప్రాసిక్యూటర్ చేతిలో పెట్టరు. కేవలం ఆ సీడీ చూసేసి జడ్జి కూడా మరణ శిక్ష విధించడు. 
           ఆ క్రిమినల్స్ ని హీరో పట్టుకుని కాల్చేస్తూంటే  విలన్ గోల చేసి, అరెస్టు చేయించి ఉండాల్సింది. అప్పుడు  చంపే అవకాశం కోల్పోయిన హీరో,  ఇక కోర్టులోనే తలపడేందుకు సిద్ధపడినట్టు చూపిస్తే పాత్రకి న్యాయం జరిగేది. కానీ కోర్టులో హీరో ఇచ్చే టర్నింగ్ ని తురుపుముక్కగా పెట్టుకున్నారు గనుక,  పాత్ర కిల్ అవుతున్నా పట్టించుకోలేదు. చివరికి హీరో చేసిన పని వాళ్ళని పట్టుకుని చంపడమే అయ్యింది. ఇదేదో అప్పుడే చేసేస్తే పోయేదిగా?
          అలాగే అమెరికా వెళ్ళిపోయినా అక్కడుండి అనుక్షణం టీవీలో ఇక్కడి పరిణామాలు గమనిస్తున్న, ఇంటరాక్టు అవుతున్న మధురిమ, ఇక ఉరి తీస్తున్నారని తెలుసుకుని చెప్పిన మాట ఆ సీడీ తో జరిగిన మోసం బయటపడినప్పుడే ఎందుకు చెప్పలేదు? ఇలా కథా సౌలభ్యం కోసం లాజిక్ ని పక్కన బెడితే,  సినిమాటిక్ గానూ ఇష్టానుసారం నడిపారు. హైదరాబాద్ ఎస్సై ఆంధ్రా కి ట్రాన్స్ఫర్ అవడం ఇంకో హరిబుల్  సినిమాటిక్ లిబర్టీ. కానీ పూరీ సినిమాలతో అభిరుచిగల ప్రేక్షకుల వాయిస్ కి స్థానం వుండదు కాబట్టి ఇలాటి ఎన్ని చేదు మాత్రలనైనా దిగమింగి సినిమా హిట్టని చప్పట్లు కొట్టాల్సిందే.

      అంతిమంగా సామాజిక సమస్యతో ప్రేక్షకుల్ని విజయవంతంగా కనెక్ట్ చేశామాలేదా అన్నది మాత్రమే ప్రస్తుతమైతే- ముందుగానే చెప్పుకున్నట్టు కిందా మీదా పడి తప్పకుండా ఇందులో సక్సెస్ అయ్యారు. ఇలాగే అన్నిసార్లూ సక్సెస్ కాలేరు. తిరిగి మూలాల వైపు చూసిన శైశవ దశ నమూనా ఇది కాబట్టి, ఈ శాంపిల్ తో ఫస్టాఫ్ –సెకండాఫ్ ఆసాంతం కూడా సోషల్ కాజ్ గల కథా కథనాల్ని ధైర్యంగా ప్రేక్షకులకి ఇకపైన రుచి చూపించవచ్చు.  
సికిందర్