రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, అక్టోబర్ 2015, శుక్రవారం

గుణశేఖరీయం!


        ‘రుద్రమదేవి’ సినిమా కథాకథనాల వెనుక మహా మహులుంటారు. ఏళ్ల తరబడి  దర్శకుడు చేసిన చరిత్ర శోధనా సారముంటుంది. ఆ సారమే ఎప్పుడూ కథా కథనాలకి ఆధారమవుతుంది. చరిత్రలోంచి ఆ పిండుకున్న సారమెలాటిదన్నది సినిమా గతిని నిర్ణయిస్తుంది. ఆ గతి సినిమా బలిమికీ, తద్వారా దాని చరిత్ర భాండాగార ప్రవేశార్హతకీ  దారి తీస్తుంది. చరిత్రని ఎత్తుకున్న సినిమా తానే  చరిత్ర అవడం కన్నా భాగ్యం  లేదు. ఎక్కడ్నించో వచ్చి ఒక అటెన్ బరో ‘మహాత్మాగాంధీ’ చరిత్రని ఎత్తుకుంటాడు. ఇంకెక్కడ్నించో వచ్చి ఒక త్రిపురనేని మహారధి ‘అల్లూరి సీతారామ రాజు’  జీవిత కథ ఎత్తుకుంటాడు. ఆ ఎత్తుకుంటున్నప్పుడు ఎంచుకున్న లేదా పిండుకున్న సారమెలాటిదో పరిశీలిస్తారు. ఆ సారంతో సినిమా చూసే ప్రేక్షకులకి ఏమైనా ప్రయోజనమా, స్ఫూర్తా అని కూడా ఆలోచిస్తారు. జీవిత చరిత్రల పరమార్ధమే అది. ఆ పరమార్ధానికి చేరువ కాని చిత్రణలతో చారిత్రక వ్యక్తులని పలచన చేయరు. అటెన్ బరో అయినా, మహారధి అయినా తామెత్తుకున్న చారిత్రక పురుషుల జీవిత చిత్రణల్ని అజరామరం చేశారు- ఎప్పుడు? వీఎఫెక్స్ ల టెక్నాలజీ కూడా లేని కాలంలోనే. ఎలా? ఆ చారిత్రక పురుషుల గాథల్లో పక్కాగా ఆత్మని పట్టుకునే. గాథలుగా ఆత్మని పట్టుకుని, కథలుగా ఆత్మని  పట్టుకుని కాదు. గాథల్లో  ఆత్మ దానికదే వుంటుంది. కథల్లో  ఆత్మని కల్పించుకుంటారు. గాథల్లో దానికదే ఏర్పడిన ఆత్మ ఉదాత్త చిత్రణలకి దారితీస్తుంది. కథల్లో కల్పించే ఆత్మ వ్యాపార యావతో వుంటుంది. వ్యాపార యావ కూడదని కాదు, జీవిత చరిత్రలో బిగ్ స్టార్ కాంబినేషన్లతో వ్యాపార యావే పరమార్ధమైపోతే అదొక సర్కస్ కంపెనీ అయిపోతుంది. గాథని కథగా కుదేసి ఆత్మని కృత్రిమంగా కల్పిస్తే అదొక ‘రుద్రమదేవి’ అనే కమర్షియల్ ఫార్ములా అవుతుంది. చరిత్రతో సిన్సియారిటీ సడలిన తాత్కాలిక బాక్సాఫీసు బిజినెస్ అవుతుంది.  మళ్ళీ భావికాలంలో ఏ థియేటర్ ప్రదర్శనలకీ నోచుకోలేని చెత్తబుట్ట చిరునామా నజరానాగా వుంటుంది. ఇవ్వాళ్ళ  ‘గాంధీ’ ని పట్టుకొచ్చి ఇలాగే  స్టీరియో స్కోపిక్ త్రీడీ ఎఫెక్ట్స్ తో నవీకరించి ప్రదర్శిస్తే మళ్ళీ మళ్ళీ ప్రేక్షకుల నుంచి జేజేలే అందుతాయి. ఇవ్వాళ్ళ ‘అల్లూరి సీతారామారాజు’ ని పట్టుకొచ్చి ఇదే డోల్బీ అట్మాస్ తో ఉన్నతీ కరించి ప్రదర్శిస్తే,  మళ్ళీ మళ్ళీ వహ్వాలే ధ్వనిస్తాయి ప్రేక్షకుల నుంచి.  
        
ఎందుకు?
          ఎందుకు?
          ఎందుకు?

***

       కనుక సారం- ఆత్మ- గాథ- స్ఫూర్తి- ప్రయోజనం అనే స్క్రిప్టింగ్ టూల్సే  చారిత్రక సినిమా సంగతులకి మూల కేంద్రాలవుతాయి. 13వ శతాబ్దపు లెజండరీ రుద్రమదేవి జీవితమంతా  యుద్దాలతోనే గడిచిపోయింది. ఆమె తండ్రి కాలంలో కూడా నిద్రంటూ పోని శత్రువులతో నిత్యపోరాటాలే. రాజ్యం మీద కన్నేసి ఎవడో ఒకడు శత్రు రాజు పనిగట్టుకుని కత్తి దూస్తాడు. వాడితో విసుగు లేకుండా ఆమె పోరాడి మట్టి కరిపించాలి. ఓరుగల్లు (వరంగల్) రాజధానిగా కాకతీయులది సుభిక్ష రాజ్యమే అయినా, పాలకులకి మాత్రం యుద్ధాలతో శాంతి లేదు. చివరికి తన 80వ యేట, నవంబర్ 27, 1289 న యుద్ధ రంగంలోనే నేలకొరిగింది రుద్రమదేవి. ఆ నేలకొరగడం కూడా వెన్నుపోటుతోనే. మహా టక్కరి శత్రువు అంబ దేవుడితో రెండు వారాల పాటు సాగిన ఆ యుద్ధంలో ఆ వయసులో కూడా అతడామెని ఓడించ లేకపోయాడు. ఓ రాత్రి పూట గుడారంలో పూజలు చేసుకుంటున్న ఆమె దగ్గరికి పూజారుల స్థానంలో తన మనుషుల్ని పంపించి వెనుక నుంచి పొడిచి చంపించాడు.  

        ఇక రెండో పాయింటు : క్రీ.శ. 1261 -89 మధ్య కాలంలో మూడు దశాబ్దాల పాటూ పరిపాలించిన ఆమె రాజ్యంలో ప్రజలకి ఏ  లోటూ రాకుండా చూసుకుంది. కరువు కాటకాలనేవి ఏర్పడకుండా చర్యలు  తీసుకుంది. దేశమంతా కలియదిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కరిస్తూ  వుండేది. తన కళ్ళ ముందే కాన్పులో ఓ స్త్రీ కన్ను మూయడంతో, తక్షణం గ్రామ గ్రామానా ప్రసూతి శాలలు కట్టించింది. వ్యవసాయం, వాణిజ్యం రెండిటినీ పట్టుగొమ్మలుగా తీర్చిదిద్దింది. సాగు నీటి కొరత లేకుండా పెద్ద పెద్ద చెరువులు తవ్వించింది. అప్పట్లో ఇటాలియన్ యాత్రీకుడు మార్కోపోలో చైనా నుంచి తిరిగి వెళ్తూ, కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించి, రుద్రమ దేవి పాలన అమోఘమంటూ శ్లాఘించాడు. ఇలా రాజకీయ సామాజిక ఔన్నత్యాలే కాకుండా, సాంస్కృతిక అభ్యున్నతికి కూడా కృషి చేసిందామె. సంగీత సాహిత్యాల్నీ, శిల్ప నృత్య కళల్నీ పోషించింది.  పేరిణీ శివతాండవమనే కొత్త నృత్య విధానం ప్రాణం పోసుకుంది ఆమె కాలంలోనే.

        మూడో పాయింటు : ఆ మధ్యయుగాల్లో  లింగ వివక్ష ఎలా ఉండేదో వేరే చెప్పనవసరం లేదు. ఒక ఆడది రాజ్యాధి నేత కావడాన్ని ఎవడూ అంగీకరించే పరిస్థితి లేదు. రుద్రమదేవి ఈ లింగ వివక్షని కూడా అనుభవించింది యుద్ధ పీడలకి తోడూ. సామంత రాజులు, శత్రు రాజులూ చివరికి దాయాదులూ అందరూ ఒకటై
,  ఆడదైన రుద్రమదేవిని ఎప్పుడెప్పుడు పదవీచ్యుతురాల్ని చేద్దామా అని కుట్రలు పన్నిన వాళ్ళే. ఈ పురుషాహంకారాన్ని కూడా  తిప్పికొడుతూ చివరి శ్వాసవరకూ పాలించింది.
         1) యుద్ధాల్లో గెలవడం 
         2) జనరంజకంగా పాలించడం
        3) పురుషాధిక్య భావజాలాన్నిమట్టు బెట్టడం
         - ఈ మూడు  ధీర లక్షణాలూ  రుద్రమదేవి జీవితపు పార్శ్వాలు. 

          ఈ మూడింటినీ సమదర్శనం చేసి స్పృశించకపోతే ఆమె చరిత్ర సమగ్రం కాదు. ఆమె చరిత్రని  ఎంత శోధించినా సారం- సందేశం- స్ఫూర్తి- ప్రయోజనం ఇవన్నీ పై మూడు పార్శ్వాల్లోనే ప్రతిఫలిస్తాయి.
        ఆమె పాలనని వెండితెరమీద ఆవిష్కరిస్తూంటే చూస్తున్న ప్రేక్షకులు  నేటి తమ నాయకుల తీరుతెన్నుల్ని బేరీజు వేసుకోగల్గాలి.  శత్రువులతో, సామంతులతో, దాయాదులతో ఆమె పోరాటాల్ని చూస్తూంటే, నేటి అధికార పార్టీల స్వపక్షంలో, ఆ అధికార పార్టీలకి విపక్షాలతో, చివరికి బంధువర్గంతో సైతం తలెత్తుతున్న రకరకాల సంఘర్షణలూ కళ్ళ ముందు కదలాడాలి. రాజ్యమేలే ఆడదిగా వివక్షని ఎదుర్కొంటున్న ఘట్టాల్ని చూస్తూంటే, జయలలితల్లో -మమతా బెవర్జీల్లో- మాయావతీల్లో- ఆ రుద్రమదేవి కన్పించి కళ్ళు తెరవాలి.  బేరీజు వేసుకునే దృష్టితో కాకపోతే చరిత్రని తీయడం, చూడడం, చదవడం ఎందుకు? చాలా శుద్ధ దండగ పని.
        ఈ మూడు పార్శ్వాలూ సినిమా కెందుకుండాలి? 
        ఆ చరిత్ర చెప్పే స్క్రీన్ ప్లే కి ఫౌండేషన్ ఇదే కాబట్టి. ‘ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్’ అన్న ప్రసిద్ధ గ్రంధంలో సిడ్ ఫీల్డ్  పేర్కొనే ప్రకారం, మహోజ్వల సృష్టి ‘గాంధీ’ కి స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు దర్శకుడు సర్ రిచర్డ్ అటెన్ బరో కి మహాత్ముడి జీవితంలో ఏ కోణాల్ని పట్టుకుని చిత్రించాలన్న సందేహం చాలాకాలం వేధించింది. అనేక శాఖోప శాఖలుగా విస్తరించి వున్న  మహావృక్షం లాంటి మహాత్మా గాంధీ జీవితాన్నంతా  ఎలా కాచి వడబోసి తెర క్కించాలి? ఆయన జీవితంలోని అన్ని ఘాట్టాలనీ చూపించడం సాధ్యం కాదు, మరెలా? అప్పుడు మహాత్ముడి జీవితంలోని ప్రధాన ఘట్టాల్లో మూడు  తన స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్ గా బలంగా  నిలుస్తాయని ఆయన గుర్తించాడు. అవి-
         1) దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా గాంధీ పోరాట జీవితం
        2) భారదేశానికి తిరిగి వచ్చి  చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం
        3) హిందూ ముస్లిం సమస్య
         -ఈ మూడు పార్శ్వాల్నీ స్పృశిస్తూ తెర కెక్కిస్తే  గాంధీ జీవిత చరిత్రకి సమగ్రత వచ్చేసింది! దీనికి బుకెండ్  ముగింపు (అంటే సినిమా ప్రారంభించిన దృశ్యం దగ్గరికే వచ్చి ముగించడం : ఫ్లాష్ బ్యాక్ కథనంతో)  గాంధీ హత్యా దృశ్యం!
        ఇలా జీవిత చరిత్రల్ని చిత్రానువాదం చేసే మార్గాన్ని సులభతరం చేసి చూపించాడు అటెన్ బరో. ఈ ఫౌండేషన్ నే ఫాలో అయి, అనిల్ కపూర్ నిర్మాతగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘గాంధీ మై ఫాదర్’  (2007) అనే క్లాసిక్ క్రియేషన్ లో, మహాత్ముడి తనయుడి యాభై ఏళ్ల జీవితకాల గమనానికీ విజయవంతమైన స్క్రీన్ ప్లే చేశాడు. 

         2007 లోనే శేఖర్ కమ్ముల తీసిన సూపర్ హిట్ ‘హేపీ డేస్’ లోనూ కాకతాళీయంగా ఈ స్క్రీన్ ప్లే ఫౌండేషనే కన్పిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఓ నాల్గేళ్ళ కాలం హేపీగా గడిపేసిన విద్యార్థుల అనుభవాల సారం ఈ సినిమా. ఇక్కడా గాంధీ జీవితం లాంటి సమస్యే. ఏం అనుభవాలు చూపించాలి? ఎన్నెన్ని అనుభవాలు చూపించాలి? వాటన్నిటినీ ఒక అర్ధవంతమైన కథగా ఎలా కూర్చాలి? అటెన్ బరో పూనినట్టే అప్పుడు శేఖర్ కమ్ములకి సులువు తెలిసిపోయింది. 
        1) కాలేజీలో ఫ్రెషర్స్ ఎదుర్కొనే ర్యాగింగ్
        2) వాళ్ళ చదువుల సమస్య
        3) వాళ్ళ ప్రేమల గురించిన స్ట్రగుల్ 
         -అనే మూడు బ్లాకులుగా ఆ నాల్గేళ్ళ టైం లైన్ ని విభజించి, వాటి తాలూకు అనుభవాల్ని గుమ్మరించుకుంటూ పోవడంతో-  కథగా చూస్తే సమగ్రంగా కన్పిస్తుంది, చూడకపోతే తన వెంట సాఫీగా తీసుకు వెళ్ళగల  అనుభవాల దొంతరలా వుంటుంది.
         రుద్రమదేవి చరిత్రకీ విజయవంతమైన స్క్రీన్ ప్లే ఫౌండేషన్ ఇదేనని బల్లగుద్ది చెప్పొచ్చు. పండు ముదుసలి వయసులో ఆమెని వెన్నుపోటు పొడిచే ఘట్టంతో ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి మొదట్నించీ ఆమె గాథంతా  చెప్పుకు రావచ్చు.
         ‘గాంధీ’ లో గాడ్సే గాంధీని చంపే సంఘటనతోనే ప్రారంభిస్తాడు అటెన్ బరో. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో కెళ్తూ  ఓ  దృష్టినాకర్షించే సంఘటన - (సౌతాఫ్రికాలో గాంధీజీని జాత్యాహంకారంతో  రైల్లోంచి తోసేసే సంఘటన) ని  ‘వెంటనే’ ఎత్తుకుంటాడు.  ఫ్లాష్ బ్యాక్ ని ఓపెన్  చేసే సరైన పద్ధతే ఇది. చెంఘీజ్ ఖాన్ చరిత్రతో రష్యన్ దర్శకుడు సెర్గీ బోద్రోవ్  తీసిన ‘మంగోల్’  (2007) లోనూ ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభిస్తూ, తొమ్మిదేళ్ళ చెంఘీజ్ ఖాన్ కి పెళ్లి సంబంధం చూసే ఆసక్తికర ఘట్టంతో ‘వెంటనే’ ఎత్తుకుంటారు. ఫ్లాష్ బ్యాక్ ఎత్తుగడ ఎప్పుడూ కథతో ‘వెంటనే’ కనెక్ట్ అవుతూ చురుకుదనంతోనే వుండాలి. అనగనగా ...అంటూ సోది చెబుతూ నిద్రపుచ్చ కూడదు. డైరెక్టుగా పాయింటు కొచ్చేయాలి. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ జీవితం ఆధారం గా 1995 లో సుప్రసిద్ధ దర్శకుడు ఆలివర్ స్టోన్ తీసిన ‘నిక్సన్’ ని కూడా ఫ్లాష్ బ్యాక్ తోనే ప్రారంభిస్తూ- నిక్సన్ జీవితంలో అత్యంత వివాదాస్పద ప్రధాన ఘట్టం వాటర్ గేట్ కుంభకోణపు ఒక దశతో ‘వెంటనే’ ఎత్తుకుంటారు. అంతేగానీ, జీవిత చరిత్ర ఫ్లాష్ బ్యాక్ అంటే, పుట్టుకతో మొదలెట్టి చావు దాకా తీరుబడిగా ఫ్యామిలీ వీడియో తీసుకుంటూ పోవడం కాదు. ఫోటో ఆల్బం తయారు చేసుకుని మురిసిపోవడం కాదు.
           ‘రుద్రమదేవి’ కి ఫ్లాష్ బ్యాక్ ని ప్రారంభిస్తూ వెంటనే నేరుగా,  రుద్రమ దేవిని మగపిల్లాడిగా పెంచుకుంటున్న ఆమె తండ్రి గణపతి దేవుడు,  ఆమె పద్నాల్గో ఏట ఆమెని రాజప్రతినిధిగా ప్రకటించే మహోత్సవంతో ప్రారంభించవచ్చు. ఆమె ఎందుకు మగపిల్లాడిగా పెరిగిందనే  దానికి రెండు మాటల్లో చెప్పేసి ముందు కెళ్ళి పోవచ్చు, అంతే. ఆ తర్వాత పైన చెప్పుకున్న-
        1) జనరంజక పాలన
        2) పురుషాధిక్య భావజాలం
        3) యుద్ధాలు 
        -అనే మూడు పార్శ్వాల్ని తడుముతూ సాగిపోవచ్చు. బుకెండ్ ముగింపుగా తిరిగి మొదట్లో చూపించిన అంబ దేవుడితో యుద్ధం దగ్గరికి వచ్చి, ఆమె నిర్యాణాన్ని హైలైట్ చెయ్యొచ్చు. ఎవరి చరిత్ర అయితే చెప్తున్నామో ఆ పాత్రని మించి మరో పాత్రని హైలైట్ చేసే చాపల్యానికి లోనుకాకూడదు.
***
   1983 లో కమాల్ అమ్రోహీ దర్శకత్వంలో హేమమాలిని- ధర్మేంద్ర లు  నటించిన ‘రజియా సుల్తాన్’ చరిత్రకి రుద్రమ దేవితో దగ్గరి పోలికలుంటాయి. 1205 లో జన్మించి 1240 లోనే ముప్పై ఐదేళ్ళకే తనువు  చాలించిన రజియా సుల్తాన్, ఓరుగల్లులో రుద్రమదేవి కంటే ఓ పాతికేళ్ళ ముందు, 1236 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది. నాలుగేళ్లే పాలించింది. ఆమె తండ్రి ఢిల్లీ సుల్తాన్ తాగుబోతు, తిరుగుబోతు అయిన కుమారుణ్ణి కాదని రజియాకి అధికారాన్ని కట్ట బెడదామంటే సామంత రాజులందరూ భగ్గు మన్నారు. ఆడది రాజ్యాలేలడ మేమిటని వ్యతిరేకించారు.  కానీ చిన్నప్పట్నించీ తండ్రి ఆమెని ఆడపిల్లగా చూడలేదు. అన్ని యుద్ధ కళలూ నేర్పాడు. అంతః పురంలో ఆమె ఎప్పుడూ జనానా మొహాల్ని చూడలేదు. కాబట్టి వాళ్లలాగా పరదా పాటించడం తెలీదు. మగ పిల్లాడిలానే పెరిగింది. తనని రజియా సుల్తానా అంటే కూడా ఒప్పుకునేది కాదు. సుల్తానా అంటే  సుల్తాన్ కి భార్యో  ప్రియురాలో అవుతుంది కాబట్టి,  తనని సుల్తాన్ గా పిలిస్తేనే  పలికేది. అలా ఆమె పేరు రజియా సుల్తాన్ గా స్థిరపడిపోయింది. అయినా లింగ వివక్ష అడ్డుగోడై,  విధిలేని పరిస్థితుల్లో ఆ చెడిపోయిన కొడుక్కే రాజ్యాన్ని అప్పగిస్తే, ఆర్నెల్లకే తల్లితో బాటు హత్యకి గురయ్యాడు. ఇంకా రజియా సుల్తాన్ ని తమ అధినేత్రిగా ఒప్పుకోక తప్పలేదు సామంతులకి. 
        రుద్రమ లాగానే రజియా సమర్ధ, జనరంజక  పాలకురాలు. తిరుగుబాట్ల తలనొప్పులు ఆమెకీ తప్పలేదు. ఆ తిరుగుబాటు దార్లని వాళ్ళల్లో వాళ్లకి తంపులు పెట్టి బలహీనపర్చడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞురాలిగా పేరు గడించింది. ఆమె బలహీనత ఒక్కటే. చిన్ననాటి నుంచీ తెలిసిన ఓ బానిసని ప్రేమించడం. ఆ బానిసకి కొలువులో కీలక పదవి కట్టబెట్టడం. ఇక సామంతులతో ఆమెకి దినదిన గండమే అయ్యింది. ప్రేమకావాలా, రాజ్యం కావాలా తేల్చుకోవాల్సిన పరిస్థితి...ఇక పతనమై, ఖైదు కూడా అయి, విడుదలై ప్రేమ వైపే మొగ్గి, ఆ బానిసనే పెళ్ళి చేసుకోవడంతో ఆమె చరిత్ర ముగిసింది.
        ఈ సినిమాలోనూ  కూడా మూడే పార్శ్వాలు కన్పిస్తాయి-
        1) రజియా పట్ల లింగ వివక్ష
        2) ఆమె పాలనా తీరు
        3) ప్రేమ కోణం
        -అనేవి
                                                     ***
      ‘రుద్రమదేవి’  సినిమాలో రుద్రమదేవి  పాత్రకి కన్పించే పార్శ్వాలేమిటో ఇక  చూద్దాం. ఎంత వెతికినా ఈ సినిమాలో రుద్రమ దేవి జీవితంలో దర్శకుడు దర్శించిన  పార్శ్వం ఒక్కటే. అది - ఆడది! ఆడది! ఆడది! రుద్రమదేవి ఆడది! ఇంతకి  మించి ఏమీకాదామె! ఆమె జీవితంలోంచి పన్నెండేళ్ళు రీసెర్చి చేసి దర్శకుడు పిండుకున్న సారం- ఆత్మ- గాథ- స్ఫూర్తి- ప్రయోజనం వగైరా వగైరా ఏదైతే అది- ఇదొక్కటే! ఆడదానికి సొంత వ్యక్తిత్వమా - హమ్మా- తప్పు కదూ అన్నట్టుగా!

        సినిమా సాంతం ఆమె ఆడతనాన్ని ఒక ఇష్యూ చేసి, సినిమాలోని పాత్రలకంటే కూడా దర్శకుడే ఎక్కువ వివక్ష ఫీలవుతున్నట్టు; ఆమెని ఎదగనివ్వకుండా, స్వతంత్రంగా రాజ్యాన్నేల నివ్వకుండా, నిర్ణయాలు తీసుకోనివ్వకుండా, అడుగడుగునా అడ్డుపడుతూ, ముగ్గురు మగాళ్ళ సహాయంతో పాలించిన, యుద్ధాలు చేసిన అబల అన్నట్టుగా గా చిత్రించిన వైనం ఇందులో కన్పిస్తుంది.  ‘ఈ ప్రజలకోసం నా ఆడతనాన్ని, సుఖాలనీ చంపుకుని నిలబడ్డాను’  అని ఏ బలహీన క్షణం లోనైనా రుద్రమ దేవి అని ఉంటుందా? ఒక నాయకురాలు అనే మాటేనా ఇది? మామూలు ఫిక్షన్లో అయినా ఎవరైనా ఇలా రాస్తారా?
        
        గ్లామర్ క్వీన్ అనూష్కా ని అడ్డు పెట్టుకుని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోలాగా, పాత్ర ఆడతనాన్ని వీలయినంత ఎక్స్ ప్లాయిట్ చేయడమే, కామోద్రేకాల్ని రెచ్చగొట్టడమే ఆద్యంతం కన్పిస్తుంది. పుట్టిన ఆడశిశువు జననాంగాల్ని కూడా క్లోజప్ వేసి చూపించడంతో మొదలెట్టి ( చాలా నిగ్రహం తప్పిన, అభ్యంతరకర  చిత్రణ), మగవేషంలో వున్న రుద్రమదేవి పాత్ర చీటికీ మాటికీ గదిలో కెళ్ళిపోయి కవచం తొలగించి, అద్దం వైపు తిరిగి పృష్ఠబాగాన్ని నగ్నంగా ప్రదర్శిస్తూ, ఎద భాగాన్ని పరిశీలించుకోవడమే కన్పిస్తుంది.  కౌమార దశ నుంచీ ఇదే వరస. పద్నాల్గేళ్ళ వయసులో వున్నప్పుడు, ఎవడో అర్ధనగ్న విగ్రహం చూపిస్తూ, సెక్సీగా అంగాంగ వర్ణ చేస్తూంటే - ఆ ఆవయవాలు తనలో చూసుకుంటే తప్ప తను ఆడది అని తెలుసుకోలేక పోయిందట ఓ అమ్మాయి! అప్పుడు తెలుసు కోవడమే కాదు,  వెంటనే సమర్తాడేసింది కూడా ఆ దెబ్బకి! కాళ్ళ  మీద ఆ రక్తం పడిన వైనాన్ని  రెండు సీన్లవరకూ లాగిలాగి చూపించడం కూడా! ఎక్కడ ఎంత వీలయితే అంత కామోద్రేకాల్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనుకోవడమే ఈ సినిమాతో  పెట్టుకున్న గోల్ అన్నట్టు వుంది.
        
         చెలి కత్తెలతో చెరువు గట్టు సీనొకటి! ఎంతసేపూ ఈమె మగాడు కాదు, ఆడదే అన్న నిజం ఎప్పుడెప్పుడు బయట పడుతుందా అన్న ఎజెండాతోనే కథనీ, పాత్రనీ నడపడం!

చూసుకోవో  తీసుకోవో
ఏమి కావాలో వచ్చి పుచ్చుకోవో
విందు ఉందోయి పొందు ఉందోయి
గుప్పిట్లోనే నీ గుట్టు పట్టుకోవోయీ..’
  అనే అశ్లీల  పాటతో  బాటు- 

అంతఃపురంలో అందాల చిలుక -
సందేహమేలనే అంతగా-
అంబర మేలగా అడ్డు
ఎవరు నీకిక..’
అనే బాధ్యత మర్చిన  పాటా- 

‘పున్నమి పువ్వై వికసిస్తున్నా 
వెన్నెల గువ్వై విహరిస్తున్నా..’
అని అవతల ప్రపంచం కొట్టుకుపోతున్నా నీరో చక్రవర్తిలా పట్టనట్టు మరో విరహం పాటా..
        
        ఉన్న ఐదు పాటల్లో మూడు ఇవే వుండేసరికి చూపించాలనుకున్నది  వీరగాథా కాదనీ,  పచ్చిశృంగార కథే అనీ తేలుతోంది.
***

     కథే అనడానికి సాక్ష్యం వుంది- ఈ స్టోరీ లైన్ ని చూసినా, స్టోరీ లైన్లో వుండే ప్లాట్ పాయింట్స్ ని చూసినా, ఇవి ఏ పాయింటుని ఆధారంగా చేసుకుని ఏర్పడ్డాయో, ఏ పాయింటు మీద ఈ కథంతా నడుస్తోందో తెలిసిపోతుంది.  మొదట  ఆడశిశువు జననం, ఆమె మగ పిల్లాడిగా ఎదగడం- (ఇది బిగినింగ్),  తను ఆడపిల్ల అని తెలుసుకోవడం- (ఇది ప్లాట్ పాయింట్-1)-అయినా మగవాడిగానే నటిస్తూ పాలన చేయడం, ఆడపిల్లగా విహరిస్తున్నప్పుడు నిడదవోలు  సామంత రాజు దృష్టిలో పడ్డం, అతడామె రుద్రమ దేవుడే అని గుర్తించకుండా, ఆ అదృశ్య సుందరిని ప్రేమించడం, అతణ్ణి సస్పెన్స్ లో పెట్టి తనూ ప్రేమలో పడ్డం- ( ఇది మిడిల్లో జెండర్ ఐడెంటిటీ స్ట్రగుల్ తో సంఘర్షణ),  తను ఆడపిల్లే అన్ననిజం బయట పడ్డం- ( ఇది ప్లాట్ పాయింట్ -2), దీన్ని ఓర్వలేని శత్రువు లందరూ యుద్ధానికి దిగడం - ( ఇది ఎండ్- క్లయిమాక్స్). 

        కనుక ఏ పాయింటు చుట్టూ  ఈ కథంతా నడిచింది? ఏ మలుపులు ఈ కథని ముందుకు నడిపించాయి? ఏ మలుపు ముగింపుకి దారితీసింది? అన్నీ ఆడతనాన్ని దాచిపెట్టే రహస్యంతోనే!   దాని తాలూకు దోబూచు లాటలతోనే. ఆ దోబూచులాటల్లోంచి సాధ్యమైనంత శృంగార (అశ్లీల) రసాన్ని పిండుకోవడంతోనే! ఈ స్క్రీన్ ప్లే కుట్లు విప్పదీసే కొద్దీ బయటపడే నిజాలివే కనిస్తున్నాయి. 

        ఉదాత్త గాథలా తీయాలనుకుని వుంటే ఆడతనమనే పాయింటే  వుండదు. అటువంటి ప్లాట్ పాయింట్సే వుండవు. రుద్రమదేవి జీవితం ప్రేమ చుట్టూ తిరగలేదు. రజియా సుల్తాన్ జీవితంలో మొదటినించీ ప్రేమ కూడా ఒక కోణమైనట్టు రుద్రమదేవికి అలా లేదు. కానీ ఇక్కడ ఆడతనపు రహస్యాన్నీ, ప్రేమనీ ప్రధానం చేసి - కమర్షియలైజ్ చేసి- మిగిలిన మూడు పార్శ్వాల్నీ గాలికి వదిలేశారు. ఏమంటే ఆమె చెరువులు తవ్వించినట్టు, రోడ్లు వేయించినట్టు వాయిసోవర్ తో నాలుగు యానిమేషన్ బొమ్మలేసి చూపించేసి సరిపెట్టేశారు. కళల్ని, సాహిత్యాన్నీ ఎలా పోషించిందో రసపోషణతో కూడిన చిత్రణే లేదు. ‘ఆదిత్య 369’  లో శ్రీకృష్ణ దేవరాయలి దర్బారులో ఆ కవి సమయాలు లేకపోయివుంటే, ఎంత డ్రైగా దర్శనమిచ్చేదో ఆ సినిమా చెప్పనవసరం లేదు.

        రెండో పార్శ్వం పురుషాధిక్య భావజాలం : దీన్నిఎక్కడా ఎప్పుడూ ప్రశ్నించదామె. అలాటి భావజాలాన్ని తుంగలో తొక్కి ముందుకు సాగిపోతున్న ఒక్క దృశ్యమూ లేదు. వాదోపవాదాలు, బోలెడు ఖండన మండనలు చేసుకునేది కోటలో ఇతర పాత్రలే. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ మంత్రి పాత్రదే హల్చల్. నిర్ణయాలూ, చాంతాడంత వ్యూహ ప్రకటనలూ అన్నీ తనవే. ఆమె ఆడతనానికీ ప్రేమకూ మాత్రమే పరిమితం. కమర్షియల్ సినిమాల్లో  ఆర్టిస్టుని బట్టి పాత్ర, డైలాగులు ఎలా రాసుకుంటారో- అలా ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ ఆర్టిస్టు కాబట్టి ఆయనకి ఆ బిల్డప్పులు, ఆ డైలాగులు. అలాగే కమర్షియల్ సినిమాలలో  హీరోయిన్ అందాలు ఆరబోసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఎలా వుంటుందో అలా అనూష్కా. 

        మూడో పార్శ్వం,  యుద్ధాల దగ్గరి కొచ్చేసరికి ఆమె తన ప్రేమికుడైన నిడదవోలు సామంత రాజుని ఆదేశించడమో, లేదా గోన గన్నా రెడ్డి మీద ఆధార పడడమో చేస్తుంది. క్లయిమాక్స్ లో నైతే పద్మవ్యూహంలో చిక్కుకుని దిక్కులు చూస్తుంది. గన్నారెడ్డి వచ్చి రక్షిస్తాడు. అసలు ఇంటర్వెల్ దగ్గర గన్నారెడ్డి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పట్నించి మరీ పాసివ్ గా మారిపోతుందామె. తన బాగోగులు చూసుకునే, తన పోరాటాలు మీదేసుకుని చేసే, తన నిర్ణయాలు శ్రమించి తీసుకునే వాళ్ళంతా కోట లోపలా బయటా బోలెడుమంది వుండగా-  ఎండ కన్నెరగని కన్యగా అంతఃపురంలో తియ్యటి ప్రేమ ఊహలతో, పాటలతో పడుండక తనకెందుకట తలనొప్పి-  అన్నట్టు తయారయ్యింది వీరనారి గాథ- సారీ- కథ!  

        ఇక సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్-2 వరకూ కథ ఎంతకీ కదలక, యాక్షన్ లోకీ  దిగక, దిగడానికి విషయమూ లేక, ఏవేవో మనం ఫాలోకాలేని భారీ డైలాగులతో, వ్యూహాలతో, కుట్రలు మాటాడుకోవడంతో, ఇష్టం వచ్చిన ఊహాగానాలతో నిండిపోతుంది. ఆశ్చర్యకరంగా ఇన్ని పదుల కోట్లు ధారబోసి తీస్తున్న సినిమాకి  టైం అండ్ టెన్షన్ ఫ్యాక్టర్ ని పట్టించుకోనే లేదు. ఏమో, ఇంకా ముందు ప్లాట్ పాయింట్ -2 దగ్గర ఆమె ఆడదే అని బయటపడే దాకా, ఏం చెయ్యడానికీ విషయమే లేదు కాబట్టి-  ప్రేక్షకుల సహనాన్ని ఇలా పరీక్షకి పెట్టి కాలక్షేపం చెయ్యక తప్పలేదేమో!

        రుద్రమదేవి  చరిత్రని  గాథగా కాకుండా కథగా చేశారు కాబట్టి, ఈ కథతో ప్రేక్షకులకి ఆడతనం (సెక్సప్పీల్)  పాయింటుతో గాలం వేస్తున్నారు కాబట్టి, ఆ పాయింటు ఎక్కడైతే పూర్తయ్యిందో  అక్కడే కథని ముగించేసి అసంపూర్ణ చరిత్ర చూపించాల్సి వచ్చింది!

        ఇది కమర్షియల్  రొమాంటిక్- యాక్షన్ మూవీ (కథ) కాబట్టి, ఓపెనింగ్ బ్యాంగ్ ఏమని ఇచ్చారో ఆ బ్యాంగ్ కి ఎదురు బ్యాంగ్ ఇచ్చే ముగింపే శరణ్య మయింది.  ఓపెనింగ్ బ్యాంగ్ ఏమిటి? కాకతీయ వంశంలో పుట్టింది మగపిల్లాడు అని ప్రకటన వెలువడడంతో ఆవతలి దేశపు రాజు (విలన్) పిచ్చెత్తి పోతాడు. మగపిల్లాడు పుడితే ఏమయ్యింది? వాడు తనకెలా అడ్డు? వాడు పెరిగి చేతికొచ్చే టప్పటికి పది యుద్ధాలైనా చేసి గెలవచ్చు కదా కాకతీయ సామ్రాజ్యాన్ని. ఇప్పుడే ఏదో కొంప లంటుకున్నట్టు- నిస్సహాయంగా ఆ పెడ బొబ్బలేమిటి? చరిత్రని నాటకీయత కోసం కొంత కల్పన చెయ్యొచ్చు- అదిలా  అభూత కల్పన ఐపోకూదడుగా?

        ఇప్పుడు పాతికేళ్ళ తర్వాత క్లయిమాక్స్ లో రుద్రమ దేవుడు ఆడదని తెలిశాక, యుద్ధానికొచ్చేస్తాడు విలన్ మహాదేవుడు. అతణ్ణి గన్నారెడ్డి చంపబోతూ ఆ చంపే ఛాన్స్ ని  దయతలచి ఇచ్చినట్టు రుద్రమ దేవికిస్తాడు..లేకపోతే కథకూడా ఆమె ముగించినట్టు వుండదు. పరువుపోతుంది. 

        ఇక్కడితో కథ ముగిసింది. కానీ  రుద్రమదేవి  చరిత్ర ఇంకా వుంది. ఇంకో ఐదు దశాబ్దాలపైబడి ఆమె జీవితం వుంది. అదంతా సినిమాగా కుదరదని మహాదేవుడితో యుద్ధం దగ్గర ముగించి నట్టున్నారు. ఒక చారిత్రక వ్యక్తి  జీవితాన్నంతా చూపించాలని కూడా లేదు. ఒక ‘నిక్సన్’ లాగా, ఒక ‘గాంధీ మై ఫాదర్’  లాగా జీవితంలో ఒక ఘట్టాన్నో, ఒక కొణాన్నో చూపించ వచ్చు. 2012 లో ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ జీవితం మీద తీసిన సినిమా ‘హిచ్ కాక్’  అనే దాన్ని ఒక ఘట్టం గురించే చెప్పి ముగించారు. ఎటొచ్చీ ఆ ఘట్టానికి చారిత్రక ప్రాధాన్యం వుండాలి. లేదా చరిత్రలో మరుగున పడిపోయిన అంశాన్ని రీసెర్చితో వెలికి  తీసి  చూపించాలి. 

        రుద్రమదేవి సినిమాలో చూపించిన ఆడతనపు రహస్యానికి ఏ చారిత్రక ప్రాధాన్యం వుందని? అదేదో చరిత్రలో మరుగున పడిపోయిన చిదంబర రహస్యం కూడా కాదే? ఈ అప్రధాన ఘట్టాన్ని సాగదీసి సాగదీసి తీయడంలో  ఉద్దేశమేమిటి? అటెన్ బరో కూడా మొత్తం ఎనభై ఏళ్ల గాంధీ జీవితమంతా కాకుండా- ఓ న్యాయవాదిగా గాంధీ జీవిత ఘట్టాన్ని మాత్రమే తీసుకుని సినిమా నిర్మించలేదే?  ‘మంగోల్’ లో మొత్తం చిన్నప్పట్నించీ చెంఘీజ్ ఖాన్ జీవితమంతా చూపించు కొచ్చారుగా? ‘రుద్రమదేవి’ కి ఎందుకు సాధ్యం కాదు- ఉయ్యాల్లో బోసినవ్వుల కాడ్నించీ గుడారంలో నిర్యాణం వరకూ? ఏంత గొప్పగా వుండేది? కేవలం ఆ సెక్సప్పీల్ బావుందని ఆడతనపు డ్రామానే ప్రధానం చేసి చరిత్ర చెప్పడమేమిటి?

        ఇంకో  క్రియేటివిటీ కూడా ప్రదర్శించారు. దీనికీ కథాపరంగా సపోర్టు లేదు. ఏమిటంటే,  ఈ కథంతా మార్కోపోలో తన ఇటలీ దేశపు రాజులకి (ఫ్లాష్ బ్యాక్) చెప్పుకొస్తాడు. కాబట్టి తను యాత్రేకుడిగా ఎంత చూశాడో, ఏం తెలుసుకున్నాడో అంతవరకే చెప్పగలడు. రుద్రమ నిర్యాణం వరకూ చెప్పే ప్రసక్తే రాదు. అయితే ఈ సినిమాలో చూపించిందాని ప్రకారం అంత గొప్పగా ఫీలై చూసిందేమిటి రుద్రమదేవిలో? ఏముందని ఈ కథలో ఆమె సమర్ధ రాజకీయ, వీరపరాక్రమ గుణగణాల గురించి చెప్పుకోవడానికి? అయినా మార్కో పోలో చెప్పడం ముగించగానే, ఇటలీ రాజులు  తాము కూడా రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకుని కూతుళ్ళకే పట్టాభిషేకం చేస్తామని శపధాలు చేయడం హాస్యాస్పదంగా లేదూ? సినిమా సాంతం ఎలా వున్నా, ఫినిషింగ్ టచ్ కూడా నవ్వుకునేలా వుంటే ఎలా? ఈ స్థాయి సినిమా ఇంటలిజెంట్ రైటింగ్ ని కదా డిమాండ్ చేస్తుంది. పరిశోధనతో పోటీ పడాలి కదా ఫలితం.  

                                                ***
         గుణశేఖర్  తీవ్రంగా అలసిపోయినట్టు కన్పిస్తారు తెరవెనుక ఈ సినిమాకి. ఆయన తలకి మించిన భారాన్ని మోశారు. పైగా ఆయన గత  ‘నిప్పు’ తోనే పూర్తిగా అలసిపోయారు. చదువుకున్న రుద్రమదేవి చరిత్రకూడా కూడా ఆయనలో నిప్పుని రాజెయ్యలేక పోయింది. మేకింగ్ పరంగానూఎన్నో లోపాలు, ఒడిదుడుకులూ. చరిత్రని రీసెర్చి చేశామన్నారు. రీసెర్చి చేసి కనుగొన్న గరంగరం కథాసా(గ)రం  ఏమిటో తెలుసుకున్నాం. వదిలేద్దాం. కానీ ఆ కాలపు వస్తు సామగ్రిని, ఆచార వ్యవహారాల్ని, వివిధ వృత్తులూ వగైరాల్ని రీసెర్చి చేసినట్టు లేదు. కోటలూ కత్తులూ, కట్టుబట్టలూ, తినే పళ్ళేలూ,  తాగే గ్లాసులూ, తొంగునే పడకలూ అన్నీ డిజైనర్ సరుకే. కృత్రిమ కాకతీయ వైభవం. దీనికి తెలంగాణా ప్రభుత్వపు వినోదపు పన్ను మినహాయింపు. ఆంధ్ర ప్రభుత్వానికి ఏ వినోదమూ పట్టలేదు. వినోదం చూస్తోందంతే.     

        ఇళయరాజా సంగీతం కూడా విఫలమవడానికి కారణం ఆయనకీ తగినంత సరుకు కన్పించకపోవడమే. ఈ చరిత్ర ఒక గాథగా నిర్మాణం జరిగివుంటే- ఆ రుద్రమదేవి కేంద్ర బిందువై- ఆవేశాన్ని రగిలించే బలమైన సన్నివేశాల్ని ఆమె నడిపించుకుంటూ పోతూంటే, ఆ పాత్ర ప్రయాణాన్ని మరింత ఎలివేట్ చేసే, మనల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే,  థీమ్ మ్యూజిక్ తో సంగీతపరంగా ఇళయరాజా ఆత్మని పోసినంత  పని చేసేవారు.  ‘నాయకుడు’ సినిమాని ఇప్పటికీ మర్చిపోలేనంతగా ఆయన కూర్చిన ‘ఎవరు కొట్టారు’ థీమ్ మ్యూజిక్ ఉండనేవుంది.

        ఒక మహాచరిత్రకి చాలని కథతో, చాలని బడ్జెట్ తో, అల్లుఅర్జున్ పుణ్యాన ఒక మంచి మాస్ కమర్షియల్ గా బాక్సాఫీసు విజయాన్ని చవిచూసి ఉండొచ్చు- కానీ ఈ సినిమాని తీసే విధానం మాత్రం ఇది కాదు. ఇలా తీసినా సక్సెస్ అవుతున్నాయి కదా అంటే, ఇక చరిత్రలన్నీ కామెడీ లవుతాయి. సినిమా చివర్న ‘ప్రతాపరుద్రుడు’  సీక్వెల్ ఉండొచ్చని హింట్ ఇచ్చారు. అందులో రుద్రమదేవి తతిమ్మా జీవితాన్ని చూపిస్తారేమో  తెలీదు. అలా సెకండరీ క్యారక్టర్ గా చేసి చూపించడం అన్యాయమే. మొత్తానికి చదివిన చరిత్రని చాలా గజిబిజి గందరగోళం చేసుకుని- చరిత్రకి పట్టం గట్టడం కోసం తానుగా తీసుకున్న ఈ సినిమా తీసే బంగారు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు గుణశేఖర్.


- సికిందర్
         



       
       


                
          

13, అక్టోబర్ 2015, మంగళవారం





రచన -దర్శకత్వం- నిర్మాణం :  గుణశేఖర్ 

తారాగణం : అనూష్కా, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, సుమన్, ఆదిత్యా మీనన్, విక్రం జిత్ విర్క్, కేథరిన్ ట్రెసా తదితరులు
సంగీతం : ఇళయరాజా
,  ఛాయాగ్రహణం : అజయ్ విన్సెంట్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : గుణా టీం వర్క్స్
విడుదల : అక్టోబర్ 9
, 2015

***

             పెద్ద బడ్జెట్  సినిమా వసూళ్లు సాధించుకోవడానికి కనీసం ఓ రెండు వారాలు కూడా గ్యాప్ లేకపోతే రిస్కే. ‘రుద్రమదేవి’ బాలారిష్టాల్ని దాటించి ఎట్టకేలకు ఎందరో మోసి విడుదలకి నోచుకునేలా చేసినా, పోటీ సినిమాల విడుదల వెన్నంటే వుండడాన్నినివారించలేక  పోయారు.మరుసటి వారమే  రామ్ చరణ్- శ్రీను వైట్లల ‘బ్రూస్ లీ’,  మళ్ళీ ఆ పైవారమే  అఖిల్- వి.వి. వినాయక్ ల ‘అఖిల్’  అనే మరో రెండు భారీ కమర్షియల్సూ వచ్చి పడుతూండడంతో  ‘రుద్రమదేవి’ బ్రీతింగ్ స్పేస్ అనేది లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడి ఎనభై కోట్లని చెప్పుకుంటున్నా, 50 కి మించి ఆవదని నిపుణులు అంటున్నారు. సీజీ క్వాలిటీని చూస్తే   తెలిసిపోతోంది. ఈ యాభై కూడా ఒక్కవారంలో వెనక్కి రావడమెలా అన్నది ఇప్పుడు ప్రశ్న. క్యూకట్టి వున్న పై  రెండు పెద్ద కమర్షియల్స్ తో పోటీని తట్టుకో గల్గితే  ఫర్వాలేదు-  ఐతే అలా తట్టుకునే శక్తి వుందా దీనికి? 

             ప్రేక్షకులు భలే  ఎమోషనల్ జీవులు. ఒక్కోసారి సినిమా బాగోగులతో సంబంధం లేకుండా భారీ సినిమాలకి ఓపెనింగ్స్ ని భారీగానే ముట్టజెప్పేస్తారు.  స్టార్ బ్యాగేజితో అట్టహాసంగా తమ ముందు కొచ్చేసిన ‘రుద్రమదేవి’ కి తొలి మూడు రోజుల్లో  26.10 కోట్ల గ్రాస్ ని అందించేశారంటే, వాళ్ళ భావోద్వేగాలు ఏ స్థాయిలో వున్నాయో ఊహించుకోవచ్చు. కాబట్టి భారీ సినిమాలు నిర్మించడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదనుకోవచ్చు. విషయపరంగానూ తీవ్రంగా కష్ట పడిపోనక్కర లేదని కూడా  అనుకోవచ్చు. బుద్ధిజీవుల కోసం భారీ కమర్షియల్స్ ని తీయరు. అయితే ఒకజాతి గర్వించదగ్గ చరిత్రతో కూడిన సినిమాని కూడా మైండ్ ని అప్లయ్ చేయకుండా, మసాలా సినిమాలా తీసెయ్యొచ్చా అన్నది ఆ దర్శకుడే  వేసుకోవాల్సిన ప్రశ్న. 

          నిజానికి దర్శకుడు గుణశేఖర్ కి చరిత్ర అవకాశామివ్వలేదు గానీ, మామూలు కమర్షియల్స్ తో వరస ఫ్లాపులు చవిచూసి విసిగిపోయి, ఆపద్ధర్మంగా తనే ఓ చారిత్రిక అవకాశాన్ని సృష్టించుకుని, ‘రుద్రమదేవి’ అనే మహాయజ్ఞానికి సమకట్టారు. దీనికి బాక్సాఫీసు క్షమించినంతగా చరిత్ర కూడా క్షమిస్తుందా, లేకపోతే ఇది ఇలావచ్చి అలా జనం మర్చిపోయే చెత్తబుట్ట దాఖలు బాపతు మరో విఫల యత్నమేనా ,  ఓ సారి ఈ కింద చూసుకుంటూ వెళ్దాం..

 దేవియే దేవుడుగా! 
         కాకతీయ సామ్రాజ్య చరిత్రలో  రాణీ రుద్రమ దేవి  (పాలనా కాలం 1261–1289)  పోషించిన పాత్ర తాలూకు చిత్రణ ఇది.  రుద్రమదేవిగా అనుష్కా ఇందులో కన్పిస్తుంది. రుద్రమ దేవి పుట్టే టప్పటికే రాజ్యానికి చాలా ప్రమాదాలు పొంచి వుంటాయి. శత్రు రాజులు, దాయాదులూ రాజ్యాన్ని కబళించాలని చూస్తూంటారు. అప్పటికే ఒక కూతురున్న రాజు గణపతి దేవుడు (కృష్ణం రాజు) తన వారసత్వాన్ని కొనసాగించే  మగ సంతానం లేకపోవడంతో శత్రువుల దృష్టిలో బలహీనపడతాడు. అలాంటప్పుడు మగసంతానం కోసం ఎదురు చూస్తూంటే ఆడపిల్ల రుద్రమ దేవి పుడుతుంది. ఈ విషయం పొక్కిందంటే, శత్రువులు విజృంభిస్తారు. దీనికో ఉపాయం చెప్తాడు మంత్రి శివ దేవయ్య (ప్రకాష్ రాజ్ ). పుట్టింది మగ సంతానమని ప్రకటించమంటాడు. పుట్టిన పిల్లని రుద్రమ దేవుడిగా పెంచుదామంటాడు. కోటలోనే పాగావేసి కుయుక్తులు పన్నుతున్న దాయాదులు హరిహర దేవుడు ( సుమన్), మురారీ దేవుడు ( ఆదిత్యా మీనన్) లకి  సైతం ఈ విషయం  తెలియకుండా దాచాలంటాడు. అలాగే ప్రకటన చేస్తాడు గణపతి దేవుడు. 

               ఇది తెలుసుకుని శత్రు దేశపు రాజు మహాదేవ నాయకుడు ( విక్రం జిత్ విర్క్) పిచ్చెక్కిపోతాడు. ఇటు మగపిల్లాడిలా పెరుగుతున్న రుద్రమదేవికి నిడదవోలు సామంతరాజు చాళుక్య వీరభద్ర ( దగ్గుబాటి రానా),   మరో దివంగత సామంత రాజు గోన బుద్ధా రెడ్డి కొడుకు గన్నారెడ్డి (అల్లు అర్జున్) లు స్నేహితులుగా ఏర్పడతారు. గన్నారెడ్డి పెద్దయ్యాక బందిపోటుగా మారి  ప్రజల్ని దోచుకుంటున్నాడని ప్రచారం జరుగుతూంటుంది. తన తండ్రిని చంపి గణపతి దేవుడి  పంచన చేరిన అన్నల మీద కక్షతో ఉంటాడు గన్నారెడ్డి. ఇటు ‘యువరాజు’ గా ఎదిగి తండ్రితో కలిసి పరిపాలిస్తూ చెరువులు తవ్వించీ, పన్నులు మాఫీ చేయించీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూంటుంది రుద్రమ దేవి. కక్షతో ఈమె పాలనకి ఆటంకాలు సృష్టిస్తూంటాడు మహాదేవ నాయకుడు. 

            ఈ నేపధ్యంలో రుద్రమదేవి ఆడపిల్లన్న సంగతి ఎలా ఎప్పుడు బయటపడింది, అప్పుడు ఎలాటి విషమ పరిస్థితులు ఏర్పడ్డాయి, వాటినామె ఎలా ఎదుర్కొంది; వీరభద్రుడు, గన్నారెడ్డి లు ఆమెకెలా తోడ్పడ్డారు మొదలయిన అంశాలతో మిగతా కథ సాగుతుంది.


ఎవరెలా చేశారు 
        ఇప్పుడున్న తారల్లో రుద్రమదేవి పాత్రలో అనూష్కా ని తప్ప మరొకర్ని ఊహించలేమన్నది నిజమే. రుద్రమ దేవుడుగా పురుష పాత్రలో, రుద్రమదేవిగా స్త్రీ పాత్రలో రెండింటిలోనూ కన్పిస్తుంది అనూష్కా. రాజరికపు వీరత్వంతో కాఠిన్యంతోనూ, ప్రేమలో పడిన కుమారిగా సౌకుమార్యంతోనూ కన్పిస్తుంది. రుద్రమదేవి నిజజీవితంలోనే కొంతకాలం పురుషుడి వేషంలో వున్న స్త్రీగా జీవించిందన్న స్పష్టత వుంది కాబట్టి  ఇంతవరకూ మాత్రం ఏ కన్ఫ్యూజనూ లేదు అనూష్కాకి. 

          ఫస్టాఫ్ గడిచి సెకండాఫ్ లో తను స్త్రీ అన్న విషయం ప్రపంచానికి తెలిసిపోయాకే, ఫైనల్ గా ఆ కీలకమైన స్త్రీ పాత్రతో ఉండాల్సిన అసలు నటనంతా నీరుగారిపోయింది. ఇక్కడ్నించీ కథ ఇతర పాత్రల చేతుల్లోకి వెళ్లిపోవడంతో, ఇంకా క్లయిమాక్స్ లో కొచ్చేసరికి  పూర్తిగా కథ అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర వశమైపోవడంతో,  చేష్టలుడిగినట్టు కన్పిస్తుంది అనూష్కా. ఎంతగానంటే, ఈ కథకి తాను ముఖ్య పాత్ర కానంతగా. ఆయా సీన్లలో తనెందుకుందో అర్ధంగానంత తికమకగా. 

          దీనికి తోడూ అప్పీరియన్స్ కి కంటిన్యూటీ సమస్య కూడా ఎదురయ్యింది. ఎప్పుడో 2013 లో ఈ సినిమాని ప్రారంభించిన నాటి నాజూకుదనంతో సినిమా సాంతం కన్పించదు. సెకండాఫ్ గడుస్తున్న కొద్దీ బరువెక్కిపోతూ  కన్పిస్తుంది. 2013 నాటి అనూష్కా -2015 నాటికి ఎలావుందో ఫిజికల్ ఫీచర్స్ పరిణామక్రమాన్ని రికార్డు చేస్తుంది ఈ సినిమా. ఈ కథ అనూష్కా పాత్రని  కేంద్రంగా చేసుకుని  నడవక పోవడంతో ఓవరాల్ గా చూస్తే తను చేసిందేమిటో అంతగా గుర్తుకు రాదు. అంటే నటిగా తను విఫలమైనట్టు కాదు. పాత్ర చిత్రణలో దర్శకుడు చేసిన పొరపాట్ల ఫలితం. ఒక ‘ప్రతిఘటన’ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా తీసుకున్నా, అందులో పవర్ఫుల్ గా నటించిన విజయశాంతి ఇప్పటికీ గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఇంత భారీ చారిత్రాత్మకంలోనూ వీరవనిత రుద్రమదేవిగా అనూష్కా గుర్తుండదు, అల్లు అర్జునే గుర్తుంటాడు. 

         అనూష్కా కంటే గోన గన్నారెడ్డి పాత్రలో అల్లుఅర్జున్ ఎక్కువ హల్చల్ చేయడంతో ఈ సినిమాకి ‘గోన గన్నారెడ్డి’ అని టైటిల్ పెట్టినా నష్టం లేదు,  పైగా ‘బ్రూస్ లీ’  లకీ, ‘అఖిల్’ లకీ బస్తీమే సవాలుగా వుంటుంది తొడగొట్టి సినిమా. తెలంగాణా యాసలో అర్జున్ డైలాగులకే ఎక్కువ హుషారు ప్రేక్షకులకి. పోషించింది అతిధి పాత్రయినా గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నట్టు, ఈ సినిమా చూస్తూంటే వచ్చే నీరసాన్నంతా హుష్ కాకీ చేసేస్తాడు ఎమోషనల్ డ్రైవ్ జాస్తిగా వున్న తెలుగుజాతి ప్రేక్షకులకి అర్జున్. 

          రానా దగ్గుబాటి కాల్పనిక చరిత్ర ‘బాహుబలి’ లోలాంటి పాత్రతోనే, ఆహార్యంతోనే, డిజైనర్ చరిత్ర ‘రుద్రమదేవి’ లోనూ నటించాడు. కానీ ఈ పాత్రకూడా ఆటలో అరటి పండు అయిపోవడంతో తన గురించి చెప్పుకోవడాని కేమీ లేదు. ఇతర పాత్రల్లో కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్ సుమన్, ఆదిత్యా మీనన్ తదితర భారీ తారాగణమంతా కలిసి, భారీ డైలాగులతో, ప్రధానపాత్ర రుద్రమ దేవి ఉనికిని ప్రశ్నార్ధకం చేశారు. ఇక మహాదేవ నాయకుడుగా నటించిన ముప్ఫయ్యేళ్ళ కుర్రాడు విక్రంజిత్ విర్క్ అయితే,  ఇంత భారీ చారిత్రాత్మకానికి కురచ విలన్ అయిపోయాడు.

          ఇళయరాజా సంగీతం హిట్టేమీ కాదు. పాటలూ - నేపధ్య సంగీతమూ అంతంత మాత్రంగానే వున్నాయి. నేపధ్య సంగీతమైతే మరీ వెనకబడిపోయింది. అజయ్ విన్సెంట్ ఛాయాగ్రహణానికి లైటింగ్ లో, కలర్ స్కీం లో ఏకత్వం కన్పించదు. కొన్ని ఔర్ డోర్ దృశ్యాలు మాత్రం బావున్నాయి. సాంకేతికంగా ఈ సినిమా అంత ఉన్నతంగా ఏమీ లేదు.  గ్రాఫిక్స్ మరీ చవకబారుగా వున్నాయి.  సెకనుకి ఇరవై వేలు వెచ్చిస్తే వచ్చే క్వాలిటీ నాలుగైదు వేలు పెడితే ఏమొస్తుంది. అలాగే యాక్షన్ సీన్సు సైతం బలహీనంగా వున్నాయి. కత్తి పోరాటాలు ఈ కాలపు సినిమానే  చూస్తున్నామా అన్నట్టున్నాయి- పాత జానపద సినిమాల్ని జ్ఞప్తికి తెస్తూ. 

          పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు ఫస్టాఫ్ వరకూ మంచి ఫీల్ నిస్తాయి. సెకండాఫ్ లోనే మరీ  భారమన్పిస్తాయి. కారణం,  కథని యాక్షన్ తో కాకుండా, ఎంతసేపూ వ్యూహ ప్రతివ్యూహాలు, కుట్రలూ కుతంత్రాలూ మాటాడుకోవడాలతో, ఊహాగానాలతో నిండి పోవడమే - ఆ నాడు కృష్ణ దర్శకత్వం వహించిన డైలాగుల మోత  ‘సింహాసనం’ ని గుర్తుకు తెస్తూ.  ఒక్క అల్లు అర్జున్ కి రాసిన డైలాగులు మాత్రమే క్రియేటివిటీతో శక్తిమంతంగా వున్నాయి. ఇలాటి పవర్ఫుల్ డైలాగులు  అసలుండాల్సిన  రుద్రమదేవి పాత్రకే మృగ్యమైపోయాయి.

          పాత్రల పంపకం, డైలాగుల పంపకం, సాంకేతిక హంగుల పంపకం.. ఇలా వేటిలోనూ బ్యాలెన్సింగ్ యాక్ట్ పాటించని అగ్ర దర్శకుడు గుణశేఖర్ మేకింగ్ పనితనం మొత్తంగా ఎలా వుందో ఈ కింద  ‘స్క్రీన్ ప్లే సంగతులు’ తర్వాత చెప్పుకుందాం..

స్క్రీన్ ప్లే సంగతులు 














                                  


                                                         
                   


          

8, అక్టోబర్ 2015, గురువారం

సాంకేతికం- ఆర్ట్

ఆనంద్ సాయి
      కళా దర్శకుల క్రియేటివిటీ సెట్స్ వేయడం దగ్గరే ముగిసినప్పుడు షూటింగుల్లో వాళ్లకి పనుండేది కాదు. రచయితల్లాగే కళా దర్శకుల్నీ షూటింగ్ స్పాట్ లో పరదేశీలు గా చూసేవాళ్ళు. హాలీవుడ్ లోనూ ఇంతే. షూటింగుల్లో  ఆ సినిమా రచయిత కన్పిస్తే - ‘ వీడిక్కడికి ఎందుకొచ్చినట్టు?’ అన్నట్టు చూస్తారనీ రెండు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్ రాశారు. తన సినిమా ప్రివ్యూకే వెళ్ళినా ద్వారపాలకుడు  రానియ్యలేదని సరదాగా పుస్తకం రాశారు ( అడ్వెంచర్స్ ఇన్ స్క్రీన్ ట్రేడ్). టాలీవుడ్ కి సంబంధించిన ఒక ప్రముఖ కళాదర్శకుడు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పిన ప్రకారం-  షూటింగుల్లో దర్శకుడికీ కెమెరామాన్ కీ మధ్య కళాదర్శకుడు డిస్టర్బెన్స్!  నిర్మాతకి అనవసర ఖర్చు!!

          ధోరణి ఇప్పుడు మారింది. కనీసం భారీ వ్యయాలతో నిర్మిస్తున్న సినిమాలకి సంబంధించి! ఇప్పుడంతా డిజైనర్ లుక్ ప్రపంచం. కొత్తతరం దర్శకులు సినిమా ఆద్యంతం, ప్రత్యంగుళం ప్రొడక్షన్ ని స్టయిలిష్ గా డిజైన్ చేసేందుకు కళాదర్శకుల్ని కూడా కలుపుకుని పోతున్నారు. దీంతో దృశ్యాల్లో కన్పించే అన్ని సెట్ ప్రాపర్టీస్ మీదా  కళా దర్శకుడికి అధికారం వచ్చేసింది. దీని పర్యవసానం ఎలా వుందంటే,  హిందీ సినిమాల్లో కన్పించే డిజైనర్ ఫర్నీచర్, డోర్ కర్టెన్లు, ఆఖరికి టీపాయ్ మీది యాష్ ట్రేలూ సైతం చూసి ముచ్చట పడి, అలాటివి తమ ఇళ్ళల్లో తయారు చేయించుకుంటున్నారు ప్రేక్షకులు. ఇంతగా ప్రభావితం చేస్తోంది నేటి కళా దర్శకత్వం ప్రజల్ని. సరీగ్గా ఇలాటి మంచి ట్రెండ్లో టైం చూసుకుని ఎంటరయ్యారు ఆనంద్ సాయి. ఎంటరై పూర్తి ఇన్వాల్వ్ మెంట్ తో అద్భుతాలు చేస్తున్నారు ఆర్ట్ డైరెక్షన్ లో.

          ‘ఎక్కడా నా టచ్ ని మిస్ కానివ్వను, నాకు సంతృప్తి నివ్వంది ఏ  సినిమాకీ పని చెయ్యను. సంఖ్య కాదు నాకు ముఖ్యం, నాణ్యత’  అని తన వర్క్ కల్చర్ చెప్పుకొచ్చారు.

          అనుభవజ్ఞుడైన దర్శకుడికీ, కెమెరా మన్లకీ భిన్నంగా,  ఫ్రేముల్లో మీరింకేం విశేషం చూసి నిర్ణయిస్తారన్న ప్రశ్నకి, రసాత్మకతని చూస్తానన్నారు.

          సంగీత నాట్యాలు, సాహిత్య చిత్రలేఖనల్లాగే, వాస్తుకళ కూడా ప్రాచీన శాస్త్రాల మీద ఆధారపడింది. మరి అత్యవసరమైన ఈ మూలాలతో కూడిన భారతీయతని ఒక కళా దర్శకుడిగా మీరెంత వరకు సంతరించుకున్నారన్న మరో ప్రశ్నకి,  తన తండ్రి జీన్సే సహజంగా తనకి సంక్రమించాయన్నారు. 

         విఖ్యాత కళా దర్శకుడు బి. చలం ( 700 సినిమాలు) తనయుడైన ఆనంద్ సాయి అప్పటి విధానాలు తనకి సరిపడక తండ్రి అడుగు జాడల్లో నడవలేదు. ఇంటీరియర్ డెకొరేషన్ కోర్సు చేసుకుని చెన్నై లోనే ఆ బిజినెస్ పెట్టుకున్నారు. కానీ సినిమాలు ఆయన్ని వదల్లేదు.  ఒకసారి ఆ పెట్టిన బిజినెస్ లో అయన సృజనాత్మకతకి మెచ్చి, పవన్ కళ్యాణ్  ‘తొలిప్రేమ’ కి పనిచేయమని కోరారు. అంతే, ఇక తన విధానాలు అమల్లో పెట్టే టైం వచ్చేసిందని ఫీల్డులోకి ఎంటరై పోయారు ఆనంద్.

           రావడం రావడం ఏకంగా తాజ్ మహల్ నే సృష్టించారు. అది చూసి వారెవ్వా అనుకుంది ఫీల్డు. కానీ అవార్డుల కమిటీ ఆ తాజ్ మహల్  గ్రాఫిక్స్ అని భ్రమసి నంది అవార్డు లేదు పొమ్మంది. గ్రాఫిక్స్ ని అంతగా ఇష్టపడని తను, ఇప్పుడు చాలా మంది అనుసరిస్తున్న 50 శాతం సెట్,  50 గ్రాఫిక్స్ అనే విధానానికి పూర్తి వ్యతిరేకం. కళా దర్శకులు వేసే సెట్స్ కి మ్యాచయ్యే ప్రమాణాలతో కూడిన హై ఎండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకా మన దేశానికి రాలేదన్నది తన అభిప్రాయం. కనుక ఎంత పెద్ద సెట్ అయినా పూర్తిగా ఫిజుకల్ గా నిర్మించే తీర్తారు తను. అసలు గ్రాఫిక్స్ కే ఖర్చు ఎక్కువన్నది తన నమ్మకం.

          ‘ గ్రాఫిక్స్ ని అలా ఉంచితే, డిజిటల్ ఇంటర్మీడియేట్ ( డీ ఐ) సంగతేమిటి? మీరొక సెట్ వేశాక, కెమెరామాన్ తన తరహా లైటింగ్ తో చిత్రీ కరిస్తాడు. ఆ చిత్రీకరణల మీద మళ్ళీ డీఐ  కలరిస్టు వచ్చేసి  ఆ లైటింగ్ నీ,  మీరు వాడిన సెట్ కలర్స్ నీ కూడా దిద్దుతాడు. అప్పుడు మీ ఒరిజినాలిటీ  ఎక్కడుంటుంది? మీ మీద కెమెరామాన్, కెమెరామాన్ మీద కలరిస్టూ చేయి చేసుకుంటూ పోతే, అంతిమ రూపం కలరిస్టుదే అవుతుంది కదా?’ అన్న సందేహానికి,  ఇలాటి సమస్యలు వస్తాయనే డీఐ మీద మంచి అవగాహన ఉన్న కెమెరామన్లతో పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆనంద్.

           తిరిగి ఆయన ప్రొఫైల్ కొస్తే, ఈ పన్నెండేళ్ళలో  60 సినిమాలకి పని చేశారు. అన్నీ బిగ్ స్టార్స్ తో బిగ్ డైరెక్టర్ల  సినిమాలే. ఒక్క 2010 లోనే చూసుకుంటే, ‘అదుర్స్’,  ‘కొమరం పులి’, ‘ఖలేజా’, ‘బృందావనం’, ‘ఆరెంజ్’  అనే ఐదు బిగ్ సినిమాలకి కళా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘శక్తి’ కి, అల్లు అర్జున్ ‘బద్రీ నాథ్’ కీ పని చేస్తున్నారు. ‘శక్తి’ కి వేసిన పాతాళ  భైరవి సెట్ తన కళా ప్రతిభకి పరాకాష్ఠ. ఇందులో ముట్టుకుంటే స్థంభాలు వెలుగుతాయి, పట్టుకుంటే కత్తులు ప్రకాశిస్తాయి. ఇంతవరకూ ఎక్కడా వెయ్యని 40 అడుగుల ఎత్తు, 120 అడుగుల పొడవు, 170 అడుగుల వెడల్పూ గల మెగాసెట్ అది. అలాగే ‘బద్రీనాథ్’ కి కులూమనాలీ లో భారీ దేవాలయం సెట్ వేశారు.

       వ్యక్తిగతంగా తెలుపు నలుపు సినిమాలిష్టం. ఎలాంటి గ్రాఫిక్స్, టెక్నాలజీ, రిఫరెన్సులూ కూడా లేని ఆ రోజుల్లో తన తండ్రీ,  ఏకే శేఖరూ కలిసీ వేసిన ‘చంద్ర లేఖ’  (1948) సినిమాలోని సెట్స్ ఈనాటికీ మర్చిపోలేనన్నారు. అలాగే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కి తన తండ్రి వేసిన మానస సరోవరం సెట్ ఒక పాఠమయిందని చెప్పారు.

          తన శైలి గురించి చెప్తూ, తక్కువ ఛాయలో కలర్స్, వేసింది సెట్ లా కాకుండా నిజ నిర్మాణంలా ఉంటూ,  కాస్త ఎత్తు ఎక్కువున్న సెట్స్ కన్పిస్తే,  అది ఆనంద్ సాయి బ్రాండ్ గా గుర్తు పట్ట వచ్చన్నారు. ‘ఖలేజా’  లో రాజస్థాన్ గ్రామం సెట్, నిజంగా గ్రామంలానే అన్పించడాన్ని మనం చూశాం. ఇకపోతే  ప్రాచీన కట్టడాల్ని పరిశీలించడానికి తరచూ విదేశీ యాత్రలు చేస్తారు ఆనంద్. కంప్యూటర్  మీద తను పని చెయ్యరు. చేత్తోనే డ్రాయింగ్స్ వేస్తారు. అదీ దర్శకుల ముందు కూర్చుని. డ్రాయింగ్స్ వేయలేని కళాదర్శకులు కూడా ఫీల్డులో కొనసాగ వచ్చనీ, అయితే అది ఎంతో కాలం సాగదనీ హెచ్చరించారు.

          కథని స్టార్స్ డామినేట్ చేయకూడదని అనుకుంటాం మనం. స్టార్స్ ని సెట్స్ డామినేట్ చేయకూడదని అంటారు టాప్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.


-సికిందర్
(ఫిబ్రవరి 2011, ఆంధ్రజ్యోతి-‘సినిమాటెక్’ శీర్షిక)