రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఆగస్టు 2014, శనివారం

ఆర్టికల్..


వర్మతో ఈ విజయ యాత్ర ముగిసినట్టేనా?

ఒకప్పుడు ప్రఖ్యాత తెలుగు దర్శకులు హిందీలో విజయవంతమైన సినిమాలు తీసి అక్కడి జనబాహుళ్యం హృదయాల్ని దోచుకునేవారు. హిందీలోకి వెళ్ళిన నాటి ప్రఖ్యాత దర్శకులు కనీసం దశాబ్ద కాలానికి తగ్గకుండా హిందీ కెరీర్ ని కూడా కొనసాగిస్తూ, ఒకొక్కరూ హీనపక్షం డజను సినిమాలు తీసి సంచలనం  సృష్టించారు. 1950ల నుంచీ 1990 ల వరకూ అప్రతిహతంగా సాగి  ఈ విజయ యాత్ర ముగుస్తున్న దశలో, తిరిగి ఒకే ఒక్క తెలుగు దర్శకుడి వల్ల ఊపందుకుని, ఆ ఒక్కడితోనే ఇప్పటిదాకా రెండు దశాబ్దాల పాటూ ముప్ఫై సినిమాల రికార్డుతో రికార్డుల్నిసృష్టిస్తోంది. ఈ ఒకే ఒక్కడు రాంగోపాల్ వర్మ అయితే, ముందు చెప్పుకున్న ప్రఖ్యాతుల్లో ఎల్వీ ప్రసాద్ దగ్గర్నుంచీ కె. రాఘవేంద్ర రావు వరకూ డజను మంది పైనే వున్నారు.

ఇప్పుడు హిందీలో వర్మ ప్రాభవం కూడా తగ్గిన నేపధ్యంలో ఏర్పడుతున్న శూన్యాన్ని  భర్తీ చేసేందుకా అన్నట్టు కొత్త బృందం బయల్దేరుతోంది. ఈ బృందంలో శేఖర్ కమ్ముల దగ్గర్నుంచీ నందినీ రెడ్డి వరకూ వున్నారు. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ఈ కొత్త బృందం బాలీవుడ్ లో తమ పూర్వీకులు ఎగరేసిన విజయ పతాకాన్ని ఇంకా  రెపరెప లాడిస్తారా లేక, ఉన్నజెండాని దింపేసుకుని తిరుగుముఖం పడతారా అన్నది!

తెలుగులో ఒక  సినిమా తీసి విడుదలకోసం ఎదురు చూస్తున్న ఒక కొత్త  దర్శకుడికి బాలీవుడ్ లో తనకున్న కనెక్షన్స్ ద్వారా ఓ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీని గురించి బాధపడుతూ అంటారాయన- ‘అనేక కార్పోరేట్ సంస్థలు అక్కడ సినిమా నిర్మాణంలోకి దిగడంతో, దేశవ్యాప్తంగా దర్శకులు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో విపరీతమైన పోటీ పెరిగి దిక్కు తోచని స్థితిలో పడిపోతున్నారు...సౌత్ నుంచి ప్రయత్నించాలంటే అది కలలోని మాటగా మిగిలిపోతోంది...’

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే- రాం గోపాల్ వర్మ కూడా ఫ్రెష్ గా వెళ్లి బాలీవుడ్ లో ప్రయత్నించలేదు. తెలుగులో కొన్ని సినిమాలు తీశాకే, ‘శివ’ ని హిందీలో విడుదల చేశాకే, హిందీ వాళ్ళ దృష్టిలో పడి ‘రంగీలా’ తో విజయాత్ర ప్రారంభించ గలిగారు. తాజాగా హిందీలో ప్రవేశించిన  తెలుగు దర్శకుడు అజయ్ భుయాన్ అయితే- తన బాలీవుడ్ ప్రవేశం సునాయాసంగా జరిగి పోయిందంటారు. అక్కినేని నాగ చైతన్యతో ‘దడ’ అనే ఫ్లాప్ సినిమా తీసిన వెంటనే ముంబాయి నుంచి ఒక కాల్ వచ్చింది- నువ్వు హిందీ సినిమా తీస్తున్నావ్- అని. అంతే, దాంతో ఏ రీమేకూ కాకుండా ‘అమిత్ సహానీ కీ లిస్ట్’ అనే ఫ్రెష్ రోమాంటిక్ కామెడీ హిందీలో ప్రారంభమై పోయింది. అయితే విడుదలకి రెండేళ్ళు పట్టింది.

తెలుగులో హిట్టయిన సినిమాల మీద కన్నేసి హిందీలో రీమేక్ చేసుకోవడం సాంప్రదాయంగా పాటిస్తున్న బాలీవుడ్ నిర్మాతలు, తెలుగు దర్శకుల మీద అంతగా కన్నేయడంలేదు. ఇప్పుడు తాజాగా కొందరు తెలుగు దర్శకులకి హిందీ అవకాశా లొస్తున్నాయంటే అది తెలుగులో వాళ్ళు తీసిన హిట్స్ ని వాళ్ళతోనే రీమేక్ చేయించుకుందా మన్న ఆలోచనకి రావడం వల్లే. అలా శేఖర్ కమ్ముల “హేపీడేస్’ తో, నందినీ రెడ్డి ’అలామోదలైంది’ తో, క్రిష్ ‘వేదం’ తో, నీలకంఠ ‘మాయ’ తో, హిందీలోకి అడుగు పెడుతున్నారు. ఒక్క అజయ్ భుయాన్ మాత్రమే  ఇటీవల డైరెక్టుగా హిందీలో ‘అమృత్ సహానీ కీ లిస్టు’ తీయగలిగారు. ఇక సుకుమార్ అయితే ‘ఆర్య-2’ హిందీ రీమేక్ ఆఫర్ వచ్చినా అంగీకరించలేదు.

శేఖర్ కమ్ముల ‘హేపీడేస్’ రీమేక్ గురించీ, క్రిష్ ‘వేదం’ రీమేక్ గురించి కూడా ప్రతిపాదనలు చాలా కాలంగా నానుతూ వున్నాయి. ఎప్పుడో తెలుగులో హిట్టయిన వెంటనే బోనీకపూర్ ‘హేపీడేస్’ ని హిందీలో తీయాల్సింది. అది అలా అలా మరుగున పడిపోయింది. శేఖర్ కమ్ముల తెలుగులో వేరే సినిమాలు తీసుకుంటూ వుండి పోయారు. తాజాగా ‘అనామిక’ (హిందీ ‘కహానీ’కి రీమేక్) తీసి అది విజయం సాధించకపోవడంతో, తను ఇప్పుడేం చేస్తారోనని  ఎదురు చూస్తున్న సందర్భంలో హఠాత్తుగా మళ్ళీ  ‘హేపీడేస్’ హిందీ రీమేక్ వార్త వచ్చింది. ఈసారి సల్మాన్ ఖాన్ నిర్మాత! దీనికోసం హిందీలో కొత్త నటీనటులకి ఆడిషన్స్ జరుగుతున్నాయి.

ఇక క్రిష్ ‘వేదం’ హిందీ సంగతి అటకెక్కి, అనూహ్యంగా చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ రీమేక్ తెరపైకొచ్చింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇందులో చిరంజీవి పాత్ర పోషిస్తున్నారు. దీనికి టైటిల్ కూడా ‘గబ్బర్’ అని పెట్టారు. శృతీ హసన్ హీరోయిన్ గా ఇది నిర్మాణం కూడా పూర్తి చేసుకుని వచ్చే జనవరి లో విడుదల కానుంది. దీనికి పేరున్న పెద్ద దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాత. ఇది హిందీలోకి అడుగు పెట్టిన కొత్త తరం దర్శకుల్లో క్రిష్ ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడుతోంది. అగ్ర నిర్మాతతో, అగ్ర హీరో- హీరోయిన్లతో 78 కోట్ల మెగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణ మౌతోంది...ఇంత  భారీ బడ్జెట్ తో హిందీలో సినిమాలు తీసిన తెలుగు దర్శకులు ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి కాదు.

‘అలా మొదలైంది’ తో తెలుగులో మొదలైన నందినీ రెడ్డి, దీని హిందీ రీమేక్ ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించ నున్నారు. ఇంకా తారాగణం ఎంపిక పూర్తి కావాల్సి వుంది.

 ‘ఆర్య-2’ హిందీ రీమేక్ ప్రయత్నాలని నిర్మాత కుమార్ తౌరానీ ఉధృతం చేశారు. తన కుమారుడు గిరీష్ కుమార్ తౌరానీ హీరోగా ఈ సినిమా నిర్మించాలని ఉత్సాహపడుతున్నారు. గిరీష్ ఇటీవలే ప్రభుదేవా దర్శకత్వంలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ హిందీ రిమేక్ తో అరంగేట్రం చేశాడు. దీని పేరు ‘రామయ్యా వస్తావయ్యా’. రెందోది కూడా తెలుగు రీమేకే కావడం యాదృచ్చికమే నంటున్నారు తౌరానీ. ‘ఆర్య-2’ రీమేక్ కి  సుకుమారే  దర్శకత్వం వహించాలని తౌరానీ ఎంత బలవంత పెడుతున్నా లొంగడంలేదు సుకుమార్. తనకి ఎన్టీఆర్ తో సినిమా  వుందని చెబుతున్నారు. ఇదెలా తేలుతుందో ఇప్పట్లో తెలీదు.

‘మాయ’ తీసిన నీలకంఠ ఇటీవల హిందీ రీమేక్ కోసం వెళ్లి మహేష్ భట్ ని కలిశారు. ఆ సంప్రదింపులు జరుగుతున్నాయి.

ఇకపోతే, వర్మ తర్వాత హిందీలోకి వెళ్ళిన తెలుగు దర్శకుల్లో పూరీజగన్నాథ్ అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ అనే డైరెక్టు సినిమా తీసి విజయం సాధించినా ఎందుకో అక్కడి నిర్మాతల దృష్టిలో పడలేదు. ఆతర్వాత మరో హిందే తీయలేదు పూరీ. దీనికి ముందు ప్రారంభించిన ‘బద్రీ’ రీమేక్ ‘షర్త్-ది ఛాలెంజ్’ మధ్యలోనే ఆగిపోయింది.

కృష్ణ వంశీ కూడా ‘అంతః పురం’ ని హిందీలోకి ‘శక్తి’ గా రీమేక్ చేశాక మళ్ళీ హిందీ జోలి కెళ్ళలేదు. తేజ సైతం ‘యే దిల్’ తర్వాత హిందీ లో మళ్ళీ తెయలేదు.

పైన చెప్పుకున్న హిందీకి వెళ్తున్న తెలుగు దర్శకులూ  పూరీలాగే ఒక్క హిందీ సినిమాతో సరిపెట్టుకున్నా
ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ మాయాబజార్ ఇప్పుడు వర్మ కాలంలో లాగా లేదు. అక్కడ సెటిలై పోయే పరిస్థితీ లేదు. చిన్న చిన్న ఎన్నో మల్టీప్లెక్స్ సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. హిందీ ప్రాంతాల నుంచి వస్తున్న కొత్త  దర్శకులకే ఠికానా లేదు. ఒక సినిమాతో చాలించుకున్న వాళ్ళే ఎక్కువ. వర్మ తర్వాత సౌత్ నుంచి ప్రభు దేవా హిందీ కి వెళ్లి ప్రభావం చూపించినంత గా మరెవరూ చూపించలేకపోయారు. ఇప్పటికీ ప్రభుదేవాకి హిందీ ఆఫర్లు వస్తున్నాయి.

హిందీ కెళ్ళి ఒకటీ అరా సినిమాలతో సాధించే దేమీ వుండదు. పైగా ఆ ఒక్క సినిమాకోసం ఏళ్ల తరబడి   బుక్కై పోవాలి. ఈలోగా తెలుగులో మర్చిపోతారు ప్రేక్షకులు. ఎంతో ప్రామిజింగ్ దర్శకుడిగా తెలుగులో మెరిసిన క్రిష్ కన్పించడం లేదు. రేపు శేఖర్ కమ్ముల, నందినీ రెడ్డి, నీలకంఠలు కూడా ఓ రెండేళ్ళపాటు  తెలుగులో కన్పించకుండా పోవచ్చు. ఈ లోగా కొత్త దర్శకులు వచ్చి తెలుగులో నిండిపోతారు.

వర్మకి పూర్వం చూసుకుంటే అప్పటి దర్శకుల హిందీ జైత్రయాత్రే వేరు. ఒకొక్కరూ ఒకో దశాబ్దం హిందీ వాళ్లకి తెలుగు దర్శకుల ఉనికి చాటుతూ ఒక్కో డజను హిందీ సినిమాలిస్తూ పోయారు. ఇవన్నీ చాలావరకూ తెలుగు రీమేకులే. మొట్టమొదట ఎల్ వి ప్రసాద్ 1957 లో ‘మల్లీశ్వరి’ ని హిందీలో ‘మిస్ మేరీ’ గా రీమేక్ చేసి దర్శకుడిగా హిందీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత 1977 వరకూ మరో ఎనిమిది హిందీ సినిమాలు తీశారు. వీటిలో జీతేంద్ర తో తీసిన ‘జీనేకీ రాహ్’ అతి పెద్ద మ్యూజికల్ హిట్.


ఎల్.వి.ప్రసాద్ 
ఆదుర్తి సుబ్బారావు 
 ఆదుర్తి సుబ్బారావు 1967- 75 మధ్యకాలంలో 9 హిందీ సినిమాలు తీశారు. వీటిలో సునీల్ డాట్-నూతన్-జమున లతో తీసిన ’మూగమనసులు’ రీమేక్ ‘మిలన్’ అతిపెద్ద మ్యూజికల్ హిట్. దీనికి ఎల్ వి ప్రసాద్ నిర్మాత.

కె. ప్రత్యగాత్మ హిందీలో కె. పి ఆత్మగా సుప్రసిద్ధుడు. ఆయన 1966-76 మధ్యకాలంలో హిందీలో కూడా బిజీగా వున్నారు. 7 హిందీ సినిమాలు తీశారు.  వీటిలో జీతేంద్ర –ముంతాజ్ లతో తీసిన ‘ఏక్  నారీ- ఏక్ బ్రహ్మచారీ’ అతిపెద్ద మ్యూజికల్ హిట్.

ఈ దర్శకుల తర్వాత కె. రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు, బాపు, కె.విశ్వనాథ్, కె. మురళీమోహన రావు, కె. బాపయ్యల, రవిరాజ పినిశెట్టి ల  తరం వచ్చింది. వీళ్ళందరూ హిందీలో కమర్షియల్ సినిమాని కొత్త పుంతలు తొక్కించారు. కె రాఘవేంద్రరావు (1982-93) పది తెలుగు హిట్స్ ని హిందీలో తీసి బప్పీ లహరీ క్రేజీ పాటలతో సంచలనం సృష్టించారు.


కె. విశ్వనాథ్ 
దాసరి నారాయణ రావు 
దాసరి నారాయణ రావు (1980-93)లమధ్య 12 హిందీ సినిమాలు, కె. విశ్వనాథ్ (1979-85) ఎనిమిది, బాపు ( 1981-87) ఏడు, కె. మురళీ మోహన రావు (1983-98) ఏడు, కె. బాపయ్య (1977-95) అత్యధికకాలం హిందీలో మార్కెట్ నిలబెట్టుకుంటూ అత్యధికంగా 25 సినిమాలు తీసిన దర్శకుడుగా నిలిచారు. ఈయన తర్వాత 30 హిందీ సినిమాలతో రామ్ గోపాల్ వర్మ నిలుస్తారు.


ఇక రవిరాజా పినిశెట్టి ఏకంగా మెగా స్టార్ చిరంజీవినే పెట్టి 1990-92 లమధ్య ఆజ్ కా గూండా రాజ్ (గ్యాంగ్ లీడర్), ప్రతిబంధ్ (అంకుశం ) అనే రెండు సినిమాలు తీశారు.

కె. ప్రత్యగాత్మ 
కె. రాఘవెంద్రరావు 
ఇలా తెలుగు దర్శకులంటే హిందీలో ఒక గౌరవం నమ్మకం సంపాదించు కున్న రోజులవి. అందరూ అప్పుడున్న ప్రసిద్ధ స్టార్స్ తో నే తీసిన సినిమాలవి. అసలు తెలుగు నిర్మాణ సంస్థలే అత్యధికంగా వీటిని నిర్మించిన కాలమది. ఇప్పుడు హిందీ సంస్థలు వచ్చి అరకోరా తెలుగు సినిమాలు తీస్తున్నాయి గానీ, తెలుగు సంస్థలో ఎప్పుడో 
హిందీలో ఈపని దిగ్విజయంగా పూర్తిచేశాయి.

ఆరోజులు మళ్ళీ వస్తాయా? కచ్చితంగా రావు. హిందీలో అలాటి గుర్తుండి  పోయే సినిమాలు తీసిన మన దర్శకులు ఎప్పుడో బాలీవుడ్ ని పదేపదే జయించేశారు. ఆ తర్వాత వర్మ ఒంటి చేత్తో ఈ క్రతువు నిర్వహించు కొచ్చాడు. ఈయన తర్వాత ఈ దివీటీని చేబూని బాలీవుడ్ లో తెలుగు జైత్రయాత్ర కొనసాగించే దర్శకుల జాడ ఇప్పటికైతే కానరావడం లేదు...

-సికిందర్
(సెప్టెంబర్ 2014 ‘ఈవారం’కోసం)















సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
5 డీ ని పర్సనలైజ్ చేసుకోవాలి !
 దర్శకుడు మారుతి 


 రానున్న అయిదేళ్ళలో తెలుగులో డిజిటల్ సినిమాలే ఉంటాయనీ, ముడి ఫిలిం పూర్తిగా అదృశ్యం అయిపోతుందనీ గత సంవత్సరం వ్యాఖ్యానించారు సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాలరెడ్డి. అప్పుడాయన మంచు విష్ణుతో తెలుగులో తొలి బిగ్ బడ్జెట్ డిజిటల్ సినిమా చిత్రీకరిస్తున్నారు. రెడ్ కెమెరాతో ఆయన చిత్రీకరిస్తోంటే ప్రతి నిత్యం ఆయన్ని సంప్రదించి సందేహాలు తీర్చుకునేవారు ఇతర సినిమాటోగ్రాఫర్లు. ఫలితాల్ని వెండి తెర మీద చూస్తే మీకే అర్ధమవుతుందని ఆయన ధైర్య వచనాలు పలికేవారు. సినిమా విడుదలైంది. చూసి ధైర్యం తెచ్చుకున్నారు సదరు సినిమాటోగ్రాఫర్లు.

డిజిటల్ మూవీ మేకింగ్‌ని ఒక ఉద్యమంగా దేశ విదేశాల్లో ప్రచారం చేస్తున్న డిజి క్వెస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు బసిరెడ్డి కూడా తెలుగులో వేళ్ళమీద లెక్కించదగ్గ సినిమాలవరకే డిజిటలీకరణని తీసుకు వెళ్ళగలిగారు. నిర్మాణ వ్యయం తగ్గిపోయే డిజిటల్ సినిమాలంటే చిన్న నిర్మాతలకెందుకో అంత భయం.

అప్పుడు రాంగోపాల్‌వర్మ దొంగల ముఠాఅనే సినిమాని 5డీ కానన్ కెమెరాతో అయిదు రోజుల్లో ప్రయోగాత్మకంగా తీసి సంచలనం సృష్టించారు. డిజిటల్ అంటే ఖరీదైన రెడ్ కెమెరా అనుకుంటున్న వర్గాలకి ఈ కానన్ 5డి సాధారణ కెమెరాతో వర్మ సినిమా తీసి చూపించడం కూడా ధైర్యాన్నివ్వలేదు. ఆ ధైర్యం, ఆ స్ఫూర్తి ఒక్కరికే కలిగింది.. ఇవి కలిగేందుకు ఇంకెటువంటి అనుమానాలూ అడ్డుపడలేదు. అయితే ఈ ధైర్యం, ఈ స్ఫూర్తి కలిగిన వెంటనే వర్మ పరిచయంచేసిన కేవలం మూడు లక్షల రూపాయల కెమెరా చేత బట్టుకుని పొలోమని పరుగులు తీసి ఓ సినిమాని అడ్డంగా చుట్టి పారేయ్యలేదు. ఆ కెమెరామీద కూడా తనదైన పరిశోధన చేసి పరిచయంచేసిన వర్మకే కళ్ళు తిరిగే ఫలితాలతో సినిమాని హిట్‌చేసి కూర్చున్నారు... దటీజ్ మారుతి ఆఫ్ ఈ రోజుల్లోఫేమ్ దర్శకుడు!


వర్మ కేవలం నాలుగైదు రోజుల్లో సినిమా తీయవచ్చని నిరూపించేందుకే దొంగల ముఠా తీశారు. దాన్ని అంతవరకే చూడాలి, టెక్నికల్ ఫలితాలతో కలిపి చూడకూడదనిపించింది.. అందుకే ఆ కెమెరాని మా సబ్జెక్ట్ కి అనుగుణంగా మార్చుకునేదాని మీదే దృష్టిపెట్టి విజయం సాధించాం. ఈ విజయానికి స్ఫూర్తినిచ్చిన రాంగోపాల్‌వర్మకి ఎంతైనా రుణపడి వుంటాంఅన్నారు ‘వెన్నెల’ కిచ్చిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మారుతి.

5డీ కెమెరా మీద దృష్టిపెట్టడం గురించి ఫీల్డులో రకరకాల కథనాలు విన్పిస్తున్నాయి. ప్రయోగాలుచేసి రెండు కెమెరాలు పాడుచేసుకున్నారనీ, సాఫ్ట్ వేర్ మార్చారనీ...అయితే సాఫ్ట్ వేర్ మార్చలేదంటారు మారుతి. కేవలం తీయాలనుకుంటున్న సబ్జెక్ట్ కి అనుగుణంగా లెన్సులు మార్చామన్నారు. అదెలా? ఎలాగంటే, కానన్ కెమెరాతో వచ్చిన లెన్స్ తో తీస్తే పిక్చర్ బ్యాక్‌గ్రౌండ్ బర్న్ అవుతోంది. అంతేకాదు, మార్నింగ్ షూట్ చేస్తే ఒక రకంగా, ఈవెనింగ్ ఇంకో  రకంగా వస్తోంది.. ఈ సమస్యని అధిగమించేందుకు కెమెరామాన్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి లెన్సుల మీద పరిశోధనలు చేశామన్నారు మారుతి. చివరికి అమెరికానుంచి తప్పించిన వేరే లెన్సులు అనుకున్న రిజల్ట్స్ నిచ్చాయన్నారు.


‘‘
ఏ కెమెరాకైనా లెన్సులే ప్రధానం. ఉన్నదున్నట్టు కానన్ కెమెరాతో తీస్తే సినిమాలో మీరు చూస్తున్న క్వాలిటీ వచ్చేది కాదు. కథ ఎంత బావున్నా చిత్రీకరణ సినిమా చూస్తున్న ఫీలింగ్‌నివ్వకపోతే అది హిట్‌కాదు. మా విషయంలో హిట్ అయ్యిందంటే అది పర్సనల్‌గా మేం రూపొందించుకున్న కెమెరావల్లే సాధ్యమయింది.’’ అని ఆనందం వ్యక్తంచేశారు.

‘‘
ఈ రోజుల్లో’’ సినిమాలో చూస్తే రిచ్ లొకేషన్స్ కనిపిస్తాయి. అభివృద్ధి చెందుతున్న శివారు హైదరాబాద్ (సైబరాబాద్) కట్టడాల మధ్య, అవుటర్ రింగ్ రోడ్ మీదా, అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ, విలాసవంతమైన అపార్ట్‌మెంట్లలోనూ ఒక పెద్ద బడ్జెట్ సినిమా చూస్తున్నట్టు దృశ్య వైభవం కనిపిస్తుంది. ఇదంతా యాభయి లక్షల వ్యవహారమే అంటే నమ్మబుద్ధికాదు. అమర్చుకున్న లెన్సులు ఇచ్చిన ఎఫెక్ట్. థియేటర్‌లో హైక్వాలిటీ వచ్చింది. కలర్ కరెక్షన్ అవసరం కూడా అంతగా రాలేదు. గ్రేడింగ్ పేరుతోనో, డిఐ పేరుతోనో వేరే కలర్స్ ని కృత్రిమంగా అద్దలేదు. ఇదంతా ఒకెత్తుఐతే లైటింగ్, ఆర్ట్ డైరెక్షన్ ఒకెత్తూ. గదుల్ని ముస్తాబు చేసేందుకు వాడిన సెట్ ప్రాపర్టీస్ లైటింగ్ స్కీంతో మ్యాచ్ అయి మనోహరమైన భావాల్ని రేకెత్తిస్తాయి. స్వాభావికంగా మారుతి యానిమేటర్ అవడంవల్లే ఇది సాధ్యమైంది. సైన్సుని, సృజనాత్మకతనీ కలగలిపి అడుగడుగునా మనోనేత్రంతో చూస్తే గానీ ఓ మామూలు కానన్ కెమెరాతో ఈ తరహా మెయిన్‌స్ట్రీమ్ అవుట్‌పుట్ సాధ్యంకాదు.
మరైతే రేపు ఇదే స్ఫూర్తిఅయి మరిన్ని ఇలాంటి క్వాలిటీ సినిమాలు కానన్ కెమెరాతో తీస్తే రెండు కోట్ల ఖరీదైన రెడ్ డిజిటల్ కెమెరా పరిస్థితి ఏమవుతుంది?


దీనికి సూటిగా సమాధానం చెప్పకుండా ‘‘సినిమాని ఏ కెమెరాతో తీశారని ప్రేక్షకులు చూడరు. బాగా వచ్చిందా లేదా అనే చూస్తారు. ఎంత ఖరీదయిన కెమెరా అన్న ప్రశ్నే రాదు.’’ అనేశారు.

 ఈరోజుల్లోఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు 5డి కెమెరా - ఫఫ్టీలాక్స్ బడ్జెట్ స్కీము తో అనేకమంది అరంగేట్రం చేస్తున్నారు. వాళ్ళందరికీ మారుతి ఇటీవల డైరక్టర్స్ అసోసియేషన్ ఇంటరాక్షన్ క్లాసులో చేసిన హెచ్చరికే మరోసారి చేశారు. తీస్తున్న సబ్జెక్ట్ ఎలాంటి చిత్రీకరణని డిమాండ్ చేస్తోందో 5డి కెమెరాని అలా మార్చుకోవాలి. ముఖ్యంగా సినిమా బ్లాకులు పెట్టడం నేర్చుకోవాలి. సినిమాకి, టీవీకి, షార్ట్ ఫిలిమ్స్ కీ వేర్వేరు షాట్ కంపోజిషన్‌లుంటాయి. ఈ కెమెరాని సినిమాకి వాడుతున్నందువల్ల ఈ తేడా గమనించి బ్లాకులు పెట్టుకోవాలి. ఇండోర్లో ఎలా వస్తోంది, అవుట్‌డోర్లో ఎలా వస్తోందీ ఒకటికి రెండుసార్లు టెస్ట్ షూట్‌లు చేసుకుని చూసుకోవాలి. ఏదీ లేకుండా బ్లయిండ్‌గా వెళ్తే దెబ్బతినిపోతారు. ఎవరికి  వారు దీన్ని ప్రత్యేక కేసుగా తీసుకుని ఆ ప్రకారం తగిన మార్పుచేర్పులు చేసుకోకపోతే, ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, డిజిటల్ సినిమాలంటేనే ప్రేక్షకులకి అసహ్యమేసి దీని కథ అంతటితో ముగిసిపోతుంది.

మరిప్పుడు మారుతి కొత్తగా ఏం ప్లాన్ చేస్తున్నారు? హిట్ చేసిన ప్రతీ  కొత్త దర్శకుడికి లాగే తనూ పై మెట్టు ఎక్కేశారు. టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ నుంచి ఆఫర్ వచ్చింది... కానీ అది డిజిటల్ సినిమా కాదు, సాంప్రదాయ ముడి ఫిల్మే. ఇక తను ఇన్నోవేట్ చేసిన డిజిటల్‌ని వదిలేస్తారా? –అంటే, అలాంటిదేం లేదనీ .. శిష్యుడికి బస్టాప్అనే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు ఇచ్చి ఇదే ఈరోజుల్లోస్కీముతో డిజిటల్‌లో తీయించబోతున్నాననీ చెప్పుకొచ్చారు.  కాకపోతే ఈసారి ఇంకాస్త ప్రయోజనకరంగా వుండే  టీనేజర్స్ - వాళ్ళ తల్లిదండ్రుల మధ్య ప్రస్తుత కాలంలో నలుగుతున్న సమస్యల గురించీ!

-సికిందర్
(అక్టోబర్ 2013 ‘ఆంధ్రభూమి వెన్నెల’ కోసం)



21, ఆగస్టు 2014, గురువారం


సాంకేతికం :
ఆనాటి ఇంటర్వ్యూ 

స్టార్స్ ని సెట్స్ డామినేట్ చేయకూడదు!
కళాదర్శకుడు ఆనంద్ సాయి 

15, ఆగస్టు 2014, శుక్రవారం

రివ్యూ..

డైనమిక్స్ మిస్సైన డ్రామా !


రచన- దర్శకత్వం : లింగుస్వామి
తారాగణం : సూర్య, సమంతా, విద్యుత్ జమ్వాల్, మనోజ్ బాజ్ పాయి, బ్రహ్మానందం తదితరులు
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, పాటలు :  వెన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, భువన చంద్ర
సంగీతం : యువన్ శంకర్ రాజా,  ఛాయాగ్రహణం :  సంతోష్ శివన్, కూర్పు : ఆంథోనీ,  ఆర్ట్ : రాజీవన్,
ఫైట్స్ :  సిల్వా, డాన్స్ : బృందా, రాజు సుందరం,
బ్యానర్ : తిరుపతి బ్రదర్స్ ,   నిర్మాతలు : లగడపాటి శిరీష - శ్రీధర్, సుభాష్ చంద్రబోస్
విడుదల :  ఆగస్టు 15,2014,  సెన్సార్ : ‘U’
***
ఇప్పుడు ముంబాయి మాఫియాల్ని ఫీలవుతోందా అంటే లేదనే సమాధానం వస్తుంది.  మారుతున్న ముంబాయి నగర వాతావరణాన్ని బాలీవుడ్ కూడా ఎప్పటికప్పుడు యాక్షన్ సినిమాల్లో అంతర్భాగంగా చేసుకుని అందిస్తూ వుంటుంది. 1970-80లలో స్మగ్లర్లు ఏలిన ముంబాయి శాంతిభద్రతల పరిస్థితుల్ని,  ఆ తర్వాత 1990-2000లలో మాఫియాలతో ఏర్పడిన హింసాత్మక స్థితినీ బాలీవుడ్ సినిమాలు దర్పణం పడుతూ వచ్చాయి. దీని తర్వాత టెర్రరిజం ముంబాయిని వణికించినప్పుడూ బాలీవుడ్ సినిమాలు దాన్నీ రికార్డు చేశాయి. ఇలా ఒక్కో దశ దాటుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి లేని దశ వైపు చూసి ఆ సినిమాల్ని ఉత్పత్తి చేయలేదు. వెనక్కి చూడాల్సి వస్తే ఆ దశని పీరియడ్ ఫిలిమ్స్ గా అదే కాలంలో స్థాపించిన కథలతో ఈమధ్య సినిమాలొచ్చాయి.  పై మూడు దశలూ గడిచి పోయాక ఇప్పుడు ముంబాయిలో మరో శాంతి భద్రతల సిట్యుయేషన్ లేదు.  దీంతో బిగ్ స్టార్స్ సినిమాలూ కాలక్షేప యాక్షన్ కామెడీలుగా రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే.

ఈ నేపధ్యంలో తమిళ టాప్ దర్శకుడు లింగు స్వామి ముంబాయిలో ఇంకా మాఫియాల్ని ఫీల్ కమ్మంటూ భారీ యాక్షన్ సినిమా ప్రేక్షకుల కందించాడు. ఏమంటే, ఇందులోమాఫియా నేపధ్యం మాటవరసకేననీ, అక్కడ ప్రధానంగా చెప్పింది ఓ స్నేహం గురించీ, ఇంకో ప్రేమ గురించీ మాత్రమేననీ సెలవిచ్చాడు. కానీ ఇలా కూడా లేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే, భారీ బడ్జెట్లతో బిగ్ స్టార్ సినిమా అనగానే తమిళ-తెలుగు భాషల్లో మాఫియా కథలు తప్పించి మరొకటి ఆలోచించలేని తనం దగ్గర! తత్ఫలితంగా ఇలాటి కృత్రిమ సినిమాలతో  కుత్తుకల మీద కత్తి పెట్టి చూసి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ సూర్య నేటివిటీ వున్న ‘సింగం’ సినిమాలు చేస్తున్న వాడల్లా ముంబాయి వెళ్లి ముంబాయిలోనే నేటివిటీ లేని సినిమా నటించి ఔరా అన్పించాడు. వెంట వెళ్ళిన సమంతా మాత్రం ముంబాయి నేటివిటీకి మారిపోయి బికినీకి సాహసించి జీవించింది. విలన్ గా ముంబాయి మనోజ్ బాజ్ పాయి కళ తప్పిన మొహంతో దక్షిణ ప్రేక్షకులకి షాకిచ్చే స్థితికొచ్చాడు.

ఇంతకీ ఈ ప్రేమా స్నేహాల, మాఫియా పోరాటాల సినిమాలో ఏముంది?
అన్వేషించు-వధించు!

అతను కృష్ణ(సూర్య). అతను కర్ర సహాయంతో నడిచే వికలాంగుడు. వైజాగ్ నుంచి ముంబాయి చేరుకొని అన్న రాజు (సూర్య) కోసం వెతుకుతూంటాడు. అన్న గురించి నమ్మలేని నిజాలు తెలుస్తూంటాయి. రాజూ రాజు కాదు, రాజూ భయ్యా. ఇంకో చంద్రూ (విద్యుత్ జమ్వాల్)తో కలిసి మాఫియాగా ఎదగాలని ప్రయతిస్తున్నాడు. అతనంటే ముంబాయి ప్రజల్లో ఎంత భయమో అంత భక్తి. కృష్ణకి ఒకొక్కరే రాజు అనుచరులు తారసపడుతూ సమాచారమందిస్తూ వుంటారు. ఆ సమాచారమంతా గతందే. దాని ప్రకారం రాజూ చంద్రూల మధ్య ‘బిజినెస్’ కంటే ఎక్కువ స్నేహబంధం వుంది. ఇద్దరూ ఎదురొచ్చిన ప్రత్యర్ధుల్ని చంపుతూ వాళ్ళ సొత్తు లూటీ చేస్తూంటారు. ఈ మాఫియాల్ని అంతమొందించాలని పోలీస్ కమిషనర్ చంపి పారేస్తూంటాడు. దీన్ని అడ్డుకునేందుకు కమిషనర్ కూతురు జీవా ( సమంతా) ని కిడ్నాప్ చేస్తాడు రాజు.  ఆమె అతడితో  ప్రేమలో పడుతుంది.



ఇలా వుండగా ముంబాయిని పాలిస్తున్న పెద్ద మాఫియా ఇమ్రాన్ ( మనోజ్ బాజ్ పాయి ) ఉంటాడు. ఇతను ఒక పార్టీలో రాజూ చంద్రూ లని చూసి, ఎక్కడున్నా వాళ్ళు అక్కడే వుండండి-  ఒక్క అడుగు ఎదగాలని ప్రయత్నించినా పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తా- అని హెచ్చరిస్తాడు. అతనలా అన్నాడని పగతో రగిలిపోతాడు చంద్రూ. చంద్రూ ఇలా రగిలిపోతాడని ముందే తెలిసిన రాజు – ఇమ్రాన్ ని ముందే ఎత్తుకొచ్చి ఒక సెల్లార్ లో బంధించి చంద్రూకి చూపిస్తాడు. ఇమ్రాన్ అన్న మాటలకి పది  మాటలతో అతణ్ణి అవమానపర్చి కసి 
తీర్చుకుంటాడు చంద్రూ. రాజూ ఇమ్రాన్ ని వదిలేస్తాడు.

ఇక కొన్నాళ్ళు జీవాతో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయమని రాజు ని పంపించేస్తాడు చంద్రూ. జీవాతో ఆటా పాటలతో ఎంజాయ్ చేసి వచ్చిన రాజూకి చంద్రూ శవం స్వాగతం పలుకుతుంది. ఎవరీ పని చేశారని అనుచరుల మీద ఎగురుతాడు. ఒక అనుచరుడు చెప్తానని తీసికెళ్ళి  రాజు ని కాల్చిచంపేస్తాడు.

ఇదంతా తెలుసుకున్న కృష్ణ ఏం చేశాడు? అన్న చావుకి పగ తీర్చుకున్నాడా? అన్న నిజంగానే చనిపోయాడా, ప్రాణాలతో ఎక్కడైనా వున్నాడా? జీవా ఏమైంది? ఇవన్నీ సెకండాఫ్ లో తేలే అంశాలు.

ఇది పూర్తిగా సూర్య భుజస్కంధాల మీద ఆధారపడ్డ సినిమా. రెండు భిన్నపాత్రల్లో- ఒకదాంట్లో స్టార్ సూర్య కన్పిస్తే, మరోదాంట్లో నటుడు సూర్య కన్పిస్తాడు. స్టార్ సూర్యగా మాస్ ని ఊపెయ్యాలని ప్రయత్నిస్తాడు, నటుడు సూర్యగా గుండెల్ని తడమాలని చూస్తాడు. రెండిట్లోనూ సఫలమయ్యాడు. ఐతే ఇంత విభిన్నమైన ఈ ద్విపాత్రాభినయానికి తగిన కథ జత పడకపోవడం విచారించాల్సిన విషయం. దర్శకుడు చేసిన పెద్ద పొరపాటు- కథలోంచి పాత్ర పుడుతుందనుకోవడం. కానీ అలా జరగదు- సినిమాకి, అందునా బిగ్ కమర్షియల్ సినిమాకి – పాత్రలోంచే కథ పుడుతుంది! ఇలా ఆలోచించి వుంటే, సాత్విక కృష్ణ పాత్రతో అద్భుతం చేసి ఈ సినిమాని తిరుగులేకుండా నిలబెట్టేవాడు దర్శకుడు. ఇదెలాగో తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం...


సమంతా కిందులో ఆడేపాడే, హీరో వెంటపడి తిరిగే, పాత ఫార్ములా కొలమానాల కమిషనర్ కూతురి పాత్రే లభించింది. దీంతో బికినీల్లో అందాల ప్రదర్శనకీ పాల్పడాల్సి వచ్చింది.ఇంతకంటే చెప్పుకోవదానికేం లేదు. చంద్రూ పాత్ర నటించిన- నటుడూ, మోడల్, మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్, పూర్తి శాఖాహారీ అయిన విద్యుత్ జమ్వాల్ తెలుగులో రెండు ఎన్టీఆర్ సినిమాలతో పరిచితుడే. తమిళంలో ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ వున్న బాలీవుడ్ నటుడు. ఈ సినిమాలో అతనున్న ప్రతి సీనూ పేరుకు తగ్గట్టే ఎలెక్ట్రిఫయింగ్ గా వుంది. ఇక మనోజ్ బాజ్ పాయ్ వన్నె తగ్గిన మొహంతో ప్రధాన విలన్ గా విఫలమయ్యాడు. సంగీత విద్వాంసుడిగా ఒక సీను లోకన్పించే బ్రహ్మానందం,  సెకండాఫ్ లో మరీ బలహీనపడ్డ కథలో హుషారు పుట్టించడానికి విఫలయత్నం చేశాడు.

చీమల్లా పుట్టుకొచ్చే మాఫియాల అనుచరుల పాత్రల్లో బాలీవుడ్ ఫైటర్స్ రఫ్ గా కొందరు, స్టయిలిష్ కొందరూ కన్పిస్తారు. కానీ వర్మ పాపులర్ చేసిన బ్రాండ్ సహజత్వాన్ని ప్రదర్శించలేకపోతారు.

ఈ సినిమాకి మరో స్టార్ వున్నాడు. అతను సంతోష్ శివన్. కెమెరాతో మాఫియా లోకాన్ని మర్చిపోలేనంత గ్లోరిఫై చేశాడు. ఇందుకు కళాదర్శకుడు రాజీవన్ సమకాలీనతని దృష్టిలో ఉంచుకుని చాలా తోడ్పాటు నందించాడు. సిల్వా సమకూర్చిన విశృంఖల యాక్షన్ దృశ్యాలూ, బృందా- రాజు సుందరంల నృత్య విన్యాసాలూ, ఆఖరికి యువన్ శంకర్ రాజా ఫాస్ట్ బీట్ సంగీతమూ అన్నీ- వేలెత్తి చూపలేని విధంగా వున్నాయి-ఒక్క ఎడిటింగ్, డైరెక్షన్ తప్పిస్తే. సుమారు మూడు గంటల నిడివికి సాగలాగిన బలహీన కథకి  ఇతర టెక్నీషియన్లు ఎంత టాప్ క్లాస్ సేవలందిస్తే మాత్రం ఏం లాభం- బూడిదలో పోసిన పన్నీరే!

దర్శకుడు లింగు స్వామి తను దర్శకుడుగా ఎనిమిది సినిమాలు తీస్తే, ఇతర దర్శకులతో నిర్మాతగా ఆరు చిన్న సినిమాలు తీశాడు. ఇవే బావున్నాయి. దర్శకుడుగా బాగా మాస్ కమర్షియల్స్ కి అలవాటు పడ్డ తను ఇప్పుడు తీసిన సినిమాతో సక్సెస్ కోసం ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయొచ్చని కూడా తెలుసుకున్నట్టుంది - లేదా తనేం చేస్తున్నాడో తెలుసుకోలేదేమో- ఏమైనా జరిగిందొక్కటే- ప్రేక్షకులు ఫూల్స్ అవడం!

స్క్రీన్ ప్లే సంగతులు..
మాస్ సినిమాలతో ఉన్న సులువేమిటంటే వాటికి  అంతగా లాజిక్ తో పనుండదు. ఎంత ఎక్కువ చేసి చూపిస్తే అంత పంచ్ వుంటుంది. దృశ్యాల్లో పంచ్ లేని మాస్ సినిమా చప్పగా వుంటుంది. దీన్నే suspension of disbelief (మన నమ్మకాల్నీ అపనమ్మకాల్నీ కాసేపు పక్కన బెట్టి సినిమాని ఎంజాయ్ చేయడం)  లేదా  cinematic liberty ( సృజనాత్మక స్వేచ్ఛ) అంటారు. అయితే ఈ ఎక్కువ,  లేదా ‘అతి’ అన్నది ఎంత ఎక్కువ వుండాలన్నది కూడా మన కామన్ సెన్సే చెప్తుంది. ఉదాహరణకి ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ లో బాలకృష్ణ  సైగ చేస్తే రైలాగి పోవడం, కుర్చీ ముందుకు కదిలి రావడం లాంటివి శృతి మించిన ‘అతి’ అయ్యాయి. అలాగే  బ్రహ్మానందం కూడా ఓ పందెం కోడితో శత్రు సంహారం చేయడం శృతి మించిన లాజిక్కయ్యింది. ఇవేవీ  మింగుడుపడక తిప్పి కొట్టి ఫ్లాప్ చేశారు ప్రేక్షకులు. ఇవి దృశ్యాల్లో కంటికి కన్పించిపోయే నాన్సెన్స్. ఇలాటివి పసిగట్టినంత తేలిగ్గా కథా కథనాల్లో అనౌచిత్యాల్ని గ్రహించలేరు అందరు ప్రేక్షకులూ.

ఎలాగంటే, ఉదాహరణకి- ‘దృశ్యం’లో హత్య జరిగిన మర్నాడే శవాన్ని తీసికెళ్ళి పోలీస్ స్టేషన్ ‘కింద’ పాతిపెట్టేశాక- ఇక మిగతా కథంతా నడపడంలో ఎలా అర్ధం లేదో, అలా ప్రస్తుత సినిమాలోనూ జరిగింది. అదేమిటంటే- తన స్నేహితుణ్ణి చంపి, తన మీద హత్యా ప్రయత్నం చేసిందెవరో హీరో (రాజు భయ్యా )కి ప్రత్యక్షంగా తెలిసిపోతున్నాక కూడా, ఇంకా తమ్ముడు కృష్ణంటూ వేషం కట్టి ఆరాతీయడం అంతా నాన్సెన్స్!

ఇది కనీస లాజిక్ కి కూడా ఎలా అందదో చూడ్డానికి పెద్ద మేధస్సేం అక్కర్లేదు. రాజూ భయ్యా తమ్ముణ్ణంటూ కృష్ణ ముంబాయి వచ్చాడు. అన్న ఆచూకీ ఆరా తీస్తూ అన్న అనుచరుల్నే కలుస్తున్నాడు. విడతలు విడతలుగా ఫ్లాష్ బ్యాక్స్ లో రాజూ భయ్యా ఉనికి గురించి మనకూ సస్పెన్స్ పెరుగుతోంది. కచ్చితంగా ఇలాటి డ్రామాకి అంతిమంగా తమ్ముడికి షాకింగ్ న్యూసే తెలియాలి. అంటే అన్న హతమే అయి వుండాలి. ‘సస్పెన్స్ పోషణ’  అనే స్క్రిప్టింగ్ టూల్ కి రెండు పార్శ్వాలుంటాయి. ఎందుకు? ఎలా? అనేవి. వీటిలో  కథాక్రమంలో ఎందుకు? అనే పార్శ్వాన్ని విప్పుతూ పోతూ,  ఎలా? అనే రెండో పార్శ్వాన్ని మూసిపెడతారు. ఇదే చివరంటా సస్పెన్స్ పోషణకి తోడ్పడుతుంది. మొదటి పార్శ్వాన్ని పూర్తిగా విప్పేశాక,  ఈ రెండోది విప్పడం మొదలెడతారు.

అలా అన్న హతమై వుంటే ఎందుకు హతమై ఉంటాడో రానురాను కథనంలో కారణం మనకి తెలిసిపోయింది. ఇక ఎలా హతమై ఉంటాడో చూడాలన్న ఈ రెండో కుతూహలాన్ని డ్రమెటిక్ గా తీర్చాడు దర్శకుడు. హతమై ఉంటాడని కథ మొదలెట్టిన మొదట్లోనే మనకి తెలిసిపోయినా, ఎలా హతమై ఉంటాడో చూడాలన్న కుతూలంతో కూడిన రెండో పార్శ్వమే మనల్ని కూర్చోబెట్టింది. ఇంటర్వెల్ ముందు వరకూ సినిమాని నిలబెట్టింది.

ఇంతవరకూ బాగానే వుంది. అలా అన్నహత్యకి కారకుల్ని కూడా తెలుసుకున్న తమ్ముడు, ఇంటర్వెల్లో వాళ్ళ మీద తిరగబడుతూ ఊతకర్ర విసిరేసినప్పుడు,  అతను తమ్ముడు కాదనీ, తమ్ముడి వేషంలో వున్న అన్నే అనీ  ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. దీంతో ప్రేక్షకులు థ్రిల్లయిపోయి దిమ్మదిరిగే ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుందనుకున్నాడు!
ఇది ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడంగా భావించ లేదతను- లేదా ఫూల్స్ చేస్తున్నానన్న జ్ఞానం కూడా లేకపోవచ్చు. తను చేసిందేమిటో తనకే తెలీక తను ఫూలవుతూ, ప్రేక్షకుల్నీఫూల్స్ చేసినట్టు.

అన్నీ తెలిసిన రాజూ భయ్యే తమ్ముడి వేషంలో వచ్చి,  మళ్ళీ మొదట్నించీ తన గురించే ఎందుకు తెలుసుకుంటూ కూర్చుంటాడు- వెళ్లి మొత్తం వాళ్ళని లేపెయ్యక? ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం అంతవరకూ నడిపిన కథ కి ఎటువంటి లాజిక్కూ లేకుండా పోయింది. పాత్రే అర్ధరహితంగా ఉండడంతో అంతవరకూ చూసిన కథనంతటినీ  ఆటోమేటిగ్గా  మన మన మైండ్ డిలీట్ చేసుకునే పరిస్థితేర్పడింది!

పాత్రోచితానుచితాలు

విజయవంతమైన సినిమాల్లో హీరోకి బలమైన ఒక లక్ష్యసాధన, దాన్ని వ్యతిరేకించే బలమైన విలన్, ఆ విలన్ తో పోరాటానికి బలమైన పునాది, దానికి సహేతుకమైన ఎమోషనల్ చోదక శక్తి, దీని ఆలంబనగా ప్రాణప్రదమైనది ఏదైనా పణంగా పెట్టడం మొదలైనవి చూస్తూంటాం. ప్రస్తుత భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమాలో ఇవన్నీ లోపించడాన్ని గమనించవచ్చు.

విలన్ ఎంత బలహీనుడు కాకపోతే హీరో కామెడీగా ఎత్తుకొచ్చి ఫ్రెండ్ కుతి తీరుస్తాడు? నాకడ్డొస్తే పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తానని విలన్ అనడమే మొత్తం పోరాటానికి కారణం కావడం ఎంత బలహీనం? ఈ ఫస్ట్ యాక్ట్ అంతంలో ముడేయాల్సిన పాయింటు ఇంత  బలహీనంగా ఉన్నందుకే గా క్లైమాక్స్ పటుత్వం లేకుండా పోయింది? ( If the ending seems to be weak,  go to the conflict point at the end of first act and set it up strongly –Syd Field ). ఇక హీరోకి ప్రతీకార కారణంగా పెట్టుకున్న ఫ్రెండ్ హత్యోదంతం ఎమోషనల్ గా ఏమేరకు చోదకశక్తి? ఆ ఫ్రెండ్ కూడా హత్యలు చేసిన మాఫియానే. అతడి పట్ల ప్రేక్షకులకి సానుభూతి ఎందుకుంటుంది? అప్పుడు  హీరో చేసే పోరాటంలో ఎలా ఇన్వాల్వ్ అవగలరు? నాగార్జున నటించిన ‘మాస్’ లో అమాయక ఫ్రెండ్ పాత్ర సునీల్ ని మాఫియాలు చంపేయడం నాగార్జునకీ, తద్వారా ప్రేక్షకులకీ ఎమర్జెంట్ ఎమోషనల్ డ్రైవ్ అయింది.

ఇక శత్రు సంహారంలో హీరో అడుగు ముందుకేయాలంటే ఖబడ్దార్ అని అడ్డుకట్ట  వేసే పణం (రిస్కు)గా పెట్టారా అంటే  ఏదీ లేదు. క్లైమాక్స్ లో హీరోయిన్ని ఎత్తుకుపోవడం పణం కాబోదు. అలాటిదే జరిగితే ముందునుంచే వుండాలి.
దర్శకుడు ఏదైనా పణంగా పెట్టాడంటే అది హీరో- అతడి ఫ్రెండ్ ల తెలివితేటల్నే. లేకపోతే  విలన్ ఏదో అన్నంత మాత్రానే కుతకుతలాడిపోయి అతన్నిఅవమానించడమే పరమావధిగా ఎందుకు పెట్టుకుంటారు. దీని పర్యవసానాలెలా ఉంటాయో మనం ఊహించగల్గినప్పుడు హీరో ఎందుకు ఊహించలేడు ? అంత మొనగాడైన ఫ్రెండ్ ని విలన్ వూరికే కుక్కని చంపినట్టు కుళ్ళబొడిచి చంపాడు. ఇలా వుంది  పాత్రచిత్రణ!

విలన్ అవమానిస్తే,  వృత్తిపరంగా అతణ్ణి దెబ్బ కొట్టేందుకు అది మోటివేషన్ . అక్కడ్నించీ అతడి పతనానికీ, గల్లీ బతుకు చాలించి తమ ఏకఛత్రాధిపత్యానికీ  మెట్లు వేసుకుంటూ రావాలి. ఈ సంఘర్షణలో ఫ్రెండ్ చనిపోతే ఒక అర్ధముంటుంది. అప్పుడు ఫ్రెండ్ చావుకి ప్రతీకారమనే బలహీనతకి ఆస్కారముండదు. ఆ ఫ్రెండ్ ఆత్మశాంతికి వాళ్ళ  ఉమ్మడి లక్ష్యమైన  ఏకఛత్రాధిపత్య సాధనే ధ్యేయంగా సమంజసంగా  వుంటుంది. కమల్ హాసన్ ‘నాయకుడు’, మోహన్ లాల్ ‘అభిమన్యు’, నాగార్జున ‘శివ’, జేడీ చక్రవర్తి ‘సత్య’ –ఇలా విజయవంతమైన ఏ మాఫియా పాత్రని చూసినా అది ఏకఛత్రాధిపత్యమనే ఉన్నతాశయం కోసమే పోరాడింది.

విలన్ అవమానించడమనే సంఘర్షణ కారణాన్ని  తీసుకుని పై విధంగా కథ అల్లలేదు సరికదా, ఫ్రెండ్ ని విలన్ చంపినప్పుడైనా దాన్ని సమగ్రంగా ఎష్టాబ్లిష్ చేయలేదు- అంటే, చావబోతున్న ఆ ఫ్రెండ్ నుంచి విలన్ ఏదో వ్యక్తిగత రహస్యాన్ని లేదా వృత్తి సంబంధ సమాచారాన్ని, ఇంకాలేదా ఓ ట్రోఫీ (హంతకుడు తన విజయాన్ని స్వైరకల్పనలతో ఎంజాయ్ చేయడానికి సేకరించే హతుడి తాలూకు ఏదైనా విలువైన వస్తువు) హస్తగతం చేసుకుని వుంటే అది హీరో ప్రతీకారానికి స్పీడ్ బ్రేకర్ గా పనిచేసే రిస్క్ ఫ్యాక్టర్ (పణం)గా పనిచేసి సెకండాఫ్ కథనానికి డైమెన్షన్ వుండేది.

అసలు హీరో తో తన కథ తనే తెలుసుకునే అసహజత్వానికి పూనుకునేకన్నా, నిజంగానే అన్నకోసం అమాయక తమ్ముడు కృష్ణే వచ్చినట్టు చూపిస్తే సరిపోయేది - ఇంటర్వెల్ దగ్గర ఊత కర్ర విసిరేసినప్పుడు అతను అవిటివాడు కాదని మాత్రమే  ట్విస్ట్ ఇచ్చి- అక్కడ్నించీ అన్న చావుకి తమ్ముడి ప్రతీకారంగా ఎమోషనల్ డ్రైవ్ తో – లేని శక్తియుక్తులతో అపసోపాలుపడుతూ మాఫియాల్ని అంత మొందించి, తనే పెద్ద మాఫియాగా ప్రకటించుకునే తెగువతో బ్యాంగ్ ఇచ్చివుంటే రుగ్మతలన్నీ తొలగిపోయేవి. దర్శకుడు ఇంటర్వెల్ దగ్గర కథకి హాని చేసే  హీరో రోల్ రివర్సల్ ట్విస్ట్ ఇచ్చేకన్నా – సినిమా ముగింపులో అన్నెం పున్నెం ఎరుగని అమాయకుడు కృష్ణ ముంబాయికి పెద్ద మాఫియాగా మారే రోల్ రివర్సల్ ఇంకా బాగా పేలేది!

-సికిందర్