రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జూన్ 2014, ఆదివారం

ఆర్టికల్ 

రెండోది తీస్తే అంతేనా!
సీక్వెల్ సినిమాల సంకటం!




             గతంలో సాధించిన ఘన విజయాలకి ఓ అంకె కలుపుకుని మళ్ళీ విజయాలు సాధించవచ్చన్న పేరాశే నేడు విచ్చలవిడిగా తెరకెక్కుతున్న కొనసాగింపు చిత్రాల పరంపర. . కొత్తవి సృష్టించలేక, సృష్టించాలన్నా అవే కథల్ని బాహాటంగా రిపీట్ చేయాల్సిన అవమానాన్ని భరించలేక, గత హిట్లకి అంకెలేసి అవే కథల్ని సాగదీసి మళ్ళీ తీయడమే కాస్తయినా పరువు నిలుపుతుందని నమ్ముతూ పాల్పడుతున్న సరికొత్త నిర్మాణాలే,  నేటి సీక్వెల్స్ అనే దిగుమతి చేసుకున్న మరో సరికొత్త హాలీవుడ్ సంస్కృతి!

            విచిత్రమేమిటంటే గతంలో రెండు తడవలుగా తీసిన తెలుగు సీక్వెల్ సినిమాలే మెగా స్టార్ చిరంజీవి సహా  ఎవరు నటించినా హిట్టయిన పాపాన పోలేదు. అయినా ఇంకేదో సర్ది చెప్పుకుంటూ మళ్ళీ సీక్వెల్స్ కి తెరతీయడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుందేమో. గతంలో రామ్ గోపాల్ వర్మతీసినపుడు మొదటిసారి, తర్వాత చిరంజీవి నటించినప్పుడు రెండో సారీ సీక్వెల్స్ నిర్మాణాలు ఊపందుకుని అదొక ట్రెండ్ గా స్థిర పడలేదు. కానీ ఈసారి మామూలు ట్రెండ్ కాదు- గజ ట్రెండ్ గా ఘీంకరిస్తూ ముందుకొస్తున్నాయి చిన్నా పెద్దా సీక్వెల్  సినిమాలు!
గబ్బర్ సింగ్-2, అదుర్స్ -2, పోకిరి-2, రేసుగుర్రం -2, కిక్-2, స్వామిరారా-2, బిందాస్-2, అంతః పురం-2,  ప్రేమకథా చిత్రం-2, యమలీల-2, అల్లరి-2, ఆనందం -2, దొంగాట -2, మంత్ర -2...ఇలా రెండో నంబర్ సినిమాల లిస్టుకి అంతే వుండదు. ఇలా అంకెలే కాకుండా టైటిల్స్ ని స్వల్పంగానో, పూర్తిగానో మార్చుకుని కూడా సీక్వెల్ సినిమాలు వరస కడుతున్నాయి...’ఆదిత్య-369’ కి సీక్వెల్ గా ‘ఆదిత్య-999’,  ‘లాహిరి లాహిరి లాహిరి’ కి సీక్వెల్ గా ‘కృష్ణా ముకుందా మురారీ’, ‘సీతయ్య’ కి కొనసాగింపుగా  ‘ఎవరి మాటా వినడు’, ‘లేడీస్ టైలర్’ కి  సాగతీతగా ‘ఫ్యాషన్ డిజైనర్- సన్నాఫ్ లేడీస్ టైలర్’... ఇలా దర్శన మివ్వబోతున్నాయి.

           వీటిలో కొన్నిటి ని  ఒరిజినల్ దర్శకులే తీయడం లేదు. దొంగాట -2, ఆనందం -2 లతో  వీటి ఒరిజినల్ దర్శకులైన కోడి రామకృష్ణ, శ్రీను వైట్ల లకి ఏ సంబంధమూ లేదు. అలాగే తమిళ మెగా దర్శకుడు శంకర్ అప్పట్లో తీసిన ‘జీన్స్’ సీక్వెల్ కి ఆయనా దర్శకుడు కాదు. ఇక ప్రస్తుతం  ‘రేయ్’  నిర్మాణంలో తలమునకలై వున్న దర్శకుడు వైవీఎస్ చౌదరి ఏకంగా గతంలో తను తీసిన ‘లాహిరి లాహిరి లాహిరి’,  ‘సీతయ్య’ ల సీక్వెల్స్ ని ప్రకటించుకున్నారు.

        ఇక నాగార్జునతో ‘డాన్’ తీసిన లారెన్స్ రాఘవ ‘డాన్-2’ కూడా తీస్తున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అదేమయ్యిందో తెలీదుగానీ, ఇప్పడు ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘మిర్చి-2’ లో నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

        కనీసం గతంలో హిట్టయిన సినిమాల టైటిల్స్ తో వేరే సినిమాలు తీస్తే కొన్నైనా  హిట్టయ్యాయి. తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’ నాటినుంచీ ఈ సరళిని గమనించవచ్చు. ‘భక్త ప్రహ్లాద’- 1931- 1967, ‘ఆలీబాబా 40దొంగలు’- 1940- 1970,  ‘అపూర్వసహోదరులు’- 1950- 1986-1989, ‘బందిపోటు’- 1963-1988, ‘పవిత్రబంధం’- 1971-1996, ‘ఆహానా పెళ్ళంట’- 1987-2011 ... స్థలాభావం చేత ఇవి కొన్ని మాత్రమే . జాబితా తీస్తే ఇలా రిపీట్ టైటిల్స్ తో హిట్టయిన సినిమాలు డజన్ల సంఖ్యలో వుంటాయి.  కానీ  సీక్వెల్స్ కీ  అదృష్టం కూడా లేదు.  ఒక్కటీ హిట్టవదు. హాలీవుడ్ లో ఏనాడో సినిమాలు పుట్టిన తొలి నాళ్లలో 1930 ల నుంచే  సీక్వెల్స్ తీయడం ఆరంభిస్తే, తెలుగులో రాంగోపాల్ వర్మ పుణ్యమా అని హిట్టయిన ‘మనీ’ (1993) కి, 1995లో  సీక్వెల్ గా ‘మనీ మనీ’ వచ్చింది. అది మట్టి కర్చింది. ఆతర్వాత 2004 వరకూ సీక్వెల్స్ జోలికి పోలేదు. 2004లో చిరంజీవితో ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ హిందీకి రీమేకుగా హిట్టయిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ కి సీక్వెల్ తీశారు. హిందీలో అదే ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ కి సీక్వెల్ గా సూపర్ హిట్టయిన ‘లగే రహో మున్నా భాయ్’ ని తీసుకుని మళ్ళీ చిరంజీవితో ‘ శంకర్ దాదా జిందా బాద్’ అని సీ క్వెల్ తీస్తే అది సూపర్ ఫ్లాపయ్యింది. ఇలా తెలుగులో మొదటి రెండు సీక్వెల్సూ ఘోరపరాజయాల పాలయ్యాక కూడా  ధైర్యం చేసి అల్లు అర్జున్ తో  ‘ఆర్య -2’ తీశారు 2009లో. ఇది కూడా ఫ్లాపయ్యింది. వర్మ తీసిన ‘గాయం-2’, ‘సత్య -2’,  ‘ఏ ఫిలిం బై అరవింద్ -2’ లు కూడా ఫ్లాపయ్యాయి. నిజానికి ఈ మూడిటి ప్రీక్వెల్స్ (తొ లిచిత్రాలు) అయిన ‘ఆర్య’, ‘గాయం’, ‘సత్య’ ‘ఏ ఫిలిం బై అరవింద్’ లు రికార్డులు సృష్టించిన చిత్రాలే. కానీ సాగదీస్తే చతికిలబడ్డాయి. పోసాని కృష్ణమురళి తీసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ ఎంత హిట్టయ్యిందో, ‘ఆపరేషన్ దుర్యోధన-2’ అంతగా  ఫ్లాపయ్యింది. వర్మ ‘రక్త చరిత్ర’ తీసిన తర్వాత,  అట్టహాసంగా ‘రక్తచరిత్ర-2’ తీస్తే ఏమైందో తెలిసిందే!

           సాక్షాత్తూ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన మెగా హిట్ ‘చంద్రముఖి’ కి సీక్వెల్లో మళ్ళీ ఆయన నటించలేదు గానీ, మన విక్టరీ వెంకటేష్ నటించిన ‘నాగవల్లి’ సూపర్ డూపర్ అట్టర్ ఫ్లాపయ్యింది. తగుదునమ్మా అని జేడీ చక్రవర్తి మళ్ళీ ‘మనీ’ , ‘మనీ మనీ’ లకి ట్రీక్వెల్ గా ‘మనీ మనీ మోర్ మనీ’ (2011) అని తీస్తే,  షరామామూలుగా  ఏమాత్రం మనీ తిరిగి రాలేదు. మోర్ మనీ అని ఆశలు మాత్రం చాలా  పెట్టుకున్నారు.

          కృష్ణుడు తో ‘వినాయకుడు’ హిట్టయ్యాక, మళ్ళీ’ విలేజిలో వినాయకుడు’ గా వస్తే ఉండ్రాళ్ళు దక్కలేదు. ఓ మాదిరిగా హిట్టయిన ‘వెన్నెల’ ని నటుడు వెన్నెల కిషోర్ దర్శకుడిగా మారి అ కథతో సంబంధంలేని ‘వెన్నెల వన్ పాయింట్ ఫైవ్’ తీసి సీక్వెల్ గా ప్రచారం చేసుకోవడం ఏమాత్రం ప్రేక్షకుల్ని ఒప్పించలేదు. అలాగే హిట్టయిన తమిళ డబ్బింగ్ ‘విల్లా’ కి సంబంధంలేని ‘విల్లా-2’ వస్తే తిప్పికొట్టారు ప్రేక్షకులు. సీక్వెల్స్ ఇలా అడ్డగోలుగా వెర్రితలలేసే స్థాయికి పడిపోతున్నాయి. సేక్వెల్ అర్థాన్నే మార్చేస్తున్నాయి. ఇంకా పాత హిట్స్ అయిన ‘ బొబ్బిలి రాజా’, ఖైదీ’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ లకి కూడా సీక్వెల్స్ తీస్తా మని బెదిరిస్తున్నారు ఈ  సినిమాలు తీయని వేరే దర్శకులు. పాత సినిమాలని మళ్ళీ నిర్మిస్తున్నప్పుడు దర్శకులు మారినా అభ్యంతర ముండదు. అక్కినేని నాగేశ్వరరావు  ‘దేవదాసు’ ని విజయనిర్మల రీమేక్ చేస్తే అదేంటీ అని ఎవరూ అనలేదు. రీమేక్స్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ సీక్వెల్స్ కి ఓ పధ్ధతి వుంటుంది. ఒరిజినల్ దర్శకుడి సొత్తు అయిన ఓ హిట్ ని వేరే దర్శకుడు సొంతం చేసుకుని సీక్వెల్ తీయడం ఏమాత్రం వృత్తి  తత్త్వం అన్పించుకోదు. కానీ ఉన్న అనేకానేక అనారోగ్య ధోరణకి ఇది కూడా ఓ ట్రెండ్ గా తోడై పోయిందిప్పుడు.
అసలిదంతా హిందీ వైపు చూసి వేసుకుంటున్న వాతలు. అయితే హిందీలో ఒకరి సృజనాత్మక ఆస్తితో మరొకరు  సీక్వెల్స్ తీసే అపసవ్య ధోరణి కన్పించదు.  ఒరిజినల్ తీసిన  దర్శకులే సీక్వెల్స్ మీద సీక్వెల్స్  తీస్తూ హిట్లు కొడుతున్నారు. హేరాఫేరీ-2, కోయీ మిల్ గయా-2,  మున్నాభాయ్ -2, దబంగ్-2,  దోస్తానా- 2 , జన్నత్-2, ఆషికీ-2, రేస్-2, ఢమాల్-2,  రాగిణి ఎం ఎం ఎస్-2, మర్డర్-2,3, రాజ్-2,3, క్రిష్- 2,3,   ధూమ్- 2,3,  గోల్ మాల్ -2,3,4. ...ఈ దశాబ్దంన్నర కాలంలో ఇవన్నీ ఇవన్నీ హిట్లూ సూపర్ హిట్లే.
తెలుగులో ఎందుకు హిట్ కావడం లేదంటే, కేవలం క్రియేటివిటీ లోపించడం వల్లే. మొదటి దాన్ని మరిపించేదిగా రెండోది వుండాలి. కానీ రెండోది తీస్తే ఇక అంతే  సంగతులు అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి.

            తమిళం వైపు చూస్తే, నాన్ అవన్ ఇల్లై, ముని, పిజ్జా లకి సీక్వెల్స్ తీస్తే హిట్టయ్యాయి. సింగం తర్వాత సూర్య సింగం-2 లో నటిస్తే అదీ హిట్టయ్యింది. కమలహాసన్ విశ్వరూపం-2, మురుగ దాస్  తుపాకీ-2 తీయబోతున్నారు. ఇండియన్, రోబోలకి దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ( బాక్స్ చూడండి). తెలుగులో లాగా  తమిళం లో అంత సీక్వెల్స్ వేలంవెర్రి లేదు. అతి తక్కువ సంఖ్యలో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కొనసాగింపుల్ని పక్కన బెట్టి కొత్త కథల మీదే దృష్టి పెడుతున్నారు.

           ‘ఇప్పుడు కథకులు లేరు, కథలకి ఐడియాలు కొరవడుతున్నాయి. ఐడియాలు  వున్నా కొత్త  కథలతో సాహసించ లేకపొతున్నారు. పూర్తి అభద్రతా భావంతో కొట్టు మిట్టాడుతున్నారు. సురక్షిత మార్గం సీక్వెల్స్ తీయడమే నని భావిస్తున్నారు. ఒకసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న పాత్రతో మళ్ళీ తీస్తే గట్టెక్కుతామని నమ్ముతున్నారు. కొత్త కథలే కాదు, కొత్త పాత్రల్ని సృష్టించాలన్నా ఏదో భయం, దీన్ని భయం అనేకన్నా భావ దారిద్ర్యం అనాలి...’అని అంటున్న సీనియర్ హిందీ రచయిత కమలేష్ పాండే మాటలు హిందీకి కన్నా తెలుగుకే ఎక్కువ వర్తిస్తాయేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇలా తీస్తున్న హిందీ సీక్వెల్సే హిట్టవుతున్నాయి. ఈ కిటుకు ఏంటో ముందు పట్టుకో గలిగితే, తర్వాత  తీరిగ్గా తెలుగు సీక్వెల్స్ గురించి ఆలోచించవచ్చు.

              రవితేజతో కిక్- 2 కి కమిటయిన దర్శకుడు సురేంద్ర రెడ్డి,   ఒరిజినల్ లోని రవితేజ పాత్రని తీసుకుని కొనసాగింపుగా కాకుండా,  కొత్త కథ తయారు చేసినట్టు చెబుతున్నారు. ఈ పాత్ర ‘కిక్’ తో ఎంతో పాపులర య్యింది. దీన్ని మళ్ళీ ఎంజాయ్ చేయవచ్చు ప్రేక్షకులు. హిట్టయిన పాత్రలాధారంగా సీక్వెల్స్ తలపెడితే సత్ఫలితా లుండొచ్చు, కానీ, హిట్టయిన కథలాదారంగా తీస్తే ఏమౌతుందో చెప్పలేం. ప్రస్తుతం తలపెడుతున్న చిన్నా పెద్దా సీక్వెల్స్ లో చాలా వాటికి హిట్టయిన పాత్రల్లేవు. హిందీలో చూస్తె ఎక్కువగా హిట్టయిన పాత్రలతోనే తీస్తున్నారు. కథలతో తీసినా చాలావరకూ హిట్టయ్యాయి. అంటే క్వాలిటీ కి కట్టు బడ్డారన్న మాట. మున్నాభాయ్, హేరాఫేరీ, కోయీ మిల్ గయా, గోల్ మాల్, దబంగ్, ధూమ్, క్రిష్, దోస్తానా, రేస్   లలోని పాత్రలు బాగా హిట్టయినవే. ఆషికీ, రాజ్, మర్డర్, రాగిణి- ఎం ఎం ఎస్ మొదలైనవి చిన్న చిత్రాలు. వీటిని కథా  బలం ఆధారంగా సీక్వెల్స్ తీసి విజయాలు సాధించారు.తెలుగులో ‘గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ ది విలక్షణ పాత్ర. అది కౌబాయ్ ప్రవర్తనల గుర్తుండి  పోయే పోలీసు పాత్ర. కానీ ‘పోకిరి’ లో మహేష్ బాబుది సాధారణ అండర్ కవర్ పోలీసు అధికారి పాత్రే. దీనికి ఏ ప్రత్యేకతలూ లేవు. అలాగే ‘అదుర్స్’ లో ఎన్టీఆర్ పురోహితుడి సాత్విక పాత్ర ఆ సినిమా వరకే చెల్లుతుంది గానీ, సీక్వెల్ కి పనికొచ్చేంత క్రేజీ పాత్రేం కాదది. ‘రేసుగుర్రం’ లో అల్లు అర్జున్ పాత్ర సైతం డిటో. పైగా దీనికి పాత్ర చిత్రణా పరమైన  లోపాలెన్నో వున్నాయి. విశ్లేషిస్తే ఇదొక అసమర్ధ పాత్ర. పైగా టైటిల్ కి తగ్గట్టు రేసు గుర్రమే కాదు. నటి ‘లేడీస్ టైలర్’ లో

           ఇక ‘యమలీల’ సహా రాబోయే చిన్న చిన్న సీక్వెల్స్ అన్నీ కథా బలం ఆధారంగా తీసుకోవాల్సినవే. ఐతే ‘యమలీల’ సీక్వెల్ కాదంటున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి. కొనసాగింపు కాకుండా కొత్త కథతో ఇది సిరీస్ చిత్రం అంటున్నారు. సిరీస్ చిత్రమ నుకుంటే దీని తర్వాత ఇంకా తీస్తూ వుండాలి, హాలీ వుడ్ లో జేమ్స్ బాండ్ చిత్రాల్లాగా. కృష్ణా రెడ్డి ఒకటి తీసి సిరీస్ అనకుండా మరి కొన్ని యమలీలలు తీస్తూ పోతారేమో  చూడాలి.

              ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయంలో, సీక్వెల్ అనేది ప్రీక్వెల్ కి సహజ సిద్ధమైన కొనసాగింపుగా వుండాలి, కానీ మన నిర్మాతలు, దర్శకులూ సంబంధంలేని వేరే కథ జోడించి పార్ట్ టూ అని ప్రచారాలు చేసుకుంటున్నారు, ప్రీక్వెల్  హేంగోవర్ తో వుండే  ప్రేక్షకులు,  తీరా థియేటర్ లోకెళ్ళి చూసి కంగు తింటున్నారు...

            ఒక పంపిణీ దారుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలి బుచ్చారు. ముందు తీసిన సినిమాతో రెండో దానికి సంబంధంలేని కథ ఉండడమే వీటి వైఫల్యాలకి కారణమంటున్నారు. నిజమే, మొదటే కథల్నీ పాత్రల్నీ ఇక సృష్టించుకునే ఓపికా తీరికా లేక సులభమార్గం సీక్వెల్స్ ని ఎంచుకున్నప్పుడు, వీటితో కూడా ప్రేక్షకులతో నిజాయితీగా ఉండకపొతే ఎలా?

            చూడబోతే ఈ ఏడాది, వచ్చే ఏడాదీ నంబర్ టూ సినిమాలు ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేట్టున్నాయి. ఐతే ఇలా డజన్ల సంఖ్యలో క్యూ కడుతున్న తెలుగు సీక్వెల్స్ లో ఒకటి రెండూ మెప్పించలేకపోయినా, మిగిలిన వాటి మొహం చూడక పోయే ప్రమాదముంది ప్రేక్షకులు. గ్రాఫిక్స్ సినిమాలు, త్రీడీ సినిమాలూ ఎలా వెన్వెంటనే మొహం మొత్తాయో సీక్వెల్స్ హంగామా కూడా అయ్యోరామా అన్పించుకునే అపాయం పొంచే  వుంటుంది. కనుక అందరూ ఒకే సారి పోటాపోటీగా ప్రారంభించకుండా, ఒకటి రెండిటి ఫలితాలు చూసి ముందడుగు వేయకపోతే ఇంతే  సంగతులవుతుంది. ఎలాగూ రెండోది తీస్తే ఏమయ్యిందో దాఖాలాలున్నాయి ఇదివరకే.
ప్రేక్షకులు కొత్త  పాత్రలతో, కొత్త  కథలతో ముందు కెళ్లాలనుకుంటారు. ఉన్న చోటే వుండి పోయి ఈ రెండేళ్ళూ అవే పాత్రలూ, అవే టైటిల్స్ తో అవే కథల కొనసాగింపులూ చూస్తూ బోరు కొట్టించుకోవాలనుకోరు. అసలే ఇంట్లో జీడిపాకం సీరియళ్ళతో నానా యాతనలు  పడుతున్నారు. ఇంకా జీడిపాకం సినిమాలని  కూడా అంటే ఎవరికీ చెప్పుకుంటారు?   ధోరణి ఇలాగే కొనసాగితే  టాలీవుడ్ లో సరుకై పోయిందని మొత్తంగా థియేటర్లకి డుమ్మా కొట్టినా కొట్టొచ్చు!

-సికిందర్
( 'ఈవారం'- జులై 2014)

27, జూన్ 2014, శుక్రవారం

రివ్యూ..


మళ్ళీ అదే ఎపిసోడ్ల వైఫల్యం!


రచన- దర్శకత్వం : దేవ కట్టా
తారాగణం: నాగ చైతన్య అక్కినేని, సమంత, రాకుల్ ప్రీత్ సింగ్, సాయి కుమార్, ఆశీష్ విద్యార్థి, జీవీ, జెపి, బ్రహ్మానందం, ఎమ్మెస్, వేణు మాధవ్ తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్,    కెమెరా: శ్రీకాంత్ నరోజ్,  ఎడిటింగ్ : గౌతమ్ రాజు.

 నిర్మాత : కె. అచ్చి రెడ్డి , సెన్సార్ :  ‘A’ ,     విడుదల : 27 జూన్, 2014,     
*****
మొన్ననే క్లాసిక్ కుటుంబ కథా చిత్రం  మనం’  సూపర్ సక్సెస్ తో మరింత క్రేజ్ ని పెంచుకున్న  అక్కినేని నాగ చైతన్య,  ‘ఆటో నగర్ సూర్య’ తో  ఇక చెలరేగిపోతాడన్న అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. దురదృష్టవశాత్తూ ఒకటే పరంపరగా విడుదల వాయిదాలు పడుతూ వచ్చిన ‘ఆటో నగర్ సూర్య’ షరామామూలు ఫలితాన్నే ఇస్తుందని ఎవరూ ఊహించి వుండరు. ఎంతటి బడా సినిమా అయినా  విడుదల వాయిదాలు  పడితే హిట్టయిన సందర్భాలు లేవు. ఐతే ‘ఆటో నగర్ సూర్య’ కూడా ఈ ప్రమాదంలో పడాలనిలేదు. దర్శకుడు దేవకట్టా  సరైన ‘దృష్టి’ తో ఈ సినిమా తీసివుంటే దీనికీ గండం వుండేది కాదు.

దర్శకుడు దేవకట్టా తో వచ్చిన సమస్యేమిటంటే,  ఆయన భారీ కథలకి లేత హీరోల్ని ఎన్నుకుంటారు. గత చిత్రం ‘ప్రస్థానం’ లో అంత బరువైన కథకి, పాత్రలకీ  సరిపోని శర్వానంద్, సందీప్ కిషన్ లలాంటి యంగ్ హీరోల్ని తీసుకున్నట్టే,  ప్రస్తుత భారీ డైలాగుల బరువైన సినిమాకీ అంతే యంగ్ స్టార్ నాగ చైతన్య ని తీసుకున్నారు. యాక్షన్ హీరోగా రాణించాలని విఫలయత్నం చేస్తున్న నాగచైతన్య చేత ఇంత సీరియస్ సినిమా దేవకట్టా చేస్తారని ఎవరూ ఊహించరు.  ఈ రోజుల్లో పెద్ద స్టార్స్ సినిమాలకే యాక్షన్ ని ఫక్తు ఎంటర్ టైనర్ గా చేసి చూపిస్తున్న ట్రెండ్ నడుస్తోంది. ఇలాటి కమర్షియల్ యాక్షన్ సినిమాల ట్రెండ్ కి  దేవ కట్టా ఎంత కొత్త అన్పిస్తారంటే, ఆయన ఎన్నుకున్న ఈ కథ ఎంత పాతకాలం నాటిదో అంత!

ఇంకో అనాధ బాధ!

ఐదేళ్ళప్పుడు సూర్య ( నాగ చైతన్య) అనాథ అవుతాడు. అప్పుడు  తల్లి కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో మేనమామ ( సాయికుమార్ )సూర్యని చేరదీయడు. దీంతో  ఆటోనగర్ లో పనిలో చేరి కాలక్రమంలో ఓ హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలవుతాడు.  అక్కడే  ఇంజనీరింగ్ కూడా పూర్తి  చేసి విడుదలవుతాడు.

అతడికో కల వుంటుంది- బ్యాటరీతో నడిచే కారు తయారు చేయాలని. ఆటోనగర్ లో ఈ పని ప్రారంభించబోతే నగర మేయర్ ( మధు), అతడి రౌడీ వర్గం ( జయప్రకాష్ రెడ్డి, అజయ్, జీవా ) అడ్డుపడుతూంటారు.  వీళ్ళంతా ఆటోనగర్ మీద, అక్కడి వర్కర్స్ యూనియన్ మీదా  అధికారం చెలాయిస్తూ అక్రమ సంపాదనలకి  అలవాటు పడివుంటారు. ఈ కొత్త  వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఇక ఎదురుతిరగడం  మొదలెడతాడు సూర్య.
ఇంకోవైపు మేనమామ కూతురుగా సిరి (సమంత) వుంటుంది. ఈమెతో ప్రేమకి మేనమామ అడ్డుగా వుంటాడు. ఈ ప్రేమ సంగతి అలావుంచితే, అతడి ధ్యేయం ఇప్పుడు ఒక్కటే - ఆటోనగర్ లో రౌడీ రాజ్యాన్ని అంతమొందించడం. ఇదీ కథ!

నటనలు- సాంకేతికాలు

2011 లో రాంగోపాల్ వర్మ తీసిన ‘బెజవాడ’, అంతకి ముందు వాసూ వర్మ దర్శకత్వంలో 2009 లో ‘ జోష్’, మళ్ళీ 2011 లో అజయ్  భుయాన్ దర్శకత్వంలో ‘దడ’ అనే మూడు యాక్షన్ చిత్రాల్లో నటించి విఫలమైన నాగ చైతన్య తిరిగి అదే యాక్షన్ హీరో గా నిరూపించుకోవడం  కోసం ఈసారి  చేసిన ప్రయత్నం కూడా పారలేదు.  ఈసారి మాస్ పాత్ర నటించడంలో కొంత ఇంప్రూవ్ ఐనప్పటికీ, అతను సాఫ్ట్ రోల్స్ లో రోమాంటిక్ పాత్రలు పోషిస్తేనే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకునే అవకాశం వుంది.

సమంత కి సరైన పాత్రేలేదు. ఈ తరహా మూస ఫార్ములా సినిమాల్లో హీరోయిన్ పాత్ర గల్లంతవడం మామూలే. ‘దూకుడు’ ద్వితీయార్ధంలో సమంత సమూలంగా మాయమైనట్టుగానే, ఇక్కడ కూడా ఆ ఉన్న కురచ పాత్ర కాస్తా సెకండాఫ్ లో ఐపు లేకుండా పోయింది.

మిగతా పాత్రల్లో పాత  విలన్లందరూ పోటీలు పడి వీలైనంత పాత  ధోరణిలోనే నటించుకుపోయారు. సెకండాఫ్ లో   నైతే మరీ పాత సినిమా విలన్స్ లా అరుపులు అరిచారు. బ్రహ్మానందం- వేణుమాధవ్ ల కామెడీ  విషయానికొస్తే, దీన్ని కామెడీ అని కూడా ఎలా అంటారో దర్శకుడే స్పష్టం చేయాల్సిన అవసరం వుంది.

సాంకేతికంగా చూస్తే కెమెరా వర్క్ లో చాలా ఎగుడు దిగుళ్ళు న్నాయి. అసలీ సినిమా కథాకాలం 1970- 90 ల నాటిది. ఆ కాలాన్ని ప్రతిబింబించే వాతావరణ కల్పన కోసం చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టి, ఆ కాలంలో  తీసిన పాత సినిమా చూస్తున్నట్టే తయారయ్యింది.

అనూప్ రూబెన్స్ సంగీతంలో  ‘మన్ చలీ’ అనే ఒక్క పాట తప్ప మరేదీ ఆకట్టుకోదు.  ఆకట్టుకోక పోగా,    అకస్మాత్తుగా కథకి అడ్డుతగుల్తూ వచ్చిపోతూంటాయి.

దర్శకత్వపు తీరుతెన్నులు

దర్శకుడు దేవకట్టా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడే అక్కడ సినిమా దర్శకత్వం కోర్సు చేశారు. స్క్రీన్ ప్లే మీద అనర్గళంగా మాట్లాడగలరు. కానీ, సినిమా తీసే  విషయానికి వస్తే మాత్రం ఆ జ్ఞాన సంపద ఏమై  పోతుందో అర్ధంగాదు. పాత్ర చిత్రణ గురించి, పాత్ర ప్రయాణం గురించీ వివరించే జోసెఫ్ క్యాంప్ బెల్ రాసిన  ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ గ్రంథ పఠనమంతా ఏమై పోతుందో తెలీదు. ఈ సినిమాకి ఆయన ఒక దర్శకుడిగా కంటే మాటల రచయితగా ఎక్కువ నిరూపించుకోవాలని ఉబలాటపడ్డారు. పట్టుకున్న కలానికి పట్టుపగ్గాలే లేనట్టు పుంఖాను పుంఖాలుగా డైలాగులు రాసుకుంటూ పోయారు. ఈ డైలాగులు కాలం చెల్లినవి. ఈ రోజుల్లో ఇంతేసి భారీ డైలాగులు చూడం. పైగా రాస్తున్నది ఒక యువ స్టార్ కోసం అన్న దృష్టి కూడా లేకుండా అలాటి డైలాగులు జొప్పించారు.

‘మీరంతా మారిపోయారు బాబాయ్, నిజం చెప్పాలంటే దూరంగా పారిపోయారు’ - అనే అరిగిపోయిన ప్రాస డైలాగు,

‘నేనింకా  పసివాడినే, మనిషే వ్యవస్థ అని తిరుగుతున్న ఆరేళ్ళ పసోడిని’ - అనే అజ్ఞానపు డైలాగు,

‘నేను అనాథనే కానీ  అనామకుడ్ని కాదు, నా పేరు సూర్య, ఆటో నగర్ సూర్య’ - అనే బలహీన  డైలాగు,

‘నాకు తెలిసి మనుషుల్లో నాలుగే జాతులున్నాయ్, తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తినగలిగినంత మాత్రమే పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు, ఈ ముగ్గుర్నీ దోచుకు తినే నాలుగో జాతి –లోఫర్ జాతి’  – లాంటి భారీ డైలాగులూ చాలా వున్నాయి...

వ్యవస్థ మనిషిని నిర్ణయించదనీ,  మనిషే ఒక వ్యవస్థ అనే అర్ధంలో ఇంకో డైలాగూ  వుంది. సంఘ జీవి అయిన మనిషి సమాజం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా తనకు తానే ఒక  వ్యవస్థ అవుతాడా? అంటే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనా? నీ కట్టు బాట్లు, సాంప్రదాయాలు, సెంటిమెంట్లు, నీతీనిజయితీలూ నీవరకు ఉంచుకో, బయట నువ్వు తిరిగే సొసైటీ యావత్తూ అత్యాశ, స్వార్ధం, ఈర్ష్యాసూయలు, అధికార దాహం  అనే నాలుగు మూల స్థంభాలమీద ఏర్పడి ఉంది, వీటిని కాదనుకుని పోలేవు- అని జిడ్డు కృష్ణమూర్తి ఏనాడో తేల్చేశాడు కదా?

చచ్చినట్టూ మనిషనే వాడు ఉన్న మత వ్యవస్థలో, అది అదుపు చేసే రాజకీయ వ్యవస్థలో పనిచేసుకు బతకాల్సిందేగా? కాకపొతే బతకలేనప్పుడు ఎదురుతిరుగుతాడు, అంతే. తానుంటున్న వ్యవస్థ అనే ఛత్రాన్ని మాత్రం తప్పించలేడు. వ్యవస్థ  అనేది ఆటవికతనం నుంచి పరిణామం చెంది ఏర్పడ్డ నాగరికత. మనిషిగా దర్శకుడే ఒక వ్యవస్థ ఐతే, ఈ సినిమా విడుదల ఇన్నిసార్లు ఎందుకాగుతుంది?

ఈ డైలాగుల ఆర్భాట మంతా  డైలాగుల కోసమే అన్నట్టు వుందే తప్ప, వీటిని ఆచరించి చూపే పాపాన హీరో పోడు సరికదా, దర్శకుడు  డైలాగుల మీద చూపించిన ‘శ్రద్ధ’  మిగతా కథా కథనాల మీద చూపించే ప్రయత్నం అస్సలు చేయలేదు.

ఈ కథా కథనాలు మరోసారి సినీ మాధ్యమానికి  పొసగని  ఎపిసోడ్ల  టైపు,  స్టార్ట్ అండ్ స్టాప్ డాక్యుమెంటేషన్ టెక్నిక్ తీరు !

స్క్రీన్ ప్లే సంగతులు!


ఈ సినిమాలో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గురించి చెప్పుకోవడాని కేమీలేదు, ఎందుకంటే దురదృష్ట వశాత్తూ ఇది స్క్రీన్ ప్లే కాలేకపోయింది. స్క్రీన్ ప్లే అంటే సినిమాకి పనికొచ్చేది, అంతేగానీ ఈ సినిమాలో ఉన్నట్టుగా టీవీ ఎపిసోడ్లు కాదు. స్క్రీన్ ప్లేకి ఒకటి -రెండు- మూడు-అని మూడంకాలుంటాయి. టీవీ ఎపిసోడ్లకీ మూడంకాలుంటాయి,  అయితే అవి ఏ ఎపిసోడ్ కా ఎపిసోడుగా వుంటాయి. సమస్య- సంఘర్షణ- పరిష్కారం అనే పద్ధతిలో వాటి సీన్లు నడిచి, ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ కథ ముగిసి పోతూంటుంది.  సినిమా స్క్రీన్ ప్లే అలాకాదు. ఒకే ఏక మొత్తం కథకి, ఒకే ప్రధాన సమస్య గా, దాంతో మాత్రమే సంఘర్షణనగా, దానికి మాత్రమే పరిష్కారంగా ఒకే ఒక్క కథ వుంటుంది.


ప్రస్తుత సినిమాలో ఒక ప్రధాన సమస్య – దాంతో సంక్షోభం అనే నడక లేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ముగింపులూ!  ఉదాహరణకి- డీజిల్ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు, తర్వాత బ్యాటరీ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు, మళ్ళీ తర్వాత కొచ్చిన్ ప్రయాణం కడితే, అక్కడ సంఘర్షణ, దానికో ముగింపూ,  ఇంకాతర్వాత, యూనియన్ లో సభ్యత్వ సమస్యతో ఇంకో  సంఘర్షణా దానికో ముగింపూ. మళ్ళీ తర్వాత వాహనాల వేలం పాట సమస్య, దాంతో సంఘర్షణా, దానికో ముగింపూ....ఇలా ఎపిసోడ్లమయంగా సాగే కథనంతోనే 2003 లో ‘టైగర్ హరిశంద్ర ప్రసాద్’ ఫ్లాపయ్యింది. 2014 లో తమిళ డబ్బింగ్ ‘సిటిజన్’ ఫ్లాపయ్యింది. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఈ ఎపిసోడిక్ స్ట్రక్చర్ కి పాల్పడ్డం తో 2001 లో ’వార్ హార్స్’ ఫ్లాపయ్యింది.

కథ మీద కాక,  సీన్ల మీదా  సీక్వెన్సుల మీదా దృష్టి పెట్టడం వల్ల  ఇలా జరుగుతుంది. దీన్నే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అంటారు. ఇది సినిమాలకి కాకుండా టీవీకీ, డాక్యుమెంటరీ చిత్రాలకీ పనికొస్తుంది.

ఇంటర్వెల్ కొచ్చేసరికి కూడా ఒక ప్రధాన సమస్య (మెయిన్ పాయింటు) లేదు. ఇంటర్వెల్లో వాహనాల వేలం పాటలకి భీకర పోరాటాలు పెట్టి,  హీరోకే ఆ  విజయాన్ని అందించి, వేలం పాట పత్రాల మీద “క్లోజ్డ్!”  అని పెద్ద శబ్దంతో ముద్ర కొట్టించడం ఎలా ఉందంటే- ఈ సినిమా ఫట్ ! – అన్నట్టే వుంది!

There is no hook at the mid - point to sustain the audiences interest anymore   -అన్నమాట! ఇక ఎందుకోసం  ప్రేక్షకులు ద్వితీయార్ధం చూడాలి? మళ్ళీ ద్వితీయార్ధలో చూపించింది కూడా  ఆ వేలం పాట చేజారిపోయిందని విలన్లు మళ్ళీ ఇంకో దాడికి పూనుకోవడమే. ఇలా దాడులకి ప్రతిదాడులతోనే హీరో క్యారక్టర్ ని రియాక్టివ్ గా చేసి నడిపించారు సినిమా ప్రారంభం నుంచీ. చివరికి విలన్ కొడుకుని హీరో కిడ్నాప్ చేశాకకూడా, మళ్ళీ ఎపిసోడ్ల పద్ధతే కొనసాగించారు.

దీంతో ఎక్కడా సస్పెన్స్, టెన్షన్, థ్రిల్ అనేవి లేకుండాపోయాయి. పైగా రెండు గంటలా 40 నిమిషాల నిడివి ఒకటీ. మర్నాడు  12 నిమిషాలు కత్తిరించారు. గంట కత్తిరించినా ఈ సినిమా బోరుని తప్పించలేరు.  ఎందుకంటే ఈ సినిమానే విషయం లేని నస కాబట్టి.

రాముడు అనే మంచి బాలుడు ఉదయం లేచి పళ్ళు తోముకున్నాడు, స్నానం చేశాడు, తయారయ్యాడు, తిన్నాడు, ఆఫీసుకి పోయాడు, పనిచేశాడు, తిన్నాడు, సాయంత్రం తిరిగొచ్చాడు, బట్టలిప్పుకుని స్నానంచేశాడు, రిలాక్స్ అయ్యాడు, మళ్ళీ  తిన్నాడు,  మళ్ళీ పడుకున్నాడు- ఇది నస!

రాముడు అనే మంచిబాలుడు ఉదయం  పళ్ళు తోముకుంటోంటే నిన్న బాస్ తిట్టిన తిట్లు గుర్తొచ్చాయి, బ్రష్ పడేసి స్నానం చేస్తూ బాస్ ని తన్నాలనుకుని  జారిపడ్డాడు. కాలు బెణికింది. నొప్పి కాలితో  అలాగే  ఆఫీసు కెళ్ళాడు. బాస్ మళ్ళీ తిట్టాడు. కాలు బావుంటే ఈసారి జాడించి తన్నే వాణ్ణి  అనుకున్నాడు. నొప్పి కాలితో సరిగ్గా పని  చేయలేక పోయాడు. ఇంకింత ఫైరయ్యాడు బాస్. వాడి మొహాన ఫైలు పెట్టి కొట్టి, ఇంటికొచ్చి భార్యని తన్నాడు- భార్య కోర్టు కెక్కింది- బాస్ పోలీసుల్ని పిలిపించాడు. ఇదీ పస. అసలు కథకి పెద్ద టర్నింగ్ పాయింట్!

విచారకరంగా ఇరవై కోట్ల బడ్జెట్ తో అట్టహాసంగా తీసిన ప్రస్తుత సినిమాకి మొదటి ఉదాహరణే  వర్తిస్తోంది!

పాత్రోచితనుచితాలు! 
జోసెఫ్ క్యాంప్ బెల్ 
ఐదేళ్లపుడు అనాధ అయిన హీరో తర్వాత చదువుకుంటున్నట్టు కన్పించడు. ఓ మెకానిక్ దగ్గర పనిలోకి చేరతాడు. పదహారేళ్ళ వయసులో  డీజిల్ తో నడిచే కారు కనిపెడతాడు. అడ్డొచ్చిన వడ్డీ వ్యాపారస్థుణ్ణి చంపి జైలు కెళ్తాడు. జైల్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతూ, బ్యాటరీతో నడిచే కారు డిజైన్ చేస్తాడు.

ముందు కనిపెట్టిన డీజిల్ తో నడిచేకారు ఏమయ్యింది? దాంతో దేశంలోనే గొప్పవాడు ఐపోవచ్చుగా? అది మర్చిపోయి మళ్ళీ బ్యాటరీ కారు ఏమిటి? జైల్లో తను చదివింది ఇంజనీరింగ్ డిగ్రీయా, లేక డిప్లొమానా? డిగ్రీకి అవకాశంలేదు. దూరవిద్యద్వారా  ఆటోమొబైల్ డిప్లొమా చెయ్యొచ్చు. అసలు స్కూలు కెళ్ళినట్టు కన్పించని కుర్రాడికి  ఏకంగా ఇంజనీరింగ్ చదివే అక్షరజ్ఞానం, ఆంగ్ల పరిజ్ఞానం ఎలా వచ్చాయి? అతను మైనారిటీ తీరని బాల నేరస్థుడే. అతన్ని సాధారణ జైల్లో ఉంచరు. ఎంత పెద్ద నేరం చేసినా మూడేళ్లకి మించి శిక్ష వెయ్యరు. ఇంతకీ ఇతను మూడేళ్ళే  జైల్లో ఉన్నట్టా, లేక డిగ్రీ చేస్తే అది పూర్తి  చేసి ఐదేళ్లకి బయటికి వచ్చాడా?

అసలు పదహారేళ్ళ మైనర్ కుర్రాడి మీద ఓ పెద్ద రౌడీ ముఠా దాడి చేస్తే, ఆత్మరక్షణ కోసం ఆ అమాయక కుర్రాడు చంపితే కోర్టు శిక్షిస్తుందా? పైగా ఒక కేస్ హిస్టరీ లేని, జీనియస్ అన్పించుకున్న కుర్రాణ్ణి? అతడి భవిష్యత్తునీ?
ఇంజనీరింగ్ చేశాడంటే శిక్షా కాలంలో అతను చాలా సంస్కరింప బడ్డట్టే. అలాటివాడు బయటికొచ్చాక ఏం చేస్తాడు?  అసలు అతడి ధ్యేయ మేమిటి? అసలు ముందు కనిపెట్టిన ఆ డీజిల్ కారు పేటెంట్ అమ్ముకుని బాగుపడ్డం మానేసి, ఇంకో బ్యాటరీ కారూ  అంటూ బయల్దేరాక, మళ్ళీ తనని  జైలుపాలు చేసిన ఆ కుళ్ళు ఆటోనగర్ కే పోతాడా, లేక ఇంకో కొత్త  చోట తన కొత్త ప్రాజెక్టు పనితో కొత్త జీవితాన్ని మొదలెట్టుకుంటాడా?

పాత్రే ఇంత గందరగోళంగా ఆవిష్కృత మైనప్పుడు, ఇక అది కథ నడిపే పధ్ధతీ అంతే అల్లకల్లోలంగా వుంటుంది. నిజానికి పాత్ర ఇలా ప్రయాణించా లనుకోలేదు, దర్శకుడే  తను ఫిక్స్ అయిపోయిన కథకోసం పాత్రౌచిత్యాన్ని ఇలా దెబ్బ తీశాడు. పాత్రకి ఓ దిశా, గమ్యం, ధ్యేయం లేకుండా చేశాడు. దీంతో పాత్ర ప్రాథమ్యాలు మరచి ప్రవర్తించింది. జైల్లో కష్ట పడి చదివి ఏర్పర్చుకున్న జీవితలక్ష్యాన్ని తీసి మూలకి విసిరేసి, అసాంఘిక శక్తులమధ్య తనూ లుంపెన్ శక్తిగా మారిపోయి వ్యర్థ జీవితాన్ని ఎంచుకుంది. కథలో హీరోయిన్ లాగే, బ్యాటరీ కారూ ఏటో మయమై పోయింది!
దర్శకుడు తన కథని త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో ఆలోచించి వుంటే ఇలా జరిగేది కాదు. జోసఫ్ క్యాంప్ బెల్ పాత్ర ప్రయాణ నమూనా ఈ క్రింద చూడండి.

స్ట్రక్చర్ మరచి ఎపిసోడ్ల సొద 
 ఎత్తుకోవడంతో-

సిడ్ ఫీల్డ్ చెక్ లిస్టులో గుర్తిస్తే- 

1. the main character has no point of view,
2. the story seems confusing,
3. story goes off in too many directions,
4. the   material is flat and boring,
5. main  character is too passive and reactive,
6. the story is predictable and contrived,
7. the main character is too reactive, too internal, seems to disappear off the page,
8. dramatic need of the main character is vague, undefined

ఇన్ని పాత్ర సంబంధమైన లోపాలవల్ల కథే చెడిపోయింది.

ఇక- పాత్ర బలిమి విషయానికి వస్తే, కుర్ర వయసులో అతనేం మొనగాడని నగర మేయర్ సహా కరుడుగట్టిన హంతక ముఠాకి సవాళ్లు విసురుతాడు? తనకి ఎవరి బ్యాకింగ్ వుంది? ఎవరు గాడ్ ఫాదర్ గా వున్నారు? తనలాంటి నల్గురు కుర్రాళ్ళని పెట్టుకుని ఏం చూసుకుని చెలరేగి పోతున్నాడు. విలన్ల ముందు అతను బచ్చా. క్షణంలో అతన్ని లేపెయ్యగలరు. కానీ ఇక్కడ  విలన్లని కూడా దెబ్బ తీస్తూ పాత్ర చిత్రణలు జరిగాయి. పోలీస్ కమీషనర్ సహా అందరూ బఫూన్లుగా మారిపోయారు. పోనీ హీరో జైలు నుంచి విడుదలై ఇంతప్పుడే ఒక  మర్డర్ చేసొచ్చిన దేవాంత తకుడనే బిల్డప్ తో, దగాపడిన తన జీవితం సాక్షిగా,  మాంచి ఎమోషనల్ థ్రస్ట్ తో విలన్ల గుండెల్లో దడ పుట్టిస్తూ వచ్చాడా అంటే అదీలేదు. కామెడీగా వచ్చాడు. ఏ విచారమూ లేదు.  

పాత్రల ప్లేస్ మెంట్ తో జరిగిన మరో తప్పిదం- ప్రధాన విలన్ని చివరిదాకా హీరో ముందుకు తేకుండా అనుచరులతోనే పోరాటాలు చూపడం. దీంతో కూడా విసుగెత్తిపోయింది సినిమా. ఆ ప్రధాన విలన్ ఇంటర్వెల్లో నైనా ప్రత్యక్షమయ్యే కమర్షియల్ కథన చాతుర్యం కొరవడ్డం విచిత్రం.

ఒకభారీ బడ్జెట్ సినిమాకి బేసిక్స్ లేని స్క్రిప్టుతో ముందు కెళ్ళడంతో ఎప్పుడో జరగాల్సిన నష్టం జరిగిపోయింది, విడుదల వాయిదాలు పడ్డం జస్ట్ ఒక ఎక్స్ క్యూజ్ మాత్రమే, అంతే!

- సికిందర్
























23, మే 2014, శుక్రవారం


   రివ్యూ..         

                              సృజనాత్మక నివాళి!
రచన- దర్శకత్వం : విక్రమ్ కె. కుమార్
తారాగణం : అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సమంతా, శ్రియ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ  తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్ - ఛాయాగ్రహణం :  పి ఎస్ వినోద్ - కళ : రాజీవన్ - ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
యాక్షన్ : విజయన్ - నృత్యాలు : బృంద  - సంభాషణలు : హర్షవర్ధన్
బ్యానర్ : అన్నపూర్ణా స్టూడియోస్  - నిర్మాతలు : అక్కినేని కుటుంబం
విడుదల :  23 మే, 2014 - సెన్సార్ : U/A
***
డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు నిండు జీవితం సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అయినట్టు ఆయన నటించిన చివరి చలనచిత్రం సెలెబ్రేషన్ ఆఫ్ న్యూ యేజ్ తెలుగు సినిమా.  ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే నవరసాల పనోరమా. ఈ శుక్రవారం నుంచి మల్టీ స్టారర్ సినిమాలకి కొత్తర్ధం చెబుతూ కొత్త శకం ప్రారంభమయిందని చెప్పొచ్చు.

దర్శకుడు విక్రం కుమార్ ముందుగా ’ఇష్క్’ తో ప్రూవ్ చేసుకున్నాకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మీద సాహసించి చె య్యేసేందుకు అనుమతి లభించింది. వేసిన చెయ్యి సరాసరి అక్కినేనికి నిజమైన సృజనాత్మక నివాళి అయి నిరూపించుకుంది. ఒక కుటుంబంలోని మూడు తరాలకి చెందిన నల్గురు హీరోలతో కొత్తతరహా కథా సంవిధానంతో కట్టిపడేసే చాతుర్యం ఈ దర్శకుడిది.

మల్టీ స్టారర్ ‘మనం’ వాణిజ్య సినిమాలతో వుండే అన్ని మూఢ విశ్వాసాల్నీ బద్దలు కొడుతూ, మూస పద్ధతుల అన్ని సంకెళ్ళనీ తెంపేసుకుంటూ, తెలుగు ప్రేక్షకులు సినిమా నిరక్షరాశ్యులనే స్థిరపడిన నమ్మకాల్ని, అవకరాల్ని  అపహాస్యం చేస్తూ ఇవాళ బిగ్గెస్టు బాక్సాఫీసు బొనంజా అయికూర్చుంది.

దీని క్రెడిట్ ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించే అక్కినేని నాగార్జునకి పోతుంది. ‘మనం’ సినిమా చూడకపోతే మనోలోకాల లోతుల సెలెబ్రేషన్ కి మనుషులు దూరమైనట్టేనని లాకులు ఎత్తేసి మరీ చెబుతున్నారు...


వందేళ్ళ ప్రయాణంలో బంధాలు!
1920లో ప్రారంభమై, ప్రస్తుత కాలానికి ఐదారేళ్ళు ముందుకెళ్ళి 2020 లో ముగిసే శతాబ్ద కాలపు ఈ పునర్జన్మల సైకో ఎనాలిసిస్ కథ,  1983లో ప్రారంభమై ఇలా సాగుతుంది... రాధామోహన్ (నాగ చైతన్య), కృష్ణవేణి (సమంత) లు పెళ్ళిచేసుకుని బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు ని కంటారు. నాగేశ్వరరావు ఐదారేళ్ళు వున్నప్పుడు ఇద్దరూ కొట్లాడుకుని విడిపోదామనుకుంటారు. లాయర్ ని కలవడానికి కారులో బయల్దేరినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతారు. ముప్పై ఏళ్ల తర్వాత బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు (నాగార్జున) బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగి ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ నడుపుతుంటాడు. ఓరోజు ఫ్లయిట్ లో పక్కసీట్లో కూర్చున్న కాలేజీ స్టూడెంట్ ని చూసి స్టన్ అవుతాడు. ఈ స్టూడెంట్ నాగార్జున (నాగచైతన్య) అచ్చం తన తండ్రి రాధా మోహన్ లాగే ఉండడంతో తండ్రే మళ్ళీ పుట్టాడని - నాన్నా-  అంటూ దగ్గరవుతాడు. తండ్రే మళ్ళీ పుడితే తల్లికూడా పుట్టే ఉంటుందని ఆమెకోసం వెతుకుతుంటాడు.


ఇంకో బిజినెస్ మేనేజ్ మెంట్ స్టూడెంట్ గా అచ్చం తన అమ్మలాగే ప్రియ (సమంత) కన్పించడంతో అమ్మా అని పిలుస్తూ ఆమెకి దగ్గరవుతాడు. ఇలా  అమ్మానాన్నలతో  ఇంటరాక్ట్ అవుతూ  గతజన్మలో పోట్లాడుకుని విడిపోయిన వీళ్ళిద్దర్నీ కలిపేదెలా అని లోచిస్తున్నప్పుడు, ఒక యాక్సిడెంట్ కేసులో డాక్టర్ అంజలి(శ్రియ) పరిచయమవుతుంది. ఈమె కోరిక మీద ఆ ప్రమాద  బాధితుడు చైతన్య (అక్కినేని నాగేశ్వర రావు ) కి రక్తదానం చేయడాని నాగేశ్వర్రావు వెళ్ళినప్పుడు,  అక్కడ ఎనభై ఏళ్ల చైతన్య వీళ్ళిద్దర్నీ పూర్వ జన్మలో తన తల్లిదండ్రులుగా గుర్తించి ఎక్సైట్ అవుతాడు. 1920లలో వీళ్ళిద్దరూ లక్ష్మీ- సీతారాముడులు!

గతజన్మలో ప్రియ, నాగార్జునలు నాగేశ్వరరావు తల్లిదండ్రులైతే, నాగేశ్వర్రావూ అంజలిలు చైతన్య పేరెంట్స్ అన్నమాట. ఆర్టిస్టులుగా చెప్పుకుంటే, నాగ చైతన్య నాగార్జున తండ్రి అయితే, నాగార్జున అక్కినేని నాగేశ్వర రావు తండ్రి అన్నమాట!

ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే సరికొత్త కాన్సెప్ట్, కాంబినేషన్లు. ఇలా సూపర్ స్టార్ల కుటుంబాలతో చాలా సినిమాలొచ్చాయి. అవన్నీ రొటీన్ మూస ఫార్ములా సినిమాలే. కొన్నయితే వాళ్ళ  వంశాలదే గొప్ప అన్న టైపులో ఇగోలకి పోయిన చిత్రీకరణలు. ‘మనం’లో ఈ మూస లేదు, మీసాలు తిప్పడాలూ లేదు. మనమంటూ .. సినిమాచూసే ఆబాలగోపాలాన్నీ తమతో బాటూ కలుపుకుపోయే సమ్మిళిత వినోదాల పంట. ఓ పాత పాటని గుర్తు తెచ్చుకుంటే, ‘రానున్న విందులో నీవంతు అందుకో’ అని ప్రేక్షకుల్ని సమాదరించిన  నిరాడంబరత. అక్షరాలా ప్రేక్షకులు అక్కినేని కుటుంబపు ఈ సెలెబ్రేషన్ లో తామూ పాలుపంచుకుంటున్న ఫీలింగ్ ని పంచిపెట్టిన హ్యూమిలిటీ.

తమిళ-తెలుగు సినిమాల దర్శకుడు విక్రం కుమార్ - మిమ్మల్ని ఇంద్రుల్నీ చంద్రుల్నీ చేసి చూపిస్తానని అక్కినేని హీరోలతో చెప్పివుండొచ్చు. దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చి వుంటే ఈ సినిమా గురించి ఇవ్వాళ్ళ చెప్పుకోడానికి ఏమీ వుండేది కాదు. ఎన్నో జన్మలు, పునర్జన్మలు –ఏంతో సంక్లిష్టత-అయినా చాలా సింప్లిసిటీ, కన్ఫ్యూజన్ లేని క్రియేటివిటీ, పాత్ర చిత్రణలు, సంభాషణలు. ఇక  సంగీతం, ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం, యాక్షన్ కోరియోగ్రఫీ, ఎడిటింగ్  సమస్తం అంతర్జాతీయ ప్రమాణాలకి తీసిపోకుండా  వున్నాయి.

మెలోడ్రామానీ, విషాదాల్నీ చూపించినట్టే చూపించి, కట్ చేసే మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ చిత్రీకరణ పద్ధతితో గురుదత్ ‘ప్యాసా’ ని తలపించే దర్శకత్వాన్ని చూడొచ్చిక్కడ.

అయితే 1920ల నాటి పల్లె వాతావరణాన్ని చూపిస్తున్నప్పుడు, ఆ దృశ్యాత్మక విశేషాలకి తగ్గట్టే కాలీన స్పృహ తో సంగీతబాణీలూ ఉండాల్సింది. ఇటీవల విడుదలైన హిందీ సినిమా ‘రివాల్వర్ రాణి’లో ఇలాటిదే 1990ల నాటి కాలానికి తగిన బాణీలతో ఓ పాట పెట్టారు. ‘మనం’ లో కూడా సంగీతపరంగా ఆ ఫ్లాష్ బ్యాక్ కి పీరియడ్ ఫీల్ తీసుకు రావొచ్చు- ‘ఆదిత్య -369’ లో ‘జాణవులే’ పాటతో ఇళయరాజా తెచ్చినట్టు. డిజైనర్ పీరియడ్  ఫ్లాష్ బ్యాక్ వల్ల వేరియేషన్ లోపించి కథాకాలాలన్నీ ఒకేలా తయారయ్యాయి.

ఇక నాగార్జున-నాగచైతన్యల బాండింగ్, సమంతాతో నాగార్జున కెమిస్ట్రీ, నాగచైతన్య-సమంతాల కెమిస్ట్రీ/ఫిజిక్సూ, మళ్ళీ నాగార్జున-శ్రియల రెండుజన్మల ‘ఐలవ్యూ అంటే ఇలాఇవ్వు’ రోమాన్స్...మొత్తం వీళ్ళందరితో వయసుమీరిన అక్కినేని నాగేశ్వరరావు రియల్ టైమ్ తక్కుటమారాలూ... ‘ధర్మదాత’ లో ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి-అని కొడుకుల్ని తరిమేసిన వైరాగ్యం నుంచీ ఇప్పుడందరూ వున్న ఏకాకిలా అక్కినేని ఎంతో హుషారు నటన కనబర్చి జోష్ తెప్పించారు. చివర్లో సూపర్ ఇంపోజ్ చేసిన ‘నేను పుట్టాను’ పాట బిట్ తో అల్లరల్లరి!


విడుదలకాని ‘ఆటోనగర్ సూర్య’ ని పట్టుకుని సినిమాలేక త్రిశంకు స్వర్గంలో వున్న నాగచైతన్య బాగా ఇంప్రూవ్ అయి తిరిగొచ్చాడు. వెళ్ళిపోయిన తాతగారి  లెగసీని ముందుకు తీసుకుపోయేందుకు తాతగారికి హామీపడినట్టు నటించాడు. అయితే నటించినవన్నీ-ఒకటిరెండు తప్ప-కామెడీ సీన్లే కావడంతో అతనెంత వరకూ ఆల్ రౌండర్ అవగలడో ఈ సినిమాతో చెప్పడం కష్టం.

సీనియారిటీ కొచ్చిన నాగార్జునకి సీనియర్ శ్రియతో రోమాన్స్ వల్ల ఇబ్బందేం ఏర్పడలేదు. హీరోయిన్ సమంత యూత్ అప్పీల్ కే గాక, పాత్రలో వున్న ‘బరువుబాధ్యతల్ని’ కూడా మోయడానికి సరీగ్గా సరిపోయింది. కమెడియన్లు బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ లు అంత కామెడీ లేని పక్కపాత్రలకి సర్దుకున్నారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రానున్న మరో అక్కినేని వంశాంకురం అఖిల్ ల అతిధి పాత్ర ప్రవేశాలతో కలుపుకుని ఈ ‘మనం’ పరిపూర్ణం అయింది.

స్క్రీన్ ప్లే సంగతులు

ఈ స్క్రీన్ ప్లే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏమిటంటే, నిజజీవితంలో అక్కినేని హీరోల బంధుత్వాల్ని తిరగేసి చూపించడం! ఇదే లేకపోతే ఈ  పునర్జన్మల కథలకి కొత్తదనమే లేదు. మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలోనే పునరావృత మవుతూ వస్తున్న  అవే పునర్జనల కథలకి ఇది అనూహ్యమైన టర్నింగ్ పాయింట్. వంశంలో మూడు నాలుగు తరాల హీరోలు ఉంటేతప్ప సాధ్యంకాని అపూర్వ  ప్రయోగం.

అయితే సమస్యల్లా ఓ నూరేళ్ళ సుదీర్ఘ కాలపు కథ చెప్పాల్సి రావడం. దీన్ని ఎక్కడ ప్రారంభించి, ఏ ఏ మజిలీలు దాటించి, గమ్యానికి చేర్చాలి?

ఇలాటి సందేహమే వరల్డ్ క్లాసిక్ ‘గాంధీ’ (1982) తీసిన దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకీ వచ్చిందని సిడ్ ఫీల్డ్ పేర్కొంటాడు ‘ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్’ అన్న పుస్తకంలో. శాఖోప శాఖలుగా విస్తరించిన ఓ మహావృక్షంలాంటి మహాత్ముడి జీవితాన్ని సినిమా కథగా  ఎలా రూపొందించాలి? మహాత్ముడి జీవితంలో అన్ని ఘట్టాలనీ చూపించుకు రాలేం. అప్పుడది డాక్యుమెంటరీ అవుతుంది. క్రియేటివిటీ తో పనుండదు. అందుకని అటెన్ బరో శల్యపరిక్ష జరిపి మహాత్ముడి జీవితంలో మూడే ఘట్టాలు స్క్రీన్ ప్లేకి బలమైన ఫౌండేషన్స్ కాగలవని నిర్ణయించాడు. అవి 1. దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా పోరాట జీవితం, 2. భారత దేశంలో సహాయ నిరాకరణోద్యమం, 3. హిందూ ముస్లిముల సమస్య. ముగింపుగా హత్య!

ఈ మూడింటి ఆధారంగానే  సంఘర్షణాత్మక కథ అల్లి,  తెరమీద మహాత్మాగాంధీ జీవిత చరిత్రకి సమగ్రత సాధించాడు అటెన్ బరో. సిడ్ ఫీల్డ్  చేసిన ఈ విశ్లేషణ ప్రకారమే చూస్తే,  2007లో అబ్బాస్ ఖాన్ తీసిన ‘గాంధీ మై ఫాదర్’ సినిమాకీ ఇదే స్క్రీన్ ప్లే ఫౌండేషన్ కన్పిస్తుంది. గాంధీ కుమారుడి యాభై ఏళ్ల జీవితకాలాన్ని అటెన్ బరో ఫార్ములా ననుసరించే చిత్రించినట్టు మనకర్ధమౌతుంది.
2007 లోనే శేఖర్ కమ్ముల తీసిన సూపర్ హిట్  ‘హ్యాపీ డేస్’ స్క్రీన్ ప్లే కీ ఇదే అటెన్ బరో ఫౌండేషన్ కన్పిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఓ నాల్గేళ్ళు  హ్యాపీ గా గడిచిపోయే అనుభవాల సారంగా ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు, ఆ అనుభవాల్లో వేటిని తీసుకుని కథ తయారుచేయాలి? అనుభవాలు కలగాపులంగా వుంటాయి. వ్యక్తిగత, కాలేజీ గత, ప్రాపంచిక...ఇలా విభిన్న పార్శ్వాలుగా  అనుభవాలు కలగలిసిపోయి వుంటాయి. గాంధీ జీవిత కథ  లాంటి సమస్యే ఇక్కడ కూడా. కాకపొతే టైంలైన్ తక్కువ. అప్పుడు 1. కాలేజీలో కొత్త విద్యార్థుల ర్యాగింగ్, 2. చదువుల్లో ఎదురయ్యే సమస్యలు, 3.  ప్రేమల గురించి స్ట్రగుల్- అనే మూడు బ్లాకులుగా నాల్గేళ్ళ  టైంలైన్ ని విభజించి, వాటి తాలూకు అనుభవాల్ని మాత్రమే పొందుపర్చడంతో స్క్రీన్ ప్లేకి అంత బలం చేకూరింది.

 ‘మనం’ లో నూరేళ్ళ  టైం లైన్ని చూసినప్పుడు ఇందులో మూడు జీవిత కాలాలు ఇమిడివున్నాయి.  1. నాగార్జున-శ్రియ ల పూర్వజన్మ జీవితకాలం, 2. నాగ చైతన్య- సమంతల పూర్వజన్మ జీవితకాలం, 3. తిరిగి అక్కినేని నగెశ్వర రావుని కలుపుకుంటూ, ఈ రెండు జంటల వర్తమాన జీవితకాలం. వీటిన్నిటినీ కలిపి ఓ కథగా చెప్పాలంటే ఈ జీవితకాలాల్లో ఏ ఏ ఘట్టాల్ని ప్రధానంగా తీసుకోవాలి?

ఈ కథ ఆదిమధ్యంతాలన్నిటా (గత జన్మల్లో, ఇప్పుడూ) ఓకే సంఘటన పునరావృతమవుతూంటుంది. అది మోటారు వాహన ప్రమాద సంఘటన. దీంతో చావుపుట్టుకల చక్రభ్రమణంలో పడి పాత్రలు నలుగుతూంటాయి. చావకపోతే పునర్జన్మ లేదుకాబట్టి వేర్వేరు కాలాల్లో రెండు జంటల చావులు చూపించక తప్పదు. మళ్ళీ పునర్జన్మల్లో వాళ్ళకి పుట్టిన పిల్లలతో కనెక్ట్ చేయకా తప్పదు. ఇలా కథా పథకం డిసైడ్ అయితే వాటికి  తగ్గ ఘట్టాల్ని  ఎంపిక చేసుకోవడం సులభమే.

1. నాగచైతన్య-సమంతల ప్రేమా పెళ్ళీ, రోడ్డు ప్రమాదంలో మరణం, వాళ్ళ కొడుకుగా నాగార్జున మిగలడం, 2. నాగార్జున- శ్రియల ప్రేమాపెళ్ళీ, రోడ్డుప్రమాదంలో మరణం, వీళ్ళ కొడుకుగా అక్కినేని నాగేశ్వర రావు మిగలడం, 3. మొత్తం అందరూ కలిసి వర్తమానకాలంలో మళ్ళీ రోడ్డు ప్రమాద ఘటనలో చిక్కుకోవడం!

ఐతే కథ ఎక్కడ్నుంచీ ప్రారంభించాలి? 1920లలో నాగార్జున- శ్రియల కథ దగ్గర్నుంచా? ఇలాటి పని అటెన్ బరో కూడా చేయలేదు. అటెన్ బరో 1948లో గాంధీ హత్యతో సినిమా ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి గాంధీ కథ మొదట్నుంచీ చెప్పుకొస్తాడు. అలాగని మరీ గాంధీ ప్రారంభ దినాల జోలికి పోకుండా, 55 ఏళ్ల క్రితం 1893లో 24 ఏళ్ల యువలాయర్ గా వున్నప్పుడు, దక్షిణాఫ్రికాలో జాత్యాహంకారంతో అతణ్ణి రైల్లోంచి తోసేసే- అతడి జీవితాన్ని సమూలంగా మలుపుతిప్పేసే - సంఘటనతో ప్రారంభిస్తాడు.

ఎందుకిలా చేశాడంటే, పాశ్చాత్య స్క్రీన్ ప్లేలని సశాస్త్రీయంగా రచించు కుంటారు కాబట్టి. సొంత నమ్మకాలతో ఏదో బుద్ధికి ఎంత తోస్తే అంత రాసుకునే  మనబోటి వాళ్ళం రచిస్తే, భలే సెంటిమెంటల్ గా ఉంటుందని, గాంధీ బాల్యజీవితం దగ్గర్నుంచీ ఎత్తుకుని అవతలివాడికి తెగ బోరు కొట్టిస్తూ, మనం తెగ సంతృప్తి చెంది తరిస్తాం!
శాస్త్రీయంగా ఓ కథ అనుకోవాలంటే,  ముందుగా ప్లాట్ పాయిట్ -1, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్-2 లని గుర్తించి, వాటినాధారంగా చేసుకుని ఆలోచించకపోతే, సినిమా కథ సవ్యంగా రానట్టే!

అందుకే, మొదటి అంకం అంతంలో ప్లాట్ పాయింట్- 1 కి దారి తీసేందుకు పనికొచ్చే, కథని మలుపు తిప్పే ‘రైలు సంఘటన’ గాంధీ జీవితంలో ఉందని గుర్తించిన అటెన్ బరో- దాంతోనే కథని (మొదటి అంకాన్ని) ప్రారంభించాడన్న మాట సశాస్త్రీయంగా!

‘మనం’ లో కూడా మరీ 1920 ల దాకా వెనక్కెళ్ళ కుండా, మధ్యస్తంగా 1983 లో,  నాగచైతన్య 23 ఏళ్ల కుర్రాడిగా వున్నప్పట్నుంచే  కథ నెత్తుకున్నాడు దర్శకుడు. యువ పాత్రలతో కథ ప్రారంభించడం బాక్సాఫీసు అప్పీలుకి దోహదం చేస్తుంది కాబట్టి ‘గాంధీ’ లో ఫాలో అయినట్టే  ‘మనం’ లోనూ ఫాలో అయ్యారు.

contd...




















ప్రకటనేసుకుని పొగత్రాగొచ్చు!


సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగిరెట్టూ...పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికే ఇది తొలి మెట్టూ!’...అన్నాడు తెలుగు సినీకవి.  ‘మై జిందగీకా సాథ్ నిభాతా చలాగయా...హర్ ఫిక్ర్ కో ధువేమే ఉఢాతా చలాగయా’ (జీవితం ఎలా సాగితే అలా సాగిపోతున్నా- వర్రీస్ ని పొగలో ఊది పారేస్తున్నా! ) అన్నాడింకో  హిందీ సినీ కవి. నిన్నమొన్న కాదు, ఎప్పుడో రెండుతరాల క్రితం అర్ధ శతాబ్దం కూడా దాటిపోయిన ...ఆ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో... ఇంటిల్లిపాదీ ఈ సినిమాలకెళ్ళి ఎంజాయ్ చేసిన ఈ సిగరెట్ పాటలు, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిల్చిపోయి, ఇప్పటికీ సిగరెట్ పాటలన గానే ఇవే గుర్తొచ్చేట్టు మనోఫలకాల మీద ముద్రించుకు పోయాయి!

‘రాముడు-భీముడు’లో రేలంగి- గిరిజలు  జంటగా,  ’హమ్ దోనో’ లో దేవానంద్ సోలోగా వెలింగించిన ఈ పాటలు కామెడీ ఒకటైతే, ఫిలాసఫీ మరొకటిగా ఉత్త కాలక్షేప సాహిత్యంగా గాక, జీవితసత్యాలకి దర్పణం పట్టాయి.
ఆ తర్వాత సినిమాల్లో సిగరెట్ తాగడం స్టయిల్ స్టేట్ మెంట్ కింద మారిపోయి కాస్త వన్నె తగ్గుతూ, సూపర్ స్టార్ రజనీకాంత్ సిగరెట్ ని  పైకెగరేసి నోటకరిచే ట్రిక్కుగా కమర్షియల్ గా  ఎంత పండిందో, ఆయన్ని అనుకరిస్తూ అటు హిందీలోనూ శత్రుఘ్న సిన్హా అదే ట్రిక్ ని కాపీ కొడితే అంతగానూ పేలింది. దుర్వ్యసనాలతో ఈ పాటలేంటి, హీరోయిజాలేంటీ అని ఎవరూ చీదరించుకోలేదు.

చీదరించుకోవడం ఎప్పట్నుంచీ మొదలయ్యిందంటే,  ఈ శతాబ్దం ఆరంభంనుంచీ అప్పుడున్న హీరోల మార్కెట్ తగ్గుతూ, కొత్త కొత్త కుర్ర హీరోల రాకతో,  వాళ్ళు పోషించే ఆకతాయి స్టూడెంట్స్ పాత్రలు ఎడాపెడా సిగరెట్లూ మద్యం లాగించేసే సీన్లతో నిండిపోవడం ప్రారంభమై నప్పట్నుంచీ!

అప్పుడు 2005లో గత కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరచింది. సినిమాల్లో ధూమపానాన్నిపూర్తిగా  నిషేధించింది. 2003లోనే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నియంత్రణా చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టంతో  సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్ని నిషేధించింది. 2004 లో ఇతర అన్ని ప్రసార-ప్రచార మాధ్యమాల్లోనూ ప్రకటనలపై నిషేధం విధించింది. అప్పుడు 2005లో సినిమాలపై దృష్టి సారించింది. నవతరం సినిమాలతో పొగాకు ఉత్పత్తులు దొడ్డిదారిన విచ్చలవిడిగా ప్రచారమవుతున్నాయని గుర్తించి- సినిమాలతో పాటు టీవీ సీరియళ్ళలోనూ ఏ పాత్రా పొగాకు ఉత్పత్తుల్ని వాడుతున్నట్టు చూపించరాదని  నిషేధం విధించింది. పాత సినిమాలు ప్రదర్శించాల్సి వస్తే ముందుగా హెచ్చరిక వేయాలని  ఆదేశించింది గత ప్రభుత్వంలోని కేంద్ర ఆరోగ్య శాఖ.

ఐతే ఈ ఆదేశాల్ని అమలుపర్చాల్సింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. ఈ శాఖ పై ఆదేశాల్ని పరిశీలించి కొంత సడలింపు నిస్తూ సృజనాత్మక స్వేచ్ఛ ని కాపాడాలని నిర్ణయించి, ధూమపాన  దృశ్యాలు తప్పని  సరయితే ఆ సినిమాలకు ‘ఏ’ సర్టిఫికేట్ జారీచేయాలని కేంద్రీయ సెన్సార్ బోర్డుకి  సూచించింది. అంతే గాక సినిమాల్లో  పొగత్రాగిన నటుడి చేత సినిమా ప్రారంభంలో పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరమనే  ప్రకటన  ఇప్పించాలనీ, ఆ దృశ్యాల కిందిభాగంలో  కూడా ఇదే హెచ్చరిక స్క్రోలింగ్ వేయాలనీ ఉత్తర్వు లిచ్చింది.

దీనిపై ప్రముఖ హిందీ నిర్మాత మహేష్ భట్  ఢిల్ల్లీ హై కోర్టుని ఆశ్రయించారు. 2009 లో ఢిల్ల్లీ హై కోర్టు ధూమపానం పై సెన్సార్ ఆంక్షల్ని కొట్టి వేసింది. అయినప్పటికీ, ప్రజారోగ్య పరిరక్షణకు రాజ్యాంగం ప్రకారం ఓ పరిధిలో చర్యలు తీసుకునే వెసులుబాటు వుందని వాదిస్తూ,  కేంద్ర ప్రభుత్వం అదే సంవత్సరం సుప్రీం కోర్టు కెళ్ళింది. సుప్రీం కోర్టు ఢిల్ల్లీ  హైకోర్టు ఆదేశాల్ని కొట్టి వేసింది. అప్పట్నుంచీ 2011 వరకూ కేంద్ర ప్రభుత్వం ఇటు తనకూ, అటు సినిమా రంగానికీ అనుకూలంగా  వుండే సవరణల్ని ప్రతిపాదించడానికి  ఆలోచిస్తూ వుండి  పోయింది. అప్పుడు అదే సంవత్సరం నవంబర్ 14 నుంచి అమలయ్యేలా కొత్త నోటిఫికేషన్ని విడుదల చేసింది.

2011 అక్టోబర్ 27న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం...

1. ధూమపానం చేసే దృశ్యాలున్న సినిమాలకి ఏ/యూఏ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలి , 2. ధూమపానం చేసిన నటుడి వాయిసోవర్ తో, సినిమా ప్రారంభం లోనూ మళ్ళీ విశ్రాంతి తర్వాతా 20సెకన్ల నిడివితో డిస్ క్లెయిమర్ వేయాలి, 3. ధూమ పానం చేస్తున్న దృశ్యాల మీద పొగత్రాగడం ప్రాణాలకు హానికరం అన్న స్క్రోలింగ్ వేయాలి, 4. ఈ నోటిఫికేషన్ అమలయ్యే తేదీ, 2011 నవంబర్ 14 నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘న్యూ ఫిలిమ్స్’ వర్గీకరణతో సర్టిఫై చేయాలి, 6. ఇవన్నీ అమలయ్యాయా లేదా చూసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖాధికారి ఒకరు సెన్సార్ బోర్డు స్క్రీనింగ్ లో పాల్గొనాలి, 7. ఈ నోటిఫికేషన్ కంటే ముందున్న ‘పాత’ సినిమాలకి సంబంధించి సదరు ప్రదర్శనాశాల నిర్వాహకుడు 30సెకన్ల పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక హెల్త్ స్పాట్ ని సినిమా ప్రారంభ్నికి ముందు ప్రదర్శించాలి, 8. హలీవుడ్/వరల్డ్ సినిమాలకు ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు వుంటుంది, ఎందుకంటే అవి దిగుమతైన సినిమాలు కాబట్టి...

ఈ చట్టం ఈ రూపం తీసుకోవడానికి ఆరేళ్ళు పట్టింది. 2005 లోనే ఈ చట్ట సవరణకి  బీజం వేసినప్పటికీ, భారతీయ సినిమాల్లో  పొగత్రాగే దృశ్యాల ప్రభావం పై 2003లోనే హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాని ప్రకారం భారతదేశం ప్రతియేటా 8 కంటే ఎక్కువ  భాషల్లో 900 సినిమాలని ఉత్పత్తి చేస్తోంది. ఈ సినిమాలు పాతిక కోట్ల యువతని ఆకర్షిస్తున్నాయి.  వీటిలో 76% సినిమాలు పొగత్రాగే దృశ్యాలతో నిండి ఉంటున్నాయి. పొగత్రాగే అలవాటున్న యువతలో 52% మంది సినిమాల్లో చూసే నేర్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2500 మంది పొగాకు ఉత్పత్తుల సేవనం కారణంగా చనిపోతున్నారు. సిగరెట్లు, గుట్కా, బీడీల వంటివి ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉంటున్నాయి. టీనేజిలో వుండే ప్రేక్షకులు తమ అభిమాన తార తెరమీద తరచూ పొగత్రాగడం చూసి ప్రభావితం అయ్యే అవకాశాలు పదహారు రెట్ల కంటే ఎక్కువే వుంటుంది.  హాలీవుడ్ సినిమాల్లో లాగే భారతీయ సినిమాల్లోనూ పొగత్రాగే దృశ్యాల సరళి ప్రమాదకర పోకడలకి పోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఈనేపధ్యంలో సినిమాల్లో ఈ పోకడల్ని అరికట్టే విధాన నిర్ణయాలు తీసుకుని అమలుపరచాలని వివిధ దేశాలకు సిఫార్సు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

మరో అధ్యయన సంస్థ ప్రకారం పొగత్రాగే వారి శాతం 1991లో 13% వుంటే, 2002 లో అది 52 శాతానికి పెరిగింది. హాలీవుడ్ సినిమాల్లో లాగే భారతీయ సినిమాలూ స్మోకింగ్ ని క్యాజువల్ చర్యగా చూపిస్తున్నాయి. అలాగే ఇళ్లల్లో పొగత్రాగే వారి సంఖ్య తగ్గి, బయట త్రాగే వారి సంఖ్య పెరిగింది. 16-18 మద్య వయసున్న యువతీ యువకుల్ని సర్వే చేస్తే, సినిమాల్లో పొగ త్రాగడాన్ని ఫ్యాషన్ అన్న అర్ధంలో చూపిస్తూంటే,  అది చూసి తామూ పొగత్రాగడం అలవాటు చేసుకున్నామనీ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత  సుభాష్ ఘాయ్ అయితే,  తను  టీనేజిలో వున్నప్పుడు తెర మీద దేవానంద్ పొగత్రాగడం చూసి ప్రభావితుడ్ని అయ్యానని చెప్పుకున్నారు. అప్పట్లో సిగరెట్ తాగే వ్యక్తి గొప్ప ఆలోచనాపరుడై ఉంటాడని భావించే వాళ్ళమనీ, అలాగే సిగరెట్ తాగే నటుడుకి మంచి నటనాసామర్ధ్యం కూడా ఉంటుందని అభిప్రాయముండే దనీ, సిగరెట్ తాగని నటుడికి టాలెంట్ గానీ, సృజనాత్మకతగానీ పెద్దగా ఉండవని డిసైడ్ అయ్యేవాళ్ళమనీ  వివరించారు.

ఈ అధ్యయనం ప్రకారం పొగ త్రాగడాన్ని యువత దైనందిన జీవితంలో ఒక భాగంగా తేలిగ్గా తీసుకుంటోంది. హిందీ సినిమాలతో బాటు దక్షిణాది సినిమాల్లో విలన్ గాక, హీరోయే  సిగరెట్లు తాగే దృశ్యాలు  పెరిగిపోతున్నాయి. సినిమాలకీ, యువత ప్రవర్తనలకీ  మధ్య బలమైన సంబంధం వుంది. సినిమాల్లో చూపిస్తున్న పొగ త్రాగే దృశ్యాల తీవ్రత వాస్తవంగా దేశంలో పొగత్రాగే పరిస్థితి కన్నా బాగా ఎక్కువ వుంది.

ఇంతవరకూ బాగానే వుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గత కేంద్రప్రభుత్వం చట్ట సవరణలు చేసి అమలుపరచడం మొదలుపెట్టింది- ఈ అమలు పరచడం దగ్గరే విమర్శల పాలవుతోంది! ధూమపాన నిషేధ బాధ్యతంతా సినిమాలదే అన్నట్టు చేతులు దులిపేసుకుంటోంది...

పాటకు తగ్గట్టే  పాట్లు!

మళ్ళీ సరదా సరదా సిగిరెట్టూ పాటేసుకుంటే..

‘ఊపిరి తిత్తుల క్యాన్సర్ కిదియే కారణం అన్నారు డాక్టర్లూ... కాదన్నారులే పెద్ద యాక్టర్లూ!
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు దీయు పొమ్మన్నారూ ...దద్దమ్మలు అది విన్నారూ!’

ఈ పాట స్ఫూర్తి తోనే స్పాట్ రూపొందించారేమో అన్నట్టుంది నిర్వాకం ... హాస్పిటల్ బెడ్ మీద నోటి క్యాన్సర్ రోగి...గుట్కాలు తిని తన పరిస్థితి ఎలా  తయారయ్యిందో చూడమన్నట్టు  స్టేట్ మెంట్. ఊపిరితిత్తుల్ని పిండుతున్న చేతులు...ఆ ఊపిరితిత్తుల్లోంచి సిగరెట్లలో వుండే టార్ –పాటలో అన్నట్టు ‘కఫము’ అందామా- కాలుష్యం పిండే కొద్దీ చిక్కటి ద్రవరూపంలో నల్లగా బీకరులోకి కారే దృశ్యం...శుభమా అంటూ సినిమాని ఎంజాయ్ చేసేందు కొస్తే వెగటు పుట్టే ఈ జుగుప్సాకర దృశ్యాలేమిటిరా బాబూ అన్పించే ట్టు, సినిమా మొదట్లో, మళ్ళీ ఇంటర్వెల్లో రిపీట్ చేసే ఆనందం!

ఈ స్పాట్లో కన్పించే నోటి క్యాన్సర్ రోగి ముఖేష్ హరానే అమాంతం ఈ పొగాకువ్యతిరేక ఉద్యమం చేపట్టిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ‘బ్రాండ్  అంబాసిడర్’ గా మారిపోయాడు. అంతలో చనిపోయాడనుకోండి, అది వేరే విషయం. అయితే స్మోకింగ్ సీన్లున్న సినిమాలకి ఈ స్పాట్ ని తప్పనిసరి చేయడంతో ప్రేక్షకుల పడిన నరకయాతన ఇంతా అంతా కాదు. పొగత్రాగడం వల్ల నష్టాలకన్నా ఈ హింస ఎక్కువైపోయింది. ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఈ హింసని ప్రేక్షకుల మీద రుద్దడం  భావ్యమా అని దేశంలో  ఏ నిర్మాత  కూడా ఆలోచించలేదు. ఆలోచించి వుంటే ఈ హింస నుంచి ప్రేక్షకుల్ని కాపాడడానికైనా స్వచ్చందంగా సిగరెట్ సీన్లు చిత్రీకరించే వాళ్ళు కాదు. ఈ రకంగా సినిమాల్లో ప్రభుత్వం ఉద్దేశించిన ధూమపాన దృశ్యాల నిషేధం అమలైపోయేది. సిగరెట్ ఫ్రీ సినిమాలతో కొత్తగా యువత స్మోకింగ్ అలవాటూ కొని తెచ్చుకునే ప్రమాదమూ  తప్పేది.

కానీ ఒక మంచి పని జరగడానికి అస్సలు వీల్లేదుగా?  ప్రజలే చచ్చినట్టూ వాళ్ళ యుక్తి కొద్దీ చెడు ప్రభావాల బారి నుంచి తెలివిగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడాలి.  ప్రభుత్వమూ నిర్మాతలూ పొగత్రాగని ప్రేక్షకుల మనోభావాలని పట్టించుకోకుండా,  అంత జుగుప్సాకర స్పాట్ తో పొగత్రాగే వాళ్ళనీ భయపెట్టినా ఫలితం లేకపోవడం వల్లనేమో- దాన్ని ఉపసంహరించుకుని మరో స్పాట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘సిగరెట్ సినిమా’ లకి ఇదే అమలవుతోంది.  ‘ఏమయ్యిందీ నగరానికీ...’  అంటూ ఆందోళనగా ప్రారంభమయ్యే ఈ స్పాట్లో ఫ్యామిలీ రెస్టారెంట్ ని చూపిస్తూ,  అందులో కూర్చుని ఆడవాళ్ళు ఇబ్బంది పడేలా పొగ మేఘాలు సృష్టిస్తున్న పొగరాయుళ్ళ మీద కామెంట్లు చేస్తుంది...చూడగానే ఈ స్పాట్ ఎంత తెలివితక్కువైనదో తెలిసిపోతుంది. ఫ్యామిలీ రెస్టారెంట్లు కాదుకదా, ఇతర ఏ హోటళ్ళలోనూ కూర్చుని పొగ తాగరాదన్న ఇంగితజ్ఞానం స్మోకర్లకుంది. చాయ్ సిగరెట్లకి ఘనతవహించిన అడ్డాలైన చాలా ఇరానీ హోటళ్ళలో కూడా నో స్మోకింగ్ నోటీసులు పెట్టేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చాలన్నా పక్కనెవరైనా వుంటే దూరంగా వెళ్లి కాలుస్తున్నారు స్మోకర్లు. స్మోకర్లకి ఈపాటి  స్మోకింగ్ మర్యాద తెల్సు. వాళ్ళని అవమానిస్తూ ఇంత  అవాస్తవికమైన స్పాట్ ని తయారుచేసి సినిమాహాళ్ళకి అంటగడితే ఏ ప్రయోజనం నెరవేరుతుంది? అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినా, ఇంకే అధ్యయన సంస్థ అయినా ఘోషిం చిందేమిటి? ప్రభుత్వం కూడా గుర్తించిం దేమిటి? సినిమాలు చూసి టీనేజర్లు సిగరెట్లకి అలవాటు పడుతున్నారనేగా? అలాటి టీనేజర్లని టార్గెట్ చేసే స్పాట్ లేనా ఇవి? టీనేజర్ల పాత్ర లేని ఇలాటి స్పాట్స్ ఎన్ని వేసి ఏం లాభం? ఈ హెచ్చరికలు మనక్కాదులే, పొగత్రాగే పెద్దోళ్ళకి – అనుకోరా వాళ్ళూ?

మీ ఆశయాలు నాకొద్దు బాబూ!

ఇలాటి  ధూమపానం నిషేధ విధానంతో ప్రభుత్వ నిర్వాకం చూసి ప్రేక్షకులు ఇంకో విధంగా కూడా నష్టపోతున్నారు. అసలు కాస్త కళాభిరుచి వున్న ప్రేక్షకులెవరికైనా ఈ ప్రభుత్వ విధానం కళారూపాల  పట్ల దొరతనంగానే  అన్పిస్తుంది. ఎందుకంటే విసుగుతో చూడాల్సి వచ్చే స్పాట్స్, అంతే గాక  సిగరెట్ సీన్లు  వచ్చినప్పడల్లా  ఆరోగ్యానికి హానికరమని కింద స్క్రోలింగ్...ఇవి ఓ  చిత్రకారుడు గీసిన బొమ్మ మీద ఇంకెవరో వచ్చి గీతలు గీసిన ఫీలింగ్ ని కలగజేస్తాయి. కోపం తెప్పిస్తాయి. దృశ్యం మీద నుంఛి ఆ స్క్రోలింగ్ మీదికి దృష్టి మళ్లుతూ,  మొత్తంగా సినిమా వీక్షణా నుభవం భంగమౌతుంది. ఇలా ఈ స్క్రోలింగ్- స్పాట్ ల వీరంగం ఇప్పటివరకూ దేశంలో ఏ దర్శకుడికీ, నిర్మాతకీ అభ్యంతరకరంగా తోచలేదు- ఆ ఒక్కడికి తప్ప! ఆయన సుప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు వుడీ అలెన్!  మీ మతిమాలినతనంతో నేను తీసిన దృశ్యాల్ని కలుషితం చేసుకోలేను, మీ ఆశయాలకో నమస్కారం , నా సినిమాని  మీ దేశంలో విడుదల చెయ్యను పొమ్మని వెళ్ళిపోయాడు.

తను తీసే సినిమాలకి ఎప్పుడూ ఏదో ఒక ఆస్కార్ అవార్డు పొందే దర్శకుడు వుడీ  అలెన్ 2013లో తీసిన ‘బ్లూ జాస్మిన్’ కి మనదేశంలో సెన్సార్  పొగ సీన్ల పట్ల అభ్యంతరం వ్యక్తం జేసింది . అందులో హీరోయిన్ కేట్ బ్లాంచెట్ పొగత్రాగే దృశ్యాలు రెండున్నాయి. వీటిమీద స్క్రోలింగ్ వేసి, సినిమా లో రెండు సార్లు స్పాట్ వేయాలని కోరింది సెన్సార్ బోర్డు. వుడీ అలెన్ తీవ్రంగా మండిపడ్డాడు. నా దృశ్యాల మీద  మీరెవరు పెత్తనం చెలాయించడానికి? అని విరుచుకు పడి, నా సినిమాని మీ దేశంలో విడుదల చెయ్యనని స్పష్టం చేశాడు. ఆ విధంగా ఆ సినిమాని చూసే అవకాశాన్ని ప్రేక్షకులు కోల్పోయారు. తర్వాత డీవీడీ ల్లో చూడొచ్చు, అది వేరు. అయితే  ఈ సినిమాలో సిగరెట్లు తాగి నటించిన కేట్ బ్లాంచెట్ కి ఆస్కార్ ఉత్తమనటి అవార్డు లభించడాన్ని ఎలా అర్ధం జేసుకోవాలో సెన్సార్ బోర్డే చెప్పాలి!

1975 ఎమర్జెన్సీ కాలం లో సినిమాల్లో మద్యం, రక్తం చూపించ కూడదని నిబంధనలు విధించినప్పుడు , విలన్ పాత్రలు విధిలేక కూల్ డ్రింకులు మాత్రమే  త్రాగి రంకె లేసేవి. రక్తాలు పారించలేక పిడిగుద్దులు మాత్రమే గుద్దుకుని ఫైటింగ్  సీన్లు ముగించేసేవి. పద్మాలయా బ్యానర్ లో  హీరో కృష్ణ తీసిన ‘రామరాజ్యంలో రక్తపాతం’ అన్న టైటిలున్న పోస్టర్లలో  ‘రక్తపాతం’ మీద ‘రక్త పాశం’ అంటూ సాత్వికమైన స్లిప్పులు అతికిం చుకోవాల్సి వచ్చింది. అప్పట్లో సృజనాత్మక స్వే చ్ఛా అంటూ నినదించడానికి వీల్లేదు. అప్పట్లో ఏ స్వేచ్ఛ కీ రోజులుకావు. ఇప్పడు అన్ని స్వేచ్ఛలూ పరిఢవిల్లుతున్నా ఏ గొంతూ పెగలడం లేదు. ఒక్క ఆ విదేశీయుడు మాత్రమే తన సృజనాత్మక స్వేచ్చ కోసం తన సినిమా విడుదలనే వదులుకుని పోయాడు.

ప్రకటనేసుకుంటే ఎంత ఉవ్వెత్తున పొగమేఘాలు సృష్టించుకున్నా మాకేం అభ్యంతరం లేదనే ధోరణిలో ప్రభుత్వ ప్రవర్తన వుంటే,  ఈ మాత్రం దానికి సృజనాత్మక స్వేచ్చంటూ మనకెందుకు గొడవని ప్రకటనేసేసి ఉధృతంగా పోగసీన్లు జొప్పించేస్తున్నారు మన నిర్మాతలు. బాలీవుడ్ లో చెప్పనవసరం లేదు, టాలీవుడ్ లోనూ మహేష్ బాబు దగ్గర్నుంచీ అల్లుఅర్జున్ వరకూ ప్రతీ పేరున్న యువ స్టారూ వెండితెర మీద పొగత్రాగేసి తరిస్తున్నారు.  దక్షిణ కొరియాలో కూడా ఈ ధోరణే ప్రబలి ఎక్కడికి దారితీసిందో తెలుసుకుంటే పొగ త్రాగకుండానే భయంతో జబ్బున పడతాం. దక్షిణ కొరియాలో సినిమాల్లో స్మోకింగ్ దృశ్యాలపై నిషేధాన్ని కచ్చితంగా అమలుపర్చక పోవడంతో, సినిమాల్లో కావాలని హీరోల చేత సిగరెట్లు తాగే సీన్లు ఎడాపెడా పెట్టేస్తూ, అది సృజనాత్మక స్వేచ్చంటూ దబాయిస్తూ పోయారు. ఫలితంగా దేశ జనాభాలో 80 శాతం  మంది పోగారాయుళ్ళుగా మారిపోయి ప్రమాదం అంచున చేరుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు సిగరెట్ల కంపెనీలు నిర్మాతల్ని ఇంకా ఎగదోసి, హీరోయిన్ల చేత కూడా తాగించడం మొదలెట్టించారు. అదేమని నిలదేస్తే,  మహిళా శక్తినీ , ఇంకా మాట్లాడితే స్త్రీ స్వేచ్చనీ ప్రమోట్ చేస్తున్నామంటున్నారు! ఆ విధంగా దేశంలో స్త్రీలు కూడా సిగరెట్లు తాగేట్టు ఎగదోసి వ్యాపారాలు పెంచుకుం టున్నారు.

ఈ పరిస్థితి మనదాకా రాదనీ గ్యారంటీ లేదు. అప్పుడు మనదేశంలో దమ్ముకొట్టే ఆడా మగా లెక్కకందకుండా పోయి, ఆ సమూహం థియేటర్ లలోకూడా స్మోకించుకోవడానికి ఛాన్సివ్వాల్సిందే నంటూ పెద్ద  ఉద్యమం చేపట్టినా ఆశ్చర్యం లేదు.

ఇందాకటి పాటని ఇంకో సారి వేసుకుంటే...

థియేటర్లలో పొగ త్రాగడమే నిషేధించి నారందుకే...కలక్షన్లు లేవందుకే! ‘ అన్నట్టు తయారవుతుంది ప్రకోపించిన పొగరాయుళ్ళ తో/పొగరాయమ్మ లతో పరిస్థితి!

కొసమెరు పేంటంటే –  గత ప్రభుత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల్ని అమలుపర్చాల్సిన కేంద్ర సమాచార ప్రసారాల  శాఖ మంత్రివర్యులే - అంత సీనేం లేదు,  పొగగోల మనకెందుకు లెండి, లైట్ తీసుకోండి –అని కేంద్రీయ సెన్సార్ బోర్డు చెవిలో ఊదినట్టు ఓ ఎన్జీఓ  సంస్థ కూపీలాగి బయటపెట్టింది!


-సికిందర్
('ఈవారం' మేగజైన్, జూన్' 2014 సంచిక )