రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, జులై 2015, బుధవారం

స్క్రీన్ సెన్స్


తెలుగు సినిమా స్క్రీన్ ప్లే
స్ట్రక్చర్- 5

          క ఐడియాని వర్కౌట్ చేసి, ఆ ఐడియాని సినాప్సిస్ గా రాసుకుని స్పష్టత తెచ్చుకున్న తర్వాత ప్రారంభించేదే పూర్తి స్థాయి కథనం – లేదా ప్లాటింగ్- లేదా ప్లానింగ్ –లేదా వన్ లైన్ ఆర్డర్. ఇక్కడ్నించే  అసలైన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. దీని ప్రకారమే ఆ తర్వాత ట్రీట్ మెంట్ లేదా స్క్రీన్ ప్లే తయారు చేయడం వుంటుంది. కనుక వెనుకటి అధ్యాయాల్లో మొదట ఐడియానీ, తర్వాత లాగ్ లైన్ నీ, ఆ తర్వాత సినాప్సిస్ నీ ఎలాగైతే  బిగినింగ్ – మిడిల్ - ఎండ్ అనే స్ట్రక్చర్ లో పెట్టుకుని రూపొందించుకోవాలని చెప్పుకోవడం జరిగిందో, ఆ చట్రంలో కథకి తగ్గ సీనిక్ ఆర్డర్ వేసుకోవడాన్నే వన్ లైన్ ఆర్డర్, లేదా దృశ్యమాలిక  అంటారు.
         
          వెండితెర  మీద సినిమా ప్రారంభమైనప్పుడు సీను తర్వాత సీనుగా ఒక క్రమపద్ధతిలో సీన్లు నడుస్తాయి. అలా  ఓ క్రమపద్దతిలో కూర్చిన ఈ సీన్లన్నీ కలిపి సినిమా నిడివిని బట్టి 60, 70, 80 ఎన్నైనా ఉండొచ్చు. ఇలా కథని సీన్లుగా విభజించి, ఒక్కో సీనుకి ఒకటి రెండు లైన్లలో విషయాన్ని ఒక దాని కింద ఒకటిగా రాసుకుంటూ పోతూ, నంబర్లు వేసుకోవడాన్నే వన్ లైన్ ఆర్డర్ అంటారు.

1. హీరో కారు దిగి ఇంట్లో కొస్తూ గులాబీ పువ్వు తెంపాడు.
2. విలన్ మార్కెట్లో కారాపి ఏరికోరి ఒక గులాబీ కొన్నాడు.
3. బస్సెక్కి పోతున్న హీరోయిన్ జడలో గులాబీ వుంది.
ఇలా...

          సీనుని బట్టి ఒక్కోసారి సబ్ సీన్లు కూడా ఉండొచ్చు. వాటిని ఏ,బి, సి, డి లుగా గుర్తులు ఇచ్చుకోవడం జరుగుతుంది.

1.  హీరో కారు దిగి ఇంట్లో కొస్తూ గులాబీ పువ్వు తెంపాడు.
1/ a.  ఇంట్లో వున్న హీరో తల్లి జడలో వున్న వాడిన గులాబీని తీసి చెత్త బుట్టలో వేసింది.


          సబ్ సీన్లు ఒకే లొకేషన్లో  అవుట్ డోర్ లో, ఇండోర్ లో నడుస్తున్నప్పుడు వస్తాయి. పై సీనులో హీరో కారు దిగడం అవుట్ డోర్ లొకేషన్, అలాగే హీరో తల్లి ఇంట్లో వుండడం ఇండోర్ లొకేషన్. అప్పుడు పై సీను వివరం ఇలా వుంటుంది..

1 / ఎక్స్.   హీరో కారు దిగి ఇంట్లో కొస్తూ గులాబీ పువ్వు తెంపాడు.
1/ a / ఇం.   ఇంట్లో వున్న హీరో తల్లి జడలో వున్న వాడిన గులాబీని తీసి చెత్త బుట్టలో వేసింది.

          ఇక్కడ ఎక్స్. అంటే ఎక్స్ టీరియర్, అంటే అవుట్ డోర్ అనీ;  ఇం. అంటే ఇంటీరియర్ అంటే ఇండోర్ అనీ అర్ధం.
          ఇక సీన్లు పగలు (డే), రాత్రి (నైట్),  సాయంకాల (ఈవ్) వేళల్లో ఎప్పుడైనా జరుగవచ్చు. అప్పుడు వన్ లైన్ ఆర్డర్ సమగ్ర రూపం కథనాన్ని బట్టి ఇలా వుండొచ్చు...

1 / ఎక్స్/ డే -   హీరో కారు దిగి ఇంట్లో కొస్తూ గులాబీ పువ్వు తెంపాడు.
1/ a / ఇం/ డే -   ఇంట్లో వున్న హీరో తల్లి జడలో వున్న వాడిన గులాబీని తీసి చెత్త బుట్టలో వేసింది.
2 / ఎక్స్ / డే -  విలన్ మార్కెట్లో కారాపి ఏరికోరి ఒక గులాబీ కొన్నాడు.
3 / ఎక్స్ / ఈవ్ -  బస్సెక్కి పోతున్న హీరోయిన్ జడలో గులాబీ వుంది.

          వచ్చిన చిక్కల్లా ఈ వన్ లై ఆర్డర్ ని ఎలా వేయాలనడం దగ్గరే. ఎలా ప్రారంభించాలి, ఎక్కడెక్కడ ఏ ఏ సీన్లు వేయాలి, వేసేటప్పుడు ఏ ఏ స్క్రిప్టింగ్ అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలి అన్న స్పృహ లేకుండా గుడ్డిగా తోచినట్టూ వేసుకుంటూ పోతే, అనుకున్న కథ రాక పోగా చాలా  గందరగోళం ఏర్పడుతుంది. అది కొట్టేసి మళ్ళీ ఇంకో ఆర్డర్, అది కూడా కొట్టేసి ఇంకో ఆర్డర్..ఇలా కాలం గడిచిపోతున్నా అంతులేని ప్రహసనంగా సాగుతూంటుందే తప్ప కొలిక్కి రాదు. ఆర్డర్ లో ఏ సీను ఎప్పుడేయాలనే దానికి ప్రాతిపదిక ఉండదు. ఒకరు కథ ప్రకారం ఎప్పుడో క్లయిమాక్స్ లో రావాల్సిన హీరో హీరోయిన్ల తల్లిదండ్రుల ప్రేమకథతో కూడిన ఫ్లాష్ బ్యాక్ ని తెచ్చి ఫస్టాఫ్ లోనే పదో సీనుగా వేశారు. దీనికి ప్రాతిపదిక ఏమిటి? ఏమీ లేదు. పైగా ఇదెంత నష్ట దాయకమంటే, శుభమా అంటూ సినిమా ప్రారంభిస్తూ అప్పుడే ముసలివాళ్ళ ఫ్లాష్ బ్యాక్ తో యూత్ అప్పీల్ ని దెబ్బ తీయడమే!
         
          ఒక ఎంతో కొంత అనుభవమున్న దర్శకుడు, కథకి ఎలా ఆర్డర్ వేయాలో అంతుపట్టక, చివరికి ఫలానా సినిమా చూసి ఆర్డర్ వేసుకు రమ్మని రచయితని పురమాయించారు. దాన్ని ముందు పెట్టుకుని లవ్ ఎప్పుడు మొదలెట్టారు, ఆ సీన్లు ఎలా వచ్చాయి, సెంటి మెంట్లు ఎలా పండాయి, కామెడీ ఎప్పుడెప్పు డేశారు, పాటలు ఎక్కడెక్కడ పెట్టుకున్నారు...ఇలా చూసుకుంటూ తాము కూడా ఆర్డర్ వేసుకుంటారన్న మాట! ఎందుకీ పాట్లు?
         
          చాలా చోట్ల ఇదే తంతు సాగుతూంటుంది. దర్శకులవుదాముకునే కో-డైరెక్టర్లు తక్కువ, అసోషియేట్ లే ఎక్కువ. అయితే ఈ అసోషియేట్ దర్శకుల్లో నూటికి తొంభై శాతం మందికి ఆర్డర్ వేయడం తెలీదంటే అతిశయోక్తి కాదు. పైగా ఆర్డర్ వేయబోయిన అనుభవమున్న రచయితలతో ఎందుకో తీవ్రంగా విభేదిస్తారు, తమ కథని పాడు చేస్తున్నారని ఎందుకో విపరీతమైన ఆందోళనకి గురవుతారు. ఎందుకీ పాట్లన్నీ?
         
          ఇవ్వాళ్ళ రకరకాల పత్రికల్లో, వెబ్ సైట్లలో ఎందరెందరో సినిమా రివ్యూలు రాస్తున్నారు. పదేళ్ళ క్రితం ఒకసారి దర్శకుడు దశరథ్ వీళ్ళు ఏ పర్ సెప్షన్ తో రివ్యూలు రాస్తున్నారని ఈ వ్యాసకర్తని ప్రశ్నించారు. ఇందులో చాలా వరకూ నిజమున్నా, ఇంకో రకం సినిమా వాళ్ళున్నారు : వీళ్ళు సినిమా బాగాలేదంటూ రివ్యూలు రాయడం కాదు, దమ్ముంటే కథ రాసి చూపెట్టాలి, సినిమా తీసి ప్రూవ్ చేసుకోవాలి- అంటూ రివ్యూ రైటర్లకి సవాళ్లు విసరడం ఇప్పటికీ మానుకోవడం లేదు. లోగుట్టు ఏంటంటే ఇలా సవాళ్ళు విసిరే తమలో చాలా మందికి  వన్ లైన్ ఆర్డర్ వేయడమే  రాదు! ఇక సినిమాలెలా తీస్తారో పెరుమాళ్ళు కెరుక! ఖచ్చితంగా ప్రతీ యేటా తొంభై  శాతం ఫ్లాపులే తీస్తారు.
         
          ఏ సినిమా కథకైనా సిడ్ ఫీల్డ్ రెండురోజుల్లో ఆర్డర్ వేస్తారు. అదెలా? పద్దతీ శాస్త్రం తెలుసు కాబట్టి.  ఇతరులు చెప్పే కఠినమైన శాస్త్రాల్ని సులభతరం చేసి సామాన్యులకి అర్ధమయ్యేట్టూ పాపులర్ చేసింది తనే కాబట్టి. దీన్ని మనం పాటిస్తే తప్పేమిటన్న ప్రశ్నకి ఇప్పటికీ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు టాలీవుడ్ లో తక్కువే. అదేదో విదేశీ సంస్కృతి అనుకుంటారు. సినిమా అనే కళే హాలీవుడ్ నుంచి  దిగుమతి అయినప్పుడు, ఎన్నో హాలీవుడ్ సినిమాలు స్ఫూర్తికీ, చక్కగా కాపీ చేసుకోవడానికీ అలవాలమై న్నప్పుడు- అవలా తయారవడానికి మూలమైన స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని పరాయిది అనుకోవడమేమిటి?
         
          ఓ ఐదారు ఫ్లాపులు తీసిన ఒక సీనియర్ దర్శకుడు ఎట్టకేలకు శాస్త్రం విలువని గుర్తించి,  “డిస్కషన్స్ లో మీరు  స్ట్రక్చర్ కీ, క్యారక్టర్ కీ (ఇది పాసివ్ పాత్ర గా మారిపోకుండా ) కాపలా వుండండి” అని అన్నారంటే ఎందుకు?
         
          కాబట్టి అన్ని పాట్లూ పొరబాట్లూ ఫ్లాపులూ స్ట్రక్చర్  స్పృహతో వన్ లైన్ ఆర్డర్ వేసుకోక పోవడం వల్లే!
           
          మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం : స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరు. స్ట్రక్చర్ ని క్రియేటివిటీ తో కన్ఫ్యూజ్ చేయకూడదు. కథకి స్ట్రక్చర్ సార్వజనీనమైనది, ప్రపంచంలో ఎక్కడైనా ఒకలాగే  వుంటుంది. క్రియేటివిటీ స్థానిక మైనది, వ్యక్తిగత మైనది. స్ట్రక్చర్ శిలాశాసనం, ఈ భూగోళం ఉన్నంత వరకూ అది మారనే మారదు.  క్రియేటివిటీ కాలాల్ని బట్టి ఎప్పటికప్పుడు మారుపోతూంటుంది. స్ట్రక్చర్ లేకుండా కథని తయారు చేయలేరు, అది పునాదుల్లేకుండా ఇల్లు కట్టుకోవడం లాంటిది.  క్రియేటివిటీ ఆ పునాదులమీద కావాల్సిన డిజైన్లో ఇంటికి అందం చేకూర్చేది. బిగినింగ్- మిడిల్- ఎండ్  అనే మూడు విభాగాల  స్ట్రక్చర్ మారదుగాక మారదు. ఆ విభాగాల్లో వేటికవిగా బిజినెస్  స్వరూపాలు కూడా మారవు.

          బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయం, కథానేపధ్యం ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, చివర్లో సమస్య ఏర్పాటూ మాత్రమే  వుండాలి, మరొకటి ఉండరాదు.
         
          మిడిల్ లో ఆ సమస్యతో యాక్షన్ – రియాక్షన్ ల  పోరాటం,  ఆ సమస్యకి పరిష్కార మార్గం కనుగొనడం మాత్రమే వుండాలి, ఇక్కడ కూడా మరొకటి చొరబడ కూడదు.
         
          ఎండ్ విభాగం లో ఆ పరిష్కార మార్గంతో  ప్రత్యర్థిని శాశ్వతంగా ఓడించి విజయబాట పట్టడం ఉండాల్సిందే! అంటే, ఈ మొత్తం స్ట్రక్చర్ లో ఇక్కడ స్వేచ్చ లేదు, సొంత కవిత్వానికి ఆస్కారం లేదు. .
         
          ఈ విభాగాల లోపల వేసుకునే సీన్లతో స్వేచ్చ వుంది, సొంత కవిత్వం కూడా వుంటుంది. స్ట్రక్చర్ ప్రకారం, ఆ స్ట్రక్చర్ లో విభాగాల బిజినెస్సుల ప్రకారం వేసుకునే సీన్లని ఎలా ఎంత కళాత్మకం గా తీర్చిదిద్దుకోవచ్చో ఆ క్రియేటివ్ ప్రదర్శనంతా చేసుకోవచ్చు.  క్రియేటివిటీకి కొలమానాల్లేవు. ఒక సీనుని ఒక దర్శకుడు ఒకలా తీస్తే, ఇంకో దర్శకుడు ఇంకోలా తీస్తాడు.  క్రియేటివిటీ వ్యక్తిగతమనదే గాక, స్థాని కమైనది కూడా. స్థానికమైనది ఎలాగంటే- టాలీవుడ్ లో ఇక్కడి సీను ఇక్కడి నేటివిటీతో తీస్తే, అదే సీన్ని బాలీవుడ్ లో అక్కడి నేటివిటీలో వేరేగా తీస్తారు. కాబట్టి మారేది స్ట్రక్చర్ లోపల  సీన్ల రూపకల్పనే తప్ప, ఆ మొత్తం స్ట్రక్చర్ కాదు. స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరు. స్ట్రక్చర్ ని క్రియేటివిటీ తో కన్ఫ్యూజ్ చేయకూడదు.
         
          అలాగే స్క్రీన్ ప్లే వేరు, దర్శకత్వం వేరు. దర్శకుడు తన క్రియేటివ్ పవర్స్ తో షాట్లు తీసే విధానంగానీ, టేకింగ్ గానీ స్క్రీన్ ప్లే అన్పించుకోవు. అది దర్శకత్వం అన్పించుకుంటుంది. స్క్రీన్ ప్లే అంటే కథకి స్ట్రక్చర్, వన్ లైన్ ఆర్డర్, పాత్ర చిత్రణలు, టెంపో, సస్పెన్స్, థ్రిల్స్ వగైరా స్టోరీ టెల్లింగ్ టూల్స్ మొదలైన వాటన్నిటినీ సమకూర్చి పెట్టే   స్క్రిప్టు పరమైన కసరత్తే.  ఇవన్నీ సీన్ల క్రమంగా తెరమీద కన్పిస్తాయి- ఆ సీన్లని చిత్రీకరించిన విధానం స్క్రీన్ ప్లే అనుకోరాదు.
         
          ఈ స్పష్టత వున్నప్పుడు పనులు సులభంగా, వేగంగా జరుగుతాయి. ఎలాగంటే, వన్ లైన్ ఆర్డర్ వేస్తున్నప్పుడు అది దర్శకత్వంలో భాగం  కాదు, స్క్రీన్ ప్లే రచనలో ఒక వంతు కసరత్తు మాత్రమే . కాబట్టి ఆ వన్ లై ఆర్డర్ లో ఒక్కో సీను అనుకుంటున్నప్పుడు అప్పుడే విజువలైజ్ చేసుకోనవసరం లేదు. ఆర్డర్ ప్రకారం లో ఒక సీను అనుకుంటున్నప్పుడు, అది విజువల్ గా బావుంటుందా లేదా ఆలోచిస్తూ కూర్చుంటే ఎటూ తెమలదు. ఈ విజువలైజేషన్ సంగతి  లైన్ ఆర్డర్ వేసుకున్నతర్వాత చేపట్టే ట్రీట్ మెంట్ అప్పుడూ, ఫైనల్ గా డైలాగ్ వెర్షన్ అప్పుడూ చూసుకోవాల్సిన పని.
           
          లైనార్డర్ కేవలం మౌలికంగా కథని మాత్రమే  ఏర్పాటు చేస్తుంది. సీన్ల మధ్య సంబంధాన్ని కలుపుతుంది. సీన్ల మధ్య సంబంధమంటే- ఆ సీన్లలో వుండే పాత్రలు, పాత్రచిత్రణ, వాటి చర్యలు, భావోద్వేగాలు, సస్పెన్స్, థ్రిల్, టెంపో మొదలైన వాటి కంటిన్యూటీ-  వీటన్నిటినీ కలుపుకుని వుండే  సంబంధం. కాబట్టి ముందు వన్ లైన్ ఆర్డర్ గా కథ ఎలా వస్తోందో మాత్రమే చూసుకుంటూ పోవాలే తప్ప, అప్పుడే తెరమీద ఎలా కన్పిస్తుందబ్బా అని పోస్ట్ మార్టం చేపట్టకూడదు. ముందు అర్ధవంతమైన కథా నిర్మాణం మీదే దృష్టి పెట్టాలి. దీని వల్ల వన్ లైనార్డర్ అనే పని చాలా సులభమవడమే గాక, వేగవంతంగా పూర్తవుతుంది.
         
          సిడ్ ఫీల్డ్ రెండ్రోజుల్లో ఆర్డర్ వేసేయగలరంటే, విజువలైజ్ చేసుకుంటూ కూర్చుంటూ కాదు. ఇంకా కథే పూర్తి కాలేదు అప్పుడే విజువలైజేషన్ ఏమిటి? ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. టిఫిన్ చేస్తూ కాఫీ కూడా తాగేస్తారా? కనుక ముందు సినాప్సిస్ లో క్లుప్తంగా వున్న కథని పెద్ద కథగా విస్తరించాలన్న ఏకైక దృక్పథంతో మాత్రమే సిడ్ ఫీల్డ్  కా స్పీడు వచ్చేస్తుందన్న మాట!!
         
          కాబట్టి వన్ లైన్ ఆర్డర్ వేయడానికి మొట్ట మొదటి ప్రాతిపదిక క్లుప్తం అనుకున్న కథ, లేదా రాసుకున్న సినాప్సిస్.  మరి లైనార్డర్ వేసేటప్పుడు ఆ సినాప్సిస్ ని ఎలా ఫాలో అవ్వాలి? సినాప్సిస్ లో 12 అంశాలు ప్రతిబింబించాలని గత అధ్యాయంలో చెప్పుకున్నాం. 1.ప్రధాన పాత్ర పరిచయంతో బాటు దాని రోజువారీ జీవితం, 2. ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్య, [ బిగినింగ్ సమాప్తం, మిడిల్ ప్రారంభం] 3. సమస్యతో సంఘర్షణ, 4. ఒక పరిష్కారం కోసం వెతుకులాట, 5. మినీ పరిష్కర మార్గం తో కొత్త ప్రయత్నం 6. ఓటమి, 7. ఆ ఓటమిలోంచి కొత్త మార్గం, 8. ఇక వెనక్కి రాలేని సంక్లిష్ట పరిస్థితి, 9. నిరాశా నిస్పృహలు, 10. మళ్ళీ కొత్త పరిష్కార మార్గం, [ మిడిల్ సమాప్తం, ఎండ్ ప్రారంభం] 11. దాంతో ముగింపు దిశగా అంతిమ పోరాటం, 12.ముగింపూ అన్నవి. సమస్య [బిగినింగ్]- సంఘర్షణ [మిడిల్] పరిష్కారం [ఎండ్] .. ఇదీ సినాప్సిస్ స్ట్రక్చర్!

          వీటితోబాటు కొన్ని ఎలిమెంట్స్ తెలుసుకోవాలి : ఓపెనింగ్ సీన్, హీరో ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ, విలన్ ఎంట్రీ, సహాయ పాత్రల ప్రపంచం, అందరి సుఖమయ లోకం, ఈ లోకాన్ని అప్సెట్ చేసి ఆందోళన సృష్టించే సంఘటన, తిరిగి ఆ లోకం లో శాంతిని స్థాపించే లక్ష్యంతో హీరో ప్రయాణం, ఈ ప్రయాణం లో విలన్ తో యాక్షన్ రియాక్షన్ ల ప్లే, హీరోకి ఎదురయ్యే విషమ పరీక్షలు, మరో వైపు హీరో లవ్ ఇంటరెస్ట్ సంగతి, పాటల  ప్లేస్ మెంట్, అవసరమైన యాక్షన్ దృశ్యాల కల్పన, అవసరమైన  కామెడీ దృశ్యాల సృష్టి, ఇంటర్వెల్ బ్యాంగ్ ( దాదాపు దశాబ్దంన్నర కాలంగా అమల్లో ఉంటున్న అవే ఓపెనింగ్ బ్యాంగ్ లు, ఇంటర్వెల్ బ్యాంగులు ఇప్పుడు ప్రేక్షకులని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాయి. వీటిని వీలయినంత త్వరగా మార్చాల్సిన అవసరముంది :  క్రియేటివిటీ అంటే ఇంతే..ఒక ధోరణికి కాలం చెల్లిపోయిందని సకాలంలో గుర్తించి వెంటనే మరో ధోరణిని ప్రవేశపెట్టడమే చలనశీలమైన క్రియేటివిటీ లక్షణం)  క్లయిమాక్స్, ముగింపూ మొదలైన ఓవరాల్  ఎలిమెంట్స్ తెలుకుని వుండాలి.
          
          ఇక సినాప్సిస్ లోని విషయం మొత్తాన్నీ ఒకేసారి ఎత్తుకుని ప్రారంభించాలా? అవసరంలేదు. సినిమా మొత్తాన్నీ ఒకసారి ప్రేక్షకులకి చూపెట్టడం లేదు. మధ్యలో విరామం ఇచ్చి చూపిస్తారు. చూసే వాళ్ళకే భారమన్పించకుండా ఒక విరామం ఇస్తున్నప్పుడు, రాసే వాళ్లకి రెండు అవసరం. అవి బిగినింగ్ ముగిశాక ఒకటి, మిడిల్ ముగిశాక మరొకటి. అంటే సినాప్సిస్ లో ఒక విభాగం ఆర్డర్ పూర్తయ్యాక తర్వాతి విభాగాని కెళ్ళడం ఉత్తమమ మన్నమాట.
          
          ఒక విభాగం తర్వాత మరొక విభాగం వారీగా పని చేసుకుంటూ పోవడం విజ్ఞత అన్పించుకుంటుంది. అప్పుడు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ పట్టు లభిస్తుంది. మొదట కథని ఎన్ని సీన్లలో చెప్పాలుకుంటున్నామో  నిర్ణయించుకోవాలి. 80సీన్లలో అనుకుంటే ఆ సీన్లని విభాగాల వారిగా వాటి నిష్పత్తి ప్రకారం ఇలా విభజించుకోవాలి:  బిగినింగ్ 20 సీన్లు,  మిడిల్ 40 సీన్లు, ఎండ్ 20 సీన్లు..


          ఇప్పుడు బిగినింగ్  విభాగాన్ని తీసుకుని ఆ 20 సీన్ల కథనే  వర్కౌట్ చేయడం మొదలెట్టాలి. అంతకి మించి దృష్టి సారించకూడదు. ఈ విభాగం ఆర్డర్ వేయడం  పూర్తయ్యాకే, మిడిల్ విభాగం ఆర్డర్ 40 సీన్ల కెళ్ళాలి.  మిడిల్ విభాగం  ఆర్డర్ పూర్తయ్యాకే, ఎండ్ విభాగం 20 సీన్ల సంగతి చూడాలి.  ఇలా కంపార్ట మెంట లైజ్ చేసుకుని  ఆర్డర్ వేసుకోవడం వల్ల  కన్ఫ్యూజన్ వుండదు. దృష్టంతా ఆ విభాగం కథ మీదే, బిజినెస్ మీదే వుంటుంది.
          
           ఇప్పుడు గత చాప్టర్ లో ప్రస్తావించుకున్న ‘శివ’ సినిమా సినాప్సిస్ లోని బిగినింగ్ విభాగాన్నే ముందుగా తీసుకుందాం : 
         
కాలేజీ ఎదుట అనుచరులతో ఎదురుచూస్తున్న గణేష్, జేడీ  సైగతో విద్యార్థిని హత మారుస్తాడు.
          
         జేడీ ఒక విద్యార్థి నాయకుడు. కాలేజీ లో ఎదురు లేని వాడు. ఆ కాలేజీ స్టూడెంట్ యూనియన్ కి ఏకపక్ష ప్రెసిడెంట్. గణేష్ ద్వారా జేడీ కి ఆ ప్రాంతం మీద గుత్తాధిపత్యం చెలాయిస్తున్న భవానీ అనే పెద్ద గూండాతో పరిచయం ఉంటుంది. ఇలా విద్యార్థులతో ఏర్పడిన  ఈ సంబంధంతోనే, మాచిరాజు అనే రాజకీయనాయకుడి నేర కార్యకలాపాలకి విద్యార్థులని ఉపయోగించుకుంటూ, మాచిరాజుకి వెన్నుదన్నుగా ఉంటాడు భవానీ.
          
           ఈ కాలేజీలోనే స్టూడెంట్ గా చేరతాడు శివ. అక్కడ మల్లి అనే విద్యార్ధి తో, ఆశా అనే ఇంకో విద్యార్థినితో స్నేహం పెంచుకుంటాడు.  అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, లెక్చరర్లని అవమానపరచడం వంటి పన్లతో అల్లరి చేస్తున్న జేడీకి శివ తారసపడతాడు. మొదటిసారి స్నేహితులు చెప్పారని జేడీ ని క్షమించినా, మళ్ళీ ఈసారి ఆశా తో మిస్ బిహేవ్ చేయడంతో, రెచ్చిపోయిన శివ సైకిలు చైను లాగి, జేడీ నీ అతడి గ్యాంగునీ చితగ్గొట్టేస్తాడు. అన్నాళ్ళూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జేడీ, ఈ శివ తెగింపు చూసి నిశ్చేష్టుడౌతాడు.
          
          ఈ బిగినింగ్ ని పరీశిలిస్తే, ఇందులో బిగినింగ్ తాలూకు బిజినెస్ అంతా వుంది : 1. ప్రథాన పాత్రని, ఇతర ముఖ్య పాత్రల్ని పరిచయం చేసి, కథా నేపధ్యాన్ని సృష్టించడం 2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే  శక్తుల్ని చూపడం, 3. సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన 4. సమస్య ఏర్పాటు.
          
          ఈ బిజినెస్ ని ఎలా విస్తరించారో చూద్దాం :

          1. ప్రధాన పాత్ర శివతో పాటు, హీరోయిన్ ఆశానీ, ఇతర ఫ్రెండ్స్ పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ తో పాటు అతడి తాలూకు జేడీ,గణేష్, మాచిరాజు పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ పడగ నీడలో కాలేజీ వాతావరణం వున్నట్టు కథా నేపధ్యాన్ని సృష్టించడం...
 
          2. ప్రధాన పాత్ర శివకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే శక్తులుగా  జేడీ, గణేష్ లని చూపడం

         3.  జేడీ చేష్టలతో శివకి సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన

         4.  సైకిల్ చైన్ లాగి జేడీ మీద తిరగబడ్డంతో శివకి భవానీతో సమస్య ఏర్పాటు అవడం.
          
          ఇప్పుడు సీన్ల వారీగా ఎలా ఆర్డర్ వేశారో చూద్దాం...



(ఇంకా వుంది) 


సికిందర్  


20, జులై 2015, సోమవారం

సాంకేతికం- కెమెరా


ఛోటా కె. నాయుడు 
సాంకేతిక ఔన్నత్యం ఆత్మిక దాహాన్ని కూడా తీర్చగలిగే సాధనమైనప్పుడు, ఒక ‘అవతార్’ లా, ఇంకో ‘రోబో’ లా కాసుల కుంభవృష్టి కూడా కురుస్తుంది. పౌరాణిక ఛాయలున్న సమకాలీన పాత్రలే ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చగల్గుతాయని ఎప్పుడో రుజువైంది. ఇలా ఆత్మిక దాహాన్ని తీర్చిన నాటి ‘మేజర్ చంద్రకాంత్’,  ‘కొండవీటి సింహం’ లాంటివి ఇప్పుడు తీస్తే, ఇంకింత భారీస్థాయిలో అత్యాధునిక సాంకేతిక హంగులన్నీ కలుపుకుని అదరగొట్టేట్టు వుండాలని నవతరపు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

          దీన్ని కరెక్టుగా గుర్తించారు సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు. ఏ వెండితెర మీద దృశ్యం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందో, అదింకా కాస్సేపుంటే బావుండన్పిస్తుందో, ఆ దృశ్యంలోని ప్రతీ అంశం తేటగా కళకళ లాడుతూ వుంటుందో, ఆ దృశ్యకారుడి పేరే  ఛోటా కె. నాయుడు. ఆయన చేతిలో కెమెరా ఓ మంత్ర దండం లాంటిది. ఈ రంగుల మంత్రదండపు మాయాజల్లులో తడిసి తరించని సూపర్ స్టార్ లేరు.  ఆ స్టార్స్ కి దాసోహం కాని ప్రేక్షకులూ లేరు...  ‘అడ్వాన్స్ అయిపోయారు ప్రేక్షకులు!’ అని కామెంట్ చేశారాయన. ‘ ప్రేక్షకుల కోసం ఇప్పుడింకెలా తీస్తే సక్సెస్ అవుతామో సరిగ్గా ఊహించి, రిస్కు చేసి, ఒక ‘అవతార్’ నీ, ఇంకో ‘రోబో’నీ తీశారు ప్రసిద్ధ దర్శకులు జేమ్స్ కామెరూన్, ఎన్. శంకర్ లు. డిస్కవరీ ఛానెళ్ళల్లో, ఇతర మీడియాల్లో ఎన్నోఆశ్చర్య గొలిపే ప్రోగ్రాముల్ని చూస్తున్న ప్రేక్షకులు,  సినిమాల్లోనూ ఆ స్థాయి దృశ్య వైభవాల్నే  కోరుకుంటున్నారు..’ అన్నారాయన.


     సినిమా అనేది ఎంత హైటెక్ హంగుల్ని కలుపుకున్నప్పటికీ ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయకూదదన్నారు. లేటెస్ట్ ‘బృందావనం’  సక్సెస్ ని మనసారా ఎంజాయ్ చేస్తున్న ఛోటా, ఆ సినిమాలో బ్రహ్మానందం దగ్గర్నుంచీ తారాగణమంతా తమని ఎంతో అందంగా ఛోటా గారు చూపించారని కురిపిస్తున్న ప్రశంసలకి స్పందిస్తూ- ‘అందంగా చూపించక పోతే ఇక నేనెందుకు? కెమెరామాన్ గా అది నా డ్యూటీ. అలా అందంగా చూపించడంతో బాటు, దర్శకులు ఏం కోరుకుంటున్నారో ఆ సన్నివేశ ఫీల్ ని రాబడుతూ పిక్చరైజ్ చేస్తాను’ అన్నారు.


             ఫీల్డులో అత్యధిక పారితోషికం పొందుతున్న ఛాయాగ్రాహకుడెవరైనా వుంటే అది తనే. ఐతే కెమెరామాన్ వేగంగా పనిచేయలేకపోతే నిమిష నిమిషానికీ నిర్మాత డబ్బు కోల్పోవాల్సి వస్తుందన్నారు. 


           ఇప్పుడు సినిమాలు ముడి ఫిలిం నుంచి డిజిటల్ కి మారుతున్న సంధి కాలంలో వున్నాయి. దీన్ని తాను తప్పక ఆహ్వానిస్తానన్నారు. కొంత సమయం తీసుకుని  చిన్న బడ్జెట్ లో డిజిటల్ సినిమా తీస్తానన్నారు. శబ్దాని కెప్పుడో డీటీఎస్ తో డిజిటలీకరణ జరిగిపోయింది, కెమెరాకీ డిజిటల్ తో అలాటి అవసరం లాగా, డిజిటల్ ఇంటర్మీడియేట్ ( డీఐ) ప్రక్రియ వచ్చిందన్నారు. ఈ డీఐ తో కూడా వెండి తెర మీద తనదైన ముద్ర ఏమాత్రం దెబ్బతినకుండా, దగ్గరుండి కలర్, లైటింగ్ కరెక్షన్స్ చేయించు కుంటానన్నారు. ఇక డెప్త్ విషయానికొస్తే, దాన్ని కాపాడే కలరిస్టులు మనకున్నారన్నారు. పోతే, మామూలు దృశ్యాల్ని కెమెరాతో చూస్తామనీ, గ్రాఫిక్స్ కయితే మనోనేత్రంతో చూడాల్సి వస్తుందనీ, గ్రాఫిక్స్ మెదడుకి మేత లాంటిదనీ  చమత్కరించారు.


         మరి కెమెరామానే దర్శకుడైతే అన్న ప్రశ్నకి, అప్పుడు తొంభై శాతం ఫెయిల్యూరే అన్నారు. అదెలా? ‘స్వార్ధం! సహజంగా కెమెరా మాన్ కుండే స్వార్ధం కొద్దీ సరౌండింగ్స్ అందంగా రావాలని దాని మీదే దృష్టి పెడతాడు. దర్శకుడైతే మొదటి నుంచీ స్క్రిప్టు మీద అవగాహనతో ఉంటాడు. సినిమా మూడ్, ఫీల్, ఫ్లో ల మీద అతడికి మంచి పట్టు వుంటుంది. కానీ నిత్యం పిక్చరైజేషన్ తోనే తలమునకలయ్యే కెమెరామాన్ ఆ మూడ్, ఫీల్, ఫ్లోలని కూడా పరిగణనలోకి తీసుకోవడంలో కొంత వెనుక బడతాడు. దీనివల్ల తను దర్శకుడిగా రాణించే లేక పోవచ్చు ‘ – అని వివరించారు.



             శ్యాం కె. నాయుడు తో బాటు, మరో ఐదారుగురు తన శిష్యుల్ని కెమెరామాన్లుగా తయారుచేసిన ఛోటా, 1991 లో ‘అమ్మ రాజీనామా’ తో డాక్టర్ దాసరి నారాయణ రావు స్కూల్ ల్ నుంచి సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. ముందు విడుదలైన సినిమా ఇదే అయినా, పని చేయడం మొదలెట్టింది అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలోని ‘రగులుతున్న భారతం’ కి. ఇప్పటికి ఆయన చేసిన సినిమాల సంఖ్య 56 కి చేరింది. ప్రస్తుతం కె. విజయభాస్కర్ దర్శకత్వంలో ‘ప్రేమ కావాలి’ కి పని చేస్తున్నారు. ‘భారీ సినిమాల మెగా బడ్జెట్లతో, టెక్నాలజీలతో పని చేసిన అనుభవమున్న మీరు, ఒక సాధారణ  ప్రేమ సినిమాకి ఎలా న్యాయం చేయగలరు? ఇది కూడా అంతేసి బడ్జెట్ భారంతో పాటు టెక్నాలజీ హంగామా కూడా మోయాల్సిందేనా?’ అన్న మరో ప్రశ్నకి, అదేం కాదన్నారు. దీని బడ్జెట్ నీ, పనిదినాలనీ దృష్టిలో పెట్టుకుని, క్వాలిటీతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రీ కరిస్తున్నానన్నారు. రామానాయుడు స్టూడియోలో ‘ప్రేమ కావాలి’ లోని ఓ పాటని చిత్రీకరిస్తూ గ్యాప్ లో ఈ కబుర్లన్నీ చెప్పిన ఛోటా, ఈ సినిమాకి రెగ్యులర్ 435 కెమెరానే వాడుతున్నానన్నారు. అయితే మాస్టర్ ప్రైమ్ లెన్స్ తో షూట్ చేస్తున్నానన్నారు. ఈ లెన్స్ ప్రత్యేకత  మండుటెండల్లో షూట్ చేసినా కూడా దృశ్యాన్ని చెక్కుచెదర నివ్వదన్నారు ఛోటా కె. నాయుడు.



సికిందర్ 

నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’

19, జులై 2015, ఆదివారం

సర్ప్రైజ్ సల్మాన్!


దర్శకత్వం :  కబీర్ ఖాన్
తారాగణం : సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్దిఖీ,  శరత్ సక్సేనా, ఓంపురి తదితరులు
సంగీతం : ప్రీతమ్ , ఛాయాగ్రహణం : ఆసీమ్ మిశ్రా,   కథ : వి. విజయేంద్రప్రసాద్, 

స్క్రీన్ ప్లే : కబీర్ ఖాన్, వి. విజయేంద్రప్రసాద్,  పర్వేజ్ షేక్,  అసద్ హుస్సేన్, మాటలు : కబీర్ ఖాన్ - కౌసర్ మునీర్
బ్యానర్ :  సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్- కబీర్ ఖాన్ ఫిలిమ్స్, నిర్మాతలు : సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్
విడుదల :  17  జులై, 2015
*
ల్మాన్ అభిమానులకు సర్ప్రైజ్ ఆఫర్! తమ అభిమాన సూపర్ స్టార్ నుంచి మరో రెగ్యులర్ మాస్ మసాలా కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఎదురుచూడని షాక్. వస్తాడు, సల్లూ భాయ్ వస్తాడు, ఈ సారికూడా షర్టు విప్పి సిక్స్ ప్యాక్ ప్రదర్శిస్తాడు, పంచ్ డైలాగులు కొట్టి విరగదీసే ఫైట్లు చేస్తాడు, గాల్లోకెగిరి విలన్స్ ని తంతాడు, హీరోయిన్ తో చిలిపి చేష్టలకి పాల్పడి, కిర్రెక్కించే పాటలు పాడతాడు, ఐటెం సాంగ్ తో గోల సృష్టిస్తాడు, కడుపుబ్బా కామెడీతో నవ్వించి, బంపర్ గా ఎంటర్ టైన్ చేస్తాడు... తన స్టయిల్- టెంపర్-స్టామినా- యాటిట్యూడ్ లతో మరోసారి నంబర్ వన్ అన్పించుకుంటాడు- అనుకుంటూ కాలరెగరేస్తూ వేంచేసే జీవితకాల ఫ్యాన్ గిరీకి కమిట్ అయిన వాళ్ళకి, ఊహించని కౌంటర్ పంచ్  ఈ ‘భజరంగీ భాయిజాన్’ !
టైటిల్ లోనే కావలసినంత మాస్ అప్పీల్ వుంది. దీంతో సినిమా ఎంత మాస్ మసాలాగా వుంటుందో ఊహించుకుంటూ వచ్చిన వాళ్లకి సాంతం ఒక సాఫ్ట్ సెంటిమెంటల్ డ్రామాతో ఉక్కిరిబిక్కిరి చేయడమేకాదు, మారు మాటాడకుండా పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యేట్టూ చేసి, హృదయాల్ని కదిలించే విశేషాలతో ఒప్పించడం సల్మాన్ కే చెల్లింది!
          సల్మాన్ కన్పించకుండా పాత్రేకన్పించడం, అదికూడా  సెన్సిబుల్ గా, సెన్సిటివ్ గా ఇండియా-పాకిస్తాన్ ప్రజల మనోభావాలతో, భావోద్వేగాలతో దాగుడుమూతలాడే అమాయక చక్రవర్తి గా, అతిజాగ్రత్తగా బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసి అమీర్ ఖాన్ ని మరిపించాడు. ‘పీకే’ లో అమీర్ ఖాన్ పాత్ర అన్నిమతాల మీదా సెటైర్ అయితే, సల్మాన్ ది ఇరుదేశాల మీద సున్నిత వ్యంగ్యాస్త్రం.
          స్టార్ సినిమా అనగానే సకల నకరాల అవకరాలతోనే  అలరించాలన్న నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ, అవేమీ లేకుండా సింపుల్ గా హృదయాల్ని జయించే సమ్మోహనాస్త్రాలతో చివరంటా ప్రేక్షకుల చేత కేరింతలు కొట్టించవచ్చని ఈ పాత్రకి ఒప్పుకుని రుజువు చేశాడు.
          దర్శకుడు కబీర్ ఖాన్ (హైదరాబాద్ వాస్తవ్యుడు)  ఈ సినిమాతో చాలా ధైర్యమే చేశాడు. పాక్ సైనికుల్ని, పోలీసుల్నీ ఇట్టే రాజీపడిపోయే  ధోరణిలో చూపించి ఇండియన్ బాక్సాఫీసుకి   బాగానే బలం పెpచుకున్నాడు.  అయినా దీన్ని పాకిస్తాన్ లో ప్రదర్శించేందుకు అక్కడి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నలివ్వడం ఆశ్చర్య పర్చేదే. ( కబీర్ ‘ఏక్  థా టైగర్’ పాకిస్తాన్ లో విడుదల కాలేదు- ఐ ఎస్ ఐ ని చెడుగా చూపించారని) ఐతే ఇదే రోజు అక్కడ విడుదలవ్వాల్సిన ఈ సినిమా ఒక ఖవ్వాలీ కాపీ రైట్ కి సంబంధించిన కారణాలతో ఆగింది.
          సాధారణంగా రెండు దేశాల మధ్య సినిమా అనగానే  అక్కడి అమ్మాయి- ఇక్కడి అబ్బాయి, లేదా దీన్ని రివర్స్ చేసి చూపించే  ప్రేమ సినిమాలుగానే వుంటాయి. ( ‘పీకే’ లో కూడా ఇదే జరిగింది) దీనికి భిన్నంగా ఇక్కడ తప్పిపోయిన అక్కడి ఒక చిన్నమ్మాయి కథని తీసుకుని – దాని చుట్టే భావోద్వేగాల్ని కేంద్రీకృతం చేసి, ఇంత భారీస్థాయి  స్టార్ సినిమా తీయాలంటే కూడా ధైర్యమే  కావాలి.
          ఆ ధైర్యం ఎలా చేశారో చూద్దాం..

భోళా భజరంగీ!

  
      పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆరంభం. కాశ్మీర్ లోయ అందాలన్నీ కళ్ళు చెదిరేట్టు చూపిస్తూ, జిల్లా సుల్తాన్ పూర్ అనే వూళ్ళో ఒకింట్లోకి ప్రవేశించాక, అక్కడ టీవీలో క్రికెట్ చూస్తున్న గుంపుఒకటి. షాహిద్ అఫ్రిదీ కొడుతున్న సిక్సర్ లకి ఎక్సైట్ అవుతున్న ఆ గుంపులో ఒక గర్భవతి,  తనకి మగ పిల్లాడు పుడితే షాహిద్ అని పేరు పెట్టుకుంటా నంటుంది.
        ఆడపిల్ల పుడుతుంది. ఆమె షాహేదా ( హర్షాలీ మల్హోత్రా) అవుతుంది. కానీ మూగది. ఆరేళ్ళప్పుడు ఈ మూగ పిల్లని వెంట బెట్టుకుని ఢిల్లీ – లాహోర్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఎక్కి వాఘా సరిహద్దు దాటి ఇండియా కొస్తుంది. అక్కడ ఒక దర్గాలో మొక్కుకుని తిరిగి వెళ్తున్నప్పుడు షాహెదా కన్పించకుండా పోతుంది.
          కాశ్మీర్ లోయలో పుట్టి పెరిగిన షాహెదాకి ప్రకృతి అందాలన్నా, వాటిలో తిరుగాడే జీవాలన్నా పిచ్చి. ప్రకృతిలో ఆడుకుంటూ తప్పిపోవడమూ అలవాటే. ఇప్పుడు కూడా రైలు దిగి మేక పిల్లతో ఆడుకుంటూంటే రైలెళ్లి పోతుంది.
          ఆమె తల్లి కనిపెట్టి రైలాపి వచ్చేసరికి బోర్డర్ గేట్లకి తాళాలు పడిపోతాయి. ఇక తీయరు. కట్ చేస్తే మూగమ్మాయి ఎక్కడో హర్యానా లోని కురుక్షేత్రలో తేలుతుంది. అక్కడ హనుమాన్ ఉత్సవంలో సెల్ఫీ లేలేరే ...అంటూ ఆటా పాటా తో తెగ ఎంజాయ్ చేస్తూంటాడు పవన్ కుమార్ చతుర్వేది అలియాస్ భజరంగీ ( సల్మాన్ ఖాన్). ఇతను కరుడుగట్టిన వీర హనుమాన్ భక్తుడు. ఎక్కడ హనుమాన్ విగ్రహం కనిపిస్తేనే కాదు, కోతులు కన్పించినా నిష్కళంకమైన భక్తితో దండాలు పెట్టేస్తాడు. (‘హమ్  భజరంగ్ బలీ కే భక్త్  హై, మర్జాయేంగే లేకిన్ ఝూట్ నహీ బోలేంగే’ – నేను భజరంగ్ బలీ భక్తుణ్ణి, చావనైనా చస్తానుగానీ అబద్ధం చెప్పను)  అనే మైండ్ సెట్ తో నిజాలు చెప్పేస్తూ భోళా మనిషిగా ఉంటాడు. ఇతడి వెంట పడుతుంది ఆ మూగమ్మాయి.
          ఈ మూగపిల్ల ఎవరో ఏమిటో తెలీక, వదిలించుకుందామన్నావదలక పోయేసరికి,  అలాగే వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్తూ,  ఆ బస్సులో ప్రయాణీకులకి తన ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటాడు. ప్రతాప్ ఘర్ లో ఆరెస్సెస్ సభ్యుడైన తండ్రి ఆశయాల్ని కొనసాగించాలంటే ఆ చదువు చదవలేక, కుస్తీ పట్లు నేర్చుకోలేక, హనుమాన్ భక్తి మాత్రమే  క్వాలిఫికేషన్ గా తిరుగుతున్నఅతణ్ణి, తండ్రి ఢిల్లీ లో తన మిత్రుడి దగ్గరికి వెళ్ళిపొమ్మని, ఆయన చూపించే జాబ్ చేసుకొమ్మని పంపించేస్తే – అక్కడ సద్బ్రాహ్మణుడైన ఆ మిత్రుడు దిగంబర్ ( శరత్ సక్సేనా) ఇంట్లో సెటిలై కూతురు రసిక ( కరీనా కపూర్) తో ప్రేమలో పడ్డాడు. ఆర్నెల్లలో ఇల్లు కొనుక్కోగలిగితే పెళ్లి చేస్తానన్నాడు దిగంబర్. ఆ ప్రయత్నాల్లోనే వున్న తనకి ఇక్కడ కురుక్షేత్రలో భారీ ఎత్తున హనుమాన్ పూజ జరుగుతోందని తెలిసి ఆగలేక వచ్చేశాడు..


          ఇలా ఇక్కడ దొరికిన మూగమ్మాయిని వెంటబెట్టుకుని దిగంబర్ ఇంటి కెళ్ళే సరికి, ముందు తెల్లగానే వుంది గనుక బ్రాహ్మణ పిల్లే అయివుంటుందన్న పవన్ మాటల్ని నమ్మి  ‘మున్నీ’ అని పేరు పెట్టుకుని దిగంబర్ ఇంట్లోనే పెట్టుకుంటే,  తర్వాత ఆమె దొంగ చాటుగా చికెన్ తినేసేసరికి క్షత్రియ అయి ఉంటుందిలే, వాళ్ళూ తెల్లగానే ఉంటారని పవన్ సర్ది చెప్పాక, ఆఖరికా అమ్మాయి మసీదులో ప్రార్ధన కూడా చేసేసరికి పవన్ సహా మొత్తమంతా ఠారెత్తి పోయి గగ్గోలు పెడతారు. ఇలా ఆలోచించ కూడదని వారిస్తుంది రసిక. ఇలాకూడా సర్దుకున్నాక, టీవీలో క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు గెలిచేసరికి మున్నీ ఆనందంతో గంతులేసేసరికి- ఆమె పాకిస్తానీ అని కూడా అర్ధమైపోయి- అసలే దేశభక్తీ, మతభావాలూ ఎక్కువున్న పవన్ ఇక మున్నీని వదిలించుకోవాలని నిర్ణయించుకుంటాడు.
          అయితే ఏమూలో వున్న మానవత్వం వల్ల ఏ బజార్లోనో వదిలెయ్యక, ఆమె దేశంలో ఆమె ఇంటికే  తీసికెళ్ళి అప్పగించాలని ప్రణాళిక వేసుకుంటాడు. లేకపోతే తన హనుమాన్ ఒప్పుకోడు!
          ఈ ప్రణాళికలో ఎన్ని ఎదురు చూడని మలుపు లెదురయ్యాయి, ఎన్నికష్టాలు పడ్డాడు, పర దేశంలో ఇండియన్ ఏజెంటుగా ముద్రపడి ఇంకెన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు- అయినా మానవత్వం కోసం నిల్చి ఆ దేశపు వాళ్ళని ఎలా తన పాదాక్రాంతం చేసుకున్నాడు.. ఇవన్నీ ఇక్కడ్నించీ కొనసాగే ద్వితీయార్ధపు ఘట్టాలు..

ఎవరెలా చేశారు
      సూపర్ స్టార్ గా సల్మాన్ ఖాన్  తన ఇమేజిని సైతం చంపేసుకుని పూర్తిగా డౌన్ ప్లే చేసిన పాత్ర ఇది. తెచ్చిపెట్టుకున్న హీరోయిజం లేదు, పోరాట విన్యాసాల్లేవు. కేవలం ఒక అమాయక చక్రవర్తి పాత్రగానే, అబద్ధం చెప్పని విలువలున్న హనుమాన్ భక్తుడి కుండాల్సిన వినమ్రతతోనే  చివరివరకూ మిస్సవని అదే ఫ్లోలో పాత్రని నిలబెడుతూ పోయాడు. సంఘర్షణ తన లోపలే వుంటుంది. శాఖాహారి అయిన తనకి మున్నీ మాంసాహారి అని తెలిసినప్పుడు పడే సంఘర్షణ, ఆమెది  వేరే మతం- దేశం అని తెలిసినప్పుడు కలిగే వైముఖ్యం,  పరదేశంలో జైశ్రీరాం అంటూ నమస్కరిచడం తప్ప, సలాము చెయ్యని నిబద్ధత- ఇలాటి తను నెమ్మది నెమ్మదిగా మానవత్వం వైపు మొగ్గే స్థితి కి చేరుకోక తప్పని పరిస్థితులూ.. చివరికా దేశం నుంచి వెను దిరుగుతు
న్నప్పుడు నేర్చుకున్న మానవత్వపు   పాఠాలకి సలాము చేయడం..ప్రతిగా వాళ్ళూ అతడి పేరుతో నినాదాలు హోరెత్తించడమూ..ఇవన్నీ కేవలం.. కేవలం ఆ పాత్రే కన్పించేట్టు చేశాయే తప్ప సల్మాన్ ని కాదు!  
          అయినంత మాత్రాన ఇది పాసివ్ పాత్రకాదు. ఆత్మరక్షణ కోసమైనా, కళ్ళముందు అన్యాయం జరిగినా ఎదురు తిరిగి కొట్టేసే తత్త్వమే. పాక్ పోలీస్ స్టేషన్లో మున్నీతో మిస్ బిహేవ్ చేసిన పోలీసుల్ని చితగ్గొట్టి పారిపోయే సీను అలాటిదే. తన దగ్గర పాస్ పోర్టు వీసాల్లేవు, శాఖాహారి కూడా, పైగా అక్రమంగా వాళ్ళ దేశంలో చొరబడ్డాడు. ఒక హనుమాన్ భక్తుడిగా ఈ నిజాలే చెప్పి, తనకి లీగల్ గా అనుమతి నివ్వందే కదలనంటాడు. ఇలా అనుమతి ఇచ్చే పరిస్థితి లేక, విసిగిపోయిన ఆ గస్తీ సైనికాధికారి  - అలాగే పోరా బాబూ, మా దేశంలో తగలడు ఫో! – అన్నాకూడా, అధికారికంగా పోనిస్తేనే అమ్మాయిని తీసుకుని మీ దేశంలోకి పోతానని పేచీ పెట్టుకుంటాడు. ఇలా భోళాతనంతో సిట్యుయేషనల్ కామెడీతో ఎంటర్ టెయిన్ చేసే దృశ్యా లెన్నో.
          సాధారణంగా ఏం జరుగుతుందంటే, హీరో ఒక వేళ అమాయకుడిలా వున్నా, ఇంటర్వెల్ దగ్గర ప్రాబ్లం లో పడేసరికి ఆ తర్వాత నుంచి క్యారెక్టరైజేషన్ ని మార్చేసి, డేర్ డెవిల్ గా
- ఫుల్ టైం యాక్షన్ హీరోగా చూపిస్తూంటారు. కానీ ఈ సినిమాలో అదే అమాయక చక్రవర్తి క్యారెక్టర్ ని చివరి వరకూ  కొనసాగించారు. ఇందుకు రెండు కారణాలున్నాయి : హనుమాన్ భక్తుడిగా అతడిది  సెంటిమెంటుతో నీతికీ నిజయితీకీ కట్టుబడే సున్నిత పాత్ర కావడంతో, ఉన్నపళాన యాక్షన్ హీరోగా మారిపోలేడు. రెండోది, యాక్షన్ హీరోగా మారిపోతే చెప్పాలనుకున్న అర్ధవంతమైన క్యారక్టర్ గ్రోత్ మంట గలిసిపోతుంది. అంత అవసరం లేని మౌఢ్యంతో వున్న అతణ్ణి మతాలకీ, దేశాలకీ అతీతమైన మానవత్వం వైపు నడిపించాలంటే యాక్షన్ కథనం తో సాధ్యం కాదు. ఇంకో పక్క యాక్షన్ కథగా మార్చేస్తే, ఈ సినిమాకి ఆయువుపట్టులాంటి బాలనటి పాత్ర అన్యాయమైపోయి సినిమా కూడా గంగలో కలిసిపోతుంది. అదెలాగో ఈ కింద చూద్దాం.
***


           అసలు సల్మాన్ ఖాన్ తన పాత్రతో ఏమీ ఏడ్పించడు. ఆ మాట కొస్తే ఏడ్పు తెప్పించడానికి ఇంకే పాత్రనీ వాడుకోలేదు- మూగమ్మాయి తల్లిని కూడా! అలా చేస్తే ఆ ఫీల్ ఆయా పాత్రల మీదికి మళ్ళి అసలు పాత్ర మీద ప్రభావం చూపకుండా పోతుంది. ఆ అసలు పాత్ర కూడా వాళ్ళల్లో ఒకటిగా ప్రాధాన్యం కోల్పోతుంది - ఏడ్పంతా, కళ్ళు చెమర్చేదంతా, హృదయాల్ని మెలిదిప్పేదంతా- ఆ అసలు పాత్ర షాహెదా అలియాస్ మున్నీకే  పరిమితం చేసి మంచి కథకుల లక్షణాన్ని ప్రదర్శించికున్నారు రచయితలూ దర్శకుడూ.   
          ఈ పాత్ర లేకపోతే కొంత, ఈ పాత్ర నటించిన బాలనటి హర్షాలీ మల్హోత్రా లేకపోతే మొత్తం సినిమాయే వుండదనేది నిశ్చయం. ఈ బాలనటితో సల్మాన్ సెన్సిబుల్ గా నటించడం వరకూ మాత్రమే చేశాడు. ఆయా సన్నివేశాల్లో ఈ బాలనటి పరిస్థితులకే ఎమోషన్స్ పెల్లుబికి ఏడ్పులొచ్చేస్తాయి. తను ఏడ్వకుండానే ఏడ్పించ గలగడం ఈ బాలనటి మూగ పాత్ర చిత్రణకున్న బలం. ఈ పాత్ర కథలో ప్లాట్ డివైస్ లాంటిది. సాధారణంగా ప్లాట్ డివైస్ లు ఎక్కడో దొరికే ఏ తాళం చెవో, లేదా కారు డిక్కీలో ఏ  శవమో, ఇంకేదో అయి వుండి వాటి చుట్టే- థ్రిల్స్, సస్పెన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్స్ వగైరా ఏర్పడి కథకి బలాన్నిస్తాయి. అలాటి ప్లాట్ డివైస్ గా మాత్రమే ఈ మూగ బాలిక పాత్ర చుట్టూ అన్ని భావోద్వేగాలూ కేంద్రీకృతమై కథకి ఆత్మ అయి కూర్చున్నాయి.    ముగింపు దృశ్యంలో మూగ బాలిక ప్రయత్నం ఫలిస్తే ప్రేక్షకులెంత కేరింతలు కొడతారో- ఆ వెంటనే చిట్ట చివరి షాట్ లో సల్మాన్- మూగ బాలికల హేపీ మూమెంట్స్ కి  అంత కళ్ళు తుడుచుకుంటూ బయటికొస్తారు. కాబట్టి ఈ బాలనటి పాత్రతో తో కనీసం డజను సార్లు చాపకింద నీరులా ఉంటూ పెల్లుబికించే అశ్రునయన సహిత సన్నివేశాలకి ముందు జాగ్రత్తగా ప్రేక్షకులు కర్చీఫులు, టవల్సు వెంట బెట్టుకు వెళ్ళడం మంచిది. వూహ కూడా తెలీని వయసులో బాలనటి హర్షాలీ కిది  హేట్సాఫ్ చెప్పాల్సిన విజయం. ఇలాటి బలమైన మూగ బాలిక పాత్ర ఉన్నాక కథని సల్మాన్ మీదికి తోసేసి అతణ్ణి యాక్షన్ హీరోగా మార్చేస్తే బాలిక పాత్ర గల్లంతై పోతుంది- దాంతో సందేహం లేకుండా సినిమా కూడా!
***


        మూడో కీలక పాత్ర నవాజుద్దీన్ సిద్దిఖీది. ఏ భేషజాలూ లేకుండా కొన్ని సినిమాల్లో ఆర్ట్ ఫిలిం తరహా పాత్రలు కూడా పోషిస్తూ ఒక విభిన్న సహాయ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న నవాజుద్దీన్, ఈ సినిమా  ద్వితీయార్ధంలో పాకిస్తాన్ లో ఎంట్రీ ఇస్తాడు- అయోమయపు డబ్బా టీవీ జర్నలిస్టు చాంద్ నవాబ్ గా- ఎప్పుడూ బిరికింగ్ ( బ్రేకింగ్ కి అతడి యాస!) న్యూస్ ఇవ్వాలనుకునే ఆరాటంతో. కొన్ని దురదృష్టకర పరిణామాలు సంభవించి పవన్ తో, ఆ మూగమ్మాయితో కలిసి పారిపోతూ ఉండాల్సి వస్తుంది పోలీసుల్నుంచి. ఈ అనుభవాలతో ఒక్కటి మాత్రం ప్రొఫెషనల్ గా అర్ధం జేసుకుని  అంటాడు- ద్వేషం అమ్ముడుపోయినంత సులభంగా ప్రేమ అమ్ముడు పోదని!  ఓపెన్ కామెడీతో సెకండాఫ్ లో మరొక ప్రధానాకర్షణ అయ్యాడతను.
          ఇక కరీనా కపూర్ ది సింపుల్ మధ్యతరగతి టీచర్ పాత్ర. వృత్తికి తగ్గ సెక్యులర్ భావాలే గాక, జీవితం పట్ల స్పష్టత, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కాదనలేని లాజిక్ ఆమె సొంతం. ఎవరితోనో పెళ్లి చూపులప్పుడు, పవన్ చేయి పట్టుకు లాక్కొచ్చి తండ్రితో అంటుంది అందరి ముందూ- పవన్ లో తను  ఫాదర్ ఫిగర్ ని చూశాననీ, అది ఇంకెవరిలోనూ చూడలేననీ. అప్పుడా తండ్రి వెంటనే ఆమెని ఆలింగనం చేసుకుంటాడు. ఆడపిల్లల గురించి సైకాలజీ ఏమంటుందో అదిక్కడ ప్లే చేసి అర్ధవంతమైన పాత్రగా మార్చారు. ఐతే ఈ పాత్ర తో ఇంటర్వెల్ తర్వాత పవన్ పాకిస్తాన్ వెళ్ళిపోయాక పనిలేకుండా పోయింది. అలాగని రొటీన్ గా సినిమాల్లో చూపిస్తున్నట్టు పరస్పరం తల్చుకుని డ్రీమ్  సాంగులు పాడుకోవడం లాంటి పన్లకి పొరపాటున కూడా పాల్పడలేదు. ఈ పని చేసి వుంటే  సెకండాఫ్ సర్వనాశన మయ్యేది.
          ఇక ఆసీమ్ మిశ్రా ఛాయాగ్రహణం, ప్రీతమ్ సంగీతం సినిమాకి  హైలైటనే చెప్పొచ్చు. దర్శకుడుగా కబీర్ ధైర్యం తో బాటు నిగ్రహం కూడా కనబరచాడు. అలాగే సినిమాని హేండిల్ చేసే విషయంలో  పరిణతి కూడా ప్రదర్శించాడు. ఆరెస్సెస్ వంటి సంఘపరివార్ దళాల్ని చూపించడం, ఢిల్లీలో పాక్ ఎంబసీ మీద దాడి చేయించడం, పాకిస్తాన్లో  సైనిక- పోలీసు దళాల తెలివితక్కువతనాన్ని చూపడం, వాఘా  బోర్డర్లో రైళ్ళ రాకపోకల విధానం, పాకిస్తాన్ లోతట్టు గ్రామాల వాతావరణం  చూపడం వంటి దృశ్యాలు ప్రేక్షకులకి ఇదివరకు వెండి తెరమీద చూడని కొత్త అనుభవాలుగా ఫ్రెష్ గా అన్పిస్తాయి. కురుక్షేత్ర  రైల్వే స్టేషన్ లో కాషాయ కార్యకర్తల హాడావిడి ఏరియల్ షాట్ మేజర్ ఎట్రాక్షన్. ఇలా చెప్పుకుంటే ఎన్నోవున్నాయి.

స్క్రీన్ ప్లే సంగతులు
          వి.విజయేంద్రప్రసాద్  రాసిన కథ ఇది. తనతోపాటు కబీర్ ఖాన్, మరో ఇద్దరు రచయితలూ కలిసి రూపొందించారు ఈ స్క్రీన్ ప్లేని. ఏ మాత్రం గజిబిజి, గందరగోళం, ఏం చెప్తున్నామో అర్ధంగాని అయోమయం, చెప్తున్నది వదిలేసి పక్కదారి పట్టించడం లాంటి అవక్షణాలు లేని స్క్రీన్ ప్లే ఇది. దేని ఆధారంగా ఎవరి కథ చెప్పాలి, ఆ కథ మీంచి, ఆ పాత్ర మీంచి దృష్టి చెదరకుండా ఎలా చెప్పాలీ  అన్న- సరైన ఎజెండా ఏర్పాటు చేసుకుని, సెన్సిటివిటీ అనే ఒకే ఒక్క ట్రాక్ మీద సీదాగా నడిపించుకొచ్చిన వైనం స్పష్టంగా కనపడుతుంది. ఒక మంచి స్క్రీన్ ప్లే ని విశ్లేషించే అవకాశం ‘మనం’ తర్వాత ఇదే.
          ఏ స్క్రీన్ ప్లే కైనా  రెండు మూల స్తంభాల వంటి మలుపులు- బిగినింగ్ ముగింపులో ఒకటి, మిడిల్ ముగింపులో ఒకటి ఉంటాయనేది తెలిసిందే. మొదటి మలుపు ప్రధాన పాత్రకి సమస్యని సృష్టిస్తే, రెండో ముగింపు ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని అందిస్తుంది.. ఈ రెండిటి మధ్య జరిగేది ఆ సమస్యతో ప్రధాన పాత్ర పోరాటమే. అయితే మంచి స్క్రీన్ ప్లే లో ఈ మలుపులు ఎలా ఉంటాయంటే- మొదటి మలుపు సమస్యా సృష్టికి దారి తీసే పరిస్థితుల కల్పన కొట్టొచ్చినట్టుండే సీన్లతో మనసులో ముద్ర వేసేస్తాయి. అలాగే రెండో మలుపు ఆ సమస్య  పరిష్కారమార్గానికి దారితీసే సీన్లు కూడా అంటే కొట్టొచ్చినట్టుంటాయి. సమస్య ని తెలుపుతూ సృష్టించే సీనుతో కలిపి  ఆ సీను కి దారితీసే సపోర్టింగ్ సీన్లూ;  మళ్ళీ పరిష్కార మార్గాన్ని సూచించే సీను తో కలిపి దీనికి దారి తీసే సపోర్టింగ్ సీన్లూ-  ఫస్టాఫ్ లో సెకండాఫ్ లో రెండువైపులా ఈ రెండు గుత్తులతో ఏర్పాటయ్యే మూలస్థంబాలు రెండూ కథకి అత్యంత బలాన్ని చేకూరుస్తాయి. కథని ప్రేక్షకుల మనోఫలకాల మీద బలంగా నాటుతాయి.
          దురదృష్ట వశాత్తూ ఇలాటి  రెండు మూల స్తంబాలూ సపోర్టింగ్ సీన్లు లేకుండానే, వున్నా అరకొరగా ఉంటూ కథకి ఇంపాక్ట్ ఇవ్వకుండానే చాలా సినిమాల్లో ఉంటున్నాయి. (ఇటీవల ఒక స్క్రిప్టుకి సంబంధించి కీలకమైన ఇంటర్వెల్ సీనుకి దారితీసే సీన్లు పించ్-వన్ దగ్గర ప్రారంభ
మైనప్పుడు, వాటి మధ్యకి వేరే సీన్లు రాకుండా అవే సీన్లు కంటిన్యూ అయితే ఇంటర్వెల్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పినా వినకుండా –[ There is no terror in the bang, only in the anticipation of it- Alfred Hitchcock]  ఆ సీన్ల మధ్యకి ఏవేవో కామెడీ సీన్లు జోప్పిస్తూ సడెన్ గా ఇంటర్వెల్ వేసి, దాని  ఇంపాక్ట్ ని పేలవం చేశారు. ఈ స్క్రిప్టు సొంత దార్లు ఒకసారి ‘భజరంగీ భాయిజాన్’  లో రెండు మూలస్తంభాల నిర్మాణాన్ని గమనిస్తే మనసు మార్చుకుంటారేమో చూడాలి. ఇలాగే  పూర్తి చేసిన ఇంకో సినిమాలో ఇంటర్వెల్ కి దారి తీసే సీన్లు గల్లంతయ్యాయి. ఆ పనికి రాని సీన్లని తీసేయించి ఇంటర్వెల్ లీడ్ సీన్లు రాసిస్తే, రీషూట్ చేసి కలుపుకుని  ఇప్పుడు ఫ్లో, ఇంపాక్ట్ బావున్నాయన్నారు)
***
ప్రస్తుత సినిమా స్క్రీన్ ప్లే ఇలావుంది..పాకిస్తాన్ మూగ బాలిక  తప్పిపోయే విధానం చూపించుకొచ్చి, ఒక పాటతో హీరోని ఇంట్రడ్యూస్ చేసి, ఆ బాలికని అతడికి ఎటాచ్ చేశారు. తర్వాత క్లుప్తంగా హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ తో ప్రేమా చెప్పేశారు. ఆ తర్వాత హీరో ఆ బాలికతో ఢిల్లీ ఓల్డ్ సిటీలో వుండే హీరోయిన్ ఇంటికి రావడం, అక్కడి వాతావరణం, సరదాలూ   చూపించారు. ఇంతవరకూ పాత్రలూ వాటి పరిచయం పూర్తయింది. కథా నేపధ్యం ఏమిటో తెలియ చెప్పారు. ఈ రెండూ ఇక్కడితో ముగించి,  ఇక సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన చేసుకొచ్చారు.
         
        ఈ పరిస్థితుల కల్పన సీను సీనుకీ తీవ్రత పెరిగేలా చూశారు. ముందు బాలిక చికెన్ తింటే బ్రాహ్మిన్ కాదని కలవరం, క్షత్రియ అయి ఉంటుందని సర్దుకోవడం, ఇంకో సీన్లో వద్దన్నా చికెన్ తినడం, మరింకో సీన్లో ఆమెని దూరంగా కూర్చో బెట్టి తామంతా వెజ్ భోజనం చేస్తున్నప్పుడు తను ఒంటరి తనం ఫీలవుతోందని- చికెన్ సాంగ్ పాడేసి ప్లేట్ల కొద్దీ చికెన్ పెట్టడం, దీని తర్వాత ఆమె మసీదులో ప్రార్ధన చేయడంతో ముస్లిం అని తెలిసిపోయి మరింత ఆందోళన చెందడం, ముస్లింగా మూగ బాలిక  కొనసాగింపు సీన్లు, అప్పుడు – టీవీలో క్రికెట్ చూస్తున్నపుడు ఆ బాలిక ముస్లిం మాత్రమే కాదనీ, పాకిస్తానీ కూడాననీ బయటపడి,  పెద్ద దుమారంతో సమస్యని  ఏర్పాటు చేయడం! బిగినింగ్ విభాగాన్ని ముగించడం!
         
       ఇక మిడిల్ ని ప్రారంభించారు. ఈ మిడిల్ బిజినెస్ ప్రకారం- ఏర్పాటు చేసిన సమస్యతో హీరోకి సంఘర్షణ ప్రారంభించారు. ఇది ద్విముఖ సంఘర్షణ. హీరోయిన్ తండ్రి ఇచ్చిన అల్టిమేటం  తో అంతర్గత  (ఎమోషనల్) సంఘర్షణ, బాలికని వదిలించుకోవడానికి పడే బహిర్గత ( ఫిజికల్) సంఘర్షణ. దీంతో హీరోకి పాత్రకి జవజీవాలు చేకూరాయి. బాలికని పాక్ ఎంబసీ కి తీసికెళ్ళడం, అక్కడ అనుకోని అవాంతరం ఏర్పడడం, ఇలా కాదని సంఘర్షణ కొనసాగిస్తూనే ఒక ఏజెంట్ ని సంప్రదించి ఇల్లీగల్ గా బాలికని పంపించేసేందుకు ఏర్పాటు చేయడం, అప్పుడా బాలికకి తానేమీ ఇచ్చి పంపలేదన్న ఆలోచనతో గాజులు కొని,  ఆ జనంతో కలిసి రిక్షాలో ఏజెంట్ తో పాటు వెళ్ళిపోతున్న బాలిక కోసం వెతుకులాటలో పడ్డం- ( బాలికకి గాజుల మీద మక్కువ గురించి, కురుక్షేత్ర పోలీస్ స్టేషన్లో ఆమె బేడీలు తీసి చేతికి తగిలించుకోవడంతో, మళ్ళీ పాకిస్తాన్ కి తీసికెళ్ళి నప్పుడు అక్కడా బేడీలు తీసి దాచుకోవడంతో, దీనికి ముందు వెనక ఢిల్లీలోనే మార్కెట్ లో గాజులమ్మేవాడు చూడకుండా గాజులు తీసుకుని వెళ్లిపోవడంతో..ఇలా ఎష్టాబ్లిష్ చేస్తూ పోయారు- ఆమె క్యారక్టరైజేషన్ లో భాగంగా).  

          ఆ గాజులతో హీరో వెతుకులాట వేశ్యా గృహానికి దారి తీయడం, అక్కడ ఎదురైన దృశ్యానికి  అంతవరకూ మతభావాలతో శిలాసదృశ మైన  హీరో వ్యక్తిత్వం పటాపంచలవడం, ఆ ఏజెంట్ చేసిన మోసానికి బాలిక అపుడే వేశ్యా గృహంలో...ఊహించడానికే భయంకరంగా వున్నా పరిస్థితికి చలించి వాళ్ళందర్నీ హీరో చావదాన్ని బాలికని తీసి కెళ్ళిపోవడం..ఇలా కావలసినంత వేడి పుట్టించిన సంఘర్షణ తో హీరో మానవత్వం వైపు కొంతవరకూ  మొగ్గడం, ఇక తనే బాలికని పాకిస్తాన్ కి తీసికెళ్ళేందుకు సిద్ధ పడ్డం...

          కొందరు ఈ ఇంటర్వెల్  సీను దగ్గరే, హమ్మయ్య ఇప్పుడు కథ ప్రారంభమయ్యిందని నిట్టూర్పులు విడుస్తున్నారు. మరి ఇంతవరకూ చూసిందేమిటి – మిడిలే కదా? అలవాటైపోయిన తెలుగు సినిమాల తంతుతో వచ్చిన తంటా ఇది.  తెలుగు సినిమాల్లో ఫస్టాఫ్ లో ఏమీ జరక్కుండా కాలక్షేపంతోనే సాగి సాగి,  ఇంటర్వెల్ దగ్గర మాత్రమే టర్నింగ్ వచ్చి కథ ప్రారంభమయ్యేది నిజమే.

          కానీ ప్రస్తుత సినిమాలో ఇంటర్వెల్ లోపే బాలిక  పాకిస్తానీ అని తెలిసిపోయిన సీనుతోనే కథ ప్రారంభమై హీరో సంఘర్షణలో పడ్డాడు. తర్వాత ఇంటర్వెల్ దగ్గర వచ్చిన సీను ఆ సంఘర్షణలో భాగంగానే పోటెత్తిన మజిలీ! మిడిల్ కి మిడ్ పాయింట్ మాత్రమే! కథా ప్రారంభం కాదు.

          ఇక ఆ తర్వాత హీరో బాలికతో ఇల్లీగల్ గా పాకిస్తాన్లోకి ఎంటర య్యేందుకు ప్రయత్నించడం, పాక్ లో అడుగు పెట్టాక ఇండియన్ ఏజెంటుగా అనుమానితుడై పోలీసులు  వెంటబడ్డం, టీవీ జర్నలిస్టుతో కలిసి మారు వేషాల ప్రహసనాలూ ఇత్యాది గడిచి- బాలిక ఒక స్కూల్లో ఒక సీనరీ చూసినప్పుడు, తన ప్రాంతం గుర్తుపట్టడంతో, ఆ సీనరీ ఎక్కడిడనే ప్రశ్నతో రెండో మూలస్తంభానికి (మిడిల్ ముగింపుకి) దారి తీసే సీన్లకి అంకురార్పణం చేశారు.
           
***



         ఇక రెండో మూలస్తంభానికి సపోర్టింగ్  సీన్ల పేర్పు చకచకా మొదలయ్యింది. అది పాకిస్తానీ సీనరీ కాదని తేలడం, అప్పుడు డల్ అయిన హీరో బాలికతో ఓ దర్గాలో జరుగుతున్న ఖవ్వాలీ పాటలో కూర్చోవడం,  అదే చోటుకి బాలిక తల్లి రావడం, బాలిక గానీ తల్లి గానీ పరస్పరం  చూసుకోక పోవడం- ఇదయ్యాక,  ఎందుకో అలిగిన బాలికని మూడ్ లోకి తెచ్చుకోవడానికి జర్నలిస్టు  తను తీసిన దర్గా దగ్గర వీడియో దృశ్యాల్ని చూపడం, బాలిక ఒక చోట ఎలర్ట్ అయి మళ్ళీ రిపీట్ చేయమనడం, అప్పుడా దృశ్యంలో నడిచి వస్తున్న తల్లిని గురు పట్టడం.. అప్పటికి ఆమె లేకపోవడం, కానీ వీడియోలో ఆమె వెనుక దూరంగా  ఒక బస్సు కన్పించడం, ఆ బస్సు ఆమె దిగిందనుకుని ఆ బస్సువాడిని పట్టుకుని అడిగితే, ఫలానా వూరునుంచి వచ్చానని చెప్పడం, ఆ రూట్లో వున్న ఊర్ల పేర్లు ఒకటొకటే జర్నలిస్టు చెప్తున్నప్పుడు తమ ఊరి పేరు దగ్గర బాలిక ఆపెయ్యడం...ఈ ఎక్సైటింగ్ సీనుతో మిడిల్ విభాగాన్ని ముగించడం!
          రెండో మూలస్థంభం దగ్గర హీరోకి పరిష్కారమార్గం దొరికింది! దీంతో ఇక అతను ఆ బాలిక వూరికి ప్రయాణం ప్రారంభిస్తూ, ఎండ్ విభాగం- అంటే క్లయిమాక్స్ ప్రారంభించాడు. 

***

  లా మొదటి మూలస్తంభానికి ఒక గుత్తిలో కొన్ని కొట్టొచ్చే సీన్లు, రెండో మూలస్తంభానికి ఒక గుత్తిలో మరికొన్ని కొట్టొచ్చే సీన్లూ సపోర్టుగా పెట్టుకుని- ఈ రెండు మూలస్థంభాల్నీ-దాంతో కథనీ బాగా హైలైట్ చేసిన స్ట్రక్చర్ ఇది.
          ఐతే ఈ స్క్రీన్ ప్లేలో అంతే  కొట్టొచ్చే ఒక లోపం కూడా వుంది. అది మొదటి మూల స్తంభానికి సంబంధించింది. ఆ మాట కొస్తే సినిమా ప్రారంభంలోనే లోపం దొర్లింది. ఈ లోపాలు లాజిక్ కి సంబంధించినవి. సరిహద్దులో బిడ్డని పోగొట్టుకున్న తల్లి పాత్ర తిరిగి ఆ బిడ్డని పొందడం కష్టమేమీ కాదు. కంప్లెయింట్ ఇస్తే చాలు. ఆ పని చేయకుండా ఆ పాత్ర కట్ అయిపోతుంది. 

          ఇక హీరో కూడా ఆ బాలిక పాకిస్తానీ అని తెలిసినప్పుడు మీడియా కి తెలియజేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సేల్ఫీ లేలేరే అని పాట పాడగల్గినవాడు, ఆ సోషల్ మీడియా ద్వారా కూడా బాలిక ప్రాబ్లం సాల్వ్ చేసేయొచ్చు. 

          కాబట్టి మొదటి మలుపు ( మూలస్థంభం) దగ్గర ఏర్పాటు చేసిన సమస్యలో ఈ లాజిక్ లోపించింది. లాజిక్ లేని సమస్య పట్టుకుని హీరో పోరాడాడు. లాజిక్ ప్రకారం చూస్తే హీరోకి ప్రాబ్లమే లేదు, ప్రాబ్లమే లేకపోయాక కథే లేదు.

          ఇక్కడ కామెడీలకి  సంబంధించే అయినా అరిస్టాటిల్ చేసిన వ్యాఖ్య గమనించాలేమో. కామెడీ కథల్లో ఏర్పాటు చేసే సమస్యలో లాజిక్ వుండాలి. లాజికల్ గా సమస్యని ఏర్పాటు చేశాక, ఆ వేదికమీద ఎంత ఇల్లాజికల్ గానైనా, ఇంకెంత  అసంబద్ధంగా నైనా కామెడీని నడిపించ వచ్చనేది.

          ఇది  మిగతా జానర్ కథలన్నిటికీ వర్తిస్తుందనడంలో సందేహం లేదు. సమస్య ఏర్పాటే లోపాలతో బలహీనంగా వుంటే అదొక సమస్య ఎలా అవుతుంది?

          పాక్ లో వున్న జర్నలిస్టు పాత్రకి కూడా మీడియా సహకారం గురించి వెంటనే తట్టదు- క్లయిమాక్స్ లో తప్ప! కథా సౌలభ్యం కోసం లాజిక్ ని క్లయిమాక్స్ కి వాయిదా వేసినట్టుంది తప్పితే మరేం కాదు..      
***


       సెకండాఫ్ కథా పథకం ఎలా వుండాలి? బాలిక బంధువుల్ని కనుగొనే హీరో గోల్ కాక, ఇంకా చెప్పడానికి ఏముంది? అతడి పాత్ర చిత్రణ మిగిలి వుంది. అతణ్ణి స్వమతాభిమానం వైపు నుంచీ మానవత్వం వైపు మళ్లించి మోక్షం కల్గించాల్సిన అవసరముంది. ఫస్టాఫ్ లో వేశ్యా గృహపు సీన్లోంచే ఈ క్రమం మొదలయ్యింది. అందుకే దేన్నైతే దూరంగా వుంచాడో దాన్నే ఆలింగనం చేసుకోక తప్పని పరిస్థితులు సెకండాఫ్ లో సృష్టించారు. పాకిస్తాన్లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బురఖా వేసుకోవాల్సి రావడం, మసీదులో దాక్కోవాల్సి రావడం, దర్గాలో ఖవ్వాలీ వింటూ కూర్చోవాల్సి రావడం మొదలైనవి. ఈసీన్లు ఏదో ఆడియెన్సుని వినోదపరచడం కోసం మాత్రమే  వేయలేదు- వీటి ద్వారా అతణ్ణి మానవత్వం వైపు మళ్ళించే పథకమూ వుంది. ఐతే అలాటి సీన్లే  ఎందుకు వేయాలంటే – ఎదుటి వర్గం, కులం, లేదా మతం ఏదైనా కావొచ్చు- దాన్ని దానివైన  ఆచారవ్యవహారాలతో సహా అంగీకరిస్తే తప్ప మానవత్వ ప్రకటనలో, ఆలింగానాల్లో నిజాయితీ వుండదు, హిపోక్రసీ అన్పించుకుంటుంది కాబట్టి.
***
       కాకతాళీయంగా ఈ సినిమా  సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగుతున్నప్పుడు విడుదలయ్యింది. అటు వైపు కూడా విడుదల కాబోతోంది. పాక్ పాలకులేమో గానీ, అక్కడి సైనిక వర్గం, మాజీ సైనికాదికారులు సహా, రెండు దేశాల మధ్య మంచిని అంగీకరించే పరిస్థితి లేనే  లేదని మళ్ళీ మళ్ళీ కూడా జాతీయ ఛానెళ్ళలో వాళ్ళ బుకాయింపుల్ని గమనిస్తే అర్ధమైపోతుంది. ఉఫాలో మోడీ- నవాజ్ లమధ్య చర్చలు వాళ్లకి ఇష్టం లేదు. అందుకే  డ్రోన్ లు ప్రయోగిస్తారు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అవతలి దేశం సైనిక వర్గం చేతుల్లో వున్నప్పుడు- ‘భజరంగీ భాయిజాన్’ లాంటి  స్నేహాన్ని, మానవత్వాన్నీ   కాంక్షించే సినిమాలు ఎన్ని తీసి మాత్రమేం ప్రయోజనం. మిలిటరీ ముఠాలో మార్పే రాదు. అటువైపు- ఇటువైపూ  ప్రజలు శాంతినే కోరుకుంటున్నారని ఇలా సినిమాలు తీస్తూపోతే, మెడ మీద కత్తిలా వేలాడుతున్న వాస్తవ పరిస్థితిని  మభ్య పెట్టుకోవడమే అవుతుందేమో. ఈ సినిమాలో ఓంపురి పోషించిన మౌలానా పాత్ర-  ‘ఆధా కాశ్మీర్ ఇదర్ భీ హై’ ( సగం కాశ్మీర్ ఇటు కూడా వుంది) అన్నట్టు, ఈ ‘ఇదర్ భీ హై, ఉదర్ భీ హై’ అసలు గోలకి ఫుల్ స్టాప్ పెట్టే ఎజెండాతో, ధైర్యం చేసి అలాటి సినిమాలు తీసే సమయం ఆసన్నమైందేమో బాలీవుడ్ ఆలోచించాలి.

సికిందర్