రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, ఆగస్టు 2014, శనివారం

రివ్యూ..
కాన్సెప్ట్ మరచిన కథనం!


రచన- దర్శకత్వం: నీలకంఠ
తారాగణం : హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, సుష్మా రాజ్, ఝాన్సీ, నాగబాబు, వేణు తదితరులు.
సంగీతం : శేఖర్ చంద్ర,   ఛాయాగ్రహణం : బాల్ రెడ్డి,  కూర్పు : నవీన్ నూలి
బ్యానర్ : షిర్డీ సాయి కంబైన్స్ , నిర్మాతలు: ఎంవికె రెడ్డి,  మధుర శ్రీధర్ రెడ్డి
విడుదల : 1 ఆగస్టు 2014,      సెన్సార్: ‘A’
***
దర్శకుడు నీలకంఠ  తీసే సినిమాల కథలు వేరైనా  వాటి మూలం ఒకటే  - మానసికం. ఆటవిడుపుగా గత సినిమా ’చెమ్మక్ చల్లో’ అనే కమర్షియల్, అంతకి ముందు “విరోధి’ అనే నక్సల్ సినిమాలు తప్పించి, ప్రస్తుత సినిమావరకూ తీసినవన్నీ మనో వైజ్ఞానిక సంబంధ  డ్రామాలే. వీటిలో తొలి రెండు సినిమాలు- షో, మిస్సమ్మ-మినహా  మిగిలినవన్నీ ప్రేక్షకుల నాడికి అందకుండా పోయినవే. సైకాలజీతోనే ఇలా వుంటే, ఇప్పుడు  ‘మాయ’ అనే తాజా  ప్రయత్నంతో ఇంకో అడుగు ముందుకేసి, ఏకంగా పారాసైకాలజీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఐతే ఈ తరహా  కథాంశాల్ని సెల్యూలాయిడ్ మీద పండించడంలో తన తొలి రోజులనాటి సృజనాత్మకత సన్నగిల్లిందని గమనించడం లేదు. ఆర్టు సినిమాలు అంతరించి, అవి కమర్షియల్ అంశాల్ని మిళితం చేసుకుని, సామాన్య ప్రేక్షకుల్నీ అలరించే క్రాసోవర్ సినిమాలుగా పరిణామం చెంది దశాబ్ద కాలం దాటిపోయినా, ఇంకా నీలకంఠ ఆర్ట్ సినిమాల కాలంలోనే ఆగిపోయినట్టు కన్పిస్తారు.

ఆర్టు సినిమాలు పరాజితుల పాసివ్  కథలు చెప్తాయి. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఆర్ధిక స్వాతంత్ర్యానికి కొత్త  ద్వారాలు తెర్చుకుని, ప్రజల జీవితాల్లో పెనుమార్పులు సంభవించడంతో ఏడ్పు కథల ఆర్టు సినిమాలకి కాలం చెల్లి- శ్యాం బెనెగల్ బాలీవుడ్ బిగ్ స్టార్స్ తో వినోదాత్మక హాస్యకథలు తీయడం, గోవింద్ నిహలానీ అదే బాలీవుడ్ బిగ్ స్టార్స్ మీద ఆధార పడి యాక్షన్ సినిమాలు తీయడమూ చేసి క్రాసోవర్ సినిమా అనే సరికొత్త ఒరవడిని కొత్త దర్శకులకి అందించి వదిలారు. హైదరాబాద్ బ్లూస్, పర్జానియా, ఇంగ్లిష్ వింగ్లిష్ , కహానీ మొదలైన తరహా మేకింగ్ లో వచ్చినవీ, వస్తున్నవీ క్రాసోవర్ సినిమాలే.

తెలుగులో గగనం, వినాయకుడు, చందమామ కథలు, దృశ్యం లాంటి వెన్నో క్రాసోవర్ సినిమాలున్నాయి. ట్రెండ్ లో వున్న వీటికీ నీలకంఠ తీసే సినిమాలకీ తేడా ఏమిటంటే, 2002 లో  ‘షో’ దగ్గర్నుంచీ ఆయన  ఆర్టు తరహా సినిమాల దగ్గరే  ఆగిపోయి వున్నారు. ఇప్పుడు  మాయ’ సూపర్ నేచురల్ (అతీంద్రియ శక్తుల) థ్రిల్లర్ అని చెప్పుకున్నారు.  ఈ థ్రిల్లర్ కథేమిటో  ఓసారి చూద్దాం!

జరగబోయేది ముందే తెలిస్తే...
మేఘన (అవంతికా మిశ్రా) కి  ఐదేళ్ళ వయసులో జరగబోయేది ముందే కనబడే అతీంద్రియ దృష్టి వున్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఒక ప్రమాదంలో తన  తల్లి చనిపోనుందని దృశ్యాలు ముందే కనపడినా అర్ధంకాక ఆమెని  పోగొట్టుకుంటుంది. పెద్దయ్యాక ఆ బాధే వెన్నాడుతుంటుంది. ఇప్పుడీమె టీవీ జర్నలిస్టు. ఈమెకి సిటీలో ఈవెంట్ కోసం వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ్ వర్మ ( హర్షవర్ధన్ రాణే)తో వృత్తిపరమైన బాధ్యత అప్పజెప్పడంతో, అతన్తో క్రమంగా ప్రేమలో పడుతుంది. ఇంతలో ఈమె చిన్ననాటి స్నేహితురాలు పూజ (సుష్మా రాజ్) వచ్చేసి,  సిద్ధార్థ్ తనక్కాబోయే భర్త అనడంతో మేఘన ఇరుకున పడుతుంది.

ఇలా వుండగా మేఘనకి ఒక నగల షాపు దగ్గర హత్య జరగబోతున్నట్టు దృశ్యాలు కనబడతాయి. కాకతాళీయంగా ఆ సంఘటనలో హంతకుణ్ణి పట్టిస్తుంది. అలాగే సిద్ధార్థ్ కి సంబంధించి కూడా గతం లో జరిగింది ఆమెకి తెలుస్తుంది. ఆ గతంలో అతను ముందు ప్రేమించిన వైశాలి (నందినీ రాయ్) అనే అమ్మాయి అనుమానాస్పద మరణంలో అతడి హస్తమున్నట్టు తెలుస్తుంది.  అంతేగాక ఇక ముందు కూడా తను పెళ్లి చేసుకోబోతున్న పూజని కూడా చంపబోతున్నట్టు మేఘనకి భవిష్యద్దర్శనం అవుతుంది. ఇప్పుడు  మేఘన ఏం చేసిందనేది మిగతా కథ.

ముగ్గురమ్మాయిలతో ఈ చతుర్భుజ ప్రేమాయణంలో పాత్రధారుల నటనలు చాలా నిరాశ పరుస్తాయి. మేఘన పాత్రలో హీరోయిన్ అవంతికా మిశ్రా చాలా పెద్ద మైనస్ ఈ సినిమాకి. ముఖంలో ఎక్స్ ప్రెషన్స్  వుండవు. పైగా చేస్తున్న టీవీ జర్నలిస్టు వృత్తికి తగ్గ వేషభాషలు లేక, ఎప్పుడూ నిండు చీరలో నుదుట పెద్ద బొట్టుతో, వయసుకి మించిన హుందాతనంతో  చాదస్తంగా కన్పిస్తుంది. యువ ప్రేక్షకులకి హీరోయిన్ అక్కయ్య లా కన్పడ్డంకన్నా బాక్సాఫీసు వ్యతిరేక చర్య వుంటుందా?


మెయిన్ హీరోయిన్ని ఇలా చూపించాం కాబట్టి,  సెకండ్ హీరోయిన్ని ఫాస్ట్ గర్ల్ గా చూపించాలన్న ఫార్ములా కొలమానాలతో సుష్మా రాజ్ ని ప్రవేశ పెట్టారు. ఈమె అల్లరి ఆకతాయితనం కృత్రిమంగా, ఐదేళ్ళ మెంటల్ స్టేజిని ప్రదర్శిస్తూంటాయి.

డల్ ఫేసుతో హర్షవర్ధన్ రాణే సైతం హీరో లా అన్పించడు. ఇక మూడో హీరోయిన్ నదినీ రాయ్ సరేసరి. ఇలా తారాగణమంతా తెలుగువాళ్ళు కాని నటీ నటులైనప్పుడు తెలుగు సినిమా తీయడ మెందుకని ప్రశ్న వేధిస్తూంటుంది.

సాంకేతికంగా చూస్తే ఛాయాగ్రహణం డౌన్ ప్లే చేసిన లైటింగ్ తో విజువల్ అప్పీల్ కల్గించదు, అలాగే సంగీతమూ. దర్శకత్వం వెనకటి తరం ప్రేక్షకుల కాలం నాటి శైలిలో వుంది.

స్క్రీన్ ప్లే సంగతులు..
ఫ్రెంచి దర్శకుడు జీన్ లక్ గొడార్డ్ అంటాడు – ఒక సినిమా సృజనాత్మక విలువల్ని ఎక్కడ్నించీ సంగ్రహించామన్నది  కాదు ప్రశ్న, ఎక్కడికి తీసుకెళ్తున్నా మన్నదే సమస్య అని!

హాలీవుడ్ ‘ఫైనల్ డెస్టినేషన్’ సినిమా ‘మాయ’ కి స్ఫూర్తి అయితే కావొచ్చు , కానీ ఈ స్ఫూర్తిని, ఆ సృజనాత్మక విలువల్నీ  ఏ కాలపు ప్రేక్షకులకి అందిస్తున్నామన్న కాలీన స్పృహ లోపించడమే ఈ స్క్రీన్ ప్లే కి పెద్ద శాపం.

నేటి కాలపు థ్రిల్లర్ కుండాల్సిన డైనమిక్స్ కంటే ఆర్ట్ సినిమాలో వుండే బద్దకమే ఇందులో కన్పిస్తుంది. ఎత్తుకున్న అతీంద్రియ శక్తులకథకీ, విప్పిన హత్యా రహస్యానికీ ఏ సంబంధమూ లేకుండా ఉండడం కొట్టొచ్చినట్టుండే ఒక కాన్సేప్చ్యువల్ బ్లండర్ గా తెలిసిపోతుంది. జరగబోయేది ముందే తెలిసిపోయే ఈ.ఎస్.పి ( ఎక్స్ ట్రా సెన్సరీ పర్సెప్షన్) లేదా సిక్స్త్ సెన్స్ కొంచెం ఎక్కువుండే స్థితి అన్న బిల్డప్ తో ప్రచారం చేశారు. తీరా సినిమాలో తేలిందేమిటంటే, ఇంత ఇంటలెక్చువల్ కలరివ్వ నవసరం లేకుండానే, దీన్నో సాదా సీదా మర్డర్ మిస్టరీగా నడిపించెయ్యొచ్చని!

ఒక సినిమా కథని మూడు వాక్యాల్లో ఒక లైనుగా చెప్పుకుంటే ఆది మధ్యాంతాల  పరస్పర సంబంధంతో కన్పించాలి. ఈ సినిమా కథని మూడు వాక్యాల్లో పెట్టి చూస్తే  ఇలా వుంటుంది.... అతీంద్రియ దృష్టి వున్న మేఘన సిద్ధార్థ్ ని ప్రేమించింది, ఆ సిద్ధార్థ్ హంతకుడనీ తను ప్రేమిస్తున్న పూజ ని హత్య చేయబోతున్నాడనీ  మేఘనకి అతీంద్రియ దృష్టి ద్వారా తెలిసిపోయింది, అప్పుడామె పూజతోనే ప్రాణాపాయంలో పడింది.

ఈ లైనులో ఆది (అతీంద్రియ దృష్టి వున్న మేఘన సిద్ధార్థ్ ని ప్రేమించింది) మధ్యమం (ఆ సిద్ధార్థ్ హంతకుడనీ తను ప్రేమిస్తున్న పూజ ని హత్య చేయబోతున్నాడనీ  మేఘనకి అతీంద్రియ దృష్టి ద్వారా తెలిసిపోయింది) అంతం (అప్పుడామె పూజతోనే ప్రాణాపాయంలో పడింది..) పరస్పరాధార భూతంగా ఉన్నాయా?

ఆది మధ్యమాల్లో అతీంద్రియ దృష్టి అనే ఎత్తుకున్న కాన్సెప్ట్ కన్పించినా, అంతం లో దాన్ని విడిచి పెట్టేశారు.  అతీంద్రియ దృష్టి వున్న మేఘనకి పూజతో తనే ప్రమాదంలో పడుతుందని ఎందుకు తెలీదు?

ఇలా ఎత్తుకున్న కాన్సెప్ట్  పరంగా కథకి ముగింపు నివ్వలేదు. కాన్సెప్ట్ విలువకి ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వలేదు. ఒక మర్డర్ మిస్టరీ తేల్చే సాధారణ బిజినెస్సే జరిగి అంతం లో కాన్సెప్ట్ ఎగిరి పోయింది. ఇలా ఇంటర్వెల్ తర్వాత నుంచీ ఈ కాన్సెప్ట్ కనుమరుగై పోయి, ఈ మాత్రం దానికి ఈ  కాన్సెప్ట్ తో ఇంత హడావిడి అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

అతీంద్రియ దృష్టి వున్న జర్నలిస్టు మేఘన సిద్ధార్థ్  ని ప్రేమించింది (ఆది), ఆ సిద్ధార్థ్ హంతకుడనీ తను ప్రేమిస్తున్న పూజ ని హత్య చేయబోతున్నాడనీ  మేఘనకి అతీంద్రియ దృష్టి ద్వారా తెలిసిపోయింది (మధ్యమం), అప్పుడామె పూజనే హంతకురాలిగా చేసి సిద్ధార్థ్ నే కాపాడుకునే స్వార్ధపరురాలిగా ప్రశ్నార్ధకంగా తయారయ్యింది (అంతం)!


ఇలా వుంటే మేఘన  పాత్ర ఎంత ఇంటరెస్టింగ్ గా తయారయ్యేది (యాంటీ హీరోయిన్ గా రోల్ రివర్సల్)? దీంతో కథ ఎంత క్రేజీగా, డైనమిక్ గా  తయారయ్యేది? ఆమె ఎందుకలా తయారవుతుందంటే , అసలు జరిగిందేమిటో తనకి ముందే తెల్సు. లేకపోతే అలాటి అతీత శక్తి వుండీ అర్ధం లేదు. దర్శకుడు ఫ్లాష్ బ్యాక్ లో మనకి చూపించిందాని ప్రకారం, మొదటి గర్ల్ ఫ్రెండ్ వైశాలి మరణం లో  సిద్ధార్థ్ అనుమానితుడు. ఇది మేఘన కూడా తన అతీత శక్తితో చూసింది. ఇక్కడే కిటుకు వుంది. ఎలాగంటే, దర్శకుడు చిట్టచివర్లో  మిస్టరీ విప్పడం కోసం,  అసలా వైశాలి మరణంలో అసూయతో రగిలిపోయిన రెండో గర్ల్ ఫ్రెండ్ పూజ పాల్పడిన చర్యని  ప్రేక్షకుల నుంచి దాచి పెట్టాడు. ప్రేక్షకులనుంచి దాచి పెట్టడం క్లైమాక్స్ కోసం చాలా అవసరమే. కానీ అదే సమయంలో అతీత శక్తి వున్న  మేఘన నుంచి ఎలా దాచి పెట్టగలడు? ఆమె గతంలో జరిగిన ఆ హత్యా దృశ్యాన్ని  చూసివుంటే, అందులో పూజ పాత్రసహా మొత్తం చూసి వుండాలి కదా. లాజిక్ ని  పట్టించుకోకుండా క్రైం కథని ఊహించడం సాధ్యమవుతుందా?  దాన్ని ఆస్వాదించడం అంతకన్నా వీలవుతుందా?


కాబట్టి ఇప్పుడు మేఘనకి తన మనోనేత్రం  ద్వారా హంతకుడు సిద్ధార్థ్ కాదనీ, పూజాయే హంతకురాలనీ ముందే తెలుసనుకుందాం, అప్పుడు  ఈ ఎరుకతోనే ఆమె ఆలా ప్రవర్తించడం మొదలెట్టిందన్న మాట : పూజాని హంతకురాలిగా నిరూపించి, తను ప్రేమిస్తున్న సిద్ధార్థ్ ని దక్కించుకోవడం కోసం ! రివర్స్అయిన  క్యారక్టర్!

ఈ ముగింపులో తనే మర్డర్ మిస్టరీని రివీల్ చేసి, తన అతీత శక్తిని హైలైట్ చేసుకుని, మారిపోయిన తన ప్రవర్తనని జస్టిఫై చేసుకుంటుందన్న మాట!

అంతేగానీ, సినిమాలో మనకి చూపించినట్టుగా పూజాయే తను చేసిన హత్యని వెల్లడించడం కాదు. అలా చేయడంవల్ల మేఘనతో బాటు, హీరో కూడా చేతకాని వాళ్ళయ్యారు. ఈ కథలో ప్రధాన పాత్ర మేఘనయే. అలాంటప్పుడు ఏదైనా ఆమె విజయంగానే వుండాలి. చాలా పూర్వం హిందీలో తీసిన ‘ధువాఁ ’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో చిట్టచివర్లో రాజమాత పాత్ర (రాఖీ) తనే హత్య చేసినట్టు ఒప్పుకుంటుంది- తానుగా వెల్లడించదు -ఆమె తన నోటితో తానే వెల్లడించేలా పరిస్థితులు కల్పిస్తూ వస్తాడు సీబీసి పాత్రధారి అమ్జద్ ఖాన్. ఈ సినిమా అంతా ఎందుకు జరుగుతోందో చెప్పకుండా రకరకాల పాత్రలతో రాజమాత నోట నిజం కక్కించడానికి చేసే పరిస్థితుల కల్పనగానే సాగుతుంది కథనం!

* సిటీ కొచ్చి భాయ్ పేరుతో దందా చేసుకుంటున్న శీను విషయం భాయ్ కి తెలిసిపోతుంది (ఆది), అతన్ని మామతో సహా చంపెయ్యమని ఆర్డరేసి హీరోయన్ని తీసుకుని వేరే పెళ్లి చేయడానికి షార్జా పారిపోతాడు భాయ్ (మధ్యమం), అప్పుడు శీను షార్జా వెళ్లి  భాయ్ కుట్రలన్నిటినీ బయటపెట్టి హీరోయిన్ని సొంతం చేసుకుంటాడు (అంతం)- ఇదీ మూడు వాక్యాల్లో ఆదిమధ్యాంతాల  ‘అల్లుడు శీను’ పరస్పరాధార భూత స్టోరీ లైను.

* భార్యా పిల్లలతో హాయిగా గడిచిపోతుంటుంది హీరో జీవితం, అప్పుడొక యూత్ కూతురి అభ్యంతరకర ఫోటో తీసి తల్లీ కూతుళ్ళ చేతుల్లో హతమై పోతాడు, ఇప్పుడీ కుటుంబాన్ని చట్టం బారి నుంచి కాపాడ్డానికి తెలివైన ప్లానేస్తాడు హీరో - ఇదీ ‘దృశ్యం’ లైను.

* పంజాబీ హీరో-  తమిళ హీరోయిన్ ప్రేమించుకుంటారు, పెళ్లి దగ్గర కొచ్చేసరికి కుటుంబాలు అడ్డు అవుతాయి, తమ కుటుంబాలు ఒప్పుకుంటే తప్ప పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు హీరోహీరోయిన్లు- ‘2-స్టేట్స్’ హిందీ లైను.

* ఒక వైరస్ వ్యాపించి మానవజాతి సమస్తం తుడిచి పెట్టుకుపోతుంది, తట్టుకున్న వానరాలు వాటి నాయకుడి సంరక్షణలో ప్రశాంతంగా జీవిస్తూంటాయి, అప్పుడింకా బతికే వున్న  కొందరు మనుషులు వాటి భూభాగంలోకి చొచ్చుకు రావడంతో తీవ్ర పోరాటం మొదలవుతుంది....ఇది ‘డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ లైను.

* ఆ భార్యాభర్త లిద్దరూ గీత రచయితలుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటారు, భర్తకి ఒక పెద్ద అవకాశం వస్తుంది, దీంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమా కళాతృష్ణా సంఘర్షణలో పడతాయి- ‘బిగిన్ ఎగైన్’ స్టోరీ లైను.  

ఒక స్టోరీ లైను అనుకుంటున్నప్పుడు అందులో ఆది మధ్యాంతాల సమన్వయాన్ని బట్టే కథ వస్తుంది. ఆ ఆది మధ్యాంతాల్లోనే స్క్రీన్ ప్లే మూడంకాలుంటాయి. ఆది (ఫస్ట్ యాక్ట్)- మధ్యమం (సెకండ్ యాక్ట్)-అంతం (థర్డ్ యాక్ట్). ఇలా కథకి లైను అనుకున్నప్పుడే  త్రీ యాక్ట్స్ ధర్మానికి సెట్టయ్యేలా – ఆ త్రీ యాక్ట్స్ లోనూ కాన్సెప్ట్ రన్ అయ్యేలా చూసుకుంటే, కథకి ఓ దారీ తెన్నూ ఏర్పడుతుంది.

రాముడు వనవాసం వెళ్ళాడు-రావణుడు సీతని అపహరించాడు-రాముడు రావణ సంహారం చేసి సీతని రక్షించుకున్నాడు...ఇలా పురాణాల్లో చూసినా ఈ నిర్మాణమే వుంటుంది. త్రీ యాక్ట్స్ నిర్మాణం గురించి రెండువేల ఏళ్ళ క్రితం నాటకాల్ని దృష్టిలో పెట్టుకుని అరిస్టాటిల్ చెబితే చెప్పి ఉండొచ్చు గానీ, అంతకి ముందు నుంచే ప్రపంచ పురాణా లన్నిట్లోనూ ఒక లైను గా చెప్పుకుంటే వుంది. ఎందుకు వుందంటే మనిషి మెదడు కథని రిసీవ్ చేసుకునే పధ్ధతి అదే కాబట్టి! పురాణాలన్నీ, ఆ మాటకొస్తే ఇప్పటిదాకా వచ్చిన నాణ్యమైన కాల్పనిక కథలన్నీ చేసేది సైకో థెరఫీనే!

ఇందుకు భిన్నంగా ‘మాయ’ అనే పారాసైకలజీ స్టోరీ లైను లోనే ఆదిమధ్యాంతాల సమన్వయం లోపించడంతో, సైకో థెరఫీ చేసే మాటలా వుంచి, కనీస స్థాయి థ్రిల్లర్ గానూ రాణించలేక పోయింది.

***
ఈ సినిమా ఫస్టాఫ్ విషయమేమీ లేక బోరు కొట్టిందని వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కారణం, ఇంటర్వెల్లోపు ప్రవేశ పెట్టిన పూజా పాత్రతో ప్లే ని నిర్లక్ష్యం చేయడమే. సినిమా ప్రారంభమైన అరగంటలోపు నా కాబోయే భర్తంటూ పూజ రావడం దగ్గర, హమ్మయ్య ఫస్ట్ యాక్ట్ సకాలం లోనే ముగిసి సెకండ్ యాక్ట్ తో అసలు కథ ప్రారంభ మైనదని సంబరపడతాం. పూజ వల్ల ఈ కథ ఏ మలుపు తీసుకుంటుందో నని ఎదురు చూస్తాం. పూజ బ్యాక్ గ్రౌండ్ ముందుగా మనకి తెలీక పోయినా దర్శకుడికి తెలుసు- అప్పటికే ఆమె తనకాబోయే భర్త గర్ల్ ఫ్రెండ్ వైశాలిని చంపిన హంతకురాలని. అప్పుడేం చేయాలి? ఈ తురుపు ముక్కని చేతిలో పెట్టుకున్న దర్శకుడు, ఇక్కడ మరో కొత్త గర్ల్ ఫ్రెండ్ రూపంలోవున్న హీరోయిన్ తో, పూజ పాత్రకి వున్న  ధ్యేయం కొద్దీ ప్లే ప్రారంభించాలి. అంతేగానీ, సెకండ్ యాక్ట్ తో అసలు కథలోకి ప్రవేశించాక ఇంకా ఫస్ట్ యాక్ట్ బిజినెస్సే నడపడం కాదు. ఐతే ఏమిటా ప్లే? ఈ హీరోయిన్ని కూడా లేపేసే ప్రయత్నాలే! ఎట్టి పరిస్థితిలో హీరో తనకే దక్కాలన్న ధ్యేయం పూజది, ఈ ధ్యేయంతోనే కదా ఒక హత్య చేసొచ్చింది. అంటే ఈమెది ఫాటల్ ఎట్రాక్షన్ సిండ్రోం తాలూకు మానసిక స్థితి. ఇలా పాత్ర మానసిక స్థితీ, దాని ధ్యేయమూ మర్చిపోతే కథేలా నడుస్తుంది? ఇదన్నమాట ఫస్టాఫ్ బోరుకి దారితీసిన కారణం.

దర్శకుడు ఈ కథకి ప్రధాన మలుపు ఇంటర్వెల్ దగ్గర వచ్చే పాయింటుగా (హీరోయిన్ తన మనోనేత్రంతో హీరోని హంతకుడుగా చూడ్డంగా ) పొరబడి దాన్ని పట్టుకుని సాగిపోయాడు. కానీ అది ప్రధాన మలుపు కాదు. కథకి ప్రధాన మలుపు అంతకి ముందు పూజా వంటి కీలక పాత్ర ఎంట్రీ దగ్గరే వచ్చింది! ఇంటర్వెల్ దగ్గర వచ్చేది ఈ  ప్రధాన మలుపు దారితీయించిన సంఘర్షణలో భాగంగా హీరోయిన్ కి ఎదురయ్యే ఒక అడ్డంకి మాత్రమే!

కథకి ప్రధాన పాత్ర ఎవరో, అది ఎదుర్కొనే ప్రధాన సమస్యే మిటో గుర్తించి  ఆ ప్రకారంగా కథకి సెటప్ (అంటే ఫస్ట్ యాక్ట్ చివర్లో వచ్చే ప్రధాన మలుపు వరకూ కథనం) ఏర్పాటు బలంగా చేసుకోకపోతే, థర్డ్ యాక్ట్ (క్లైమాక్స్)లో ఆ ప్రధాన పాత్రకి ఒక లక్ష్యమంటూ లేక,  ఈ సినిమాలో లాగే ప్రమాదంలో ఇరుక్కుని ఇంకెవరో వచ్చి రక్షించాలని పెడబొబ్బలు పెడుతుంది!
***


డైనమిక్స్ విషయానికొస్తే, ‘ఫైనల్ డెస్టినేషన్’ లో  ఏం జరుగుతుందంటే, హీరోకి ముందు జరగబోయే దుర్ఘటనలు మనో ఫలకం మీద కన్పిస్తూంటాయి. తనకున్న ఈ ప్రత్యేక శక్తిని స్వీయానుభవంతోనే గుర్తిస్తాడు. ఓసారి విమానమెక్కితే అది పేలిపోబోతోందని విజన్ పడుతుంది. దాంతో ఎలర్ట్ అయి, గోలగోల చేసి బయల్దేరబోతున్న విమానంలోంచి దూకేస్తాడు. అతడితో బాటూ మరికొందరు దూకేస్తారు. ఎగిరి వెళ్ళిన విమానం పేలిపోతుంది.

బతికామనుకుని తేలికబడ్డ వాళ్ళు ఒకక్కరూ వేర్వేరు ప్రమాదాల్లో చనిపోతూంటారు. విమానం పే లిపోయినప్పుడే ఎఫ్ బి ఐ కి హీరో మీద అనుమానం వేస్తుంది. ఇతడి మానసిక శక్తుల్ని నమ్మలేక పేలుడులో ఇతడి కుట్ర ఉందేమోనని అరా తీస్తూంటారు. దీనికి తోడూ ఒకొక్కరే చనిపోతూ ఉండడంతో ఈ హత్యలు కూడా తన కుట్రని దాచడానికి హీరోయే చేస్తున్నాడని అనుమానాలు పెరిగిపోయి అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేస్తారు.

ఇంతకీ ఈ మరణాలు ఎలా జరుగుతున్నాయంటే, మృత్యువు పగబట్టింది. మృత్యువు ఆయువు తీరిన కొంతమందిని ఒకే విమనంలో పోగేసి బలి తీసుకుందామనుకుంటే, ఆ మృత్యువు పెట్టిన ముహూర్తాన్ని హీరో తన ‘విజన్’ తో దెబ్బకొట్టి మరికొందరితో చావు తప్పించుకున్నాడు. ఇది ఓర్చుకోలేని మృత్యువు చావాల్సిన వాళ్ళు చావాల్సిందే అని వెంటబడి ప్రమాదాలు సృష్టిస్తోంది. హీరోకి మృత్యువు విలన్. ఇదన్నమాట సంగతి!

హీరో తన మానసిక శక్తితో మృత్యువు తప్పించుకోవడం, ఆ మృత్యువు వెన్నాడ్డం, మరోవైపు ఎఫ్ బీఐ ఏజెంట్లు వేధించడం-అనే డైనమిక్స్ తో ఈకథకి జీవంవచ్చింది. హీరోకి ద్విముఖ పోరాటం. ఉత్తమస్క్రీన్ ప్లే లక్షణంగా- మృత్యువుతో అంతర్గత మానసిక పోరాటం, ఎఫ్ బీ ఐ తో బహిర్గత భౌతిక పోరాటం. పైగా ప్రేక్షకులు ఆత్మికంగా కనెక్టయ్యే ఎంతో సైకోథెరఫీ, మరెంతో ఫిలాసఫీ!

‘మాయ’ లో హీరోయిన్ కి మానసిక శక్తి ఉందిగానీ, దానికి కథని దౌడు తీయంచే వ్యతిరేక శక్తులు లేవు. విలన్లు లేరు, అపాయాలూ లేవు-చివర్లో పూజా రహస్యం బయట పెడితే గానీ తను ఇరుక్కునే ప్రమాదం తప్ప!

పాత్రోచితానుచితాలు..
కథే  పాత్రని నడిపిస్తే అది డబ్బులు రాని ఆర్ట్ సినిమా అవుతుంది, పాత్రే కథని నడిపిస్తే డబ్బులొచ్చే కమర్షియల్ సినిమా అవుతుంది. మొదటిది బోరు కొట్టే పాసివ్ క్యారెక్టర్, రెండోది హుషారు తెప్పించే యాక్టివ్ క్యారెక్టర్. ప్రధాన పాత్రకి సంబంధించి  పట్టుకోవాల్సిన గుట్టు ఏమిటంటే, అది మనలో వుండే ఇగోకి తెరమీద కన్పించే ప్రతినిధి. మరి మన ఇగో ఎలా వుంటుంది?  చచ్చిన పాములా పాసివ్ గా వుండదు. మొండికేసి వుంటుంది. ఎవరి మాటా వినదు. గెలుపే కోరుకుంటుంది, ఓటమిని అంగీకరించదు. ఎప్పుడూ యాక్షన్ లో యాక్టివ్ గా వుంటుంది. ఐతే ఇగో మనిషికి మేలు చేయదు. దాంతో ఎన్నో  సమస్యలు, యుద్ధాలు. మరిదాన్నేం చేయాలి. వద్దంటే వదిలిపోదు, చంపుకుంటే చచ్చేది కూడా కాదు మన ఇగో. మరేం చేయాలి? అందుకే తెరమీద ఆ ఇగో (హీరో) ప్రయాణాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే దిశగా రచన సాగిస్తారు తెలివైన రచయితలు, దర్శకులు. సరయిన కథల్లో ఈ కృషే జరుగుతుంది. సరయిన ఏ కథైనా ఇంతే- ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే తంతే!  బాక్సాఫీసు మంత్రం. ప్రేక్షకులకి తెలీకుండా వాళ్ళకి చేసే సైకో థెరఫీ! పైగా శాస్త్రాల ప్రకారం మనముంటున్న ఈ కలియుగం మన నుంచి యాక్షన్ నే  డిమాండ్ చేస్తోంది...

‘ మాయ’ ప్రధాన పాత్ర ఐన హీరోయిన్ సహా, మిగిలిన మూడు పాత్రలూ కథ నడిపిస్తే నడిచే పాసివ్ పాత్రలే. ఎక్కడా ప్రేక్షకుడనే వాడు తనలోని  ఇగోతో ఈ క్యారక్టర్లతో కనెక్ట్ కాలేని అసంతృప్త స్థితి!

హీరోయిన్ కి  జరగబోయేది ముందే  తెలిస్తే  ఎప్పుడూ ఒకే ఎక్స్ ప్రెషన్ తో శూన్యంలోకి చూస్తుందే  తప్ప, ఎలర్ట్ అయి నివారణా చర్యలు చేపట్టదు. ఒక జర్నలిస్టుగా ఆమెలో జర్నలిస్టు సహజాతం ఏమాత్రం వుండదు. నగల షాపు దగ్గర హత్య జరుగుతుందని తెలిసినా వూరుకుంటుంది. ఎప్పుడో ఎందుకో అటు వెళ్లి నప్పుడు చావబోయే సెక్యురిటీ గార్డు కనబడితే  గుర్తుపట్టి వెన్నాడుతుంది. ఇలా కథ నడిపితే కాకతాళీయంగా తను ఇన్వాల్వ్ అవ్వాలే తప్ప, తనే కథని చేతిలోకి తీసుకుని క్రియాశీలంగా వుండాలనుకోని పాత్ర చిత్రణతో వచ్చిన ఇబ్బంది ఇది.

ఇక హీరో నిమిత్త మాత్రుడిగా ఉండిపోతాడు. ఫ్యాషన్ డిజైనర్ గా కుర్తా జీన్స్ వేసుకుని సాత్వికుడి లుక్ తో డల్ గా ఉంటాడు. తను నిర్వహించబోయే ఫ్యాషన్ ఈవెంట్ కూడా చేనేత వస్త్రాల గురించి పెట్టుకుని యూత్ అప్పీల్ ని కాలరాస్తాడు. సినిమా ప్రారంభం లోనే ఫ్యాషన్ ఈవెంట్ కి నెలరోజులు టైం వుందని చెప్పి, దాన్ని  క్లైమాక్స్ లో ఘటనల వరకూ సాగలాగారు. అప్పటికి ఆ  ఫ్యాషన్ ఈవెంట్ అనే ఎలిమెంట్  కి కథనంలో కాలదోషం పట్టేసింది. ఇలా సినిమా మొత్తాన్ని ఆప్షన్ లాక్ తో కాకుండా టైం లాక్ తో నడపడం మరో మైనస్ పాయింట్ అయ్యింది. టైం లాక్ స్టోరీలకి తెలుగులో విజయాలు లేవు.
***
ఈ సినిమా చూస్తూ ఆటోమేటిగ్గా ‘కోకిల’ ని గుర్తు తెచ్చుకుంటాం. 1989 లో నరేష్- శోభన లతో గీతాకృష్ణ దర్శకత్వంలో ఇళయరాజా మ్యూజికల్ హిట్  ‘కోకిల’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ ని మళ్ళీ చూస్తే, ఆ డైనమిక్స్ కి గీతాకృష్ణ అనే క్రేజీ డైరెక్టర్ని మెచ్చుకోకుండా ఉండలేం.

నరేష్ కి ఒక ప్రమాదంలో కళ్ళు పోతాయి. ఆ రోజే హత్యకి గురయిన ఒకస్వామిజీ కళ్ళు నరేష్ కి అమరుస్తారు. నరేష్ కళ్ళు తెరిస్తే అతడికి కన్పించేవి స్వామీజీని హత్యచేస్తున్న వాళ్ళ దృశ్యాలే. ఒక అంతర్జాతీయ సైన్స్ పత్రికలో వచ్చిన అంశం ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నట్టు దర్శకుడు చెప్పినా, దీనికి శాస్త్రీయత లేదని తర్వాత రుజువైనా, సైన్స్ ఫిక్షన్ కి అదంతా అనవసరం. అలా అనుకుంటే ‘అవతార్’ తీయడం అసాధ్యం.

లాజిక్ అడ్డుపడని సృజనాత్మక స్వేచ్ఛ ఇది. స్వామీజీ కళ్ళు పెట్టుకున్న హీరోకి  ఆ  స్వామీజీ హంతకులే కనపడ్డం, ఇది తెలుసుకున్న పోలీసులు హీరో ద్వారా హంతకుల్ని పట్టుకోవాలను కోవడం, డాక్టర్లు వారించడం, హంతకులు హీరోని చంపాలని ప్రయత్నించడం, ప్రకృతి చికిత్సతో హీరోకి నయమైతే, హంతకుల్ని పట్టుకోవడానికి అతడ్ని గుడ్డి వాడుగానే నటించమని పోలీసులు కోరడం, అలా చివరికి హంతకులు దొరికిపోవడం...ఇవీ ఆసాంతం థ్రిల్లింగ్ గా సాగే డైనమిక్స్ కి ఉపయోగపడిన మలుపులు. మలుపు లన్నిట్లోనూ కాన్సెప్ట్ ప్రవహించింది. హీరోకి చివరంటా సంఘర్షణే. ప్రారంభంలో శోభన తో ప్రేమ దృశ్యాలు కూడా పంచ్ తో చకచకా సాగిపోతాయి.

కళ్ళతో లాజిక్ లేని సైన్స్ ఫిక్షన్ తోనే ఇంత మాయ చేస్తే, అన్ని శాస్త్రీయతలూ వున్న జరగబోయేది చూడగలిగే కళ్ళతో ఇంకెంత మాయ చేసివుండాలి! ఇతర భాషల్లో దీన్ని రీమేక్ చేస్తున్నట్టున్నారు. బాలీ వుడ్ లో మహేష్ భట్ నీ కలిశారు. రీమేకులూ తెలుగు ‘మాయ’లాగే ఉంటాయా!

-సికిందర్




















25, జులై 2014, శుక్రవారం

రివ్యూ..
మాస్ మసాలా శీను!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : వి.వి.వినాయక్
తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, సమంతా, తమన్నా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, తనికెళ్ళ భరణి, రవిబాబు, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్    ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు  కూర్పు: గౌతమ్ రాజు
రచన: గోపీమోహన్   మాటలు : కోన వెంకట్
బ్యానర్ : శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్       నిర్మాతలు  : బెల్లకొండ సురేష్, బెల్లంకొండ గణేష్
విడుదల : 25 జులై 2014     సెన్సార్ : ‘A’
**
మరో కొత్త యువ వారసుడు రంగప్రవేశం చేశాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ వెండితెర ఎంట్రీ కోట్లరూపాయల భారీ బడ్జెట్ ని వెదజల్లుతూ అట్టహాసంగా జరిగింది. బడాబడా సాంకేతికుల సపోర్టుతో బ్రహ్మాండమైన కమర్షియల్ పండుగని  ప్రేక్షకులకి నజరానాగా సమర్పించడానికి తీవ్ర కసరత్తు చేశారు.  భారీఎత్తున పబ్లిసిటీతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సృష్టించిన ఈ మాస్ కమర్షియల్ ని పక్కాగా అందించడానికి ముందువరసలో నడుంకట్టి నిలుచున్నారు టాప్ దర్శకుడు వి.వి. వినాయక్. ఆయనకి తోడుగా క్యాచీ కెమెరా వర్క్ తో ఛోటా కె.నాయుడు, హిట్ ట్యూన్స్ తో దేవీశ్రీ ప్రసాద్ నిలిచారు. ఇంకా ప్రముఖ కోరియోగ్రాఫర్లూ, యాక్షన్ డైరక్టర్లూ, ఇతర పేరున్న టెక్నీషియన్లూ అందరూ తోడై పోటాపోటీగా పనిచేశారు. మరైతే ఇన్నిహంగులూ వరించడానికి యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిజంగా అర్హుడైన టాలెంటేనా?


ఈ యువ హీరోని పరిచయం చేయడానికి రొటీన్ కథనే ఎన్నుకున్నారు. ఎమోషనల్ సీన్లకి తావులేకుండా జాగ్రత్త పడ్డారు. శ్రీనివాస్ కి అమెరికాలో శిక్షణ ఇప్పించి ముందు మంచి డాన్సర్ గా, ఫైటర్ గా ఎష్టాబ్లిష్ చేయడానికే  పూనుకున్నారు. నటనమీద అప్పుడే వొత్తిడి అనవసరమన్పించి,  హావభావాల ప్రద ర్శనకంటే, కామెడీతో అలా అలా నడిపించెయ్యడమే బెటరని నిర్ణయించుకున్నట్టుంది. 

కథేంటి?
రొటీన్ కథ అని ముందే చెప్పుకున్నాం. ఒకానొక వూళ్ళో మామ నరసింహా (ప్రకాష్ రాజ్ ) తో కలిసి బాగా అప్పులు చేసి తీర్చలేక అతన్తో పారిపోయి రైలెక్కేస్తాడు శీను (బెల్లంకొండ శ్రీనివాస్). చెన్నై వెళ్తున్నామనుకుని హైదరాబాద్ లో దిగుతారు. ఆటోవాలా (వెన్నెల కిషోర్) ఈ అమాయకుల్ని ఇదే చెన్నై అని నమ్మిస్తూ నాయుడు (రఘుబాబు) అనే హోటల్ యజమానికి అప్పగిస్తాడు. నాయుడు తన గ్యాంగ్ తో కలిసి వీళ్ళని దోచేద్దా మానుకుంటే ఏమీ వుండదు. ఇలా వుండగా ట్రాఫిక్ లో శీను అంజలి (సమంతా) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె భాయ్ (ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం) అనే ఒక గ్యాంగ్ లీడర్ కూతురు. ఇంకోరోజు సాక్షాత్తూ భాయ్ ని చూసి అతను అచ్చం తన మామ నరసింహా లాగే ఉండడంతో, ఓ ప్లానేస్తాడు. మామని భాయ్ లాగా  తిప్పుతూ భాయ్ చేయాల్సిన బిజినెస్ ని కొట్టేస్తూంటాడు. మరో వైపు షార్జాలో వుండే భాయ్ పార్టనర్ (ప్రదీప్ రావత్) కొడుకు రోహిత్ తో అంజలికి పెళ్లి కుదుర్తుంది. త్వరలో రోహిత్ ఇక్కడికి రాబోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శీను తనే రోహిత్ అని నమ్మిస్తూ అంజలికి దగ్గరవుతాడు.

ఇలా వుంటే, మామ నరసింహం తో కలిసి శీను ఆడుతున్న నాటకం భాయ్ కి తెలిసి పోతుంది. ఏనాడో చనిపోయాడ నుకున్న నరసింహం బతికే వుండడం భాయ్ ని కంగారు పెడుతుంది. వెంటనే నరసింహం –శీను లిద్దర్నీ చంపెయ్యమని ఆర్డరేసి కూతురి పెళ్లి చేయడానికి ఆమెని తీసుకుని షార్జా వెళ్లి పోతాడు భాయ్.
ఇప్పుడు శీను ఈ హత్యా ప్రయత్నం నుంచి ఎలా తప్పించుకున్నాడు, అసలు నరసింహం గతం ఏమిటో తెలుసుకుని షార్జా వెళ్లి భాయ్ పనిబట్టి, అంజలిని తన సొంతం ఎలా చేసుకున్నాడన్నది ఇక్కడ్నించీ సాగే సెకండాఫ్ కథ!
కామెంట్!
అనేక సార్లు చూసి వున్న రొటీన్ ఫార్ములా కథే. కాకపోతే నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండడంతో కళ్ళప్పగించి చూసేలా చేస్తుంది. మరీ బాగా పేలే పంచ్ డైలాగులు లేవుగానీ, ఉన్నంతలో కమేడియన్ల చేత సాఫ్ట్ కామెడీని పండించగలిగారు. భాయ్ అనుచరుడుగా బ్రహ్మానందం పోషించిన డింపుల్ పాత్ర రొటీన్ గా సెకండాఫ్ లో రాకుండా ఫస్టాఫ్ నుంచే వుంటుంది. ఒకేలా వున్న నరసింహం, భాయ్ లతో తికమక పెట్టే సన్నివేశాల్లో బ్రహ్మానందం హాస్యం కొన్ని చోట్ల బాగా పేలింది. షార్జా పార్టనర్ అనుచరుడి పాత్రలో రవిబాబు ఇంకో వెర్రిబాగులవాడి కామెడీని పండించాడు. రఘుబాబు, వెన్నెల కిషోర్, వేణు తదితర హాస్యబృందం ప్రేక్షకుల్ని వినోద పరచడానికి ఉన్న పాత్రల పరిధిమేరకు కృషి చేశారు. అయితే మొత్తంగా చూస్తే సినిమాలో కామెడీ ఉండాల్సిన రేంజిలో మాత్రం లేదు.
ఇక ద్విపాత్రాభినయంలో ప్రకాష్ రాజ్ సన్నివేశాల బలం పెంచుతాడు. ప్రదీప్ రావత్  గెటప్ అతడి కరకు విలనిజాన్ని పండించడానికి అడ్డుపడింది. గడ్డం మీసాల తీరు సాఫ్ట్ నేచర్ ని వ్యక్తీకరించడంతో వచ్చిన సమస్య ఇది!

ఇక కొత్త హీరో శ్రీనివాస్ గురించి ముందే చెప్పుకున్నాం. ఈ సినిమా ఇతడికి ఇంజనీరింగ్ కోర్సులో చేరడానికి ఎంసెట్ రాయడం లాంటిది అనుకుంటే ఇందులో ఇతను ఉత్తీర్ణుడైనట్టే. తర్వాత వచ్చే సినిమాల్లో ఇతను డాన్సులూ పోరాటాలతో బాటు, తన నటనాభినివేశాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వుంటుంది. లేకపోతే కార్డ్ బోర్డు నటుడిగా ఫేడవుట్ అయిపోయే ప్రమాదముంది.
హీరోయిన్ సమంతా గ్లామర్ కోషెంట్ కోసం ఉపయోగపడింది. అయితే మరీ ‘దూకుడు’, ‘ఆటోనగర్ సూర్య’ ల్లో లాగా సెకండాఫ్ లో కథలోంచి మాయమైపోకుండా ఆద్యంతం ఉంటూ రక్షించింది. మొదటి పాటలో ఐటం గర్ల్ గా వచ్చిపోయే తమన్నా మరో కమర్షియల్ దినుసు!

ఏ సిల్వర్ స్క్రీన్ అయితే నిండుగా కన్నులపండువగా వెలిగిపోతుందో- అది ఛోటా కె.నాయుడు కెమెరా వర్క్ కి నిదర్శనంగా గుర్తుపట్ట వచ్చు- అని గతంలో ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న సందర్భంగా ఈ సమీక్షకుడికి వెల్లడించిన ఛోటా కె. నాయుడు మరోసారి ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ సినిమా ఆయనెందుకు టాప్ డీ ఓ పీ నో అడుగడుగునా నిరూపిస్తుంది- పాటల చిత్రీకరణలో మరీనూ!

పాటలతో దేవీశ్రీ ప్రసాద్ దీన్నో మ్యూజిక్ ఫెస్టివల్ గా మార్చేశారు. పాటలు, పోరాటాలు, కాసింత కామెడీ ఈ భారీ కమర్షియల్ ని వినోదించడానికి పోటీపడ్డాయి. అయితే, ఇందరు టాప్ కళాకారులతో భారీ హంగులతో రూపొందిన  ఈ సినిమాకి వెనకబడిపోయింది స్క్రిప్ట్ ఒక్కటే! ఇంతమంది పెద్ద తారాగణం,  పేరున్న టెక్నీషియన్లూ అందరూ పోటాపోటీగా పనిచేసి సినిమాని నిలబెట్టడానికి విపరీతంగా కృషిచేస్తే, స్క్రిప్టు బాధ్యతలు తీసుకున్న రచయితలు  మాత్రం ఈ పోటీలో భాగం కాలేకపోయారు. రచయితలు  కోన వెంకట్- గోపీ మోహన్ లు  అరిగిపోయిన మూసలోంచి బయటికి రావడానికి ససేమిరా అంటున్నారు! అదిసరే, స్క్రీన్ ప్లే నిర్వహణలోనూ పెద్ద పొరపాట్లు చేస్తున్నారు!

దర్శకుడు వినాయక్ ఈ మూస కథకి  తనదైన చిత్రీకరణతో నవ్యత సాధించడానికి చేసిన కృషి కూడా తెరమీద కన్పిస్తుంది- మొత్తం మీద బెల్లంకొండ వారసుడికి సేఫ్ పాసేజ్ కల్పించి ముందుకు నెట్టారు!

 స్క్రీన్ ప్లే సంగతులు

ఈ స్క్రీన్ ప్లేలో సమయం వృధా చేయకుండా కథనంలో రావాల్సిన మలుపుల్ని, కొన్ని ప్రధాన పాత్రల షేడ్స్ ని, మరికొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ నీ  వెంటవెంటనే బాగానే ఏర్పాటు చేసుకుంటూ పోయారు. ప్రధాన సమస్య- భాయ్ పాత్ర తనకో డబుల్ (నరసింహం) ఉన్నాడని తెలుసుకుని హీరోతో సహా మిత్రబృందాన్నంతటినీ సజీవ దహనానికి ఆర్డరేసి,  హీరోయిన్ తో షార్జా పారిపోయే ఘట్టం- ఇది ఇంటర్వెల్లో వస్తుంది. అంటే ఫస్ట్ యాక్ట్ ఇక్కడి దాకా సాగి  ముగిసిందన్నమాట.

నిజానికి సినిమా ప్రారంభమైన అరగంట లోపే, శీను హైదరాబాద్ లో తన మామ లాగే వున్న భాయ్ ని చూసి, మామతో భాయ్ లా గేమ్ ఆడ్డం ప్రారంభించినప్పుడే, సమస్య ఇక్కడే పుట్టి కథ సెకండ్ యాక్ట్ లో పడిందనుకుంటాం. ఇది చాలా మంచి ఎత్తుగడ. క్యారక్టర్ కలర్ ఫుల్ గా  ఎప్పుడు కన్పిస్తుందంటే, ఇలాటి సాహసాలకి తెగించి సంఘటన సృష్టించినప్పుడే! ఆ సంఘటన ప్రత్యర్ధికి ఇంకా తెలీయకుండా, ఆడియెన్స్ కి తెలిసిపోతున్నప్పుడే. దీంతో ఉత్కంఠ, ఏమవుతుందో నన్న సస్పెన్సూ ఏర్పడతాయి. What is character but the determination of incident? And what is incident but the illumination of character?- అని హెన్రీ జేమ్స్ అంటాడని దివంగత సిడ్ ఫీల్డ్ అనేక సార్లు పేర్కొన్నాడు!

పాత్రని ఆవిష్కరించడానికి తగిన సంఘటనల కోసం అన్వేషణ సాగుతుంది- అంటారు డా. వల్లంపాటి వెంకట  సుబ్బయ్య కూడా- తన కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన గ్రంథం ‘కథా శిల్పం’లో. అంతే గాక పాత్ర ఎవరికి  ప్రాతిధ్యం వహిస్తోంది? –అన్నది కూడా ముఖ్యమే నంటారు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్ళకుండా స్థూలంగా చెప్పుకుంటే, ప్రతీ మనిషీ ఒక గుంపుకి చెందివ వాడై ఉంటాడు. మన దేశంలో మతం, కులం, భాష, ప్రాంతం మనుషుల్ని గుంపులుగా విభజించాయి....ఇవి కాకుండా వర్గ తారతమ్యాలూ, ఉద్యోగమూ, సామాజిక స్థాయీ, లింగ బేధమూ, వయస్సూ సైతం మనుషుల్ని గుంపులుగా విభజిస్తాయి..వీటిలో ఏ గుంపుకు చెందిన మనిషైనా తనకి తెలీకుండా ఆ గుంపు భావజాలానికి లోనవుతాడు...ఇలా గుంపు భావజాలానికి ప్రాతినిధ్యం వహించేలాగా కథలో చిత్రించిన పాత్రల్ని ప్రాతినిధ్య పాత్రలంటారు..వీరు గుంపుకు నమూనాలు, మచ్చు తునకలు...ఇంగ్లీషులో చెప్పాలంటే ‘టైప్స్’... కథా సాహిత్యంలో ఈ నమూనా ప్రాతినిధ్య పాత్రలే చాలా ఎక్కువ ఉంటాయని వివరించుకొస్తారు సుబ్బయ్య.

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే, ఈసినిమా కథలో తర్వాత బయట పడే ఒక ఉదంతం వుంది. ఈ ఉదంతమే ఈ కథంతా పుట్టడానికి కారణం. ఈ ఉదంతం లేకపోతే కథే లేదు, సినిమా కూడా లేదు . ఇది అంతర్గతం గా ( హిడెన్ ట్రూత్ గా ) ఉంటూ, ఇంటర్వెల్ మలుపు తర్వాత బయట పడుతుంది. కథలో ఒక  హిడెన్ ట్రూత్ అంటూ ఉన్నాక, దాన్ని పక్కన పెట్టేసి,   పైపైన పాత్రలతో ఎంత ఆటాడించినా అది వెలవెల బోతూనే వుంటుంది. ఇదే జరిగిందిక్కడ. ఈ సినిమా సెకండాఫ్ దెబ్బతినిపోవడానికి ఇదే కారణం.

ఇరవై ఏళ్ల  క్రితం నల్లగొండ జిల్లాలో ఫ్లోరీన్ బాధితుల సమస్య తీసుకుని, దాని పరిష్కారాన్ని విలన్ చేత భంగ పరచిన ఫ్లాష్ బ్యాక్ ఈ కథలో వుంది. నరసింహం ఆ వూళ్ళో మోతుబరి. ఫ్లోరీన్ సమస్య తీర్చడానికి మంచి నీటి ప్లాంటు కోసం ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంలో తను పాతిక కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంటాడు. అందులో పది  కోట్లు ప్రజలనుంచి సేకరిస్తాడు. ఈ డబ్బు మీద కన్నేసిన తమ్ముడు (తర్వాత భాయ్ గా మారాడు) అన్న నరసింహం కుటుంబం మీద దాడి చేసి, ఆ డబ్బుతో, ఐదేళ్ళ అన్నకూతురు అంజలి తో పారిపోతాడు. అంజలిని ఎందుకు చంపలేదంటే, ఇంకో ఇరవై ఏళ్ల  తర్వాత తండ్రి ఆస్తి ఆమెకే వస్తుందని! లోకానికి మాత్రం అన్న తన కుటుంబాన్నీ, సెక్యూరిటీ పోలీసుల్నీ  చంపేసి డబ్బుతో పారిపోయినట్టు చిత్రిస్తాడు. లోకం మంచోడైన అన్నని అసహ్యించు కుంటుంది. అయితే తను చంపేశాడనుకున్న అన్న ప్రాణాలతో బయట పట్టాడన్న నిజం ఈ తమ్ముడికి తెలీదు. అలా బద్నాం అయిన అన్న వేరే వూరికి పారిపోయి బతికాడు. అక్కడే శీను దొరికి అతన్ని పెంచుకున్నాడు తమ్ముడేమో ఆ పాతిక కోట్లతో ఇప్పుడు వందలకోట్లకి ఎదిగి భాయ్ గా దందాలు చేస్తున్నాడు.
ఇదీ జరిగిన విషయం!
ఇదిశీను అడిగితే చెప్పుకొస్తాడు నరసింహం. శీను సంగతేమో గానీ,  మనలాంటి సామాన్య ప్రేక్షకులకి వెంటనే ఇప్పుడిన్నేళ్ళకి ఫ్లోరీన్ సమస్య తీరని పీడితులు ఇంకెంతమంది పెరిగిపోయి  యాతన పడుతున్నారో కదా- అని సినిమాలో మనకి తాజా పరిస్థితి చూపించకున్నా,  ఆ హృదయవిదారక దృశ్యాలు  కళ్ళముందు కదలాడతాయి...ఇది నిజంగా కథాత్మని ఆవిష్కరించే సన్నివేశం!

హీరోకి ఈ కథాత్మంతా అవసరం లేదు, అరంగేట్రం హీరో మీద అంత హెవీ కథ భారం మోపదల్చుకోలేదు మేము- అని ఆర్గ్యూ చేస్తే, అలాంటప్పుడు ఈ ఫ్లాష్ బ్యాకే పెట్టివుండాల్సింది కాదు. సినిమా అరగంటలోపు ఇచ్చిన మలుపుతో-దాన్నే ‘ప్రధాన సమస్య’ గా- పాయింటుగా చేసుకుని- (నిజానికే ఇదే కథాంశమని మనకి అన్పించినట్టు పైన చెప్పుకున్నాం) శీను కాకతాళీయంగా మామలాగే వున్న భాయ్ ని చూశాడు, మామని ఉపయోగించుకుని డబ్బు సంపాదనకి గేమ్ ప్లే చేశాడు, మరో వైపు డబుల్ ధమాకాగా భాయ్ కూతుర్నే లవ్ చేసిపారేశాడు, ఇది భాయ్ తెలుసుకోగానే భాయ్ ని మాయం చేసి మామనే డైరెక్టుగా భాయ్ గా ప్రవేశపెట్టాడు...ఇలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీగా చేసుకుంటూ పోతే సరిపోయేది.
***
కానీ ఫ్లాష్ బ్యాక్ విన్న శీను సిల్లీగా మామని నిర్దోషిగా నిరూపిస్తా-అని పాతసినిమా డైలాగే  కొడతాడు. మామ నరసింహం కూడా స్వార్ధ పరుడుగా కన్పించే చిత్రణ ఇది...ఎలాగంటే, ఎంతసేపూ అతడికి తాను నిర్దోషి అని లోకానికి నిరూపించుకోవాలన్న సొంత యావే తప్ప, అసలానాడు తాను  డబ్బు ఖర్చుపెట్టి ఆదుకోబోయిన ఫ్లోరీన్ పీడితులు అన్యాయమైపోయారన్న విశాల దృక్పథంతో బాధే వుండదు!

ఈ ఫ్లాష్ బ్యాక్ రివీలయ్యాక స్టోరీ పాయింటు అసలు ఫస్టాఫ్ లో మామతో శీను ప్రారంభించిన గేము కాదనీ, ఇంటర్వెల్లో భాయ్ హీరోయిన్ తో పారిపోవడం కూడా కాదనీ, ఫ్లాష్ బ్యాక్ లో వీటికంటే తీవ్ర సమస్య వున్నాక,  హీరో రియాక్ట్ అయి దానిమీదే ఉద్యుక్తుడవ్వాలనీ అన్పిస్తుంది ఎవరికైనా.

భాయ్ హీరోయిన్ తో పారిపోయి శీనుకీ, మామకి అన్యాయం చేసి మామకీ అసలు శత్రువే కాదనీ, ఆనాడు ఫ్లోరిన్ బాధితులకి అన్యాయం చేసిన సమాజ శత్రువనీ శీనుకి అవగాహన కలగాలి. కలిగితే పాత్ర ఎదిగి క్యారక్టర్ గ్రోత్ కన్పించేది. పాత్ర అలా పైకిలేచి కథలో వున్న మొనాటనీ ని ఛేదించుకుంటూ పోయేది. శీను కేవలం మామ చెపితే వినడం కాదు, తానూ ఆ ఊళ్ళు తిరిగి ఇప్పటి పరిస్థితిని (ఫ్లోరీన్ బాధితుల్ని) కళ్ళారా గాంచి చలించిపోవాలి. అంతవరకూ తనకోసమే జులాయిగా బతికిన అతను, ఈ పరిస్థతి చూశాక ఎవరికోసం బతకాలో, ఏ ‘గుంపు’కి ప్రాతినిథ్యం వహించాలో బాధ్యత తెలుసుకుని, పెద్ద టర్న్ తీసుకోవాలి! అప్పుడతను ప్రేక్షకుల ప్రేమకి అనివార్యంగా పాత్రుడయ్యే వాడు!

ఒక సుప్రసిద్ధ అమెరికన్ పత్రికా సంపాదకుడు- ఓ కథ నాల్గు పేజీలు  చదివితే, ఈ రచయిత మనుషుల్ని ప్రేమించే రకమో కాదో తెలిసి పోతుందనీ, మనుషుల్ని ప్రేమించని రచయిత రచన  పాఠకుల్ని ఆకట్టుకోదనీ అంటాడు..ఇదే కన్పిస్తోందీ సినిమాలో.
***
.

 contd...










సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 


వాస్తవికత లేని మిక్సింగ్ వృధా!



దేవీకృష్ణ కడియాల

(సౌండ్ ఇంజనీర్-రామానాయుడు స్టూడియో) 


ఆర్టికల్..

పొంచి వుంది ముంచే కాలం !

తెలుగు సినిమాల నిర్మాణాలు ఇప్పుడు జోరు తగ్గాయి. రాష్ట్ర విభజన పరిణామాలు, దీని కారణంగా రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చే పెట్టుబడుల మందగమనం వంటి అవాంతరాలు గాకుండా, కేవలం శాటిలైట్ రైట్స్ కి తాళం పడి పోవడంతో పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాల ప్రారంభోత్సవాలకి ఫుల్ స్టాప్ పడింది. ఎక్కడపడితే అక్కడ తామరతంపరలా వెలసి, పోటీలకి పోయి, ధరలతోబాటు  సినిమా సాంకేతిక విలువలనీ  దిగజార్చిన రికార్డింగ్, ఎడిటింగ్, డీటీఎస్, డీఐ థియేటర్లు ఇప్పుడు పనుల్లేక బోసిపోతున్నాయి. మొన్నటివరకూ గల్లీల్లో రెండు గదుల్లో రికార్డింగ్, ఎడిటింగ్ థియేటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు డి టి ఎస్, డిఐ టెక్నాలజీ థియేటర్లు సైతం వెలసి పెద్ద స్టూడియోల కార్యకలాపాలకి సవాలుగా మారాయి. ఇక విడుదలకి ముందే శాటిలైట్ హక్కులు కోట్లరూపాయలు అడ్వాన్సుగా తెచ్చుకునే పెద్ద సినిమాలు తప్ప, చిన్న సినిమాల ఉత్పత్తి తగ్గిపోవడంతో, వాటినే నమ్ముకున్న దర్శకులు, వాళ్ళ సహాయకులు, ఇతర టెక్నీషియన్లూ రోడ్డున పడ్డారు! ఇదీ ఈ ఏడాది తొలిసగంలో తెరవెనుక సీను.

ఇక తెర ముందుకొస్తే జనవరి- జూన్ నెలల ఆరు మాసాల కాలంలో షరా మామూలుగా 50కి పైన తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇవన్నీ గత సంవత్సరం ఎప్పుడో ప్రారంభమైన సినిమాలు కాబట్టి ఈ సంఖ్య కనబడుతోంది. ఇంకా మరెన్నో బ్యాక్ లాగ్ సినిమాలూ వచ్చే ఆర్నెల్లలో విడుదల కావొచ్చు. తాజాగా ఈ ఏడాది కొత్త సినిమాల నిర్మాణాలు పడిపోవడంతో దీని ప్రభావం వచ్చే సంవత్సరం డిస్ట్రిబ్యూటర్ల మీద, ఎగ్జిబిటర్ల మీదా తప్పక వుంటుంది! ఆడించుకోవడానికి సినిమాల్లేక థియేటర్లు ఏమౌతాయో ఏమో! ఇంతేకాదు, ప్రకటనల రంగం మీదా ప్రభావం పడుతుంది. పత్రికలకి, ఛానెళ్ళకి సినిమా యాడ్స్  ఆదాయం తగ్గి పోవచ్చు. ప్రారంభోత్సవాలూ ప్రెస్ మీట్లూ లేక సినిమా విలేఖరులూ ఖాళీగా కూర్చోవాలి. పీఆర్ఓలు వేరే పనులు చూసుకోవాలి. ఇప్పటికే దినపత్రికల  సినిమా పేజీల్లో సినిమా వార్తల్లేక, వేరే కబుర్లు రాసుకోవాల్సిన పరిస్థితి. ఛానెళ్ళలోనూ ప్రతిరోజూ వుండే  సినిమా ప్రొడక్షన్ వార్తలు, ప్రెస్ మీట్ల విశేషాలూ రావడం లేదు. ఇక ఆడియో ఫంక్షన్లు కూడా ఐపులేకుండా పోవచ్చు.

కేవలం చిన్న సినిమాలు ఆగిపోతేనే  ఈ పరిస్థితి. చిన్న సిన్మాల నిర్మాతలకి శాటిలైట్ రైట్స్ పరంగా జేబులో పడే సొమ్ముల బరువు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది. ఛానెళ్ళు లేని కాలంలో, శాటిలైట్ హక్కుల్లేక సినిమాలు ఆడాలంటే కేవలం ప్రేక్షకులనే నమ్ముకోవాలి. ప్రేక్షకుల కోసమే అప్పట్లో సినిమాలు తీసేవాళ్ళు. కాబట్టి కాస్తో కూస్తో క్వాలిటీ వుండేది. శాటిలైట్ రైట్స్ మొదలయ్యాక నిర్మాణ దశలోనే భారీ అడ్వాన్సులు వచ్చేస్తూంటే- భక్తి దేవుడి మీద, చిత్తం ప్రసాదం మీదా  అన్నట్టు ప్రేక్షకులు కోన్ కిస్కా అయిపోయారు. ప్రేక్షకులకోసం సినిమాలు తీయడం మానేశారు. సార్, దీనికి కోటి పెడితే ఎనభై దాకా శాటిలైట్ వస్తుంది...కోటి కూడా పెట్టనక్కరలేదు, డెబ్బై  పెట్టుకుంటే ముఫై శాటిలైట్ అడ్వాన్సు వచ్చేస్తుంది..ఇలా చెబుతూ సినిమా మొహమెరుగని కొత్త కొత్త వాళ్ళని నిర్మాతలుగా దింపడం అలవాటు చేసుకున్నారు తమ స్వార్ధం కోసం దర్శకులు. కోటిలో శాటిలైట్ ఎనభై దాకా వస్తే, ఇరవయ్యే కదా రిస్కు,  ఇది సొంతంగా విడుదల చేసుకున్నా థియేటర్ల నుంచి రాకపోతుందా..అన్న అంచనాలేసుకుని కొత్త వాళ్ళు సినిమాలు చుట్టేయడం మొదలెట్టారు. పెట్టుబడిలో ఇరవై శాతమే ప్రేక్షకులనుంచి ఆశించే పరిస్థితి ఏర్పడింది. 

'ఒకప్పుడు నూరు శాతం ప్రేక్షకులనుంచే రాబట్టాలని కంకణం కట్టుకుని క్వాలిటీ కోసం ప్రయత్నించే వాళ్ళు. ఈ ఇరవై శాతాన్ని కూడా కేర్ చేసే పరిస్థితి లేదు. ఇరవై శాతం క్వాలిటీ సినిమాని కొనే బయ్యర్ ఎవరూ రారు. నిర్మాతే సొంతంగా విడుదల చేసుకోవాలి. ఇదే జరిగింది ఇంతకాలమూ. ఇరవై శాతం సొమ్ముల కోసం నిర్మాతయినా ఎందుకు విడుదల చేసుకోవాలంటే, విడుదల చెయ్యకపోతే మిగతా శాటిలైట్ సొమ్ములూ  రావు గనుక !

పదేళ్ళ క్రితం ఈ శాటిలైట్ రంధి ఎక్కడికి దారితీసిందంటే,  మూడ్రోజుల్లో ఐదారు లక్షల్లో సినిమా చుట్టేసి- పది-పదిహేను లక్షలు శాటిలైట్ సొమ్ములు తెచ్చుకో వచ్చనే దాకా. ఈ సినిమాలు థియేటర్ల పరంగా ప్రేక్షకుల ముందుకే రావు. కానీ శాటిలైట్ సొమ్ములు రావాలంటే విడుదలై నట్టు చూపించాలి. కాబట్టి పేపర్లలో ఓ చిన్న యాడ్ వేసి, ఒక రోజు కోసం థియేటర్ మాట్లాడుకుని నాల్గాటలు వేసుకుని ఎత్తేసే వాళ్ళు. ఈ సహకారం అందించడానికి హైదరాబాద్ నగరంలో జనం వెళ్ళని ఓ రెండు థియేటర్లు ఉండేవి. దీని మతలబు తెలీక,  ఓ ప్రముఖ పత్రికలో ఓ సినిమా విమర్శకుడు వీరావేశ పడిపోయి, ఈ థియేటర్లలో ఆ సినిమాలు చూసేసి,  సమీక్షలు రాసి పారేశాడు కూడా!

ఎవరైనా హోటల్ పెడితే కస్టమర్లకి భోజనం పెట్టడానికి పెడతారు. కానీ ఎవరైనా చిన్న సినిమాలు తీస్తే ప్రేక్షకులకోసం తియ్యరు! ఇదే ఇంతకాడికి తెచ్చింది. శాటిలైట్ బూమ్ పెద్ద కుంభ కోణంలోకి తిరగబెట్టడంతో, చిన్న సినిమాలకి ఉరి బిగుసుకుంది. ప్రతి చెత్త సినిమానీ లక్షలకి లక్షలు శాటిలైట్ బేరాలు పెంచేసి సొమ్ములు దండుకున్న కొన్ని పెద్ద తలకాయల వ్యవహారం పొక్కడంతో, మొత్తంగా చిన్న సినిమాల శాటిలైట్ హక్కులకి ఈ ఏడాది ప్రారంభం నుంచే బ్రేకు పడిపోయింది. ఇక చిన్న సినిమా శాటిలైట్ హక్కులమ్ము కోవాలంటే ముందు సొంత డబ్బులతో సినిమా తీసి, అది నాల్గు వారాలు ఆడి ఫర్వాలేదని ప్రేక్షకులు సర్టి ఫికేట్టిస్తే, అప్పుడు లక్షలేం ఖర్మ, కోటి పెడితే మరో కోటి ఇచ్చి శాటిలైట్ హక్కులు కొనేందుకు సిద్ధంగా వున్నాయి ఛానెళ్ళు!

అంటే చిన్న సినిమా తిరిగి ప్రేక్షకుల పేషీ లోకి వచ్చేసిందన్నమాట. ప్రేక్షకులు చూసి, కనీసం యావరేజి అని ధృవీకరిస్తే గానీ ఇంక ఆటలు సాగవన్న మాట. ఫ్లాప్ రిపోర్టు వస్తే ఇక అంతే  సంగతులు!

పరిస్థితి ఇలా ఇలా తిరగ బెట్టాక, అంత అంకిత భావంతో చిన్న చిన్న బడ్జెట్ సినిమా లెవరు తీస్తారు? కళ కోసం ఎలాగూ తియ్యారు, కనీసం ప్రేక్షకుల కోసం తీయడానికైనా మన సొప్పడం లేదు. కచ్చితంగా ఫ్లాపయ్యే సినిమాలే తీస్తారు కాబట్టి. కనుక పెట్టిన మొత్తం డబ్బులూ పోతాయి. చిన్న సినిమాల నిర్మాణాల్నికూడా ఒక కుంభకోణం గా చేసి, జేబులు నింపుకున్నాక, మళ్ళీ ఆ జేబుల్లోంచి తీసి పోగొట్టుకుందుకు మనసొప్పదుగా?

పోనీ తెగించి క్వాలిటీ సినిమా తీద్దామన్నా, అప్పట్లో చిన్న సిన్మాలు తీసి విజయాలు సాధించిన దాసరి నారాయ రావు ల్లాగా, కోడి రామకృష్ణ ల్లాగా ఇప్పుడెవరున్నారు? చిన్న సినిమా అంటే ప్రేమ సినిమా అనే అర్ధం రాసుకుని ఈ ఆర్నెల్లలో తీసిన పద్దెనిమిది ప్రేమ సిన్మాలన్నీ అడ్రసులేకుండా పోయినవేగా? వాటికొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు,కొత్త కొత్త హీరో హీరోయిన్లందరూ ఐపులేకుండా పోయిన వాళ్ళేగా?

ఇదీ సంగతి! ఏడాదంతా పెద్ద సినిమాలు పదే విడుదలౌతాయి. వారం వారం థియేటర్ లకి  ఫీడింగ్ నిచ్చేవి, పదుల సంఖ్యలో తయారయ్యే చిన్న సినిమాలే. ఈ చిన్న కూడా లేకపోయాక మొత్తం అన్ని సెక్టార్లలో ఫీల్డు పరిస్థితేంటో బ్రహ్మ దేవుడే చెప్పాలి. ఫీల్డు ని వైజాగ్ కి తరలించుకోవాలన్న ఆలోచన సంగతి దేవుడెరుగు, అసలిప్పుడున్న ఫీల్డే మవుతుందని ఆలోచించాలి. క్వాలిటీ లేని కళాకారులతో  వైజాగ్ లో పరిశ్రమ స్థాపించినా వైకుంఠంలో  స్థాపించినా ఇంతకంటే ఒరిగేదేమీ వుండదు!

-సికిందర్
(ఈవారం –ఆగస్టు,2014)