రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, ఆగస్టు 2015, శుక్రవారం

నాటి సినిమా



ప్పుడు 2008 వ సంవత్సరం..
          పగబట్టి ఒకటే కుండపోతగా వర్షం.. ఆ కుండపోతని లెక్క చెయ్యకుండా అభిమానుల ఒకటే పరుగులు..ప్రముఖుల బారులు..అందరివీ విషణ్ణ వదనాలే. ..తీరని యమ శోకమే అందరి కళ్ళల్లో..కుండపోతకంటే కంటిపోత శివాలు!
         
ఇంకా అప్పుడు 1969 వ సంవత్సరం..
          తట్టుకోలేనంత  విషాదం..కొంగు నోట్లో కుక్కుకుని ఆడవాళ్ళ ఒకటే ఏడ్పులు.. కన్నీళ్ళతో తడిసి ముద్ద ముద్దయి అలాగే ఇళ్ళకి పరుగులు..మళ్ళీ మళ్ళీ అక్కడికే వచ్చి అవే ఏడ్పులు మళ్ళీ మళ్ళీ.. అవే కన్నీటి జలపాతాలు జడివానలా!

        ఎక్కడ శోభన్ బాబుతో కలిసి విషాదముంటుందో అక్కడ జనసముద్రం పెల్లుబుకుతుంది. శోభన్ బాబుతో విషాదం, అయస్కాంతమూ ఒకటే. జనం ఇనుప రజను.

          పై 2008 నాటి దృశ్యం ఆయన అంతిమ యాత్రా ఘట్టాన్ని ఆవిష్కరిస్తే, 1969 నాటి దృశ్యం ఆయన తొలి  సిల్వర్ జూబ్లీ ‘మనుషులు మారాలి’ చరిత్రకి సాక్ష్యం పలుకుతుంది.

          సత్యజిత్ రే శాంతి నికేతన్ వదిలేసి వెళ్ళిపోయారు. బయటి ప్రపంచంలో కొత్త కొత్త సంగతులు కుతూహలం రేపుతోంటే, పాశ్చాత్య సంగీత బాణీలు రారమ్మని పిలుస్తూంటే, ఇంకా ఆ రవీంద్రుడి శాంతి నికేతన్లో  బొమ్మలేసుకుంటూ కూర్చోవడం వ్యర్ధమనిపించి, సరాసరి సినిమా ప్రపంచాన్ని ఆలింగనం చేసుకున్నారు.

          శోభన్ బాబు శాంతి నికేతన్ కే తిరిగి వచ్చారు - తన సొంత శాంతి నికేతన్ కి. వయసు మీరాక సినిమాలేమిటని అన్పించి, ప్రాపంచిక రణగొణ ధ్వనులకి సుదూరంగా తనదైన శాంతి నికేతన్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ విశ్రమించారు. కళాకారులు ఎప్పుడు ఎక్కడ ప్రశాంతతని కనుగొంటారో తెలీదు. ఒకరు నిష్క్రమించిన లాంటి వాతావరణం లోకే మరొకరు ప్రవేశిస్తారు. ఇది కాదు పాయింటు- పన్నెండేళ్ళూ ఎవరికీ కన్పించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన శోభన్, ఎక్కడో చెన్నైలో కన్నుమూస్తే, ఇక్కడ తెలుగు గడ్డ మీంచి తండోప తండాలుగా అభిమాన జనం ఇంకా తమ అందాల నటుణ్ణి గుర్తుపెట్టుకుని, గుండెలు బాదుకుంటూ ఆయన అంతిమయాత్రలో కలిసిసాగడం!  ఆ వర్ష బీభత్సంలో శోభన్ మహాప్రస్థానాన్నికనీవినీ ఎరుగని సంఘటన చెయ్యడం!


          2008- 1969 రెండూ అంతటి చరిత్రలే శోభన్ కి. శోభన్ తో విషాదం హిట్టవుతుందని మొట్టమొదటిసారిగా తెలిసింది ‘మనుషులు మారాలి’ తోనే. అంతటి  విషాదాన్ని సత్యజిత్ రే సైతం తీసి వుండరు. అభినేత్రి శారదతో కలిసి విషాదాన్ని పరాకాష్ఠకి చేర్చిన శోభన్ కిది మరో సంసార గొడవల సినిమా కాదు. సామాజిక రుగ్మతల సారాంశం. ఇవాళ్టికీ దీన్ని సీడీ వేసుకు చూడండి- సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల ఆత్మహత్యలు ఎంత మతిమాలినవో తెలుస్తుంది.

           ఈ క్లాసిక్ చాలా కామన్ సెన్సు శ్రమైక జీవన సౌందర్యం గురించి చెప్తుంది. శోభన్- శారదల పాత్రలిందులో నేటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల లాంటి పాత్రలే. కాకపోతే ఆ రోజుల్లో పారిశ్రామిక వేత్తల పాలిట వరంగా యంత్రాలొచ్చేసి శోభన్- శారద పాత్రల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసింది - ఇవాళ్ళ ఆర్ధిక మాంద్యమనే పెను భూతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పాలిట బెడదగా మారినట్టు.

          1957 లోనే ఇలాటి కథతో బీ ఆర్ చోప్రా హిందీలో నయా దౌర్ (కొత్త యుగం) తీశారు. దిలీప్ కుమార్ -వైజయంతీ మాలా ప్రధాన పాత్రలు. పనిచేస్తున్న రంపం మిల్లులో కొత్తగా యంత్రం తెచ్చి బిగించడంతో, ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు తిరగబడతారు ( హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రోడ్లు ఊడ్చే స్వీపింగ్ యంత్రాలు ప్రవేశపెట్టినప్పుడు స్వీపర్లు చీపురు కట్టలతో పటపట కొట్టి వాటిని అడ్డుకున్నట్టు)  ‘మనుషులు మారాలి’ లో షుగర్ ఫ్యాక్టరీని కొత్త యంత్రాలతో ఆధునీకీకరీంచడంతో టోకున కార్మికులు రోడ్డున పడతారు. అంతమాత్రాన ఆత్మ హత్యలే శరణ్య మనుకోవాలని లేదు.  ప్రత్యాన్మాయ ఉపాధి మార్గాలని వెతుక్కోవచ్చు. దీనికి సహకరించాల్సిన బాధ్యత మళ్ళీ సమాజం మీదే వుంటుంది. ఇదే ‘మనుషులు మారాలి’ లో చెప్పదల్చుకున్నది. అలాగని  యంత్రంతో మనిషి పోరాటం గురించి ఈ సినిమా కాదు. యంత్రాల కారణంగా ఉపాధిని కోల్పోయిన ఆకలి బాధల గురించి అంతకన్నా కాదు. ఇలాటి అగ్నిపరీక్షలకి అలమటిస్తూ వచ్చి బంతిని సాటి మనుషుల కోర్టులో పడేస్తే, అప్పుడా సాటి మనుషులు ఏం చేశారనే దాని గురించే.

          ఈ పరిస్థితి సృష్టికర్త కన్నింగ్ పారిశ్రామికవేత్త పాత్ర వేసిన నాగభూషణమే. తన షుగర్ ఫ్యాక్టరీలో భాగస్వామిగా వున్న గుమ్మడిని నిండా ముంచి, ఆయన చావుకి కారకుడవుతారు మొదట. దీంతో వీధిన పడ్డ గుమ్మడి ఏకైక కుమార్తె శారద, కార్మికుడైన శోభన్ ని వివాహం చేసుకుని అలా స్థిమిత పడ్డారో లేదో, నాగభూషణం తన ఫ్యాక్టరీలోకి  కొత్త కొత్త యంత్రాలు దింపుతారు. దింపడమే గాక శోభన్ బాబు సహా రెండు వందల మంది కార్మికులని ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. వీళ్ళందరికీ శోభన్ నాయకత్వం వహించి సమ్మెకి దిగుతారు. ఆ తదనంతర పరిణామాల్లో గూండాల చేతలో హత్యకి గురవుతారు.

       దీంతో మళ్ళీ వీధిన పడ్డ శారద, ఇప్పుడు తన ముగ్గురు పిల్లలతో నానా కష్టాలూ పడతారు. అయినా నిరాశచెందక- పిల్లల్ని పోషించుకోవాలి, మీ పిల్లలకి ట్యూషన్లు చెప్పుకునే అవకాశ మివ్వండంటే, ఆమె మాసికల చీరని చూసి హేళన చేస్తారు. పోనీ కూలీ పని ఇప్పించమని ఇంకో దగ్గర అడిగితే, చదువు కున్నదానివి మా నెత్తికే ఎక్కుతావు పొమ్మంటారు. ఇలా ఎక్కడా ఆదాయం పుట్టదు. ఆఖరికి ఇహ ఉంటున్న పూరి పాకనే అమ్మేద్దామంటే, బంధు వొకడు వచ్చి రంకు అంటగడతాడు. ఇలావుంటే, అటు ఆకలికి నకనకలాడుతున్న పిల్లలు, అమ్మని వదిలేసి బయట ఆహార పదార్ధాలని దొంగిలించి తింటూంటారు. ఇంట్లో వస్తువులు కూడా అమ్మేసుకోబోయి పోలీసులకి పట్టుబడతారు. చిట్టచివరికి పిల్లలు ముష్టెత్తు కోవడం చూసి చలించిపోతారు శారద. ఇహ లాభంలేదు, కనాకష్టమైపోయిన ఈ జీవితంతో అవిసిపోయాయి ప్రాణాలు- బక్క చిక్కి, బొగ్గులా నల్లబడి- దెయ్యంలా తయారయ్యింది తను. పిల్లలు పుచ్చిపోయారు. ఇవాళ్ళ ఇలా తయారైన వీళ్ళు- రేపింకేం చేస్తారో. లేదు- ఇంకోలా వీళ్ళు తయారవడానికి వీల్లేదు. అలా తయారవకూడదంటే...

          ‘యువరానర్..ముగ్గురు పిల్లల్ని చంపుకున్న హత్యానేరం రుజువయ్యింది గనుక ఈ ముద్దాయికి...’  చెప్పలేక పోతున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాంచనకి, బోనులో నిలబడ్డ స్నేహితురాల్ని చూస్తూంటే  కడుపు తరుక్కుపోయే బాధ. మరణ శిక్ష విధించమని తనే వేడుకుంటున్నారు శారద. పిల్లలకి విషమిచ్చి తనూ మింగింది కానీ, ఇంకా ప్రాణాలతో తను మిగిలిందిలా.. ఈ పాపానికి ఈమెని నెట్టిందెవరు? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళని వదిలేసి ఈమెకేమిటీ శిక్ష?.. అని కాంచన వాదన. న్యాయమూర్తి తీర్పు వాయిదా వేసి వెళ్ళిపోతాడు. ఈమెని శిక్షించి చట్టం తానూ పాపం మూట గట్టుకోకూడదనేమో. ఈమెని ఈ స్థితికి తీసుకొచ్చిన పాపుల సరసన చట్టం తానూ చేరకూడదనేమో.  కానీ ఈ చట్టాలకీ, సాటిమనుషుల నిర్వాకాలకీ, సర్వ భ్రష్టత్వాలకీ అతీతంగా ఒకే ఒక్కటుంది-  అది ఆ భర్త పిలుపు. దానికి మించింది లేదు. దాని ముందు ఈ లోకమెంత! లాలించని లోకులెంత! నమస్కారం పెట్టి, పైలోకాల్లోంచి పిలుస్తున్న ఆ శోభన్ దగ్గరికి వెళ్ళిపోతారు తనే శారద.

         మనుషుల్లో పరోపకార గుణం పెరిగితే ఇలాటి అఘాయిత్యాలు ఆగుతాయి. ఈ చరాచరా సృష్టిని ఎవరివో ఆక్రందనలు వినడానికి ఉద్దేశించలేదు సృష్టికర్త- ఆక్రందన కేవలం సొసైటీ మిస్ మేనేజ్ మెంట్ ఫలితమే!

          సహజత్వానికి దగ్గరగా తీసికెళ్ళిన విషాదభరిత సినిమా ఇది. అయితే మరీ ఆర్ట్ సినిమా లాంటి సహజత్వంతో కాక, కాస్త నాటకీయత, చలం- కెవి చలం- రమాప్రభలతో ఇంకాస్త హాస్యం, ‘తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో’ , ‘ పాపాయి నవ్వాలి పండగే రావాలీ’ ..లాంటి స్వీట్ సాంగ్స్ తో, ఇంకా చురకత్తి లాంటి నాగభూషణం చెణుకులతో- ( ఈ దేశంలో నాయకులు ఉపన్యాసాలు, ప్రజలు ఉపవాసాలు పంచేసుకున్నారు),  ఇంకా ఇతర మసాలా దినుసులూ  దట్టించి, అన్ని వర్గాల ప్రేక్షకులూ బ్రహ్మ రధం పట్టేలా తీశారు. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఖంగు మనే ఘంటసాల గొంతుతో ‘ చీకటిలో కారు చీకటిలో ‘ పాట ఒకటి మార్మోగిన చరిత్ర ఉండనే వుంది. స్వరబ్రహ్మ కెవి మహదేవన్ కి సైతం ఈ సినిమా ఘన విజయంలో సింహ భాగముంది.

          దీని మాతృక మలయాళమే అయినా, పూర్తిగా తెలుగు స్థానికత అలరారింది విఖ్యాత వి. మధుసూదన రావు దర్శకత్వంలో. పైగా బ్లాక్ అండ్ వైట్ లో చాలా మంచి షాట్లు తీశారాయన. దీన్ని నిర్మించిన ఇదే జెమినీ సంస్థ, మధుసూదన రావుతోనే తెలుగు తర్వాత హిందీ లో ‘సమాజ్ కో బదల్ డాలో’ అని రీమేక్ చేస్తే, అదీ సంచలన విజయమే ఉత్తర భారతాన.

          సృజనాత్మకత విషయానికొస్తే, ఒక విశిష్ట శిల్పం ఈ స్క్రీన్ ప్లే కి కన్పిస్తుంది. కథ పాత్రల చేతులు మారుతూ పోతూంటుంది. అసలు ట్రాజడీల్లో కథే పాత్రల్ని నడిపిస్తుంది. ట్రాజడీల్లో పాత్రలు గొప్ప కాదు, అవి బలిపశువులు. అప్పుడే ట్రాజడీ. కాబట్టి ట్రాజడీల్ని పాత్రలు నడపవు. కథే  పాసివ్ పాత్రల్ని నడిపిస్తుంది. ‘దేవదాసు’ తీసుకున్నా, ‘శంకరాభరణం’  తీసుకున్నా ఇంతే. అలా ‘మనుషులు మారాలి’  గుమ్మడి ట్రాకుతో ప్రారంభమౌతుంది. తర్వాత శారద, ఆ తర్వాత శోభన్, ఇంకా తర్వాత తిరిగి శారద, ఆఖరికి పిల్లలూ.. ఇలా అధ్యాయాల వారీగా, ఏ అధ్యాయానికా అధ్యాయం విస్పష్ట  విభజన జరిగిన ట్రాకులతో నడుస్తుంది. ఇబ్బందిపడకుండా కథని ఫాలో అవడాన్ని సులభతరం చేసింది ఈ విధానం. కథలు చెప్పడం లో గ్రేట్ మాస్టర్లు ఆ కాలంలోనే వున్నారు.

     అయితే శారద పాత్ర తన మొదటి ట్రాకులో, అర్జెంటుగా ఎవరో ఒకరి ఆశ్రయం పొందాలన్న బేలతనంతో ప్రవర్తించడమే అసహజంగా తోస్తుంది. ఆ క్లిష్ట సమయంలో ఆమె ప్రదర్శించే బేలతనం కన్నా-  కాంచన పాత్ర మనోబలం, వ్యక్తిత్వం ఆకర్షణీయంగా వుంటాయి. పెళ్లి కాకుండా మిగిలిపోయిన తను -‘ నేను పెద్ద ప్లీడర్ని, నన్ను పెళ్లి చేసుకోవాలని సామాన్యులకి అన్పించదు. తోటి వాళ్లకి నా ఉద్యోగం, హోదా తప్ప నేను స్త్రీగా కన్పించను. నాకు కూడా స్త్రీ సహజమైన కోరికలుంటాయని ఈ లోకమే కాదు, నా కన్న తండ్రి కూడా మర్చిపోయాడు..’  అని ఒక్కసారే వెళ్ళ బోసుకుంటారు కాంచన. కానీ అంత ఆప్తమిత్రురాలైన శారదకి, తను తలచుకుంటే మంచి ఉద్యోగమే ఇప్పించగలరు. ఆ పని చేయకుండా, చిన్న చిన్న అవసరాలు తీర్చడానికి వచ్చి తిరస్కారం పొందుతూ వుంటారు.

           ‘ఉగ్గు పెట్టడానికి ఆముదమే లేనప్పుడు బంగారు ఉగ్గు గిన్నెందుకు చెప్పు?’  అన్నది శారద పాయింటు. తిండికి లేని స్థితిలో కూడా శారద పాత్ర సామాజిక దృక్పథం ఎలాంటిదంటే- ‘ఈ కూలి పేటలో ఎక్కడా పొయ్యి రాజెయ్య లేదు, పొగ లేవలేదు, ఇప్పుడు మా ఇంట్లో మాత్రం, పొయ్యి రాజేస్తే, చూసే వాళ్లకి ఎలా వుంటుంది? తోటి వాళ్ళ కడుపులు మాడుతోంటే మా కడుపులు నింపుకోవడం బావుంటుందా?’ అని కాంచన ఇవ్వబోయిన రూపాయల్ని తిరస్కరిస్తారు.

వి. మధుసూదన రావు 

          సెకండాఫ్ లో, చనిపోయే శోభన్ పాత్ర హేండాఫ్ పాత్రలా వుంటుంది. అంటే, కథలో తను చేయాల్సిన కార్యం ముగించుకుని, ఆ రెపరెపలాడే కథ అనే పతాకాన్ని, రెండో ముఖ్య పాత్రకి అప్పగించి  తను నిష్క్రమించడ మన్నమాట. ఇలా శోబన్ నించి ఆ పతాకాన్ని అందుకున్న శారద,  దాంతో ముగింపు దిశగా సాగిపోతారు. ‘రాబోయే కష్టాలకి భయపడి రావాల్సిన హక్కుల్ని వదులుకోవడం పిరికితనం’ అని శోభన్ సిద్ధాంతంసమ్మె చేస్తారు, వాళ్ళు లాకౌట్ ప్రకటిస్తే నిరాహార దీక్ష చేస్తారు, ప్రభుత్వమే తిరిగి ఫ్యాక్టరీ తెరిపిస్తూంటే, నిస్సహాయుడై పోతారు. లంచం ఎరజూపితే తిప్పికొడతారు. ఓ రాత్రి యాజమాన్యం పంపిన గూండాల చేతిలో హతమైపోతారు.

          ఒక్క యంత్రాలు తెచ్చి పెట్టుకుని నాగభూషణం సృష్టించిన పరిస్థితి ఇది. యంత్రాలు మంచివే, వాటితో యాజమాన్యాల వైఖరే ప్రశ్నార్ధకమవుతోంది. మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడు, యుధిష్టరుడు, ధృతరాష్ట్రుడు, అశ్వత్థామ లాంటి వాళ్ళందరూ కలిసే, వాల్ స్ట్రీట్ ని కుప్ప కూల్చి, పెట్టుబడిదారీ వ్యవస్థని నేలకు దించారని - ఆర్ధిక నిపుణుడు, కాలమిస్టు గురుచరణ్ దాస్ తాజాగా ఆర్టికల్ రాశారు. ఈ సినిమాలో కూడా నాగభూషణం దుర్యోధనుడైతే, రావికొండలరావు యుధిష్టరుడు, హరనాథ్ కర్ణుడు లాంటి వాళ్ళే. ఈ ముగ్గురి నిర్వాకమే కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చింది- ఏ నాటికైనా ఈ సినిమా ఓ హెచ్చరిక, కనువిప్పు.



సికిందర్ 
(సెప్టెంబర్ 2009, సాక్షి- ‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)


          

          

19, ఆగస్టు 2015, బుధవారం

సాంకేతికం- ప్రొడక్షన్ డిజైనర్


ర్ట్ డైరెక్షన్ తీరు తెన్నులు మారిపోతున్నాయి... యథా సినిమాలు తథా సింగారాలూ.. హై ఎండ్
టెక్నాలజీ సినిమాలకి  ప్రధానాకర్షణ అవుతున్నప్పుడు, కళా దర్శకత్వం ఆ శిఖరాల్ని అందుకోకుండా కొనసాగలేదు. నేటి సోషియో ఫాంటసీ ల కాలానికి
తగ్గట్టుగా టెక్నాలజీని మార్చుకోవాల్సిందే. కథల్లో అంతర్భాగంగా వుండే స్పెషల్ ప్రాపర్టీస్ రూపకల్పన, మెగా సెట్స్ నిర్మాణాల్లో పొదుపు చర్యలు, అత్యాధునిక కలర్ స్కీమ్స్, అట్మాస్ఫియర్ - మెకానికల్ ఎఫెక్ట్స్, లొకేషన్ కన్వర్షన్, మెకానికల్ స్పెషల్ వెపన్స్,
క్రోమో కీయింగ్, మోడల్ మేకింగ్ తదితరాలే కాకుండా, గ్రాఫిక్స్  టెక్నాలజీతో కూడా సహవాసం నేటి కళా దర్శకుడికి తప్పనిసరి అవుతోంది. కేవలం ఇప్పుడు ఇంకా కుంచె పట్టుకుని రంగు లేస్తూ కూర్చోలేడు. తన వృత్తి పరిధిలో  సకలకళా వల్లభుడైన
ప్రొడక్షన్ డిజైనర్ గా అవతరించాల్సిందే!

          నిర్వచనానికి సరీగ్గా సరిపోతారు భూపేష్ ఆర్. భూపతి అనే ‘అనగనగా ఓ ధీరుడు’ విజువల్ వీరుడు. ఈ మధ్యే విడుదలైన ఈ సంచలనాత్మక సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ ఊహాతీతంగాగా ఎదిగింది. నిజ జీవితంలో లాగా సినిమాల్లో ఊహల్ని నిజం చేయడమంటే, ఏళ్లకొద్దీ పట్టే ప్రక్తియ కాదు. క్షణాల్లో సృష్టి చేసి చూపించే మంత్రాల పెట్టె - అలాటి ఆ పెట్టె లాంటి భూపేష్  ‘డిజిటల్ ఫోర్స్ స్టూడియోస్’  లో ఇప్పుడు లేటెస్టుగా కన్పించేది జ్యూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘శక్తి’  లో మంత్రం శక్తిని నింపుకున్న మెటల్ నాళిక- కథలో అంతర్భాగమైన స్పెషల్ ప్రాపర్టీ.

         ‘ఫాంటసీలూ పీరియడ్  ఫిలిమ్సూ నా స్పెషల్ ఇంటరెస్ట్’ అన్నారాయన స్టూడియోలో స్పెషల్ గా ఏర్పాటుచేసుకున్న హాలీవుడ్ దిగ్గజం జార్జి  లుకాస్ ఫొటో ఫ్రేమునే తదేకంగా చూస్తూ. స్పెషల్ ఎఫెక్ట్స్ జ్ఞాని జార్జి లుకాస్ తనకి స్ఫూర్తి అన్నారు. అయితే స్ఫూర్తి వేరు, బడ్జెట్ - టైం పరిమితులు వేరు. ఉన్న బడ్జెట్లో ఇచ్చిన టైంలో స్ఫూర్తినంతా సర్దాలంటే యాతనే. దీన్ని ఛాలెంజి గా తీసుకుని పనిచేశారు తను- ‘అనగనగా ఓ ధీరుడు’ కి.

          రామోజీ, అన్నపూర్ణా, పద్మాలయా- స్టూడియోల్లో నాలుగు భారీ సెట్లు నిర్మించారు. ఎంత విఖ్యాత  వాల్ట్ డిస్నీ భాగస్వామ్యమున్నా, బడ్జెట్ 30-32  కోట్ల రూపాయలే. ఇదే మాత్రం చాలదు. కనీసం 50-55  కోట్లు కావాలి. ఇది మంజూరు కాదు, కాబట్టి సర్వసాధారణంగా ఉపయోగించే ప్లాస్టరాఫ్ పారిస్ జోలికి పోకుండా, ఇండస్ట్రియల్ థెర్మో కూల్ సెట్స్ ని నిర్మించి బడ్జెట్ పరిమితుల్ని జయించారు. ఒక రైలు డబ్బా పొడవంత మహా సర్పం రూపకల్పన కూడా థెర్మో కూల్ తోనే చేశారు. మామూలు గా చేసినట్టూ ఫైబర్ గ్లాస్ తోనో, ప్లాస్టరాఫ్ పారిస్ తోనో చేసివుంటే  ఆ మహా సర్పం బరువు 12 రెట్లు పెరిగేది. వందలాది కార్మికులూ హస్తకళా నిపుణులూ కలిసి నిర్వహించిన ఈ క్రతువుకి గ్రాఫిక్స్ కూడా తోడయ్యాయి.

      
       ‘కొంత ఆర్ట్ డైరెక్షన్ మరి కొంత గ్రాఫిక్స్ అనే కాన్సెప్ట్ హాలీవుడ్ హిట్  ‘300’ తోనే మొదలయ్యింది. దాన్ని చూసి మనమంతా ఫాలో అవుతున్నాం’ అని అసలు సంగతి చెప్పారు. ‘అనగనగా ఓ ధీరుడు’  విసిరిన సవాలుకి- దర్శకుడు కె. ప్రకాష్ తో బాటు, కాన్సెప్ట్ ఆర్టిస్ట్ రాజ్ గోరె, కెమెరామాన్ సౌందర రాజన్, కాస్ట్యూమ్స్ డిజైనర్స్ ద్వయం నిఖార్- భక్తీ ప్రభృతులు అందించిన సహకారం  మరువలేనిదన్నారు.

      ‘ 2002 లో మీరు ‘అల్లరి’  అనే బుల్లి సినిమాతో ప్రారంభంయ్యారు. ఇప్పుడు ఇన్ని అద్భుతాల్ని సాధించి అగ్రస్థాయికి చేరుకున్నాక ఎవరైనా కోటిన్నర బడ్జెట్ తో వస్తే సహకరిస్తారా?’ అన్న ప్రశ్నకి- ఆల్రెడీ ఆ పని చేస్తూనే ఉన్నానన్నారు. తన సంపాదనలో కొంత భాగం తీసి- చిన్న సినిమాలు నిర్మిస్తున్నానన్నారు.

        అసిస్టెంట్ డైరెక్టర్లకి  
అవకాశాలు కల్పిస్తున్నానన్నారు. అలా తీసిందే ‘కచరా’ అనే బాలల సినిమా అనీ, దానికి బంగారు నంది  వచ్చిందనీ  ఆ షీల్డ్ చూపించారు. ఫిలిం ఫెస్టివల్స్ ని దృష్టిలో ఉంచుకుని ఇలాటి ప్రత్యేకమైన సినిమాలు నిర్మించాలన్న ఉద్దేశంతో తన తమ్ముడు నీల్ భూపేష్ ని పారిస్ పంపి సినిమాటోగ్రఫీ చదివించా నన్నారు.

       తన సంపాదనలో కొంత భాగం తీసి- చిన్న సినిమాలు నిర్మిస్తున్నానన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లకి  అవకాశాలు కల్పిస్తున్నానన్నారు. అలా తీసిందే ‘కచరా’ అనే బాలల సినిమా అనీ, దానికి బంగారు నంది  వచ్చిందనీ  ఆ షీల్డ్ చూపించారు. ఫిలిం ఫెస్టివల్స్ ని దృష్టిలో ఉంచుకుని ఇలాటి ప్రత్యేకమైన సినిమాలు నిర్మించాలన్న ఉద్దేశంతో తన తమ్ముడు నీల్ భూపేష్ ని పారిస్ పంపి సినిమాటోగ్రఫీ చదివించా నన్నారు.

        ‘అసలు నేను ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని అనుకోలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి అహ్మదాబాద్ లో ఇండస్ట్రియల్ డిజైనర్ కోర్సులో చేరాను. అప్పుడా శాస్త్రాన్ని సినిమాల కెలా  ఉపయోగించుకోవచ్చో థీసిస్ రాస్తే, అది చూసి నిర్మాత డి. సురేష్ పిలిపించుకుని నాతో మాట్లాడారు. ‘నీ కాన్సెప్ట్ సినిమాలకి అప్లయ్ చేయాలంటే ఇంకో పదేళ్ళు  పడుతుంది- ఈ లోగా ఏం చేస్తావ్? రవి బాబు ‘అల్లరి’ తీస్తున్నాడు- వెళ్లి ఆ సెట్టింగ్స్ వ్యవహారాలు చూడు’ - అని రవిబాబు దగ్గరికి పంపించారు. అలా రవిబాబు దగ్గర నేరుగా ఆర్ట్ డైరెక్షన్ మొదలెట్టాను. రవి బాబు దగ్గరే పొదుపు కిటుకులూ తెలిశాయి. మన కళ్ళు 110 డిగ్రీల వక్ర రేఖలో చూస్తాయి. కెమెరా అంత  చూడదు. కాబట్టి దాని చూపు మేరకే సెట్స్ వేస్తే  చాలా డబ్బు అదా అవుతుందని ఆయన దగ్గర నేర్చున్నాను’ అని  వివరించారు.

         
      భూపేష్ చేసిన ఇండస్ట్రియల్ డిజైనర్ డిగ్రీ ,  స్పెషల్ ప్రాపర్టీస్, డమ్మీ వెపన్స్ ల తయారీకి ఉపయోగ పడుతోంది. హిందీ ‘నాకౌట్’ సినిమాకి సంజయ్ దత్ ఒక మల్టీ బ్యారెల్ రిమోట్ గన్ తయారు చేయించు కున్నారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ నిర్మాతలు తమ కొత్త సినిమాకి స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫరిచ్చారు. ‘గ్రహణం’ అనే పీరియడ్ ఫిలింతో  బాటు, ‘మల్లీశ్వరి’,  ‘షాక్’, ‘బాణం’, ‘ఓం శాంతి’, రవి బాబు అన్ని సినిమాలూ, మరికొన్ని బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకీ పనిచేసిన తను- ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న మంచు మనోజ్ తో నిర్మిస్తున్న భారీ ఫాంటసీకి గాంధర్వ భవనం సెట్ నిర్మాణ పనుల్లో నిమగ్నమై వున్నారు. గుంటూరుకి చెందిన భూపేష్ పూర్వీకులు మూడు తరాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.

సికిందర్ (ఫిబ్రవరి 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక)

17, ఆగస్టు 2015, సోమవారం

నాటి సినిమా






          
సినిమా చూస్తున్నప్పుడు ఆ కథలో  ఏర్పాటయ్యే సమస్య తో ఆసక్తిని రేపి, ఆలోచింప జేయడం వేరు. ఆ ఆలోచనని, ఆసక్తినీ  సహేతుకమైన, సమగ్రమైన పరిష్కార మార్గం దిశగా నడిపి ప్రేక్షకుల్ని సంతృప్తి పర్చడం పూర్తిగా వేరు. మొదటిదే జరిగి, రెండోది జరగని సినిమాలే ఎక్కువ. చాలా అదృష్టం కొద్దీ రెండూ జరిగాయంటే, ఇక ఆ సినిమాని జీవితాంతం మర్చిపోలేరు ప్రేక్షకులు! 

          ‘జీవితచక్రం’ అనే సినిమానీ ఇంకో జన్మకి కూడా మర్చిపోలేరు ప్రేక్షకులు!

          ‘జీవిత చక్రం’ అనగానే, ‘సుడిగాలిలోన దీపం..’ అనో, లేదా ‘మధురాతి మధురం మన ప్రేమ మధురం..’  అనో శంకర్ -జైకిషన్ ల సంగీతంలో ప్రజాదరణ పొందిన పాటలెలా మెదులు లుతాయో- అలా ఆ పాటలతో పోటీ పడుతూ కథా సంవిధానమూ సయ్యాటలు పోతుంది.

          ఒక ముక్కోణ ప్రేమకథలో నెలకొల్పిన కథా పథకానికి త్యాగాన్ని కేంద్ర బిందువు చేసినప్పుడు, ఆ ప్రేమలో ఆ మూడు పాత్రల్లో ఒక దాన్ని ఆ  త్యాగం పేరుతో పీక నులిమి పరిష్కారం చెప్పడం - హాయిగా సృజనాత్మక శ్రమ నుంచి పలాయనం చిత్తగించే దర్శకులు చేసే పనే.

          ఇందుకు ప్రతిగా కథల మీద పట్టున్న దర్శకుడు ఆ పాత్రల మధ్య ఏర్పడ్డ సమస్యకి సర్వామోద యోగ్యమైన పరిష్కారాన్ని చూపించి ప్రశంస లందుకుంటాడు. ఈ రెండో కోవకి చెందిన దర్శకుడే స్వర్గీయ సీఎస్ రావు.

          వారసత్వం ఉద్యోగ భద్రత నివ్వచ్చు. వృత్తి నైపుణ్యం స్వయం కృషితోనే అలవడుతుంది. 1925 లో ‘భక్త మార్కండేయ’ అనే తొలి తెలుగు మూకీని పూర్తిగా తెలుగు గడ్డ మీద నిర్మించిన గొప్ప దర్శకుడు సి. పుల్లయ్య తనయుడిగా సీఎస్ రావు ( చిత్తజల్లు శ్రీనివాస రావు) చిన్ననాటి నుంచే తండ్రి నిర్మించే సినిమాల్లో నటిస్తూ, 1953 కల్లా దర్శకుడిగా మారారు. ‘పొన్ని’ అనే తొలి సినిమా తమిళంలో తీశాక -


       ఇంకో తమిళం కూడా తీసి, అప్పుడు 1955 లో తెలుగులో ‘శ్రీకృష్ణ తులాభారం’ తీసి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, మలయాళ, ఒరియా భాషల్లో 70 వరకూ సినిమాలకి దర్శకత్వం వహించారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఆయన సంపాదించుకున్న అనుభవమే 1963 లో తండ్రి అనారోగ్య కారణాలతో ఆగిన ఆల్ టైం ఎవర్ గ్రీన్ క్లాసిక్  ‘లవకుశ’ చివరి భాగానికి తానే  దర్శకత్వం వహించి పూర్తి చేశారు. ‘మసక మసక చీకటిలో..’ వ్యాంప్ తార రాజసులోచన భర్తగా మళ్ళీ కొత్త పాపులారిటీని సంపాదించుకుని వుంటే ఉండొచ్చు గాక-  జీవితపు చరమాంకంలో ఆ పెళ్లి విఫలమై దుర్భర జీవితాన్నే గడపాల్సి వచ్చింది. సినిమా కథలకి అర్ధవంతమైన ముగింపులు పలికే తనే తన జీవితాన్నెలా ముగించుకోవాలో తెలుసుకోకపోవడమే ఆయన జీవితంలో అతి పెద్ద విషాదమేమో!

     
          ‘జీవిత చక్రం’ ఆయన అందించిన క్లాస్ క్రియేషన్. కమర్షియల్ గా వుంటూనే కళ్ళు చెమర్చే సీరియస్ నెస్ తో సుఖాంతమయ్యే ముగ్గురి జీవితాల కథ ఇది. నందమూరి తారకరామారావు, వాణిశ్రీ, శారద లు రోమాన్స్ బరిలో; చిత్తూరు వి. నాగయ్య, హేమలత, శ్రీరంజని, జగ్గయ్యలు జడ్జిమెంటు గుడిలో; రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రావికొండలరావు అండ్ కోలు కామెడీ బడిలో; ప్రభాకరరెడ్డి విలనీ కోటలో సమన్వయం చేసుకుని, ఒక అర్ధవంతమైన సినిమాగా రక్తి కట్టిస్తారు దీన్ని.

     ఇందులో ధర్మారావు ( నాగయ్య) కొడుకు రాజా ( ఎన్టీఆర్) విదేశాల్లో చదువుకుని వస్తాడు. తండ్రి వ్యాపారం చూసుకోమంటే, వినకుండా సరదాగా తిరుగుతూంటే, ఒకనాడు సుశీల ( వాణిశ్రీ) పరిచయమవుతుంది. ఈమె చిన్నపాటి ఉద్యోగం చేస్తూ, తల్లి ( శ్రీ రంజని) ని, చెల్లి ( శ్యామల) నీ పోషించుకుంటూ వుంటుంది. ఇంతవరకూ బాగానే వుంది. కానీ జూదం పిచ్చిగల తండ్రి ( రమణా రెడ్డి), లాటరీల పిచ్చోడైన అన్న పిచ్చేశ్వర్రావ్( పద్మనాభం), ఇంకో ముదిరిన బ్రహ్మచారి మేనమామ బుచ్చేశ్వర్రావ్( రేలంగి) ..ఈశుద్ధ వేస్టు మగ మూక పోషణాభారం కూడా తన మీదే పడుతుంది. ఈమెకి తన జీవితానుభావాల్లోంచి ఒకటే పుట్టింది- డబ్బున్న వాళ్ళంటే అసహ్యం!

          అందుకని డబ్బున్న రాజా నిరుపేదగా నటిస్తూ ఈమెకి దగ్గరవుతాడు. ప్రేమించి, ప్రేమించేట్టు చేసుకుంటాడు. ఓసారి మేనత్త ( హేమలత) ఊరి కెళ్తాడు. తల్లి లేని తనని ఈమే పెంచి  పెద్ద చేసింది. కూతురు కమల ( శారద) పుట్టగానే ఇతడి తోనే పెళ్ళనుకుని అన్న ధర్మారావు దగ్గర మాట కూడా తీసుకుంది.

      కానీ రాజా మాత్రం కమలని ఆ దృష్టితో చూడ్డం లేదు. కమల మాత్రం ఆ దృష్టితోనే చూస్తూ చాలా కలలు కంటోంది. ఇహ పెళ్ళనుకునే సరికి, రాజా సుశీల గురించి చెప్పేసి పెద్ద తుఫాన్నే సృష్టిస్తాడు. తండ్రి కుమిలిపోతాడు. కమల కృశించి జబ్బున పడుతుంది. ఆ ప్రాణాంతక జబ్బుతో చివరి కోరిక ఒకటే కోరుతుంది : ఈ క్షణంలో రాజా చేత తాళి కట్టించుకుని తృప్తిగా కన్ను మూయాలని.

          రాజా ఆమె కోరిక తీరుస్తాడు. ఆ తర్వాతే కథ అడ్డం తిరుగుతుంది- కమల బతికి బాగుపడుతుంది! కలవర పడిపోతుంది. ఏం చేసింది తను? అనుకున్న దేమిటి, జరిగిందేమిటి? నమ్మి తాళి కట్టిన రాజాతో ఇప్పుడెలా? ఇప్పుడెలా నూరేళ్ళ జీవితాన్ని అతడితో పంచుకోవాలి? ఈ లోకం లోంచి వెళ్ళిపోవాల్సిన తనే  ఇలా సుశీలకి అడ్డు అయ్యిందేమిటి? ఇందులోంచి ఎలా బయట పడాలి? ఎలా? ఏమిటి మార్గం?

       ఇదీ విషయం. ఇంతకంటే చెబితే గతంలో ఈ సినిమా చూడని పాఠకుల సీడీ వీక్షణానుభావాన్ని భంగపర్చినట్టే అవుతుంది. ఒక్కటి చెప్పుకోవచ్చు : గొప్ప సస్పెన్సుని పోషిస్తూ  సీఎస్ రావు ఈ క్లిష్ట పరిస్థితిని కొలిక్కి తెచ్చిన తీరుని చూసి ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీర్తారు. ఒకసారి మనం జాన్ ట్రూబీ అనే వెయ్యి సినిమాలకి పైగా స్టోరీ కన్సల్టెంట్ గా పనిచేసిన హాలీవుడ్ స్క్రిప్ట్ డాక్టర్ ఇంటర్నెట్ లో ఏం రాశారో చూస్తే..  ‘ప్రేమకథల్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఐతే పైకి చూస్తే సులభంగా తోచే ఈ ప్రేమ కథల్ని రాయడమే చాలా కష్టమైన పని. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి : ఒక మంచి ప్రేమకథ ఇతర అన్ని రకాల కథలకంటే కూడా అత్యంత బలమైన  ప్రభావం చూపగలదు. ఎందుకంటే, అది ప్రేక్షకులకి వాళ్ళ జీవితాల్లో ప్రేమకున్న అర్ధమేమిటో స్పష్టంగా తెలిసేట్టు చేస్తుంది గనుక!’

          దట్సిట్, సరీగ్గా  ‘జీవిత చక్రం’ తో  సీఎస్ రావు ఈ పనెప్పుడో పూర్తి చేశారు. ఎన్టీఆర్, వాణిశ్రీ, శారదల పాత్రలతో పగా ప్రతీకారాలకి తావివ్వని ఏకతాటి పైకి వాటిని తెచ్చి, వాటి మధ్య ప్రేమానురాగాలనే చాటారు. చాటుతూ ప్రేమలో భిన్న కోణాల్లో త్యాగ ప్రయత్నాల్ని చూపి, మనమెన్ని రకాలుగా ప్రేమకి బద్ధులం కావచ్చో తెలిపారు. అందుకే  ఓ పట్టాన ఈ సినిమాని మర్చిపోవడం సాధ్యం కాదు. నవశక్తి ప్రొడక్షన్స్  పి. గంగాధర రావు నిర్మాణంలో 1.1.1971 న విడుదలైన ఈ మ్యూజికల్ హిట్ లో ఆరుద్ర సినారె లు రాసిన అన్ని పాటలూ శంకర్- జైకిషన్ ల సంగీత సారధ్యంలో ఇప్పటికీ అలరిస్తాయి. నవశక్తి ఫిలిమ్స్ యూనిట్ సమకూర్చిన కథ, స్క్రీన్ ప్లేలకి విద్వాన్ కణ్వశ్రీ మాటలు రాశారు.

***
కదిలించే ఒక సన్నివేశం

కదిలించే సన్నివేశం సినిమా మొత్తానికీ డెప్త్ తీసుకురావచ్చు. 

          పరిస్థితుల దృష్ట్యా ఎన్టీఆర్ శారదకి కి తాళి కట్టిన తదనంతర పరిణామాల్లో మిత్రుడు జగ్గయ్య వచ్చి నిలదీస్తారు ఎన్టీఆర్ ని. ఈ విషయం వాణిశ్రీకి చెప్పకుండా అన్యాయం చేస్తున్నారనీ, ఆమె మోసగాడను కోవచ్చనీ, కనుక వెంటనే వెళ్లి జరిగింది చెప్పేయమనీ హెచ్చరించి వెళ్ళిపోతారు.

          ఇది గమనించిన ఎన్టీఆర్ తండ్రి నాగయ్య,  ‘నువ్వు చేసిన బుద్ధి లేని పనికి లోకమేం అనుకుంటోందో చూశావా?’ అని నిలదీస్తారు. ఈ లోకంతో తన కవసరం లేదని ఎన్టీఆర్ అంటారు.

          ‘నీ కవసరం లేకపోతే మా పరువు ప్రతిష్ఠ లేంగావాలనుకున్నావ్. అసలీ విషయం ఇన్నాళ్ళూ అమ్మాయికి చెప్పకుండా ఎందుకీ నాటకా లాడుతున్నావ్?’ అని రెట్టిస్తారు నాగయ్య. ఆమెకి ఎప్పుడెలా చెప్పాలో తనకి బాగా తెలుసంటారు ఎన్టీఆర్.

          ‘ఏమిట్రా నీకు తెలిసిందీ? పెద్దల మాట లెక్క చేయకుండా స్వతంత్రించి,  ప్రశాంతంగా వున్న కొంప మీద కుంపటి పెట్టడం తెలుసు. దాని ఫలితం నువ్వూ నేనూ అందరమూ అనుభవిస్తున్నాం!’ అని నాగయ్య ఆగ్రహం మిన్నంటుతుంది.

          హర్టయిన ఎన్టీఆర్,  ‘నాన్నా, అందరిలాగా మీరూ అపార్ధం జేసుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. అందరి కన్నీళ్ళకూ నేనే కారణమైతే కావచ్చు. కానీ కావాలని ఎవరికీ ఏ  అన్యాయమూ చేయలేదు.. అత్తయ్యా! ‘ అంటూ హేమలత వైపు వెళ్లి- ‘ కమలని నాకిచ్చి పెళ్లి చేయాలని మీ మనసుసులో వున్న కోరిక నాకెప్పుడైనా చెప్పారా? హుఁ, లేదు.. కానీ అది నా ధర్మంగా భావించి నేనామెకు మాంగల్యం కట్టాను’  అనగానే, అటు పక్క వున్న శారద ఆర్తిగా చూస్తారు. ఎన్టీఆర్ కొనసాగిస్తారు- ‘ఎందుకు? ప్రాణం వదలడానికి సిద్ధంగా వున్న కమలని బతికించుకోవడానికి. అంతేగానీ ఆమె జీవితంతో చెలగాటా లాడ్డానిక్కాదు. మీ మనస్సుల్లో కోరికలు మీరే రగిలించుకుని నా జీవితంతో చెలగాటా లాడిన మనుషులు మీరు. ఈ రోజున అడ కత్తెరలో పోక చెక్కలా ముక్కలు ముక్కలయ్యేట్టు చేసింది మీరు. మీ అందరితో మంచిగా ఉండాలనుకున్న నన్ను ఈ రోజు పిచ్చివాణ్ణి చేసింది మీరు!’ అని ఆగి-

          ఒక నిశ్చయానికి వచ్చినట్టు-  ‘ మీ పరువు  ప్రతిష్టలకి భంగం కలగనక్కర్లేదు. ఈ కథకి ముగింపు బాగా తెలుసు. ఈ కథ ఎలా ముగించాలో బాగా తెలుసు..’ అని కసిగా అనేసి వెళ్లి పోబోతూంటే శారద వచ్చేసి కాళ్ళ మీద పడతారు. ఈ కథకి  ముగింపు తనకి వదిలెయ్యమని ప్రాధేయ పడతారు. ఆమెని విడిపించుకుని బయటికి వెళ్లి పోతారు ఎన్టీఆర్.

***
డైలాగ్ డైజెస్ట్


ఎన్టీఆర్ :

 *బంధుత్వాలు వేరు, బంధాలు వేరు నాన్నా.
*ఏ ధర్మం నిన్ను మారు మనువు చేసుకోకూడదని శాసించిందో, అదే ధర్మం నన్ను కూడా
నిన్ను వదిలి పెట్టొద్దని శాసించింది.
*అద్దంలో ఎన్ని ముఖాలైనా కన్పిస్తాయి, కానీ ఆత్మలో ఒకే లక్ష్యం.
*ఈ కథకి ముగింపు ( నాకు) బాగా తెలుసు, ఈ కథని ఎలా ముగించాలో (నాకు) బాగా తెలుసు.

వాణిశ్రీ :
*ఆలో లక్ష్మణా అని నేనేడుస్తూంటే హలో అంటూ మీరేమిటి?
* జీవితమంతా కన్నీటితో గడిపిన నేను, నవ్వుతూ ఈ బాధని అనుభవించ గలను. కానీ అది నీ వల్ల కాదు.
*మన మంచితనం వల్లే ఇందరి జీవితాలు బాధపడుతున్నప్పుడు, అన్ని ప్రశ్నలకూ ఒకే జవాబుగా మనమే ఆహుతై పోవడం మంచిదమ్మా.

శారద :
*నేను ఆయనకు చాలా దూరంలో వెలుగుతున గుడ్డి దీపాన్ని, నువ్వాయన మనసులో వెలుగుతున్న మాణిక్య దీపానివి.


సికిందర్
(జనవరి 2010 - సాక్షి ‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)





16, ఆగస్టు 2015, ఆదివారం

అన్నదమ్ముల ఆక్రందన!



దర్శకత్వం : కరణ్ మల్హోత్రా
తారాగణం : అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, జాక్విలిన్ ఫెర్నాండెజ్, జాకీ ష్రాఫ్, షెఫాలీ షా, కిరణ్ కుమార్, ఆశుతోష్ రాణా, రాజ్ జుష్టీ తదితరులు
సంగీతం : అతుల్- అజయ్,  ఛాయాగ్రహణం :  హేమంత్ చతుర్వేది
కథ :  గెవిన్ ఓ కానర్, క్లిఫ్ డార్ఫ్ మన్,  అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : ఏక్తా పాఠక్ మల్హోత్రా, 
మాటలు : సిద్ధార్థ్ - గరిమ
బ్యానర్ : ధర్మా ప్రొడక్షన్స్, లయన్స్ గేట్ ఫిలిమ్స్, ఎండెమాల్ ఇండియా
నిర్మాతలు :  కరణ్ జోహార్, హిరూ యాష్ జోహార్, ఎండెమాల్ ఇండియా
విడుదల : 14  ఆగస్ట్, 2015
*
          హాలీవుడ్ సంస్థలు బాలీవుడ్ లోకి ప్రవేశించి వ్యాపారాలు మొదలెట్టుకోవడంతో అంతవరకూ హాలీవుడ్ సినిమాల్ని యదేచ్ఛగా కాపీ కొట్టుకునే హస్తకళకి బాలీవుడ్ లో తీవ్రసంక్షోభం ఎదురైంది. ఏమంటే కాపీ కొట్టిన బాలీవుడ్  నిర్మాణ సంస్థలకి భారీ మొత్తాలకి తాఖీదు లందుతున్నాయి. దీంతో న్యాయమైన హక్కులు కొనుక్కుని అధికారికంగా రీమేక్ చేసుకోవాలన్న జ్ఞాన సంపద సముపార్జించుకుంది బాలీవుడ్. ఈ విజ్ఞతతో ఈ వారం విడుదలైన  ‘బ్రదర్స్’ ని హాలీవుడ్ ‘వారియర్’ కి అధికారిక రీమేక్ అంటూ సగర్వంగా ప్రచారం చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ప్రచారంతో ఇన్నాళ్ళూ హిందీలో చేస్తున్నది అనధికారిక ఫ్రీమేకులే అని రట్టు చేసుకున్నట్లయ్యింది.

         ధికారిక రీమేక్ అయినంత మాత్రాన ఏంతో  గొప్పగా ఉంటుందని అనుకోనవసరం లేదు. అధికారంగా రీమేక్ చేసినా, అనధికారికంగా ఫ్రీ మేక్ చేసినా రెండూ ఒకే క్వాలిటీతో వుండడం బాలీవుడ్ ప్రత్యేకత. ఈ క్వాలిటీకి సహజంగానే హాహాకారాలు చేస్తారు ప్రేక్షకులు.
          ‘వారియర్’ కి అంతర్జాతీయంగా అన్నీ ప్రశంసలే వస్తే, ‘బ్రదర్స్’ కి విమర్శలు రావడం ఎందుకంటే, ఈ అధికారిక రీమేక్ కాస్తా అలవాటైపోయిన  ‘ద్విమేక్’ గా మారిపోవడం వల్ల. దీని దర్శకుడు కరణ్ మల్హోత్రా కిది రెండో సినిమా. తొలిసినిమా ‘అగ్నిపథ్’ ఎంత పాత పంథాలో తీశాడో, అదే పాత పంథా ‘బ్రదర్స్’ లోనూ తొంగి చూడడంతో వచ్చింది సమస్య. దేశీయ ప్రేక్షకుల్ని రంజింప జేయడానికి సగం పాత ఫార్ములాకి కేటాయించి, మిగతా సగం ‘వారియర్’ అయిడియాకి వదిలేశాడు దర్శకుడు. ఇందుకే ఇది ద్విమేక్ అయింది.
          అయితే.. అయితే.. ‘వారియర్’  ఐడియా సెంటిమెంట్ల పరంగా, భావోద్వేగాల పరంగా ఒక స్థాయిలో ఉండిపోతే, వాటిని ఆకాశమార్గం పట్టించి ప్రేక్షకుల్ని కన్నీళ్ళలో ముంచడంలో విజయం సాధించాడు దర్శకుడు. ఇప్పటికే ఈ పని ‘భజరంగీ భాయ్ జాన్’ విజయవంతంగా చేస్తే, ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు ‘బ్రదర్స్’ దర్శకుడు. 
          మెలోడ్రామాని ఆకాశాన్నంటించడంలో ఇండియన్లు సిద్ధ హస్తులు కదా- ఈ విషయంలో దిగదుడుపే హాలీవుడ్!

అన్నదమ్ముల ప్రస్థానం!
      డేవిడ్ ( అక్షయ్ కుమార్), మాంటీ ( సిద్ధార్థ్ మల్హోత్రా) లు అన్నదమ్ములు. వీళ్ళ తండ్రి ఫెర్నాండెజ్ ( జాకీ ష్రాఫ్) మద్యం బానిస, ముంబాయిలో స్ట్రీట్ ఫైట్లు  చేసి సంపాదిస్తాడు. మాంటీ  ఇతను ఉంచుకున్నామె కొడుకు. ఆమె చనిపోయింది. దీంతో మాంటీని తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఇతడి భార్య మరియా ( షెఫాలీ షా) మాంటీ తో అడ్జెస్ట్ అవడానికి ప్రయత్నిస్తూంటుంది. వాడికి బర్త్ డే లు కూడా జరుపుతుంది. పెద్దకొడుకు డేవిడ్ తండ్రి చేస్తున్న తప్పులకి  ద్వేషించినా, మాంటీ ని ప్రేమిస్తూనే ఉంటాడు. మరో పక్క తల్లికి సపోర్టుగా ఉంటాడు. తాగిన మత్తులో నైనా తండ్రి ఉంచుకున్నామె పేరెత్తితే తల్లి సహించదు. ఇలా ఒకసారి గొడవ జరిగి ప్రమాదవశాత్తూ తల్లి చనిపోతుంది. తండ్రి జైలు కెళ్తాడు. అప్పుడు డేవిడ్ కి మాంటీ మీద ప్రేమ నశిస్తుంది. తన తల్లి మరణానికి మూలకారకుడు వీడే నని ద్వేషంతో దూరమైపోతాడు. చిన్నతనంలో తనని ఇలా వదిలేసినందుకు మాంటీ కూడా ద్వేషం పెంచుకుంటాడు. ఇద్దరూ విడిపోతారు.

          ఓ ఇరయై ఏళ్ళకి విడుదలై వస్తాడు ఫెర్నాండెజ్. ఎదిగిన మాంటీ ఇంటిదగ్గరే ఉంటాడు. ఇప్పుడు మద్యం జోలికి వెళ్ళని ఫెర్నాండెజ్ తను చంపుకున్న భార్య ని తల్చుకుని హిస్టీరికల్ గా మారిపోతాడు. మాంటీ అతడికి నచ్చ జెప్తూంటాడు.

          ఎక్కడో డేవిడ్ టీచర్  ఉద్యోగం చేస్తూంటాడు. భార్యా ( జాక్విలిన్ ఫెర్నాండెజ్ ), ఓ కూతురూ వుంటారు. కూతురు తీవ్ర వ్యాధితో వుంటుంది. వైద్యానికి చాలా డబ్బు కావాలి. ఆ డబ్బుల కోసం రాత్రి పూట స్ట్రీట్ ఫైట్లు చేస్తూంటాడు డేవిడ్. ఇది స్కూలు యాజమాన్యానికి నచ్చక ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఇక ఫుల్ టైం ఫైటర్ గా మారిపోవడానికి ముస్తఫా ( ఆశుతోష్ రాణా) అనే రింగ్ లీడర్ ని ఆశ్రయిస్తాడు.

          అటు ఫెర్నాండెజ్ కూడా మాంటీ తో ఇదే పనిచేస్తూంటాడు. మాంటీ ని ఫైటర్ గా తీర్చి దిద్దుతాడు. అన్నదమ్ములు వేర్వేరు ఫైట్లలో పాల్గొని గెలుస్తూంటారు. 

          ఇలా వుండగా ముంబాయిలో అంతర్జాతీయ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎం ఎం ఏ) పోటీలని
నిర్వహించబోతున్నట్టు పీటర్ బ్రిగాంజా ( కిరణ్ కుమార్) అనే ఏజెంట్ ప్రకటిస్తాడు. ఇండియన్ ఫైటర్స్ వర్సెస్ ఇంటర్నేషనల్ ఫైటర్స్ గా ఈ టోర్నమెంట్ వుంటుంది. దీంతో అన్నదమ్ములు ఆ పోటీలకి కఠోర శిక్షణ పొందుతారు. ఒకరికి తెలీకుండా ఒకరు ఈ పోటీలకి హాజరవుతారు. మాంటీ ని ప్రోత్సహిస్తున్న తండ్రి ఫెర్నాండెజ్ స్టేడియంలో డేవిడ్ ని చూసి ఇబ్బందిలో పడతాడు. అన్నదమ్ములు విడివిడిగా అంతర్జాతీయ ఫైటర్స్ ని ఓడించుకు వస్తూ ఫైనల్స్ లో తామిద్దరే మిగులుతారు. దీంతో ఫెర్నాండెజ్ మరీ దిక్కుతోచని స్థితిలో పడతాడు-ఇప్పుడు ఏ  కొడుకుని ప్రోత్సహించాలి? కొడుకులిద్దరూ గెలుపుకోసం కొట్టు కుంటూంటే ఎలా చూడాలి ? ఎవరూ తగ్గే ప్రసక్తే లేదు. ప్రాణ శత్రువుల్లా తయారయ్యారు. ఈ ఈవెంట్ లో వున్న ఇంకో ప్రమాదమేమిటంటే, ఒక ఫైటర్  చేతిలో మరొక ఫైటర్ చనిపోతే అరెస్ట్ వుండదు. ఇప్పటికే నంబర్ వన్ ఫైటర్ నంటూ విర్రవీగిన లూకా అనే అంతర్జాతీయ ఫైటర్, మాంటీ ఇచ్చుకున్న ఒకే ఒక్క పంచ్ కి ప్రాణాలు కోల్పోయాడు..


          ఇదీ విషయం. డేవిడ్ కి మాంటీ అన్నా, తండ్రి అన్నా ఇంకా చావని కసి. పైగా కూతురి వైద్యానికి అదృష్టంగా కలిసివచ్చిన తొమ్మిది కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కోసం దేనికైనా తెగించేందుకు సిద్ధంగా వున్నాడు. మాంటీ కూడా ఏం తీసిపోలేదు. డేవిడ్ మీద ఇన్నేళ్ళకీ పగ చల్లారలేదు. పైగా మెరుపు దాడితో క్షణాల్లో ప్రత్యర్ధిని ఎలా మట్టి కరిపిస్తాడో ఈవెంట్ లో ఎస్టాబ్లిష్ అయింది. వయసులోకూడా తను యంగ్. వయసు రీత్యా శారీరకంగానూ, కూతురి సమస్యతో  మానసికంగానూ కుంగిన డేవిడ్ తనకే మాత్రం పోటీ కాదు!

          ఒక మధుర జ్ఞాపకాల బాల్యాన్ని కలిసి పంచుకున్న అన్నదమ్ములిద్దరూ ఇలా ఈ స్థితికి చేరుకున్నారు..

ఎవరెలా చేశారు
            ఒరిజినల్లో జోల్ ఎడ్గెర్టన్ పోషించిన పాత్రని అక్షయ్ కుమార్, టామ్ హార్డీ పోషించిన పాత్రని సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. ఒరిజినల్లోని తండ్రి పాత్ర నటించిన నిక్ నోల్ట్ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయి వార్తల కెక్కాడు. ఈ పాత్రని హిందీ లో జాకీ ష్రాఫ్ పోషించినప్పుడు పాత్రచిత్రణే అతడికి అన్యాయం చేసింది.  
          ఒరిజినల్లో  నిక్ నోల్ట్  నటించిన పాత్ర చిత్రణ నీటుగా వుంటుంది. అతను గతంలో మద్యం బానిస అని మాటల్లో బయట పడుతుందే తప్ప ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమీ వుండదు. ప్రస్తుత కథలో పెద్ద కొడుకుతో సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నిస్తూంటాడు. జాకీష్రాఫ్  పాత్రని గతంలో మద్యం బానిసగా చూపడంతో బాటు, ప్రస్తుత కథలో గతించిన భార్య గురించిన అరుపులతో హిస్టీరికల్ గా మార్చడం తో అంతా అభాసు అయ్యింది. ఫస్టాఫ్ అంతా ఇదే వరస. సెకండాఫ్ లో పెద్ద కొడుకు ప్రత్యర్ధిని పడగొట్టినప్పుడు అప్రయత్నంగా ప్రశంసించి మొహం దాచుకున్నప్పుడు -ఆ ఒక్క సీనులో జాకీ ష్రాఫ్ కదిలిస్తాడు. కారణం, ఇంతసేపటికి ఈ సీనులో ఆ పాత్ర అపరాధభావం బయటపడింది. దీన్ని మర్చిపోలేని ఎక్స్ ప్రెషన్ తో ప్రదర్శించాడు జాకీ ష్రాఫ్.


          ఎప్పుడో తన చేతిలో మరణించిన భార్య గురించిన  గోడు కంటే (భార్య చావుకి  శిక్ష కూడా అనుభవించాక అది ముగిసిన అధ్యాయమే)  తన కారణంగా కొడుకు లిద్దరూ విరోధులయ్యారన్న అపరాధభావం తో సతమతమయ్యే పాత్రగా దీన్ని తీర్చిదిద్ది వుంటే - అప్పుడా పాత్రలో జాకీ బెస్టుగా వుండే వాడు. కథ అన్నదమ్ముల మధ్య విరోధం గురించి అయినప్పుడు దానికి కారకుడైన వాడు ఇంకేదో సమస్యతో బాధపడ్డం పాత్రౌచిత్యం అన్పించుకోదు. ఇప్పుడు తన కళ్ళ ముందున్న సమస్య గురించి బాధపడినప్పుడు మాత్రమే పాత్ర కథతో కనెక్ట్ అయినట్టు లెక్క. ఒరిజినల్లో ఇలాగే చిత్రించారు.

          అక్షయ్ కుమార్ పాత్రని కూడా ఒరిజినల్ కి విరుద్ధంగా మొదటినుంచీ విషాదంగానే  మార్చారు. ఒరిజినల్లో ఈ పాత్ర ఎంత కూతురి ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ అదేపనిగా బాధపడుతూ వుండదు. సమస్యపట్ల ప్రాక్టికల్ గా, యాక్టివ్ గా వుంటుంది. అక్షయ్ కుమార్ ఇమేజి దృష్ట్యా అయినా ప్రేక్షకులాశించే దూకుడు తనం ఈ పాత్ర కుండాల్సింది. నెరిసిన గడ్డంతో వయసు మీద పడ్డవాడిలా అదే భారమైన గెటప్ తో సినిమా సాంతం చూపించారు. తండ్రి జైలు నుంచి విడుదలై వచ్చేటప్పటికి అతను నడివయసులో వుండే అవకాశం లేదు. తండ్రి జైలు కెళ్ళే టప్పటికి తనకి పట్టుమని పదిహేనేళ్ళు కూడా లేవు.

          నడివయసులో వున్న వ్యక్తి  చేయకూడని స్ట్రగుల్ ( ఫైటర్ గా) చేస్తున్నాడని చూపించడంలో సానుభూతి ఉంటుందని భావించారేమో తెలీదు- వయసు మీద పడ్డ వాడిలా అతను ను ఫైట్ చేస్తూంటే మాత్రం చూడ్డానికేం బాగా లేడు. అసలు ఒక సామాన్య టీచర్ అత్యవసరమైన డబ్బుకోసం ఫైటర్ గా మారడంలోనే బోలెడు సానుభూతి వుంది. ఈ క్యారక్టర్ ఆర్కే  అర్ధవంతంగా వుంటుంది.

          ఎక్కడ అక్షయ్ బావున్నాడంటే- ఆ ఫైట్ కాస్తా తమ్ముడితో చేయాల్సి వచ్చినప్పుడు- క్లయిమాక్స్ లో మాత్రమే. అక్కడ సెంటిమెంట్ల వల్ల, భావోద్వేగాల వల్ల అతడికా లుక్ వున్నా సరిపోయింది. ఎంత వైరమున్నా ఫైట్ పేరుతో సొంత తమ్ముణ్ణే చావచితకదన్నడం ఏ అన్నకీ రాకూడని పరిస్థితి. ఈ మోరల్ డైలమా ని అత్యుత్తమంగా ప్రదర్శించాడు అక్షయ్ తమ్ముడితో ఫైట్ చేయలేకపోతూ. ఒక పక్క కూతురి వైద్యం - మరో పక్క తమ్ముడి ప్రాణం. ఒరే ఇక  చాలించరా- అని డస్సిపోయి కూడా తిరగబడుతున్న తమ్ముణ్ణి ప్రాధేయపడాల్సిన పరిస్థితి.

          తమ్ముడి పాత్రలో సిద్ధార్థ్  మల్హోత్రా ఈ సినిమాకి ఎస్సెట్. ఈ పాత్రచిత్రణ లో కూడా ఒక లోపం వుంది. ఐతే అతను ఎప్పుడు మాట్లాడతాడో తెలీదు. సినిమా సాంతం ఒకే చూపు చూస్తాడు. అమాయకంగా వుండే ఆ చూపులోనే ఈ ప్రపంచం సంగతి నాకు తెలుసులే అన్న ధిక్కారం వుంటుంది. స్కూల్లో చదివేటప్పుడు తోటి పిల్లలు అతణ్ణి బాస్టర్డ్ అన్నారు. ఆ మూలల్లోంచి అతను అలా ఉంటాడు. బాస్టర్డ్ కాదని తెలియాలనేమో తండ్రిని అంటి పెట్టుకుని ఉంటాడు. రింగ్ లో అంతర్జాతీయ ఘనాపాటీని రావడం రావడం ఒక్క పంచ్ తో నేలకరిపించేసరికి  స్టేడియం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయినా నిర్లిప్తంగా చూస్తూంటాడు. చాలా క్రేజీ లుక్ అది.

          ఈ ఘట్టంలో లో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట చరణం ఇలా వుంటుంది..
హర్ డర్ కా హటా దే కొహ్రా 
తాఖత్ తూ బాన్ మొహ్రా 
హర్ లక్ష్యా కో భేడ్ కే దిఖ్లా దే 
అర్జున్ కి కహానీ దొహ్రా..

(భయమనే పొగ మంచుని తొలగించుకుని శక్తి శాలియైన సైనికుడివి కా,
ఏర్పరచుకున్న లక్ష్యాలన్నీ సాధించి అర్జునుడి కథ పునరావృతం చెయ్!)

***
      ఒరిజినల్లో ఈ తమ్ముడి పాత్రకి ఒక ఫ్లాష్ బ్యాక్ వుంటుంది- ఇరాక్ యుద్ధంలో పాల్గొని వచ్చినట్టు. ఇప్పుడు ఈ ఫైట్ గెలిస్తే,  ఆ ప్రైజ్ మనీ ఐదు మిలియన్ డాలర్లని ఇరాక్ యుద్దంలో చనిపోయిన అమెరికన్ సైనికుల కుటుంబాలకి అందజేస్తానని ఉదారంగా ప్రకటిస్తాడు. హిందీ రీమేక్ లో ఈ బ్యాకప్ లేదు. ఉన్నదల్లా చిన్ననాటి బాధాకరమైన ఫ్లాష్ బ్యాకే. ఈ ఫ్లాష్ బ్యాక్ వల్ల పాత్రకి డెప్త్ ఐతే వచ్చింది గానీ, ఫైట్ లో పాల్గొనేందుకు అతడికి ఉన్నతాదర్శం ఏదీ లేదు. అన్న మీద కోపంతో తనూ ఫైట్ కి వెళ్తున్నాడనుకోవడానికి అన్న కూడా పాల్గొంటున్నాడని అప్పటికింకా అతడికే తెలీదు. అంటే కేవలం ఆ ప్రైజ్ మనీ తొమ్మిది కోట్ల రూపాయమీద కన్నేసి ఫైట్ కి సిద్ధమ య్యాడా? ఆ డబ్బుతో తను రిచ్ అయిపోవాలనా? ఈ దృష్ట్యా స్వార్ధపూరితమైన పాత్రని పై పాట ద్వారా అర్జునుడంటూ గొప్పగా ఎలివేట్ చేయడంలో అర్ధమే లేదు.

          అన్న పాత్ర భార్యగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ ది పెద్దగా స్కోపు లేని పాత్ర. మొదట కూతురి అనారోగ్యంతో ఆందోళన చెందుతూ, తర్వాత ఈవెంట్ లో భర్త ఒక్కొక్కడ్ని ఓడిస్తూంటే ఆనందంతో ఎగిరి గంతులేసే పాత్రగా ఉండిపోయింది. అలాగే అన్నదమ్ముల తల్లిపాత్రలో షేఫాలీ షా- ఒక పక్క భర్త దాష్టీకంతో, మరో పక్క అతడి అక్రమ సంతానం సంక్షేమ బాధ్యతతో నలిగిపోయే పాత్రగా కన్పిస్తుంది.    

          ఇక ఇతరపాత్రల్లో కిరణ్ కుమార్, ఆశుతోష్ రాణా, రాజ్ జుట్షీ లు చాలా పాత సహాయ నటులే. పాత టేస్టున్న యువ దర్శకుడికి ఈ తెరమరుగైన పాత నటులే గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు.


          సంగీతం, ఛాయాగ్రహణం, యాక్షన్ కోరియోగ్రఫీ ఉన్నతంగా వున్న ఈ యాక్షన్ డ్రామా కి మెగా స్టేడియం లో భారీ ఎత్తున జరిపిన ఈవెంట్ చిత్రీకరణ దాదాపు  సెకండాఫ్ అంతా ఆక్రమిస్తుంది. ‘లగాన్’ లో గంట పాటు ఎలాగైతే పాత్రల మధ్య క్రికెట్ చూపిస్తారో- అలా గంటకి పైగా రెండ్రోజుల ఎంఎంఏ ఈవెంట్ ని చూపించాడు దర్శకుడు. 

          ఫస్టాఫ్ లో ప్రేక్షకుల్ని చాలా కఠినంగా శిక్షించిన దర్శకుడు, సెకండాఫ్ లో దానికి పరిహారం చెల్లించాడు. బలమైన క్లయిమాక్స్ తో ఇక ప్రేక్షకులు మారు మాటాడకుండా చేశాడు.

స్క్రీన్ ప్లే సంగతులు
       ‘రెండు పాత్రల మధ్య పద్నాల్గేళ్ళ  ఎడబాటు వుందని చెప్తున్నప్పుడు, ఆ ఎడబాటు గురించి చాలా కథ చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్కోసారి ఆ గతం గురించి ఒక పాత్ర ఆ రెండో పాత్రతో మాట్లాడుతున్నప్పుడు- రెండో పాత్రకీ ఆ గతం తెలుసు గాబట్టి - ఆ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఆ పాత్రల మధ్య డైలాగుల్లో వెల్లడైతే సరిపోతుంది...’  ఇదీ ‘వారియర్’  దర్శకుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య గతంలో అసలేం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ వేయకుండా మాటల ద్వారానే  ఎందుకు చెప్పించాల్సి వచ్చిందన్న దానికి ఇచ్చిన వివరణ.

          హిందీలో ఈ గతాన్నంతా ఫ్లాష్ బ్యాక్ లో చూపించు కొచ్చారు. అదీ మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో- మధ్య మధ్యలో రియల్ టైం లో ఇప్పుడు అన్నదమ్ములూ తండ్రీ ఏం  చేస్తున్నారో చూపిస్తూ. 
దేశీయ ప్రేక్షకుల కోసం ఈ ఫ్లాష్ బ్యాక్ అవసరమే. దీన్ని ఏకబిగిన పది  నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఇలాకాకుండా ఖండఖండాలుగా ఫ్లాష్ బ్యాక్స్ వేస్తూ, మధ్యమధ్యలో జైలు నుంచి వచ్చిన తండ్రి గొడవ చూపిస్తూ, అన్న దమ్ముల విడివిడి స్ట్రీట్ ఫైట్లు వేస్తూ..ఇలా అనేక విషయాల్ని మోసుకుంటూ వచ్చేసరికి ఇంటర్వెల్ వచ్చేసింది గంటా పది నిమిషాలకి.


          ఇక్కడా సమస్య ఏర్పాటు కాలేదు- కథేమిటో సూచన ఇవ్వలేదు. అన్నదమ్ములని ఎదురు రెదురు రప్పించి మాత్రమే ఇంటర్వెల్ వేశారు. దీనివల్ల ఇంకా బిగినింగ్ విభాగం పూర్తి కాని ఫీలింగ్. ‘బాహుబలి’ మొదటి భాగం ముగిసినా ఇంకా కథా పరిచయ బిగినింగ్ విభాగం ఎలా ముగియలేదో- అలా ఇక్కడ ఇంటర్వెల్ కొచ్చినా కథా పరిచయ బిగినింగ్ విభాగం ఇంకా మిగిలిపోయే వుంది.

          సింపుల్ గా చెప్పాలంటే ఇది సార్వజనీన త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లే కాదు. త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లే లో ఇంటర్వెల్ లోపే బిగినింగ్ ముగిసి మిడిల్ కొస్తుంది కథ. చాలా హిందీ- తెలుగు సినిమాలు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ కాక, ఫస్టాఫ్- సెకండాఫ్ అనే లోకల్ స్ట్రక్చర్లో ఎలా ఉంటున్నాయో,  అలా ‘బ్రదర్స్’ సైతం ‘ఫస్టాఫ్- సెకండాఫ్’ స్ట్రక్చర్లో వుంది.

          అంటే ఫస్టాఫ్ అంతా  బిగినింగ్ విభాగమే సుదీర్ఘంగా సాగి, అప్పుడు ఇంటర్వెల్లో పాయింటు కొస్తుంది కథ. ఇంటర్వెల్ తర్వాత ఆ సెకండాఫ్ ఆట స్థలంలోనే ఆ పాయింటుతో స్ట్రగుల్ చేసే  మిడిల్ విభాగమూ, ఆ పాయింటుకి పరిష్కారం చెప్పే ఎండ్ విభాగమూ కలిసి పంచుకుంటాయన్న మాట.

          దీని వల్ల సినిమా మొత్తంలో యాభై  శాతం ఉండాల్సిన మిడిల్ విభాగం ఆట స్థలం పాతిక శాతానికి కుంచించుకు పోతుంది. రెండు గంటల సినిమా వుందంటే ఇంటర్వెల్ కి ముందు అరగంట సేపు, ఇంటర్వెల్ తర్వాత ఇంకో అరగంట సేపూ మొత్తం గంట సేపూ మిడిల్ ఆటస్థలం ఉన్నప్పుడే సినిమాకి (కథకి) బలం వస్తుంది. ఇలాకాక మొత్తం ఇంటర్వెల్ వరకూ గంట సేపూ బిగినింగ్ విభాగమే ఆక్రమిస్తే అది కథకి ఆటస్థలం కాదు- ఉపోద్ఘాత భూతమే. ఉపోద్ఘాతం అంత  వుండడం అవసరమా?

          కానీ- ఈ రిమేక్ ని జాగ్రత్తగా చూస్తే, ఫస్టాఫ్ లోపే బిగినింగ్ ముగిసింది!  ఇది తెలుసుకోలేదు. తెలుసుకున్నా ఏమీ చేయలేక- ఎంఎంఏ కాన్సెప్ట్ లాగే,  మిక్స్ డ్ మిడిల్ ఎనీమియా గా తయారు చేశారు.

          అన్న పాత్ర స్కూల్లో ఉద్యోగం కోల్పోయినప్పుడే ఫస్టాఫ్ లో చక్కగా బిగినింగ్ విభాగం ముగిసింది.  ఇక డబ్బుకోసం ఫుల్ టైం ఫైటర్ గా మారడానికి చేసే స్ట్రగుల్ తో మిడిల్  ప్రారంభమయ్యింది కూడా ఇంటర్వెల్ లోపే. కానీ ఫ్లాష్ బ్యాక్ ఖండికలు ఇంకా మిగిలి వుండడం తో, తండ్రి గొడవ, అన్నదమ్ముల విడివిడి ఫైట్లూ ఇంకా మిగిలి ఉండడంతో- ఈ బిగినింగ్ విభాగాన్ని మళ్ళీ ఇంటర్వెల్ దాకా కంటిన్యూ చేశారు. అంటే బిగినింగ్ లో మిడిల్ ఇరుక్కుపోయింది! ఇలాటి స్క్రీన్ ప్లే ఎక్కడా వుండదు బహుశా.

          ఒరిజినల్లో టీచర్ ఉద్యోగం కోల్పోవడంతో 35 వ నిమిషానికి బిగినింగ్ ముగిసి మిడిల్లో పడుతుంది కథ. ఈ వొరిజినల్ స్క్రీన్ ప్లేలో చూసినా- 28 వ పేజీకల్లా ఈ మలుపు వస్తుంది. ఇక్కడ్నించీ మిడిల్ 92వ పేజీ వరకూ 64 పేజీలూ కొనసాగుతుంది. 93వ పేజీ నుంచి 103వ పేజీ వరకూ 10 పేజీలూ ఎండ్ విభాగం వుంటుంది.

          సినిమాలో చూసినా- 35 వ నిమిషంలో మిడిల్లో పడ్డ కథ, గంటా 25 నిమిషాలు మిడిల్లో కొనసాగి, చివరి ఇరవై నిమిషాలు ఎండ్ తో నడుస్తుంది. సినిమా మొత్తం నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు. బిగినింగ్ 35 నిమిషాలు, మిడిల్ 85 నిమిషాలు, ఎండ్ 20 నిమిషాలు. ఇదీ ఒరిజినల్లో వున్న  త్రీ యాక్ట్ స్ట్రక్చర్.

          ఆ మిడిల్లో అన్న చేస్తున్న స్ట్రగుల్లోనే ఒకసారి తండ్రితో, ఇంకో సారి తమ్ముడితో ముఖాముఖీ అయినప్పుడు వాళ్ళ పాత గొడవలేమిటో వాళ్ళ మాటల్లోనే  బయటపడతాయి. అంతే  తప్ప దీనికి ఫ్లాష్ బ్యాక్స్ వేయలేదు.

          ఒరిజినల్లో అన్న ఉద్యోగం కోల్పోవడం బిగినింగ్, స్ట్రగుల్ మిడిల్, తమ్ముడితో ఫైటింగ్ కి దిగడం ఎండ్.  

          రీమేక్ లో ఏజెంట్ ఎంఎంఏ ఎనౌన్స్ చేయడం బిగినింగ్, ఈవెంట్ లో అన్న ఒక్కొక్కడ్నీ
ఓడించడం మిడిల్, తమ్ముడితో తలపడ్డం ఎండ్.


          ఇదీ తేడా. రీమేక్ లో ఏజెంట్ ఎంఎంఏని  ఎప్పుడు ఎనౌన్స్ చేశాడు? ఇంటర్వెల్ తర్వాత వెంటనే. కాబట్టి బిగినింగ్ అక్కడికొచ్చి ముగిసింది. సినిమా ఫస్టాఫ్ వాష్ అవుట్ అనీ, ఫస్టాఫ్ లేకపోయినా కొంప లంటుకోవనీ సర్వత్రా టాక్ వస్తోందంటే రాకుండా ఎలా వుంటుంది? కారణాలు ఇవీ. ఫస్టాఫ్ అంతా ఉపోద్ఘాతంతో నస పెట్డడమే తప్ప కథ వేషం కట్ట లేదు.
***

          నష్టాన్ని సెకండాఫ్ ప్రారంభంలోనే పూడ్చడం చాలా మెరుగు. ఎంఎంఏ ఎనౌన్స్ మెంట్ అయిన వెంటనే ఇక నస పెట్టకుండా టోటల్ నాన్ స్టాప్ యాక్షన్ గా సాగించడం, మధ్యమధ్యలో జబ్బుతో వున్న కూతురితో సీన్లు వేయడం చేసుకుంటూ పోయారు. ఫైటర్ గా ఎంఎంఏ బరిలోకి దిగిన అన్న, అలాగే తమ్ముడు కూడా వాళ్ళ ఫైటింగ్ టెక్నిక్స్ ని ఎలా ప్రదర్శిస్తారో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయారు. అన్న కంటే తమ్ముడి టెక్నిక్ కొట్టొచ్చినట్టూ వుంటుంది. ఊహించని మెరుపు దాడితో క్షణాల్లో ప్రత్యర్ధిని పడగొట్టే తన టెక్నిక్ ని చివరికి అన్న మీద కూడా ప్రయోగిస్తాడు. అన్నకి ప్రత్యర్ధిని లాక్ చేసి ఎముకలు విరిచేసే టెక్నిక్ వుంటుంది.

          ఈ అన్నదమ్ముల కథ ఒరిజినల్ లో వున్నట్టు ఈ రిమేక్ లో వుండదు. ఒరిజినల్ లో తప్పు స్పష్టంగా అన్నదే అన్నట్టు వుంటుంది. ఇద్దరూ ఒకే తల్లి పిల్లలు. తండ్రి తాగుబోతు. తల్లికి క్యాన్సర్. తండ్రి పట్టించుకోక పోతే, ఇక తల్లిని వేరే వూరికి చికిత్సకి తీసికెళ్ళాల్సి వస్తే, వెంట అన్న వెళ్ళడు. ఒకమ్మాయితో ప్రేమాయణం సాగిస్తూ ఆ పెళ్ళీ, సంసారం అనే లోకం లో పడిపోతాడు. తల్లిని తీసికెళ్ళిన తమ్ముడు తల్లి మృతిని చూస్తాడు. ఈ విషయం కూడా అన్నకి చెప్పకుండా కసి పెంచుకుని సంబంధాలు కట్ చేసుకుంటాడు. తండ్రి ఇక తాగుడు మానెయ్యడానికి పునరావాస కేంద్రం లో చేరతాడు. తల్లి క్యాన్సర్ తో చనిపోవడం, ఆమెని నిర్లక్ష్యం చేసిన అన్న కూతురు అప్పుడే హృద్రోగం బారిన పడ్డం ఇదంతా కర్మ సిద్ధాంతం లాగే వుంటుంది. ఈ సినిమా పునరావాస కేంద్రం లో తండ్రి బాగు పడి తిరిగి వస్తూండడంతో ప్రారంభమవుతుంది. హిందీ రిమేక్ లో తండ్రి జైలు నుంచి విడుదలై రావడంతో ప్రారంభం వుంటుంది.

          ఒరిజినల్లో జరిగిన కథ పాత్రల మధ్య మాటల ద్వారా వ్యక్తమైతే, రిమేక్ లో ఫ్లాష్ బ్యాక్ వేసి చూపిస్తారు. దీని వల్ల ఒక మేలు  జరిగింది. అన్నదమ్ముల ఈ చిన్నప్పటి బాంధవ్య దృశ్యాలు తర్వాత పవర్ఫుల్ మాంటేజెస్ గా ఉపయోగపడ్డాయి. ఫ్లాష్ బ్యాక్ దృశ్య రూపంలో లేక పోతే ఈ మాంటేజెస్ లేవు. ఈ మాంటేజెస్ లేకపోతే క్లయిమాక్స్ కి- మొత్తం కథకే  జీవం లేదు!
***
మిడిల్ విభాగమంతా అంతర్జాతీయ ఫైటర్లతో అన్నదమ్ముల విడివిడి రౌండ్లతో సంఘర్షణా త్మకంగా వుంటుంది. చివరికి బరిలో అన్నదమ్ములే మిగలడం ఈ విభాగం ముగింపు. 

          ఒరిజినల్, రిమేక్ రెండిటి క్లయిమాక్స్ (ఎండ్ విభాగం) ఇదే. అసలు విషయమంతా ఇక్కడే వుంది. ఇంతసేపూ నడిచిన  కథంతా ఇక్కడే సారాన్ని పిండి గూఢార్ధాలు పలుకుతుంది. గూఢార్ధాలు రిమేక్ లో వర్కౌట్ అయినంతగా ఒరిజినల్లో కాలేదు. ఇక్కడే దర్శకుడు కరణ్ మల్హోత్రా స్కోర్ చేశాడు. ఒరిజినల్ని దాటిపోయి- చెప్పకుండానే బలమైన నీతిని  ఈ క్లయిమాక్స్ ద్వారా చెప్పి ముగించాడు.
            ఒరిజల్లో విడిపోయిన అన్నదమ్ముల మధ్య ఫైట్ లో మాటలుండవు. కేవలం యాక్షనే వుంటుంది. ఈ యాక్షన్ లో తమ్ముడి భుజం విరిచెయ్యడం పరాకాష్ఠ. అప్పటికి కొంత బెట్టు చేసినా తమ్ముడు ఓటమిని అంగీకరించాక పట్టుకుని ఏడ్చేస్తాడు అన్న. భుజం విరిగిపోయిన తమ్ముణ్ణి ఆర్తిగా పొదివిపట్టుకుని అలాగే స్టేడియం నుంచి నడిపించుకుంటూ వెళ్తూంటే, ఇది చూస్తున్న తండ్రి ఆనందంతో ముగుస్తుంది సినిమా. అయితే హోరాహోరీ పోరాడు తున్నప్పుడు కనీసం మాట్లాడుకోక పోవడంతో- అన్నాళ్ళ కసిని కూడా వెళ్ళ గక్కుకోక పోవడంతో, ఆ యాక్షన్ అంతా ఫ్లాట్ గానే వుంటుంది.

           రీమేక్ లో కూడా భుజం విరిచేసిన తమ్ముణ్ణి ఇలాగే ఆర్తిగా పొదివి పట్టుకుని స్టేడియం నుంచి నడిపించుకు పోతాడు అన్న. తండ్రి ఆనందిస్తాడు. అయితే హోరాహోరీ కొట్టుకుంటు న్నప్పుడు ఎమోషన్ తో రెండే రెండు డైలాగులు పేల్తాయి. చివరి రౌండ్ లో తమ్ముడి భుజం విరిచేశాక - ఒరే ఇక చాలించరా!- అని అన్న వేడుకోవడం, అయినా అలాగే అన్నని పడదోసి లాక్ చేసి-  ఆమె నాక్కూడా అమ్మే కదరా! - అని తమ్ముడు అనడం కథని ఎక్కడికో తీసికెళ్ళి పోయింది!!

            సినిమా మొత్తం మీద వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఈ రెండు ముక్కలే. ఇది వెర్బల్ గా. ఇక విజువల్ గా చూస్తే- ఫ్లాష్ బ్యాక్ లోంచి రెండు విజువల్స్ ఇక్కడ ప్రయోగించి ఆశ్చర్య పరుస్తాడు చేస్తాడు దర్శకుడు. తమ్ముణ్ణి కొట్ట బోతూంటే అన్నకి చిన్నప్పటి తమ్ముడు కన్పిస్తాడు- ముద్దు ముద్దుగా నవ్వుతూ.  అలాగే తమ్ముడు అన్నని కొడుతూంటే చిన్నప్పుడు అన్న తనని వీపెక్కించుకుని ఆడించిన దృశ్యం మెదుల్తుంది!

          ఈ సృజనాత్మకత క్లయిమాక్స్ ని అతి శక్తిమంతంగా మార్చేసింది. కళ్ళు చెమర్చే ఈ దృశ్యాలు ఈ సిట్యుయేషన్ లో చెప్పకనే ఒక విషయం స్పష్టం చేస్తాయి- తోబుట్టులెవరైనా, వాళ్ళ బాల్యంలో ఎలా కలిసి గడిపారో ఆ స్మృతుల్ని ఏ అవాంతరాలొచ్చినా జీవితకాలం మోసుకు తిరక్కపోతే, ఇదిగో ఇలాటి కౄర తీరాలకే చేరుకుంటారు. తోబుట్టువులతో బాల్య స్మృతుల్ని చెరిపేసుకోవడం మహాపరాధం. ఎలా బయల్దేరినవాళ్ళం అలాగే కొనసాగాలి. సౌభాతృత్వానికి ఇంతకంటే బలమైన చిత్రణ లేదు.


—సికిందర్