రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, ఆగస్టు 2014, ఆదివారం


సాంకేతికం 
ఆనాటి ఇంటర్వ్యూ..

రసాత్మక అనుభూతి కోసమే..
ఆదిల్ అదీలీ- కమలాకణ్ణన్- పీటర్ డ్రేపర్
హీరో సునీల్ పరుగుదీస్తున్నాడు... ప్రాణాలరజేత బట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చి, నిండుగా ప్రవహిస్తున్న నదిపైన కళ్లు తిరిగే ఎత్తులో ఉన్న భారీ చెక్క వంతెన మీదికొచ్చేశాడు. మధ్యలో ఆ వంతెన ప్రమాదకరంగా రెండుగా చీలిపోయి ఉంది. దాటేందుకు బల్లకట్టు మాత్రమే ఉంది. భయపడలేదు సునీల్. ఆ బల్లకట్టు మీదుగా అటు దాటేశాడు. తనని వెంటాడి వస్తున్న ముఠా సమీపించే లోగా, ఆ బల్లకట్టుని లాగేశాడు. అక్కడి కొచ్చేసిన ముఠా ఠక్కున ఆగిపోయింది... అంతే ఇక హై ఓల్టేజీ డ్రామా మొదలైంది. ముఠా ఆ గ్యాపుని దాటేసి సునీల్‌ని పట్టేసుకుంటుందా? ఎలా దాటుతుంది? దాటి సునీల్ మీద ఎలా వేటు వేస్తుంది?... తీవ్ర ఉత్కంఠ!

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మర్యాద రామన్న'లో ప్రేక్షకులకి విపరీతంగా థ్రిల్ కలిగిస్తున్న సన్నివేశమిది. గగుర్పాటు కల్గించే దృశ్యం. అయితే ఒక సందేహం. రాయలసీమలో ఏ నదిమీద ఇంత ఎత్తులో చెక్క వంతెన ఉందబ్బా? దీనికి సమాధానం మనకు ‘మకుటా వీఎఫ్ఎక్స్’ అధినేతల దగ్గర దొరుకుతుంది. కమలా కణ్ణన్- ఆదిల్ అదీలీ -పీటర్ డ్రేపర్ త్రయం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఆ పేరుతో ఒక సంస్థ నేర్పాటు చేసుకుని కూల్‌గా పనిచేసుకుపోతున్నారు.

వాళ్ల టెక్నికల్ బ్రిలియెన్సే ఈ అద్భుతాల్ని సృష్టించింది. 'మర్యాద రామన్న'లో మెగా వంతెనేమిటి, పాట సన్నివేశంలో కార్లు గాల్లో కెగరడమేమిటి, 'మగధీర'లో కోట, స్టేడియం నిర్మాణాలేమిటి- అన్నిచోట్లా లేనిది ఉన్నట్టు సృష్టించడమే వీళ్ల గ్రాఫిక్స్ మాయాజాలం. వీళ్ల కలయిక మాత్రం గ్రాఫిక్స్ కాదు, దైవ సంకల్పం. 'అంజి'తో కమలా కణ్ణన్‌కి ఆదిల్ పరిచయమయ్యారు. హిందీ 'గజిని' తో పీటర్ సన్నిహితుడయ్యారు. 'మగధీర' కి ఈ ఇద్దరి సహాయమూ తీసుకున్నారు కమల్. 'మగధీర' తర్వాత వాళ్లిద్దరినీ కలుపుకుని ‘మకుటా వీఎఫ్ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ స్థాపించి 'మర్యాద రామన్న' గ్రాఫిక్స్ వర్క్స్ ని చేపట్టారు.


చెన్నైకి చెందిన కమల్, బ్రిటన్ దేశస్థుడైన పీటర్ ఇద్దరూ డివిజన్ హెడ్ అండ్ చీఫ్ టెక్నీషియన్స్ గా ఉంటే, ఇరాన్ నుంచి వచ్చిన ఆదిల్ వీఎఫ్ఎక్స్ క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈయన త్రీడీ ఆర్టిస్టుగా ప్రసిద్ధుడు. ముగ్గురికీ ఈ రంగంలో దశాబ్దాల విశేష అనుభవముంది. పీటర్ తన అనుభవాన్నంతా రంగరించి గ్రాఫిక్స్ మీద మూడు గ్రంథాలు రచించారు కూడా. అవి బ్రిటన్ యూనివర్సిటీల్లో బోధిస్తున్న వీఎఫ్ఎక్స్ కోర్సుల తీరు తెన్నులనే మార్చివేశాయట.

'మా పని సినిమా దర్శకులు కోరుకున్నది అందించడమనేది నిజమే, అయితే అంతిమంగా చూసుకుంటే ఆ ఫలితం ప్రేక్షకులతో పాటు మేమూ రసాత్మకంగా అనుభూతించేలా ఉండాలి కదా' అంటారు పీటర్.

'స్థానిక మార్కెట్‌ని గుణాత్మకంగా (అంటే సృజనాత్మకంగా) అభివృద్ధి పర్చాలన్నది కూడా మా ధ్యేయమే' అంటారు ఆదిల్. ఇక- 'మగధీర' కి మేం చేసి పెట్టిన వర్క్ ప్రేక్షకుల నుంచే కాదు, తలపండిన టెక్నీషియన్స్ నుంచి కూడా ప్రశంసల్ని పొందింది' అని ఆనందం వ్యక్తం చేశారు కమల్.


ఎక్కడి పౌరులు వీళ్లు... ఎక్కడి కొచ్చి పరిశ్రమిస్తున్నారు! తెలుగు సినిమాలు వస్తుపరంగా గ్లోబలీకరణ చెందడం కలలో మాట. అయినా గ్లోబల్ కళాకారులైన వీళ్ళు తెలుగు సినిమాల కోసం తెలుగు నేల మీద స్థిరపడి, వాటికి టెక్నికల్‌గా జవసత్వాలు కల్పించడం- అదీ పబ్లిసిటీ కోరుకోకుండా కూల్‌గా పనిచేసుకుపోవడం- తెలుగు సినిమాల అదృష్టమే. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'బద్రీనాథ్'కి ఈ టీమ్ పనిచేస్తోంది. ఇటీవల రజనీకాంత్ 'రోబో' వర్క్ కూడా పూర్తి చేశారు. ఏడాదికి రెండు మూడు సినిమాలకి చేస్తామని చెప్పారు కమల్. సినిమాలే గాక అంతర్జాతీయంగా వివిధ ప్రాజెక్టులు కూడా చేపట్టామన్నారు.

కమల్ అందించిన వివరాల ప్రకారం- 'మగధీర'లో కోట, స్టేడియం నిర్మాణాల్లో పదిహేను శాతం మాత్రమే కళాదర్శకుడు రవి నిర్మించినది, మిగిలినదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీ)తో తాము సృష్టించిందే. ఈ సెట్స్ రామోజీ ఫిలిం సిటీలో వేశారు. స్టేడియం డ్రాయింగ్ ఇటలీకి చెందిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్ మార్కో రోనాల్డీ చేత వేయించుకుని, ఆదిల్ చేత త్రీడీ ఎఫెక్ట్ చేయించుకున్నారు. 


సినిమాలో కనిపించే ఉదయ్‌గఢ్ పట్టణమంతా కూడా ఆదిల్ సృష్టే. ఆదిల్‌తో 'అంజి', 'యమదొంగ', 'అరుంధతి' చిత్రాలకి కూడా కలిసి పనిచేశామని కమల్ అన్నారు. ఏ సినిమాకీ ఒక్క కంపెనీయే పూర్తి గ్రాఫిక్స్ వర్క్ చేయదనీ, రెండు మూడు సంస్థలు కలిసి పనిచేస్తాయనీ చెప్పారు. చెన్నైలో ఫ్రీలాన్స్ టెక్నీషియన్‌గా ఉన్నప్పుడు పురోగతి లేకపోయిందని, అలాంటి పరిస్థితుల్లో ఎస్.ఎస్. రాజమౌళి తనను నమ్మడమే కాకుండా తన మీద తనకు ఎంతో ఆత్మవిశ్వాసం కల్గించారని, ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు కమల్.



-సికిందర్
(ఏప్రెల్ 2011 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)




23, ఆగస్టు 2014, శనివారం

సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 
డిజిటలీకరణలో మనమింకా తాబేళ్లమే..
కె. బసిరెడ్డి, 'డిజిక్వెస్ట్' చైర్మన్-ఎండీ 
బోలెడు సెంటిమెంట్స్ ని- మూసపద్ధతుల్నీ తరతరాలుగా జీర్ణించుకున్న తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిస్థాయిలో డిజిటల్ టెక్నాలజీకి స్వాగతం పలకడమంటే మామూలు విషయం కాదు. ఒక పైరసీరహిత, వాతావరణ కాలుష్యరహిత వ్యవస్థా సృష్టికి డిజిటలీకరణే తక్షణావసరమని గుర్తించాలంటే కూడా మాటలు కాదు. ముక్తకంఠంతో పాలిథిన్ కవర్లకి ‘నో’ చెబుతున్నట్టు, ముడి ఫిలిం మీద కూడా పారంపర్యంగా వస్తున్న మమకారాన్ని వదులుకుంటే తప్ప ఇతర రాష్ట్రాలలాగా డిజిటల్ శకంలోకి సమున్నతంగా ముందడుగేయడం సాధ్యమయ్యేలా లేదు.

అయితే బసిరెడ్డి లాంటి 'ఉద్యమకారుడి'ని చూస్తే ఆశ చిగురిస్తుంది. ఈ మార్పు సంభవమే నన్పిస్తుంది. దేశంలో డిజిటల్ టెక్నాలజీని ఒక ఉద్యమంలా తీసుకుని ముందుకు పోతున్న ఏకవ్యక్తి సైన్యం కె. బసిరెడ్డి. ఇవ్వాళ దేశంలో ‘డిజిక్వెస్ట్’ పేరు తెలియని సినీ నిర్మాత ఉండరంటే అతిశయోక్తి కాదు. స్కానింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, డిజిటల్ ఇంటర్మీడియరీ, గ్రాఫిక్స్, ఫిలిమ్ రికార్డింగ్ వంటి తెలుగు నిర్మాతలకి పరిచయమున్న సేవలతో పాటు ఉన్నత నాణ్యతాప్రమాణాలతో అత్యాధునిక డిజిటల్ కెమెరాలూ ఇతర షూటింగ్ సామాగ్రీ డిజిక్వెస్ట్ గర్వించదగ్గ  సంపద. దీని చైర్మన్-ఎండీ కె.బసిరెడ్డి. తను ప్రమోట్ చేస్తున్న డిజిటల్ టెక్నాలజీతో మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళ నాడు రాష్ట్రాల సినిమా పరిశ్రమల్లోకి విజయవంతంగా చొచ్చుకుపోగల్గారీయన.
స్టూడియో దృశ్యం 
"దేశంలో నిర్మిస్తున్న 72 శాతం డిజిటల్ సినిమాలకి సేవలందిస్తున్నాం మేము. 2003లో దేశంలో మొదటి డిజిటల్ సినిమా తయారైంది. అప్పటినుంచీ చూసుకుంటే ఈ ఫీల్డులో అభివృద్ధి 700 శాతానికి చేరుకుంది'' అని గర్వంగా చెప్పే బసిరెడ్డి, కేరళ సినిమాలు నూటికి నూరు శాతమూ డిజిటలీకరణ చెందాయంటారు. అలాగే కర్ణాటక 80 శాతం, తమిళనాడు 50-60 శాతం డిజిటల్ ఫార్మాట్‌కు మారాయనీ, కానీ మన రాష్ట్రం 20 శాతం దగ్గరే ఆగిందనీ అంటారు.

'మగధీర' క్లయిమాక్స్‌కి గ్రాఫిక్స్ చేసింది డిజిక్వెస్టే. 'మనోరమ'లో 500 రూపాయల నోటుతో 8 నిమిషాల త్రీడీ క్యారెక్టర్ని సృష్టించారు. 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం'లో త్రీడీ కుక్కతో గమ్మత్తులు చేయించారు. ఇంకా చాలా చాలా అద్భుతాలు సృష్టించారు. 'ఇదీ సంగతి', 'మనోరమ', 'టాస్' లాంటి వాటికి పూర్తిస్థాయి డిజిటల్ వర్క్ చేసి, , 'ప్రస్థానం', 'అందరి బంధువయా', 'కాఫీబార్' మొదలైన సినిమాలకి డిజిటల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేశారు. ఈ వర్క్ అంతా టెక్నికల్ డైరెక్టర్ సి.వి. రావు పర్యవేక్షణలో జరుగుతోందని తెలిపారు. త్రీడీలో ఒక అద్భుతమైన తాజ్‌మహల్‌ని కూడా సృష్టించి పెట్టుకున్నారు ఆయన. దీన్ని ఎవరైనా నిర్మాత అడిగితే ఇస్తానన్నారు. లేదంటే తను తీయబోయే సినిమాలో పెట్టుకుంటానన్నారు. అన్నట్టు బసిరెడ్డి సినిమా నిర్మాత కూడా. వై.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో 'సొంత ఊరు' నిర్మించాక మళ్లీ అదే దర్శకుడితో 'గంగ పుత్రులు' నిర్మిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఆయన టీమొకటి స్టూడియోలో ‘డిజిటల్ సింహం’ రూపకల్పనలో నిమగ్నమై ఉంది.


సందర్భం వచ్చింది కాబట్టి, గ్రాఫిక్స్ జంతువులు ఆట బొమ్మల్లా కాకుండా, రక్త మాంసాలున్న నిజ జంతువుల్లా కన్పించడంలోని మర్మమేమిటని అడిగితే, జి. మోహన్ అందుకుని బదులిచ్చారు. ఈయన ఆ సంస్థ ‘ 361 డివిజన్‌’ క్రియేటివ్ డైరెక్టర్. అదంతా మోషన్ క్యాప్చర్ సాఫ్ట్‌వేర్‌తో జరుగుతుందన్నారు. ముందుగా నిజ సింహానికి ఆయా అవయవాల్లో సెన్సార్లు అమరుస్తారు. అప్పుడా సింహం నడిస్తే, పరిగెడితే, ఇంకేదైనా చేస్తే దాని కండరాల కదలికల్ని ఆ సెన్సార్ల ద్వారా మోషన్ క్యాప్చర్ సాఫ్ట్ వేర్‌ని లోడ్ చేసిన కంప్యూటర్ క్యాచ్ చేసి, ఆ సింహం గ్రాఫిక్ రూపంలోని అవయవాలకి అతికించుకుంటుంది. దీంతో కండరాలు పొంగడం, బిగుసుకోవడం లాంటి చర్యలతో అది అచ్చం ప్రాణమున్న సింహంలాగే కనిపిస్తుంది.



సాధారణంగా ఒక సినిమాకి ఒకే కంపెనీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేయదు. ఇలా ఎందుకని అడిగితే, ముందస్తు ప్రణాళిక లేకపోవడమే కారణమన్నారు బసిరెడ్డి. కొన్ని గ్రాఫిక్స్ ప్రధాన సినిమాల్ని మినహాయిస్తే మిగతా మన సినిమాల నిర్మాణ పద్ధతులు హాలీవుడ్ లాంటి వృత్తితత్వంతో కూడుకుని వుండడం లేదని చెప్పారు. పూర్తి స్క్రిప్టు చేతిలో వుండదు. సినిమా మొత్తం తీసేశాక అప్పుడాలోచిస్తారు. దాంతో టైము చాలక హడావిడిగా నాలుగైదు కంపెనీలకి పనిని విభజించి అప్పగించేస్తారు.

'
సినిమా స్టోరీ బోర్డు దశ నుంచే విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌ని భాగస్వామిని చేస్తే గ్రాఫిక్స్ వర్క్స్ ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది' అని మోహన్ కూడా అభిప్రాయపడ్డారు.

డిజిక్వెస్ట్ అసలు స్పెషాలిటీ కళ్లు చెదిరే డిజిటల్ కెమెరాల శ్రేణి. ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీతో ఏ డిజిటల్ కెమెరా తయారైనా అదిక్కడ కొలువుదీరుతుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మక 'వైపర్' డిజిటల్ కెమెరా రారాజు స్థానంలో ఉంది . 2009 ఆస్కార్ అవార్డు చిత్రం 'ది క్యూరియస్ కేసాఫ్ బెంజమిన్ బటన్' ఈ కెమెరాతో తీసిందే. ఇంకా ప్రసిద్ధ ఆరీ అలెక్సా, రెడ్‌వన్ డిజిటల్ కెమెరాలూ స్టూడియోలో ఉన్నాయి. రెడ్‌వన్ విఫలమైందని మన సాంకేతికులు కొందరు అనుకోవడాన్ని ప్రస్తావిస్తే- అది నిర్వహణ తెలియక ఏర్పరుచుకున్న అభిప్రాయమని కొట్టివేశారు బసిరెడ్డి. దేశంలో డిజిటల్ సినిమాటోగ్రఫీలో శిక్షణనిచ్చే సంస్థలు లేవనీ, మొదటిసారిగా అలాంటి శిక్షణా సంస్థని ఓ ప్రముఖ మల్టీమీడియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ తో కలిసి ప్రారంభించబోతున్నామని తెలిపారు. డిజిటల్ పోస్ట్ ప్రొడక్షన్‌లో కూడా ఇక్కడ కోర్సు వుంటుందన్నారు.

డిజిటల్ ఫిలిం మేకింగ్‌కి లభిస్తున్న ఆదరణకి ఒక్క ఉదాహరణ చాలన్నారాయన. 2009 ఆస్కార్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు ఎనలాగ్ (ఫిలిమ్)తో బాటు, డిజిటల్‌లో షూట్ చేసిన 'స్లమ్‌డాగ్ మిలియనీర్' కీ దక్కడం కంటే ఇంకేం కావాలన్నారు. హేమాహేమీలైన ఫ్రాన్సిస్‌ఫోర్డ్ కపోలా, జేమ్స్ కామెరూన్, జార్జిలూకాస్, డానీ బాయిల్, మెల్ గిబ్సన్, కమల్ హాసన్, దిల్ రాజు ప్రభృతులు తమ సినిమాల్లో డిజిటల్ ఫార్మాట్‌కి కూడా చోటు కల్పిస్తున్నారని వివరించారు. అయితే ప్రముఖ ఎనలాగ్ కెమెరాల ఉత్పత్తిదారు 'ఆరీ' సైతం మార్పుని అంగీకరిస్తూ వివిధ డిజిటల్ కెమెరాలు తయారు చేస్తూంటే, కొన్ని పేరున్న ముడి ఫిలిం కంపెనీలు మాత్రం వాటి స్వప్రయోజనాల కోసం  డిజిటల్ యానాన్ని అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బసిరెడ్డి.

ముడిఫిలిమే కాలుష్య కారకమని తేల్చారాయన. ఎలాగంటే ముడిఫిలిం తయారీ దగ్గర్నుంచి, ల్యాబ్‌లో ప్రాసెసింగ్ వరకూ అనేక రసాయన వ్యర్థాలు వెలువడుతాయి. శిథిలమైన ప్రింట్లని భస్మీపటలం చేసినా కూడా ప్రమాదకర క్యాన్సర్ కారక వాయువులు వెలువడుతాయి. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఒక్కో పంపిణీదారుడు తక్కువ ఖర్చుతో, పర్యావరణ ఫ్రెండ్లీ డిజిటల్ వి.శాట్/హార్డ్ డిస్కు రూపంలో సినిమాల్ని ప్రొజెక్షన్ వేసుకుంటే పోయేదానికి ప్రింట్ల మీద భారీ మొత్తాలు వెచ్చించి మరీ కాలుష్యాన్ని ఉత్పత్తి చేయడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నించారు. ధరలు దిగి వస్తే, ఆప్టికల్ ఫైబర్ ద్వారా ప్రొజెక్షన్‌లో మరింత నాణ్యత తీసుకురావచ్చన్నారు.

సినిమాలు డిజిటల్‌కి మారితే పైరసీని కూడా అరికట్టవచ్చన్నారు. డిజిటల్ డిస్క్ లో వాటర్ కోడ్ నిక్షిప్తమై వుంటుందని, అది తెర మీద కన్పించదని, ఒకవేళ పైరసీదారుడు తెరమీద ఆ సినిమాని షూట్ చేసి సీడీలు తీస్తే ఆ సీడీల్లో వాటర్ కోడ్ ద్వారా పైరసీ ఏ థియేటర్లో జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చనీ  అన్నారు.

రాష్ట్రంలో డిజిటల్ ఫిలిం మేకింగ్‌ని పూర్తిస్థాయిలో ముందుకు తీసుకుపోయేందుకు వీలుగా పెట్టుబడులు, సబ్సిడీలు, వినోద పన్నులో రాయితీల కోసం తాను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంటే స్పందన రావడం లేదన్నారు. ప్రభుత్వం కూడా వాతావరణ కాలుష్యానికే ఓటేస్తున్నట్టే ఉందన్నారు. డిజిటల్ సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్లు నిరాకరించడాన్ని మాత్రం తను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానన్నారు. ఫలితంగా ఇప్పుడు అన్ని ప్రాంతీయ సెన్సార్‌బోర్డులూ డిజిటల్ సినిమాలకి 'థియేటరికల్ రిలీజ్ షాట్ ఆన్ డిజిటల్' పేరిట సర్టిఫికేట్లు ఇస్తున్నాయని చెప్పారు మహెబూబ్ నగర్ జిల్లాకి చెందిన కె. బసిరెడ్డి.

-సికిందర్
(నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’కోసం)


సాంకేతికం...

ఆనాటి ఇంటర్వ్యూ
 దృశ్యంలో నేను శబ్దాన్ని చూస్తాను..

మూకీల నుంచీ టాకీలకి చలనచిత్రాలు రూపాంతరం చెందడంలో ధ్వని ముద్రణ ఒక వారధిగా ఉంటే, ఆ ధ్వని తరంగాల సముదాయాన్ని విడదీసి విపులంగా శ్రవణానందం కలగజేయడంలో స్పీకర్ నిర్ణాయకపాత్ర పోషిస్తూ వస్తోంది. మొదట మోనో సౌండ్ విన్పించిన సోలో స్పీకర్, కాలక్రమంలో మరిన్ని స్పీకర్ల వ్యవస్థకి దారితీసి, నాలుగు లేదా ఆరు ట్రాకుల శబ్ద ఫలితాల ఆవిర్భావానికి స్ఫూర్తినిచ్చింది. దీంతో అటు హాలీవుడ్‌లో మెకన్నాస్ గోల్డ్, ఇటు బాలీవుడ్, టాలీవుడ్‌లలో షోలే, సింహాసనం వచ్చి ఆబాలగోపాలాన్నీ ఉర్రూతలూగించాయి.

ఈ వ్యవస్థ లేని థియేటర్లలో అప్పట్లో సైడ్ బాక్సులు అమర్చి పాటలప్పుడు కేబిన్‌లో ఆపరేటర్ల చేత మేనేజ్ చేయించి ప్రేక్షకుల్ని తరింపజేసేవాళ్లు. ఒక్కోసారి ఈ ప్రయోగాలు వికటించి మనకి గుండె దడ, గాభరా, విరక్తి, విలాపమూ కూడా కల్గించి వదిలేవాళ్లు. 1991లో 'బ్యాట్‌మన్ రిటర్న్స్' డిజిటల్ డోల్బీ సిస్టమ్‌లో వచ్చి మనల్ని రక్షించింది. అయితే ఇది ఎనలాగ్ సౌండ్ ఫార్మాట్ (అంటే ఫిలిం మీద ధ్వని ముద్రణ) లాగే మన్నికకి, కాలపరీక్షకీ తట్టుకోలేనిది కావడంతో 1994లో డిజిటల్ థియేటర్ సౌండ్ ఇన్‌కార్పొరేషన్ సంస్థ ప్రత్యేకంగా జురాసిక్ పార్క్ కోసం డిటిఎస్ ఫార్మాట్‌ని డిజైన్ చేసి శబ్ద ఫలితాల సరికొత్త శకానికి నాంది పలికింది. ఈ విధానంలో ధ్వనిని ఫిలిం మీద ముద్రించరు. ఫిలిం రీళ్లమీద ఎలాగూ సంప్రదాయ ఎనలాగ్ బ్యాకప్ ఉంటుంది. డిటిఎస్‌కి విడిగా సీడీ రామ్‌లో ముద్రించి ఇస్తారు. దీంతో సినిమా ప్రింటు బాగోగులతో నిమిత్తం లేకుండా ఆడియోగ్రఫీకి శాశ్వతత్వం చేకూర్చినట్లయింది.
ఇప్పుడు డిటిఎస్ అంటే తెలియని ప్రేక్షకుల్లేరు. 1997లో తమిళ సినిమాతో మన దేశంలోకి ఈ టెక్నాలజీ ప్రవేశించింది. అదే సంవత్సరం తెలుగులో వచ్చిన 'మాస్టర్' మొదటి డిటిఎస్ సినిమా అయింది. 1998లో ఈ టెక్నాలజీని మన రాష్ట్రంలో రామానాయుడు స్టూడియో ప్రవేశపెడుతూ 'చూడాలని వుంది'కి డిటిఎస్ హంగులు కూర్చింది. ఆ కూర్పరే ప్రముఖ సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదన్‌రెడ్డి.

'డిటిఎస్‌తో ఆడియోగ్రఫీలో మనం కూడా సరికొత్త ప్రయోగాలు చేసే స్కోపున్నా, మన సినిమాలు డ్రామా ప్రధానమైనవి కావడంతో ఆ వీలు కుదరడం లేదు' అంటారు మధుసూదన్‌రెడ్డి. ఈ రంగంలో 14 ఏళ్ల సుదీర్ఘానుభవం ఉంది ఆయనకు. నిజమే, భారతీయ సినిమాలింకా వీధి భాగోతాల స్థాయిని దాటి రాలేకపోతున్నాయని ఏనాడో సత్యజిత్‌రే జీవిత కథ రాసిన మేరీశాటన్ ఎత్తి పొడిచింది కూడా. సినిమా అంటే డైలాగుల మోత అనే నాటు పద్ధతికీ, మధుసూదన్‌రెడ్డి లాంటి శబ్దగ్రాహకుడి సృజనాత్మకత ఎక్కడ అతుకుతుంది?

'
దృశ్యంలో నేను శబ్దాన్నీ చూస్తాను' ఇదీ ఆయన కవితాత్మక స్టేట్‌మెంట్. సినిమాని వీడియో ఫార్మాట్‌లో... సైలెం ట్ మూవీగా రన్ చేసి, ఎక్కడెక్కడ ఏయే శబ్దాలు అవసరమో ఆలోచించి తన అమ్ములపొది లాంటి 256 ట్రాకుల 8.1 ప్రోటూల్స్ సిస్టమ్ లోంచి ధ్వనుల్ని తీసి తాపడం చేస్తూపోతారు ఆయన. నిర్మాతలు ఒక్కో సినిమాకి 100 గంటల సమయమే ఇస్తారు. కాని మంచి క్వాలిటీని తీసుకు రావాలంటే 150 నుంచి 200 గంటలు అవసరమంటారు మధుసూదన్‌రెడ్డి. ఏకకాలంలో రెండు సినిమాలకి మించి చెయ్యనంటారు.

డబ్బింగ్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ శాఖల నుంచి తనకి అందే రికార్డింగుల్ని టెక్నాలజీ వుంది కదా అని ఫక్తు టెక్నోక్రాట్‌లా ధ్వని ముద్రణ చేయకుండా, ప్రేక్షకుడిలా ఫీలై రసాత్మక దృష్టితో డిటిఎస్‌ని కళాత్మకంగా ప్రెజెంట్ చేస్తారు. బొమ్మరిల్లు, సమరసింహారెడ్డి, హేపీడేస్... ఇలా ఏ సినిమాకా సౌండ్ మూడ్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా సృష్టిస్తారు. ఇందుకేనేమో నంది అవార్డుతో ఈయనకి మంచి దోస్తీ కుదిరింది. రికార్డు స్థాయిలో తొమ్మిదిసార్లు ఈ అవార్డు అందుకున్నారు.
కడప జిల్లా పులివెందులకి చెందిన ఈయన తాతగారు అంకిరెడ్డి అప్పట్లో మద్రాసులో విజయావాహినీ స్టూడియోలో ఎడిటర్‌గా ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో మద్రాసు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి సౌండ్ ఇంజనీర్ డిప్లొమా పొందారు. 1988లో కోదండపాణి రికార్డింగ్ థియేటర్‌లో డబ్బింగ్ శాఖలో చేరారు. తర్వాత ప్రసిద్ధ సౌండ్ ఇంజనీరు స్వామినాధన్ దగ్గర అసిస్టెంట్‌గా చేశారు. 1995లో రామానాయుడు స్టూడియోలో మ్యూజిక్ రికార్డిస్టుగా చేరి 'తాజ్‌మహల్'కి పనిచేశారు. పూర్తిస్థాయి ఆడియోగ్రాఫర్‌గా 'గులాబీ' మొదటి సినిమా కాగా, 1998లో 'చూడాలని వుంది'తో డిటిఎస్ టెక్నీషియన్‌గా అవతరించారు. గత రెండేళ్లుగా శబ్దాలయా రికార్డింగ్ థియేటర్లో పనిచేస్తున్నారు. మొత్తం 250 సినిమాలకి పనిచేశారు. ప్రస్తుతం 'ఖలేజా', 'రంగా ది దొంగ'లకి పనిచేస్తున్నారు.

ప్రేక్షకులు వాస్తవికతని  ఫీలవ్వాలంటే సహజసిద్ధమైన ధ్వనుల్ని మిక్సింగ్ చేయాలి. ఉదాహరణకి ఒక సీన్‌లో బెంజి కారు వస్తూంటే ఆ కారు శబ్దమే వేయాలి. కొందరు ఏదో వేరే కారు శబ్దం వేసేస్తుంటారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పోకుట్టికీ, మనకూ ఇదే తేడా. అలాగే దృశ్యాల ఫాస్ట్ ఎడిటింగ్ వల్ల శబ్దాల్ని ఆస్వాదించేందుకు చాలినంత కాల వ్యవధి చిక్కడం లేదు. కాంతి కంటే శబ్ద వేగం తక్కువ. సంబంధిత శాఖల సమన్వయంతో దర్శక నిర్మాతలు ఓపిక పడితే ఉన్నంతలో తాను ఉత్తమ ఫలితాల్ని అందించడానికే కృషి చేస్తానన్నారు మధుసూదన్‌రెడ్డి.

దీపన్ చటర్జీ ('శివ' ఫేమ్), వాల్టర్ ముర్చ్ (అపోకాలిప్స్ నౌ, గాడ్ ఫాదర్), రాండీ థామస్ (గ్లాడియేటర్, ఇండిపెండెన్స్‌డే) తన అభిమాన శబ్దగ్రాహకులని చెప్పారాయన.

-సికిందర్
(అక్టోబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

ఆర్టికల్..


వర్మతో ఈ విజయ యాత్ర ముగిసినట్టేనా?

ఒకప్పుడు ప్రఖ్యాత తెలుగు దర్శకులు హిందీలో విజయవంతమైన సినిమాలు తీసి అక్కడి జనబాహుళ్యం హృదయాల్ని దోచుకునేవారు. హిందీలోకి వెళ్ళిన నాటి ప్రఖ్యాత దర్శకులు కనీసం దశాబ్ద కాలానికి తగ్గకుండా హిందీ కెరీర్ ని కూడా కొనసాగిస్తూ, ఒకొక్కరూ హీనపక్షం డజను సినిమాలు తీసి సంచలనం  సృష్టించారు. 1950ల నుంచీ 1990 ల వరకూ అప్రతిహతంగా సాగి  ఈ విజయ యాత్ర ముగుస్తున్న దశలో, తిరిగి ఒకే ఒక్క తెలుగు దర్శకుడి వల్ల ఊపందుకుని, ఆ ఒక్కడితోనే ఇప్పటిదాకా రెండు దశాబ్దాల పాటూ ముప్ఫై సినిమాల రికార్డుతో రికార్డుల్నిసృష్టిస్తోంది. ఈ ఒకే ఒక్కడు రాంగోపాల్ వర్మ అయితే, ముందు చెప్పుకున్న ప్రఖ్యాతుల్లో ఎల్వీ ప్రసాద్ దగ్గర్నుంచీ కె. రాఘవేంద్ర రావు వరకూ డజను మంది పైనే వున్నారు.

ఇప్పుడు హిందీలో వర్మ ప్రాభవం కూడా తగ్గిన నేపధ్యంలో ఏర్పడుతున్న శూన్యాన్ని  భర్తీ చేసేందుకా అన్నట్టు కొత్త బృందం బయల్దేరుతోంది. ఈ బృందంలో శేఖర్ కమ్ముల దగ్గర్నుంచీ నందినీ రెడ్డి వరకూ వున్నారు. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ఈ కొత్త బృందం బాలీవుడ్ లో తమ పూర్వీకులు ఎగరేసిన విజయ పతాకాన్ని ఇంకా  రెపరెప లాడిస్తారా లేక, ఉన్నజెండాని దింపేసుకుని తిరుగుముఖం పడతారా అన్నది!

తెలుగులో ఒక  సినిమా తీసి విడుదలకోసం ఎదురు చూస్తున్న ఒక కొత్త  దర్శకుడికి బాలీవుడ్ లో తనకున్న కనెక్షన్స్ ద్వారా ఓ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీని గురించి బాధపడుతూ అంటారాయన- ‘అనేక కార్పోరేట్ సంస్థలు అక్కడ సినిమా నిర్మాణంలోకి దిగడంతో, దేశవ్యాప్తంగా దర్శకులు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో విపరీతమైన పోటీ పెరిగి దిక్కు తోచని స్థితిలో పడిపోతున్నారు...సౌత్ నుంచి ప్రయత్నించాలంటే అది కలలోని మాటగా మిగిలిపోతోంది...’

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే- రాం గోపాల్ వర్మ కూడా ఫ్రెష్ గా వెళ్లి బాలీవుడ్ లో ప్రయత్నించలేదు. తెలుగులో కొన్ని సినిమాలు తీశాకే, ‘శివ’ ని హిందీలో విడుదల చేశాకే, హిందీ వాళ్ళ దృష్టిలో పడి ‘రంగీలా’ తో విజయాత్ర ప్రారంభించ గలిగారు. తాజాగా హిందీలో ప్రవేశించిన  తెలుగు దర్శకుడు అజయ్ భుయాన్ అయితే- తన బాలీవుడ్ ప్రవేశం సునాయాసంగా జరిగి పోయిందంటారు. అక్కినేని నాగ చైతన్యతో ‘దడ’ అనే ఫ్లాప్ సినిమా తీసిన వెంటనే ముంబాయి నుంచి ఒక కాల్ వచ్చింది- నువ్వు హిందీ సినిమా తీస్తున్నావ్- అని. అంతే, దాంతో ఏ రీమేకూ కాకుండా ‘అమిత్ సహానీ కీ లిస్ట్’ అనే ఫ్రెష్ రోమాంటిక్ కామెడీ హిందీలో ప్రారంభమై పోయింది. అయితే విడుదలకి రెండేళ్ళు పట్టింది.

తెలుగులో హిట్టయిన సినిమాల మీద కన్నేసి హిందీలో రీమేక్ చేసుకోవడం సాంప్రదాయంగా పాటిస్తున్న బాలీవుడ్ నిర్మాతలు, తెలుగు దర్శకుల మీద అంతగా కన్నేయడంలేదు. ఇప్పుడు తాజాగా కొందరు తెలుగు దర్శకులకి హిందీ అవకాశా లొస్తున్నాయంటే అది తెలుగులో వాళ్ళు తీసిన హిట్స్ ని వాళ్ళతోనే రీమేక్ చేయించుకుందా మన్న ఆలోచనకి రావడం వల్లే. అలా శేఖర్ కమ్ముల “హేపీడేస్’ తో, నందినీ రెడ్డి ’అలామోదలైంది’ తో, క్రిష్ ‘వేదం’ తో, నీలకంఠ ‘మాయ’ తో, హిందీలోకి అడుగు పెడుతున్నారు. ఒక్క అజయ్ భుయాన్ మాత్రమే  ఇటీవల డైరెక్టుగా హిందీలో ‘అమృత్ సహానీ కీ లిస్టు’ తీయగలిగారు. ఇక సుకుమార్ అయితే ‘ఆర్య-2’ హిందీ రీమేక్ ఆఫర్ వచ్చినా అంగీకరించలేదు.

శేఖర్ కమ్ముల ‘హేపీడేస్’ రీమేక్ గురించీ, క్రిష్ ‘వేదం’ రీమేక్ గురించి కూడా ప్రతిపాదనలు చాలా కాలంగా నానుతూ వున్నాయి. ఎప్పుడో తెలుగులో హిట్టయిన వెంటనే బోనీకపూర్ ‘హేపీడేస్’ ని హిందీలో తీయాల్సింది. అది అలా అలా మరుగున పడిపోయింది. శేఖర్ కమ్ముల తెలుగులో వేరే సినిమాలు తీసుకుంటూ వుండి పోయారు. తాజాగా ‘అనామిక’ (హిందీ ‘కహానీ’కి రీమేక్) తీసి అది విజయం సాధించకపోవడంతో, తను ఇప్పుడేం చేస్తారోనని  ఎదురు చూస్తున్న సందర్భంలో హఠాత్తుగా మళ్ళీ  ‘హేపీడేస్’ హిందీ రీమేక్ వార్త వచ్చింది. ఈసారి సల్మాన్ ఖాన్ నిర్మాత! దీనికోసం హిందీలో కొత్త నటీనటులకి ఆడిషన్స్ జరుగుతున్నాయి.

ఇక క్రిష్ ‘వేదం’ హిందీ సంగతి అటకెక్కి, అనూహ్యంగా చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ రీమేక్ తెరపైకొచ్చింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇందులో చిరంజీవి పాత్ర పోషిస్తున్నారు. దీనికి టైటిల్ కూడా ‘గబ్బర్’ అని పెట్టారు. శృతీ హసన్ హీరోయిన్ గా ఇది నిర్మాణం కూడా పూర్తి చేసుకుని వచ్చే జనవరి లో విడుదల కానుంది. దీనికి పేరున్న పెద్ద దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాత. ఇది హిందీలోకి అడుగు పెట్టిన కొత్త తరం దర్శకుల్లో క్రిష్ ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడుతోంది. అగ్ర నిర్మాతతో, అగ్ర హీరో- హీరోయిన్లతో 78 కోట్ల మెగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణ మౌతోంది...ఇంత  భారీ బడ్జెట్ తో హిందీలో సినిమాలు తీసిన తెలుగు దర్శకులు ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి కాదు.

‘అలా మొదలైంది’ తో తెలుగులో మొదలైన నందినీ రెడ్డి, దీని హిందీ రీమేక్ ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించ నున్నారు. ఇంకా తారాగణం ఎంపిక పూర్తి కావాల్సి వుంది.

 ‘ఆర్య-2’ హిందీ రీమేక్ ప్రయత్నాలని నిర్మాత కుమార్ తౌరానీ ఉధృతం చేశారు. తన కుమారుడు గిరీష్ కుమార్ తౌరానీ హీరోగా ఈ సినిమా నిర్మించాలని ఉత్సాహపడుతున్నారు. గిరీష్ ఇటీవలే ప్రభుదేవా దర్శకత్వంలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ హిందీ రిమేక్ తో అరంగేట్రం చేశాడు. దీని పేరు ‘రామయ్యా వస్తావయ్యా’. రెందోది కూడా తెలుగు రీమేకే కావడం యాదృచ్చికమే నంటున్నారు తౌరానీ. ‘ఆర్య-2’ రీమేక్ కి  సుకుమారే  దర్శకత్వం వహించాలని తౌరానీ ఎంత బలవంత పెడుతున్నా లొంగడంలేదు సుకుమార్. తనకి ఎన్టీఆర్ తో సినిమా  వుందని చెబుతున్నారు. ఇదెలా తేలుతుందో ఇప్పట్లో తెలీదు.

‘మాయ’ తీసిన నీలకంఠ ఇటీవల హిందీ రీమేక్ కోసం వెళ్లి మహేష్ భట్ ని కలిశారు. ఆ సంప్రదింపులు జరుగుతున్నాయి.

ఇకపోతే, వర్మ తర్వాత హిందీలోకి వెళ్ళిన తెలుగు దర్శకుల్లో పూరీజగన్నాథ్ అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ అనే డైరెక్టు సినిమా తీసి విజయం సాధించినా ఎందుకో అక్కడి నిర్మాతల దృష్టిలో పడలేదు. ఆతర్వాత మరో హిందే తీయలేదు పూరీ. దీనికి ముందు ప్రారంభించిన ‘బద్రీ’ రీమేక్ ‘షర్త్-ది ఛాలెంజ్’ మధ్యలోనే ఆగిపోయింది.

కృష్ణ వంశీ కూడా ‘అంతః పురం’ ని హిందీలోకి ‘శక్తి’ గా రీమేక్ చేశాక మళ్ళీ హిందీ జోలి కెళ్ళలేదు. తేజ సైతం ‘యే దిల్’ తర్వాత హిందీ లో మళ్ళీ తెయలేదు.

పైన చెప్పుకున్న హిందీకి వెళ్తున్న తెలుగు దర్శకులూ  పూరీలాగే ఒక్క హిందీ సినిమాతో సరిపెట్టుకున్నా
ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ మాయాబజార్ ఇప్పుడు వర్మ కాలంలో లాగా లేదు. అక్కడ సెటిలై పోయే పరిస్థితీ లేదు. చిన్న చిన్న ఎన్నో మల్టీప్లెక్స్ సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. హిందీ ప్రాంతాల నుంచి వస్తున్న కొత్త  దర్శకులకే ఠికానా లేదు. ఒక సినిమాతో చాలించుకున్న వాళ్ళే ఎక్కువ. వర్మ తర్వాత సౌత్ నుంచి ప్రభు దేవా హిందీ కి వెళ్లి ప్రభావం చూపించినంత గా మరెవరూ చూపించలేకపోయారు. ఇప్పటికీ ప్రభుదేవాకి హిందీ ఆఫర్లు వస్తున్నాయి.

హిందీ కెళ్ళి ఒకటీ అరా సినిమాలతో సాధించే దేమీ వుండదు. పైగా ఆ ఒక్క సినిమాకోసం ఏళ్ల తరబడి   బుక్కై పోవాలి. ఈలోగా తెలుగులో మర్చిపోతారు ప్రేక్షకులు. ఎంతో ప్రామిజింగ్ దర్శకుడిగా తెలుగులో మెరిసిన క్రిష్ కన్పించడం లేదు. రేపు శేఖర్ కమ్ముల, నందినీ రెడ్డి, నీలకంఠలు కూడా ఓ రెండేళ్ళపాటు  తెలుగులో కన్పించకుండా పోవచ్చు. ఈ లోగా కొత్త దర్శకులు వచ్చి తెలుగులో నిండిపోతారు.

వర్మకి పూర్వం చూసుకుంటే అప్పటి దర్శకుల హిందీ జైత్రయాత్రే వేరు. ఒకొక్కరూ ఒకో దశాబ్దం హిందీ వాళ్లకి తెలుగు దర్శకుల ఉనికి చాటుతూ ఒక్కో డజను హిందీ సినిమాలిస్తూ పోయారు. ఇవన్నీ చాలావరకూ తెలుగు రీమేకులే. మొట్టమొదట ఎల్ వి ప్రసాద్ 1957 లో ‘మల్లీశ్వరి’ ని హిందీలో ‘మిస్ మేరీ’ గా రీమేక్ చేసి దర్శకుడిగా హిందీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత 1977 వరకూ మరో ఎనిమిది హిందీ సినిమాలు తీశారు. వీటిలో జీతేంద్ర తో తీసిన ‘జీనేకీ రాహ్’ అతి పెద్ద మ్యూజికల్ హిట్.


ఎల్.వి.ప్రసాద్ 
ఆదుర్తి సుబ్బారావు 
 ఆదుర్తి సుబ్బారావు 1967- 75 మధ్యకాలంలో 9 హిందీ సినిమాలు తీశారు. వీటిలో సునీల్ డాట్-నూతన్-జమున లతో తీసిన ’మూగమనసులు’ రీమేక్ ‘మిలన్’ అతిపెద్ద మ్యూజికల్ హిట్. దీనికి ఎల్ వి ప్రసాద్ నిర్మాత.

కె. ప్రత్యగాత్మ హిందీలో కె. పి ఆత్మగా సుప్రసిద్ధుడు. ఆయన 1966-76 మధ్యకాలంలో హిందీలో కూడా బిజీగా వున్నారు. 7 హిందీ సినిమాలు తీశారు.  వీటిలో జీతేంద్ర –ముంతాజ్ లతో తీసిన ‘ఏక్  నారీ- ఏక్ బ్రహ్మచారీ’ అతిపెద్ద మ్యూజికల్ హిట్.

ఈ దర్శకుల తర్వాత కె. రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు, బాపు, కె.విశ్వనాథ్, కె. మురళీమోహన రావు, కె. బాపయ్యల, రవిరాజ పినిశెట్టి ల  తరం వచ్చింది. వీళ్ళందరూ హిందీలో కమర్షియల్ సినిమాని కొత్త పుంతలు తొక్కించారు. కె రాఘవేంద్రరావు (1982-93) పది తెలుగు హిట్స్ ని హిందీలో తీసి బప్పీ లహరీ క్రేజీ పాటలతో సంచలనం సృష్టించారు.


కె. విశ్వనాథ్ 
దాసరి నారాయణ రావు 
దాసరి నారాయణ రావు (1980-93)లమధ్య 12 హిందీ సినిమాలు, కె. విశ్వనాథ్ (1979-85) ఎనిమిది, బాపు ( 1981-87) ఏడు, కె. మురళీ మోహన రావు (1983-98) ఏడు, కె. బాపయ్య (1977-95) అత్యధికకాలం హిందీలో మార్కెట్ నిలబెట్టుకుంటూ అత్యధికంగా 25 సినిమాలు తీసిన దర్శకుడుగా నిలిచారు. ఈయన తర్వాత 30 హిందీ సినిమాలతో రామ్ గోపాల్ వర్మ నిలుస్తారు.


ఇక రవిరాజా పినిశెట్టి ఏకంగా మెగా స్టార్ చిరంజీవినే పెట్టి 1990-92 లమధ్య ఆజ్ కా గూండా రాజ్ (గ్యాంగ్ లీడర్), ప్రతిబంధ్ (అంకుశం ) అనే రెండు సినిమాలు తీశారు.

కె. ప్రత్యగాత్మ 
కె. రాఘవెంద్రరావు 
ఇలా తెలుగు దర్శకులంటే హిందీలో ఒక గౌరవం నమ్మకం సంపాదించు కున్న రోజులవి. అందరూ అప్పుడున్న ప్రసిద్ధ స్టార్స్ తో నే తీసిన సినిమాలవి. అసలు తెలుగు నిర్మాణ సంస్థలే అత్యధికంగా వీటిని నిర్మించిన కాలమది. ఇప్పుడు హిందీ సంస్థలు వచ్చి అరకోరా తెలుగు సినిమాలు తీస్తున్నాయి గానీ, తెలుగు సంస్థలో ఎప్పుడో 
హిందీలో ఈపని దిగ్విజయంగా పూర్తిచేశాయి.

ఆరోజులు మళ్ళీ వస్తాయా? కచ్చితంగా రావు. హిందీలో అలాటి గుర్తుండి  పోయే సినిమాలు తీసిన మన దర్శకులు ఎప్పుడో బాలీవుడ్ ని పదేపదే జయించేశారు. ఆ తర్వాత వర్మ ఒంటి చేత్తో ఈ క్రతువు నిర్వహించు కొచ్చాడు. ఈయన తర్వాత ఈ దివీటీని చేబూని బాలీవుడ్ లో తెలుగు జైత్రయాత్ర కొనసాగించే దర్శకుల జాడ ఇప్పటికైతే కానరావడం లేదు...

-సికిందర్
(సెప్టెంబర్ 2014 ‘ఈవారం’కోసం)