రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, డిసెంబర్ 2014, మంగళవారం

ఐటెం ట్రెండ్

ఐటెం సాంగ్స్ తో వన్స్ మోర్ చరిత్ర!
     ఎంటర్ టైన్ మెంట్ అంటే హాట్ హాట్ కంటెంట్ గా అర్ధం మారిపోయాక టాప్ హీరోయిన్లు తమ వంతూ ఆ కాష్టంలోకి ఆజ్యంపోస్తూ, వాంప్స్ మాదిరిగా ఐటెం సాంగ్స్ తో రసిక ప్రేక్షకుల్ని రంజింప జేస్తున్నారు. బికినీ వేసినప్పుడు లేని బింకం ఐటెమప్పుడు ఎందుకట అనీ తలావొక కెవ్వు పాటెత్తుకుని ఆడిపాడేస్తున్నారు. `60 లలోనే  హిందీ హీరోయిన్ బికినీ వేసినప్పుడు తెలుగు హీరోయిన్ నిండు చీరలోనే ఉండిపోయింది. ఆ చీర తగ్గుతూ తగ్గుతూ పొట్టి నిక్కరు దాకా  వచ్చింది. అదికూడా చాలక బికినీ తో వొళ్ళు కప్పుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు బికినీల్లోనే  చాలా కాన్ఫిడెంట్ గా ఫీలవుతోంది. ఇక ఐటెం సాంగ్స్  తో మేజువాణీ కూడా మొదలెట్టేసి, నేటి సినిమా హీరోయిన్ తలచుకుంటే ఏ శిఖరాలకి చేరుకోగలదో నిరూపిస్తోంది.
          నిర్మాతలకి కమర్షియల్ హిట్ కావాలి, టాప్ హీరోయిన్లకి తక్షణ రొక్కం  కావాలి. ఈ రెండే ఐటమ్స్ సాంగ్స్ పుట్టుకకి కారణం. టాప్ హీరో పక్కన క్రేజీ హీరోయిన్ తో ఓ ఐటెం సాంగ్ పెడితే వాణిజ్య విలువలు బాగా పెరుగుతాయనే ఆశ నిర్మాతలకి, రెండ్రోజుల్లో ఇరవై నుంచీ 75 లక్షలవరకూ ఒక్క ఐటెం సాంగ్ తోనే గడించ వచ్చన్న ఆశయం హీరోయిన్లకీ ఏర్పడి ఐటెం సాంగ్స్ పుడుతున్నాయి. ఇక ఈ సాంగ్స్ కి అట్టహాసంగా కోటి- కోటిన్నర ఖర్చుపెట్టి వేసే భారీ సెట్టింగులతో కళాదర్శకులకీ, వాళ్ళ  పరివారానికీ పుష్కలంగా ఆర్జనకూడా! కాస్ట్యూమర్లని కూడా మర్చిపోవద్దు!
         
మగధీర   తో ప్రారంభమైన సోషియో ఫాంటసీ సినిమాల ఒరవడిలో అకస్మాత్తుగా భారీ సెట్టింగులు వేసే ట్రెండ్ ఒకటి ప్రారభమై, హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ కట్టడాలతో పోటీ పడుతూ ఆ  సినిమా సెట్స్ కూడా వెలిశాయి. ఆ సినిమాలు అంతరించి పోయాయి. కానీ అలాటి సెట్స్ వేసే ట్రెండ్ ఇప్పుడు ఐటెం సాంగ్స్ తో మళ్ళీ మొదలైంది. కాకపోతే అవుట్ డోర్ లో కాదు. ఇలా ఒక పెద్ద స్టార్ సినిమాలో ఐటెం సాంగ్ కే హీరోయిన్ పారితోషికాలూ సెట్ నిర్మాణాలతో కలుపుకుని  రెండు కోట్లకి పైనే   ఖర్చు పెడుతున్నారు. తాజాగా కరెంట్ తీగలో సన్నీ లియోన్ ఐటెం పాటకి వేసిన సెట్ ఖర్చే కోటిన్నర రూపాయలు. ( ఛార్మీ వంటి చిన్న తార తో ఓ తమిళ సినిమాకి తీసిన ఐటెం పాటకి కోటి రూపాయల సెట్ వేశారు!
  దేశం లో ఐటెం పాటకి కళ్ళు తిరిగే మొత్తం అక్షరాలా ఆరుకోట్ల రూపాయలు హిందీలో వచ్చిన బాస్కోసం ఖర్చు పెట్టారు. అక్షయ్ కుమార్ సోనాక్షి సిన్హా లు నటించిన ఈ సినిమాలో పార్టీ ఆల్ నైట్ అనే ఐటెం పాటలో అక్షయ్ , సోనాక్షి, ప్రభుదేవా, యోయో హనీసింగ్ ఇంకా ఆరువందల మంది విదేశీ మోడళ్ళు కన్పిస్తారు!)     ఐతే ఇటీవల మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్ల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో ఐటమ్స్ సాంగ్స్ సంగతి దేవుడెరుగు- బడ్జెట్ లో భారీగా కోత పెట్టుకుని కొత్త సినిమాల నిర్మాణాలకి పూనుకుంటున్నారు. 

        ఎన్టీఆర్ ఆదేశాలతో పూరీ జగనాథ్ దర్శకత్వం వహిస్తున్న టెంపర్సినిమాకి ఇదే అమలవుతోంది. స్టార్లు, స్టార్ దర్శకులు చెరో పదీ పన్నెండేసి కోట్లు పారితోషికాలు తీసుకుంటూ తమకు  అట్టర్ ఫ్లాప్ సినిమాలు అంటగడుతున్నారని ఇటీవల బయ్యర్లు తిరుగుబాటు చేయడంతో, మొదటగా కళ్ళు తెర్చింది ఎన్టీఆరే. ఇది తనకి రభస నేర్పిన పాఠం. మహేష్ బాబు కూడా ఈ సంవత్సరం నేనొక్కడినేతర్వాత ఆగడుకూడా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఆగడునిర్మాతలకి ఆరు కోట్లు వెనక్కి ఇచ్చేసినా- ఆయన భవిష్యత్ ప్రణాళికేమిటో  తెలీదు. ఎన్టీఆర్ మాత్రం పూరీ దర్శకత్వంలో నటిస్తున్న టెంపర్కి పారితోషికం తీసుకోకుండా నైజాం హక్కులు పొందితే,  పూరీ కూడా అదే దారిలో సీడెడ్ హక్కులు రాయించుకున్నారు. ఇది సరయిన పద్దతి! తమ పనితనం చూసి ఆయా ఏరియాల్లో ప్రేక్షకులిచ్చేదే సరైన ప్రతిఫలం!
          ఇంతేగాక టెంపర్ నిర్మాణ వ్యయం  కూడా బాగా తగ్గేట్టు ప్లాన్ చేశారు. దీంతో సీన్స్ కీ, పాటలకీ విదేశాలకి వెళ్ళడంలేదు. ఐటెం సాంగ్ తప్పడం లేదు, కాకపోతే ముందు అనుకున్న శృతీ హాసన్ ని కాదని, కెనడా మోడల్ నోరా ఫతేహీ ని తీసుకున్నారు. జంక్షన్ లో..అంటూ మహేష్ బాబుతో శృతీ హాసన్ ఆగడులో నాలుగు నిమిషాలు కనపడే ఐటెం సాంగ్ కి అక్షరాలా యాభై లక్షల రూపాయలు సొంతం చేసుకుంది! నా పేరు సిల్కు..అంటూ  అల్లుడు శీనులో మరో ఐటెం సాంగ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో స్టేప్పే సిన టాప్ హీరోయిన్ తమన్నా కయితే 75లక్షలు ముట్టాయి!

         ఐటెం సాంగ్స్ వ్యయం తగ్గించడానికి పూరీ అనుసరిస్తున్న ఫార్ములా ఫారిన్ మోడళ్ళని ప్రవేశపెట్టడం. మన టాప్ హీరోయిన్లు, లేకపోతే  బాలీవుడ్ హీరోయిన్లు గా సాగుతున్న ఐటెం సాంగ్ ల ట్రెండ్ అంతర్జాతీయ మోడళ్ళతో ఇంకో మలుపు తిరిగింది. బ్రెజిల్ కి చెందిన మోడల్ గాబ్రిలా బెర్టెంట్ ని దేవుడు చేసిన మనుషులులో ఐటెం సాంగ్ కోసం తీసుకొచ్చిన పూరీ, మళ్ళీ ఇప్పుడు టెంపర్ కోసం నోరా ఫతేహీ ని పట్టుకొచ్చారు. మధ్యలో దిల్ రాజు ఎవడులో రాం చరణ్ తో ఐటెం సాంగ్ కోసం స్కార్లెట్ విల్సన్ ని దిగుమతి చేశారు.
          మన దేశపు సినిమాలకి మాత్రమే పరిమితమైన ఈ ఐటెం సాంగ్స్ అనే మసాలా దినుసుని   
ది అఫీషియల్ డిక్షనరీ ఆఫ్ అన్ అఫీషియల్ ఇంగ్లిష్ఇలా నిర్వచిస్తోంది...కథతో సంబంధంలేకుండా, అందమైన డాన్సర్లతో ఆడిపాడించి, కమర్షియల్ గా ఆకర్షించేందుకు వినియోగించే ఒక హంగు అని...సెన్సార్ బోర్డు కూడా జోక్యం చేసుకుని, ఐటెం సాంగ్ వుండే సినిమాలకి సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది వేడి వేడి చర్చకు దారితీసింది. అలా అనుకుంటే ఇక  యూసర్టిఫికేట్ సినామాలే వుండవు. పాతరోజుల్లో ప్రతి భాషలోనూ కుటుంబ కథా చిత్రాల్లో, మన సినిమాల్లో విజయలలిత,  జ్యోతిలక్ష్మి పాటల్లాగా - ఏదోవొక వాంప్ సాంగ్  వుండేది. వాటికి  సర్టిఫికేట్ ఇచ్చిన దాఖలా లేదు. ఇంతే కాదు,  ఇప్పుడు ఐటెం సాంగ్స్ ని ఛానెళ్ళలో కూడా ప్రదర్శించ కూడదని సెన్సార్ బోర్డు ఉత్తర్వులు వెలువడ్డాయి.  అసలు ఐటెం సాంగ్ నిర్వచనాన్నే సెన్సార్ బోర్డు ఇంతవరకూ స్పష్టంగా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏది నాటీ సాంగ్ అవుతుంది, ఏది ఐటెం సాంగ్ అవుతుందో ఎలా చెప్పగలదని ప్రశ్నిస్తున్న వారూ వున్నారు. ఈ గొడవలు మనకెందుకు, ఐటెం సాంగ్ లేకపోతే  సినిమా ఏమైనా ఫ్లాప్ అవుతుందా అని ఆలోచిస్తున్న నిర్మాతలూ  వున్నారు.  

          ఒకప్పటి వాంప్ పాత్ర నేటి ఐటెం గర్ల్ అయ్యింది. ఇంత వరకూ ఫర్వాలేదు. ఐతే ఒక టాప్ హీరోయిన్ వున్న సినిమాలో ఇంకో టాప్ హీరోయిన్ అతిధి పాత్ర వేయడానికే
నోచెప్పేస్తున్న  దృష్టాంతాలు చూస్తున్న రోజుల్లో, ఏమాత్రం సంకోచించకుండా  ఐటెం గర్ల్ రూపంలో దిగుమతి అవడానికి ఎస్చెప్పేస్తోంది. తను వచ్చేసి ఐటెం గర్ల్ రూపంలో వాంప్ ఆర్టిస్టు వృత్తిని లాక్కోవడం అలా వుంచుదాం, అసలు ఆ పాత్రకి తను దిగజారుతున్నానని కూడా భావించడం లేదు.  ప్రత్యేకంగా జ్యోతి లక్ష్మిలు, డిస్కో శాంతిలు, అభినయశ్రీలు ఇప్పుడు అక్కర్లేదు- తమన్నా,శృతీ హసన్, శ్రియ, ఛార్మీలు వచ్చేసి ఆపని కానిచ్చేస్తున్నారు. ఎంతటి టాప్ హీరోయిన్ అయినా ఆ స్థానంలో ఎన్నాళ్ళు వుంటుందో గ్యారంటీ లేదు. దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే తాపత్రయం లోంచే ఇలాటి బుద్ధులు పుడుతున్నాయని, ఇప్పుడు సినిమాలు తీయకుండా ఈ తమాషా చూస్తున్న ఓ సీనియర్ నిర్మాత అన్నారు. ఐటెం సాంగ్స్ కి పెడుతున్న డబ్బులతో ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయొచ్చని ఆయన అభిప్రాయం. సరీగ్గా  ఈయన అభిప్రాయాన్నే పైన మనం చెప్పుకున్న హిందీ సినిమా ఐటెం సాంగ్ విషయంలో ఇంకాస్త ఘాటుగా వెలిబుచ్చాయి బాలీవుడ్ వర్గాలు. ఐటెం పాట పేరుతో ఆరుకోట్ల రూపాయలు తగిలెయ్యడాన్ని తీవ్రంగా నిరసించారు. చిన్న నిర్మాతలు, కొత్త కొత్త  దర్శకులు ఎందరో పెట్టుబడులకి మొహం వాచి  వుంటే, ఒక ఐటెం పాటకి ఆరుకోట్లు తగిలెయ్యడం బాధ్యతారాహిత్యమని తీవ్రంగా విమర్శించారు. 

          కొందరు హీరోయిన్లు ఐటెం పాటలు ఒప్పుకోవడానికి వాళ్ళ పరిస్థితి కారణమౌతోంది- హీరోయిన్ గా అవకాశాలు సన్నగిల్లడం! దీన్ని అర్ధం జేసుకోవచ్చు. నమిత
, ఆశాసైనీ, ఫర్జానా, సమీరా రెడ్డి, పార్వతీ మెల్టన్, కిమ్ శర్మ, కౌశ, రీమా సేన్, హంసా నందిని, మాళవిక, రంభ, స్వాతీ వర్మ .....ఇలా అవకాశాలు తగ్గిన హీరోయిన్లు ఐటెం సాంగ్స్ కి ఒప్పుకుంటున్నారు. అయితే ఎదుగుతున్న నటి అంజలి కూడా సూర్య నటించిన యముడులో ఐటెం సాంగ్ కి ఒప్పుకోవడాన్ని ఎలా అర్ధం జేసుకోవాలో అంతుబట్టదు. ఇక ఛార్మి విషయం చెప్పక్కర్లేదు. ప్రియమణి అయితే షారుఖ్ ఖాన్ నటించిన హిందీ చెన్నై ఎక్స్ ప్రెస్లో వన్ టూ త్రీఅనే ఐటెం పాటేసుకుంది. శ్రియ కూడా వెళ్లి సంజయ్ దత్ నటించిన జిల్లా ఘజియా బాద్లో మై ఛమియా నంబర్ వన్ హూ, మై ఛమియా ఐటెం బాంబ్ హూ..అని నేరుగా ఐటెం బాంబునని డిక్లేర్ చేసుకుంది!

     వీళ్ళందరి సుడిగాలిలో కేవలం ఐటెం గర్ల్ గానే వచ్చి కొన్నాళ్ళు ఊపిన ముమైత్ ఖాన్ అమాంతం తెరమరు గయ్యింది. అభినయశ్రీ గురించి చెప్పక్కర్లేదు. ఇలాటి వృత్తి ఐటెం డాన్సర్లు సినిమాల్లో ఇంకో పాత్ర కూడా పోషించే వాళ్ళు. విలన్ పక్కన ఉంపుడు గత్తెలుగా వుండడం. ఇది అనాదిగా వస్తున్నదే. విజయలలిత, జ్యోతి లక్ష్మి, రాజసులోచన, జయమాలిని, హలం, సుభాషిని, అనూరాధ, జయశ్రీ, పాకీజా, రమ్యశ్రీ, కుయిలి, ఆల్ఫోన్సా, షకీలా, డిస్కో శాంతి, సిల్క్ స్మిత..వీళ్ళంతా ఒకప్పుడు ఈ శాఖని ఏలుకున్నారు. కాకపోతే వీళ్ళని వాంప్స్ అనేవాళ్ళు. వీళ్ళ పాటల్ని క్లబ్ సాంగ్స్ అనేవాళ్ళు, ఆ క్లబ్ సాంగ్స్ లో కేబరే డాన్సర్స్ అన్పించుకునే వాళ్ళు. లేదా ద్వందార్ధాలు బాగా దట్టించి –‘సూదిలో దారం సందులో బేరంలాంటి ఫోక్ సాంగ్స్ వేసుకునే వాళ్ళు. ఇలాటి వాటికి తిరుగులేని ఐటెం సింగర్గా ఎస్టాబ్లిష్ అయింది ది గ్రేట్ ఎల్లారీశ్వరియే! ఇప్పుడు అలాటి ఐటెం సింగర్స్ ఎవరో చెప్పగలమా?

          ఐతే హిందీలో టాప్ హీరోయిన్ వైజయంతీ మాలా, షకీలా లాంటి ప్రముఖ హీరోయిన్లు కూడా ఐటెం గర్ల్గా అనేక సార్లు కన్పించినవారే. దీనికి సాహసించడానికి  మన హీరోయిన్లకి ముక్కుతూ మూల్గుతూ ఐదు దశాబ్దాలకి పైగా పట్టింది. 1954 లోనే  మొట్ట మొదటిసారిగా దేశీయ సినిమాల్లో ఐటెం గర్ల్గా వెలసిన తార షకీలా. ఈమె గురుదత్, షమ్మీ కపూర్ ల వంటి  అగ్ర హీరోల  సరసన హీరోయిన్ గా నటించిన గ్లామర్ తార. అలాంటిది  ఆర్ పార్లో బాబూజీ ధీరే చల్నా-ప్యార్ మే జరా సంభల్నా’ ( చూసి అడుగెయ్యి బాబూ, ప్రేమలో జాగ్రత్త) 

           ఇక 1957 లో ఆశాఅనే సినిమాలో ఈనా  మీనా డీకాఅని నేటికీ మోగే ఐటెం సాంగ్తో మళ్ళీ టాప్ హీరోయిన్ వైజయంతీ మాలా దుమ్మురేపింది. తిరిగి  మధుమతిలో చడ్ గయో పాపీ బిచువా  (పాపిష్టి తేలు ఎక్కేసింది),  ఇంకా మళ్ళీ సాధన  లో కహోజీ తుం క్యా క్యా ఖరీదోగే’ (చెప్పవయ్యా ఏమేం కొంటావ్) లాంటి డబుల్ మీనింగులతో హృదయాల్ని మీటింది’. ఇలా పది  పన్నెండు వరకూ ఇవ్వాళ మనం చెప్పుకునే ఐటెం సాంగ్స్ తో  చెలరేగింది- అంత పాపులర్ హీరోయిన్ గా ఉంటూ కూడా!

షకీలా
        1965 లో అంతస్తులులో రేలంగి, రమణా రెడ్డి కమేడియన్లని వెంటేసుకుని వీధిలో చుట్టూ జనం మధ్య భానుమతి పాడే దులపరో బుల్లోడో దుమ్ము దులపరో బుల్లోడోపాట అందులో సాంతం ఈవ్ టీజర్లమీద ఎంత విసుర్లు ఉన్నప్పటికీ, ఐటెం సాంగ్ కాక మరేమిటి? ఇక హిందీలో మాధురీ దీక్షిత్ అయితే తేజాబ్లో ఏక్  దో తీన్పాటతో దేశమంతా మార్మోగించింది. తిరిగి ఖల్నాయక్లో చాలా వివాదాస్పదమైన పాట- పార్లమెంట్ లోనూ గొడవకి దారితీసిన ఐటెం సాంగ్ -చోళీ కే పీఛే క్యాహైగురించి తెలిసిందే.

          కాకపోతే అప్పట్లో డిమాండ్లు లేవు. ఆశ్చర్యకరమైన పారితోషికాలు ఐటెం సాంగ్స్ లో కన్పించే హీరోయిన్లకి లేవు. అలాగే ఎక్స్ పోజ్ చేసే కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు ధరించలేదు. మూలాన్ని తీసుకుని దాని షోకుల్ని మార్చేస్తే అది ఇప్పటి ఐటెం సాంగ్ అయింది - తను ఇప్పటి ఐటెం గర్ల్ అయింది, అంతే.  మూలాలున్నంత కాలం అవి  పునరావృతమవుతూనే 
వైజయంతీ మాలా 

వుంటాయి వివిధ రూపాల్లో. 1930 లలోనే వున్న రాజనర్తకే తర్వాత
కాలంలో క్లబ్ డాన్సర్ అయినట్టు, `50 లలో కవ్వించే స్పెషల్ సాంగ్స్ నటించిన హీరోయినే నేటి ఐటెం గర్ల్ అయ్యింది. దీనిపట్ల ఎవరికీ  అభ్యంతరం ఉండనవసరం లేదు. కమర్షియల్ సినిమాకి ఏ హద్దులూ వుండవు. నిజజీవితంలో అసాధ్యమైన వాటిని చూపించి రంజింప జేయడమే వాటి విధి. నేటి సినిమాల్లో ఒక అర్ధవంతమైన పాత్రంటూ లేక, నామమాత్రంగా మిగిలిన హీరోయిన్- ఎంత టాప్ హీరోయిన్ అయినా, నటిగా నిరూపించుకోవడానికి ఇంకేమీ లేక,  చేయకూడని విన్యాసాలు చేస్తూ ఇలాగే  దారితప్పి తిరుగుతుంటుంది..ఎవరేమంటారు?

సికిందర్ 
(డిసెంబర్ 2014 ‘ఈవారం’)
         
         
         

         



15, డిసెంబర్ 2014, సోమవారం

కెమెరా!

అదొక యజ్ఞమే!
ఛాయాగ్రాహకుడు సి. రాం ప్రసాద్
రోసారి కెమెరామాన్ అదృశ్య దృశ్యాల దార్శనికు డవుతున్నాడు. పౌరాణిక, జానపద సినిమాల్ని ఇప్పటి  ప్రేక్షకులు మిస్సవ్వచ్చు గాక, ఆ కాలంలో అవి ప్రవేశపెట్టిన ‘ట్రిక్ ఫోటోగ్రఫీ’ అనే మాయాజాలం నుంచి మాత్రం ఇప్పటి కెమెరామాన్ తప్పించుకోలేక పోతున్నాడు. ఏదైతే మనలో అంతర్భాగంగా ఉంటుందో, అది వెన్నాడుతూంటుంది. దృశ్య రూపాలు మారినంత మాత్రాన శాస్త్రం అంతరించిపోయిందని కాదు. శాస్త్రం శాశ్వతం. దానాధారం జేసుకుని ఒకప్పుడు ట్రిక్ ఫోటోగ్రఫీ వుండొచ్చు, ఇంకోప్పుడు రూపం మార్చుకుని సీజీ గ్రాఫిక్స్ ఉండొచ్చు!
    రాత్రి వేళ రైలు ప్రయాణిస్తూ వుంటుంది. పైన చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ చంద్రుడికి మబ్బులు అడ్దొస్తూ వుంటాయి. వాటి నీడ కింద పడుతూంటుంది. రైలు కదులుతూంటే, ఆ నీడ తన వాలు చూసుకుంటూ, మబ్బు తొలగ్గానే తనూ తప్పుకుంటూ ఉంటుంది..ఈ వెన్నెల దోబూచులాటలో నాయకా నాయికలు రైలు చివర ‘ఎల్’ షేపు ట్రాలీ మీద యుగళ గీత మొకటి పాడుకుంటూ మైమరచి పోతూంటారు. ఇదంతా చూస్తూ మనమూ మనసు పారేసుకోకుండా ఉండం.
   నిజంగా జరిగిందేమిటంటే, అక్కడ అంత పొడవు రాయలసీమ వెళ్ళే రైలే లేదు. చుట్టూ ఎలాటి పరిసరాలూ లేవు. పైన చంద్రుడూ వెన్నెలా మబ్బులసలే లేవు. ఓ ట్రాలీ, దానిమీద హీరో హీరోయిన్లు, మబ్బు తాలూకు ఓ నీడా - ఇవే మాత్రమే వున్నాయి!
    ఇవి- ఈ మూడూ మాత్రమే నిజం, మిగతావన్నీ అబద్ధం! ఈ అబద్దాల్ని గ్రాఫిక్స్ ఆర్టిస్టు నిజాలుగా భ్రమింపజేసి దృశ్యాన్ని రక్తి కట్టించాడన్న మాట!
   ఓస్ ఇంతేనా, ఆ మూడూ తప్ప మిగతాదంతా గ్రాఫిక్సేనా! మరైతే కెమెరామాన్ చేసిందేమిటి, ఇక అతడికి సినిమాలతో పనేమిటి- అన్న సందేశాలూ రావచ్చు. అతణ్ణి ఆత్మరక్షణ లోనూ పడెయ్య వచ్చు. అయితే దీనికి తిరుగులేని సమాధానముంది సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ సి. రాం ప్రసాద్ దగ్గర. అనేక సూపర్ హిట్ చిత్రాల అగ్రస్థాయి ఛాయాగ్రాహకుడైన ఈయన, పైన వివరించిన సందర్భంలో, రామోజీ ఫిలిం సిటీలో సెట్లో ఓ యజ్ఞమే చేసి కృత్రిమ నీడని అంత సహజంగా సృష్టించారు.  తన లైటింగ్ పరిజ్ఞానంతో అలాటి కృత్రిమ నీడని సృష్టిస్తూ, ట్రాలీ మీద హీరో హీరో హీరోయిన్లైన సునీల్- సలోనీల నృత్య విన్యాసాలని కెమెరాలో పొదివి పట్టుకుంటూ, అక్కడలేని విశేషాల్ని క్యాలిక్యుటివ్ గా ఊహిస్తూ, ఉన్న నిజాలతో వాటిని సమన్వయం చేసుకుంటూ, ఎనిమిది రోజుల పాటూ శ్రమిస్తే గానీ, ‘మర్యాదరామన్న’ లో ఆ డ్యూయెట్ కి ఆతర్వాత జోడించాల్సిన అంతటి గ్రాఫిక్స్ ఇన్పుట్ రాలేదు!
    “గ్రాఫిక్స్ అనేది ఒక సపోర్టింగ్ ఆర్టు” –అన్నారాయన, “అయితే దృశ్యంలో గ్రాఫిక్స్ హైలైట్ కానప్పుడే ఆ దృశ్యానికి రాణింపు వస్తుంది. ఈ సినిమా చివర్లో  వంతెన సీను గ్రాఫిక్స్ సృష్టి అంటే నేనే నమ్మలేకపోయా. అదీ నిజమైన గ్రాఫిక్స్ అంటే. ప్రేక్షకులు తాము చూస్తున్నది నకిలీ అని ఇట్టే కనుక్కో గలుగుతున్నారు. అయినా వాళ్ళ ఎంజాయ్ మెంటుకి అదేమీ అడ్డు రావడం లేదు., బాగా ఎంజాయ్ చేస్తున్నారు..” అని వివరించారు.
    ఇప్పుడిప్పుడే రవితేజ నటిస్తున్న ‘మిరపకాయ్’ షూటింగు జర్మనీలో ముగించుకొచ్చిన రాం ప్రసాద్,  ఈ హాస్యకథా  చిత్రానికి దానికుండే  ఫీల్ తోనే చిత్రీకరణ జరిపామన్నారు. ప్రత్యేకంగా ఎలాటి హై-ఎండ్ టెక్నాలజీనీ వాడలేదన్నారు. తెలుగు సినిమాలు స్టైలిష్ గా ఎందుకు ఉండడడం లేదని అడిగితే-  బాలీవుడ్ సినిమాల టార్గెట్ ప్రేక్షకులు వేరన్నారు. మన సినిమాలకి పారితోషికాలకి పోను మేకింగ్ కి మిగిలేది బొటాబొటీ అనీ, కాబట్టి ‘విత్తం కొద్దీ వైభవ’ మనీ కొటేషన్ చెప్పారు.
   మరి ఎవరైనా దర్శకులు హాలీవుడ్ షాట్స్ ని చూపించి, వాటిని కాపీ కొట్టమంటే కొట్టారా లేదా ఫ్రాంక్ గా చెప్పమంటే – కాపీకోసం కాదుగానీ, ఫీల్ కోసం రిఫరెన్స్ కోసం వాటిని చూపిస్తారనీ, తమ భావాల్ని తెలియజేసేందుకు టూల్స్ గా వాటి నుపయోగిస్తారనీ చెప్పుకొచ్చారు. 
    ‘అతనొక్కడే’ కి  నంది అవార్డు నందుకున్న రాం ప్రసాద్  1984 నుంచే రంగంలో వున్నారు. అప్పట్లో మద్రాసులో డిఎఫ్ టి చేస్తూ,  ప్రసిద్ధ కెమెరామాన్ వీఎస్సార్ స్వామికి సహాయకుడిగా చేరారు. 1993 లో పద్మాలయా వారి ఒక సినిమాకి ఛాయాగ్రాహకులయ్యారు. అప్పటినుంచీ ఇప్పటి దాకా 60 సినిమాలు పూర్తి చేశారు. 90శాతం దర్శకుల తొలి సినిమాలకి తనే  ఛాయాగ్రాహకుడు.
    లైటింగ్ కి అతివృష్టి అశోక్ మెహతా అయితే, అనావృష్టి సంతోష్ శివన్.  ఈ ఇద్దరూ రాం ప్రసాద్ అభిమాన సినిమాటోగ్రాఫర్లే. ఇంకా నాటి మార్కస్ బార్ట్లే, రెహ్మాన్, వీకే మూర్తీ లాంటి ప్రసిద్ధ ఛాయాగ్రహకులు నేడు లేకపోవడం బాధాకరమని అంటూ,  భగవంతుడు ఇప్పుడు తమలాంటి కెమెరా మెన్లకి ఇంత టెక్నాలజీతో ఎక్విప్ మెంట్ నిస్తున్నందుకు సంతోషంగా వుండన్నారాయన. 
    సరే, మరి మీ హాబీ లేమిటి? – అని ప్రశ్న వేయడమే తడవుగా లోపలి నుంచీ ఒక హెలికాప్టర్ ని ఎత్తుకొచ్చారు. దాన్ని ఎగరేయడం తన హాబీయని చెప్పారు గర్వంగా. ప్యూర్ మెటల్ తో తళ తళా మెరిసిపోతూ, గూఢచార గ్యాడ్జెట్ లా వుందది. ఖరీదు మూడు లక్షల రూపాయలట. మూడేళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్నారట. ఏం ప్రాక్టీసు? ఎప్పటికైనా దీనికి మినియేచర్ కెమెరా అమర్చి ఏరియల్ షాట్స్ తీయాలని! ఏం ఐ -2, హారీ పోటర్ -7 లాంటి హాలీవుడ్ సినిమాల్లో ఇలాటి షాట్సే తీశారని వివరించారు.
   ఇంకా డీటెయిల్స్? ప్రస్తుతానికింతే! ఇంకో ఇంటర్వ్యూ వరకూ సస్పెన్స్- అంటూ దాన్ని పాపాయిలా ఆప్యాయంగా ఎత్తుకుని వెళ్ళిపోయారు. అన్నట్టు హీరో కృష్ణ మేకప్ మాన్ మాధవరావు పెద్ద కుమారుడే రాం ప్రసాద్.
సికిందర్
(నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

కళ!

పాత్రలకి కూడా జీవంపోసే వాతావరణ సృష్టి!
కళా దర్శకుడు ఎస్. రవిందర్ రెడ్డి 
మొత్తానికి తెలుగు సినిమా కళా దర్శకత్వానికి మహర్దశ పట్టింది. ఒక బిగ్ స్టార్ తో సినిమా అనుకోగానే తక్షణం కళా దర్శకత్వానికి పెద్ద పీట వేసేసి భారీ బడ్జెట్ల తో  మెగా సెట్స్ నిర్మించడం  పరిపాటైంది. ఏమంటే మన సినిమాలెవరికీ తీసిపోవని ఇతరులకి చూపించడమే  దీని ముఖ్యోద్దేశమని కొందరంటున్నారు. ఇది కరెక్టేనా? తెలుగు సినిమాల్ని తెలుగేతరులే చూడనప్పుడు ఇలా మీసాలు మెలెయ్యడం సబబేనా? కనీసం ఇంకో భాషలో అనువాదాలకైనా నోచుకకోని మన సినిమాల్ని చూసి ‘శభాష్ టెల్గూమాన్’ అని ఎవరనాలి?

‘మగధీర’ ఫేమ్ కళాదర్శకుడు ఎస్.రవిందర్( రవీందర్ కాదు) రెడ్డి అభిప్రాయంలో కళా దర్శకత్వానికి ఇప్పుడింత మంచి రోజులు రావడానికి స్టార్ల మధ్య పోటీయే కారణం. వాళ్లకి ఇతర భాషల మీద కూడా ఆసక్తి వుండదు. అంటే ఆ మెగా సెట్స్ ని స్థానికంగానే ప్రదర్శించుకుని సంతృ ప్తిపడుతున్నారని అనుకోవాలి. ఏమైనా ఈ పరిణామాలతో కళా దర్శకులు, వాళ్ళ టీములు, కార్మికులూ అంతా హ్యాపీ. హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి, మెగా సెట్స్ లేస్తున్నాయి జోరుగా.. ఇదే రాజధాని అభివృద్ధి: ఏకంగా ఒక వర్చువల్ ప్రపంచాన్నే సృష్టించుకోవడం!

 ‘సరయూ ది డిజైన్’  స్టూడియో అధినేత రవిందర్  ‘ఐతే’ తో మొదలై,  ‘మగధీర’ చెయ్యి పట్టుకుని ‘గోల్కొండ హైస్కూల్’ కొచ్చారు. మధ్యలో మరో 14 ప్రసిద్ధ సినిమాలున్నాయి. ముడి ఫిలిం కి డిజిటల్ ప్రత్యాన్మాయం వచ్చేసి నిర్మాణ వ్యయం తగ్గిపోతున్నట్టే, సెట్స్ పరంగా కూడా అలాటి ఖర్చు తగ్గించే ఆవిష్కరణ లేమైనా  జరుగుతున్నాయా అని అంటే, లేదన్నారు. సెట్స్ కయ్యే వ్యయం దర్శకుడు, నిర్మాతల నిర్ణయాలపై ఆధారపడుతుందన్నారు.  కొంత భాగం సెట్ వేసి, మిగతా భాగాన్ని  గ్రాఫిక్స్ తో సృష్టించుకునే విధానంలో కూడా ఖర్చేం తగ్గదనీ, పైగా ఆ రెండిటికి నిర్దుష్టమైన మ్యాచింగ్ కూడా కష్టమనీ చెప్పారు రవిందర్. ‘మగధీర’ లో కొంతవరకూ ఇలాటి మ్యాచింగ్ ని సాధించామన్నారు. 

    డీఐ విషయానికొస్తే, దీనిపట్ల అవగాహన వున్న కెమెరామాన్ కి సెట్ కి వేసిన ఒక రంగు, డీఐ తర్వాత ఫలానా ఈ విధంగా కన్పిస్తుందని ముందు జాగ్రత్తలు చెప్పడం వల్ల, డీఐ తో కళా దర్శకుడి కళ వన్నె తగ్గే ప్రసక్తి లేదన్నారు. సెట్స్ మీద లైటింగ్ ని తను దగ్గరుండి చూసుకుంటా నన్నారు. అలాగే సౌండ్ గురించి కూడా పట్టించుకుంటా నన్నారు. అదెలా అనడిగితే-

    “హీరోయిన్ పరిగెడుతున్నప్పుడు కాలికి డబ్బా తగిలి పడిపోవచ్చు, చేతికి గ్లాసు తగిలి పగలొచ్చు, బయట పావురాల గుంపు ఒక్క పెట్టున ఎగిరిపోవచ్చు...సీన్ ని నేనిలా ఊహించి,  ఆ డబ్బా, ఆ గ్లాసు, ఆ పావురాల గుంపు నీ ఏర్పాటు చేశాననుకోండి, సంగీత దర్శకుడికి ఆయా శబ్దాలు వేసి జీవం పోసే అవకాశం వుంటుంది. దృశ్యం బాగా రక్తి కడుతుంది..” అని వివరించు కొచ్చారు. 

          వేరీవెల్, పోతే పోరాట దృశ్యాలకి ఆయుధాలు మీ కళా దర్శకులే తయారు చేస్తున్నప్పుడు, అది ఫైట్ మాస్టర్ల సృష్టిగా మా బోటి వాళ్ళం అనుకుంటున్నాం కదా..అంటే, ఫైట్ మాస్టర్లు ఏదీ సృష్టించరన్నారు. వాళ్లదంతా విధ్వంసమే నని జోకేస్తూ, ఇప్పుడు తాజాగా ‘రాజన్న’ కి తయారుచేసిన వేట కత్తు ల్లోంచి ఒకదాన్ని తీసి చూడమని చేతిలో పెట్టారు. మెత్తటి మెటీరియల్ తో తయారు చేసిన ఆ కత్తితో గాయలయ్యే ప్రసక్తే లేదు. ఇదే ఫైట్ మాస్టర్ తయారు చేస్తే కసిక్కున  దిగబడుతుందేమో...
     ఇక ఫైట్ మాస్టర్ల గురించి ఇంకో విషయం చెబుతూ, హీరో పిడికిలితో కొడితే అమాంతం గోడ పడిపోయేట్టు కట్టివ్వాలంటారు ఫైట్ మాస్టర్లు. అలా కాకుండా ముందు గోడ పగుళ్లిచ్చి, కొన్ని పెచ్చు లూడుతూంటే, అది ఫియర్ సైకోసిస్ ని సృష్టించి ప్రేక్షకులకి గాభార పెడుతుందని సైన్స్ వివరించారు రవీందర్.
    స్వేచ్ఛ విషయానికొస్తే, తనవరకూ పూర్తి స్వేచ్చతో పనిచేసే అవకాశం లభిస్తోందన్నారు. సినిమాకి వెన్నెముక లాంటిది కళా దర్శకత్వమని, అది పాత్రల మనస్తత్వాల్ని,  వ్యక్తిత్వాల్ని, స్థితిగతుల్నీ వెల్లడి చేసే ఒక వాతావరణ సృష్టి అనంటూ, ఒక ఆపిల్ పండు పెట్టాలన్నా ప్రొడక్షన్ బాయ్ పరుగెత్తి మార్కెట్లో దొరికిందల్లా పట్టు కొచ్చేస్తే కుదరదున్నారు. ముందు బ్యాక్ స్టోరీ ని వర్కౌట్ చేసి ప్రాపర్టీస్ ని సూచిస్తానన్నారు. కళా దర్శకత్వం కథని డామినేట్ చేయకూడదనీ, కథ వింటున్నప్పుడే దర్శకుడి ఊహా లోకపు ఫీల్ ని పసిగడతాననీ చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఇద్దరు దర్శకులు కథ చెప్పననడంతో ఆ సినిమాల్ని వదులుకున్నా నన్నారు.

       ప్రేక్షకులు సినిమా బాగా లేదనడానికి కళాదర్శకత్వం కూడా కారణ మౌతుందన్నారు. కొన్ని రకాల రంగులు, వస్తు సంచయం అన్ కాన్షష్ గా వాళ్ళని చీకాకు పెట్టి ఉండొచ్చు. కనుక వస్తువుల ఎంపికలో, వాటి అమరికల, రంగుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
    “కాలేజీ నుంచి వచ్చిన హీరోయిన్ ఇంట్లో అటో చెప్పూ ఇటో చెప్పూ విసిరేసుకుంటూ వస్తే అవి ఎక్కడెక్కడ పడాలి, బ్యాగు కూడా విసిరేస్తే అది పడేందుకు ఓ సోఫా ఉంటే, అదెక్కడ వుండాలి...వాచీ తీసేస్తే దాన్ని టేబుల్ మీద ఎక్కడ పడెయ్యాలీ...” అని తన ధోరణిలో చెప్పుకు పోతూంటే- 
    “చూస్తూంటే మీరే దర్శకత్వం వహించేసేట్టున్నారు, ఇక దర్శకులేం చెయ్యాలి?” అని  అడ్డు తగిలితే- “టాలెంట్ వుంది కదా అని డామినేట్ చెయ్యను. అన్ని శాఖల వారితో ట్యూన్ అవుతాను. కొందరికి తక్కువ టాలెంట్ ఉండొచ్చు. అలాంటప్పుడు అంతకు నన్ను తగ్గించుకుని పని చేస్తాను” –అన్నారు. 

   నెల్లూరుకి చెందిన రవిందర్ 1993 లో హైదరాబాద్ జేఎన్టీయూ లో ఫైనార్ట్స్ చేసి,  న్యూఢిల్లీ  ఐఐటీ లో మాస్టర్స్ ఇన్ డిజైన్ పూర్తి చేశారు. కొంతకాలం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసి, ‘అమృతం’  సీరియల్ కొచ్చారు. 2003 లో గుణ్ణం గంగరాజు తీసిన ‘ఐతే’ కి కళా దర్శకులయ్యారు. 
     “ ‘ఐతే’ లో అపోలో హాస్పిటల్ వెనుక మీరు వేసిన టీ స్టాల్ సెట్ మిస్టీరియస్ నేచర్ ని ఇప్పటికీ మరువ లేకున్నాం,  అంత రియలిస్టిక్ గా ఎలా క్రియేట్ చేయగలిగారు?” అనడిగితే, బహుశా పారితోషికం లేని పరిస్థితుల్లో పని చయడం వల్ల ఆ సహజత్వం వచ్చిందని చమత్కరించారు (సినిమా విడుదలయ్యాక పాతిక వేలు లభించాయట!)

    తర్వాత ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘సై’, ‘ఒక్క మగాడు’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘అమ్మ చెప్పింది’, ‘అష్టాచెమ్మ’, ‘మార్నింగ్ రాగ’, ‘నేను మీకు తెలుసా’, ‘మగధీర’...ఇలా ఆయన ఖాతాలో సినిమాలు జమ పడ్డాయి.
    ‘మగధీర’ ఒక చరిత్ర. అందులో రాజభవనాలు, రథం, ఊబి, హెలీకాప్టర్, కాస్ట్యూమ్స్ వంటి అద్భుత సృష్టులు రవీందర్ చేతుల మీదుగా జరిగాక, చెప్పుకోవాల్సిన మరో విశిష్టత ‘మర్యాదరామన్న’ లోని రైల్ కంపార్ట్ మెంట్, ట్రాలీసెట్లు, నది మీద కలప వంతెన యదార్థ నిర్మాణం (గత ఇంటర్వ్యూల్లో ‘మర్యాదరామన్న’ గ్రాఫిక్స్ నిపుణులు కణల్ కణ్ణన్, కెమెరా మాన్ సి. రాం ప్రసద్ లు ఆ వంతెనని పూర్తిగా గ్రాఫిక్స్ సృష్టిగా పేర్కొనడాన్ని రవీందర్ దృష్టికి తెస్తే, దీనికి ఆయన ఫీలై,  అది తను వేసిన సెట్ -నిజ కట్టడం- అని ఫోటోలు చూపించారు).

    పోతే, ‘మర్యాదరామన్న’ కోసం వేసిన ఇంటి సెట్ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది...ఇప్పటికీ ఇందులో వివిధ సినిమాల షూటింగులు జరిగిపోతున్నాయి. పూర్తిగా ప్లై వుడ్ తో నిర్మించిన ఈ సెట్ కి నాల్గేళ్ళ గ్యారంటీ వుంది. దీని పటిష్టత కోసం ప్లైవుడ్ మీద వేసిన కోటింగ్ లో రసాయనాల మిశ్రమం రవిందర్ సొంత డిస్కవరీయే. ఇప్పుడు దీనికే ఆయన పేటెంట్ హక్కులు పొందారు. ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నవారమే స్విట్జర్లాండ్ నుంచి పత్రాలందాయని వాటిని చూపించారు. ఈ విషయం ముందుగా  ఇలా ‘ఆంధ్రజ్యోతి’ కే వెల్లడిస్తున్నాననీ, తర్వాత నిర్మాతల సమక్షంలో ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటిస్తామనీ చెప్పారు. కాబట్టి ఈ కెమికల్ కాంబినేషన్ ని ప్రపంచంలో ఎవరు వాడాలన్నా ముందుగా రవీందర్ కి రాయల్టీ చెల్లించాల్సి వుంటుంది. ఇలా ఒక కళా దర్శకుడికి పేటెంట్ హక్కులు దక్కడం దేశంలోనే మొదటిసారి!
      ప్రస్తుతం ‘శ్రీ రామరాజ్యం’ కి రామోజీ ఫిలిం సిటీలో రాజప్రాసాదాల సెట్, అల్వాల్ లో అడవి సెట్, ‘రాజన్న’ కి జూబ్లీహిల్స్ లో 1946 నాటి తెలంగాణా గ్రామం సెట్ వేసి, ఇంకా ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘ఈగ’ సినిమాలకి పనిచేస్తున్న రవిందర్ ఎలాటి అవార్డులకీ సన్మానాలకీ  దూరం!

సికిందర్  
(ఫిబ్రవరి 2011 ,ఆంధ్రజ్యోతి’ కోసం)

14, డిసెంబర్ 2014, ఆదివారం

రివ్యూ

ప్రాబ్లం ఫ్లాష్ బ్యాక్ తో! 

 



స్క్రీన్ ప్లే- దర్శకత్వం : కె ఎస్ రవికుమార్
తారాగణం :
రజనీకాంత్‌, సోనాక్షి సిన్హా, అనుష్కా శెట్టి, జగపతిబాబు, బ్రహ్మానందం, కె. విశ్వనాధ్‌, సంతానం, రాధా రవి, దేవ్ గిల్  తదితరులు
రచన: పొన్‌ కుమరన్‌, కె.ఎస్‌. రవికుమార్‌ *  సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ *
ఛాయాగ్రహణం: రత్నవేలు * కూర్పు: సంజిత్‌ * కళ: సాబు సిరిల్‌
బ్యానర్‌: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. * నిర్మాత :  రాక్‌లైన్‌ వెంకటేష్‌
విడుదల : డిసెంబర్‌ 12, 2014 
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త  సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా పండగే. ఆ పండగ  ఉత్సాహాన్ని ఇనుమడిం పజేయడం ఎప్పటికప్పుడు ఆయన సినిమాల దర్శకులకి గట్టి పరీక్షే. అయితే  స్టార్లతో కొత్త ప్రయోగాలు చేసే శంకర్ లాంటి టాప్ దర్శకుడి విజన్ ని చూడలేకపోతున్న ఇతర టాప్ దర్శకులకి మాత్రమే ఈ పరీక్ష. రజనీకాంత్ తో శంకర్ ఇంకో  ముప్ఫై సినిమాలు తీసినా అవి వేటికవి ముప్ఫై కొత్త రకాలుగానే  ఉండొచ్చు. ఇతరులే మామూలు మాస్ కమర్షియల్స్ తో సక్సెస్ ని ఇద్దామనుకుంటున్నారు. ఈ కోవకి చెందినవాడే దర్శకుడు కె ఎస్ రవికుమార్. రజనీకాంత్ తో గతంలో ముత్తు ( 1995), నరసింహా( 1999)  తీసిన కోవలోనే తిరిగి రజనీ స్టార్ పవర్ ని ఇంకా ఈ కాలంలో కూడా మరో మూస కథకి మాత్రమే పరిమితం చేయాలనుకున్నాడు. 

         మెగా స్టార్ చిరంజీవి కూడా తన 150 వ సినిమాకి ఇలాటి ‘లింగా’ లాంటి పీరియడ్ కథనే ఎంచుకుంటే రజనీ లాగే తప్పులో కాలేసినట్టే. ఈ కాలంలో ఇవి  ప్రేక్షకులెవరికీ పట్టవు. కేంద్రంలో ఆశలు రేపే కొత్త ప్రభుత్వం, స్థానికంగా రాష్ట్ర విభజన నేపధ్యాలు విసురుతున్న అనేక సవాళ్ళకి పరిష్కారాల కోసం ప్రేక్షకులు అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఎమోషన్ ఇక్కడుంది ఈ వర్తమానంలో. ఎప్పటివో గతించిపోయిన బ్రిటిషకాలపు కథల్లో కాదు. కాలక్షేపమే  కావాలనుకుంటే ఇతర హీరోల సినిమాలు చాలా వస్తాయి, అవి చూసుకుంటారు. రాజకీయంగా ప్రభావితం చేయగల, ప్రాబల్యమున్న సూపర్, మెగా స్టార్ల నుంచి స్వైరకల్పనల మసాలా సినిమాలకోసం ఎదురు చూడ్డం లేదు. తమిళంలో గత అక్టోబర్లో నేటి ప్రేక్షకుల ఎమోషన్స్ ని సరీగ్గా టార్గెట్ చేసిన  ‘కత్తి’ సమకాలీన సామాజిక సమస్యల్ని అతి  బలంగా చిత్రించి ప్రేక్షకుల భావోద్వేగాల్ని చక్కగా సంతృప్తి పర్చగల్గింది. ఈ అతి పెద్ద సక్సెస్ ని తీసింది విజయ్ లాంటి కమర్షియల్ స్టార్ తో, మురుగ దాస్ లాంటి కమర్షియల్ దర్శకుడే!

     ‘లింగా’ మరోసారి  ఫ్యూడలిజంపట్ల ప్రజల భయభక్తుల్ని చాటే తిరోగమనపు కథ చెప్పింది. ఫ్యూడలిజం మీద ఎనలేని సానుభూతిని, ఫ్యూడలిజమే కొనసాగివుంటే ఎంత బావుండునన్న మమకారాన్నీ చాటింది. ఇది  అశేష రజనీ ఫ్యాన్స్ గా నేటితరపు యువప్రేక్షకులకి అర్ధమయ్యే ‘ఇజం’ కాదు. ఐనా సినిమాలో దీనిదే (దాదాపు రెండు గంటలు) సింహభాగం!

    ఈ ‘ఇజం’ సీరియెస్ నెస్ సినిమాలో సమకాలీనతనీ, వినోదాన్నీ మింగేసింది. ‘ఇజం’ తో హీరోయిజమైనా చూపించివుంటే యువప్రేక్షకులకి హుషారెక్కేది-  రజనీ సినిమా అంటే హుషారే గానీ, బేజారెత్తిన అతడిపాత్ర పడే బాధలూ ఏడ్పులూ కాదుగా? ప్రజలకి తమ బాధలు తీర్చే నాయకుడు కావాలి తప్ప, తన బాధలు చెప్పుకునే నాయకుడు కాదు. అది నాయకుడి లక్షణం కూడా కాదు. త్యాగమనే ప్యాసివ్ హీరోయిజం కంటే,  పోరాటమనే యాక్టివ్ నెస్సే రజనీ స్థాయి సినిమాకి పండుతుంది.

రాజావారు – దొంగోడు!  
      లింగా ( రజనీకాంత్) ఒక దొంగ. ఫ్రెండ్స్ నేసుకుని బంగారు నగలు కొట్టేస్తూంటాడు. ఒక సేటుకి అమ్ముతూంటాడు. అతడికి తనతాత రాజా లింగేశ్వర్ అంటే మంట. రాజభోగా లనుభవించిన అతను తన తండ్రికి ఏమీ ఇవ్వలేదనీ, తను దొంగలా మారడానికి అతనే కారణమనీ అంటూంటాడు. ఒక టీవీ జర్నలిస్టు లక్ష్మి పరిచయమవుతుంది. ఇతన్ని దొంగాగా పట్టివ్వడానికి  ప్రయత్నిస్తూంటుంది తన స్టింగ్ ఆపరేషన్స్ తో. ఒకసారి ఒక స్టార్ హోటల్లో ఒక విలువైన ఆభరణం ఎగ్జి బిషన్ జరుగుతూంటే దాని మీద కన్నేస్తాడు లింగా. అక్కడికి అనుసరించి వచ్చిన లక్ష్మీనీ తన ఆపరేషన్లో ఇన్వాల్వ్ చేసేస్తాడు తెలివిగా లింగా. తీరా ఆ ఆభరణం కాజేసి సీటు కిస్తే,  ఆ సేటు అరెస్ట్ అవుతాడు. ఇక లింగా తన ఫ్రెండ్స్ తో పారిపోవాల్సి వస్తుంది.  అప్పుడు లక్ష్మి అతన్ని సింగనూరు అనే వూరు తీసికెళ్తుంది.

    ఇక్కడికే ఎందుకంటే, ఈ వూళ్ళో లింగా తాత లింగేశ్వర్  కట్టిన దేవాలయం వుంది. 70 ఏళ్ల క్రితం నుంచీ ఇది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఆ ప్రారంభోత్సవం రాజా లింగేశ్వర్ మనవాడే చేయాలని ఊరి పెద్ద అయిన లక్ష్మీ  తాత ( కె. విశ్వనాథ్) పట్టుదల. ఆ మనవడే లింగా అని  తెలుసుకున్న లక్ష్మి అతడ్ని ఇక్కడికి తీసుకొచ్చిందన్న మాట. 

    ఆనాడు లింగేశ్వర్ ఆలయంలో శివలింగాన్ని ఒక ఖరీదయిన మరకతమణి తో చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న లింగా, ఆ లింగాన్ని కొట్టేసేందుకు ప్రయత్నిస్తూ గ్రామస్థులకి దొరికిపోతాడు. దీంతో లక్ష్మీ తాత, రాజా లింగేశ్వర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు.

    1939 లో బ్రిటిష్ ప్రభుత్వంలో రాజవంశీయుడైన లింగేశ్వర్ కలెక్టర్ గా వుంటాడు. ఇతను ఐసీఎస్ కంటే ముందు కేంబ్రిడ్జి యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఒకసారి సింగనూరు అనే ఊరికొచ్చి, అక్కడ నీటి ఎద్దడి కారణంగా కరువుకాటకాల్నీ, ఆత్మహత్యల్నీ చూసి చలించిపోతాడు. అక్కడ డ్యాం కట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాడు. ఆ గ్రామంలోనే భారతీ ( సోనాక్షీ సిన్హా) అనే అమ్మాయి పరిచయమై ప్రేమలో పడుతుంది.

    కానీ ఆ డ్యాం ప్రతిపాదనకి బ్రిటీష్ అధికారి (విలియం ఒరెండ్రాఫ్) అడ్డుతగిలి రైల్వే ట్రాక్ వేస్తానంటాడు. మీ రైల్వే ట్రాకులు మా సంపద దోచుకెళ్ళాడానికే నని ఎదురు తిరిగి, ఆ డ్యాం ని సొంత ఖర్చుతో నిర్మిస్తానని రాజీనామా చేసి వెళ్లి పోతాడు లింగేశ్వర్.

    ఇప్పుడీ డ్యాం ని లింగేశ్వర్ కట్టాడా, కడితే బ్రిటిష్ అధికారివల్ల ఏ ఏ ఇబ్బందు లొచ్చాయి, చివరి కేమయ్యాడు - అన్నవి ఈ ఫ్లాష్ బ్యాక్ లో మిగిలిన అంశాలు.

    ఇలా తాత ఔన్నత్యం గురించి తెలుసుకున్న లింగా మారి పోతాడు. అయితే ఇప్పుడు ఈ డ్యాంని కూల్చే కుట్ర ఒకటి ఎంపీ నాగభూషణం ( జగపతిబాబు) చేస్తున్నాడు. దీన్ని పేల్చేసి, కాలం చెల్లిపోవడం వల్లే అది కూలిపోయిందని చెప్పి కొత్త డ్యాంకట్టే కాంట్రాక్టుతో వేలకోట్లు వెన కేసుకోవాలని అతడి పథకం. ఈ పథకాన్ని లింగా ఎలా తిప్పి కొట్టాడనేది సినిమాకి ముగింపు.

రజనీ షో!

    సాంతం రజనీ షో ఈ సినిమా –మైనస్ రజనీ మార్కు హీరోయిజం, కేరింతలు కొట్టించే డైలాగులు కూడా శూన్యం. దాదాపు రెండు గంటలు సాగే ఫ్లాష్ బ్యాక్ పాత్రే దొంగోడి పాత్రని మింగేసింది. ఫ్లాష్ బ్యాక్ పాత్ర ద్వారా రజనీ కాంత్ లో గంభీర్యాన్నే, ఉదాత్తతనే చూస్తాం. దీని ప్రభావమే దొంగోడి పాత్ర మీద కూడా పడి అది కూడా డౌన్ ప్లే అయింది. మనకి తెలిసి మొట్ట మొదటిసారిగా రజనీ కాంత్ రజనీ కాంత్ లా కాక, ఏ అభిమానీ జీర్ణించుకో లేని ‘పాత్ర’ లా కనపడ్డాడు. రజనీ కాంత్ లో ‘పాత్ర’ని ఎవరూ చూడాలనుకోరు. కేవలం రజనీ కాంత్ నే చూస్తారు. రెండు పాత్రల్నీ ఎంత నీటుగా పోషించినా, ఆ నీట్ నెస్సే రజనీ అనే ఎట్రాక్షన్ కి ఎసరు పెట్టింది. దర్శకుడూ రచయితా కలిసి రజనీ పోషించిన ఉదాత్త పాత్రని ఎంతో పూజించ వచ్చు గాక, అభిమానులు మాత్రం రజనీనే పూజిస్తారు. ఆ వ్యక్తి పూజకి అవసరమైన గుణగణాలని పాత్రలకి పెయింట్ చేయడంలో విఫలమయ్యారు దర్శకుడూ రచయితా.

      హీరోయిన్లిద్దరూ సోనాక్షీ సిన్హా, అనూష్కా శెట్టీ లిద్దరూ ఒళ్ళు చేసి కాస్త ఇబ్బందికరంగానే కన్పిస్తారు. విలన్ గా జగపతిబాబుది సోసో పాత్ర. ఒక పెద్ద డ్యాం ని కూల్చి కొత్త డ్యాం కాంట్రాక్టు పట్టాలనే కుట్ర ఎంత సినిమా అయినా ఒప్పించని విషయం. అతడి కుట్ర కూడా కథనంలో ఎక్కడా కనీస గాభరా పుట్టించే విధంగా కూడా లేదు. కారణం ఫ్లాష్ బ్యాకే అసలు కథని మింగేయడం.
    ఏఆర్ రెహమాన్ సంగీతం, పాటలు కూడా హుషారెక్కించలేక పోయాయి. రత్నవేలు ఛాయగ్రహణం గురించి చెప్పాలంటే, అదొక అనిర్వచననీయమైన అనుభూతి. ఈ లెవెల్లో టాప్ సినిమాటోగ్రఫీ ఇంతవరకూ భారతీయ సినిమాలకి లేదు. రెడ్ డ్రాగన్ 6కె, పాంథమ్ ఫ్లెక్స్ 4కె వంటి అత్యాధునిక హైరిజల్యూషన్ కెమెరాలు వాడిన ఫలితమిది!

స్క్రీన్ ప్లే సంగతులు 
      ఒక సినిమాకి కి ఏది అసలు కథ అవుతుంది? కథ చెబుతూ సందర్భవశాత్తూ ప్రస్తావించుకునే గడచిన కాలపు ఏదైనా ఒక విశేషమా( డ్రీమ్ టైం), లేక వర్తమానంలో నడుస్తున్న కథా (ప్రెజెంట్ టైం)? గతానిదెప్పుడూ కథే   కాదు. అది ప్రస్తుతం ఎత్తుకుని చెప్తున్న, లేదా వర్తమానంలో నడుస్తున్న కథకి అవసరమైన సమచారాన్నిఅందించే వనరు మాత్రమే. ఇలా ఫ్లాష్ బ్యాక్ ( డ్రీమ్ టైం) అనేది ఒక డేటా బ్యాంకే తప్ప, మెయిన్ స్టోరీ కాదు. మెయిన్ స్టోరీ కూడా అవుతుంది- ఎప్పుడంటే- మొత్తం ఫ్లాష్ బ్యాకూ, మెయిన్ స్టోరీ ( డ్రీమ్ టైం- ప్రెజెంట్ టైం) ఒకే పాత్ర వైనప్పుడు. ఉదాహరణకి చిరంజీవి నటించిన ‘ఖైదీ’. ఇందులో మెయిన్ స్టోరీ కంటే ఫ్లాష్ బ్యాక్ నిడివే ఎక్కువ. ( సిల్వెస్టర్ స్టాలోన్ హిట్ ‘ఫస్ట్ బ్లడ్’ కాపీ) అయినా ఫర్లేదు- అది ఒకే హీరో సమస్య కాబట్టి. ఆ హీరో కథనే సమగ్రంగా ఫాలో అవుతున్నాం కాబట్టి. ఇలాకాక, వర్తమానంలో నడుస్తున్న హీరో కథని పక్కన పెట్టి, ఇంకో  పాత్ర ఫ్లాష్ బ్యాక్ ని ఎత్తుకుని సుదీర్ఘంగా చెప్పుకుంటూ కూర్చోవడమంటే, వర్తమాన హీరో కథని దగా చేయడమే. ప్రేక్షకుల వీక్షణా నుభవానికి తీవ్ర భంగం కల్గించడమే.
   ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా ప్రెజెంట్ టైం -డ్రీమ్ టైంలు ఆ హీరోవే  అయివుండడం గమనించగలం. ఇలాటి డ్రీమ్ టైం లతో ప్రమాదం వుండదు గానీ, ప్రస్తుత ‘లింగా’ లో లాంటి అవధుల్లేని రెండో పాత్ర  డ్రీమ్ టైం తోనే  సమస్య వస్తుంది. వుంటే గింటే అది సుదీర్ఘంగా వుండకూడదు. ప్రెజెంట్ టైం నీ , హీరో పాత్రనీ అధిగమించకూడదు. అధిగమిస్తే సినిమా చప్పగా తయారవుతుంది.
    ఒక అపూర్వ సూపర్ స్టార్ గా రజనీ కాంత్ పాత్రపరంగా, నటనా పరంగా అన్ని నియమ నిబంధనలకీ అతీతుడే కావొచ్చు, కానీ స్క్రీన్ ప్లే సూత్రాలకి కాదు. కామెడీకి సంబంధించి అరిస్టాటిల్ ఏం చెప్పాడో- ముందు కామెడీ పుట్టడానికి ఆధారభూతమైన సంఘటన లాజికల్ గా వుంటే, దాని మీద నిలబడి ఎలాటి అసంబద్ధ కామెడీ నైనా నడపొచ్చని- అలా ముందు స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుంటే, ఆ స్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకుని కథనంలో ఎన్ని అనూహ్య విన్యాసాలైనా చేసుకోవచ్చు.  రజనీతో ఇదే చేస్తూ వచ్చారు ఇంతకాలం. ఇప్పుడొచ్చి  స్ట్రక్చర్ ని కూలదోసి, స్ట్రక్చర్ కి కూడా రజనీ అతీతుడైనట్టు డ్రీమ్ టైం- ప్రెజెంట్ టైం లతో చెలగాట మాడి బ్యాడ్ టైం ని సృష్టించు కున్నారు. మనవడి కథని ఎత్తుకుని, తాత కథ చెప్పుకొచ్చారు రెండు గంటలపాటూ. 

      ఐతే ఇలా రివర్స్ లో, ఫ్లాష్ బ్యాక్ నే ప్రధాన కథగా మార్చిన స్ట్రక్చరల్ విన్యాసంతో కూడా సినిమాని నిలబెట్ట వచ్చు. కానీ  ‘లింగా’ మేకర్లు తాము ఫ్లాష్ బ్యాక్ తో ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోయారు. ప్రమాదంలో పడబోతున్నామని తెలుసుకుని వుంటే, చేయకూడని ఆ స్ట్రక్చరల్ విన్యాసానికి అనితర సాధ్య రజనీ విన్యాసాలతో చెక్ పెట్టేసే వాళ్ళు!
     ఫ్లాష్ బ్యాక్ లో రజనీ పాత్ర ని అలా పాసివ్ హీరోయిజంతో కాక, బ్రిటిష్ వాడితో అమీతుమీ తేల్చుకునే యాక్టివ్ పాత్రగా – దుమ్మురేపి వదిలేవాళ్ళు. బ్రిటిషర్ ప్రతినాయక పాత్రకి బిల్డప్పే లేక, రజనీ తలపడడానికి ముఠాయే లేక, ప్రతీచోటా రజనీ రాజీ పడిపోయే మనస్తత్వంతోనే  నడిపారు. బ్రిటష్ దోపిడీకి వ్యతిరేకంగా సొంతంగా ప్రజలకి డ్యాం కట్టించి ఇవ్వడానికి కలెక్టర్ పదవికి సైతం రాజీనామా చేసిన ప్పుడే రజనీ బ్రిటిషర్లకి అతీతుడైపోవాలి. అంతేగానీ, ఎలాగో డ్యాం కట్టిన తర్వాత మళ్ళీ ఆ బ్రిటిషర్ బ్లాక్ మెయిల్ కే  తలొగ్గి, సర్వం అతడిపరం జేసి, డ్యాం అతనే కట్టిచ్చినట్టు కూడా రాసిచ్చి, అతడి పేరే పెట్టుకునేట్టు చేసి బికారిలా వెళ్లి పోవడమనే ఫ్లాష్ బ్యాక్ కాన్సెప్టే
పాత్రోచిత్యాన్నీ, తద్వారా కమర్షియల్ గా కథనంలో పుట్టాల్సిన సంఘర్షణనీ  దెబ్బతీసింది. ప్యాసివ్ హీరోయిజం తో పనికిరాని త్యాగ ధనుడన్పించు కోవడంకంటే, ఫిజికల్ యాక్షన్ తో వీరమరణం పొందివుంటే, ఆ ఫ్లాష్ బ్యాక్ నడకే వేరుగా వుండేది!
   పూర్తిగా ఫ్యూడలిజానికి పట్టంగట్టి, ప్రజలతో అడుగడుగునా రజనీకి పూజనీయ పాత్రగా దండాలు పట్టించడమే సరిపోయింది. దాంతో అది ఉదాత్త పాత్రగానే సెటిలయ్యింది. ఈ కాలం చెల్లిన కథా పాత్రా రజనీ ఇమేజినే డౌన్ ప్లే చేశాయి!
   ఈ రైతుల కథే ‘కత్తి’ లో కూడా చెప్పారు. అందులోనూ తమిళ స్టార్ విజయ్ ద్విపా త్రాభినయమే. అయితే అది సమకాలీనంగా. ఒకడు క్రిమినల్, రెండోవాడు రైతుజన బాంధవుడు. ఇతను కుట్రకి బలైతే, ఇతని స్థానంలో క్రిమినల్ విజయ్ వస్తాడు. రైతుల భూములు లాక్కునే కార్పోరేట్ కుట్ర అది. మన చుట్టూ ఇప్పుడు జరుగుతున్నవాటిని ఎత్తి చూపే చిత్రణ ఇది.. బ్యాంకులకి ఐదువేల కోట్లు ఎగ్గొట్టిన బీరు ఫ్యాక్టరీ వాడు సమాజంలో ఫ్రీగా తిరుగుతోంటే, ఐదు వేలు రుణం తీసుకున్న రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి?-లాంటి కదిలించే డైలాగులున్న వర్తమాన కథ చెప్పారు. 2జి స్కాం మీదా, మీడియా అనారోగ్యకర ధోరణి మీదా, ఇంకా చాలా వాటి మీదా  పదునైన డైలాగులు విసురుతాడు హీరో విజయ్. రైతుల సామూహిక ఆత్మహత్యల సీను  ఒక్కటి చాలు ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ అయిపోవడానికి! రజనీ సర్, వేరార్యూ సర్?

సికిందర్
   








    

12, డిసెంబర్ 2014, శుక్రవారం

ఎడిటింగ్

 కన్నూ చెవీ సంబంధం కాలరాస్తే ఎలా?
 క సందేహం : ఫిలిం ఎడిటింగ్ లో ఫిజికల్ కంటిన్యూటీ ఎడిటర్ కి చాలా ముఖ్యం. షాట్స్ ని సీక్వెన్సులుగా, సీక్వెన్సుల్ని మొత్తం సినిమాగా ఏర్చి కూర్చే ప్రయత్నంలో ఎక్కడో ఒక షాటేదో మిస్సయిందన్పించ వచ్చు . హీరో పలికిన ఒక డైలాగుకి విలన్ రియాక్షన్ పడలేదన్పించ వచ్చు. ఆ  రియాక్షన్ షాట్ కోసం దర్శకుడ్ని సంప్రదిస్తాడు ఎడిటర్. ఇలా కంటిన్యూటీ షాట్స్ ని తర్వాత తీయడాన్నే ప్యాచ్ వర్క్ అంటారు. ఆ వొక్క షాట్ తీయడానికి పది  వేలు ఖర్చయినా, దానివల్ల పది లక్షల కలెక్షన్ పెరగ వచ్చు. బాగానే వుంది,  మరి 35 కోట్లు ఖర్చుపెట్టి ‘ఆరెంజ్’ తీసినప్పుడు, అందులో చివర్లో హీరో రాం చరణ్, హీరోయిన్ జెనీలియాని కలుసుకోబోతూండ గానే, హఠాత్తుగా శుభం పడి, రీలేదో  మిస్సయినట్టు థియేటర్లో  గందరగోళం ఏర్పడింది. అలాంటప్పుడు అది కలెక్షన్లని దెబ్బతీసే కంటిన్యూటీ సమస్యలా తోచి, వెంటనే ప్యాచ్ వర్క్ కి ఆదేశించాలన్పించ లేదా సుప్రసిద్ధ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ కి? ఆ అర్ధాంతరపు ముగింపునలా ఉపేక్షించి , సినిమాకి జరగబోయే భారీ నష్టాన్ని చూస్తూ కూడా ఎందుకు వదిలేసినట్టు?

          దీనికాయన ఇచ్చిన జవాబు : దర్శకుడి లాజిక్ ననుసరించే ముగింపుని అనుమతించామని! రొటీన్ గా ముగించకుండా కాస్త సాంప్రదాయేతరంగా  ఉండాలన్న దర్శకుడి ఆలోచన మేరకే అది జరిగిందని వివరించారు.

          దర్శకుడి విజ్ఞతే శిరోధార్యమైనప్పుడు ఎడిటర్ చేసేదేమీ వుండదు. అయితే ఎడిటింగ్ లో తను ప్రేక్షకుల్లో ఒకడిగా ఫీలయ్యి నిస్సంకోచంగా దర్శకులకి తన అభిప్రాయం వ్యక్తం చేస్తానన్నారు వెంకటేష్. నిజానికి ఈ విమర్శనా  దృష్టే తనని ఎడిటర్ గా చేసిందన్నారు. ‘కూలీ నెం-1’ తీసిన కె. రాఘవేంద్ర రావు దానిమీద తన విశ్లేషణ కోరినప్పుడు, నిర్మొహమాటంగా చెప్పడమే ఆయనకి  నచ్చి ఆ తర్వాత ‘అల్లరి ప్రేమికుడు’ కి ఎడిటింగ్ బాధ్యతల్ని అప్పజెప్పారన్నారు. 1995 లో అలా ఎడిటింగ్ పగ్గాలందుకున్న వెంకటేష్, అంతవరకూ సుప్రసిద్ధుడైన తన తండ్రి ఎడిటర్ మార్తాండ్ దగ్గర సహాయకుడుగా వున్నారు. ఇప్పటికి ఈ పదిహేనేళ్ళ ప్రస్థానంలో 250 తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా అగ్రస్థానంలో వుంటున్నారు. 
    మాన్యువల్ ఎడిటింగ్ కాలానికి చెందిన ఈయన మొదట రాఘవేంద్రరావు తిట్టి కొట్టి చెప్పిన పాఠాలెన్నో నేర్చుకున్నారు. తర్వాత రామానాయుడు స్టూడియోలో ఎవిడ్ వ్యవస్థ నెలకొల్పినప్పుడు, నిర్మాత డి. సురేష్ కోప్పడుతూంటే, మాన్యువల్ ని వదిలి వెళ్లి ఎవిడ్ ఎడిటింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు సరికొత్త వెర్షన్ ఎవిడ్ -5 మీద పనిచేస్తున్నారు.

           అయితే చాలా మంది దర్శకులు ఎడిటింగ్ లో వస్తున్న కొత్త టెక్నాలజీని దుర్వినియోగ పరుస్తున్నారని బాధ పడ్డారు వెంకటేష్. ఫ్లాష్ లు, డిజాల్వ్ లు, వైప్ లు, స్ప్లిట్ ఫ్రేములు, ఇష్టారాజ్యంగా వేయిస్తున్నారన్నారు. ఫారిన్ లో షూటింగ్ ఎందుకు చేస్తారు? అక్కడి సుందర దృశ్యాలతో కనువిందు చేయాలనేగా? మరి ఆ వివిధ లోకేషన్స్ లో తీసిన సుందర దృశ్యాల్ని నాలుగేసి బొమ్మలుగా విభజించి, ఒకేసారి తెరమీద స్ప్లిట్ స్క్రీన్ లో వేస్తే  ప్రేక్షకులు వాటినెలా ఆస్వాదిస్తారని ప్రశ్నించారు.


           సరే, ఇప్పుడు పెరిగిపోయిన జీవన వేగం కారణంగా ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ (ఒక దృశ్యం పై ధ్యాస నిలిపే కాలం) కొన్ని సెకన్లకి పడిపోయిందని హాలీవుడ్ సినిమాల్లో కూడా ఎంటీవీ తరహా మైక్రో షాట్స్ తో సినిమాలు తీస్తున్నారు, ఇది సబబేనా అంటే- అది కంటికీ చెవికీ మధ్యన వుండే  4 ఫ్రేముల తేడా థియరీని కాలరాసి, డబ్బులిచ్చుకుని సినిమా కొచ్చిన ప్రేక్షకులకి తలనొప్పి తెప్పించడమేనని ఆయన దుయ్యబట్టారు! ఈ జాడ్యం తెలుగు సినిమాల్లోనూ ప్రబలిందన్నారు. షాట్స్ ని గజిబిజిగా వేయాలని నేటి దర్శకులు కోరుతున్నారన్నారు.


          తన వరకూ సంప్రదాయ స్కూల్ నే అనుసరిస్తున్నానని అన్నారు వెంకటేష్. డాక్టర్ డి. రామానాయుడు తన ప్రతీ సినిమానీ ప్రేక్షకుల మధ్య కూర్చుని- మొదటి రోజు, మూడో రోజు, రెండు వారల తర్వాతా..ఇలా మూడేసి సార్లు చూసి, ఎక్కడ ప్రేక్షకులు ఏడుస్తున్నారు, ఎక్కడ నవ్వుతున్నారు, ఎక్కడ చప్పట్లు కొడుతున్నారూ స్టడీ చేసి రమ్మనేవారు వెంకటేష్ ని. ఈ అనుభవం బగా తోడ్పడింది. అలాగే తన తండ్రి మార్తాండ్ కూడా ఒక విషాద సన్నివేశంలో కళ్ళు చెమర్చేలా  చేయని ఎడిటర్ మంచి ఎడిటరే  కాదని చెప్పేవారన్నారు వెంకటేష్. తను ఏ సినిమా కథ విననీ, తను ఫీలుయిన పద్ధతిలో కథని షాట్స్ గా కూర్చి, దర్శకుడికి చూపించి, అప్పుడు మాత్రమే  మార్పు చేర్పులుంటే చేస్తానని తన పని విధానాన్ని వివరించుకొచ్చారు.


       మరి తన ఎడిటింగ్ వెనకాల ఇంత వృత్తితత్త్వం ఉంటున్నప్పుడు, థియేటర్లలో ప్రొజెక్షన్ బాయ్స్ వాళ్ళ సొంత ఎడిటింగులూ అవీ చేసుకుని, బోరుకోడుతున్న సినిమాల నిడివినీ, కొన్ని భరించలేని పాటల్నీ వాళ్ళే ఎందుకు తీసిపారేస్తున్నట్టు? ఈ ప్రశ్నేఅడిగితే, అక్కడ ఎడిటర్ విఫలమైనట్టేనని ఒప్పుకున్నారు వెంకటేష్. 

       ఫిలిం ఎడిటింగ్ లో ఎమోషనల్ కంటిన్యూటీ చూసుకోవడం కూడా వుంటుంది. దర్శకుడు ఏ ఉద్దేశంతో దృశ్యాన్ని ప్రతిపాదిస్తున్నాడో గ్రహిస్తే, ఆ ప్రకారం షాట్స్ ని ఎంపిక చేసుకుని, ఆ వరసలో  పేర్చుకుంటూ పోయి దృశ్యానికి న్యాయం చేయవచ్చు. శేఖర్ కమ్ముల తీసిన ‘ఆనంద్’ లో కమలినీ ముఖర్జీ భోగి మంటలో ఫోటోలు వేసేస్తూ వుంటుంది. దీన్ని వెంకటేష్ ఎడిట్ చేశాక, దర్శకుడు శేఖర్ కమ్ముల చూసి, ఆమె తన మనసులోంచి చెత్తని తీసి మంటలో పారేస్తున్న అర్ధంలో ఆ దృశ్యం తీశానని వివరించారు. అప్పుడు వెంటనే వెంకటేష్ మరోసారి చూసుకుంటే, ఆమె గుండెల దగ్గర ఫోటోలు పట్టుకుని మంటలో వేస్తున్న షాట్ ఉండనే వుంది! ఇంకాలోచించ కుండా ఆ షాట్ ని కేంద్రబిందువుగా చేసుకుని, మొత్తం దృశ్యాన్ని రీ- ఎడిట్ చేస్తే, ఎమోషనల్ కంటిన్యూటీ అప్పుడు బాగా వచ్చింది!


        ఇప్పుడు ‘నాగవల్లి’, ‘రగడ’, ‘శక్తి’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మనసారా’ మొదలైన సినిమాల ఎడిటింగ్ పనులతో బిజీగా వున్నారు మార్తాండ్ వెంకటేష్.

సికిందర్
(2010 డిసెంబర్ ‘ఆంధ్రజ్యోతి’ కోసం)