రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, జులై 2015, గురువారం

నాటి సినిమా!



          వెండితెర మీద బహువిధ పాత్రలకి మించి నిజజీవితంలో పోషించే పాత్రలు సూపర్ హిట్టయితే ఆ చమత్కృతి పేరేమిటి?
          గన్ షాట్ గా పి. భానుమతే!

          టించిన సినిమాల్లో  ద్విపాత్రాభినయాల పరిమితిని దాటుకుని అక్కినేని, సంజీవ్ కుమార్, శివాజీ గణేశన్ ల నవవిధ పాత్రాభినయాలు, కమల్ హాసన్ దశావతారాలు, ఆఖరికి ప్రియాంకా చోప్రా భుజాన్నేసుకున్న పన్నెండు వేషాలూ ..డబుల్ యాక్షన్ తో మొదలెట్టి డజను యాక్షన్స్  వరకూ చేరిన వెండితెర బహువిధ పాత్రాభినయాల చరిత్ర అంత గర్వకారణ మేమీ కాదు ఆలోచిస్తే, గర్వకారణం నిజజీవితంలో భానుమతి బహుముఖ ప్రజ్ఞాపాటవమే!

          గటు ప్రేక్షకుడు సినిమాకొచ్చి తన అభిమాన నటీనటుల ప్రజ్ఞని విశ్లేషించుకుంటూ కూర్చోవాలనుకోడు. వాడి తహతహ అంతా కూడా కేవలం ఆ నటనల్లో తాదాత్మ్యం చెంది, వెంటాడే ఈ జీవితాన్నుంచీ కాసేపు దూరంగా పారిపోవాలనుకోవడం గురించే. అయితే ఆ తదాత్మ్యత  సాంద్రత పోషించే పాత్రలు పెరిగే కొద్దీ తరిగిపోవడం కూడా కద్దు. కమల్ ( ‘దశావతారం’), ప్రియాంకా ( ‘వాటీజ్ యువర్ రాశి’ ) వంటి ఇటీవలి బాక్సాఫీసు ఓటములే ఇందుకుదాహరణలు.

          భానుమతి కలాటి ఓటమిలేదు. నటిగా, గాయనిగా, కవయిత్రిగా, సంగీత కర్తగా, కథా రచయిత్రిగా, సినిమా దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా, ఫిలిం ఎడిటర్ గా, ఖగోళ జ్యోతిష్య శాస్త్రాల స్రష్టగా...ఇన్ని విభిన్న పాత్రల పోషణని తన జీవితంలో సూపర్ డూపర్ హిట్టు గా నిర్వహించుకుపోయిన వన్ ఉమన్ ఆర్మీ భానుమతీ రామకృష్ణ!
          జీవితం కాన్వాసు జగమంత, అందులో మేధస్సు విస్తృతి ఆకాశమంత, సినిమా కాన్వాసు కమర్షియాలిటీకి సరిపోయేంతే;  అందులో మళ్ళీ క్రియేటివిటీ పాలు ఆ కమర్షియాలిటీకి లొంగినంతే, అంతే! దాటిపోయిందంటే దవాఖానాలో పడకే. ఈ అపూర్వ సందేశాన్నే అందుకోవాలి భానుమతి నిండు జీవితంలోంచి.
          మరొకటుంది- చాలా డేరింగ్ వుమన్ కూడా భానుమతి!
          లేకపోతే ఏమిటా తెగింపు!  ఇంకా ఇరవయ్యారేళ్ళ లేత వయసులోనే 1953 లో, దేశంలో సినిమా దర్శకత్వం చేపట్టిన తొలి మహిళ ఎవరున్నారంటే, తనే అని అన్పించుకుంటూ- నిర్మాతగానూ మారి, ఇంకో చేత్తో భారతీయ సినిమాల్లో తొలిసారిగా ద్విపాత్రాభినయాన్ని అవలీలగా పోషించి అవతలపారేసి,  తెలుగు- తమిళ- హిందీ బహు భాషా చిత్రంగా ‘చండీరాణి’ అనే మసాలా సినిమా తీసి, ఒకే రోజు ఆ మూడు భాషల్లోనూ విడుదల చేసి పారేసి, సత్తా చాటుకోవడం ఇంకెవరి వల్లయింది?
        ప్రపంచ సినిమా చరిత్రలో భానుమతితో పోల్చదగ్గ  చలనచిత్ర మహిళ ఇంకొక్కరే! ఆవిడ ఫ్రాన్సుకి చెందిన ఆలైస్ గై బ్లాంచ్ ( 1873-1963) అనే ఆవిడ. సినిమా అనే దృశ్య మాధ్యమాన్ని కనిపెట్టింది 1896లో ఫ్రాన్సు దేశస్థులైన లూమియర్ సోదరులహో అని అదేపనిగా బాజా వాయిస్తూంటాం గానీ, అదే సంవత్సరం ఆ విజయంలో ఓ చెయ్యి వేసిన  స్త్రీ మూర్తి గురించి పట్టించుకోం. మేడమ్ ఆలైస్ ప్రపంచంలోనే తొలి సినిమా ‘దర్శకురాలు’ గా ‘లాఫీ ఆక్ హాక్స్’ అనే మూకీ సినిమా తీయడమే కాదు, ఇంకే మూకీ దర్శకుడూ నిర్మాతా ఉత్పత్తి చేయనంత స్థాయిలో 700 వరకూ మూకీలు తీసి అవతల పారేసి కాలుమీద కాలేసుక్కూర్చుందంతే!!

అలైస్ గై బ్లాంచ్
              భానుమతి 1939లో 13వ యేట ‘వరవిక్రయం’ తో సినీరంగ ప్రవేశం చేసినా, 1945లో బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో ‘స్వర్గసీమ’ లో నటించాకే మంచి పేరొచ్చింది. అందులో కథానాయకుడి ( వి. నాగయ్య) పండంటి సంసారాన్ని పీకి పందిరేసే ప్రతినాయిక సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తుంది. ‘ఒరేవొరే, భానుమతి కూడా మంచిది కాదురా, కాపురాలు కూల్చే రకం!’ అని నాటి ప్రేక్షకులు యమవర్రీ అయిపోయేవాళ్ళు- ఆవిడేదో తమ పక్కింట్లోనే మకాం వేసి తమ కొంపలకి  ఎసరుపెడుతున్నట్టు. ఇలాటి వాళ్ళని ఇంకా ఏడ్పించి వదలాలని కాబోలు, ‘విప్రనారాయణ’ లోనూ అదే వ్యాంప్ పోకడ పోయారామె!
          ‘విప్రనారాయణ’ భానుమతి నటజీవితాన్ని కీలక మలుపు తిప్పిన మహోజ్వల భక్తి రస ప్రధాన చలన చిత్రం. ‘లైలా మజ్నూ’, ‘మల్లీశ్వరి’, బాటసారి’ ల లాంటి మరెన్నో అద్భుత చలన చిత్రాలు ఆమెఖాతాలో పడివుంటే ఉండొచ్చు గాక- ఒక పూర్తి స్థాయి యాక్టివ్ పాత్రగా, కథలో ఓ ప్రధాన సంఘటనని సృష్టించి, ఆ కథని నడిపించే, కథనాన్ని కూడా పండించే దృశ్య కావ్యంగా  ‘విప్రనారా యణ’ నిలబడింది. అక్కినేని నాగేశ్వరరావు పోషించిన విప్రనారాయణ పాత్రపరంగా సినిమాకి నామకరణం జరిగినా,  నిజానికిందులో భానుమతి పోషించిన దేవదేవి పాత్రకే పెద్ద పీట. ట్రాజెడీల్లో ప్రధాన పాత్ర కర్మణి పాత్ర స్థానంలో వుండిపోయి, ప్రతినాయక పాత్ర కర్తగా తానే కథ నడిపించడం చూస్తూంటాం. అలాగే  ‘విప్రనారాయణ’ లో కూడా ఇలా ప్రతినాయిక పాత్రనే ప్రధాన పాత్రగా చేసి, సాగించిన కథనాన్ని నాటక పరిభాషలో ప్రకరణం అంటారు. ‘చింతామణి’, ‘వసంతసేన’, ‘స్వర్గసీమ’ లలోని ‘సుబ్బలక్ష్మి’ కథలు ఈ కోవకే చెందుతాయి.
          సరే, ఇంతకీ ఎవరీ విప్రనారాయణ?
         చరిత్రలో కెళ్ళాలి.  క్రీ.శ. 787 లో తమిళనాడులోని కావేరీ నది ఒడ్డున మందంగుడి అనే గ్రామంలోజన్మించాడు తొండరాదిప్పొడి ఆళ్వార్. ఇతను నారాయణుడి ఆశీస్సులతో  జన్మించడంతో విప్రనారాయణ అయ్యాడు. విప్ర అంటే బ్రాహ్మణుడు. ఇతను పెరిగి పెద్దయి, వేదాలు చదువుకుని, శ్రీరంగ పట్టణం వెళ్లి శ్రీ రంగనాథుడి దర్శనం చేసుకున్నాడు. ఆ దర్శనం అతడిలో భక్తి పారవశ్యాన్ని కల్గించి, ఇక అక్కడే వుండిపోయి ఆ రంగనాథుడి సేవలో తరించి పోయేందుకు పురిగొల్పింది. ఆ సేవలో ప్రధానమైనది మాలా కైంకర్యం. దాంతో ఆలయం వారగా తులసి మొక్కలు, రకరకాల పూల చెట్లూ పెంచి ఒక మనోహరమైన తోటని అభివృద్ధి చేశాడు. అనునిత్యం పూలమాలలు అల్లుతూ స్వామికి సమర్పించుకోవడమే దినచర్య అయిపోయింది.
          కావేరి ఆవలి ఒడ్డున కదంబణగారం అనే ఊరుంది. ఆ ఊళ్ళో దేవదేవి అనే వేశ్య ఉంటోంది. ఓ నాడామె చోళరాజు ఎదుట నృత్య ప్రదర్శన ఇచ్చింది. చోళ రాజు మెచ్చుకుని సత్కరించాడు. ఆమె తిరిగి వెళ్తూ తోటలో విప్రనారాయణని చూసింది. అతడి గొప్ప గురించి ఇదివరకే చెప్పి వుంది తన అక్క అలివేణి. దీంతో ఈ గొప్పవాడికి ప్రణమిల్లాలని ముందుకు సాగిన దేవదేవి కి భంగపాటు ఎదురయ్యింది. అప్పుడేదో పరధ్యానంలో వున్న విప్రనారాయణ ఆమె ప్రణమిల్లడాన్ని గమనించలేదు. దీంతో ఆమె అహం దెబ్బ తింది. అతడి పరధ్యానాన్ని అహంకారంగా భావించుకుని –ఈ మనిషిని ఎలాగైనా లొంగదీసుకుని పీచమణుస్తానని అక్కడికక్కడే ప్రతిజ్ఞ చేసింది.
          ఇక్కడ్నించే మొదలయ్యాయి విప్రనారాయణకి కష్టాలు! అతడి దైవ చింతన, భక్తీ ముక్తీ సర్వం ఆ ఒక్క ఆడగాలి సోకి పటాపంచలై పోయాయి. అనాధనని, అతడి సేవలో తరిస్తూ కష్టాలన్నీ మర్చిపోతాననీ బొంకి, పథకం ప్రకారం అతడి పంచన చేరిన ఆమె, ఓ వర్షపు రాత్రి అనుకున్నట్టూ లొంగ దీసేసుకుంది. అంతే, ఇక దీంతో అతడామెకి దాసుడైపోయాడు. ఆలయం నుంచి ఏకంగా మకాం ఆమె ఇంటికే మార్చేశాడు. కానీ, చిల్లికాణీకీ కొరగాని ఇతగాణ్ణి ఆమె తల్లి చీదరించుకుని, పైపెచ్చు ఇతడి మైకంలో కూతురు పడిందంటే తన ఆదాయమూ పడిపోతుందని ఇంట్లోంచి వెళ్ళ గొట్టేసిందతణ్ణి.
      అయినా మూతబడ్డ తలుపులవతలే బైఠాయించి దేవదేవినే కలవరించసాగాడు. విప్రనారాయణ ఈ దుస్థితిని రంగనాయకి తో పట్టణ విహారాని కొచ్చిన రంగనాథుడు చూసి జాలిపడ్డాడు. దారి తప్పిన ఇతడికి సాయపడాలని, ఆలయంలోంచి బంగారు గిన్నె తొలగించి తెచ్చి, అది విప్రనారాయణ పంపిన కానుక అంటూ  దేవదేవికి బహూకరించాడు. అటు ఆలయంలోని బంగారు గిన్నె చోరీ జరిగిందని పూజారి గోల పెట్టాడు. ఆ నేర విచారణలో విప్రనారాయణుడే నిందితుడిగా నిలబడాల్సి వచ్చింది.
          అప్పుడు  చోళ రాజు అతడి దోషిత్వాన్ని నిర్ధారించుకుని, శిక్షగా చేతులు నరికెయ్యాలని ఆదేశించాడు. ఆ శిక్ష అమలవుతూండగా, రంగనాథుడు ప్రత్యక్షమై కాపాడాడు. ఇదంతా తాను ఆడించిన ఆట అని చెప్పాడు. పూర్వ జన్మలో విప్రనారాయణ వైజయంతీ మాలా రూపుడనీ, శాపవశాత్తూ మానవుడిగా జన్మించాడనీ, దేవదేవి కూడా పూర్వజన్మ కర్మానుభవం కోసం మానవిగా జన్మించిన గంధర్వ కాంత అనీ, అలా వీళ్లిద్దరికీ సంబంధ బాంధవ్యాలు కల్పిస్తూ, వాళ్ళ కర్మ శేషం హరింపజేసేందుకే, తన సన్నిధి లోని బంగారు గిన్నెని సాని ఇంటికి పంపాననీ, చెప్పుకొచ్చాడు రంగనాథుడు. దీంతో విప్రనారాయణ కష్టాలన్నీ గట్టెక్కి, తిరిగి ఆ స్వామి భక్తుడ య్యాడు.
          శ్రీరంగం టెంపుల్ వెబ్ సైట్లో పెట్టిన ఈ చరిత్ర పాఠాన్ని ఉన్నదున్నట్టూ తెరకెక్కించారు దర్శకుడు, భానుమతి భర్త రామకృష్ణ. కాలానుగుణమైన వాతావరణ నేపధ్యం, దృశ్యానుగతమైన నటనలూ ఇంత చక్కగా అమరిన ఈ కళా సృష్టి, మనల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఎప్పుడో 1954 లోనే సినిమా క్రాఫ్ట్ ఇంత రాటుదేలి వుండడం ఒక అద్భుత విషయంగా కన్పిస్తుంది. వర్షపు రాత్రి సీనైతే ఫెంటాస్టిక్. మూడంకాల ( త్రీ యాక్ట్స్) కథా సంవిధానంలో ఆయా అంకాల్లో ఏ ఏ బిజినెస్సులు జరగాలో- ఆ కథన కవాతులు పొల్లుపోకుండా ఆకట్టుకుంటే, సందర్భానుసారంగా వచ్చే పాటలొక మంచి కవిసమయం. భానుమతి, ఏఎం  రాజాల గళాలు మధువులు నిండిన గళాసులు. సేవించే మనబోటి శాల్తీలకి సాంత్వన క్లాసులు. ‘ఎందుకోయీ తోటమాలీ..’,  ‘సావిరహే తవదీనా..’,  ‘చూడమదే చెలియా ..’  పాటలన్నీ సాలూరు రాజేశ్వరరావు చేతినుంచి జాలువారిన సంగీత ఝరులే. సముద్రాల రచన, రెహ్మాన్ ఛాయాగ్రహణం మరో రెండు పంచ ప్రాణాలు.
          ఈ సినిమా విడుదలై యాభై ఏళ్ళు దాటింది. అయినా లోకంలో ఇంత శోకం ఇంకా మిగిలే వుంది. కష్టాలకి కుంగి పోతారు మనుషులు. భోరున విలపించేసి తమ బాధని ప్రపంచానికి ప్రకటిస్తారు. కష్టాలు రావడమంటే చేసిన పాత కర్మల దరిద్రం వదలడమేననీ, వదిలి పునీతులవడమే ననీ- ఈ సినిమా చూసి గ్రహించి వుంటే, ఇంత విషాదం ఈ  ప్రపంచంలో వుండేది కాదు. అక్కినేని, భానుమతి ల మధ్య రోమాన్సుని రోమాంచితం చేసి, షుగర్ కోటింగ్ సన్నివేశాలతో అలరింపజేస్తూ వెళ్లి, ఆఖర్లో అసలు గుట్టు విప్పుతూ, ఒక ఆధ్యాత్మిక ప్రభోదం చేస్తున్న ఈ చలన చిత్ర రాజం-  సృజనాత్మకతా పరంగా జేమ్స్ బానెట్ స్టోరీ వీల్ స్లాట్ లో అగ్రస్థానాన్నే ఆక్రమిస్తోంది సగర్వంగా!
         అక్కినేనిది బాధిత పాత్ర కావడం వల్ల ఆ మేరకే ఆయన నటనా వుండి జాలి పుట్టిస్తుంది. ఎదురయ్యే సంఘటనల్ని ప్రతిఘటించే తత్త్వం కాకపోవడం చేత ఆయన ప్రదర్శించిన అమాయకత్వం నిండిన హావభావాలు చాలా రోజులూ మనల్ని వెన్నాడి తీర్తాయి! ఇక భానుమతి గురించి చెప్పుకోవాలంటే – ‘భానుమతి ఈజ్ ది షో ఉమన్’  అని చెప్పుకోవాలి. పాత్ర స్వభావం చేత ఆమెకి నవరసాల పోషణ దక్కింది. కథని నడిపించే పాత్రవడం చేత ఆ పాత్ర చివరంటా సినిమాకి చురుకుదనం పుట్టిస్తుంది. వేశ్యగా హొయలు, ప్రేమికగా హుందాతనం..ఈ రెండు శారీరక భాషల తో ఆమె అభినయ కళా విశేషాలు వెర్రెత్తించి వదుల్తాయి. తమిళులు కలైమా మణి  అనీ, బహుకళా ధీరతి శ్రీమతి అనీ, ఊరికే అనలేదు భానుమతి నుద్దేశించి. వ్యాంప్ కి చెరువైనా, గయ్యాళి తనానికి దూరం ఉంటూ, జీవితపు చరమాంకంలో వెండితెర మీద ది గ్రాండ్ ఓల్డ్ మదర్ గా మన్నన లందుకున్న పాలువాయి భానుమతీ రామకృష్ణ ( 1925- 2005) చక్కగా ‘విప్రనారాయణ’ నిర్మించి తనకి తానే నివాళి అర్పించుకున్నారు!

సికిందర్
( నవంబర్ 2009, సాక్షి- ‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)
         
         





అదృశ్యం!

      
                                               
కథ- స్క్రీన్ ప్లే- నిర్మాణం- దర్శకత్వం : వాసు మంతెన
తారాగణం: శ్రేయాన్‌
, ప్రగతి, అభిమన్యుసింగ్‌, ముఖేష్‌ రుషి, కోట శ్రీనివాసరావు, స్నిగ్ధ, సత్య
మాటలు: వడ్డాలపు ప్రభాకర్‌,  ఛాయాగ్రహణం: వి.కె. గుణశేఖర్‌
సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి,  కూర్పు: గౌతంరాజు విడుదల
నిర్మాణం: వజ్మన్‌ ప్రొడక్షన్స్‌, విడిదల : 3 జులై
, 2015
*
         
సీనియర్ నటి జయసుధ కుమారుడు శ్రేయాన్ ని హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు వాసు మంతెన తనే నిర్మాతగా మారి నిర్మించిన ‘బస్తీ’ ని కనువిందు చేసే ఒక సృజనాత్మక ప్రయత్నంగా ఆహ్వానించవచ్చు. చిన్న బడ్జెట్ సినిమాల్లో ఈ స్థాయి దృశ్యపరమైన ప్రమాణాలు తెలుగులో చాలా అరుదుగా చూస్తూంటాం. దర్శకుడికి విజువల్ సెన్స్ వున్నప్పుడు ఛాయాగ్రహణం- కళ- కాస్ట్యూమ్స్ విభాగాలు  సైకలాజికల్ గా ట్రాన్స్ లోకి తీసికెళ్ళేట్టు చేస్తాయి ప్రేక్షకుల్ని. కళా దర్శకుడి కలర్ స్కీం, కాస్ట్యూమ్స్ స్పెషలిస్టు ఇచ్చే డ్రెస్సింగ్ స్కీం, ఈ రెండిటికి మ్యాచయ్యే ఛాయాగ్రాహకుడి లైటింగ్ స్కీం,  దృశ్యాల్లో మూడ్ ని క్రియేట్ చేస్తాయి. ఈ మూడ్ క్రియేషన్ ని పర్యవేక్షించే దర్శకుడు కొత్తవాడై వుంటే అతను ప్రామిజింగ్ డైరెక్టర్ గా కనపడతాడు. వాసు మంతెన అలాటి ప్రామిజింగ్ డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. చిన్న సినిమాలు తీస్తున్న కొత్త దర్శకులు తమదైన ముద్రతో ప్రామిజింగ్ డైరెక్టర్ లుగా కన్పించే దృష్టాంతాలు భూతద్దం పెట్టి గాలించినా కన్పించడం లేదు. ఏదో ఇలా వస్తున్నారు, అలా పోతున్నారు మొక్కుబడిగా..
          హీరో శ్రేయాన్ కెసిఆర్ అన్నట్టు తెలుగు అమితాబ్ బచ్చనే పొడుగు రీత్యా. ఆ పొడుక్కి చాక్లెట్ బాయ్ ఫేస్ కట్ ఒక భిన్నమైన కాక్ టెయిల్. కాకపోతే సరసన నటించే హీరోయిన్లతో రావచ్చు సమస్య. ఈ సినిమాలో వచ్చింది కూడా. హీరోయిన్ ప్రగతి హైటు చాలక చిన్నపిల్లలా కన్పిస్తుంది. పైగా ఈమె అంత వయసున్న కోట శ్రీనివాసరావుకు కూతురంటే కూడా నమ్మశక్యం కాదు- మనవరాలిలా వుంటుంది.
          దర్శకుడు ‘బస్తీ’ అనే ఈ యాక్షన్ మూవీని తనే రాసుకుని తనే తీసి ఎలా ఆకట్టుకోబోయాడో ఒకసారి చూస్తే ...
ప్రేమలు వేరు- చావులు వేరు   
       ఓపెనింగ్ సీనులో సిటీలో ఓ పొద్దుటే జాగర్స్ కి, వాకర్స్ కి పార్కులో ఓ అమ్మాయి శవం కంత పడుతుంది. ఓ క్లాసిక్ క్రైం / డిటెక్టివ్ సినిమాల్లో లాంటి సింపుల్ ఓపెనింగ్. పోలీసులొస్తారు, ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. కథా నేపధ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. సిటీలో ఆ  ప్రాంతం ఒకప్పుడు బస్తీ. ఇప్పుడు పోష్  ఏరియా. బస్తీగా వున్నప్పట్నించీ అక్కడ భిక్షపతి ( కోట), అమ్మిరాజు ( ముఖేష్ రిషి) అనే గ్యాంగ్ స్టర్స్ మధ్య వైరాలు. ఇవి ప్రస్తుతం చల్లబడి ప్రశాంతత నెలకొన్నా- ఈ ప్రశాంతతకి కారకుడైన అమ్మిరాజుని వద్దన్నా ఏదో రకంగా  బిక్షపతి కొడుకు భవానీ ( అభిమన్యు సింగ్) రెచ్చ గొడుతూంటాడు.  అమ్మిరాజు భిక్షపతితో ఏనాడో శత్రుత్వం చాలించుకుని ప్రశాంతంగా తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఇలాటి సమయంలో అమ్మిరాజు ఏరియాలో భవానీ  ఓ అమ్మాయిని చంపించడంతో, అతడి చెల్లెల్ని, అంటే భిక్షపతి కూతురు స్రవంతి ( ప్రగతి) ని రహస్యం గా కిడ్నాప్ చేయించి తనింట్లోనే  బంధిస్తాడు అమ్మిరాజు. 
          ఇంతలో అమ్మిరాజు తమ్ముడు విజయ్ ( శ్రేయాన్) అమెరికానుంచి వస్తాడు. ఇంట్లో బంధించివున్న స్రవంతిని చూస్తాడు. విషయం తెలుసుకుంటాడు.  అన్న వాదాన్ని నమ్ముతాడు. స్రవంతితో పరిచయం పెరుగుతుంది, ఆమె కూడా దగ్గరవుతుంది. ఆ దగ్గరవడం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు.  దీనికి అమ్మిరాజు ఒప్పుకుంటాడు- ఇలాగైనా రెండు కుటుంబాల మధ్య శాంతి ఏర్పడుతుందని. ఈ విషయం ఎస్పీ కి చెప్పి భిక్షపతితో మీటింగ్ ఏర్పాటు చేయించమంటాడు. ఆ మీటింగులో ఉద్రిక్తత లేర్పడతాయి పెళ్లనగానే. భిక్షపతి ఒప్పుకున్నా, కొడుకు భవానీ అంగీకరించడు. కాల్చిపారేస్తాడు తండ్రిని, ఎస్పీనీ, అమ్మిరాజునీ...విజయ్ స్రవంతిని తీసుకుని పారిపోతాడు. భవానీ మరికొందరు అమ్మిరాజు బంధువుల్ని కూడా చంపేస్తాడు.
          స్రవంతి తో పారిపోయిన విజయ్ కర్ణాటకలో స్నేహితుల దగ్గర తలదాచుకుంటాడు. ఇక ఎట్టి పరిస్థితిలో స్రవంతిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవాలనుకుంటాడు ...ఇదీ విషయం. ఇక భవానీని ఎదుర్కొని అమెరికా వెళ్లి పోగలిగారా అన్నది మిగతా కథ. 
బడ్జెట్ కి చాలని కథ 
      ఈ కథ చూస్తే దర్శకుడు పెద్ద బడ్జెట్ ఫార్ములా సినిమాలకి ప్రభావితుడైనట్టు తెలిసిపోతూంటుంది. సినిమా కథ అంటే పెద్ద బడ్జెట్ ఫార్ములా సినిమా కథే అన్న అభిప్రాయమో ఏమో అదిక్కడ బెడిసి కొట్టింది. పెద్ద బడ్జెట్ సినిమా కథల్ని పెద్ద బడ్జెట్ సినిమాల్లోనే అన్ని భారీ హంగులతో చూసి ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు, పనిగట్టుకుని అలాటి హంగులు వుండని ఛోటా సినిమాల్లో కూడా చూడాలని ఎందుకు కోరుకుంటారు? సమస్య ఎక్కడ వచ్చిందంటే, తెలుగులో భారీ సినిమాలు హాలీవుడ్ ని అనుకరిస్తే, భారీ సినిమాల్ని చిన్న సినిమాలు అనుకరిస్తున్నాయి- ఐతే హాలీవుడ్ ని అనుకరించినా  భారీ సినిమాలు బతికుంటాయి, భారీ సినిమాల్ని అనుకరించే చిన్న సినిమాలు మాత్రం చచ్చూరుకుంటున్నాయి. ప్రస్తుత చిన్న సినిమాదీ ఇదే పరిస్థితి. అంతగా యాక్షన్ మూవీ తీయాలనుకుంటే నవ్యత తో కూడిన ఏ థ్రిల్లరో తీయవచ్చు.
          రెండోది, ఈ కథ మూస ఫార్ములాయే  అయినా దర్శకుడు ఒక విజన్ పెట్టుకుని రియలిస్టిక్ గా తీయాలనుకున్నట్టు కొన్ని సీన్లలో అర్ధమవుతుంది. ఓపెనింగ్ సీను అలాంటిదే. కానీ అంతలో అభద్రతాభావం వెంటాడినట్టు మళ్ళీ ఫార్ములా చిత్రీకరణల్లో సేఫ్ జోన్ చూసుకునే ధోరణి కన్పిస్తుంది. ఇదెక్కడిదాకా పోయిందంటే కామెడీ సీన్లన్నీ అలాటివే. ఇంకా పనిగట్టుకుని- ఫార్ములా సినిమాల్లో సెకండాఫ్ లో కథతో సంబంధం లేని కమెడియన్లని దింపి కామెడీతో టైం పాస్ చేసినట్టూ- ఇక్కడా అదే పరిస్థతి. మహావిష్ణువు పాత్రలో అలీ వచ్చేసి ఆ కామెడీ ఏమిటి? గే క్యారక్టర్ తో సత్య కామెడీ ఏమిటి? ఇవన్నీ బిగ్ బడ్జెట్ సినిమా ఫీల్ తీసుకురావడానికి దర్శకుడు పడ్డ పాట్లే!
          మూడోది, ఇలాటి కథ మహేష్ బాబు- ఆర్తీ అగర్వాల్ లతో ‘బాబీ’ గా వచ్చిందే. ఇద్దరి తండ్రులూ పగలు రగిలిన గూండాలే. ఇంకా మహేష్ బాబే నటించిన ‘ఒక్కడు’ లో మహేష్ బాబు హీరోయిన్ ని రహస్యం గా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఈ సినిమాలో హీరో అన్న హీరోయిన్ ని తెచ్చి రహస్యంగా ఇంట్లో పెట్టుకుంటాడు. ఈ రెండు పాయింట్ల తోనే మొత్తం సినిమా అంతా నడించింది. ‘బాబీ’ లో తండ్రులిద్దరూ హింసతో నగరాన్ని అట్టుడికిస్తూంటే, అదేం పట్టనట్టు హీరో హీరోయిన్లు ప్రేమలతో, డ్యూయెట్లతో ఎలా కాలక్షేపం చేస్తారో- అలా ఈ సినిమాలోనూ ఇంతే. భవానీ అనే వాడు కుటుంబాల్నే హతమారిస్తే, ఈ ప్రేమ జంటకి పెళ్ళే ముఖ్యమైపోవడం,  చనిపోయిన వాళ్ళకోసం ఒక్క కన్నీటి బొట్టూ రాల్చకుండా అసలేం జరగనట్టే తిరగడం...ఎలా సాధ్యం?
          నాల్గోది, హీరో పాత్ర పాసివ్ పాత్రగా తయారైందని తెలుసుకోలేదు. ఈ సినిమా మొత్తం మీద హీరో ఏం చేశాడు? చిట్ట చివర్లో మాత్రం తన మీదికి వచ్చిన విలన్ ని రియాక్టివ్ గా చంపి, పేలవమైన డైలాగు కొట్టడం  తప్ప? హీరోయిన్ కుటుంబాన్ని కాసేపు పక్కన పెడితే, కనీసం తన అన్నని చంపినందు కైనా హీరో అనే వాడు ఆ భవానీని చంపేందుకు సిద్ధమవ్వాలిగా? అలాగాక హీరోయిన్ తో పారిపోయి- పెళ్లి చేసుకుని- అమెరికా వెళ్లి పోవాలనుకోవడం ఏ బాపతు పాత్ర, ఏ రకం కథనం?
          ఐదోది, ఆకస్మిక ముగింపు. ‘బాహుబలి’ లో లాంటి ఆకస్మిక ముగింపు! ‘బాహుబలి’ కంటే ముందు ఈ సినిమా తీసినా ఆటోమేటిగ్గా అలాటి బిగ్ బడ్జెట్ సినిమా ముగింపే దర్శకుడికి వచ్చేసిందంటే – ఇక సందేహం లేదు, దర్శకుడి ఊహాశక్తి అపరిమితమైనది! ‘బాహుబలి’ లోని ముగింపు సైతం కలలో కన్పించేంత ఫోర్సుగా బిగ్ బడ్జెట్ సిన్మా హంగులు తనమీద స్వారీ చేస్తున్నాయి!
          ఉరుము లేని పిడుగులా క్లయిమాక్స్ రావడం దర్శకుడు చేతులెత్తేసిన తనాన్నే పట్టిస్తోంది.
          ఒక కనువిందైన దృశ్య ప్రదర్శన చేశాడు తనకున్న విజువల్ సెన్స్ తో. మున్ముందు ఇదే   విజువల్స్ సెన్స్ తో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంటూ దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే, ఇక చేయాల్సిందొకటే- ఏ కథ, ఎలాటి స్క్రిప్టు - స్క్రీన్ ప్లే, ఏ క్యారక్టరైజేషన్లు అనే విషయపరమైన  పరిజ్ఞానం పెంపొందించుకుని ఇలా నష్టపోకుండా సినిమాలు తీయడమే. కథా కథనాలూ పాత్ర చిత్రణ లనే మహాసముద్రంలో కొంత లోతుకైనా వెళ్ళగలగడమే...

సికిందర్










14, జులై 2015, మంగళవారం

రైటర్స్ కార్నర్

‘క్వీన్’ రచయిత పర్వేజ్ షేక్ 
        వికాస్ బహల్ దర్శకత్వంలో గతేడాది  క్వీన్  స్లీపర్ హిట్ గా నిల్చిన విషయం తెల్సిందే. కంగనా రణౌత్ నటించిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ బాలీవుడ్ హిట్ ఒకందుకు కూడా విమర్శకుల దృష్టి నాకర్షించింది : ఈ సినిమా బలమంతా దీని పరిశీలనాత్మకమైన స్క్రిప్టులో ఉన్నందున! ఈ స్క్రిప్టు రాసిన రచయిత పర్వేజ్ షేక్ దీనికి ముందు ఇదే విమర్శకుల చేత మొట్టి కాయలు వేయించుకున్న  ‘ఘన్ చక్కర్’  అనే డార్క్ కామెడీ రచయితే. దానికీ ఇప్పుడు ‘క్వీన్’ కీ రైటింగ్ పరంగా తేడా చాలా కన్పిస్తోంది. ఈ క్వాలిటీ ఎలా సాధించాడో ‘ఫస్ట్ పోస్ట్’ లో మిహిర్ ఫడ్నవిస్ కిచ్చిన ఇంటర్వ్యూలో సవివరంగా చెప్పుకొచ్చారు పర్వేజ్ షేక్...

బాలీవుడ్ అనే కీకారణ్యంలో మీరెలా వచ్చి పడ్డారు? రచయిత  కావాలనుకోవడం మీ చిరకాల కోరికా?  కొత్త రచయితగా మీరూ స్ట్రగుల్ చేసే వుంటారు..
          లేదు, నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ముంబాయి వచ్చింది సినిమా రైటర్ నవ్వాలని కాదు. యాడ్స్ రంగం మీద నాకు ఎక్కువ ఇంటరెస్టు. కాబట్టి కాపీ రైటర్ గా చేరాను.  అక్కడే వికాస్ బహల్ తో పరిచయమైంది. మేమిద్దరం ఒకే బ్రాండ్ యాడ్స్ కోసం పనిచేసేవాళ్ళం. అక్కడ మానేసి వికాస్ యూటీవీలో స్పాట్ బాయ్ గా చేరడంతో, నా కెరీర్  కూడా మలుపు తిరిగింది. ఒక రోజు నా దగ్గరేమైనా సినిమా కథలకి ఐడియా లున్నాయా అని అడిగాడు. నేనొక వన్ లైన్ అయిడియా చెప్పాను. అది అతడికి నచ్చి దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా కి చెప్పాడు. ఆయన డెవలప్ చేయమన్నాడు. ఈ స్క్రిప్టే 2013 లో ‘ఘన్ చక్కర్’  గా విడుదలయ్యింది. అలా నేనేమీ స్ట్రగుల్ చేయకుండానే సినిమా రచయిత  నయ్యాను..
‘క్వీన్’  ఆఫరెలా వచ్చింది?
          అది వికాస్ అయిడియా. ఒకమ్మాయి ఒంటరిగా హనీ మూన్ కెళ్ళే అయిడియాలోంచి   పుట్టిన కథ అది. వికాస్ నా మిత్రుడే కాబట్టి ఈ ఆఫర్ నాకే ఇచ్చాడు. నేను డెవలప్ చేశాను.
కంగనా ని దృష్టిలో పెట్టుకునే రాసినట్టున్నారు?
          రాయడానికి ముందు నుంచే కంగనా మా దృష్టిలో వుంది.
హిందీలో వచ్చే హీరోయిన్  ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయినెప్పుడూ నార్మల్ క్యారక్ట రైజేషన్ తో వుండదేమిటి? పైగా ఆడియెన్స్ తో కనెక్టివ్ గా కూడా వుండదు. ఇలా ఎందుకు జరుగుతోం దంటారు?
          హీరోల పాత్రలు కూడా ఇలాగే ఉంటున్నాయి లెండి. ఈ వైపరీత్యం హీరోయిన్  క్యారక్టర్లకే  ఉంటోందని అనుకోనవసరం లేదు. ప్రేక్షకులు కూడా తమ అభిమాన  హీరో హీరోయిన్లు మానవాతీ  తులుగానే వుండాలని కోరుకుంటారు. అయితే మల్టీప్లెక్స్  ప్రేక్షకుల ట్రెండ్ ప్రారంభమయ్యాక, కొత్త తరం దర్శకులూ రచయితలూ వస్తున్నాక- ఈ అసహజ ధోరణి కొంత తగ్గుతోంది. వీలైనంత వాస్తవికంగానే పాత్రల్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మేం తీసిన ‘క్వీన్’ తో బాటూ శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
‘క్వీన్’ స్క్రిప్ట్ రాయడంలో బాగా కష్ట పెట్టిన పార్టు ఏది? అందులో కమర్షియల్ – నాన్ కమర్షియల్ ఎలిమెంట్స్ మధ్య బ్యాలెన్స్ ని సాధించడానికి ఎంత ఇబ్బందిపడ్డారు?
          బాగా కష్ట పెట్టింది ఒకే ఒక్కటుంది. అది స్రక్చర్ ని సరైన పంథాలో పెట్టి ఆద్యంతం        ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చేసే విషయంలో. పాత్రే కథని నడిపించే సందర్భంలో మనకి తెలియకుండా అత్యుత్సాహంతో విషయాన్ని సాగలాగడమో, స్లో చేయడమో జరిగిపోయే ప్రమాదముంది. దీన్ని కాచుకోవ డం చాలా కష్టమై పోయింది. నేను తెలుసుకున్న మరో విషయమేమిటంటే,  మన ప్రేక్షకులకి సహనం బాగా తక్కువ. ఇక  కమర్షియల్, నాన్ కమర్షియల్ అనే ఆలోచనే చేయలేదు. చేతిలో ఉన్న కథతో ఉండాల్సినంత సిన్సియర్ గా వున్నాను తప్పితే, ఏవో కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గాయని       తొందరపడలేదు. కథ డిమాండ్ చేసే మేరకే వినోదాత్మకంగా చెప్తున్నామా లేదా అన్నదే ప్రధానంగా దృష్టిలో ఉంచుకున్నాను.
‘క్వీన్’ ముగింపులో-  ఆమ్స్ స్టర్ డామ్ లో కేఫ్ దగ్గర మనసు మార్చుకుని వచ్చిన విజయ్ ని రాణి అక్కడే తిరస్కరించి వెళ్లిపోయుంటే బావుండేదేమో? ఎందుకంటే, కథా ప్రారంభంలో ఢిల్లీలో కేఫ్ దగ్గర అతను ఆమెని రిజెక్ట్ చేస్తూ ఎంగేజ్ మెంట్ అయిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇలా ప్రారంభ ముగింపులు మ్యాచ్ అయ్యేవి కదా? ఫైనల్ సీనుని  అక్కడే ముగించకుండా, తిరిగి రాణి ఢిల్లీ వెళ్లి విజయ్ ని అతడింట్లో కలిసే పొడిగింపు అవసరమా?
          ఫైనల్ సీను చాలా  క్లిష్టమైనదే. రాణి క్యారక్టర్ కి, కథకీ ఓ ముగింపు నిచ్చే సీను అది. అది       లేకుండా మొత్తమంతా  అసంపూర్ణంగానే  వుంటుంది. ఆమ్స్ స్టర్ డామ్ లో విజయ్ కి ఏ విషయం చెప్పకుండా ఇండియాలో కలుస్తానని చెప్పి వెళ్ళిపోతుంది రాణి. హండ్రెడ్ పర్సెంట్ అతను వద్దనుకుని  ఇంకా ఆమె నిర్ణయానికి రాలేకపోయింది. అందుకే  ఇండియా వచ్చాక విజయ్ తల్లి చెప్పింది ఆమె నిర్ణయం తీసుకోవడానికి కీలకంగా  మారింది. ఆమె విజయ్ కి వెడ్డింగ్ రింగ్ తిరిగి ఇచ్చేస్తుందని ప్రేక్షకులు కూడా    ఊహించలేదు. అది వాళ్లకి సర్ప్రైజ్ ఎండింగ్ లా అన్పించి చప్పట్లు కూడా కొట్టేశారు!
మీరు రాసిన సీన్లు ఏవైనా మీకు బావున్నాయన్పించినవి, సినిమాలోంచి తీసేయడం జరిగిందా?
          అలాటిదేం లేదు, నిడివి దృష్ట్యా  ఏవైనా సీన్లు తీసేసి ఉండొచ్చు. నేను బాధపడింది లేదు.
          ‘ఘన్ చక్కర్’ ని అనవసరంగా తూర్పారబట్టినట్టు అన్పించలేదా? క్రిటిక్స్ ( కొందరు ప్రేక్షకులు కూడా) అందులో పాయింటు ని మిస్సయ్యారని మీకన్పించలేదా? లేకపోతే బ్యాడ్ మార్కెటింగ్ కారణం గా దానికి రావాల్సిన మైలేజీ రాలేదంటారా?? ఏం జరిగి ఉంటుందంటారు?

           ‘ఘన్ చక్కర్’ మీదొచ్చినంత భిన్నాభిప్రాయాలు ఇంకే సినిమా మీదా వచ్చి వుండవు.   దాన్ని ద్వేషించిన వాళ్ళు తీవ్రంగా ద్వేషించారు, ప్రేమించిన వాళ్ళు అమితంగా ప్రేమించారు. ‘ఘన్ చక్కర్’ ఓ డిఫరెంట్ మూవీగా వుండాలని మేం కోరుకున్నాం. ఆ  ప్రయత్నంలో కొంత వరకు సఫలమయ్యామని అనుకుంటున్నాను. దీనికి గర్విస్తాను. ఐతే పాయింటుని క్రిటిక్స్ పూర్తిగా మిస్సయ్యారనేది మాత్రం నిజం. దాన్నొక  ఒక రెగ్యులర్ థ్రిల్లర్ గా భావించుకుని రివ్యూలు రాశారు. దాన్ని రెగ్యులర్ థ్రిల్లర్ లాగా చూడకూడదన్న పాయింటుని మిస్సయ్యారు. ఒక డిఫరెంట్ మూవీని ప్రేక్షకులకి పరిచయం చేసే          అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారు. తర్వాత టీవీల్లో చూసిన ప్రేక్షకులకి  ఈ మూవీ కి ఇంత బ్యాడ్ రివ్యూస్ ఎందుకిచ్చారో అంతుబట్టలేదు. ఇక థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల విషయానికొస్తే, పోస్టర్లని బట్టి ఇది డొమెస్టిక్ కామెడీ అయివుంటుందనుకుని వెళ్లి-    వయొలెంట్ ఎండింగ్ తో వున్న డార్క్ కామెడీని చూసి థ్రిల్లయ్యారు!
మీ నెక్స్ట్ మూవీస్ ఏమిటి? దర్శకత్వం వహించే ఆలోచన ఉందా?
          ఇప్పుడిప్పుడే ‘ఫాంటమ్’ అనే పోలిటికల్ సెటైర్ స్క్రిప్టు రాయడం ముగించాను. ఇది కబీర్        ఖాన్ దర్శకత్వం వహించే మూవీ. సైఫలీ ఖాన్ - కరీనా కపూర్ లు నటిస్తారు. కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో ఇమ్రాన్ హాష్మీ నటించబోయే ‘షతిర్’ అనే మరో మూవీ కి స్క్రిప్ట్ పూర్తి చేశా. ప్రస్తుతం అనూజా చౌహాన్ రాసిన నవల ‘బాటిల్ ఫర్ బిటోరా’ కి స్క్రీన్ ప్లే రాసే పనిలో వున్నాను. దీన్నిఅనిల్ కపూర్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది. దర్శకత్వం మీద నాకు ఆసక్తి లేదు. ఇంట్లోంచి బయటి కెళ్ళా లంటేనే నాకు పరమ బోరు. రైటర్ గా హేపీగానే వున్నాను.
ఏఏ  సినిమాలు చూస్తూ మీరు పెరిగారు? మీ ఫేవరేట్ దర్శకులెవరు?
          రోజర్ మూర్ జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తూ, 80 లలో 90 లలో వచ్చిన బాలీవుడ్   సినిమాలు చూస్తూ పెరిగాను. నా కిష్టమైన దర్శకులు అలెగ్జాండర్ పైన్, మైకేల్ మన్, పాల్ గ్రీన్ గ్రాస్, ఉడీ అలెన్, ఫ్రిట్జ్ లాంగ్.. మొదలైన వాళ్ళు. మన విషయానికి వస్తే మన్మోహన్ దేశాయ్, హృషికేశ్ ముఖర్జ్జీ, జోయా అఖ్తర్, అనురాగ్ కశ్యప్ లు నా అభిమాన దర్శకులు.
రచయిత లవ్వాలనుకునే వాళ్లకి మీ సలహా?
          రాస్తూనే వుండాలి. ఐదు స్క్రిప్టులు రాశారంటే ఏదో ఒకటి బయటి కొస్తుంది. వేరే జాబ్ చేస్తూంటే రెండో స్క్రిప్టు ఓకే అయ్యే దాకా ఆ జాబ్ మానెయ్యకూడదు!

***



13, జులై 2015, సోమవారం

మహాయజ్ఞం!

స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి
తారాగణం: ప్రభాస్‌, రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్కా, రమ్యకృష్ణ, రోహిణి,  సుదీప్, నాజర్, ప్రభాకర్, అడివి శేష్, సత్యరాజ్ తదితరులు
కథ : వి. విజయేంద్రప్రసాద్‌, మాటలు : సి హెచ్ విజయ్ కుమార్, జి అజయ్ కుమార్
పాటలు : రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, శివ శక్తి దత్తా, ఇంద్రగంటి సుందర్, చైతన్య ప్రసాద్, నియోల్ సీన్, ఆదిత్య,  సంగీతం : ఎం ఎం కీరవాణి, ఛాయాగ్రహణం : కె.కె. సెంథిల్‌ కుమార్‌,
కళ: సాబు సిరిల్,  కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు,  నృత్యాలు : శంకర్, దినేష్ కుమార్, ప్రేమ్ రక్షిత్, జానీ, వస్త్రాలంకరణ : రమా రాజమౌళి, ప్రశాంతి త్రిపురనేని,  పోరాటాలు : పీటర్‌ హెయిన్స్‌,
వీ ఎఫెక్స్ దర్శకుడు : ఆదిల్ అదీలీ, యానిమేటర్ : శ్రీమనేందు భట్టా, డీఐ కలరిస్టు : బివిఆర్ శివకుమార్, శబ్ద గ్రహణం :  జస్టిన్ జోస్,
బ్యానర్ :
ఆర్కా మీడియా, సమర్పణ : కె. రాఘవేంద్రరావు,
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
 విడుదల : 10 జులై 2015

*
తెలుగులో హైకాన్సెప్ట్ మూవీస్ ఎప్పుడూ ఫాంటసీలుగా వుండడం పరిపాటే. ఐతే ఈసారి అత్యాధునిక టెక్నాలజీ ప్రసాదిస్తున్న వరాల్ని అందిపుచ్చుకుని ఫాంటసీతోనే అంతర్జాతీయ స్థాయికి ఎదగ గల్గింది మేకింగ్ పరంగా తెలుగు సినిమా. జాతీయ స్థాయిలోనే గుర్తింపు లేని తెలుగు సినిమాల దైన్యాన్ని పటాపంచలు చేస్తూ గర్వించదగ్గ గ్లోబల్ స్థాయికి తీసి కెళ్ళింది  ‘బాహుబలి’. దక్షిణ మెగా బడ్జెట్ సినిమాలకి ఏకైక గుత్తేదారుగా చెలామణీ అవుతున్న శంకర్ కంచుకోటని కూడా బద్దలు చేస్తూ రాజమౌళి రావడం, రాజమౌళి సినిమాల్లో నటించేందుకు తమిళ స్టార్లూ క్రేజ్ పెంచుకోవడం చూస్తే, శంకర్ కి గాభరా పుట్టించే ఘట్టంగానే నమోదవుతుంది ఈ చారిత్రిక బ్లాక్ బస్టర్ విడుదల. 

          ఈ మెగా వెంచర్ కి సాగిలపడి అసంఖ్యాక  ప్రేక్షకులూ  టికెట్టు ఒక్కింటికి వేలరూపాయలు ధారబోసి మెగా- రిచ్  ప్రేక్షకుల క్లబ్ లో చేరిపోయారు దర్జాగా. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వచ్చేసి తెలుగు వాళ్ళంటే మాద్రాసీలు కాదనీ, తెలుగు జాతి అని ఒకటి ప్రత్యేకంగా ఉందనీ, ఉత్తరాది ప్రజానీకానికి  చాటి చెప్తూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిపెట్టినట్టూ - రాజమౌళి కూడా వచ్చేసి ప్రపంచ దేశాలకి తెలుగు సినిమా అనేదొకటుందనీ, దాని విశ్వరూపం ఈ రేంజిలో ఉంటుందనీ ఎనౌన్స్ చేస్తున్న అరుదైన సందర్భమిది. తెలుగు ఫీల్డులోకి అడుగు పెట్టడానికి ఇంకా మీన మేషాలు లెక్కిస్తున్న హాలీవుడ్ కంపెనీలు కూడా ఇహ హడావిడి పడేంత  బడా బాక్సాఫీసు అంకెల సంరంభమిది.
          దేశంలో బాలీవుడ్, కోలీవుడ్ లతో బాటు,  టాలీవుడ్ లో కూడా ఇంతవరకూ రికార్డుల కెక్కిన కలెక్షన్ల మైలు రాళ్ళని పెకిలించేసి, కొత్త శిలాక్షరాలు రాస్తున్న ఈ మహా చిత్రరాజం గంగ వెర్రులెత్తించిన ప్రచారార్భాటం తో కమర్షియల్ గా మెగా సక్సెస్సే. మేకింగ్, మార్కెటింగ్ వ్యూహాలు రెండూ ఫలించాయి. అయితే ఇంతటి ఈ మహా చిత్రరాజాన్ని చూసిన, ఇంకా చూస్తున్న ప్రేక్షకుల కడుపులు నిండి పోతున్నాయా? మేకింగ్ పరమైన క్రియేటివిటీకి మెస్మరైజ్ అవుతూనే మాటర్ పరమైన క్రియేటివిటీకీ దాసోహమవుతున్నారా? ఇంతటి మహాచిత్ర రాజం కాస్తా మహోజ్వల చిత్రరాజంగా ప్రమోటవడానికి మాటర్ పరమైన క్రియేటివిటీ ఇంకా ఒనగూడాల్సి ఉందా? ఒకవేళ రెండు భాగాల ‘బాహుబలి’ ఈ మొదటిభాగంలో అలాటి రసాత్మక సౌందర్యం మిస్సయి వుంటే వచ్చే యేడు రాబోయే రెండో భాగంలో దీన్నీ ఆశించవచ్చా? ఏమో మనకేం తెలుసు? 
          అంతవరకూ ఈ మొదటి భాగంలో  విషయమేమిటో చూడ్డమే మన పని!కథేమిటంటే...

      అరణ్యాల్లో బతికే శివుడు ( ప్రభాస్) కి ఎక్కడో ఆకాశమంతెత్తున్న నీటి కొండ (జలపాతం) మీద ఏముందో  చూడాలన్న కోరిక చిన్నప్పట్నుంచీ వుంటుంది. ఆ జలపాతం కింద కొండజాతి వాళ్ళ మధ్య పెరిగిన అతడికి తన జన్మ రహస్యం తెలీదు. మాహిష్మతి రాజ్య వారసుడుగా పుట్టీ పుట్టగానే జరుగుతున్న కుట్ర నుంచి తప్పిస్తూ నాన్నమ్మ శివగామి ( రమ్యకృష్ణ) ఆ పసిబిడ్డగా వున్న అతణ్ణి తీసుకుని పారిపోతూ జలపాతం ధాటికి తట్టులేక ప్రాణాలు విడుస్తూ దేవుణ్ణి ప్రార్ధిస్తుంది. తెల్లారి ప్రాణం లేని ఆమె చేతిలో బతికున్న పసిబిడ్డ కొండజాతి వాళ్లకి దొరుకుతుంది. శివుడు అని నామకరణం చేసి పెంచుకుంటుందామె ( రోహిణి). 

          ఊహ తెలిసినప్పట్నించీ శివుడు ఆ నీటి కొండ మీద ఏముందో చూడాలని విఫలయత్నాలు చేస్తూంటాడు. కుండపోతలా కురిసే ఆ జలపాతం కొండచరియ అనేక సార్లు ఎ క్కుతూ జారి పడుతూంటాడు. అలా ఒకసారి జారి పడ్డప్పుడు మనిషి మొహం ఆకారంలో వున్న చిప్ప ఒకటి కొండమీంచి వచ్చి పడుతుంది.  దాంతో ఇసుకలో బొమ్మ చేసి చూస్తే అది అమ్మాయి రూపం దాలుస్తుంది. దీంతో కొండ పైన అమ్మాయి ఉందని నిర్ధారణ అవుతుంది. ఇంకాగలేక కొండెక్కేస్తూంటే పాడుకుంటూ ఆ అమ్మాయి అవంతిక (తమన్నా) ప్రత్యక్షం!
            అవంతిక ఒంటి చేత్తో శత్ర్రువుల్ని చితగ్గొట్టే వీరవనిత.  ఈమె ప్రేమలో పడిపోయిన శివుడు ‘కళాత్మకం’  గా ప్రేమిస్తూంటాడు. ఈమెకో లక్ష్యం వుంటుంది-అది మాహిష్మతి రాజ్యంలో బందీగా వున్న తన కుంతల రాజ్యపు స్త్రీ దేవసేన ( అనుష్కా) ని విడిపించుకోవడం. ఈమెని తనతో ప్రేమలో, ఆ తర్వాత పడకలో పడేట్టు చేసుకున్న శివుడు ఈమె లక్ష్యాన్ని తన లక్ష్యంగా తీసుకుని, దేవ సేనని విడిపించుకోవడానికి మాహిష్మతి రాజ్యంలోకి రహస్యంగా ప్రవేశిస్తాడు. అక్కడ ఒక సంఘటనలో అతణ్ణి చూసిన బానిసలు బాహుబలీ అని హోరెత్తిస్తారు.
       ప్రజల్ని బానిసలుగా చేసి క్రూరంగా పాలిస్తున్న మాహిష్మతి రాజ్యాధిపతి భల్లాల దేవుడు ( రానా) ఈ బాహుబలి భజనతో  చిర్రెత్తి పోతాడు.  అక్కడే పాతికేళ్ళూ తను బందీగా ఉంచిన దేవసేనని శివుడు తీసుకుని పారిపోవడంతో రెచ్చిపోయి సైన్యాన్ని ఎగదోస్తాడు. ఆ పోరాటంలో భల్లాల దేవుడి నమ్మిన్న బంటు కట్టప్ప ( సత్యరాజ్) శివుణ్ణి చంపబోతూ గుర్తు పట్టి ఆగిపోతాడు. ఇలా ప్రతీ వాడూ తనని గుర్తు పట్టి బాహుబలీ  అని ఎందుకంటున్నారో అర్ధంగాక, ‘నేనెవర్నీ?’ అని నిలదీస్తాడు శివుడు.
          శివుడు ఎవరు? బాహుబలి అసలెవరు? దేవసేనతో సంబంధ మేమిటి? భల్లాలదేవుడు ఎందుకామెని బంధించాడు? శివగామి పాత్రేమిటి? మొదలైన ప్రశ్నలకి సమాధానాలు  ఇక్కడ్నించీ సాగే కథలో తెలుస్తాయి. 
ఎవరెలా చేశారు?
   ఈ ద్విపాత్రాభినయంతో ప్రభాస్ ఏం చేయడానికీ ఇంకా ఈ రెండు భాగాల కథలో పాత్రల పరంగా కొలిక్కి రాలేదు. పాత్రలింకా రసకందాయంలో పడలేదు. పోషించిన శివుడు- బాహుబలి ద్విపాత్రాభినయాల్లో పాత్రల పరంగా ఎమోషనల్ గా ప్రభాస్ ఎలా ఎక్కడ ప్రేక్షకులతో కనెక్ట్ అవగలడో రెండో భాగంలోనైనా  చూపిస్తారేమో ఎదురుచూడాలి. శివుడిగా మొదటి భాగంలో కొండెక్కా లన్న అబ్సెషన్ తో సాహసకృత్యాలు, అవంతిక తో ప్రేమకలాపాలు, మంచుకొండల్లో పోరాటం, శివలింగాన్ని జలపాతం దగ్గరికి మోసే, భల్లాల దేవుడి వంద అడుగుల విగ్రహం కింద పడిపోకుండా కాపాడే, దేవసేనని తీసుకుని పారిపోయే ఘట్టాల్లో -  ఇంకా పాత్ర ఎస్టాబ్లిష్ కాకపోవడం వలన నటన ప్రేక్షకులు ఫీలయ్యేట్టు ఏమీ లేదు. 
          ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రభాస్ పోషించిన బాహుబలి రెండో పాత్ర కూడా నలభై నిమిషాలపాటు సాగే భీకర యుద్ధ దృశ్యాల్లో వీరోచితంగా పాల్గొన్నాక ఆగిపోవడం చేత, మిగతా ఫ్లాష్ బ్యాక్ ని రాబోయే రెండో భాగం సినిమా కోసం అట్టి పట్టడం వల్ల, ఈ పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అవక, ఈ సీనియర్ పాత్రలో కూడా ప్రభాస్ తన నటనతో కనెక్ట్ కాలేక పోయాడు.
        ఈ మొదటి భాగం లో అసంపూర్ణంగా వున్న ఫ్లాష్ బ్యాక్, రెండో భాగంలో పూర్తయితే గానీ ప్రభాస్ నటించిన శివుడుతో బాటు - బాహుబలి పాత్రలు రెండూ ఏమిటో అర్ధంగావు, ఎస్టాబ్లిష్ కూడా కావు.  అంతవరకూ ప్రేక్షకులతో దోబూచులాటలే. పాత్రల్ని ప్రేక్షకులు ప్రేమించాలంటే, ఇన్వాల్వ్ అవ్వాలంటే ముందు ఆ పాత్రలేమిటో  అర్ధమవ్వాలి. కనుక ఎస్టాబ్లిష్ కాని ఈ ద్విపాత్రాభినయాల్లో నటనల గురించి, టాలెంట్ గురించీ అప్పుడే ఏమీ మాట్లాడుకోలేం. మిగతా అన్ని పాత్రలూ అవసరానికి మించిన ఎక్స్ పొజిషన్ తోఅర్ధమవుతూ, ప్రధాన కథలో ప్రభాస్ శివుడి పాత్ర, ఫ్లాష్ బ్యాక్ లో బాహుబలి పాత్ర రెండూ మాత్రం అర్ధోక్తిలో ఉండిపోవడంతో,  ఎటూ న్యాయం చేసే అవకాశం దక్కలేదు ప్రభాస్ కి!  
          వచ్చే రెండో భాగంలో ఈ రెండు పాత్రలకి లక్ష్యాలేర్పడితే తప్ప ఇవి ఎమోషనల్ గా ఆడియెన్స్ తో కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. అప్పుడుగానీ ప్రభాస్ ఏం ప్రూవ్ చేశాడో చెప్పగలం.
          అడవి దున్నతో  దుమ్మురేపుతూ పోరాటంలో పాల్గొని ఎంట్రీ ఇచ్చిన రానా కూడా డిటో. ఈ పాత్ర చిత్రణ కూడా అర్ధాంతరంగానే ముగియడంతో ఇదేమిటో ‘బాహుబలి -2’ లోగానీ తేలేట్టులేదు. అప్పటివరకూ ఎంత గుర్తుండి పోయేలా నటించాడో,  నటనల్లో ఎన్ని మార్కులు పడతాయో రానా కూడా వెయిట్ చేయాల్సిందే. 
          కానీ అనూష్కా పోషించిన డీగ్లామరైజుడు దీవసేన పాత్ర, రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర, సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర - ఈ మొదటి భాగంలోనే సంఘర్షణలో పడ్డాయి కాబట్టి వీటికో వెయిట్ వచ్చి ఎమోషనల్ గా కనెక్ట్ అవగల్గాయి. ఈ పాత్రలకి లక్ష్యాలు కూడా వుండడం చేత వీటిపై మనకి సానుభూతి పుడుతుంది. ఈ సానుభూతిని రాబట్టుకునే నటనలతో చక్కగా రాణించారు ముగ్గురూ.
          మహా యుద్ధంలో కాలకేయుడి పాత్రలో ప్రభాకర్ అప్పుడే పుట్టి అప్పుడే నశించే పాత్ర. మాహిష్మతి వర్గాలతో వెర్బల్ గా సంపర్కం లోకి వెళ్ళే ఆలోచన కూడా చేయకుండా ఏకపక్షంగా కావలసినంత రాక్షసత్వంతో విర్రవీగిపోయాడు. యుద్ధ కారణాలకి తగిన నేపధ్య బలం లేకపోవడంతో ఈ పాత్ర కాగితం పులిలా తేలింది.  
         అందరికంటే ఎక్కువ లక్ష్యం వుండి కార్యాచరణలో ఉన్న పాత్ర తమన్నాది మాత్రమే. ఈ సంఘర్షణతో ప్రేక్షకులని ఆకట్టుకోగలిగే స్థితిలో ఈమె పాత్ర వుండడం చేత, పాత్ర అర్ధమైపోయి రెండో పార్టు దాకా ఆగనవసరం లేకుండా నటనలో మార్కులు కొట్టేసింది. ఈ సినిమా మొత్తం మీద పూర్తిగా ఎష్టాబ్లిష్ అయిన పాత్ర ఇదొక్కటేనని చెప్పాలి.
          అయితే ఈమె పాత్రచిత్రణలో కూడా లొసుగులు లేకపోలేదు. ఫైనల్ గా దేవసేనని విడిపించే ఆపరేషన్ని నాయకుడు ఈమెకి అప్పగిస్తున్నప్పుడు, ఈమెకి తెలియకుండా ఈమె చేతిమీద శివుడు పొడిచిన పచ్చ బొట్టు చూసి- ఈమె నిబద్ధతని ప్రశ్నిస్తాడు. అప్పుడీమె ఈ షాకులోంచి తేరుకుని, తనకి ప్రేమలో పడే ఉద్దేశం లేదని ప్రతిజ్ఞ చేస్తుంది. కానీ అక్కడ్నించీ ఆపరేషన్ కి బయల్దేరాక శివుణ్ణి వెతుక్కుంటుంది. అతడితో ప్రేమలో పడి  సర్వస్వం అర్పించుకుని ఆపరేషన్ సంగతే మర్చిపోతుంది. ఆ ఆపరేషన్ ని శివుడు మీదేసుకుని బయల్దేర తాడు. ఇంత ఫూలిష్ గా ఈమె ఎలా ప్రవర్తించినట్టు? ఇప్పుడు నాయకుడికి ఎలా మొహం చూపిస్తుంది? ఆ నాయకుడు ఊరుకుంటాడా? అతడి దృష్టిలో శివుడెవరు ఆపరేషన్ కి వెళ్ళడానికి?

***
      ఇక సాంకేతికాంశాల్లోకి వెళితే, విజువల్ వండరే గానీ, మ్యూజికల్ పండుగ కాదు. కీరవాణి చేతిలో బాణీలు ఎందుకో ఈసారి క్యాచీగా పలకలేకపోయాయి. మళ్ళీ ఓ ‘మగధీర’ మ్యాజిక్ ని ఈ ‘బాహుబలి’ అనే పెద్దన్న లాంటి సినిమా ( ‘మగధీర’ కి పెద్దన్న’ బాహుబలి’) నుంచి కూడా ఆశిస్తారెవరైనా. కానీ ఈ ఇద్దరి బాణీలకీ పురుడు పోసిన కీరవాణి ఒక్కరికే న్యాయం చేయగల్గారు. ఇవ్వాళ్ళ కూడా పెద్దన్నని త్రోసిరాజని చిన్నోడు  ‘మగధీర’ క్యాచీ పాటలు ఇంకా మెదులుతూనే వున్నాయి.   సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, ఆదిల్ అదీలీ గ్రాఫిక్స్ సృష్టి – మహా జలపాతం, మంచు కొండల ఉత్పాతం, యుద్ధ దృశ్యాలూ వంటి చిత్రణల్లో  ఈ ఇద్దరి పనితనం హాలీవుడ్ బాసుల్ని ఒకసారి ఇటు చూసేలా చేస్తాయి. కళాదర్శకుడు సాబు సిరిల్ మహా కట్టడాలు హాలీవుడ్ ‘బెన్హర్’ కేం తీసిపోవు. పీటర్ హెయిన్స్ కొరియోగ్రఫీలో నిమిషనిమిషానికీ  మారిపోయే యుద్ధ తంత్రాల వార్ సీన్స్  ని ఏకధాటిగా నలభై నిమిషాల పాటూ నిలబెట్టడం ఒకెత్తు.  ‘బెన్హర్’ లో రధప్పందాల దృశ్యాల చిత్రీకరణని తలపించే ఈ యుద్ధ దృశ్యాల్లో కంటిన్యూటీ పరమైన లోపాలూ లేకపోలేదు. సినిమా ప్రారంభంలో జలపాతంలో చనిపోయిన శివాగామి ఎత్తి పట్టుకున్న చేతిలో పసిబిడ్డ సీను మెలోడ్రామా కాబట్టి అందులో లాజిక్ చూడనవసరం లేదు. అలాగే నీటిలో వున్న అవంతిక చేతి మీద ఆమెకి స్పర్శ తెలియకుండా, నీటిలో కరిగిపోయే రంగులతో శివుడు పచ్చ బొట్టు ఎలా పొడుస్తాడో కూడా మెలోడ్రామా మాటున చెల్లిపోయే లాజిక్కే. కానీ సన్నివేశాల్లో కంటిన్యూటీ దెబ్బతింటే ఆస్వాదనకి లాజిక్ అడ్డుపడుతుంది. ఎడిటింగ్ లో కూడా సవరించలేనంత కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ యుద్ధ సన్నివేశాల్లో చొరబడిపోయాయి. 


        ఈ ఉర్రూతలూగించే యుద్ధ దృశ్యాలూ వెరసి చూస్తున్నంత సేపూ ఇంకా ఇంకా చూడాలన్న ఆసక్తి రేపే దృశ్య వైభవం యావత్తూ ఈ ‘బాహుబలి’ సొంతం. మేకింగ్ లో ఇది క్రియేటివ్ వండర్, సందేహం లేదు. ఇండియాలోనే ఇలా ఇంకో దర్శకుడూ నిర్మాతా సాహసించలేని మహత్కార్యానికి  ఒక తెలుగు దర్శకుడూ నిర్మాతలూ పూనుకోవడం చూసైనా మిగతా దేశమంతా గర్వించాలి తప్పదు. శేఖర్ కపూర్ అన్నట్టు ‘బాహుబలి’ లాంటి సినిమాలు తీసే దర్శకులు బాలీవుడ్ లోనే లేరు.స్క్రీన్ ప్లే సంగతులు

           ఒక పెద్ద కథని రెండు భాగాలుగా చేసి, రెండు సినిమాలుగా తీస్తునప్పుడు మొదటి సినిమాని కేవలం రెండో సినిమాకి పైలట్ గా తీయవచ్చా? ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? లేదని అనేక విభజిత భాగాల సినిమాలు చెప్తున్నాయి. మొదటి భాగం సినిమా కూడా ఒక పూర్తి స్థాయి సినిమా కుండే కథా నిర్మాణం తోనే వుంటుంది. కాకపోతే ఒక పూర్తి స్థాయి సినిమా ఎక్కడ ఇంటర్వెల్ తో ఆగుతుందో, ఆ ఇంటర్వెల్ నే ముగింపుగా చేసుకుని  మొదటి భాగంగా తీసే సినిమా ముగియవచ్చు. అంటే అర్ధం అప్పటికి తిరుగులేకుండా కథ మిడిల్ విభాగంలో పడితీరాలన్న మాట- అప్పుడే మొదటి భాగాని కి అర్ధంపర్ధం.

            అలాకాకుండా బిగినింగే మొదటి భాగమంతా ఆక్రమిస్తూ, స్క్రీన్ ప్లే లో ఆ బిగినింగ్ విభాగం కూడా ముగియకుండానే, బిగినింగ్ కే  బ్రేక్ ఇచ్చేసి సినిమాని ముగిస్తే, మొత్తం తీసిన మొదటి భాగమంతా అర్ధం లేకుండా పోతుంది. చూశామంటే ఏదో అద్భుత దృశ్యవైభవాన్ని గాంచామని
 అన్పిస్తుందంతే, అద్భుత దృశ్య కావ్యాన్ని మాత్రం కాదు!
          ఒక పూర్తి స్థాయి సినిమా కథని మిడిల్ లోకి తీసికెళ్ళకుండా,  బిగినింగ్ కే బ్రేక్ ఇచ్చి, ఇంటర్వెల్ వేస్తే ఎంత అర్ధరహితంగా వుంటుందో ఊహించండి.
          ‘శివ’ అనే సినిమాని నాగార్జున సైకిలు చెయిన్ తెంపి తిరగబడే బిగినింగ్ ముగింపు ఘట్టాన్ని అక్కడ పెట్టకుండా, సెకండాఫ్ లో ఎక్కడో పెట్టుకుని ఇంకెప్పుడో  మిడిల్ ప్రారంభిస్తాం మా ఇష్టమని, ఇంటర్వెల్ దాకా బిగినింగ్ దృశ్యాల్నే సాగలాగి, ఓ సరదా కాలేజీ సీన్ మీద ఇంటర్వెల్ వేసి వుంటే  ఎలా ఉండేదో- రెండు భాగాల సినిమాల్లో మొదటి భాగం ముగింపు కూడా అలాగే తయారవుతుంది. 
          ‘బాహుబలి’ మొదటి భాగంలో మనకు చూపించిందంతా  కథగా ఇంకా ప్రారంభం కాని బిగినింగ్ కథా విభాగం ( మొదటి అంకం లేదా ఫస్ట్ యాక్ట్) మాత్రమే.. ఇది కూడా ఇంకా బ్యాలెన్సు పెట్టి సినిమాని ఆకస్మికంగా ముగించడమే. ఇన్ని గంటలు నడిచినా  ( రెండు గంటల నలభై నిమిషాలు) మిడిల్ కథా విభాగం ( రెండో అంకం లేదా సెకండ్ యాక్ట్) లోకి ఈ మొదటి భాగం సినిమా ఇంకా వెళ్ళనే లేదు. అంటే అసలు కథ ప్రారంభమే కాలేదు. ప్రారంభించిన పాత్రల పరిచయం, కథా నేపధ్య పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, అంతిమంగా సమస్య ఏర్పాటు అనే నాల్గు బిగినింగ్ విభాగపు టూల్స్ లో మొదటి రెండే ప్రయోగించారు ఈ సినిమా సాంతం. ఇంకా సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, అంతిమంగా సమస్య ఏర్పాటు అనే మిగిలిన రెండు టూల్స్ జోలికే వెళ్ళ లేదు. ఇలా బిగినింగ్ బిజినెస్ కూడా మొదటి భాగంలో పూర్తి కాలేదు. ఈ లెక్కన కథని సమగ్రంగా తీయడానికి రెండు కాదు, మూడు భాగాలుగా తీయాల్సి వస్తుందేమో!

***
   స్క్రీన్ ప్లే ఎపిసోడ్లుగా ఇలా సాగుతుంది..మొదట శివుడి పాత్ర పరిచయం కొండెక్కాలన్న కోరికతో కలిపి ఒక ఎపిసోడ్,  తర్వాత అవంతిక పాత్ర పరిచయం ఆమెకున్న లక్ష్యాన్ని యాక్షన్ తో చూపిస్తూ ఒక ఎపిసోడ్, ఆ తర్వాత కట్టప్ప పాత్ర పరిచయం అస్లం ఖాన్ (సుదీప్) పాత్రతో కలిపి  ఒక ఎపిసోడ్, దీని తర్వాత భల్లాల దేవుడి పాత్ర పరిచయం దున్నతో పోరాటంతో ఒక ఎపిసోడ్, మళ్ళీ దీని తర్వాత దేవసేన పాత్ర పరిచయం పుల్ల లేరుకోవడంతో ఒక ఎపిసోడ్..ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఈ పాత్రల పరిచయాలు విడివిడి ఎపిసోడ్లు మాదిరిగా ( సీన్లని జంబ్లింగ్ చేయ వీలుకాని పరిమితులుండే రంగస్థల నాటకాల్లో లాగా) నడుస్తుంది కథనం. దీని వల్ల హీరోగా వున్న శివుడి పాత్ర ప్రాధాన్యం తగ్గిపోవడమే కాకుండా, స్క్రీన్ మీద దాని నిడివి కూడా తగ్గిపోయింది ఫస్టాఫ్ లో.         


        ఫస్టాఫ్ లో అవంతిక ఎపిసోడ్ లో ప్రభాస్ శివుడి పాత్రకి లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. అంటే కథ మిడిల్ లో పడిందన్నట్టా? కాదు, ఎందుకంటే ఆ లక్ష్యం అతడికి ఎదురైన సమస్య వల్ల ఏర్పడింది కాదు, ఆమె అనుభవిస్తున్న సమస్యలోంచి పుట్టింది. అలా ఆమె లక్ష్యాన్ని తను సాధించడానికి ( దేవసేనని విడిపించడానికి ) బయలేదేరాడు. ఈ సెకండ్ హేండ్ గోల్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ లోనూ ఉన్నదే. తన కుటుంబాన్ని హతమార్చిన హంతకుల్ని హతమార్చ మంటుంది తమన్నా. తనది కాని సమస్యతో ఈ సెకెండ్ హేండ్ గోల్ తీసుకుని నటించిన ఎన్టీఆర్ పాత్రా ఆ తర్వాత  ఆ సినిమా ఏమయ్యాయో తెలిసిందే. 
          హీరో పాత్ర మరో పాత్ర గోల్ ని తీసుకుని తన గోల్ గా సాగిపోవచ్చు. అదెప్పుడంటే, ఆ మరో పాత్ర మరణించి నప్పుడు. మరణిస్తూ ఆ పాత్ర తన అసంపూర్ణ లక్ష్యాన్ని పూర్తి చేసి సమస్యని పరిష్కరించ మంటుంది. అప్పుడా లక్ష్యాన్ని హీరో పాత్ర స్వీకరించినప్పుడు ‘హేండ్ ఆఫ్’ క్యారక్టర్ గా మారుతుంది. దీనివల్ల ఎమోషన్ ఏమీ తగ్గకపోగా పెరుగుతుంది. ఎటొచ్చీ లక్ష్యాన్ని అందజేసిన పాత్ర కథలో వుండకూడదు. 
          కానీ ఇందుకు భిన్నంగా ‘ఊసరవెల్లి’ లోనూ మళ్ళీ తగుదునమ్మా అని ‘బాహుబలి’ లోనూ, రెండు సినిమాల్లోనూ ఇలాటి తమన్నా పాత్ర కథలో అలాగే కంటిన్యూ అయింది (తమన్నా పాత్ర లక్ష్యం శివుడు తీసుకుని వెళ్లి పోవడంతో తమన్నా పాత్ర ఇప్పటికి కనుమరుగైనా, రెండో భాగంలో ఈ కంటిన్యూటీ ఉండొచ్చని భావించవచ్చు). 
          దీంతో ఇంతా చేసి ఈ మాగ్నం ఓపస్ లాంటి సినిమాలో ప్రభాస్ శివుడి పాత్ర కాస్తా కేవలం సహాయ పాత్రగా మారిపోయిందా అన్న ఫీలింగ్ నివ్వడంతో బాటు, ఈ సెకండ్ హేండ్ గోల్ వల్ల పెరగాల్సిన హీరో క్యారక్టర్ ఆర్క్ పెరగకుండా చప్పున చల్లారి పోయింది! ఇది హై కాన్సెప్ట్ మెగా బడ్జెట్ మూవీ లక్షణమా?          

***
                                       
      దీని తర్వాతే వుంది అసలు షాక్. శివుడు అలా వెళ్లి దేవసేనని కాపాడు కొచ్చాక, ఆ లక్ష్యం పూర్తయి పోయింది సెకండాఫ్ ఆరంభంలోనే! ఇంకేముంది, కథ ముగిసినట్టేనా? అంటే కాదు – ఎందుకంటే, ఓపెన్ చేసిన మ్యాన్ హోల్ మూతలు ఇంకా వేయాల్సినవి చాలా వున్నాయి. అవంతిక ఎపిసోడ్ కి లాగే మిగిలిన భల్లాల దేవా, దేవా సేన, కాటప్పల ఎపిసోడ్లకీ ముగింపు లివ్వాల్సి వుంది. అవంతిక ఎపిసోడ్ కి మాత్రమే భరతవాక్యం పలుకుతూ హీరో లక్ష్యం పూర్తయినట్టు సెకండాఫ్ ఆరంభం లోనే చూపించడంతో – ఓస్ ఇది ప్రధాన కథ కాదనీ, ఇంకేదో ఉంటుందనీ ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మీద చన్నీళ్ళు పోసినట్టయ్యింది. 

          అంటే, ఇంటర్వెల్ కి ముందు  ఫస్టాఫ్ లో ఒకానొక ఘట్టంలో తమన్నా పాత్ర లక్ష్యాన్ని  హీరోకి బదలాయిస్తూ అదే ప్రధాన లక్ష్యంగా డైలాగు సహితంగా బిల్డప్ ఇవ్వడం చాలా పొరపాట న్న మాట! దీనివల్ల ఏం జరిగిందంటే, అంతలోనే ఆ లక్ష్యం పూర్తయ్యాకా ఆడియెన్స్ ని చీటింగ్ చేసి నట్టయింది. బాబూ, ఈ కథ దేవసేనని కాపాడ్డం గురించి కాదురా నాయనా అని పరిహసించి నట్టయింది.
          ఇలా ఎందుకు జరిగిందంటే, ఏం విత్తితే అదే మొలకెత్తుతుందన్నట్టు - ఇంతవరకూ ఈ ఎపిసోడ్లమయమైన కథనం దాని సహజ లక్షణం కొద్దీ స్టాప్ అండ్ స్టార్ట్ కథన టెక్నిక్ నే డిమాండ్ చేసింది. ఫలితంగా అప్పుడే పుట్టిన హీరో లక్ష్యం అప్పుడే పూర్తయి ఆ కథనం ‘స్టాప్’ అయ్యింది, ఇక మరో పాయింటు తో మరో కథనాన్ని ‘స్టార్ట్’ చేయాలి. అలా ‘స్టార్ట్’ అయిందే ‘నేనెవర్నీ?’ అన్న శివుడి ప్రశ్నతో మొదలైన ఫ్లాష్ బ్యాక్ అనే మరో ఎపిసోడ్!
          ఫస్టాఫ్ లో అలా డైలాగు సహితంగా హీరోకి ప్రధాన లక్ష్యంకాని సెకండ్ హేండ్ లక్ష్యాన్ని ప్రకటించకుండా, కేవలం ఆవంతిక పాత్ర లక్ష్య సాధనలో సహాయపడే పాత్రగానే శివుడితో  కథనం నడిపి వుంటే ఆడియెన్స్ కి చీటింగ్ ఫీలింగ్ కలక్కుండా వుండేది. ఒక సినిమాలో ఒక హీరోకి ఒకే లక్ష్యం వుంటుందనేది, మధ్యంతర లక్ష్యాలుండవనేది కామన్ సెన్సే తప్ప అంతరిక్ష సైన్సు కాదుగా?

***

***      మరి హీరోకి అసలంటూ తనదైన లక్ష్యం ఎప్పుడు ఏర్పడినట్టు? ఈ మొదటి భాగం లో ఏర్పడే అవకాశమే లేదు. సెకండాఫ్ ఆరంభంలో లో దేవసేనని విడిపించాకా, ‘నేనెవర్ని?’ –అన్న ప్రశ్నతో మొదలైన ఫ్లాష్ బ్యాక్ పూర్తయితే గానీ, అప్పుడు తానెవరో తెలుసుకున్న హీరో తన లక్ష్యం ఏమిటో తెలుసుకో గలుగుతాడు. కానీ ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా సెకండాఫ్ లో పూర్తయితే కదా! కాబట్టి ఇలా మొదటి భాగంలో హీరోకి లక్ష్యం ఏర్పడకుండా పోయింది. సినిమా ముగించినా బిగినింగ్  విభాగం ఫ్లాష్ భాక్ తో సహా ఇంకా బ్యాలెన్సు వుండి పోవడంతో! 
          ఇప్పుడు సినిమా అనే కళారూపానికి అత్యంత ప్రధానమైన కథాత్మ, ఫీల్, ఆత్మిక దాహం, రసాత్మక అనుభవం- ఏదైనా కావొచ్చు- వీటి గురించి మాటాడుకుంటే-  ఏ సినిమా కథకైనా బిగినింగ్ విభాగం ముగిసి ఒక సంఘర్షణతో, ఒక సమస్యతో పోరాటం లక్ష్యంగా మిడిల్ విభాగం ప్రారంభం కానంత వరకూ ఆడియెన్స్ తాదాత్మ్యం చెందలేరు. పాత్రతో కనెక్ట్ కాలేరు. స్క్రీన్ ప్లే కి గుండె కాయలాంటి మిడిలే లేకపోయాక ఇంకే దృశ్య వైభవాలూ ఆ లోటుని భర్తీ చేయలేవు. 
          ఆడియెన్స్ పట్టుకు ప్రయాణించడానికి ఒక పాయింటూ ఏర్పాటుకాక, ఆ పాయింటు వల్ల ఉత్పన్నమయ్యే భావోద్వేగాలూ అనుభవించలేకా, detached గా ఉండిపోవాల్సి వచ్చింది. టీవీ సీరియల్ చూసినట్టుందని ఒక ప్రేక్షకుడు వ్యాఖానించడానికి కారణమిదే. ఇంత ప్రతిష్టాత్మకమైన సినిమాని పట్టుకుని టీవీ సీరియల్ చూసినట్టుందని చెప్పుకునే పరిస్థితా!
          ఈ సినిమాలో ట్రాయ్, థోర్, 300, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అవతార్ ల వంటి హాలీవుడ్ ఫాంటసీల ఛాయలున్నాయని ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ పత్రికలు కోడై కూస్తున్నాయి. ఏ ఛాయలు లేకుండా ఏ సినిమా వుండదు. దీన్నలా ఉంచితే, దర్శకుడు రాజమౌళి ఏవో సినిమాల మేకింగ్ మంత్రా కి ప్రభావితుడై నట్టుగానే, ‘బెన్హర్’ లాంటి కొన్ని సుదీర్ఘ నిడివి గల సినిమాల కథా నిర్మాణాన్ని కూడా గమనించి వుండాల్సింది. మూడున్నర గంటల నిడివిగల బెన్హర్ ని రెండు భాగాలు చేసి విడుదల చేయలేదు. ఏకమొత్తంగా రిలీజ్ చేశారు. సినిమా ఇంత నిడివి వుంది కదా అని సకాలంలో కథలోకి వెళ్ళకుండా కాలక్షేపం చేశారా? లేదే? మొదటి పావు గంటలోపే  పాత్రల పరిచయం, హీరో లక్ష్యం వగైరాలతో కూడిన బిగినింగ్ విభాగాన్ని ముగించేసి కథలోకి ( మిడిల్ విభాగం లోకి) వెళ్ళిపోయారు. హీరో ప్రాణమిత్రుడనుకున్న వాడు తల్లినీ చెల్లినీ కారాగారం పాల్జేసి తనని  దేశాంతరం పట్టించడంతో ముగుస్తుంది బిగినింగ్ విభాగం. ఈ ప్రతీకార భావం తో రగిలిపోయే హీరో సఘర్షణతో ఇక ప్రారంభమవుతుంది మిడిల్ విభాగం. ఇది సుదీర్ఘంగా సెకండాఫ్ లో రథప్పందాల ఘట్టం దాకా సాగి ముగుస్తుంది. రథప్పందాల్లో ఆ మిత్ర ద్రోహిని ఓడించి పగదీర్చుకోవాలన్న పరిష్కార మార్గంతో హీరో ఉద్యుక్తుడవడం తో ఎండ్ విభాగం (క్లయిమాక్స్) ప్రారంభమౌతుంది.
          ఇక్కడ ఎందుకని మిడిల్ విభాగానికి అంత నిడివి ఇచ్చివుంటారు ? సినిమాకి ఇదే గుండెకాయ కాబట్టి. మిడిల్ విభాగంలోనే కథాత్మ, ఫీల్, తదాత్మ్యత, రసాత్మకత ఏర్పాటై ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు కాబట్టి. వీటి ప్రభావంతో హీరోని తమ వాణ్ణిగా చేసుకుంటారు కాబట్టి. అదనంగా ‘బెన్హర్’ లో ఇంకో హంగు జత చేశారు. అది ప్రేక్షకుల ఆత్మిక దాహానికి సంబంధించి. ఈ కల్పిత కథలోనే ఏసుక్రీస్తు పాత్రనీ లీలామాత్రంగా చూపిస్తూనే  భక్తి రసంతో కూడా ప్రేక్షకులు ఊగిపోయేలా చేశారు!
          కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ లోనూ ఈ ఆధ్యాత్మిక కోణాన్ని కల్పించడం ఆశ్చర్య  పరుస్తుంది. అది విప్లవ సినిమా. విప్లవ సినిమాలో భక్తి రసమేమిటి? లేకపోతే  సినిమా డ్రైగా అన్పించేట్టుంది. కనుక వీరత్వమున్న అల్లూరి పాత్రకి దైవత్వాన్ని కూడా ఆపాదించి ప్రేక్షకుల్ని భక్తి రసంతో కూడా ఓలలాడించారు. ఇప్పుడు ఈ సీజీ, వీ- ఎఫెక్స్ ల టెక్నాలజీల కాలంలో జానపదాలో పౌరాణికాలో తీస్తున్నప్పుడు, కథా కథనాల పరంగా కాస్త పాత క్లాసిక్స్ ని గైడ్ గా వాడుకుంటే తప్పేమిటి?

***
          ముట్టుకో కూడని పాసివ్ పాత్రలతో కథల్ని, ఎండ్ సస్పెన్స్ కథనాల్ని, ఇంటర్వెల్లో కథ మధ్యకి విరిగిందని కూడా తెలుసుకోకుండా సెకండాఫ్ సిండ్రోమ్ రచనల్ని; ఎంత కాలం గడిచినా, ఇంకెన్ని ఫ్లాపులు పోగు పడినా, మిడిల్ విలువని గుర్తించకుండా అదే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలనీ యధేచ్చగా రాసేయడం అలవాటైనప్పుడు మార్పేం వస్తుంది? ఒకసారి ఈ పక్క  పటం చూడండి-

 మొదటి బొమ్మలో 1, 2, 3 అనే వృత్తాలు బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాల్ని సూచిస్తాయి. వీటి సైజుల్ని బట్టి స్క్రీన్ ప్లే లో వీటి పరిమాణం ఎంతుంటుందో తెలుస్తోంది. మధ్యలో మిడిల్ కేంద్రంలో MP అని గుర్తు వుంది. ఇది మిడ్ పాయింట్ లేదా ఇంటర్వెల్ ఘట్టం. ఇది ఆమోదనీయమైన, సార్వజనీన వృత్తాల ఏర్పాటు. 
          రెండో బొమ్మ చూస్తే, బిగినింగ్ వృత్తం దీర్ఘ వర్తులాకారంగా సాగి – మిడిల్ వృత్తం భూభాగాన్ని సగానికి కబ్జా చేస్తూ ఇంటర్వెల్ ఘట్టాన్ని తాకింది. ఇంటర్వెల్ తర్వాత తనకి మిగిలిన సగ భూభాగంతోనే సరిపెట్టుకుంది మిడిల్ వృత్తం. ఎండ్ వృత్తం డిస్టర్బ్ కాలేదు. ఇది ఆమోదనీయం కాదు, కానీ ఫస్టాఫ్ –సెకండాఫ్ తరహా స్క్రిప్ట్ లకి అలవాటు పడిపోయిన సినిమాలకి దీంతోనే ఆడింది ఆటగా సాగిపోతోంది.
          మూడో బొమ్మలో చూస్తే, బిగినింగ్ వృత్తం ఇంకా చెలరేగి, ఇంటర్వెల్ తర్వాత మిడిల్ కి ఆ కాస్తా మిగిలిన సగ భూగంలో సగాన్నీ మింగేస్తూ సెటిలయ్యింది. దీంతో విధిలేక మిగిలిన సగం మిడిల్ వృత్తం వెళ్లి సర్దుబాటు కోసం ఎండ్ భూభాగం మీద దాడి చేసి కావలసినంతా దురాక్రమించేసింది.  కుయ్యోమని ఎండ్ మూల్గింది. దీన్నే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటారు. మిడిలే  వుండదు, వున్నా ఎక్కడో క్లయిమాక్స్ దగ్గరికి జరిగిపోయి బిక్కుబిక్కుమంటూ దాక్కుని వుంటుంది- ఇలావున్నాకా ఇంకా చెప్పుకోవడానికి కథేం వుంటుంది. కథంటే మిడిలే కదా? ఈ సమస్యే ‘బాహుబలి’ ది- రెండో భాగం కూడా విడుదలయ్యాక ఒక పూర్తి స్క్రీన్ ప్లేగా చూసినప్పుడు మాత్రమే!

           ఐతే ముందే చెప్పుకున్నట్టు, మొదటి భాగం సినిమా అంతా నడిచినా ఇంకా బిగినింగ్ ముగియలేదు కాబట్టి- ఈ బిగినింగ్- అంటే మొదటి భాగం ముగింపులో ఫ్లాష్ బ్యాక్ ఎక్కడికైతే వచ్చి ఆగిందో- అది సినిమా రెండో భాగం ప్రారంభం నుంచీ కొనసాగుతుందన్న మాట. ఆ ఫ్లాష్ బ్యాక్ బ్యాలెన్స్ భాగం, సినిమా రెండో పార్టులో వచ్చే  ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ లోపు ఎక్కడో పూర్తవ్వచ్చన్న మాట! . అప్పుడు గానీ హీరోకి ఏం చేయాలో లక్ష్యం ఏర్పడి మిడిల్ ప్రారంభం కాదన్న మాట!

***
          క మొదటిభాగం ఆకస్మిక ముగింపు విషయాని కొద్దాం. షోమాన్ రాజ్ కపూర్ కూడా ఇలాటిదే సుదీర్ఘమైన నిడివిగల సినిమా తీశాడు ‘బెన్హర్’ ని మించీ. ఆ సినిమా ‘మేరా నామ్  జోకర్’. దీని నిడివి నాల్గుంపావు గంటలు!  దీన్ని రెండు భాగాలుగా చేసి మాత్రం విడుదల చేయలేదు. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చి చూపించాడు. ‘బాహుబలి’ ని కూడా ఇలా ఒకే సినిమాగా రెండు ఇంటర్వెల్స్ తో విడుదల చేసి వుంటే ఎంత బావుండేదో! 
         కానీ మార్కెటింగ్ వ్యూహం అనేదొకటి వుంది. ఇకముందు హాలీవుడ్ లో కూడా విడుదలయ్యే  కొన్ని సినిమాలకి మార్కెట్ వ్యూహమే ప్రధానంగా రెండుమూడు భాగాలుగా చేయబోతున్నారు. ఐతే పాపులరైన నవలల ఆధారంగా తీస్తున్న సినిమాల విషయంలోనే ఈ వ్యూహం.  పాపులరైన నవలల మీద గల క్రేజ్ నుంచి  వీలైనంత సొమ్ము పిండుకోవాలని ఆ నవలల్ని  రెండుమూడు భాగాలుగా చేసి,  ఊరిస్తూ ఊరిస్తూ ఒకటొకటిగా తీసి సినిమాలు విడుదల చేస్తారన్న మాట.  ‘ట్విలైట్’ సాగా మూవీస్, ‘హంగర్ గేమ్స్’ పార్టుల వారీ సినిమాలూ ఈ వ్యూహంతో వచ్చినవే. ఇంకా ‘ఎవెంజర్స్’ రెండో భాగాన్ని కూడా రెండో భాగం, మూడో భాగం గా విడదీసి తీస్తున్నారు.  ‘జస్టిస్ లీగ్’ కూడా రెండు భాగాలుగా వస్తోంది.

          వీటి మొదటి భాగాల్ని ఎలా తీస్తున్నారన్నదే ప్రశ్న. ఎలా ముగిస్తున్నారన్నదే సమస్య. గతంలో – 2003 లో ‘పల్ప్ ఫిక్షన్’ కల్ట్ ఫిలిం ఫేమ్ క్వెంటిన్ టరాంటినో ‘కిల్ బిల్’ తీయాలనుకున్నప్పుడు,  ఆ పెద్ద కథని ఒకే సినిమాగా తీయలేమని- రెండుగా కథని విభజించాడు. రెండూ దేనికది స్ట్రక్చర్ సర్దుబాటు అయ్యే విధంగా జాగ్రత్త తీసుకుని తీశాడు! 
          ఇది హీరోయిన్ ఉమా థర్మాన్ ప్రతీకార కథ. ఒక కిల్లింగ్ స్క్వాడ్ లో పని చేస్తున్న ఈమె ఆ స్క్వాడ్ బాస్ బిల్ అనే వాడి చేత గర్భం ధరిస్తుంది. దాంతో బిడ్డ కోసం తానీ వృత్తి మానేయా లనుకుంటుంది. ఇది చెప్తే బిల్  చంపేస్తాడు గనుక పారిపోయి వేరే నగరంలో ఇంకొకర్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతూంటుంది. అప్పుడు బిల్ గ్యాంగ్ తో సహా ఊడిపడి ఆ పెళ్లి వేడుకలోమారణ కాండ సృష్టిస్తాడు.  చావుబతుకుల్లో వున్న ఉమా ని వదిలేసి వెళ్ళిపోతాడు. నాల్గేళ్ళూ  కోమాలో వున్న ఉమా కోలుకున్నాక- గర్భంలో వున్న తన బిడ్డ ఏమయ్యిందో అర్ధంగాక తల్లడిల్లుతుంది. పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు సహా తన వాళ్ళందర్నీ చంపేసిన బిల్ మీద – అతడి గ్యాంగ్ మీదా పగ పెంచుకుంటుంది. 
          ఒకొక్కర్నీ చంపడం మొదలెడుతుంది. తప్పించుకుంటున్న బిల్ సినిమా ముగింపులో తన మీద తిరుగులేని ప్లాన్ వేసిందని తెలుసుకుని- ‘అసలు దీని కూతురు బతికుందని దీనికి తెలుసా?’  అని ట్విస్ట్ ఇస్తాడు! ఈ పిచ్చెత్తించే ట్విస్టే మొదటి భాగం ముగింపు!
          ఒక లాజికల్ గానూ ఎమోషనల్ గానూ సమగ్రంగా, పరిపూర్ణంగా ప్రశ్నార్ధకంగా నిల్చిన cliffhanger moment ఇది!   గడ్డు పరిస్థితిని సృష్టించి, హీరోయిన్ కి ఇంకింత సమస్య –ఈసారి మాత్రుత్వపు భావోద్వేగాల సంకటంలో పడేసి వదిలేసిన పరిపక్వాని కొచ్చిన ముగింపు! ఆమెకి తెలియని నిజంతో కళ్ళు తెరిపించడం! ఇక కన్న కూతురా? ప్రతీకార కాంక్షా? ఏది ఎంపిక చేసుకోవాలి తను? 
          దీంతో ప్రేక్షకులకి ఎంత ఉత్కంఠ రేగిందంటే, రెండో భాగం చూడాలి- కొత్త కథతో రెండోభాగం వెంటనే చూడాలి- అంటూ  టరాంటినోని ఫోన్ కాల్స్ తో ఉక్కిరి బిక్కిరి చేశారు!
          ఏంటిది! ఏం చేశాడు మాస్టర్ స్టోరీ టెల్లర్ టరాంటినో?
        సింపుల్ గా స్ట్రక్చర్  కి నిబద్ధుడయ్యాడు. స్ట్రక్చర్  కి నిబద్ధుడైన వాడు మరపురాని సినిమాల్ని నిర్మిస్తాడు. మొదటి భాగంలో పెళ్లి వేడుకల్లో బిల్ సృష్టించిన మారణ కాండతో బిగినింగ్ ముగించి, హీరోయిన్ కి ప్రతీకార భావం రగిలించి, ఆ  చివరిదాకా మిడిల్ నడిపి- ఆ మిడిల్ కి పైన చెప్పిన క్లిఫ్ హేంగర్ ట్విస్ట్ ఇస్తూ ముగించాడు మొదటి భాగాన్ని. ట్విస్ట్ అనేది కథకి  ( మిడిల్ విభాగానికి ) ఇవ్వాలే గానీ,  పరిచయానికి (ఇంకా సాగదీసిన బిగినింగ్ విభాగానికి ) కాదని తెలియ చెప్పాడు.  ఇక మలిసగం మిడిల్ తో రెండో భాగం ‘కిల్ బిల్’ ఇంకింత ఆసక్తికరంగా మొదలవుతుందన్నమాట! అంతేగానీ, ‘బాహుబలి’ లోలాగా మలిసగం బిగినింగ్ విభాగంతో బలహీనంగా కాదు!
          ‘బాహుబలి’ మొదటి భాగం ముగింపుని ఇంకా ముగియని బిగినింగ్ కే ఇవ్వడంతో,  విషయపరంగా మూవీ ఫ్లాట్ గా మిగిలింది. చివర్లో ఫ్లాష్ బ్యాక్ ని ఆపి, సడెన్ గా- ఉరుము లేని పిడుగులా-  బాహుబలికి తానే  వెన్నుపోటు పొడిచాననీ విజువల్ వేస్తూ నమ్మినబంటు కట్టప్పతో చెప్పించడం ద్వారా ట్విస్ట్  ఇచ్చామనుకున్నారేమో. అది పరిపక్వతకి రాని ట్విస్ట్. దానికి క్లిఫ్ హేంగర్ మూమెంట్ ఎఫెక్టు లేదు. అందులో ఆత్రుత, ఉత్కంఠ, రెండో భాగం ఇప్పుడే చూడాలన్న ఆసక్తి- నీటి కొండ మీద ఏముందో చూడాలన్న శివుడికి లాంటి లాజికల్- ఎమోషనల్ తహతహా ఏవీ లేకుండా పోయాయి. లేకపోగా ప్రేక్షకుల్ని తెల్లబోయేట్టు చేసింది ఈ ట్విస్ట్ తో ముగింపు!

          ఇలాటి మహాచిత్రరాజాలకి మేకింగ్ కోసమే కాకుండా హైటెక్ సాంకేతికుల అవసరం రైటింగ్ కి కూడా ఉండాలేమో!  


సికిందర్