రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, ఆగస్టు 2014, బుధవారం

రివ్యూ..


సీన్ రివర్సల్స్ తో స్పీడు!

రచన- దర్శకత్వం : సుజీత్
తారాగణం : శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, అడవి శేషు, వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావు తదితరులు.
సంగీతం : జిబ్రాన్,   ఛాయాగ్రహణం : మాధి,  కూర్పు : మధు
బ్యానర్ : యూవీ క్రియేషన్స్,   నిర్మాతలు : వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
విడుదల : ఆగస్టు 1, 2014       సెన్సార్ : U/A
***
కొత్త దర్శకుడన్నాక తన శైలిని మార్కెట్ లో వున్న దానికంటే విభిన్నంగా చాటుకుంటూ ముద్రేయక పోతే నిలదొక్కుకునే అవకాశాలు లేవీ రోజుల్లో. రెండో సినిమా కోసం మళ్ళీ మొదటికొచ్చి ప్రయత్నాలు చేయాల్సిందే. ఈ రెండేళ్ళ కాలంలో అలా యూత్ ఫుల్ సినిమాలతో సొంత శైలిని విజయవంతంగా ప్రకటించుకున్న కొత్త  దర్శకులు ఇద్దరే కన్పిస్తారు : ‘స్వామిరారా’ సుధీర్ వర్మ,  ‘రన్ రాజా రన్’ సుజీత్ లు.

తెలుగు సినిమా ఓవర్సీస్ కి వ్యాపారాన్ని విస్తరించుకుని ఎప్పుడో గ్లోకల్ (గ్లోబల్+లోకల్) సినిమాగా పరిణామం చెందింది. స్థానిక డిమాండ్లని దృష్టిలో పెట్టుకుంటూనే,  ప్రవాస ప్రేక్షకుల టేస్టునీ సంతృప్తి పర్చినప్పుడే చిన్న సినిమా అయినా ఈ మార్కెట్ కి అర్హతలు సంపాదించుకుని బాగుపడుతుంది. కానీ చాలా చిన్న, మధ్య తరహా సినిమాలు గ్లోకల్ మేకింగ్ ని గాలికొదిలేసి,  పాత మూసలోనే కొట్టుకుపోతూ లోకల్ గానూ అడ్రసు లేకుండా పోతున్నాయి. చాలా మంది మారడానికి సిద్ధంగా లేరు. ఒకరో ఇద్దరో అప్పుడప్పుడు ఇలా మెరుస్తోంటే తెలుగు సినిమా మీద గౌరవం పెరుగుతుంటుంది.

షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు సుజీత్ విజన్, నేటి కాలపు ప్రేక్షకుల విజన్ ఒకటే : న్యూవేవ్ రోమాంటిక్ క్రైం థ్రిల్లర్ ఫీల్ ఎలా ఉండాలో తెలియజెప్పే విజన్. క్యాజువల్ గా, కేర్ ఫ్రీ గా సాగిపోతూ పిల్ల గాలి తెమ్మెరలా తాకే కథా కథనాలన్నమాట. విజువల్ విలువలు, మ్యూజికల్ విలువలు అదనం.

అలాగని  విషయపరంగా ఇదేదో మరో పాప్ కార్న్ సినిమాకాదు. కాకపోతే ఉన్న విషయాన్ని సకాలంలో చెప్పడం బాధ్యతగా తీసుకోలేదు. 2000 – 2002 మధ్యకాలంలో వెల్లువెత్తిన యూత్ చిత్రాలనే జాతరలో ఇలాగే విషయాన్ని సకాలంలో చెప్పడాన్ని కూడా  లైట్ తీసుకుని- మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అనే ఒక దుస్సంప్రదాయానికి తెర లేపిన దశని మళ్ళీ గుర్తు చేస్తూ వచ్చిందే ఈ ‘రన్ రాజా రన్’ అనే ఎంటర్ టైనర్.


విషయం ఏమిటి?
రాజా ( శర్వానంద్) ఒక కూరగాయల వ్యాపారి కొడుకు. సరదాగా తండ్రి (జయప్రకాష్ వి.) దగ్గర అసరాలకి డబ్బు తీసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయడమే పని. చాలా మందిని ప్రేమిస్తాడుగానీ, నిజాయితీకి పోయి వాళ్లకి దూరమవుతూంటాడు. అలాంటిది తాజాగా ప్రియ (సీరత్ కపూర్) తో ప్రేమలో పడతాడు. తండ్రి చెప్పే  చిట్కాలతో ఎలా ప్రేమించాలో అలా ప్రేమిస్తూంటాడు. ఆమె పోలీస్ కమిషనర్ కూతురని తెలిసి కంగారు పడ్డా, ఆయన్నికలుసుకుని పెళ్లి ప్రపోజల్ పెడతానంటాడు.

మరో వైపు నగరంలో డబ్బులకోసం పోలీసు అధికారుల, రాజకీయ నాయకుల కిడ్నాపులతో అలజడిగా వుంటుంది. ఓ రెండేళ్ళ క్రితం ఇలాటి కిడ్నాపులే జరిగాయి. అప్పుడు దిలీప్ (సంపత్ రాజ్ ) అనే పోలీసు అధికారి ఆ కేసుల్ని విజయవంతంగా సాల్వ్ చేశాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పడు మళ్ళీ పెట్రేగిన కిడ్నాపుల సంగతి చూడ్డానికి అతన్నే కొత్త నగర కమిషనర్ గా నియమిస్తుంది ప్రభుత్వం.

ఈ నేపధ్యంలో రాజా కమీషనర్ దిలీప్ ని కలిసి పెళ్లి ప్రపోజల్ పెడతాడు. విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు దిలీప్. అయితే ఒక షరతు పెడతాడు. కిడ్నాపర్లని పట్టుకోవడం కోసం రాజానే కిడ్నాపర్ గా మారి నటించాలంటాడు. అలాగేనని రాజా ప్రియని కిడ్నాప్ చేసేసి దిలీప్ కి ఝలక్ ఇస్తాడు. అసలు రాజా ఆడుతున్న గేమ్ ఏమిటి, జరుగుతున్న కిడ్నాపులతో అతడికున్న సంబంధమేమిటి, కమిషనర్ దిలీప్ అతడికి ఎందుకు ఏలా శత్రువయ్యాడు మొదలైన ప్రశ్నలకి సమాధానాలకోసం ఇక్కడ్నించీ మిగతా సినిమా చూడాల్సిందే.

శర్వానంద్ కిది సరయిన ప్లాట్ ఫాం. ‘జర్నీ’ తర్వాత అలాటి న్యూవేవ్ సినిమాతో ప్రేక్షకులకి దగ్గరయ్యే అవకాశంలభించింది. పట్టుబట్టి దర్శకుడు శర్వానంద్ లుక్ ని మార్చేయడంతో అతను సరిగ్గా ఏ స్థాయి  అల్లరి నటుడు కాగలడో తెల్చేసినట్టయ్యింది. మళ్ళీ మీసాలజోలికి వెళ్ళకుండా ఈలుక్ తోనే కంటిన్యూ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోవచ్చు.


కొత్త హీరోయిన్ సీరత్ కపూర్ లావెక్కువ. ఈమెని మించి స్థూలకాయంతో నేస్తంగా నటించిన విద్యుల్లేఖా రామన్ ది కామెడీతో ఆకట్టుకునే నటన. సంపత్ రాజ్, జయప్రకాష్, కోట, అలీ, వెన్నెల కిషోర్ అందరూ కామెడీని వాళ్ళ వాళ్ళ స్టయిల్లో చేసుకుపోయారు. చాలా సీరియస్ పోలీసుగా ఎంట్రీ ఇచ్చిన సంపత్ రాజ్ ఉత్త కామెడీ క్యారక్టర్ గా మారిపోవడం మింగుడు పడని వ్యవహారం. పోతే జ్యూనియర్ పోలీసు అధికారి నయీం బాషా గా నటించిన అడివి శేష్ ది సస్పెన్స్ తో కూడిన క్లిష్ట పాత్ర.

పాటలపరంగా, నేపధ్య సంగీత పరంగా ఇదొక ఫ్రెష్ నెస్ తో కూడిన ప్రయత్నం. యాడ్ ఫిలిమ్స్ కి సంగీతం కూర్చే మహమ్మద్ జిబ్రాన్ ట్యూన్స్ మళ్ళీ ‘స్వామిరారా’ తరహా జాజ్ సంగీత బాణీల్ని గుర్తుకు తెస్తాయి.ఇక కెమెరా మాన్ మాధీది అత్యుత్తమ తరహా పనితనం. పిల్ల గాలి తెమ్మెర ఫీల్ అంతా కలర్ ఫుల్ గా అతడి కెమెరా పట్టుకోగాల్గింది. మూడోది దృశ్యాల్ని పరుగులెత్తించే మధు ఫాస్ట్ ఎడిటింగ్. ఇక ప్రకాష్ కళాదర్శకత్వం సినిమాకి నిజమైన గ్లోకల్ లుక్ ని సంతరించి పెట్టింది.

కొత్త దర్శకుడు సుజీత్ అనుభవమున్న టెక్నీషియన్ గా సినిమా మొత్తంతో కట్టి పడేస్తాడు. తడబాటు, సినిమాని బోరు సుడిగుండంలో పడెయ్యడం, సాగదీయడం, పాత్రల్ని ఖూనీ  చేయడం, నటనల్ని లైట్ గా తీసుకోవడం లాంటి బలహీనతలు లేని, ఆత్మవిశ్వాసం గలవాడిగా ఈ మొదటి సినిమాతోనే కన్పిస్తాడు. ఐతే అలా అలా వేగంగా పరుగెత్తే దృశ్యాలతో ఒక పేస్ ని మెయింటెయిన్ చేస్తూ కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేసినప్పటికీ, ఎక్కడో మెదడుని దొలిచేస్తూండే ప్రశ్నలకి సమాధానం చెప్పడంలో బాగా ఆలస్యం చేయడంవల్ల –దాని ఫలితంగా క్లైమాక్స్ ఉత్తుత్తిగానే తేల్చేయడం వల్ల,  ఒకలాంటి వెలితితోనే థియేటర్ లోంచి బయటికి రావల్సిన పరిస్థితి!

స్క్రీన్ ప్లే సంగతులు ..

ముందుగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటే ఏమిటో చూద్దాం...అప్పారావుకి సుబ్బారావ్ ఫోన్ చేసి, ఒరే నీతో అర్జెంటు పనుంది వస్తున్నా- అని వచ్చాడనుకుందాం. అలా వచ్చిన సుబ్బారావు వచ్చిన ఆ అర్జెంటు పనేంటో చెప్పకుండా గంటలతరబడి పిచ్చాపాటీ  మాట్లాడుతోంటే అప్పారావ్ కి ఎలావుంటుంది? ఓపిక నశిస్తుంది. సుబ్బారావు వచ్చిన పనేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా తగ్గుతుంది. అప్పుడు రెండు గంటలయ్యాక సుబ్బారావు చల్లగా ఓ యాభై కావాలన్నా డనుకుందాం- అప్పుడు అప్పారావ్ మానసిక స్థితి ఎలా వుంటుంది? యాభై రూపాయలు కావాలని చెప్పడానికి రెండు గంటలు నస పెడతాడా!

ఇదే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటే. పైన చెప్పుకున్నట్టు 2000 – 2002 మధ్యకాలంలో వేలంవెర్రి యూత్ సినిమాల కథన రీతులు చూసి మనం కాయిన్ చేసిన పదబంధం-మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. మనమే ఎందుకు కాయిన్ చేయాల్సి వచ్చిందంటే,  ఇలాటి వైపరీత్యం ప్రపంచంలో ఇంకే భాషా చిత్రాల్లోనూ కనపడదు కాబట్టి. అలాగని ఇదేమన్నా విప్లవాత్మక మార్పా అంటే అదేం కాదు, ఆత్మహత్యా సదృశ అజ్ఞానపు పోకడ అది. ఇలా వచ్చిన యూత్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. దీన్ని బట్టే స్క్రీన్ ప్లే అంటే ఏ అవగాహనతో కొత్తకొత్త దర్శకులు వచ్చిపడుతున్నారో అప్పట్లో తెలిసిపోయింది.

స్క్రీన్ ప్లేలో వుండే  ఫస్ట్- సెకండ్- థర్డ్ యాక్ట్ లని సింపుల్ గా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలని అనుకుంటే –
బిగినింగ్ లో ప్రధానపాత్రని, ఇతర ముఖ్య పాత్రల్నీ పరిచయం చేసి, కథ దేని గురించో చెప్పి, ఆ కథలో సృష్టించా లనుకుంటున్న సమస్య లేదా పాయింటుకి దారితీసే  పరిస్థితుల కల్పన చేస్తూ, ముగింపులో ఆ సమస్య లేదా పాయింటుని స్థాపిస్తారు. ఇది సుమారు అరగంట వుంటుందనుకుందాం.

ఇక్కడ్నించీ తర్వాతి విభాగం ‘మిడిల్’ లోపడుతుంది కథ. ఈ మిడిల్లో ప్రధాన పాత్ర ఆ సమస్య లేదా పాయింటుతో పోరాటం చేస్తుంది. ఆ సమస్య లేదా పాయింటుని ప్రత్యర్ధి పాత్ర సృష్టించ వచ్చు,లేదా ప్రతికూల పరిస్థితి ఏదైనా సృష్టించ వచ్చు. ఏదుంటే దాంతో ప్రధాన పాత్ర సంఘర్షిస్తూ ఉత్థాన పతనాలు చెందుతూ చివరికి ఈ మిడిల్ విభాగపు చివర్లో పరిష్కార మార్గాన్ని కనుగొంటుంది. దీని నిడివి గంట ఉండొచ్చు.

దీంతో కథ ఎండ్ విభాగంలో పడుతుంది. అంటే క్లైమాక్స్ ప్రారంభ మన్నమాట. ఇక్కడ ఆ ప్రధాన పాత్ర కనుగొన్న పరిష్కార మార్గం తో ఆ ప్రత్యర్థి పాత్ర, లేదా ప్రతికూల పరిస్థితి ఏదైతే అది దాని పీచమణచడం ప్రారంభించి విజయం సాధిస్తుంది. కథకి ముగింపు వాక్యం పలుకుతుంది. ఈ నిడివి అరగంట ఉండొచ్చు.


ఇదీ పదిలక్షల సినిమా కథకైనా, యాభైకోట్ల సినిమా కథ కైనా వుండే  యూనివర్సల్ స్క్రీన్ ప్లే నిర్మాణం. రెండు గంటల సినిమాకి బిగినింగ్ అరగంట వుంటే,  మిడిల్ రెండింతలు అంటే గంట వుంటుంది, ఎండ్ ఇంకో అరగంట. అంటే స్క్రీన్ ప్లేలో వీటి నిష్పత్తి 1:2:1 అన్నమాట. సీన్ల వారీగా చెప్పుకుంటే 20-40-20. ఏంచేసీ మిడిల్ సుదీర్ఘంగా సాగాలన్నమాట. కథంతా సంఘర్షణతో కూడి ఉత్కంఠ రేపుతూ మిడిల్లోనే వుంటుంది కాబట్టి.

కానీ 2000 – 2002 మధ్య కాలంలో యూత్ సినిమాలెలా వచ్చాయంటే, అరగంటలో బిగినింగ్ ముగియదు. అది గంటన్నర పాటు సాగుతుంది. అప్పుడు మిడిల్ వస్తుంది. ఆ మిడిల్, తర్వాత వచ్చే ఎండ్ ఆ చివరి అరగంటలోనే  సర్దుకుంటాయి. అంటే స్క్రీన్ ప్లేలో బిగినింగ్ ఒక్కటే మూడొంతుల స్థానాన్ని దురాక్రమించడ మన్నమాట. 3 : ½ : ½ అన్నమాట. అంటే మిడిల్ విభాగం పూర్తిగా మటాష్ అవడమన్నమాట! మిడిల్ విభాగమే మటాష్ అయితే ఇక కథేముంటుంది? అది పాయింటు కెప్పుడొస్తుంది?

గంటన్నర పాటూ బిగినింగ్ విభాగమే సాగుతూ కామెడీ-కామెడీ- కామెడీ గా ఉంటూ విషయం చెప్పకుండా వుంటే నస పెట్టడంగానే వుంటుంది.  పైన చెప్పుకున్న అప్పారావ్ –సుబ్బారావుల ఎపిసోడే.

గంటన్నర సినిమా నడిచిపోయాక అప్పుడా యూత్  సినిమాల్లో లవర్స్ మధ్య ప్రాబ్లం వస్తుంది. అది మిడిల్ అన్నమాట. పది  నిమిషాలే ఆ ప్రాబ్లంతో సంఘర్షణ వుంటుంది. అంతలోనే తేలిపోయి ఎండ్ లో పడుతుంది. చూపిస్తున్న సినిమాలో విషయమేంటో, ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి అంతసేపూ సహన పరీక్షన్న మాట. తీరా తెలుసుకుంటే అది అది ఆ చప్పున చల్లరిపోయే తాటాకు మంట మాత్రమే.


ఇదే ప్రస్తుత సినిమాలోనూ జరిగిన అనర్ధం. ఎలాగంటే, అసలు హీరోకి పోలీస్ కమిషనర్ తో వైరం ఎందుకొచ్చిందో, గతంలో ఏం జరిగిందో చెప్పడానికి దర్శకుడు క్లైమాక్స్ వరకూ సమయం తీసుకున్నాడు. అంటే ప్రారంభించిన బిగినింగే పాయింటు లేకుండా, మిడిల్ ని బుల్డొజ్ చేసుకుంటూ  క్లైమాక్స్ వరకూ సాగిందన్న మాట. ఎండ్ విభాగంలో ఫ్లాష్ బ్యాక్ వేసి అసలు విషయం చెప్పేసరికి ఆ ‘విషయం’ తో సంఘర్షణకి తావేలేక మిడిల్ విభాగమూ, ఎండ్ విభాగమూ పదిహేను నిమిషాలకి కుంచించుకు పోయి- సినిమా తేలిపోవడానికి ఆస్కారమిచ్చింది.

ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా అసలు హీరోకి ఏం జరిగిందో చెప్పి పాయింటు ఎష్టాబ్లిష్ చేసేందుకు ఇంటర్వెల్ తర్వాత వెంటనే ఫ్లాష్ బ్యాక్ వేస్తారు. అంతకంటే ఆలస్యం చేయరు.

మిడిల్ మటాష్ అనే మిడిమేళపు స్క్రీన్ ప్లేలో చెప్పాలనుకున్న విషయం ముగింపుకి జారిపోతుంది. అసలే సినిమాలోనూ క్లైమాక్స్ లో ఫ్లాష్ బ్యాక్ వేయడమే జరగదు. అక్కడ ప్రేక్షకులు భరించలేరు కాబట్టి.
ఈ లోపం గుర్తించి వుంటే ఈ సినిమా కథ మరింత బలంగా వుండేది.

దీన్ని పక్కనపెడితే, సినిమా విషయంలేకుండానే ఎందుకు కూర్చోబెడుతోందని చూస్తే- ఇందుకు సీన్ రివర్సల్స్  టెక్నిక్ ని వాడడమే కారణంగా కన్పిస్తుంది. ప్రతీ సీనూ ఒకలా ప్రారంభమై అందుకు వ్యతిరేకమైన రిజల్టుతో ముగియడమనే సీన్ రివర్సల్స్ టెక్నిక్ తో స్పీడుగా సాగకపోయుంటే,   ఈ సినిమా దీనికున్న విషయపరమైన లోపంతో కుప్పకూలేది.

వికలాంగుడికి కూడా దేవుడు ఇంకేదో ఇంద్రియ శక్తినిస్తాడు.

-సికిందర్







































2, ఆగస్టు 2014, శనివారం

రివ్యూ..
కాన్సెప్ట్ మరచిన కథనం!


రచన- దర్శకత్వం: నీలకంఠ
తారాగణం : హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, సుష్మా రాజ్, ఝాన్సీ, నాగబాబు, వేణు తదితరులు.
సంగీతం : శేఖర్ చంద్ర,   ఛాయాగ్రహణం : బాల్ రెడ్డి,  కూర్పు : నవీన్ నూలి
బ్యానర్ : షిర్డీ సాయి కంబైన్స్ , నిర్మాతలు: ఎంవికె రెడ్డి,  మధుర శ్రీధర్ రెడ్డి
విడుదల : 1 ఆగస్టు 2014,      సెన్సార్: ‘A’
***
దర్శకుడు నీలకంఠ  తీసే సినిమాల కథలు వేరైనా  వాటి మూలం ఒకటే  - మానసికం. ఆటవిడుపుగా గత సినిమా ’చెమ్మక్ చల్లో’ అనే కమర్షియల్, అంతకి ముందు “విరోధి’ అనే నక్సల్ సినిమాలు తప్పించి, ప్రస్తుత సినిమావరకూ తీసినవన్నీ మనో వైజ్ఞానిక సంబంధ  డ్రామాలే. వీటిలో తొలి రెండు సినిమాలు- షో, మిస్సమ్మ-మినహా  మిగిలినవన్నీ ప్రేక్షకుల నాడికి అందకుండా పోయినవే. సైకాలజీతోనే ఇలా వుంటే, ఇప్పుడు  ‘మాయ’ అనే తాజా  ప్రయత్నంతో ఇంకో అడుగు ముందుకేసి, ఏకంగా పారాసైకాలజీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఐతే ఈ తరహా  కథాంశాల్ని సెల్యూలాయిడ్ మీద పండించడంలో తన తొలి రోజులనాటి సృజనాత్మకత సన్నగిల్లిందని గమనించడం లేదు. ఆర్టు సినిమాలు అంతరించి, అవి కమర్షియల్ అంశాల్ని మిళితం చేసుకుని, సామాన్య ప్రేక్షకుల్నీ అలరించే క్రాసోవర్ సినిమాలుగా పరిణామం చెంది దశాబ్ద కాలం దాటిపోయినా, ఇంకా నీలకంఠ ఆర్ట్ సినిమాల కాలంలోనే ఆగిపోయినట్టు కన్పిస్తారు.

ఆర్టు సినిమాలు పరాజితుల పాసివ్  కథలు చెప్తాయి. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఆర్ధిక స్వాతంత్ర్యానికి కొత్త  ద్వారాలు తెర్చుకుని, ప్రజల జీవితాల్లో పెనుమార్పులు సంభవించడంతో ఏడ్పు కథల ఆర్టు సినిమాలకి కాలం చెల్లి- శ్యాం బెనెగల్ బాలీవుడ్ బిగ్ స్టార్స్ తో వినోదాత్మక హాస్యకథలు తీయడం, గోవింద్ నిహలానీ అదే బాలీవుడ్ బిగ్ స్టార్స్ మీద ఆధార పడి యాక్షన్ సినిమాలు తీయడమూ చేసి క్రాసోవర్ సినిమా అనే సరికొత్త ఒరవడిని కొత్త దర్శకులకి అందించి వదిలారు. హైదరాబాద్ బ్లూస్, పర్జానియా, ఇంగ్లిష్ వింగ్లిష్ , కహానీ మొదలైన తరహా మేకింగ్ లో వచ్చినవీ, వస్తున్నవీ క్రాసోవర్ సినిమాలే.

తెలుగులో గగనం, వినాయకుడు, చందమామ కథలు, దృశ్యం లాంటి వెన్నో క్రాసోవర్ సినిమాలున్నాయి. ట్రెండ్ లో వున్న వీటికీ నీలకంఠ తీసే సినిమాలకీ తేడా ఏమిటంటే, 2002 లో  ‘షో’ దగ్గర్నుంచీ ఆయన  ఆర్టు తరహా సినిమాల దగ్గరే  ఆగిపోయి వున్నారు. ఇప్పుడు  మాయ’ సూపర్ నేచురల్ (అతీంద్రియ శక్తుల) థ్రిల్లర్ అని చెప్పుకున్నారు.  ఈ థ్రిల్లర్ కథేమిటో  ఓసారి చూద్దాం!

జరగబోయేది ముందే తెలిస్తే...
మేఘన (అవంతికా మిశ్రా) కి  ఐదేళ్ళ వయసులో జరగబోయేది ముందే కనబడే అతీంద్రియ దృష్టి వున్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఒక ప్రమాదంలో తన  తల్లి చనిపోనుందని దృశ్యాలు ముందే కనపడినా అర్ధంకాక ఆమెని  పోగొట్టుకుంటుంది. పెద్దయ్యాక ఆ బాధే వెన్నాడుతుంటుంది. ఇప్పుడీమె టీవీ జర్నలిస్టు. ఈమెకి సిటీలో ఈవెంట్ కోసం వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ్ వర్మ ( హర్షవర్ధన్ రాణే)తో వృత్తిపరమైన బాధ్యత అప్పజెప్పడంతో, అతన్తో క్రమంగా ప్రేమలో పడుతుంది. ఇంతలో ఈమె చిన్ననాటి స్నేహితురాలు పూజ (సుష్మా రాజ్) వచ్చేసి,  సిద్ధార్థ్ తనక్కాబోయే భర్త అనడంతో మేఘన ఇరుకున పడుతుంది.

ఇలా వుండగా మేఘనకి ఒక నగల షాపు దగ్గర హత్య జరగబోతున్నట్టు దృశ్యాలు కనబడతాయి. కాకతాళీయంగా ఆ సంఘటనలో హంతకుణ్ణి పట్టిస్తుంది. అలాగే సిద్ధార్థ్ కి సంబంధించి కూడా గతం లో జరిగింది ఆమెకి తెలుస్తుంది. ఆ గతంలో అతను ముందు ప్రేమించిన వైశాలి (నందినీ రాయ్) అనే అమ్మాయి అనుమానాస్పద మరణంలో అతడి హస్తమున్నట్టు తెలుస్తుంది.  అంతేగాక ఇక ముందు కూడా తను పెళ్లి చేసుకోబోతున్న పూజని కూడా చంపబోతున్నట్టు మేఘనకి భవిష్యద్దర్శనం అవుతుంది. ఇప్పుడు  మేఘన ఏం చేసిందనేది మిగతా కథ.

ముగ్గురమ్మాయిలతో ఈ చతుర్భుజ ప్రేమాయణంలో పాత్రధారుల నటనలు చాలా నిరాశ పరుస్తాయి. మేఘన పాత్రలో హీరోయిన్ అవంతికా మిశ్రా చాలా పెద్ద మైనస్ ఈ సినిమాకి. ముఖంలో ఎక్స్ ప్రెషన్స్  వుండవు. పైగా చేస్తున్న టీవీ జర్నలిస్టు వృత్తికి తగ్గ వేషభాషలు లేక, ఎప్పుడూ నిండు చీరలో నుదుట పెద్ద బొట్టుతో, వయసుకి మించిన హుందాతనంతో  చాదస్తంగా కన్పిస్తుంది. యువ ప్రేక్షకులకి హీరోయిన్ అక్కయ్య లా కన్పడ్డంకన్నా బాక్సాఫీసు వ్యతిరేక చర్య వుంటుందా?


మెయిన్ హీరోయిన్ని ఇలా చూపించాం కాబట్టి,  సెకండ్ హీరోయిన్ని ఫాస్ట్ గర్ల్ గా చూపించాలన్న ఫార్ములా కొలమానాలతో సుష్మా రాజ్ ని ప్రవేశ పెట్టారు. ఈమె అల్లరి ఆకతాయితనం కృత్రిమంగా, ఐదేళ్ళ మెంటల్ స్టేజిని ప్రదర్శిస్తూంటాయి.

డల్ ఫేసుతో హర్షవర్ధన్ రాణే సైతం హీరో లా అన్పించడు. ఇక మూడో హీరోయిన్ నదినీ రాయ్ సరేసరి. ఇలా తారాగణమంతా తెలుగువాళ్ళు కాని నటీ నటులైనప్పుడు తెలుగు సినిమా తీయడ మెందుకని ప్రశ్న వేధిస్తూంటుంది.

సాంకేతికంగా చూస్తే ఛాయాగ్రహణం డౌన్ ప్లే చేసిన లైటింగ్ తో విజువల్ అప్పీల్ కల్గించదు, అలాగే సంగీతమూ. దర్శకత్వం వెనకటి తరం ప్రేక్షకుల కాలం నాటి శైలిలో వుంది.

స్క్రీన్ ప్లే సంగతులు..
ఫ్రెంచి దర్శకుడు జీన్ లక్ గొడార్డ్ అంటాడు – ఒక సినిమా సృజనాత్మక విలువల్ని ఎక్కడ్నించీ సంగ్రహించామన్నది  కాదు ప్రశ్న, ఎక్కడికి తీసుకెళ్తున్నా మన్నదే సమస్య అని!

హాలీవుడ్ ‘ఫైనల్ డెస్టినేషన్’ సినిమా ‘మాయ’ కి స్ఫూర్తి అయితే కావొచ్చు , కానీ ఈ స్ఫూర్తిని, ఆ సృజనాత్మక విలువల్నీ  ఏ కాలపు ప్రేక్షకులకి అందిస్తున్నామన్న కాలీన స్పృహ లోపించడమే ఈ స్క్రీన్ ప్లే కి పెద్ద శాపం.

నేటి కాలపు థ్రిల్లర్ కుండాల్సిన డైనమిక్స్ కంటే ఆర్ట్ సినిమాలో వుండే బద్దకమే ఇందులో కన్పిస్తుంది. ఎత్తుకున్న అతీంద్రియ శక్తులకథకీ, విప్పిన హత్యా రహస్యానికీ ఏ సంబంధమూ లేకుండా ఉండడం కొట్టొచ్చినట్టుండే ఒక కాన్సేప్చ్యువల్ బ్లండర్ గా తెలిసిపోతుంది. జరగబోయేది ముందే తెలిసిపోయే ఈ.ఎస్.పి ( ఎక్స్ ట్రా సెన్సరీ పర్సెప్షన్) లేదా సిక్స్త్ సెన్స్ కొంచెం ఎక్కువుండే స్థితి అన్న బిల్డప్ తో ప్రచారం చేశారు. తీరా సినిమాలో తేలిందేమిటంటే, ఇంత ఇంటలెక్చువల్ కలరివ్వ నవసరం లేకుండానే, దీన్నో సాదా సీదా మర్డర్ మిస్టరీగా నడిపించెయ్యొచ్చని!

ఒక సినిమా కథని మూడు వాక్యాల్లో ఒక లైనుగా చెప్పుకుంటే ఆది మధ్యాంతాల  పరస్పర సంబంధంతో కన్పించాలి. ఈ సినిమా కథని మూడు వాక్యాల్లో పెట్టి చూస్తే  ఇలా వుంటుంది.... అతీంద్రియ దృష్టి వున్న మేఘన సిద్ధార్థ్ ని ప్రేమించింది, ఆ సిద్ధార్థ్ హంతకుడనీ తను ప్రేమిస్తున్న పూజ ని హత్య చేయబోతున్నాడనీ  మేఘనకి అతీంద్రియ దృష్టి ద్వారా తెలిసిపోయింది, అప్పుడామె పూజతోనే ప్రాణాపాయంలో పడింది.

ఈ లైనులో ఆది (అతీంద్రియ దృష్టి వున్న మేఘన సిద్ధార్థ్ ని ప్రేమించింది) మధ్యమం (ఆ సిద్ధార్థ్ హంతకుడనీ తను ప్రేమిస్తున్న పూజ ని హత్య చేయబోతున్నాడనీ  మేఘనకి అతీంద్రియ దృష్టి ద్వారా తెలిసిపోయింది) అంతం (అప్పుడామె పూజతోనే ప్రాణాపాయంలో పడింది..) పరస్పరాధార భూతంగా ఉన్నాయా?

ఆది మధ్యమాల్లో అతీంద్రియ దృష్టి అనే ఎత్తుకున్న కాన్సెప్ట్ కన్పించినా, అంతం లో దాన్ని విడిచి పెట్టేశారు.  అతీంద్రియ దృష్టి వున్న మేఘనకి పూజతో తనే ప్రమాదంలో పడుతుందని ఎందుకు తెలీదు?

ఇలా ఎత్తుకున్న కాన్సెప్ట్  పరంగా కథకి ముగింపు నివ్వలేదు. కాన్సెప్ట్ విలువకి ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వలేదు. ఒక మర్డర్ మిస్టరీ తేల్చే సాధారణ బిజినెస్సే జరిగి అంతం లో కాన్సెప్ట్ ఎగిరి పోయింది. ఇలా ఇంటర్వెల్ తర్వాత నుంచీ ఈ కాన్సెప్ట్ కనుమరుగై పోయి, ఈ మాత్రం దానికి ఈ  కాన్సెప్ట్ తో ఇంత హడావిడి అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

అతీంద్రియ దృష్టి వున్న జర్నలిస్టు మేఘన సిద్ధార్థ్  ని ప్రేమించింది (ఆది), ఆ సిద్ధార్థ్ హంతకుడనీ తను ప్రేమిస్తున్న పూజ ని హత్య చేయబోతున్నాడనీ  మేఘనకి అతీంద్రియ దృష్టి ద్వారా తెలిసిపోయింది (మధ్యమం), అప్పుడామె పూజనే హంతకురాలిగా చేసి సిద్ధార్థ్ నే కాపాడుకునే స్వార్ధపరురాలిగా ప్రశ్నార్ధకంగా తయారయ్యింది (అంతం)!


ఇలా వుంటే మేఘన  పాత్ర ఎంత ఇంటరెస్టింగ్ గా తయారయ్యేది (యాంటీ హీరోయిన్ గా రోల్ రివర్సల్)? దీంతో కథ ఎంత క్రేజీగా, డైనమిక్ గా  తయారయ్యేది? ఆమె ఎందుకలా తయారవుతుందంటే , అసలు జరిగిందేమిటో తనకి ముందే తెల్సు. లేకపోతే అలాటి అతీత శక్తి వుండీ అర్ధం లేదు. దర్శకుడు ఫ్లాష్ బ్యాక్ లో మనకి చూపించిందాని ప్రకారం, మొదటి గర్ల్ ఫ్రెండ్ వైశాలి మరణం లో  సిద్ధార్థ్ అనుమానితుడు. ఇది మేఘన కూడా తన అతీత శక్తితో చూసింది. ఇక్కడే కిటుకు వుంది. ఎలాగంటే, దర్శకుడు చిట్టచివర్లో  మిస్టరీ విప్పడం కోసం,  అసలా వైశాలి మరణంలో అసూయతో రగిలిపోయిన రెండో గర్ల్ ఫ్రెండ్ పూజ పాల్పడిన చర్యని  ప్రేక్షకుల నుంచి దాచి పెట్టాడు. ప్రేక్షకులనుంచి దాచి పెట్టడం క్లైమాక్స్ కోసం చాలా అవసరమే. కానీ అదే సమయంలో అతీత శక్తి వున్న  మేఘన నుంచి ఎలా దాచి పెట్టగలడు? ఆమె గతంలో జరిగిన ఆ హత్యా దృశ్యాన్ని  చూసివుంటే, అందులో పూజ పాత్రసహా మొత్తం చూసి వుండాలి కదా. లాజిక్ ని  పట్టించుకోకుండా క్రైం కథని ఊహించడం సాధ్యమవుతుందా?  దాన్ని ఆస్వాదించడం అంతకన్నా వీలవుతుందా?


కాబట్టి ఇప్పుడు మేఘనకి తన మనోనేత్రం  ద్వారా హంతకుడు సిద్ధార్థ్ కాదనీ, పూజాయే హంతకురాలనీ ముందే తెలుసనుకుందాం, అప్పుడు  ఈ ఎరుకతోనే ఆమె ఆలా ప్రవర్తించడం మొదలెట్టిందన్న మాట : పూజాని హంతకురాలిగా నిరూపించి, తను ప్రేమిస్తున్న సిద్ధార్థ్ ని దక్కించుకోవడం కోసం ! రివర్స్అయిన  క్యారక్టర్!

ఈ ముగింపులో తనే మర్డర్ మిస్టరీని రివీల్ చేసి, తన అతీత శక్తిని హైలైట్ చేసుకుని, మారిపోయిన తన ప్రవర్తనని జస్టిఫై చేసుకుంటుందన్న మాట!

అంతేగానీ, సినిమాలో మనకి చూపించినట్టుగా పూజాయే తను చేసిన హత్యని వెల్లడించడం కాదు. అలా చేయడంవల్ల మేఘనతో బాటు, హీరో కూడా చేతకాని వాళ్ళయ్యారు. ఈ కథలో ప్రధాన పాత్ర మేఘనయే. అలాంటప్పుడు ఏదైనా ఆమె విజయంగానే వుండాలి. చాలా పూర్వం హిందీలో తీసిన ‘ధువాఁ ’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో చిట్టచివర్లో రాజమాత పాత్ర (రాఖీ) తనే హత్య చేసినట్టు ఒప్పుకుంటుంది- తానుగా వెల్లడించదు -ఆమె తన నోటితో తానే వెల్లడించేలా పరిస్థితులు కల్పిస్తూ వస్తాడు సీబీసి పాత్రధారి అమ్జద్ ఖాన్. ఈ సినిమా అంతా ఎందుకు జరుగుతోందో చెప్పకుండా రకరకాల పాత్రలతో రాజమాత నోట నిజం కక్కించడానికి చేసే పరిస్థితుల కల్పనగానే సాగుతుంది కథనం!

* సిటీ కొచ్చి భాయ్ పేరుతో దందా చేసుకుంటున్న శీను విషయం భాయ్ కి తెలిసిపోతుంది (ఆది), అతన్ని మామతో సహా చంపెయ్యమని ఆర్డరేసి హీరోయన్ని తీసుకుని వేరే పెళ్లి చేయడానికి షార్జా పారిపోతాడు భాయ్ (మధ్యమం), అప్పుడు శీను షార్జా వెళ్లి  భాయ్ కుట్రలన్నిటినీ బయటపెట్టి హీరోయిన్ని సొంతం చేసుకుంటాడు (అంతం)- ఇదీ మూడు వాక్యాల్లో ఆదిమధ్యాంతాల  ‘అల్లుడు శీను’ పరస్పరాధార భూత స్టోరీ లైను.

* భార్యా పిల్లలతో హాయిగా గడిచిపోతుంటుంది హీరో జీవితం, అప్పుడొక యూత్ కూతురి అభ్యంతరకర ఫోటో తీసి తల్లీ కూతుళ్ళ చేతుల్లో హతమై పోతాడు, ఇప్పుడీ కుటుంబాన్ని చట్టం బారి నుంచి కాపాడ్డానికి తెలివైన ప్లానేస్తాడు హీరో - ఇదీ ‘దృశ్యం’ లైను.

* పంజాబీ హీరో-  తమిళ హీరోయిన్ ప్రేమించుకుంటారు, పెళ్లి దగ్గర కొచ్చేసరికి కుటుంబాలు అడ్డు అవుతాయి, తమ కుటుంబాలు ఒప్పుకుంటే తప్ప పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు హీరోహీరోయిన్లు- ‘2-స్టేట్స్’ హిందీ లైను.

* ఒక వైరస్ వ్యాపించి మానవజాతి సమస్తం తుడిచి పెట్టుకుపోతుంది, తట్టుకున్న వానరాలు వాటి నాయకుడి సంరక్షణలో ప్రశాంతంగా జీవిస్తూంటాయి, అప్పుడింకా బతికే వున్న  కొందరు మనుషులు వాటి భూభాగంలోకి చొచ్చుకు రావడంతో తీవ్ర పోరాటం మొదలవుతుంది....ఇది ‘డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ లైను.

* ఆ భార్యాభర్త లిద్దరూ గీత రచయితలుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటారు, భర్తకి ఒక పెద్ద అవకాశం వస్తుంది, దీంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమా కళాతృష్ణా సంఘర్షణలో పడతాయి- ‘బిగిన్ ఎగైన్’ స్టోరీ లైను.  

ఒక స్టోరీ లైను అనుకుంటున్నప్పుడు అందులో ఆది మధ్యాంతాల సమన్వయాన్ని బట్టే కథ వస్తుంది. ఆ ఆది మధ్యాంతాల్లోనే స్క్రీన్ ప్లే మూడంకాలుంటాయి. ఆది (ఫస్ట్ యాక్ట్)- మధ్యమం (సెకండ్ యాక్ట్)-అంతం (థర్డ్ యాక్ట్). ఇలా కథకి లైను అనుకున్నప్పుడే  త్రీ యాక్ట్స్ ధర్మానికి సెట్టయ్యేలా – ఆ త్రీ యాక్ట్స్ లోనూ కాన్సెప్ట్ రన్ అయ్యేలా చూసుకుంటే, కథకి ఓ దారీ తెన్నూ ఏర్పడుతుంది.

రాముడు వనవాసం వెళ్ళాడు-రావణుడు సీతని అపహరించాడు-రాముడు రావణ సంహారం చేసి సీతని రక్షించుకున్నాడు...ఇలా పురాణాల్లో చూసినా ఈ నిర్మాణమే వుంటుంది. త్రీ యాక్ట్స్ నిర్మాణం గురించి రెండువేల ఏళ్ళ క్రితం నాటకాల్ని దృష్టిలో పెట్టుకుని అరిస్టాటిల్ చెబితే చెప్పి ఉండొచ్చు గానీ, అంతకి ముందు నుంచే ప్రపంచ పురాణా లన్నిట్లోనూ ఒక లైను గా చెప్పుకుంటే వుంది. ఎందుకు వుందంటే మనిషి మెదడు కథని రిసీవ్ చేసుకునే పధ్ధతి అదే కాబట్టి! పురాణాలన్నీ, ఆ మాటకొస్తే ఇప్పటిదాకా వచ్చిన నాణ్యమైన కాల్పనిక కథలన్నీ చేసేది సైకో థెరఫీనే!

ఇందుకు భిన్నంగా ‘మాయ’ అనే పారాసైకలజీ స్టోరీ లైను లోనే ఆదిమధ్యాంతాల సమన్వయం లోపించడంతో, సైకో థెరఫీ చేసే మాటలా వుంచి, కనీస స్థాయి థ్రిల్లర్ గానూ రాణించలేక పోయింది.

***
ఈ సినిమా ఫస్టాఫ్ విషయమేమీ లేక బోరు కొట్టిందని వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కారణం, ఇంటర్వెల్లోపు ప్రవేశ పెట్టిన పూజా పాత్రతో ప్లే ని నిర్లక్ష్యం చేయడమే. సినిమా ప్రారంభమైన అరగంటలోపు నా కాబోయే భర్తంటూ పూజ రావడం దగ్గర, హమ్మయ్య ఫస్ట్ యాక్ట్ సకాలం లోనే ముగిసి సెకండ్ యాక్ట్ తో అసలు కథ ప్రారంభ మైనదని సంబరపడతాం. పూజ వల్ల ఈ కథ ఏ మలుపు తీసుకుంటుందో నని ఎదురు చూస్తాం. పూజ బ్యాక్ గ్రౌండ్ ముందుగా మనకి తెలీక పోయినా దర్శకుడికి తెలుసు- అప్పటికే ఆమె తనకాబోయే భర్త గర్ల్ ఫ్రెండ్ వైశాలిని చంపిన హంతకురాలని. అప్పుడేం చేయాలి? ఈ తురుపు ముక్కని చేతిలో పెట్టుకున్న దర్శకుడు, ఇక్కడ మరో కొత్త గర్ల్ ఫ్రెండ్ రూపంలోవున్న హీరోయిన్ తో, పూజ పాత్రకి వున్న  ధ్యేయం కొద్దీ ప్లే ప్రారంభించాలి. అంతేగానీ, సెకండ్ యాక్ట్ తో అసలు కథలోకి ప్రవేశించాక ఇంకా ఫస్ట్ యాక్ట్ బిజినెస్సే నడపడం కాదు. ఐతే ఏమిటా ప్లే? ఈ హీరోయిన్ని కూడా లేపేసే ప్రయత్నాలే! ఎట్టి పరిస్థితిలో హీరో తనకే దక్కాలన్న ధ్యేయం పూజది, ఈ ధ్యేయంతోనే కదా ఒక హత్య చేసొచ్చింది. అంటే ఈమెది ఫాటల్ ఎట్రాక్షన్ సిండ్రోం తాలూకు మానసిక స్థితి. ఇలా పాత్ర మానసిక స్థితీ, దాని ధ్యేయమూ మర్చిపోతే కథేలా నడుస్తుంది? ఇదన్నమాట ఫస్టాఫ్ బోరుకి దారితీసిన కారణం.

దర్శకుడు ఈ కథకి ప్రధాన మలుపు ఇంటర్వెల్ దగ్గర వచ్చే పాయింటుగా (హీరోయిన్ తన మనోనేత్రంతో హీరోని హంతకుడుగా చూడ్డంగా ) పొరబడి దాన్ని పట్టుకుని సాగిపోయాడు. కానీ అది ప్రధాన మలుపు కాదు. కథకి ప్రధాన మలుపు అంతకి ముందు పూజా వంటి కీలక పాత్ర ఎంట్రీ దగ్గరే వచ్చింది! ఇంటర్వెల్ దగ్గర వచ్చేది ఈ  ప్రధాన మలుపు దారితీయించిన సంఘర్షణలో భాగంగా హీరోయిన్ కి ఎదురయ్యే ఒక అడ్డంకి మాత్రమే!

కథకి ప్రధాన పాత్ర ఎవరో, అది ఎదుర్కొనే ప్రధాన సమస్యే మిటో గుర్తించి  ఆ ప్రకారంగా కథకి సెటప్ (అంటే ఫస్ట్ యాక్ట్ చివర్లో వచ్చే ప్రధాన మలుపు వరకూ కథనం) ఏర్పాటు బలంగా చేసుకోకపోతే, థర్డ్ యాక్ట్ (క్లైమాక్స్)లో ఆ ప్రధాన పాత్రకి ఒక లక్ష్యమంటూ లేక,  ఈ సినిమాలో లాగే ప్రమాదంలో ఇరుక్కుని ఇంకెవరో వచ్చి రక్షించాలని పెడబొబ్బలు పెడుతుంది!
***


డైనమిక్స్ విషయానికొస్తే, ‘ఫైనల్ డెస్టినేషన్’ లో  ఏం జరుగుతుందంటే, హీరోకి ముందు జరగబోయే దుర్ఘటనలు మనో ఫలకం మీద కన్పిస్తూంటాయి. తనకున్న ఈ ప్రత్యేక శక్తిని స్వీయానుభవంతోనే గుర్తిస్తాడు. ఓసారి విమానమెక్కితే అది పేలిపోబోతోందని విజన్ పడుతుంది. దాంతో ఎలర్ట్ అయి, గోలగోల చేసి బయల్దేరబోతున్న విమానంలోంచి దూకేస్తాడు. అతడితో బాటూ మరికొందరు దూకేస్తారు. ఎగిరి వెళ్ళిన విమానం పేలిపోతుంది.

బతికామనుకుని తేలికబడ్డ వాళ్ళు ఒకక్కరూ వేర్వేరు ప్రమాదాల్లో చనిపోతూంటారు. విమానం పే లిపోయినప్పుడే ఎఫ్ బి ఐ కి హీరో మీద అనుమానం వేస్తుంది. ఇతడి మానసిక శక్తుల్ని నమ్మలేక పేలుడులో ఇతడి కుట్ర ఉందేమోనని అరా తీస్తూంటారు. దీనికి తోడూ ఒకొక్కరే చనిపోతూ ఉండడంతో ఈ హత్యలు కూడా తన కుట్రని దాచడానికి హీరోయే చేస్తున్నాడని అనుమానాలు పెరిగిపోయి అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేస్తారు.

ఇంతకీ ఈ మరణాలు ఎలా జరుగుతున్నాయంటే, మృత్యువు పగబట్టింది. మృత్యువు ఆయువు తీరిన కొంతమందిని ఒకే విమనంలో పోగేసి బలి తీసుకుందామనుకుంటే, ఆ మృత్యువు పెట్టిన ముహూర్తాన్ని హీరో తన ‘విజన్’ తో దెబ్బకొట్టి మరికొందరితో చావు తప్పించుకున్నాడు. ఇది ఓర్చుకోలేని మృత్యువు చావాల్సిన వాళ్ళు చావాల్సిందే అని వెంటబడి ప్రమాదాలు సృష్టిస్తోంది. హీరోకి మృత్యువు విలన్. ఇదన్నమాట సంగతి!

హీరో తన మానసిక శక్తితో మృత్యువు తప్పించుకోవడం, ఆ మృత్యువు వెన్నాడ్డం, మరోవైపు ఎఫ్ బీఐ ఏజెంట్లు వేధించడం-అనే డైనమిక్స్ తో ఈకథకి జీవంవచ్చింది. హీరోకి ద్విముఖ పోరాటం. ఉత్తమస్క్రీన్ ప్లే లక్షణంగా- మృత్యువుతో అంతర్గత మానసిక పోరాటం, ఎఫ్ బీ ఐ తో బహిర్గత భౌతిక పోరాటం. పైగా ప్రేక్షకులు ఆత్మికంగా కనెక్టయ్యే ఎంతో సైకోథెరఫీ, మరెంతో ఫిలాసఫీ!

‘మాయ’ లో హీరోయిన్ కి మానసిక శక్తి ఉందిగానీ, దానికి కథని దౌడు తీయంచే వ్యతిరేక శక్తులు లేవు. విలన్లు లేరు, అపాయాలూ లేవు-చివర్లో పూజా రహస్యం బయట పెడితే గానీ తను ఇరుక్కునే ప్రమాదం తప్ప!

పాత్రోచితానుచితాలు..
కథే  పాత్రని నడిపిస్తే అది డబ్బులు రాని ఆర్ట్ సినిమా అవుతుంది, పాత్రే కథని నడిపిస్తే డబ్బులొచ్చే కమర్షియల్ సినిమా అవుతుంది. మొదటిది బోరు కొట్టే పాసివ్ క్యారెక్టర్, రెండోది హుషారు తెప్పించే యాక్టివ్ క్యారెక్టర్. ప్రధాన పాత్రకి సంబంధించి  పట్టుకోవాల్సిన గుట్టు ఏమిటంటే, అది మనలో వుండే ఇగోకి తెరమీద కన్పించే ప్రతినిధి. మరి మన ఇగో ఎలా వుంటుంది?  చచ్చిన పాములా పాసివ్ గా వుండదు. మొండికేసి వుంటుంది. ఎవరి మాటా వినదు. గెలుపే కోరుకుంటుంది, ఓటమిని అంగీకరించదు. ఎప్పుడూ యాక్షన్ లో యాక్టివ్ గా వుంటుంది. ఐతే ఇగో మనిషికి మేలు చేయదు. దాంతో ఎన్నో  సమస్యలు, యుద్ధాలు. మరిదాన్నేం చేయాలి. వద్దంటే వదిలిపోదు, చంపుకుంటే చచ్చేది కూడా కాదు మన ఇగో. మరేం చేయాలి? అందుకే తెరమీద ఆ ఇగో (హీరో) ప్రయాణాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే దిశగా రచన సాగిస్తారు తెలివైన రచయితలు, దర్శకులు. సరయిన కథల్లో ఈ కృషే జరుగుతుంది. సరయిన ఏ కథైనా ఇంతే- ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే తంతే!  బాక్సాఫీసు మంత్రం. ప్రేక్షకులకి తెలీకుండా వాళ్ళకి చేసే సైకో థెరఫీ! పైగా శాస్త్రాల ప్రకారం మనముంటున్న ఈ కలియుగం మన నుంచి యాక్షన్ నే  డిమాండ్ చేస్తోంది...

‘ మాయ’ ప్రధాన పాత్ర ఐన హీరోయిన్ సహా, మిగిలిన మూడు పాత్రలూ కథ నడిపిస్తే నడిచే పాసివ్ పాత్రలే. ఎక్కడా ప్రేక్షకుడనే వాడు తనలోని  ఇగోతో ఈ క్యారక్టర్లతో కనెక్ట్ కాలేని అసంతృప్త స్థితి!

హీరోయిన్ కి  జరగబోయేది ముందే  తెలిస్తే  ఎప్పుడూ ఒకే ఎక్స్ ప్రెషన్ తో శూన్యంలోకి చూస్తుందే  తప్ప, ఎలర్ట్ అయి నివారణా చర్యలు చేపట్టదు. ఒక జర్నలిస్టుగా ఆమెలో జర్నలిస్టు సహజాతం ఏమాత్రం వుండదు. నగల షాపు దగ్గర హత్య జరుగుతుందని తెలిసినా వూరుకుంటుంది. ఎప్పుడో ఎందుకో అటు వెళ్లి నప్పుడు చావబోయే సెక్యురిటీ గార్డు కనబడితే  గుర్తుపట్టి వెన్నాడుతుంది. ఇలా కథ నడిపితే కాకతాళీయంగా తను ఇన్వాల్వ్ అవ్వాలే తప్ప, తనే కథని చేతిలోకి తీసుకుని క్రియాశీలంగా వుండాలనుకోని పాత్ర చిత్రణతో వచ్చిన ఇబ్బంది ఇది.

ఇక హీరో నిమిత్త మాత్రుడిగా ఉండిపోతాడు. ఫ్యాషన్ డిజైనర్ గా కుర్తా జీన్స్ వేసుకుని సాత్వికుడి లుక్ తో డల్ గా ఉంటాడు. తను నిర్వహించబోయే ఫ్యాషన్ ఈవెంట్ కూడా చేనేత వస్త్రాల గురించి పెట్టుకుని యూత్ అప్పీల్ ని కాలరాస్తాడు. సినిమా ప్రారంభం లోనే ఫ్యాషన్ ఈవెంట్ కి నెలరోజులు టైం వుందని చెప్పి, దాన్ని  క్లైమాక్స్ లో ఘటనల వరకూ సాగలాగారు. అప్పటికి ఆ  ఫ్యాషన్ ఈవెంట్ అనే ఎలిమెంట్  కి కథనంలో కాలదోషం పట్టేసింది. ఇలా సినిమా మొత్తాన్ని ఆప్షన్ లాక్ తో కాకుండా టైం లాక్ తో నడపడం మరో మైనస్ పాయింట్ అయ్యింది. టైం లాక్ స్టోరీలకి తెలుగులో విజయాలు లేవు.
***
ఈ సినిమా చూస్తూ ఆటోమేటిగ్గా ‘కోకిల’ ని గుర్తు తెచ్చుకుంటాం. 1989 లో నరేష్- శోభన లతో గీతాకృష్ణ దర్శకత్వంలో ఇళయరాజా మ్యూజికల్ హిట్  ‘కోకిల’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ ని మళ్ళీ చూస్తే, ఆ డైనమిక్స్ కి గీతాకృష్ణ అనే క్రేజీ డైరెక్టర్ని మెచ్చుకోకుండా ఉండలేం.

నరేష్ కి ఒక ప్రమాదంలో కళ్ళు పోతాయి. ఆ రోజే హత్యకి గురయిన ఒకస్వామిజీ కళ్ళు నరేష్ కి అమరుస్తారు. నరేష్ కళ్ళు తెరిస్తే అతడికి కన్పించేవి స్వామీజీని హత్యచేస్తున్న వాళ్ళ దృశ్యాలే. ఒక అంతర్జాతీయ సైన్స్ పత్రికలో వచ్చిన అంశం ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నట్టు దర్శకుడు చెప్పినా, దీనికి శాస్త్రీయత లేదని తర్వాత రుజువైనా, సైన్స్ ఫిక్షన్ కి అదంతా అనవసరం. అలా అనుకుంటే ‘అవతార్’ తీయడం అసాధ్యం.

లాజిక్ అడ్డుపడని సృజనాత్మక స్వేచ్ఛ ఇది. స్వామీజీ కళ్ళు పెట్టుకున్న హీరోకి  ఆ  స్వామీజీ హంతకులే కనపడ్డం, ఇది తెలుసుకున్న పోలీసులు హీరో ద్వారా హంతకుల్ని పట్టుకోవాలను కోవడం, డాక్టర్లు వారించడం, హంతకులు హీరోని చంపాలని ప్రయత్నించడం, ప్రకృతి చికిత్సతో హీరోకి నయమైతే, హంతకుల్ని పట్టుకోవడానికి అతడ్ని గుడ్డి వాడుగానే నటించమని పోలీసులు కోరడం, అలా చివరికి హంతకులు దొరికిపోవడం...ఇవీ ఆసాంతం థ్రిల్లింగ్ గా సాగే డైనమిక్స్ కి ఉపయోగపడిన మలుపులు. మలుపు లన్నిట్లోనూ కాన్సెప్ట్ ప్రవహించింది. హీరోకి చివరంటా సంఘర్షణే. ప్రారంభంలో శోభన తో ప్రేమ దృశ్యాలు కూడా పంచ్ తో చకచకా సాగిపోతాయి.

కళ్ళతో లాజిక్ లేని సైన్స్ ఫిక్షన్ తోనే ఇంత మాయ చేస్తే, అన్ని శాస్త్రీయతలూ వున్న జరగబోయేది చూడగలిగే కళ్ళతో ఇంకెంత మాయ చేసివుండాలి! ఇతర భాషల్లో దీన్ని రీమేక్ చేస్తున్నట్టున్నారు. బాలీ వుడ్ లో మహేష్ భట్ నీ కలిశారు. రీమేకులూ తెలుగు ‘మాయ’లాగే ఉంటాయా!

-సికిందర్