రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, అక్టోబర్ 2015, శుక్రవారం

ఇంకేం ప్రేమో !





రచన-  దర్శకత్వం : రమేష్ సామల 


తారాగణం : సుమంత్ అశ్విన్, శీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి, రోహన్ బషీర్ పృథ్వీ, నాగినీడు, సప్తగిరి సంగీతం : జతిన్ రోషన్ , కెమెరా : భాస్కర్ సామల 

బ్యానర్ : ఎ కె ఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత : అశ్విన్ కుమార్ సహదేవ్ 
విడుదల : 22 అక్టోబర్, 2015

                        

     అగ్ర నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ యూత్ హీరోగా పాపులర్ అవ్వాలని  చేస్తున్న స్ట్రగుల్ లో భాగంగా మరో యూత్ సినిమాతో ఈ దసరాకి ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఈసారి కూడా మరో ప్రేమ కథని , అదీ ట్రయాంగులర్ లవ్ స్టోరీని ఆశ్రయించాడు. రమేష్ సామల అనే కొత్త దర్శకుడితో తన అదృష్టాన్ని  పరీక్షించుకుంటూ, ‘కొలంబస్’ అనే టైటిల్ తో ఇద్దరు హీరోయిన్లని వెంటేసుకుని నటించిన ఈ రోమాంటిక్ కామెడీలో కొత్తదనం ఏముందో ఈ కింద చూద్దాం..

కథ : 
        అశ్విన్ (సుమంత్ అశ్విన్) ఒక హత్యా యత్నం కేసులో రెండేళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇంటి కొస్తాడు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇక ఇందూ ( మిస్తీ చక్రవర్తి) ని  మర్చి పొమ్మంటారు. కానీ ఇందూ ని మర్చిపోలేక ఆమె కోసం గాలిస్తూంటాడు. తను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఆమె ని ప్రేమించాడు. తను బీటెక్ ఫెయిలవడంతో తనని వదిలేసి పైచదువులకి ఢిల్లీ వెళ్ళిపోయింది. తను ఢిల్లీ వెళ్ళి చూస్తే  అక్కడ వంశీ (రోహన్ బషీర్) అనే క్లాస్ మేట్  తో క్లోజ్ గా ఉంటోంది. దీంతో వంశీతో ఘర్షణ పడ్డ తనని వంశీ హత్యాయత్నం కేసులో ఇరికించి జైలుకి పంపించాడు. ఇప్పుడు విడుదలై,  ప్రేమ చావక అదే ఇందూని వెతకసాగాడు. ఆమె అమెరికా వెళ్లి పోయినట్టు తెలుస్తుంది.

        ఈ క్రమంలో నీరజ (శీరత్ కపూర్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇతన్ని చూస్తే ఆమెకి వొళ్ళు మంటగా వుంటుంది. ప్రేమ కోసం వెంట పడుతున్నాడని అనుకుంటుంది. తీరా చూస్తే ఈమె పనిచేస్తున్న కంపెనీ లోనే అమెరికానుంచి వచ్చి చేరుతుంది ఇందూ. దీంతో నీరజ సహాయం తీసుకుని ఇందూకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు అశ్విన్. ఇందూ దగ్గరవదు గానీ, నీరజ మాత్రం ప్రేమలో పడుతుంది ఆశ్విన్ తో. ఇప్పుడు అశ్విన్ ఏం చేశాడు- తను ప్రేమిస్తున్న ఇందూనే కోరుకున్నాడా,  లేక తనని ప్రేమిస్తున్న నీరజనే స్వీకరించాడా అన్నది మిగతా కథ.

కథెలా వుంది  
     రొటీన్ కథ. యూత్ చాలాసార్లు చూసేసి మానేసిన కథ. పూర్తి నిడివి  రోమాంటిక్ కామెడీల, లైటర్ వీన్ ప్రేమకథల నుంచీ చాలాకాలం క్రితమే వేరే జానర్స్ వైపు మళ్ళి పోయారు యువ ప్రేక్షకులు. తేజ లాంటి పేరున్న దర్శకుడు తీసిన ‘హోరా హరీ’ కి సైతం ఓపెనింగ్స్ లేవు. మరో క్రేజ్ వున్న దర్శకుడు మారుతీ కూడా ఈ తరహా సినిమాలకి దూరయయ్యారు. అయితే రోమాంటిక్ థ్రిల్లర్స్,  కాకపోతే హార్రర్ కామెడీలకి ఎగబడుతున్నారు యూత్. మార్కెట్ డిమాండ్ ఏమిటో తెలుసుకుని ఏ సినిమా అయినా తీయాలని ‘కొలంబస్’ రిజల్ట్ మరోసారి తేల్చి చెబుతోంది. 


ఎవరెలా చేశారు  
     సాఫ్ట్ లుక్స్ తో కోమలంగా వుండే  సుమంత్ అశ్విన్ లవర్ బాయ్ పాత్రలకే సరిపోతాడు. కానీ ఇలా ఎంత కాలం? వరుణ్ సందేశ్ కూడా లవర్ బాయ్ పాత్రలకే తప్ప మరి దేనికీ సరిపోక అతలకుతలమై పోయాడు. సుమంత్ అశ్విన్ అర్జెంటుగా తన పరిస్థితిని సమీక్షించుకోవాలి. ఈ సినిమా వరకూ చూస్తే, ఈ లవర్ బాయ్ పాత్ర ఎంటర్ టైన్మెంట్ యావతో మూలాలు మర్చి  ప్రవర్తించే, కొన్ని సార్లు కామెడీ కోసం ఓవర్ యాక్షన్ చేసే ఆషామాషీ  పాత్రగానే ఉండిపోయింది. ఇందూ కోసం ఒక ఎమోషనల్ డ్రైవ్ తో రగిలిపోయే పాత్రగా వుండివుంటే తేడాగా వుండేది. అప్పుడు కేవలం లవర్ బాయ్ పాత్రలేస్తున్న తనకి,  ఇదో డిఫరెంట్ క్యారక్టర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు పనికొచ్చేది. పాత్ర ఎమోషనల్ డ్రైవ్ ని డిమాండ్ చేస్తున్నప్పుడు కామెడీ కళాకారుడిగా మారిపోతే ఏం లాభం? 

        హీరోయిన్లిద్దరివీ అంతే ఫ్లాట్ క్యారక్టరైజేషన్స్. ముక్కోణ ప్రేమ కథల్లో మార్పేమీ లేకుండా ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిన ఈ పాత్రల్లో వీళ్ళిద్దరూ తేలిపోయారు. ఈ పాత్రలూ వాటి ముగింపులూ కూడా ఏనాడో కాలం తీరిపోయాయి. ఎంత టాప్ హీరోయిన్లయినా తమ టాలెంట్స్ తో చేసేదేమీ వుండదు ఇలాటి పాత్రల్లో. 

        సప్తగిరి సీరియల్ డైరెక్టర్ గా చేసిన కామెడీ దర్శకుడు  రాసుకున్న పంచ్ డైలాగులతో బాగానే పేలినా- ఈ పాత్ర ప్రధాన కథలో ఇన్వాల్వ్ అయి క్లయిమాక్స్ లో ఏదో గిమ్మిక్ చేసి వుంటే సార్ధకమై వుండేది. కమెడియన్లని కరివేపాకులా వాడుకుని విసిరేయడం ఇంకెంత కాలం సాగుతుందో? 

        ఈ సినిమాకి ఉద్దేశపూర్వకంగా పింక్ టింట్ లో డీఐ చేసినట్టుంది. ఈ ప్రేమ కథంత లైటర్ వీన్ లో నే సాగింది కెమెరా వర్క్ కూడా. పాటలు ఓ మాదిరిగా వున్నాయి.

చివరికేమిటి 
      ఈ రొటీన్ ప్రేమ కథని ముగించ డానికి చివర్లో ఎన్నెన్ని మలుపులు, ఎన్నెన్ని సాగ తీతలు, ఎన్నెన్ని పాటలూ పెట్టి అపహాస్యం పాలయ్యారో చెప్పుకోవాలి. శీరత్ కపూర్ తో హీరో సెటిల్ అవుతాడని ప్రేక్షకులకి ఎప్పుడో హింట్ ఇచ్చేసినప్పుడు, తెలివి తక్కువగా ఆ డొంక తిరుగుడంతా అవసరమా?  అసలే అంతంత మాత్రం ప్రేమ కథకి ఈ డొంక తిరుగుడు ముగింపు మరింత హాని చేసింది. దర్శకుడిలో డైలాగులు రాసుకోగల మంచి టాలెంట్ వుంది. కథ చేసుకోగల- అదీ ట్రెండ్ లో వున్న కథ చేసుకోగల నేర్పు కూడా జతయితే మున్ముందు నిలదొక్కుకునే అవకాశం వుంటుంది. ఒక కొత్త దర్శకుడు అందరి కంటే కొత్తగా తాను ఏమిస్తున్నాడనేది క్రైటేరియా అయినప్పుడే మార్కెట్ లో మెరుస్తాడు. రొటీన్ కథతోనే రాజీ పడొచ్చు. ఆ రాజీ పడ్డ రొటీన్ కథలోనే కొత్తగా ఏమిస్తున్నాడనేది సెల్లింగ్ పాయింటు కావాలి. ఒకమ్మాయితో ప్రేమని సెట్ చేసుకోవడానికి ఇంకో అమ్మాయి సహాయం కోరినప్పుడు - పనిలో పనిగా నువ్వు మాత్రం నాతో  ప్రేమలో పడొద్దు -అని కండిషన్ పెట్టినప్పుడు ముక్కోణ ప్రేమకథకి కొత్త ముగింపు రావొచ్చు.

ఇంతకీ కొలంబస్ ఈ ప్రేమలో కనుగొన్న దేమిటి? 

-సికిందర్ 


22, అక్టోబర్ 2015, గురువారం



రచన- దర్శకత్వం : క్రిష్ 

తారాగణం : వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్, నికితాన్ ధీర్, అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి మారుతీ రావు. షావుకారు జానకి, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, అనూప్ పురీ, తదితరులు
సంగీతం : చిరంతాన్ భట్, పాటలు :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఛాయాగ్రహణం : జ్ఞాన శేఖర్, మాటలు : సాయినాథ్ బుర్రా, ఎడిటింగ్ : సూరజ్ జగ్ తాప్- రామ కృష్ణ అర్రం,
కళ  : సాహి, యాక్షన్ : డేవిడ్ కబువా, బ్యానర్ : ఫాస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు : జె సాయిబాబు, వై రాజీవ్ రెడ్డి
విడుదల :   22 అక్టోబర్ 2015


భిన్న కథా చిత్రాల దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ ( క్రిష్) తన క్రియేటివిటీనీ, గుణాత్మకంగా తెలుగు సినిమా స్థాయినీ, ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి ప్రతిష్టించారు. విషయం లేని  అదే పాత  మసాలా సినిమాల మధ్య కాస్త క్వాలిటీ సినిమా కోసం మొహం వాచిపోయి వున్న ప్రేక్షకులకి ‘కంచె’  తో ఆ కొరత తీర్చేశారు. ‘కంచె’ ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యే నేటివిటీ చట్రంలో ఇరుక్కుపోయే మరో కమర్షియల్ కాదు- దీని నేటివిటీ సార్వజనీనం. దేశంలోనే కాదు, విదేశాల్లో ఎక్కడ ప్రదర్శనకి నోచుకున్నా దీనికి ప్రశంసల జల్లులే కురుస్తాయి. ఏ కాలంలోనైనా స్థానిక- అంతర్జాతీయ నేపధ్య పరిస్థితులు రెండూ ఒకటేననీ చెబుతూ, ఒక ప్రేమ కథ- ఇంకో యుద్ధకథ అనే యూనివర్సల్ ఫార్మాట్ మీదికి తన అసామాన్య క్రియేటివిటీని రంగరించి ఒక కమర్షియల్ కానుకగా ఇచ్చారు క్రిష్. ఈ దసరా పండగ రోజున  ఒక పవర్ఫుల్ పీరియడ్ సినిమా చూసి ఆనందించే భాగ్యం తెలుగు ప్రేక్షకులకి కల్గించారు. 


21, అక్టోబర్ 2015, బుధవారం

మేకప్ చీఫ్   వి. మోహన్ రావు 





గాడ్ క్రియేటెడ్ వన్ ఫేస్ బట్ విత్ మేకప్ వియ్ కెన్ షో వేరియస్ ఫేసెస్ ఆన్ ది సేమ్  ఫేస్’ అని ఉంటుంది ఎపి సినీ మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ హేర్ స్టయిలిస్ట్స్ యూనియన్ వెబ్ సైట్లో. యూసుఫ్ గూడలోని మూడంతస్తుల సొంత యూనియన్ భవనం టెర్రస్ మీద ఓ సాయంకాలం పూట యూనియన్ ప్రెసిడెంట్, సీనియర్ మేకప్ చీఫ్ వి. మోహన్ రావు ఈ కొటేషన్ కి కొనసాగింపుగా నందికేశ్వరుడి శ్లోకం చెప్పుకొచ్చారు..

ఆంగికం భువనం యశ్య
వాచికం సర్వ వాజ్మయం
ఆహార్యం చంద్రతారాది తం
వందే సాత్వికం శివమ్ - అని.

        తుర్విదాభినయ స్వరూపుడైన ఆ శివుడికి పై విధంగా నమస్కరిస్తూ నందికేశ్వరుడు, ఆహార్యాభినయాన్ని ప్రకృతిలో కన్పించే సమస్తంతో పోలుస్తూ తృతీయ స్థానం కల్పించాడు. ఇందుకు చాలా గర్వంగా ఫీలవుతారు మోహనరావు. ఆహార్యంలో మేకప్ చాలా ప్రధానమైన భాగమని తెలిసిందే.

        ‘సృష్టికి ప్రతి సృష్టి చేయగలం మేము. బ్రహ్మ ఇచ్చిన రూపాన్ని మార్చగల శక్తి మాకుంది.’ అన్నారు నవ్వుతూ. అసలు మేకప్ అంటే ఏమిటన్న ప్రశ్నకి- ముఖంలో లోపాల్ని సరిదిద్ది అందంగా చూపడమే నన్నారు.

      అనేక పరిణామ దశలు దాటిన మేకప్ కళ ప్రస్తుతం హైటెక్ స్థితికి చేరుకుందని చెబుతూ, రోజుకో కొత్త రకం బ్రాండ్ తో మేకప్ మెటీరియల్ వెల్లువలా వచ్చి పడుతోందని తలపట్టుకున్నారు. ఏది ఎంచుకోవాలో తెలిసి చావడం లేదన్నారు. మేకప్ ఆర్టిస్టు కిట్ బ్యాగులో కనీసం లక్షరూపాయాల మెటీరియల్ వుంటే తప్ప అతణ్ణి కన్నెత్తి చూడడం లేదన్నారు. మెటీరియల్ ధరలు కూడా తడిసి మోపెడవుతున్నాయనీ, ఓ లిప్ స్టిక్ కొనాలన్నా కూడా రెండు వేలు తీసి ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు. లేకపోతే రంగంలో  వుండే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సినిమాల కంటూ ప్రత్యేకంగా మేకప్ మెటీరియల్ ఉత్పత్తి చేయడం వల్లే ఇవి ఇంత ఖరీదైనవి అవుతున్నాయన్నారు

        తెలుపు - నలుపు రోజుల్లో మేకప్ వేయడానికి 45 నిమిషాలు పట్టేదనీ, ఇప్పుడా సమయం సగానికి తగ్గిందనీ, అయితే నటీమణుల విషయంలో మళ్ళీ అదే  45 నిమిషాలూ పడుతోందనీ వివరించారు.

     కొన్ని సినిమాల్లో మేకప్ లేకుండా నటించారని అంటూంటారు,  అదేమిటన్న ప్రశ్నకి-  ‘అప్పుడు కూడా మేకప్ ఆర్టిస్టుకి పని వుంటుంది. ఆర్ట్ సినిమాల్లో ఆ వాస్తవిక లుక్ తీసుకు రావడానికి కూడా మేకప్ ఆర్టిస్టు చెయ్యి పడాల్సిందే’ అని చెప్పుకొచ్చారు. చర్చ టెక్నిక్ మీదికి మళ్ళినప్పుడు- ‘ఆర్టిస్టు మొహానికి ఇంత రంగు పులిమేసి గాయమైనట్టు చూపించేస్తున్నారు, ఇది కరెక్టేనా?’ అంటే- నవ్వేసి- అలాటి దాన్ని ‘మేకప్’ అనలేమన్నారు. గాయాన్ని సృష్టించడానికి పట్టీ, వాక్స్ అనే పదార్దాలున్నాయనీ, వాటిని అతికించి, కోత పెడితే అప్పుడది గాయంలా కన్పిస్తుందనీ, ఈ పదార్ధాల ఖరీదు  కూడా ఐదు వేలకి తక్కువుండదనీ, వీటి జీవితకాలం కూడా నాలుగైదు నెలలేననీ వివరించారు.

        ‘మరగద నాయకన్’ (కమలహాసన్ ఆగిపోయిన సినిమా) కి కమల్ హాలీవుడ్ నుంచీ మేకప్ నిపుణుడు బేరీ కూపర్ ని పిలిపించుకుని, 30 లక్షలు ఖర్చు చేసి శిక్షణా తరగతులు నిర్వహించారని చెప్పుకొస్తూ, అందులో తాను కూడా పాల్గొన్న విషయం వెల్లడించారు. ఆ శిక్షణా తరగతుల్లో  మొహం మీద మచ్చలు, ముసలితనం, పెద్ద పెద్ద గెడ్డమూ మీసాల మేకప్ గురించి తెలుసుకున్నానని చెప్పారు. అయితే ఎప్పుడో భీష్ముడి లాంటి పాత్రలకి మనమే పెద్ద పెద్ద గడ్డాలూ మీసాలూ అవీ సృష్టించి వున్నాం కదా అంటే, ‘ఎందుకు లేదూ, చింతపండుతో స్పెషల్ గెటప్స్ సృష్టించిన ఘనత కూడా మనకుంది. అయితే ఆ తెలుపు నలుపు రోజుల్లో నెట్ తో గడ్డం అతికిస్తే తెలిసేది కాదు. ఇప్పుడు తెలిసిపోతోంది’ అన్నారు. ఇప్పుడు గడ్డం అతికించడానికి వాడే జిగురు ఖరీదే 3,800 రూపాయలుందన్నారు. హాలీవుడ్ లోనైతే ముందు నటుడి మౌల్డ్ ని తయారు చేసి, దాని  మీద మేకప్ ప్రక్రియ పూర్తి చేస్తారనీ, అలా మ్యాచింగ్ చేసిన గడ్డం మీసాల్ని మళ్ళీ ఆర్టిస్టు కి అలంకరిస్తారనీ చెప్పుకొచ్చారు.

       రేపల్లె దగ్గర్లోని బెల్లంవారి పాలెం కి చెందిన మోహనరావు, 1975 లోనే  మద్రాసు చేరుకున్నారు. ‘స్వర్గం-నరకం’ సినిమాకి  దర్శకత్వం వహిస్తున్న డా. దాసరి నారాయణరావు కి వ్యక్తిగత కార్యదర్శిగా చేరారు. తర్వాత దాసరే అడిగితే, మేకప్ మాన్ కావాలన్న కోరిక వెలిబుచ్చారు. చిన్నప్పట్నించే తనకి మేకప్ పట్ల ఆసక్తి వుంది. అప్పట్లోనే నాటకాల్లో టమాటా రసంలో రంగులు కలిపి మొహాలకి అద్దిన అనుభవాలున్నాయి. సరేనని,  దాసరి 150 రూపాయలు సభ్యత్వ రుసుం చెల్లించి చేర్పిస్తే, మేకప్ మాన్ గా మోహన్ కెరీర్ మొదలైపోయింది. ఇప్పటివరకూ 300 సినిమాలకి పని చేశారు. ఎస్వీ రంగారావు, గుమ్మడి, రావికొండలరావు ప్రభృత నటులకి మేకప్ చేసిన అనుభవాల గురించి గర్వంగా చెప్పుకొచ్చారు. పోతే, గత 26 ఏళ్లుగా పరుచూరి బ్రదర్స్ కి పర్సనల్ మేకప్ మాన్ గా కొనసాగుతున్నారు తను. 

        ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులకి  విలవ లేదన్నారు. నందికేశ్వరుడి మంత్రాన్ని జపించే మేకప్ కళాకారులు కూడా లేరన్నారు. పూర్వం నటీనటులు గడపకి దండం పెట్టుకుని, లోపల కొచ్చి,  మేకప్ మాన్ కాళ్ళకి నమస్కరించి గానీ మేకప్ కి కూర్చునేవాళ్ళు కాదని చెప్పారు. 

      నాటి ప్రఖ్యాత నటీమణి కృష్ణ కుమారి ఓసారి మోహనరావు కాళ్ళకి దండం పెట్టేశారు! ఆయన కంగారు పడి - ‘ అమ్మా మీకు బిడ్డ లాంటి వాణ్ణి!’ అన్నారు. ఆవిడ చిద్విలాసంగా నవ్వి- ‘దండం పెట్టుకున్నది నీకు కాదు బాబూ, నీలోని కళాకారుడికి’ అని అన్నారని చెమర్చిన కళ్ళతో చెప్పుకొచ్చారు మోహనరావు.
        ‘వియ్ డోంట్ నో హౌమెనీ పీపుల్ హేడ్ సీన్ గాడ్, బట్ మేకప్ కెన్ షో’  ఇది కూడా యూనియన్ వెబ్సైట్లోదే.  ఇందుకే ఆ రోజుల్లో మేకప్ కళాకారుల పట్ల అంత గౌరవం..

-సికిందర్ 
( ఏప్రిల్ 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమాటెక్’ శీర్షిక) 

17, అక్టోబర్ 2015, శనివారం

బ్రూస్ శ్రీ!






కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : శ్రీను వైట్ల
తారాగణం : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, కృతీ కర్బందా, సంపత్ రాజ్, రావు రమేష్, అరుణ్ విజయ్,నదియా, అమితాష్ ప్రధాన్, బ్రహ్మానందం, అలీ,
పోసాని, సప్తగిరి, ముఖేష్ రుషి, సాయాజీ షిండే  తదితరులు
సంగీతం : ఎస్ ఎస్ థమన్, ఛాయాగ్రహణం ;  మనోజ్ పరమహంస,
మాటలు :  కోన వెంకట్,  ఎడిటింగ్ : ఎం ఆర్ వర్మ ,
బ్యానర్ : డివివి ఎంటర్ ప్రైజెస్ , నిర్మాత : డివివి దానయ్య
విడుదల : 16 అక్టోబర్, 2015,  సెన్సార్ : U/A
***
          ఒక్క ‘ఆగడు’ అనే పరాజయ అనుభవంతో ప్రతిష్ట  అమాంతం నేలకు దిగిన అగ్ర దర్శకుడు శ్రీను వైట్ల తిరిగి కోలుకుని, మెగా వారసుడు రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ’ కి శ్రీకారం చుడుతూ,  ఇప్పుడు సరికొత్త శ్రీను వైట్ల ప్రేక్షకుల ముందు కొస్తున్నాడన్న అంచనాలని, ఆశల్నీ అంతే అమాంతంగా పెంచేసుకుంటూ,  ఈ వారం బాక్సాఫీసు పరీక్షకి సిద్ధపడ్డారు. రామ్ చరణ్ కూడా ‘గోవిందుడు అందరివాడేలే’ కల్గించిన నిరాశని దృష్టిలో పెట్టుకుని, ఈసారి శ్రీను వైట్లతోనే తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. ‘ఆగడు’ కంటే ముందే శ్రీను వైట్లతో మనస్పర్ధ లొచ్చి విడిపోయిన ఆయన ఆస్థాన రచయితలు, టాలీవుడ్ సలీం -జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్ లు, రామ్ చరణ్ మధ్యవర్తిత్వంతో తిరిగి కలిసి ఈ సినిమాకి పనిచేశారు. ఈ మూడు ప్రత్యేకతలతో బాటు, సుమారు ఎనిమిదేళ్ళ  గ్యాప్ తర్వాత మెగా స్టార్ చిరంజీవి ఈ  సినిమాలో అతిధి పాత్ర పోషిస్తూ ప్రేక్షక లోకంలోకి రావడం ఈ సినిమాకి కావలసినంత ప్రచారాన్ని ఇచ్చేసింది. ఇన్ని ప్రత్యేకతలు గల  ‘బ్రూస్ లీ’  అసలెలా వుంది-ఆ ప్రత్యేకతల విలువని  కాపాడుతూ ప్రేక్షకులకి మన్నికైన  వినోద కాలక్షేపాన్ని పంచిచ్చిందా, లేక ఇంకేమైనా జరిగిందా, జరిగితే ఇన్ని వుండగా ఇంకెందుకు జరిగిందీ  వంటి అవసరమైన సమాచారాన్ని శ్రమించి తెలుసుకుందాం.

అసలేమిటి కథ
    చిన్నప్పటి కథ : కార్తీక్, కావ్యాలు రామచంద్రరావు ( రావురమేష్) అనే సగటు ఉద్యోగి పిల్లలు. కార్తీక్ కి చదువుకుని కలెక్టర్ అవ్వాలని వుంటుంది. (ఎప్పటి కథో! ఏనాటి పాత్రోరా నాయనా!)  అతన్ని మంచి స్కూల్లో చేర్పించి, కావ్యాని మామూలు స్కూల్లో వేస్తాడు రామచంద్రరావు. అదేంటని భార్య ప్రశ్నిస్తే,  ఇద్దర్నీ మంచి స్కూల్లో వేసి పెద్ద చదువులు చదివించే స్థోమత లేదంటాడు. దీంతో అక్క  కోసం కార్తీక్ త్యాగం చేస్తాడు. మార్కులు తక్కువ తెచ్చుకుని ఫెయిలై తండ్రి చేత చివాట్లు తిని, అక్క ఐఏఎస్ చదువుకోవడానికి రూటు క్లియర్ చేస్తాడు.

        పెద్దయ్యాక కథ :  ఇప్పుడు ఇంటర్ ఫెయిలైన కార్తీక్ ( తెలుగు కమర్షియల్ హీరో అనేవాడు విద్యకి వ్యతిరేకి కాబట్టి ఇలా మనకి రామ్ చరణ్ ఇమేజిని కాపాడుకుంటూ ఒక రోల్ మోడల్ లా, అవిద్యకి అంబాసిడర్ లా సగర్వంగా కన్పిస్తాడు)  సినిమా ఫీల్డులో స్టంట్ మాస్టర్ గా పనిచేస్తూంటాడు. తనకి బ్రూస్ లీ అంటే ఇష్టం కాబట్టి ఆ పేరుతో  చెలామణీ అవుతూంటాడు. అక్క కావ్య ( కృతీ కర్బందా) ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ వుంటుంది. ఈ నేపధ్యంలో కార్తీక్ కి రియా ( నార్త్ ఇండియన్ పాత్ర పేరుతో నార్త్  ఇండియన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్- పాపం ఈమె తెలుగు చక్కగా నేర్చుకుని మాట్లాడేస్తూంటే పాత్రకి తెలుగమ్మాయి పేరు పెట్టి తెలుగు వాళ్ళల్లో కలిపేసుకోవడం మనస్కరించనట్టుంది)  అనే యానిమేటర్ పరిచయమై,  అది ప్రేమగా మారుతుంది. ఒక యాక్షన్ సీన్లో కార్తీక్ ని నిజ పోలీస్ అధికారిగా భ్రమించి అతడి వెంటపడుతూ- అతణ్ణే ఆదర్శంగా తీసుకుని ఒక వీడియో గేమ్ రూపొందించేందుకు పాటుపడుతూంటుంది.  

        దారిలో పడ్డాక కథ: రామచంద్రరావు పని చేస్తున్న వసుంధరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత జైరాజ్ ( సంపత్ రాజ్ ) సడెన్ గా వచ్చి, రామచంద్ర రావు కూతురు కావ్యాని తన కొడుకు (అమితాష్ ప్రధాన్) కి ఇవ్వాలని కోరతాడు. రామచంద్రరావు ఉబ్బి తబ్బిబ్బు అయి సంబంధం ఒప్పేసుకుంటాడు. ఎంగేజి మెంట్ చేసుకుంటారు.

        నగరంలో దీపక్ రాజ్ ( అరుణ్ విజయ్) అనే మాఫియా పాల్పడుతున్న ఆగడాలకి అనుకోకుండా రియా యానిమేషన్ కోసం అడ్డు తగిలి అతడ్ని గాయపరుస్తాడు కార్తీక్. ఈ దీపక్ రాజ్ ఎవరో కాదు, జైరాజ్ మొదటి భార్య (టిస్కా చోప్రా) కొడుకే. ఈ మొదటి పెళ్లి విషయం భార్య వసుంధర (నదియా) కి తెలీకుండా దాస్తాడు జైరాజ్. కార్తీక్ చేతిలో తన్నులు తిని చావుబతుకుల్లో వున్న దీపక్ రాజ్ ని చూసిన  మొదటి  భార్య, ఈ పని చేసిన వాడెవడో వాడి శవం చూడాలని భర్త మీద  ఒత్తిడి తెస్తుంది. జైరాజ్ కూడా వాడెవడో వాణ్ణి పట్టుకుని చంపాలని గ్యాంగ్ ని పురమాయిస్తాడు.

        తేలాల్సిన కథ :  ఇలా అసలు జైరాజ్ నిజ స్వరూపం  ఏమిటో, ఎందుకు తన అక్కతో కొడుక్కి పెళ్లి సంబంధం కోరుకున్నాడో, ఎందుకు తన మీద పగబట్టాడో- దీనికి విరుగుడుగా కార్తీక్ ఏం చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో అన్నది ఇక్కడ్నించీ సాగే మిగతా కథ.




ఎలా వుంది కథ
        సీనియర్ స్టార్లు ఏనాడో వాడేసిన కథలే ఇంకా సినిమా కథలనుకుంటూ, వాటినే మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులకి అందిస్తున్న, విసుగులేని  హైటెక్ జూనియర్ స్టార్ల గిరిగీసుకున్న పరిధిలోనే వుంది కథ. కాకపోతే ఈసారి ఈ వయసు మళ్ళిన కథ జూనియర్ స్టార్ ని ముసలి వాణ్ణి చేయడానికే పోటీపడింది. అంటే నమ్మిన పాత కథలోనూ దమ్ము కూడా లేదన్నమాట.

ఎవరెలా చేశారు
      మాస్ సినిమాలంటూ అవే పాత మూస సినిమాలతో  రాజీపడిపోయిన రామ్ చరణ్ కి ఈ సారి గట్టి షాకే తగిలింది- మొన్నే ‘శివమ్’ తో మరో వూర మాస్ సినిమాల అమర ప్రేమికుడైన ఎనర్జిటిక్ స్టార్  రామ్ షాక్ తిన్నట్టు.  రామ్ చరణ్ ఇంగ్లీషు పత్రికలకిస్తున్న ఇంటర్వ్యూ లలో ఎంతైనా తన ‘బ్రూస్ లీ’ ని  ‘భజరంగీ భాయిజాన్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ల వంటి హై క్వాలిటీ సినిమాలతో పోల్చనీగాక, ‘ఇది నా దసరా కానుక’ అనికూడా పొగుడుకోవచ్చుగాక, అవే ఇంటర్వ్యూల కిందే ప్రేక్షకులు వాళ్ళ కామెంట్స్ తో ఎలా విరుచుకు పడుతున్నారో చూస్తే- తనెంతగా ప్రేక్షకులతో కనెక్ట్ కోల్పోయి గుడ్డిగా సినిమాలు చేసుకుపోతున్నాడో  తెలుస్తుంది. వేకప్ చరణ్, వేకప్ మాన్! గ్రో అప్! ఇతర వ్యాపారాల లాగే సినిమాలు కూడా విషయపరంగా మోడర్నైజ్ అయ్యాయి. 

        డాన్సుల్లో, ఫైట్సుల్లో రామ్ చరణ్ చూపిస్తున్న టాలెంట్ కి గుర్తింపు రావాలంటే మొత్తంగా సినిమా బావుండాలి. ఆ సినిమాలో నటన కన్పించాలి. సినిమానీ నటననీ వదిలేసి, కేవలం డాన్సులూ ఫైట్లూ చూసి తననెవరూ స్టార్ గా గుర్తించరు. నటన కన్పించాలంటే నటించడానికి ఓ పాత్ర వుండాలి. అసలు పాత్రే లేనప్పుడు - కామెడీ బాగా చేశాను నా కంఫర్ట్ జోన్ లోంచి బయటి కొచ్చి, సెంటి మెంట్ ఎమోషన్ సీన్లు బాగా చేశాను-  అని చెప్పుకోవడంలో అర్ధం లేదు. ఈ సినిమా చూస్తే అలాటి సీను ఒక్కటయినా గుర్తుంటుందా? సినిమా ఫైటర్ గా, హీరోయిన్ కి లవర్ గా, అక్కకి తమ్ముడుగా, తండ్రికి కొడుకుగా, విలన్ కి హీరోగా..  ఇలా ఎన్నో షేడ్స్ పెట్టుకున్నారు. ఒక్కటైనా పాత్రకి పనికొచ్చిందా? వీటితో ఒక్క సీనైనా పండిందా? ఏ పూర్వరంగమూ వుండని  బలహీన సన్నివేశాల్లో కన్విన్స్ కాని కృత్రిమ కన్నీళ్లు, కృత్రిమ ఆలింగానాలు, కృత్రిమ డైలాగులూ..మొదలైన వాటితో ఒక్క చోటయినా తన క్యారక్టర్ సరీగ్గా రిజిస్టర్ అయిందా? చివర్లో తండ్రీ కొడుకుల త్యాగాల కథలు, ఆ డైలాగులు ఎంత కాలం చెల్లినవో చెప్పనవసరంలేదు. కూతుర్ని కలెక్టర్ని  చేయడం కోసం కొడుకు చదువుకోలేదన్న గొప్ప నిజం ఎప్పుడో పాతికేళ్ళకి తెలిసి, ఆ తండ్రి కొడుకు త్యాగాన్ని కీర్తిస్తూ కన్నీళ్లు పెట్టడం ఏమైనా కదిలించిందా? అదొక త్యాగంగా కన్విన్స్  చేయగల్గారా? ఆ త్యాగం అనే ఎలిమెంట్ కి ఏమైనా అర్ధముందా? ఒక బడా కంపెనీలో మేనేజర్ గా పనిచేసే తండ్రి ఉన్న తన ఇద్దరు పిల్లల్ని సమానంగా చదివించుకోలేడా!

        ఇలా ఈ సినిమాలో ఎక్కాడా దేనికీ సరైన  ‘బేస్’ అంటూ కన్పించదు. గాలిమేడలు కట్టినట్టు వుంటుంది - ఒక్క విషయంలో తప్ప, అది కాపీ చేయడం కోసం ఒక ఫ్రెంచి హిట్ సినిమాని ఫ్రీగా  ‘బేస్’ చేసుకునే విషయంలో మాత్రమే. దీని వివరాల్లోకి తర్వాత వెళ్దాం. 

       హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పుకోవాలంటే, ఈమె టాలెంటెడ్ నటి. ఠికానా లేని గ్లామర్ పాత్రలతో వృధా అయిపోతోంది. ఆ ఒడ్డూ పొడవుతో, వెండి తెరంతా వెలిగిపోయే చిరునవ్వుతో, నటనలో అంత ఈజ్ తో- ఆథర్ బ్యాక్డ్ పాత్రలు చేస్తే, ఇండిపెండెంట్ హీరోయిన్ గా తనదంటూ ఒక స్లాట్ ని క్రియేట్ చేసుకోగలదు అనూష్కా లాగా. ‘కిక్-2’ లో బీహార్ ఎపిసోడ్ లో ఆ చీరకట్టుతో పల్లెటూరి పాత్రలో చేయవలసినదంతా చేసింది. ‘బ్రూస్ లీ’ లో చేయడానికేమీ లేదు. వూరికే హీరోని పోలీసాఫీసర్ గా నమ్మేసి వెంటపడ్డం తప్ప. తన యానిమేషన్  పిచ్చి వల్లే  హీరో విలన్ తో సమస్య తెచ్చుకున్నాడని కనీసం తెలుసుకోలేని పాత్రచిత్రణలతో, పాటలకీ ప్రేమలకీ పరమితం చేస్తూంటే, ఎందరో రకుల్ ప్రీత్ సింగ్ లు ఇలా అపహాస్యం పాలై కనుమరుగవుతూనే వుంటారు.

        ఇక బ్రహ్మానందం సహా డజన్ల సంఖ్యలో వున్న కమెడియన్లూ, క్యారక్టర్ ఆర్టిస్టులూ  వున్న ‘కథ’ కి ఏ ప్రయోజనం కోసం వున్నారో తెలీదు. నానా గందరగోళం సృష్టించి, ఏదో నవ్వించామనుకుని వెళ్ళిపోతారు. శ్రీను వైట్ల ఈ స్థాయికి చేరుకున్నాక కూడా ఇంకా ఎందరో ఆర్టిస్టుల సమూహం లేకపోతే డైరెక్టర్ గా తను నిలబడలేననుకోవడం చాలా విచారకరం. తాను చేరుకున్న ఈ పొజిషన్ కి ఆరేడుగురు ఆర్టిస్టులతో బలమైన కమర్షియల్ సినిమా తీసి ప్రేక్షకులకి కొత్త అనుభవ మివ్వొలేకపోతే చేరుకున్న ఈ టాప్ పొజిషన్ కి అర్ధం లేదు. నిజానికి ‘బ్రూస్ లీ’ ని కేవలం ఆరేడుగురు నటీనటులతో బలంగా, కొత్తగా, ఆశ్చర్య కరంగా తీసి క్రేజ్ సృష్టించవచ్చు. ‘ఆగడు’ పరాజయంతో తప్పులు తెలుసుకుని తాను  మారిపోయానని చెప్పుకున్న వైట్ల ‘బ్రూస్ లీ’ తో ఏం మారినట్టో అర్ధంగాదు. అదే ఆర్టిస్టుల గుంపు, అదే కథా స్కీము, అదే కామెడీ గోల, అదే మూస రైటింగ్, అదే టేకింగూ డైరెక్షన్!

       ఇక ఈ ‘సీ’ గ్రేడ్ అనిపించే కథాకథనాలతో కూడిన  సినిమాకి కొసమెరుపుగా చివర్లో చిరంజీవి రావడమే శ్రీరామ రక్ష . ‘రుద్రమ దేవి’ ని అల్లు అర్జున్ కాపాడినట్టు, ‘బ్రూస్ లీ’ కి ఈమాత్రమైనా కలెక్షన్లు వస్తున్నాయంటే చిరంజీవిని చూడ్డానికి జనం ఎగబడ్డం వల్లే. ఈ ధోరణి చూస్తూంటే, ఇక సరుకులేని ఇలాటి సినిమాలకి క్రేజ్ వున్న స్టార్లతో అప్పీయరెన్సులు  ఇప్పించుకునే సాంప్రదాయానికి తెరతీస్తారేమో. ఈ సినిమాలోనే మొహమాటపడకుండా మాటల రచయిత తన మీద తనే సెటైర్ వేసుకుంటున్నట్టు -  ‘సీన్ లో కంటెంట్ లేని సినిమాల్లో క్లయిమాక్స్ లో హడావిడి ఎక్కువ’ - అని డైలాగు రాయడం, దాన్ని పాటిస్తూ క్లయిమాక్స్ లో చిరంజీవిని రప్పించి హడావిడీ చేయడం అంతా మసిపూసి మారేడు కాయ. కానీ చిరంజీవి రాకతో అంతసేపూ నరకం అనుభవించే ప్రేక్షకులకి హుషారు వచ్చేస్తుంది. చిరంజీవి కూడా జీవితంలో 150 వ సినిమా అంటూ తీస్తే,  దానికి ప్రేక్షకుల రెస్పాన్స్ ఏమేరకు ఉంటుందనే  దానికి ఓ చిన్న ట్రయల్ వేసి చూసుకున్నట్టయ్యింది.  ఆ నూటయాభయ్యోవది తప్పకుండా ఓ చరిత్రే అయ్యేట్టు చూస్తామని ప్రేక్షుకులు కూడా ఇలా హామీ ఇచ్చేస్తున్నారు-  ‘జస్ట్ టైం గ్యాప్, టైమింగ్ లో గ్యాప్ వుండదు’  అన్న మెగాస్టార్ డైలాగ్ కి డంగై పోతూ. 

        మెగా స్టార్ తో బాటు ఎస్ఎస్ తమన్, మనోజ్ పరమహంస, రామ్- లక్ష్మణ్ లు ఈ  సినిమాని నిబెట్టేందుకు చాలా కృషిచేశారు. కానీ కంటెంట్ లేకపోతే  ఎవరు మాత్రమేం చేయగలరు. కంటెంటే లేనప్పుడు వచ్చే పాటలూ ఎంత బావున్నా బోర్ కొడతాయి. ఫైట్లూ సహనపరీక్ష పెడతాయి. కెమెరా వర్కూ వృధా అయిపోతుంది. దేంట్లోనూ ఇన్వాల్వ్ కాలేరు ప్రేక్షకులు. వీటితో కంటెంట్ అయినా కలిసిపోవాలి, లేదా కంటెంట్ తో ఇవైనా కలిసి సాగాలి- ఇలా కాక భిన్నధృవాలైనప్పుడు, ఎవరికివారే యమునా తీరేగా కాశీలో కలుసుకోవడమే అన్నీ కలిసి.


స్క్రీన్ ప్లే సంగతులు 
         విజయవంతంగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అనేది లేదు, ‘ఐస్ స్క్రీమ్ ప్లే’ అంటూ కొత్తది కనిపెట్టారు.  దీనితర్వాత ‘లాలిపాప్ ప్లే’ రావొచ్చు. ‘చూయింగమ్ ప్లే’ రావొచ్చు. ఆఖరికి ఇంకా కాలం కలిసివస్తూ వుంటే,   ‘పాన్ మసాలా ప్లే’, ‘మాణిక్ చంద్ గుట్కా ప్లే’ లు కూడా వచ్చేస్తాయి. బిగ్ బడ్జెట్ సినిమాలకి కావలసిందల్లా అతి బీదతనంతో కూడిన తెల్ల రేషన్ కార్డు  ‘ప్లే’ మాత్రమే. సబ్సిడీ బియ్యం మాత్రమే. సబ్సిడీ బియ్యంతో బిర్యానీ వంటకం  మాత్రమే. నాణ్యమైన బాస్మతీ బియ్యంతో ప్రేక్షకులకి మంచి బిర్యానీ  పెట్టలేని పేదరికంతో  వుంది టాలీవుడ్ రైటింగ్ డిపార్ట్ మెంట్. సబ్సిడీ బియ్యం మాత్రమే తెలుగు బిగ్ బడ్జెట్ సినిమాల్ని ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జోకుగా ( స్కామ్ గా కూడా!)  పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టగలదు కాబట్టి ఆ రేషన్ ని వదులుకోరు. టాలీవుడ్ సలీం-  జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్లు ఆల్రెడీ సింగిల్ విండో స్కీము అనబడు జారుడుబల్ల స్క్రీన్ ప్లేని  కనిపెట్టారు. అది సినిమా తర్వాత సినిమాగా ఏకసూత్ర కార్యక్రమంగా అమలవుతూ  ‘పండగ చేస్కో’ తో పరాకాష్టకి చేరింది. ఈ స్కీము కింద ఏ స్టార్ అయినా, ఎంతటి వాడైనా; ఏ కథైనా, కథే కాకపోయినా, అదే సింగిల్ విండో లోంచి దూకి, అదే జారుడు బల్లమీదుగా రయ్యిన జారుకుంటూ వెళ్లి బాక్సాఫీసులో పడాల్సిందే. అదంతా ఒక సెట్ చేసిన ప్రోగ్రామింగ్, ఒక టెంప్లెట్, ఒక ఆటోమేషన్, అంతే. మీటలు నొక్కడమే పని. స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ లు అంటూ వున్నాయి. ఈ సింగిల్ విండో స్కీము గురించి ప్రపంచానికి తెలిసిపోతే,  వందల కోట్ల డాలర్ల ఆ స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ రంగం మొత్తంగా మూతబడి పోవాల్సిందే. 

        ఈ సినిమాలో కూడా హీరో వెళ్లి విలన్ ఇంట్లో పడి, మరో పది మందిని తెచ్చుకుని, అదే కన్ఫ్యూ జ్ కామెడీ అనే అదే డ్రామా ఇందుకే మొదలెట్టాడు. పాపం రామ్ చరణ్ కీ తప్పలేదు ఈ జారుడు బల్ల పిల్లలాట!

        ఒక హిట్ దర్శకుడు ఆఫ్ ది  రికార్డ్ గా ఇలా డిసైడ్ చేశారు : ‘సినిమాలు  డిజిటలైజ్ అయ్యాక ‘ఏ’ సెంటర్ నుంచీ ‘సీ’ సెంటర్ దాకా, పక్క స్టేట్స్ నుంచీ  ఓవర్సీస్ దాకా, ఒకేసారి వెయ్యి థియేటర్లలో విడుదల చేసుకుని, శుక్ర- శని- ఆదివారాల్లో పెట్టుబడులూ లాభాలూ లాగేసుకునే సులువు ఏర్పడ్డాక,  ఇంకా క్వాలిటీ, క్రియేటివిటీ లెందుకండీ, కథా కాకరకాయ లేంటండీ - స్టార్ నీ డైరెక్టర్ నీ చూసి పొలోమని జనాలు వచ్చి పడుతోంటే- మూడ్రోజుల్లో దులుపుకు పోయే దానికి!’ 

        ‘ఐతే జనాలు కూడా దులుపుకు పోయేవాళ్ళలాగా తయారైపోయారంటారా డబ్బులిచ్చుకుని?’’ అనడిగితే,  ‘తీసేవాళ్ళూ చూసేవాళ్ళూ అందరూ ఎవరి గేములు వాళ్ళు ఆడుకుంటున్నారండీ.. మీరే రివ్యూలు రాసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు’  అన్నారు. నిజమే, నూటికి 90 శాతం ఫ్లాపయ్యే సినిమాలకీ అంతే కష్టపడి రివ్యూలు రాయాల్సిన సంగతలా వుంచి, మూడ్రోజుల్లో వాటికి జనం అలా నిలువు దోపిడీలు ఇచ్చేస్తూంటే, ఇంకా వాటి మంచి చెడ్డలు విశ్లేషిస్తూ బ్లాగులో పోస్టులు పెట్టడం శుద్ధ తెలివితక్కువ పనే. చాలా లో-క్లాస్ యాక్టివిటీ! వెయ్యి థియేటర్లలో డిజిటల్ ప్రొజెక్షన్ల ఇన్ స్టెంట్ కాలంలో రివ్యూలు అవుటాఫ్ ఫోకస్ అయిపోక తప్పదు. సినిమాలు చూడని వాళ్ళే ఎక్కువ మంది రివ్యూలు చదువుతారు. దీంతో ఫటాఫట్ నిర్మాతలకీ నష్ట మేమీ లేదు, పనిగట్టుకుని రాస్తున్న వాళ్ళకీ ఒరిగేదేమీ లేదు.  

***
     ఐనా టైపు చేసే చెయ్యి వూరుకోదు కదా.చదివే వాళ్ళు వున్నా లేకపోయినా టైపింగ్ జరిగి పోతూ  వుంటుంది. కనీసం ఈ టైపు చేస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలు బయటపడుతోంటే, ఈ జ్ఞానధార కోసమైనా అర్రులు చాస్తూ టైపు చేయాల్సిందే. There's no wastage in God's grand economy’ అని కదా కొటేషన్? 
      
          ‘బ్రూస్ లీ’ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జడివాన వెలసిన వెనుకా జరిగింది  తెలియునులేరా- అనీ ఇప్పుడు ఒకటొకటే  విషయాలు బయటపడుతున్నాయి. శ్రీను వైట్ల అనుకున్న కథ ఇది కాదనీ, ఆయన  కథని కోన- మోహన్ లు కలిసి మార్చేశారనీ, టైటిల్ కూడా ఆయననుకున్నది కాదనీ, వాళ్ళతో మళ్ళీ కలిసి పనిచేయడం వైట్లకి ఇష్టం లేకపోయినా, రాం చరణ్ బలవంతంతో తప్పలేదనీ, చివరికి ఒక ఫ్రెంచి సినిమా  కథని తెచ్చి సెకండాఫ్ లో పెట్టి నడిపారనీ..కథని విస్తరించి డైలాగులు రాయడానికి  పారితోషికం రెండు  కోట్ల రూపాయలకి తగ్గకుండా తీసుకున్నారనీ ...ఇలా ఫిలిం నగర్లో లీకవుతున్నాయి వార్తలు. 

        ఎన్ని కోట్లు తీసుకున్నారన్నది ముఖ్యం కాదు, తిరిగి ఏమిచ్చారన్నదే ముఖ్యం. ఒరిజనల్ గా ఏం సృష్టించారన్నదే ముఖ్యం. ఒరిజినాలిటీ లేనప్పుడు, మౌలిక అవగాహన లేనప్పుడు, వున్నా మనకెందుకని ఉపెక్షించినప్పుడు మాత్రమే ఇచ్చి పుచ్చుకోవడాలు ప్రశ్నార్ధక మవుతాయి.  ముందుగా కాన్సెప్ట్ పరంగా చూస్తేనే ఇది సినిమాకి పనికి రాదనీ ఇట్టే తెలిసిపోతుంది. ఈ శతాబ్దం లో ఇప్పటివరకూ మహేష్ బాబు నటించిన, గుణశేఖర్ తీసిన  ‘అర్జున్’  దగ్గర్నుంచీ సిస్టర్ సెంటి మెంట్ తో వచ్చిన సినిమా ఏదీ ఆడలేదు. అలాంటప్పుడు శ్రీను వైట్ల కూడా కలెక్టర్ అక్కగార్ని పెట్టుకుని ఇంత పురాతన కథ అనుకోవడమే పొరపాటు. సిస్టర్ సెంటి మెంట్సుని పండించడానికి జ్యూనియర్ స్టార్లు చిరంజీవీ నాగార్జునలు కాదు. ఆ గ్రేస్ వీళ్ళకింకా  రాలేదు. అయినా వర్కౌట్ చెయ్యక తప్పదనుకుంటే, ఈ కాలానికి కనెక్ట్ అయ్యేట్టు చాలా బలంగా సృష్టించాలే తప్ప, ఆషామాషీగా నాల్గు కృత్రిమ సీన్లతో కాదు. మొన్న ఆగస్టులోనే అక్షయ్ కుమార్- సిద్ధార్థ్ మల్హోత్రాలతో కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ‘ బ్రదర్స్’ లో అన్నదమ్ముల సెంటిమెంట్ ఎంత బలంగా,  ఒక సందేశం లాగా వర్కౌట్ అయ్యిందో చూశాం. ఆ సినిమా చూసి చివర్లో ఏడవకుండా ఎవరైనా బయటికి రాగలరా? ఏడ్పించడం  ఎప్పుడో మర్చిపోయిన బిగ్ బడ్జెట్ సినిమాలకి ఈ సెంటి మెంట్ల కథలు అవసరం లేదు.

        అక్క అనేదే కాస్త ఉన్నతంగా వుండే పాత్ర. అప్పుడామె  ప్రవర్తన తనకోసం తమ్ముడు చేసిన త్యాగ మూల్లాల్లోంచి వుండాలి. మూలాల్లేని  ప్రవర్తనతో సెంటిమెంట్లెలా పెల్లుబుకుతాయి. ఇందుకే ఈ సినిమాలో దేనికీ ‘బేస్’ లేదనేది. ఐయ్యేఎస్ చదివే అమ్మాయి అప్పుడే పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఆ ఒప్పుకోవడం కూడా ఎవరో పెళ్ళికొడుకుని చూసీచూడగానే తనకి నచ్చేశాడని సగటు అమ్మాయిలా సిగ్గులు పోతుందా? రేపు ఈ పర్సనాలిటీతో గనుక ఈమె ఐయ్యే ఎస్ రాసి ఇంటర్వూ కెళ్తే,  వెంటనే డిస్ క్వాలిఫై అయిపోతుంది. ఇలాటి చిత్రణలు ‘సీ’ గ్రేడ్ సినిమాల్లో కన్పిస్తాయి. నిర్మాత డివివి దానయ్య దయతో దానం చేసిన రెండు కోట్ల కథల్లో కాదు.

        రెండోది- హీరో పాత్ర. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ పేరు పెట్టుకుని హీరో ఏం చేస్తున్నాడు. స్టంట్ మాన్ వృత్తిలో ఏ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇవి కూడా వదిలేద్దాం. ఆ వృత్తి కారణంగా కథనంలో సహజసిద్ధంగా ప్రధాన కథతో  ఏర్పడాల్సిన సంబంధం ఎక్కడుంది? తెలీక ఆ వృత్తికి పోలీసు ముసుగేసి హీరోయిన్ ఆడుకోవడం ప్రధాన కథా, లవ్ ట్రాక్ లో భాగమా? ప్రధాన కథ విలన్ తో కదా వుంది. మారా విలన్ హీరో వృత్తిని ఎక్కడ ఎక్స్ ప్లాయిట్ చేశాడు. ఎక్స్ ప్లాయిట్ చేయకపోతే హీరోకి అలాటి స్పెషలైజ్డ్ వృత్తి దేనికి, ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని నీరు గార్చెయ్యడానికి కాకపోతే.

        ఒరిజినల్ సలీం- జావేద్ లు ఇలా కాదు- వాళ్ళు రాసిన  ‘డాన్’ ( 1978) లో ప్రాణ్ నటించిన పాపులర్ పాత్ర సర్కస్ కళాకారుడు. అతడి సర్కస్ విద్యని విలన్ ఎక్స్ ప్లాయిట్ చేస్తాడు. అతడి పిల్లల్నికిడ్నాప్ చేసి,  ఒక సర్కస్ కళాకారుడికి మాత్రమే సాధ్యమయ్యే సాహసంతో కూడిన నేరం చేయిస్తాడు. అదీ పాత్రప్రయోజనమంటే. మరి బ్రూస్ లీకి ఏం జరిగినట్టు, అతడెందుకు ఫైటర్ గా వున్నట్టు? అతడి అసిస్టెంట్లు కమెడియన్లు ఎందుకయిన్నట్టు. కమెడియన్లు స్టంట్ కళాకారులుగా కన్విన్స్ చేస్తారా?  

***
       ఈ స్క్రీన్ ప్లే కి ఒక స్ట్రక్చర్ అంటూ ఏమీ లేదు. చాలా క్లమ్సీగా వుంటుంది కథనం. ఏ సంఘటన ఎందుకు జరుగుతోందో, ఏ యాక్ట్ లో భాగంగా వస్తోందో అర్ధంగానంత గజిబిజిగా వుంటుంది. ఇందాక చెప్పుకున్న ‘బ్రదర్స్’ ఫస్టాఫ్ లో బిగినింగ్ ముగిసి, మిడిల్ ప్రారంభమయ్యాక- మళ్ళీ బిగినింగ్ తాలూకు సీన్లు ఎలా వచ్చి గందరగోళం సృష్టిస్తాయో- శాండ్ విచ్ స్క్రీన్ ప్లే అన్పిస్తాయో- అలాటి గందర గోళం ఇక్కడ మొత్తం సినిమా అంతా కన్పిస్తుంది. చాలా నిర్లక్ష్యంగా రాసుకుపోయిన  విధానమే కన్పిస్తుంది. ప్రారంభించడమే ఇంకా పాతకాలంలో వున్నట్టు-  అనగనగా.. అంటూ చిన్నపిల్లల కథ ఎత్తుకుంటారు. 

        హీరో పెద్దయ్యాక ఓ ఫైట్ ఓ పాటా రొటీన్ గా వచ్చేశాక, హీరోయిన్ తో వచ్చేసి లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఇంకోవైపు జయప్రకాష్ రెడ్డి డబుల్ యాక్షన్ తో హీరోకి కన్ఫ్యూజ్ కామెడీ. మధ్యమధ్యలో జెర్కు లిస్తూ చిన్న విలన్  వస్తూంటాడు. ఇతను టెర్రరిజం చేస్తాడు, డ్రగ్ స్మగ్లింగ్ చేస్తాడు, ఇంకేవేవో చేస్తాడు. ఒక్కటీ రిజిస్టర్ కాదు. రొటీన్ గా అతడికి దండాలు పెట్టే  పోలీసు అధికారులు వచ్చేస్తూంటారు. ఏమిటో లీడ్ సరిగ్గా వుండని యాక్టివిటీస్ తో ఔటాఫ్ పేజ్ క్యారక్టర్లై పోతారు. ఎవరూ సరిగ్గా రిజిస్టర్ కారు, ఏదీ సరిగ్గా ముద్రించుకోదు. ఇది చాలనట్టు సడెన్ గా ఒకసారి హీరో అక్క కిడ్నాప్ అవుతుంది. డ్రగ్ కేసులో పోలీస్ స్టేషన్లో వుంటుంది. మరోసారి హీరోయినే కిడ్నాప్ అవుతుంది. ఇలా కిడ్నాపులు కూడా అర్ధం పర్ధం లేకుండా రిపీట్ అవుతూంటాయి. అప్పుడు సడెన్ గా పెళ్లి సంబంధం అంటూ పెద్ద విలన్ వచ్చేస్తాడు. రోగానికి టైముకి టాబ్లెట్ వేసుకోవాలన్నట్టు, పాటలూ ఫైట్లూ ఠంచనుగా వచ్చేస్తూంటాయి. ముందు అక్క కిడ్నాప్ లాంటి మేజర్  సంఘటనని చూసి, హమ్మయ్య ఇక్కడ ఈ గజిబిజి బిగినింగ్ విభాగం ముగించి చక్కగా ప్లాట్ పాయింట్ -1 ని ఏర్పాటు చేస్తున్నారు కాబోలనుకుంటాం. ఆ సంఘటన కాస్తా నీరుగారిపోయి, ఇది కాదు మరేదో జరుగుతుంది కాబోలని మళ్ళీ చూస్తూంటాం. ఇంకేవేవో జరిగి, ఈసారి హీరోయిన్ కిడ్నాపై పోతుంది. ఇలా రిపీటీషన్స్ తో రచనకి ఒక ధ్యేయం, గమ్యం, కథా పథకమంటూ కన్పించక- స్టార్ట్ అండ్ స్టాప్ అనే డాక్యుమెంటరీ లకి వాడే టెక్నిక్ ని విరివిగా వాడేస్తూంటారు. 

        చివరికి ఇంటర్వెల్ ముందు హీరో వెళ్లి ఎలాగో చిన్న విలన్ గాయపర్చి  కోమాలోకి పంపిస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఆ చిన్న విలన్ బడా వ్యాపార వేత్త మెయిన్ విలన్  పెద్ద కొడుకే  అని. చిన్న కొడుక్కి హీరో అక్కతో  సంబంధం మాటాడు కున్నాడు. హీరో తండ్రి ఈ బడా వ్యాపార వేత్త కంపెనీలో మేనేజరే. నిజానికి ఇప్పుడు ఇన్నేళ్ళకి ఇంకా పెద్ద హోదాలో వుండాలి. ఎకాఎకీన బడా వ్యాపారి ఈ సంబంధం ఎందుకు కోరుకున్నాడంటే, ఇతను రాజ్యసభ సీటు మీద కన్నేశాడు. టికెట్టు కోసం తనది ఎంత సామ్యవాదమో మంచి మార్కులు కొట్టెయ్యడానికి ఈ సంబంధమట. హీరోగానీ, అతడి తండ్రిగానీ ఈ కుయుక్తి గ్రహించకుండానే ఎంగేజిమెంటుకి కూడా సిద్ధపడి పోతారు. వీళ్ళ అమాయకత్వమే  వీళ్ళ కొంపముంచింది. 

        ఎప్పుడైతే బడా వ్యాపారి మొదటి భార్యకి పుట్టిన పెద్ద కొడకు కోమాలోకి వెళ్ళాడో,  ఆ మొదటి భార్య అల్టిమేటం ఇస్తుంది- తన కొడుకుని ఇలా కొట్టిన  వాడిని చంపాలని. బడా వ్యాపారి ఒప్పుకుని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు. ఇటు ఏదో సందర్భంగా హీరో అక్క ఏదో ప్రమాదాన్ని శంకిస్తే, మన ఫ్యామిలీ జోలి కెవరొచ్చినా సెంటీ మీటర్ దూరంలో చావు చూపిస్తానంటాడు హీరో. ఇలా ఇక్కడ విడివిడి బిల్డప్స్  తో ఇంటర్వెల్ పడుతుంది. గత్యంతరం లేదు కాబట్టి ఇదే ప్లాట్ పాయింట్ -1 అనుకోవాలి. దీని నిర్వహణ ఎలా వుంది? ఈ కింద చూద్దాం..

***
      'యాం ఏ ఫైటర్, టేకప్ చేసిన మిషన్ ఫినిష్ చేసేవరకూ నో ఇంటర్వెల్, జస్ట్ క్లయిమాక్స్!’  రామ్ చరణ్ డైలాగ్. 
        పాత్రలు ఆడియెన్స్ కి అర్ధంకాని సినిమా స్క్రిప్టు లాంగ్వేజీ బాగానే మాట్లాడుతూ కోతలు కోస్తాయి వాటి అర్ధాలే తెలీకపోయినా. 

        ఇంటర్వెల్ దగ్గర ఏం ఎస్టాబ్లిష్ అయింది? హీరో, విలన్ ఇద్దరూ ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఎలా?  అసలు తను ఎవరి కొడుకుని కొట్టాడో హీరోకే తెలీదు, అయినా  వాడు తన కుటుంబం జోలికొస్తే వూరుకోనన్నాడు.  అలాగే తన కొడుకుని కొట్టిందెవరో విలన్ కీ  తెలీదు. అయినా ఆ కొట్టిన వాణ్ణి చంపుతానని అతను కూడా శపథం చేశాడు.

        ఈ కథలో విలన్ ఎవరో హీరోకి తెలీదు, అలాగే తన హీరో ఎవరో విలన్ కీ తెలీదు ఇంటర్వెల్ కి వచ్చాక కూడా. ఇద్దరూ డమ్మీలే, ఇద్దరూ పాసివ్ లే. 

        ‘శివమ్’  లో ఎలాగైతే సిగరెట్ లైటర్ కోసం తను కొట్టింది విలన్ కొడుకునే అని హీరోకి తెలీదో, అలాగే తన కొడుకుని హీరోయే కొట్టాడని కూడా విలన్ కి ఎలా తెలీదో- అదే సిట్యుయేషన్ ఇక్కడా ఏర్పాటు చేశారు. ‘శివమ్’ ఫ్లాప్ అయ్యింది, ఇలాటిదే ‘హోరాహోరీ’  కూడా ఫ్లాపయ్యింది. 

        ‘
మెక్సికన్ స్టాండాఫ్’ ( Mexican stand-off) అనే సిట్యుయేషన్ ఒకటుంటుంది. ఈ సిట్యుయేషన్ లో  ప్రత్యర్థులిద్దరూ తుపాకులు గురిపెట్టుకుని వుంటారు. ఎవరు ముందు పేలుస్తారన్నది సస్పెన్స్. ఇది ముఖీముఖీగా ఏర్పడే టెన్షన్. కానీ పై మూడు ఫ్లాపయిన తెలుగు సినిమాల్లో హీరోలూ విలన్లూ పరస్పరం తెలుసుకోకుండా ఒకడు ఎక్కడో, ఇంకొకడు ఇంకెక్కడో వుండి  బీరాలు పలుకుతారు. సమస్య ఏంటో తెలీదు, శత్రువెవరో తెలీదు. అలాటి ఆ ఇద్దరి సౌండ్ పొల్యూషన్ ని ఒక దగ్గర చేర్చి, కాంట్రాస్ట్ చూపిస్తూ- ఫిలిం నగర్ స్టాండాఫ్’ (Film nagar stand-off) అనే ఒక వింత గారడీ చూపించి ప్రేక్షుకులు తెల్లబోయేలా చేస్తారు.

***
         ‘వేట ఎలా ఉంటదో నేను చూపిస్తాను. మొదలు పెట్టాకా పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్ లు వినపడవ్, రియాక్షన్ లు కనపడవ్, ఓన్లీ రీసౌండ్’ - రామ్ చరణ్ మరో డైలాగ్ డీటీఎస్ టెక్నాలజీని కూడా లాగి. ఈ ‘రీసౌండ్లు’-  ‘స్క్రీన్ ప్లే’ లో తాటాకు చప్పుళ్ళు. 

        పాసివ్ పాత్రకి ఇన్నేసి డైలాగులా. సరే, ఇంటర్వెల్ దగ్గర వేసిందే ప్లాట్ పాయింట్ -1 అనుకుందాం. ఈ ప్లాట్ పాయింట్- 1 లో-  a) హీరోకి గోల్,  b) ఆ గోలో ఎమోషన్, c) తను తీసుకోబోయే చర్యల తాలూకు పరిణామాల హెచ్చరికా - ఉన్నాయా? ఏవీ లేవు. వాడెవడో తెలీదు, వాడు తన ఫ్యామిలీ జోలికొస్తే అంతు చూస్తానన్నాడు. వచ్చినప్పుడు కదా. రాకపోతే ఏమీ లేదు. కాబట్టి హీరోకి గోల్ లేదు. గోల్ లేకపోయాక మిగిలిన రెండు అంశాలూ లేవు. ప్లాట్ పాయింట్ -1 దగ్గర కూడా హీరోకి గోల్ ఏర్పడక పోతే అది కథెలా అవుతుంది. ప్లాట్ పాయింట్ -1 అనే మొదటి మూలస్థంభంలో ఏ బలమూ లేకపోతే, 40 కోట్ల సినిమాకి ఆధారభూతమయ్యే స్క్రీన్ ప్లే అనే మహా సౌధాన్ని అదెలా నిలబెడుతుంది? యథా ప్లాట్ పాయింట్- 1 తథా ప్లాట్ పాయింట్- 2  అని కదా? మొదటి మూలస్థంభం బలంగా లేకపోతే, రెండో మూలస్థంభమూ అంటే- క్లయిమాక్సూ ముగింపూ కూడా తేలిపోతాయని కదా జనరల్ రూలు? ఈ సినిమాలో ఇదే జరిగింది కదా?  

        కథ నడపాల్సిన  కథానాయకుడు, ఓ అక్క ఊహాజనిత భయాలకి ఊహాగానాలు చేస్తూ వున్నాడు. మరి కథెవరు నడపాలి?

***
      ‘నీ మీటర్ పగిలితే గానీ నా మీటర్ అర్ధంగాదు’ - రామ్  చరణ్ ఇంకో డైలాగ్ బీటెక్ ఎలెక్ట్రానిక్స్ భాషలో. 

        ఏమీ చేయలేని దానికి ఈ డైలాగు లెందుకో. తనకున్న మీటరేంటి-అదెందుకు పనికొచ్చింది? నీ మీటర్ తో నువ్వు సినిమాని ఫ్లాప్ చేశావ్ కదా అని విలన్ అంటే పరిస్థితి ఏంటి? ఎస్, ఇంటర్వెల్ తో అదే ప్లాట్ పాయింట్-1  అనుకుని అలాగే కంటిన్యూ చేద్దాం. సినిమా అంతా నిండిపోయి వున్న నానా వ్యర్ధ పాత్రలన్నిటినీ తీసేద్దాం. కేవలం హీరో, అతడి కుటుంబం, హీరోయిన్, విలన్, అతడి కుటుంబం- ఈ పాత్రలతోనే ఒక ఫ్యామిలీ డ్రామాకి తెర తీద్దాం. విలన్ ప్రస్తుత భార్య - ‘కోడలిని తెచ్చుకునేది మనకున్న స్టేటస్ ని పెంచుకునేందుకు కాదు, మనకి లేని కూతుర్ని తెచ్చుకునేందుకు’  అని అందమైన డైలాగు పలికింది. ఎస్, ఫ్యామిలీ డ్రామాకి తెర తీద్దాం. అక్క పెళ్లి సంబంధం నేపధ్యంలో ఇటు హీరో- అటు విలన్ పరస్పరం ఒకరికొకరు తెలీక ఏం హాని చేసుకున్నారో, ఇంకేం  చేసుకోబోతున్నారో, ఆ పెళ్లి సంబంధం ఏమౌతుందో -ఎవర్ని ఎవరు క్షమించుకోవాలో, ఎవరికి  ఎవరేం నేర్పాలో- తక్కువ పాత్రలతో సిస్టర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ ని మానవ సంబంధాల చట్రంలో సూటిగా బలంగా ఎక్కిస్తూ- ఈ కథని నిలబెట్టొచ్చు.

***
    ‘సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండీ’  రామ్ చరణ్ గోల్డెన్ వర్డ్స్. తనకేం జరుగుతోందో తెలుసుకోవడానికి లోకజ్ఞానం కూడా అక్కర్లేదా? వచ్చిన వాడెవడో తెలుసుకోకుండా అక్కని విలన్ చేతుల్లో పెట్టేశాడు. సెకండాఫ్ ప్రారంభం కాగానే ఒక ఇంటలిజెన్స్ అధికారి వచ్చి ఆ వియ్యమందుకున్న విలన్ గుట్టు చెప్తే గానీ  హీరో తెలుసుకోలేకపోయాడు. ఇదీ హీరోయిజం. ఆ అధికారి- ఆ విలన్ రాజ్యసభ టికెట్ పొందకుండా ఆపడానికి అతడు చేస్తున్న నేరాలపై రుజువులు సంపాదించడం కోసం హీరోని నియమించాడు. హీరోకి పనేలేదు, గోల్ లేదు. రెండూ ఆ అధికారివే. ఆ అధికారి చేతికింద కిరాయి సైనికుడుగా హీరో వెళ్ళిపోయాడు. ఓన్ పవర్ వున్న ఫైటర్ గా కాదు. ఇందులో భాగంగా విలన్ ఇంట్లో చేరాడు కామెడీ కోసం. 

        ఇదీ విషయం. సింగిల్ విండో స్కీము ప్రకారం జర్రున జారుకుంటూ హీరో వెళ్లి విలన్ ఇంట్లో పడాలి కాబట్టి- అక్కడ ఒకర్నొకరు గుర్తుపట్టుకోలేని కన్ఫ్యూజ్ కామెడీతో ప్రేక్షకులకి కితకితలు పెట్టాలి కాబట్టి - అలా ఇంటర్వెల్లో ఇద్దర్నీ అనామకంగా వుంచేశారన్న మాట!

        ఇక ఆ  ఇంట్లో సమయానికి మాత్ర వేసుకోవాలన్నట్టు బ్రహ్మానందం ఎంట్రీ, ఇంకొందరు కమెడియన్ల ఎంట్రీ- ఈ బోలెడు క్యారక్టర్లనీ కలిపి విలన్ ని బకరా చేస్తూ- రచయితలకి, దర్శకుడికీ అలవాటైపోయిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ బ్రాండ్ కామెడీ వెర్షన్ కి శంకు స్థాపన చేయడం. సిస్టర్ సెంటి మెంటుని ఏటో పంపించెయ్యడం. 

        ఇందులోకి మళ్ళీ ఇంకో కథ విలన్ కోసం ఇరికిస్తూ, ఫ్రెంచి హిట్ కామెడీ ‘ది వాలెట్’ ని కాపీ కొట్టి పెట్టేశారు. ఇదే శ్రీను వైట్ల ‘దూకుడు’ లో జర్మన్ సినిమా ‘గుడ్ బై లెనిన్’ ని తెచ్చి ప్రకాష్ రాజ్ కోమా కథకి పెట్టేసుకున్నట్టు.

        కానీ ఒక్క ముక్కా ఈ సెకండాఫ్ కామెడీ అర్ధంగాదు. ప్లాట్ పాయింట్ -2 ఎక్కడుందో గుర్తు పట్టడం కూడా కష్టం. మాటిమాటికీ విలన్ ఏది ఎందుకు మాట్లాడుతున్నాడు, మాటిమాటికీ ఆ పథకాలేంటి బుర్ర కెక్కించుకోవడం చాలా కష్టం. బక్వాస్ తో బుర్ర వాచిపోతుంది. ఇక క్లయిమాక్స్ అంటూ మొదలెట్టిన ప్రహసనం ఫస్టాఫ్ లో కథనం లాగే, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడి-  ఇదిగో ముగిసిందీ అనుకోగానే మళ్ళీ విలన్ బతికి ఏదో చేయడం; అదిగదిగో ముగిసిందీ అనుకోగానే మళ్ళీ విలన్ బతికి, చిరంజీవి రావడం కోసం  హీరోయిన్ ని కిడ్నాప్ చేయడం, చిరంజీవి బుద్ధి చెప్పి వెళ్ళిపోగానే మళ్ళీ హీరోయిన్ ని పిప్పళ్ళ బస్తాలా ఎత్తుకెళ్ళి పోవడం...ఓ గాడ్..ఇంకా చెప్పుకోవడం మనవల్ల కాదు!!

        ఇంత లోపభూయిష్టమైన స్క్రీన్ ప్లే తో సినిమాని కాపాడుకోవడానికి చివర్న ఐస్ క్రీమ్ లా చిరంజీవిని రప్పించుకున్నారు కాబట్టి, ఇది  ‘ఐస్ క్రీమ్ ప్లే’. ఎం.ఆర్.పి : రెండుకోట్లు, ప(త)న్నులు అదనం. ఆల్ ది బెస్ట్.

-సికిందర్