రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, ఏప్రిల్ 2014, గురువారం

రివ్యూ..
అదే గాడ్ ఫాదరీయం!


మోహన్ బాబు, విష్ణు,శాన్వీ శ్రీవాస్తవ, జయసుధ, తనికెళ్ళ భరణి, బెనర్జీ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు
సంగీతం : సాయి కార్తీక్,  ఛాయాగ్రహణం ; సతీష్ ముత్యాల    మాటలు : గంగోత్రి విశ్వనాథ్
బ్యానర్ : ఏవీ పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాతలు :  విజయ కుమార్, పి. గజేంద్ర బాబు, ఎం. పార్ధసారధి నాయుడు
రచన -దర్శకత్వం : రాంగోపాల్ వర్మ

విడుదల : 4.4.2014     సెన్సార్ : U/A
***
ఇంకా తెలుగు సినిమాని ఎక్కడేసిన గొంగళిలా వుంచేసేందుకు కృషిచేసే దర్శకుల కొరత తీర్చడానికా అన్నట్టు ప్రత్యేకంగా ముంబాయి నుంచి రాం గోపాల్ వర్మ కూడా వచ్చి ఓచేయి వేసినట్టుంది.  ‘గాడ్ ఫాదర్’ ని  అదేపనిగా తీసే డైరెక్టర్లు లేకపోవడంకూడా వర్మకి ఇచ్చగించ నట్టుంది. చర్వితచరణంగా తను ‘గాడ్ ఫాదర్’ నే తీస్తూ ఉండకపోతే ప్రపంచం ఏమనుకుంటుందో నన్న భయసందేహాలు కూడా వెన్నాడుతున్నట్టుంది. అదే పనిగా తీసే ఓకే తరహా సినిమాలకి సృజనాత్మకతతో పనేముంటుంది గనుక - ఇది ‘రౌడీ’ అనే టైటిల్ పెట్టడం దగ్గర కూడా రుజువవుతూ- గొప్ప విషాద దృశ్యాన్ని కళ్ళెదుట నిలబెడుతోంది...


శివ-సత్య-కంపెనీ-సర్కార్-నిశ్శబ్ద్ ల వంటి వేటికవి ఆలోచనాత్మక సినిమాలుగా తీసిన దర్శకుడు అమాంతం అరాచక సినిమాల సారధి కావడం, అంతకి మించి ఎదగక పోవడం పోటీ యుగంలో విచిత్రమే.  ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలాకి సుతారమూ ఇష్టంలేని ఆ సినిమా సీక్వెల్స్ ని నిర్మాతల ప్రోద్బలంతో నే తీయాల్సి వచ్చిందట. వర్మ అదే ‘గాడ్ ఫాదర్ ‘తో  తరాలు మారుతున్న ప్రేక్షకుల్నీ ఆకట్టుకుకో గల్గుతాననుకోవడంలో తనకి మాత్రమే తెలిసిన సక్సెస్ ఫార్ములా ఇంకా ఏదో అందులో కన్పిస్తోందేమో.  కపోలా  తన 29 ఏళ్ల కుర్ర వయసులో వయసుమళ్ళిన దశలో కెరీర్ ప్రారంభిస్తున్నట్టు, ఓల్డర్ లుక్ గల ‘గాడ్ ఫాదర్’ తీయాల్సి వచ్చిందనీ, అదే ఇప్పుడు తన వయసుమళ్ళిన దశలో కుర్రాడిలా కెరీర్ ప్రారంభిస్తున్నట్టు,  యంగర్ లుక్ గల సినిమా తీస్తున్నాననీ ‘యూత్ వితౌట్ యూత్’ తీస్తున్న సందర్భంగా ఛలోక్తి విసిరాడు! ప్రేక్షకులు విసిగిపోయినా  ‘గాడ్ ఫాదర్’ నస తో  వర్మ కింకా వార్ధక్యం అనుభవం కావడం లేదేమో!
ఇలా వుంటే ఎంత బావుండేది!


ఇప్పుడు  లేని ఫ్యాక్షన్ గొడవల్ని  ‘గాడ్ ఫాదర్’ ఆలంబనగా తీయాల్సి వచ్చిన ఒక అవస్థ 'రౌడీ'. మేకప్ లేకుండా మోహన్ బాబు నటించాడన్న ఒక్క విశేషం తప్పితే ఏ కొత్తదనమూ లేని వన్ బై టూ కిచిడీ గా-  ప్రథమార్ధపు  వాస్తవిక ధోరణి కాస్తా సెకండాఫ్ లో మూస ఫార్ములా చిత్రీకరణకి ఫిరాయించిన దర్శకత్వపు తీరు.

నందవరం ప్రాజెక్టు ప్రహసనం

సమకాలీన రాజకీయం అన్పిస్తూ, గొడవెందుకన్నట్టు రాజీ పడినట్టనిపించే కాలక్షేప చిత్రణ ఇది. రాష్ట్ర విభజన నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టూ దాని ముంపుగ్రామాల వివాదమూ ఇంకా రగులుతూ వుండగానే, ఈసినిమా ‘నందవరం’ ప్రాజెక్టూ దాని చుట్టూ కుట్రా అంటూ వేరేదారి పట్టిపోయింది . ‘రక్తచరిత్ర’ లాంటి డేరింగ్ సినిమా తీయగల్గిన వర్మ చేతిలో చితికిపోయిన ఈ సినిమాలో ఓ కుట్ర- ఆ  కుట్రలో టార్గెట్ ‘అన్న’ (మోహన్ బాబు) అనే కరుడుగట్టిన రాయలసీమ ఫ్యాక్షనిస్టు. ఇతడికి భార్య (జయసుధ), కొడుకులిద్దరు భూషణ్ (కిషోర్), కృష్ణ (విష్ణు) అనే తూర్పు పడమరలు.


మాట వేదం- చేత శూన్యం 
ఆప్రాంతాల ‘అన్న’ మాటే వేదం. ప్రజలకి ఆయనే దేవుడు. మాట వినని మనిషిని కఠినంగా శిక్షిస్తాడు. ‘న్యాయం కోసం’ హత్యలు చేయిస్తే అరెస్టు చేసే ధైర్యం ఎస్పీకి కూడా  వుండదు. ఇలాటి తండ్రి అండ చూసుకుని పెద్దకొడుకు భూషణ్ చుట్టుపక్కల అరాచకాలు చేస్తూ సమస్యగా తయారవుతాడు. ఇతడికి భార్య, కొడుకు కూడా వుంటారు. చిన్న కొడుకు కృష్ణ బుద్ధిమంతుడు. సిటీలో ఇతను శిరీషా (శాన్వి ) అనే అమ్మాయిని రౌడీల బారి నుంచి కాపాడిన పరిణామ క్రమంలో ఆమె ఇతడితో ప్రేమలో పడుతుంది. ఇతని తండ్రి తన తండ్రిని చంపించాడని తెలిసీ ప్రేమిస్తుంది. ఈ విషయం కృష్ణ తండ్రికి చెప్తే, ఆమె గొప్పమనసుకి తెగ ఫీలైపోతాడు అన్నగారైన తండ్రి.

ఇంకో వైపు ఓ వ్యాపార ముఠా ( తనికెళ్ళ, జీవా, విశ్వనాథ్) అన్న కి వ్యతిరేకంగా పథకా లాలోచిస్తూంటారు. వీళ్ళ వెనుక అసలు వ్యాపారవేత్త ఇంకొక డుంటాడు. వీళ్ళు ప్రతిపాదించిన నందవరం ప్రాజెక్టు పనులు సంపాదించుకోవాలి. కానీ ఈ ప్రాజెక్టు కడితే మూడు నాల్గొందల గ్రామాలు మునుగుతాయని అన్న అడ్డుపడుతున్నాడు. ఈ అన్న పీడా ఎలా తొలగించాలి? ముందుగా పెద్ద కొడుకు భూషన్ ని తమవైపు లాగుతారు. ఇది పెద్దగా లాభించక పోవడంతో ఏకంగా అన్ననే లేపేసేందుకు పూనుకుంటారు.

ఇదీ విషయం. ఇప్పుడు వీళ్ళ కుట్రని కృష్ణ ఎలా భగ్నం చేశాడన్నది మిగతా కథ.

ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మోహన్ బాబు గురించి చెప్పుకోవాలంటే, ప్రధానంగా పాత్ర చిత్రణ ఆయన అభినయ చాతుర్యానికి ప్రతిబంధకంగా మారింది.  ఏ మేకప్పూ హంగూ  ఆర్భాటాలూ లేకుండా ఎంత బాగా నటిస్తేనేం, పాత్రలో  అసలంటూ సరుకుండాలిగా? దీనిగురించి వివరంగా ‘పాత్రోచితానుచితాలు’  విభాగంలో మాట్లాడుకుందాం. ఇతరపాత్రల్లో విష్ణు, శాన్వి, జయసుధ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులున్నా బలహీన పాత్రల కారణంగా వీళ్ళూ ప్రభావం చూపలేకపోయారు.

సాంకేతికంగా, సంగీతపరంగా, యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా నీరసంగా వుంది. తెలుగు ప్రేక్షకులకు అలవాటులేని బ్రౌన్ టింట్ లో గ్రేడింగ్ వర్మ అదేపనిగా చేయడం మాత్రం మానుకోవడంలేదు.

స్క్రీన్ ప్లే సంగతులు

దర్శకుడు గమనించారో లేదో గానీ,  ప్రథమార్ధం షుగర్ కోటింగ్ లేని సహజత్వం తో కూడిన సన్నివేశాలతో  (ఈ సన్నివేశాల కల్పన కూడా పూర్ గా వుండడం వేరే సంగతి), ద్వితీయార్ధం సహజత్వం లేని కృతిమ మూస ఫార్ములా సన్నివేశాలతోనూ దర్శకత్వం దారి తప్పి నడుస్తుంది. సెకండాఫ్ లో డాక్టర్ల వేషాల్లో ముఠా వచ్చి హాస్పిటల్లో ‘అన్న’ మీద హత్యాయత్నం చేయడం, దాన్ని కృష్ణ ఎదుర్కోవడం, అలాగే కృష్ణ- శిరీషా లమీద తుపాకీ కాల్పులు జరుపుతూ దుండగులు వెంటాడ్డం, ఆ సందర్భంగా జరిగే ఫైట్ దృశ్యాలూ వగైరా ఫస్టాఫ్ సహజ ఫ్యాక్షన్ శైలిలో ఇమిడేవికావు. ఒక విధంగా ఇవి వీక్షణానుభావాన్ని భంగపరుస్తాయి. ఇంటర్వెల్ వరకూ రియలిస్టిక్ సినిమా చూసి, ఇంటర్వెల్ తర్వాతనుంచీ పూర్తిగా వేరే రొటీన్ ఫార్ములా సినిమా చూస్తున్నట్టు వుంటుంది.

స్క్రీన్ ప్లే కి కూడా ఒక నిర్మాణమంటూ లేదు. దీనిక్కారణం ‘పాత్రోచితానుచితాలు’ విభాగంలో తెలుసుకుందాం. ఎప్పుడో ఇంటర్వెల్ వరకూ మలుపు లేకుండా మొదటి అంకమే సుదీర్ఘంగా అపసోపాలుపడుతూ సాగుతుంది. అక్కడ పెళ్ళికి వెళ్తున్న ‘అన్న’ బృందం మీద మొదటి దాడి జరుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత రెండో అంకంలో పడిన కథ వెంటనే శైలి మార్చుకుంటూ మూస ఫార్ములా ధోరణిలో పడి, హాస్పటల్లో మరోసారి ‘అన్న’ మీద దాడి జరుగుతుంది. మొదటి హత్యాయత్నం జరిగాక దాని  పరిణామాల మూల్యాంకన, ‘అన్న’ ప్రతివ్యూహం, శాంతి భద్రతల పరిస్థితి, ప్రభుత్వ యంత్రాంగం స్పందన మొదలైనవేవీ పరిగణనలోకి తీసుకోకుండా, ప్రత్యర్ధులు వెంటనే మరోదాడికి పాల్పడ్డం ఎక్కడా జరగదు. అంటే  దర్శకుడు కథనంలో సాధారణంగా పాటించాల్సిన  ‘పేసింగ్’ ని కూడా పట్టించుకోలేదన్న మాట.


తండ్రిని చంపినా ఈమెకి ప్రేమే !
ఇది చాలనట్టు రెండోసారి కూడా హాస్పిటల్లో దాడి చేసి ‘అన్న’ భార్యని చంపేస్తారు. విచిత్రమేమిటంటే ఇన్నేసి దాడులు చేస్తున్నదెవరో అంతటి ‘అన్న’ కి తెలీకపోవడం! క్లైమాక్స్ కి ముందు కృష్ణ చెప్తే నే తెలుస్తుంది. అదికూడా కృష్ణకి ఫస్టాఫ్ లోనే  మొదటి దాడి జరక్కముందే, హీరోయిన్ అన్న ఆ దాడి ప్రమాదాన్ని హెచ్చరించినప్పుడే, శత్రువు గురించి సూచన లందుతాయి. ఇది  దర్శకుడి కథా సౌలభ్యంకోసం మర్చిపోయాడు  బహుశా కృష్ణ! సరే, చిట్టచివరికి ఆ శత్రువుని పట్టుకు రమ్మంటాడు ‘అన్న’ . పట్టుకువస్తే పాత  సినిమాల్లోలాగా కేవలం ఓ కత్తితో కడుపులో గుచ్చితే, కిందపడి చచ్చిపోతాడు శత్రువు!

క్లైమాక్స్ వరకూ విలన్ ఎవరో చెప్పకపోవడంవల్ల, ‘అన్న’కీ, విలన్ కీ మధ్య ముఖాముఖీ ఉండాల్సిన నువ్వానేనా పోరు లోపించి టైం అండ్ టెన్షన్ గ్రాఫు ఐపులేకుండా పోయి- చేవ చచ్చిపోయింది సినిమా. విలన్ ఎవరో చివరి వరకూ చూపించకుండా ‘ఎండ్ సస్పెన్స్’ పోషించడం ఎక్కడో మర్డర్ మిస్టరీల్లో వాడుకునే టూల్. ఇదికూడా ఇప్పటి సినిమాల్లో భరించే ఓపిక ప్రేక్షకులకి లేదు. దీంతో ‘ఎండ్ సస్పెన్స్’ ని కూడా సినిమాల్లో పక్కనపెట్టేసి, అడుగడుగునా టెన్షన్ పెట్టే ‘సీన్-టు-సీన్’ సస్పెన్స్ ని వాడుకుంటున్నారు. ప్రస్తుత సినిమాలో ఉన్న మూస ఫార్ములా ప్రక్రియ చొరబాటుకి తోడు ఈ మర్డర్ మిస్టరీ టూల్ ఒకటొచ్చి పడింది కథనంలో. ఏకసూత్రత ఇన్నిసార్లు మటాష్ అవుతూంటే ఇక ఏ రస ప్రధానంగా ఈ సినిమా ని ఫాలోఅవాలి?

ఇంటర్వెల్ ముందు ‘పదకొండు నిమిషాల లాంగెస్ట్ యాక్షన్ సీన్ ‘ అంటూ కూడా పబ్లిసిటీ చేశారు. ‘అన్న’ని ఒంటరిచేసి పెద్ద ముఠా కత్తులతో దాడిచేసే యాక్షన్ కోరియోగ్రఫీ –టెన్షన్ లేకపోగా చాలా డీలాగా హాస్యాస్పదంగా కూడా వుంది. ఫ్యాక్షన్ ఎటాక్ ఈ పద్ధతిలో జరుగుతుందా? ఇంతకంటే రోమాంచితంగా  గతంలో ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల్లో చిత్రీకరించారు. అన్నట్టు దీనికంటే ముందు విడుదలైన ‘లెజెండ్’ లో ఇలాగే ఇంటర్వెల్ సీన్లో పెళ్లి బృందం మీద (బీభత్స భరిత)దాడి దృశ్యాలు వుండడం కాకతాళీయమే కావొచ్చు.


ఒక డ్యూయెట్ కి లీడ్ సీను -ఉన్నట్టుండి హీరోయిన్ హాస్యాస్పదమైన డైలాగులతో,  క్రియేటివిటీతో పనుండని ‘బి’గ్రేడ్ చిత్రీకరణకి తక్కువేమీ కాదు!

పాత్రోచితానుచితాలు


అందరికీ 'అన్న'-విలన్ కి సున్నా - 
పాత్రల్ని పట్టించుకోకుండా, కథనంలో పాత్రలు ఒక భాగం కాకుండా, కథే పాత్రల్ని నడిపిస్తే, అప్పుడా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందనేందుకు ఈ సినిమానే ఒక ఉదాహరణ. టైటిల్ రోల్ పోషిస్తున్న కమర్షియల్ పాత్ర కథని తాను  నడిపించకుండా, కథకుడు చెప్పినట్టు నడుచుకుంటే, అదొక స్క్రీన్ ప్లే కాదుకదా, కథకూడా అవదు. ఆర్టు సినిమా కథవుతుందేమో గానీ, కమర్షియల్ సినిమా కథవదు. పొరపాటున కూడా వర్మ ఆర్టు సినిమా అనుకుని ఈ సినిమా తీసి వుండరు. కమర్షియల్ సినిమాకి శక్తివంతమైన ప్రధానపాత్రే ప్రాణం. కమర్షియల్ సినిమాల కథలన్నీ సంఘర్షణల సమాహారాలు. సంఘర్షణ లేక పోతే పాత్రలేదు, పాత్ర లేకపోతే అవి పాల్పడే చర్యల్లేవు, చర్యల్లేక అసలు కథే లేదు, కథే లేకపోయాక స్క్రీన్ ప్లేనూ లేదు, అదంతే!

మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోషించిన ఈ ‘అన్న’అనే కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు పాత్ర ఎంత బలహీన ప్యాసివ్ పాత్రంటే, తన ప్రాణ శత్రు వెవరో తనకే తెలీక పదేపదే తనమీద దాడులు చేయించుకుంటూ-కుటుంబ సభ్యులని పోగొట్టుకుంటూ- తల్లడిల్లి పోతూంటాడు. ఇతను పరస్పర వైరుధ్యాల పుట్ట. పాపం ఎవడో అర్భకుడు కట్నంకోసం కడుపుతో వున్న పెళ్ళాన్ని వేధిస్తే, ఈ  ‘అన్న’ గారు ఇంత పెద్ద సుత్తి తీసుకుని వాడి కాళ్ళూ చేతులూ రాక్షసంగా విరగ్గొడతాడు. హాస్పిటల్లో పడేసి నెలకి పది వేలు ఇంటికి పంపమని అనుచరుడికి చెప్తాడు. మంచాన పడ్డ వీడికి భార్య సేవలుచేస్తూంటే, ఆమె ఎంత మంచిదో  తెలిసి వస్తూందంటాడు -అదేం న్యాయమో దేవుడెరుగు!


వద్దు బాబో ఈ న్యాయం!
అదే తన పెద్దకొడుకు ఒకమ్మాయిని ఎత్తుకుపోయి రేప్ చేసినప్పుడు, నీకు న్యాయం చేయలేను క్షమించమని ఆమెకి సింపుల్ గా చెప్పేసి పంపించేసి, కొడుకుని బెల్టుతో కొట్టి, ‘గృహనిర్బంధం’ మాత్రమే గావిస్తాడు. ఒక పెళ్ళికి వెళ్ళాలని భార్య వేడుకుంటే, విడుదల చేసేస్తాడు!

ఈ ‘అన్న’ అనుభవంలేని లేత పిండం చిన్న కొడుకు కృష్ణ ఏదో చెప్పగానే తను చంపిన శత్రువు కూతురితో ప్రేమని అంగీకరించేస్తాడు. తన మీద దాడులు జరుగుతున్నప్పుడు ఇదంతా ఈ ‘కూతురి’ పన్నాగమేమో అనుమానించడు.

ఈ పాత్ర చిత్రణలో చాలా పెద్ద లోపం ఏమిటంటే, ఒక డ్యాం కాంట్రాక్టు పనుల్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వర్గం ఎవరో  తనకి తెలీకుండా ఎలా వుంటుంది? అది నిత్యం వార్తల్లో నలిగే కామన్ నాలెడ్జియే కదా? డ్యాం ని తను అడ్డు కుంటున్నప్పుడు,  కింది స్థాయి నుంచీ అత్యున్నత అధికార వర్గాలవరకూ ఏమేం జరుగుతున్నాయో తెలీకుండానే ఉంటుందా!

కథ కోసం, ఏదో కథా సౌలభ్యం కోసమనుకుంటూ పాత్రని బలి చేశారు. కథ ప్రకారం పాత్ర నడవాలనుకున్నారు. పాత్రే కథని నడపాలన్న సామాన్య సూత్రాన్ని మరిచారు. పాత్రే కథని నడిపితే కథా ప్రపంచంలో జరిగే ఏ విషయమూ పాత్రనుంచి దాచి పెట్టలేరు. దాచిపెట్టాల్సిన అవసరం కథని ఇష్టారాజ్యంగా తానే  నడపాలనుకుంటున్న కథకుడికి వుంది గనుక పాత్ర ఇలా చేష్ట లుడిగిపోయింది. మొదటి దాడిలో కోడలు, మనవడు చనిపోయారన్న స్పృహ కూడా పాత్రకి లేకుండా పోయిందంటే,  పాత్ర చిత్రణ ఏ స్థాయిలో వుందో ఊహించుకోవచ్చు.

దర్శకుడు వర్మ అందరికీ భిన్నమైన కోణంలో ఆలోచించే దర్శకుడు నిజమే.. పాత్ర చిత్రణ ఎప్పుడూ ఇలాగే యాక్టివ్ గానే ఎందుకుండాలి, ఇదేమైనా మార్చ వీల్లేని  స్థిరీకరించిన  ఏక శిలా సదృశ శాసనమా?అనుకుని వుంటే కూడా-తన వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో విఫలమైనట్టే.

ఇది చాలామంది తెలీక చేసే పాసివ్ పాత్ర చిత్రణకి నిలువెత్తు నిదర్శనమే తప్ప మరేం కాదు. పాసివ్ పాత్ర కమర్షియల్ సినిమా విజయానికి పనికిరాదనే విషయం ఇవ్వాళ్ళ కొత్తగా చెప్పుకుంటున్నది కాదు. ఈ సినిమాలో ఉన్నట్టే పాసివ్ పాత్రకి కథలో ఎదుగుదల కన్పించదు. అంటే క్యారక్టర్ ఆర్క్ ఉండదన్నమాట. ఇది లేకపోతే ఈ సినిమాలో లాగే చాలా బోరు కొడుతుందన్నమాట. ఈ పాత్ర సినిమా ప్రారంభంలో ఏ మానసిక స్థాయిలో వుందో, ముగింపు లోనూ జీవితంలోంచి ఏమీ నేర్చుకోకుండా అదే మానసిక  స్థాయిలో ఉండిపోయింది.


వీడు రూటు చూపిస్తాడు!
అయినా కూడా ఇలాటి పాత్రతో నూ కథని రంజింప జేయగలమా అంటే, తప్పకుండా చేయవచ్చు. దీని మెకానిజం ఎలావుంటుందో అన్నా మరియా క్రమ్ అనే స్క్రీన్ ప్లే రచయిత్రి ఆసక్తికరంగా వివరించింది...ఇదామె కు 2008 లో విడుదలైన డిస్నీ- పిక్సార్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘వాల్-ఇ’ ఆనే యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చూసినప్పుడు  కలిగిన అవగాహన...ఇందులో వాల్-ఇ అనే  రోబో పొరపాటున అంతరిక్ష నౌకలో పడి ఒక గ్రహం మీది కెళ్తుంది. అక్కడ ఈవ్ నే ఇంకో రోబోని ప్రేమిస్తుంది. ఇతర రోబోల్ని ఇది వాటికున్న ప్రోగ్రామింగ్ ని మించి ఎదగవచ్చని మోటివేట్ చేస్తూంటుంది. ఒక్కో రోబోని ఒక్కో విధంగా ఎగదోస్తూ వాటి అంతర్గత శక్తుల్ని బయటికి తీయిస్తుంది. దీంతో ఆ రోబోలన్నీ వాల్-ఇ ని దైవసమానంగా చూస్తూ అరాధిస్తాయి. స్థూలంగా ఇదీ కథ.


ఈ కథలో ప్రధాన పాత్ర అయిన వాల్-ఇ కి ఒక లక్ష్యం గానీ సంఘర్షణ గానీ లేకపోవడంతో దాని ఎదుగుదల- క్యారక్టర్ ఆర్క్ –కన్పించదు. క్యారక్టర్ ఆర్క్ లేకుండా ఏ కథా ఎంజాయ్ చేయలేం. అలాంటిది వాల్-ఇ విషయంలో ఈ లోటే తెలీలేదు సదరు రచయిత్రికి. ఎందుకని? ఎందుకనంటే, అది ఇతర క్యారక్టర్ల ఎదుగుదలకి దోహదపడి వాటి క్యారక్టర్ యార్క్ లని తనే క్రియేట్ చేస్తోంది  కాబట్టి. అయితే  ఈ కోవలో ఇది సీరియస్ గా  క్లాసు పీకే పాత్రలా బోరు కొట్టే ప్రమాదం కూడా వుంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ఈ పాత్రకి హాస్యప్రియత్వం అనే లక్షణాన్ని జోడించారు.  వెరసి ఇదొక రూల్స్ ని బ్రేక్ చేసిన క్యారక్టర్ ఆర్క్ లేని విజయవంతమైన పాత్రగా సూపర్ హిట్టయ్యింది!

ఇలాటిది ‘రౌడీ’లో జరగలేదు. జడం గా వుండే మోహన్ బాబు పాత్ర ఏ పాత్ర ఎదుగుదలనీ కోరుకోలేదు. కనీసం కుట్రని తిప్పికొట్టే సూత్రధారిగా ఇతర పాత్రల్ని తన ప్రయోజనం కోసం అస్త్ర శస్త్రాలుగా నైనా ఉపయోగించుకోలేదు. రూల్స్ ని బ్రేక్ చేయాలనుకుంటే అసలంటూ రూల్సేమిటో  తెలిసి వుండాలికదా? అదీ సమస్య!

ఒక సినిమా కథని ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు సృష్టించుకుంటే ఫలితాలేలావుంటాయో వేరే చెప్పక్కర్లేదు!

-సికిందర్ 















2, ఏప్రిల్ 2014, బుధవారం

పాత కళ-కళ 

పాత్రచిత్రణకి పరాకాష్ఠ ! 
ఆధునికత్వంతో సాంప్రదాయం అభ్యుదయంగా సాగితే దాని  ఔన్నత్యమే  వేరు. మాతృస్థానం లో  వున్నది ఆధునిక పోకడల్ని నిరసిస్తూ దూరం పాటిస్తే, అప్పుడు దారీతెన్నూ తెలీని ఆధునిక పోకడలు మరింత కాలుష్యాన్నే సృష్టిస్తాయి!

హోదా అనేది రాగ ద్వేషాల కోసం సమకూరదు. మార్గనిర్దేశం చేసేందుకోసం ప్రాప్తిస్తుంది. కరుడుగట్టిన సాంప్రదాయవాది శంకరాభరణం శంకరశాస్త్రే గనుక ఛీత్కార మంత్రమే పఠించి వుంటే, కె. విశ్వనాథ్ కి తన దర్శకత్వ ప్రతిభతో ఇంత చమత్కారం చేసే అవకాశమే దక్కేది కాదు. ఎంతో ఉదారంగా శంకర శాస్త్రి ‘ఊఁ..సరే, కానీయ్!’ అని భుజంతడితే గానీ విశ్వనాథ్ తనపని తను చేసుకుపోయే వీలు చిక్కలేదు. తీరా చూస్తే- అదొక మాటలకందని అద్భుత సృష్టి అయి, పండిత-పామర- పురాతన-ఆధునిక అగాధా లన్నిటినీ పూడ్చేస్తూ, సినిమా సక్సెస్ సూత్రాల్ని తిరగ రాసేస్తూ, మహోజ్వల వినోద సాధనమై కూర్చుంది మాహా దర్జాగా!


‘శంకరాభరణం’ ఫక్తు దర్శకుడి సినిమా. ఖాయంగా డబ్బులు రావని తెలిసికూడా సోమయాజులూ మంజూ భార్గవి ల్లాంటి ఏ బాక్సాఫీసు అప్పీలూ లేని నటులతో ఆడిన మహా జూదం. చోద్యంగా మారే ప్రమాదాన్ని కాచుకున్న మహా దృశ్య కావ్యం. మాట-పాట-ఆట-తీతా అన్నిటా సంభ్రమానికి గురిచేసే ఒక మహాద్భుత వైవిధ్య ప్రదర్శన.

పాశ్చాత్య సంగీత వ్యామోహంలో దేశీయ వారసత్వ సంపదైన శాస్త్రీయ సంగీతాన్ని అలక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేని సంగీత విద్వాంసుడు శంకర శాస్త్రి కథ ఇది. శంకర భరణం రాగంలో నిష్ణాతుడు. ప్రయోగాల పేరుతో అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయడాన్ని అస్సలు సహించడు. సంగీతానికి అతడి దృష్టిలో కులమతాల్లేవు. భాషా భేదాలూ స్వపర అంతరాలూ లేవు. 

 ఒకరకమైన సంగీతం గొప్పదనీ, మరొకటి అధమమనీ చెప్పడానికి మనమెవరన్న వివేచనకూడా అతడికుంది. సంగీతంలో ఆధునిక పోకడలపట్ల ధర్మాగ్రహమే తప్ప తానేదో గొప్పన్న అహంకారం  కాదది. సంప్రదాయానికేదో అపచారం జరిగిపోతోందనీ కళ్ళూ చెవులూ మూసుకుని తనలోకి తానూ ముడుచుకుపోయే సంకుచిత్వమూ, పలాయన వాదమూ లేవు. అలాటి అర్భకుల్ని దిశానిర్దేశం చేసి  సన్మార్గంలో పెట్టాలన్నతపనే. పాప్ మ్యూజిక్ కుర్ర గ్యాంగ్ అయినా, ప్రయోగాల పిచ్చి మాస్టా రైనా, తనకి అర్భకులే. వాళ్ల కంటే దివ్యంగా పాప్ కూతలు తాను కూయగలడు. అసలంటూ శాస్త్రీయ సంగీతపు పునాదులుంటే, ఇంకే సంగీతమైనా  అర్ధవంతంగా పాడగలరనీ నిరూపించనూ గలడు!

వృత్తి గతంగా ఇంతటి అభ్యుదయమున్న శంకర శాస్త్రికి వ్యక్తిగత జీవితంలోనూ విశాల దృక్పథమే. లోకులు ఛీ థూ అని దూరమైనా, తానొక నిష్టాగరిష్టుడైన సద్బ్రాహ్మణుడనే భేషజాలేవీ పెట్టుకోకుండా నిమ్న కులస్థురాలైన వెలయాలి కూతుర్ని చేరదీస్తాడు. ఆమె నాట్యాభిలాషని ప్రోత్సహిస్తాడు. సంగీతంలో అభ్యుదయవాది ఎంతో, జీవన సంగీతంలోనూ అంతే. అందుకే అంటాడు- ‘ఆచార వ్యవహారాలు మనుషుల్ని సన్మార్గంలో పెట్టడానికే తప్ప, మనుషుల్ని కులమనే పేరుతో  విడదీయడానికి కాదు’ –అని.

సచే గ్రేట్ పర్సనాలిటీ! అయితే ఇంతటి  సెక్యులర్ పర్సనాలిటీ శాస్త్రీయ సంగీతానికి గనుక హాని జరుగుతోందని తెలిస్తే, కన్నకూతురి పెళ్లి సంబంధం సైతం చెడగొట్టుకోవడానికీ వెనుకాడడు! కూతురి గళాన ఆందోళనగా హిందోళ రాగం హింసపడి,

contd..  

31, మార్చి 2014, సోమవారం


పాత కళ -కళ !


‘ముత్యాల ముగ్గు’ ముగింపు మెరుపులు!


‘డైరె‘డైరెట్రూ, పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో? సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ? మాసిపోయిన మూస పాత్రలు, డైలాగులు, యాక్టింగులూ మర్డరై పోయిన దృశ్య మయ్యా ఇదీ. డైరెట్రు అన్నాక  కాస్తంత కళా పోసనుండాలయ్యా. ఉత్తినే కాపీకొట్టి కాలరెగరేస్తే డైరెట్రుకీ, దిగిపోయిన బ్యాట్రీకీ తేడా ఏటుంటది?’

ముత్యాలముగ్గు’ లో రావు గోపాలరావు ఫేమస్ విలనీ రీమిక్స్ అయిందని పై డైలాగు చూసి ఎవరైనా సీడీల కోసం రేసు మొదలెడితే అంతకన్నా ‘కర్సయిపోవడం’ వుండదు! అది ‘యాభైలో సగం పన్నెండున్నర’ బాపతు అమాయకత్వమే అవుతుంది. పై నివేదన నేటి అభిరుచిగల ప్రేక్షకుడి/ప్రేక్షకురాలి ఆవేదనే కావొచ్చు. ‘ముత్యాలముగ్గు’ ని చూసిన కళ్ళతో నేటి సినిమాల్ని చూడలేకపోతున్న రోదనే కావొచ్చు. వాస్తవమెప్పుడూ కర్కశంగానే వుంటుంది. ‘ముత్యాలముగ్గు’ దీన్ని  గుర్తు చేస్తూనే వుంటుంది.

సినిమా అన్నది కళాత్మక వ్యాపారమని అందరూ అంటారు. కళాత్మకంగా కమర్షియల్ సినిమాలు తీసే వాళ్ళే తక్కువ. ఓ కళాత్మక (ఆర్టు) సినిమా తీసే ముందు మామూలు కమర్షియల్ మసాలా లతో చేయి తిప్పుకోండని ‘స్టోరీ’ అన్న ఉద్గ్రంధం రాసిన  ప్రొఫెసర్ రాబర్ట్ మెక్ కీ సినిమా దర్శకులకి సలహా ఇస్తాడు. ఒకవేళ ఆ దర్శకుడు వెండితెర మీద కెమెరాని కుంచెలా  మల్చుకోక ముందు, బ్రష్ తో కాన్వాస్ ని రంగుల రమ్యలోకంగా చేస్తున్న చిత్రకారుడయితే? అప్పుడతను వేరే కమర్షియల్సూ, కాకరకాయలంటూ కళాత్మక సినిమాకోసం ప్రత్యేకంగా చేయి తిప్పుకోవాల్సిన అవసరముంటుందా? ఇదీ ‘బాపు’ గారి ప్రశస్తి అంటే!

ముదిమితనానికి నో !
1967లో ‘సాక్షి’ అనే తొలి కళాత్మక ప్రయత్నం చేసినప్పుడే ఆయన నేపధ్యం చిత్ర లేఖనం. అలా చిత్రకారుడు చలన చిత్ర కారుడైనప్పుడు ఆ సృజనాత్మకతకి  వయస్సే  మీదపడదేమో? ‘ముత్యాల ముగ్గు’ తీసి నలభై ఏళ్ళు కావొస్తున్నా ముదిమితనమే అంటలేదు. మళ్ళీ ఒక్కసారి సీడీ వేసుకుని చూస్తే, ఏ విభాగంలో ఇది ప్రస్తుత కాలానికి వెనుకబడింది?కథా కథనాలు, మాటలు, సంగీత  సాహిత్యాలు, నటనలు, చిత్రీకరణా ఏదీ కాలదోషం పట్టని అసమాన సృజనే. అసలే మేకప్పూ లేని నటీ నటులతో వాస్తవిక కథాచిత్రాల నడక నడుస్తూనే, కమర్షియల్ గా సూపర్ సక్సెస్ కావడం దీనికే చెల్లింది.

ఇంకో దశాబ్ద కాలంలో ఆర్టు సినిమాల చెలామణి చరమాంకం కొస్తుందనగా,  బాపు భవిష్యద్దర్శనం చేసినట్టు అప్పుడే (1975లో )ఈ ముందుకాలపు ‘కమర్షియలార్టు’ నిచ్చారు. ఉత్తరాదిన ఆర్టు సినిమాల ఉద్యమం ముగిశాక వాటి స్థానాన్ని భర్తీ చేస్తూ ఆతర్వాత బాలీవుడ్ లో క్రాసోవర్ సినిమాల పేరుతో  వచ్చినవన్నీ, నేటికీ వస్తున్నవీ ‘ముత్యాలముగ్గు’ టైపు కమర్షియలార్టు సినిమాలే.

‘ముత్యాలముగ్గు’ అనగానే రావుగోపాలరావు మెదలడం సహజం. కానీ ‘ముత్యాలముగ్గు’ అంటే కేవలం రావుగోపాలరావు క్లాసిక్ విలనీ మాత్రమే కాదు, బహు సుందరమైన కుటుంబ గాథ కూడా. హృద్యమైన శోకనాశన జానకీ వృత్తాంతం. ఆధునిక రామాయణం...ఉత్తర రామాయణం! విడిపోయిన భార్యా భర్తలమధ్య పసి పిల్లల గేమ్ ప్లాన్!

శ్రీధర్, సంగీతలు భార్యాభర్తలు. బాధితురాలు భార్యే. బాధకుడు డబ్బుకోసం ఏమైనా చేసే కాంట్రాక్టర్ రావుగోపాలరావు. అప్పుడా తల్లి అవస్థ చూడలేక కవలలిద్దరూ సదరు కాంట్రాక్టరు దురాగతాన్ని నిరూపించి, పునీతురాలిగా తిరిగి పునీతురాలిగా తిరిగి తల్లిని కన్నతండ్రితో కలిపి సుఖాంతం చేసే వృత్తాంతమే.
ఎందరికో భిక్ష!
సినిమా కథని ఆసక్తిగా మొదలెట్టాలంటే రెండు మార్గాలున్నాయంటాడు సిడ్ ఫీల్డ్. ఏదైనా ఒక సంఘటనతో యాక్షన్ దృశ్యాల్ని చూపడం, లేదా పాత్ర ద్వారా కథని వివరిస్తూ పోవడం. బాపుగారు తన మూడంకాల స్క్రీన్  ప్లేకి ఈ రెండో విధానాన్నే ఎంచుకున్నారు. శ్రీధర్ పాత్ర ద్వారా జమీందారు అయిన తండ్రి కాంతారావుని, ఆయన అక్కగార్ని, ముక్కామలని, అతడి మోడరన్ కూతుర్ని, అక్కడి ఉద్యోగి అల్లు రామలింగయ్యని, శ్రీధర్ స్నేహితుడ్నీ చకచకా పరిచయం చేసేసి- ఆ స్నేహితుడి చెల్లెలి పెళ్ళికి శ్రీధర్ ని పంపించేసి, ఆ పెళ్ళికూతురి రూపంలో సంగీతాని చూపిస్తారు.
ప్రారంభంలోనే ఇది చాలా ఆసక్తి రేపే ఘట్టం. హీరోయిన్ పెళ్ళవుతోంటే హీరో రావడం! ...ఇలాంటి ప్రారంభంతో మొన్నటివరకూ అదేపనిగా చాలా సినిమా లొచ్చాయి. ఇది ‘ముత్యాలముగ్గు’ పెట్టిన భిక్షే. ఈ ప్రారంభ ఘట్టంలోనే సంగీత పెళ్లి చెడిపోయి, శ్రీధర్ ఆపద్ధర్మంగా ఆమెనే చేసుకోవాల్సిరావడంతో టెన్షన్ గ్రాఫ్ అమాంతం పెరిగి, కథకి గట్టి ముడి పడిపోతుంది. ఇదంతా కేవలం ఎనిమిది సీన్లలోపే జరిగిపోతుంది.

రిచర్డ్ గెర్ నటించిన విజయవంతమైన సినిమా ‘అన్ ఫెయిత్ ఫుల్’ (2002) లో ఐదవ సీనుకల్లా కథ ముడి పడిపోతుంది. ఇలాటి క్లుప్తీ కరించిన కథనాలే అసలుసిసలు సృజనాత్మకతకి నిదర్శనాలవుతాయి. ‘ముత్యాలముగ్గు’ ఈ సెక్షన్ లో అపూర్వంగా నిలబడుతుంది. బాపూ- ఈ కథా, సంభాషణలూ రాసిన రమణా ‘ముత్యాలముగ్గు’ ని భావి తరాలకి రిఫరెన్స్ గైడ్ లా అందించారు. ఏ కథైనా సరదాగా మొదలై, సంక్షుభితంగా మారి, తిరిగి శాంతి సామరస్యాలు స్థాపించే మూడంకాల నిర్మాణంలోనే  వుంటుంది. ఆనందంగా సాగుతున్న శ్రీధర్-సంగీతల వైవాహిక జీవితంలోకి రావుగోపాల రావుని ప్రవేశపెట్టి సంక్షుభితం చేస్తారు బాపు. కడుపుతో వున్న సంగీత శీలమ్మీద నిందపడి వీధి పాలవుతుంది. ఫస్టాఫ్ లో ఇలా విడదీయడం సులభమే. సెకండాఫ్ లో ఔచిత్య భంగం కలక్కుండా తిరిగి కలపడమే పెద్ద సమస్య. ఈ చౌరాస్తా నుంచీ కథ ఎటువైపు వెళ్ళాలి? పిల్లలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. సంగీత మీద పడ్డ నింద తొలగించేందుకు ఉపయోగపడే సాధనాలు వాళ్ళే.  వాళ్ళు దూకాల్సిన కార్య క్షేత్రంలోకి ముందుగానే ఇంకో పాత్రని పంపి కథ నడిపించడం కోరి (సెకండాఫ్) గండాన్ని తెచ్చుకోవడమే.

పోనీ శ్రీధర్-సంగీతల ఎడబాటు తాలుకూ బాధల్ని వాళ్లిద్దరి మీదా  చిత్రీకరిస్తూ కాలక్షేపం చేద్దామా అంటే అదీ సుడిగుండంలో పడేస్తుంది. పైగా  రసభంగం కల్గిస్తూ శోక రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి పిల్లలు పుట్టి వచ్చేవరకూ కథ ఎలా నడపాలి? మొదట్నించీ చూస్తే  ఈ కథ అద్భుత రస ప్రధానంగానే నడుస్తూ వచ్చింది. ఈ అద్భుత రసాన్నే ఇక ముందూ కొనసాగించాల్సి వుంటుంది. అప్పుడే కథకి ఏకసూత్రత చేకూరుతుంది.  అందుకని ఈ అద్భుతరస స్రవంతికి  ఒక సాధనంగా ఉంటూ వస్తున్న  రావుగోపాలరావు అండ్ గ్యాంగు ని పోస్ట్ మార్టం చేసే పని చేపట్టారు సిద్ధహస్తులైన బాపూ-స్వర్గీయ రమణలు దిగ్విజయంగా!

ఇదీ సరైన సెకండాఫ్ కథనానికి మార్గం! ఇదే సూత్రం! ఏ రసప్రధానంగా కథ ప్రారంభమై దాని ఆలంబనగా కొనసాగుతోందో, అదే రస స్రవంతిని పట్టుకుని ఇంటర్వెల్ చౌరస్తా నుంచీ దారితప్పకుండా సాగిపోవడమే దిశ-దశ-సమస్తం కూడా!

పంచభూతాలు మింగేసుకున్నాయి!
సరే, ఎవరీ రావుగోపాలరావు అండ్ గ్యాంగులో దొంగలు? ఓ అమాయకురాలి కాపురాన్ని చెడగొట్టిన రావుగోపాలరావు, ముక్కామల, అల్లురామలింగయ్య, నూతన్ ప్రసాద్ లు- మరి ఈ దుష్ట చతుష్టయం చెడబుట్టిన బతుకుల్లో చీకటి కోణాలేమిటి?...అనే సెకండ్ ట్రాక్ ఓపెన్ చేసి, వాళ్లకి వాళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునే ఆత్మవినాశక చర్యలతో టైం అండ్ టెన్షన్ థియరీకి న్యాయం చేస్తూ అమాంతం కథనంలో టెంపో- దాంతోబాటు కొత్త సస్పెన్సూ సృష్టించేశారు!

చేసిన పాపం చావదనే కదా? సృష్టిలో ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. మంచి చేస్తే మంచీ, చెడు చేస్తే చెడూ చుట్టూ తిరిగి మనకే వచ్చి తగుల్తాయి. ఈ దుష్ట చతుష్టయం ధనదాహంతో సంగీత ని వనవాసం పట్టించినప్పుడు, సృష్టి చూస్తూ ఊరుకోదు. సృష్టెప్పుడూ హెచ్చు తగ్గుల్ని సమతూకం చేసే దిశగానే కదుల్తూంటుంది. సంగీతకి ఆ స్థాయిలో అన్యాయం చేసి హెచ్చిపోయిన కీచకుల అదృష్టాల్ని ఛిన్నాభిన్నం చేసి, ఆ నష్టపరిహారం సంగీతకి ఇప్పించడం సృష్టి ధర్మం కదా? ఇదే కదా ది గ్రేట్ ఫిలాసఫర్ ఎమర్సన్ సూత్రీకరించిన, సృష్టి తనపని తానుగా చేసుకుపోయే ‘లా ఆఫ్ కంపెన్సేషన్’ ప్రక్రియ?

కథలో ఈ ఫిలాసఫీ ఎంచక్కా ఇమిడిపోయి సంగీత పాత్ర పట్ల ప్రేక్షకులకి ఎనలేని సానుభూతేర్పడుతుంది!

ఇలా సాగుతూండగా, సంగీతకి పుట్టిన కవలలు తల్లిదండ్రుల్ని కలిపే అధ్యాయం మొదలౌతుంది. వీళ్ళ చేత ఈ పని ఎలా చేయించాలి?  ఇది మిలియన్ రీళ్ల ప్రశ్న! ఎవరికీ? కథని ఉదాత్తంగా చెప్పాలని సమకట్టిన వాళ్ళకే. ఇందుకు ముందుగా శాస్త్రం తెలియాలి...

కృతయుగంలో మనుషులు సత్వర ఫలితాలు పొందేందుకు ధ్యానం చేసే వాళ్లట. త్రేతాయుగంలో యాగాలు చేశారని, ద్వాపరయుగంలో అర్చనద్వారా పొందారనీ, ఇక కలియుగంలో జ్ఞాన శూన్యులైన అల్పులు అధైర్య పడకుండా సంకీర్తన ద్వారా సత్వర ఫలితాలు పొందవచ్చనీ  సూత మహర్షి చెప్పాడు.

అల్పులైన పిల్లల చేత బాపుగారు ఈ పనే చేయించారు!

రామాలయంలో ఒకర్నీ, రావుగోపాలరావు ఇంట మరొకర్నీ పడేసి సంకీర్తనలతో మస్కాలు కొట్టిస్తూ స్వకార్యం పూర్తి చేయించారు. అక్కకేమో ఆంజనేయుడితో ఫాంటసీ, తమ్ముడికేమో కోతితో ప్రాక్టికాలిటీ! తత్ఫలితంగా రావుగోపాలరావు చాపకింద నీళ్ళొచ్చేయడం!
ఇప్పుడు ఈ మజిలీకి చేరిన కథని ఎలా ముగించడం? మళ్ళీ శాస్త్రమే! సృష్టికర్త ఈ సృష్టిని ఎలా ఉపసంహరిస్తాడు? బ్రహ్మ పురాణం ఏం చెప్తోంది? త్రివిధాలుగా సృష్టి ఉపసంహారం జరగవచ్చంది. నైమిత్తికం, ప్రాకృతికం, ఆత్మీంద్రికం...మొదటిదాంతో పంచభూతాలు ఒకదాన్నొకటి మింగేసుకుని ఆకాశం శూన్యమైపోతుంది. రెండోదాంతో ప్రకృతి పరమాత్మలో కలిసిపోతుంది. మూడో ప్రక్రియలో మానవాళి మోక్షమార్గం ద్వారా జరుగుతుంది.

సినిమాలో ఆల్రెడీ వెన్నుపోట్లతో కలహించుకుంటున్న దుష్టచతుష్టయం కీచులాటలన్నిటినీ  ఇక పతాక స్థాయికి చేర్చి , పంచ మహాభూతాల్లా ఒకర్నొకరు మింగేసుకునే నైమిత్తిక ముగింపు నే ఇచ్చారు చాలా టెర్రిఫిక్ చిత్రీకరణతో!
అప్పుడంతా  ఆకాశం శూన్యమైపోయినట్టు శ్మశాన నిశ్శబ్దం!

తిరిగి సృష్టి తాజాగా మొదలైనట్టూ...శ్రీధర్-సంగీతల కాపురం - కళకళలాడుతూ...సీతారాములు తామై, పిల్లలు లవకుశలై ఉత్తరరామాయణం పరిసమాప్తం!

-సికిందర్
(సాక్షి, 2009)






29, మార్చి 2014, శనివారం

రివ్యూ..
బాలయ్య వేసవి బ్యాంగ్ !

** నందమూరి బాలకృష్ణ, సోనల్ చౌహాన్, రాధికా ఆప్టే, జగపతిబాబు, బ్రహ్మానందం, సుమన్, జయప్రకాష్ రెడ్డి, రావురమేష్, చలపతిరావు, ఎల్బీ శ్రీరాం, సుహాసిని, కల్యాణి, హంసానందిని తదితరులు..
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్,  ఛాయాగ్రహణం : సి. రాంప్రసాద్   కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు  కళ : ఏఎస్ ప్రకాష్   యాక్షన్ : రాం- లక్ష్మణ్, కణల్ కన్నన్  మాటలు : ఎం. రత్నం
బ్యానర్ : వారాహి చలన చిత్రం- 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రాం ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర
రచన- దర్శకత్వం : బోయపాటి శీను
విడుదల : 28 మార్చి 2014     సెన్సార్ : ‘A’

***
వేసవికీ, ‘నందమూరి బాలకృష్ణ- బోయపాటి శీను’ ల కాంబినేషన్ కీ ఏదో బలమైన బాక్సాఫీసు బంధం ఉన్నట్టుంది. సరిగ్గా నాల్గేళ్ళ క్రితం 2010 వేసవిలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘సింహా’ ఎంత బలమైన హిట్ గా నిల్చిందో, అందుకేమాత్రం తీసిపోని విజయ ఢంకా మోగిస్తూ ఇప్పుడు ‘లెజెండ్’ వచ్చింది. మధ్యలో బోయపాటికి  ‘దమ్ము’తో శృంగభంగమైతే- ఈ సారి ఆ వైఫల్య కారణాన్ని హీరో మీదనుంచి విలన్ మీదికి తోస్తూ తప్పించుకో జూశాడు. దీంతో ‘లెజెండ్’ దంతా ఏకపక్ష గోడు అయ్యింది!

అసలే ఎన్నికల సమయంలో విడుదలౌతున్న ఈ సినిమా- బాలకృష్ణ ఇంటి పార్టీ కి ప్రచారంచేసిపెట్టే అస్త్రంగా రాబోతోందన్న ఊహాగానాల్ని పటాపంచలుచేస్తూ, ఫక్తు ఫ్యాక్షన్ మార్కు మరో ఫార్ములాగా మాత్రమే ఫ్యాన్స్ కోసం ‘సర్వాంగ సుందరంగా’ ముస్తాబయింది.


అడుగడుగునా భగభగ మండిపోతూ బాలకృష్ణ తన భుజాలమీద  ఒన్ మాన్ షోగా అవలీలగా మోసుకొచ్చి బాక్సాఫీసు ముంగిట పడేసిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఒక్కటి రుజువు చేసింది- బిగ్ స్టార్స్ కి ఇంతకంటే గత్యంతరం లేదు. గతం వైపే చూపు తప్ప వర్తమాన భవిష్యత్ కాలాల కొత్తదనంతో సంబంధం వుండదు. ఒక పాత  ఫ్యాక్షన్ ఫార్ములాలోంచి, రూపం మార్చి ఇంకో ఫ్యాక్షన్ ఫార్ములాని లాగే అనివార్య విన్యాసమే శ్రీరామరక్ష అయితే ఇందుకు తప్పుబట్టాల్సిందేమీ వుండదు. 


బాలకృష్ణ లోని శక్తివంతమైన నటుణ్ణి ఎలా బయటికి తీసి హిట్ కొట్టాలో  తెలుసుకోవాలంటే కేరాఫ్ అడ్రసుగా మారిన బోయపాటిని స్టడీ చేయాల్సిందే. ఇక బాలకృష్ణ ఉన్నంత కాలం బోయపాటీ, బోయపాటి ఉన్నంత కాలం బాలకృష్ణా ఉభయకుశలోపరిగా వుంటారనుకోవచ్చు వేసవికో ఫ్యాక్షన్ రీసైక్లింగ్ చేసుకుంటూ!

విశాఖ తీరాన ఫ్యాక్షన్ ఘరానా!
కర్నూలు నుంచి ఫ్యాక్షన్ తొడగొట్టి విశాఖపట్నంలో మకాం వేసే చిత్రణ అదేదో వర్తమాన రాజకీయ ముఖచిత్రంలా అన్పిస్తే అదిక్కడితో అంతమౌతుంది. మిగతా కథాకమామిషు అంతా పాతఫ్యాక్షన్ కాల్పనికమే. కర్నూలునుంచి పెళ్లి సంబంధానికి వైజాగ్ వచ్చి వెళ్తూ ఫ్యాక్షనిస్టు జితేంద్ర (జగపతిబాబు) పక్కూళ్ళో అనుకోకుండా ఓ రోడ్డుప్రమాదం చేసి అక్కడి పెద్ద మనిషి  (సుమన్) ముందు పంచాయితీకి హాజరవుతాడు. ఆ పెద్దమనిషి బాధితుడికి నష్టపరిహారమూ క్షమాపణా డిమాండ్ చేస్తాడు. మాట వినని జితేంద్ర కి లెంపకాయకూడా కొడతాడు. 

దీంతో ఈ వైజాగ్ లోనే మకాం వేసి ఆ పెద్దమనిషి కుటుంబాన్ని తుదముట్టిస్తానని ప్రతిన బూనుతాడు జితేంద్ర.
దరిమిలా ఆ పెద్దమనిషినీ, అతడి భార్య (సుహాసిని)నీ మట్టుబెట్టేస్తాడు జితేంద్ర. దీనికి రియాక్టయిన పెద్దమనిషి పెద్దకొడుకు జయదేవ్ (బాలకృష్ణ-1) జితేంద్ర తండ్రిని హతమార్చేస్తాడు. ఈ హత్యలు చూసి చలించిన నాయనమ్మ పెద్దమనవణ్ణి కుటుంబ బహిష్కారం గావించి, చిన్న మనవడు కృష్ణ (బాలకృష్ణ-2) ని లండన్ పంపించివేస్తుంది.
ఈ పూర్వకథ లోంచి వర్తమానానికొస్తే, కృష్ణ దుబాయిలో ప్రత్యక్షమౌతాడు. అక్కడ  స్నేహ (సోనల్ చౌహాన్) అనే మోడర్న్ గర్ల్ ని ప్రేమించి నానమ్మ కి పెళ్లి ప్రతిపాదన పంపుతాడు. పెళ్లి శత్రువు పొంచివున్న వైజాగ్ లో వద్దనీ, మేమంతా దుబాయ్ కేవచ్చి చేస్తామనీ నానమ్మ అంటుంది. కానీ కృష్ణ వెంటవుండే మాణిక్యం (బ్రహ్మానందం) ప్రోద్బలంతో వైజాగ్ కే చేరతాడు కృష్ణ స్నేహతో.
చేరగానే ఒక అన్యాయాన్ని ఎదుర్కొని జితేంద్ర ముఠా ని తంతాడు. దీంతో జితేంద్ర లో పాత  పగ మేల్కొని కృష్ణ పెళ్లి బృందం మీద దాడి చేస్తాడు. కృష్ణ సహా బృందమంతా ఇక హతమౌతారన్న క్షణాన అజ్ఞాతంగా వున్న జయదేవ్ ప్రచండంగా ఏతెంచి శత్రుసంహారం  గావిస్తాడు. జితేంద్ర తప్పించుకుంటాడు...ఇప్పుడు అజ్ఞాతంలో వున్న జయదేవ్ కథతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమౌతుంది...

ఇక కుటుంబాన్ని జితేంద్ర బారినుంచి కాపాడే ఏకైక దిక్కుగా జయదేవ్ ఉంటాడు. ఓ పక్క బామ్మ ఛీత్కారాల్ని భరిస్తూ, మరదలి ప్రేమతో సతమతమౌతూ ఏకాకి జీవితం గడుపుతున్న అతను ఎన్ని అవమానాలు, అవాంతరాలూ ఎదురైనా కుటుంబ క్షేమాన్నే కాంక్షిస్తూ ఉద్యమిస్తూంటాడు...

బాలయ్య బాలయ్యా రాసుకుంటే...
ఇద్దరు బాలయ్యల బలాబలాల జుగల్బందీ ఇది. ఇందులో రెండో బాలయ్యది ప్రథమార్ధంలో ముగిసిపోయే రోమాంటిక్ పాత్రైతే, మొదటి బాలయ్యది ద్వితీయార్ధం పగ్గాలందుకునే  యాక్షన్ పాత్ర. ఈ యాక్షన్ బాలయ్య పాత్రే కథకి బలాన్నీ అర్ధాన్నీ చేకూరుస్తుంది. ఈ పాత్రలో బాలకృష్ణ నటనని ప్రేక్షకులు కళ్ళప్పగించి వీక్షిస్తారు. ఎందుకంటే ఇది వయసుకుకి తగ్గట్టున్న సీరియస్ పాత్ర. అదే ప్రథమార్ధమంతా రోమాంటిక్ బాలయ్యని ఆ వయసులో చూడలేక ఒకటే గగ్గోలు పెడతారు ప్రేక్షకులు. మొదటి పాటకి డాన్సులూ డ్రెస్సులూ అయితే మరీ ఎబ్బెట్టుగా కూడా వుంటాయి.

జయదేవ్ పాత్రకిచ్చిన గెటప్, డ్రెస్ సెన్స్, డైలాగులు, అంతర్గత-బహిర్గత సంఘర్షణల సమాహారంతో సమగ్ర పాత్రచిత్రణా ఈ సినిమాకి ప్రత్యేకాకర్షణలు. ద్వితీయార్ధంలో కామెడీ లేదనే విమర్శ అసంగతమైనది. బోయపాటి ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ తో ఆలోచనాత్మకంగా ప్రవేశించిన జయదేవ్ పాత్ర కోసం గాక, కామెడీ వైపు నిలబడి వుంటే మొత్తం అభాసయ్యేది.

జయదేవ్ పాత్రలో బాలకృష్ణ ని చూస్తే సమీప భవిష్యత్ లో ఏ యంగ్ స్టారూ ఆయన్ని బీట్ చేయలేడని రాసిచ్చేయొచ్చు. అసలు ఈ పాత్రే యంగ్ స్టార్స్ కి దుస్సాధ్యమైనది. యంగ్ స్టార్సే కాదు- తన సమకాలీనులు సైతం హిట్టివ్వలేని తరుణాన బాలకృష్ణ  ఇంకో విజయం సాధించాడు.
ఇక జగపతిబాబు ఈ సినిమాకి రెండో దన్ను. వయసుమళ్ళిన విలన్ గా అవతారమెత్తి తనలో ఇన్నాళ్ళూ బయల్పడని అసలుసిసలు నటుణ్ణి దృశ్యమానం చేశాడు. మోహంలో, కళ్ళల్లో ఆ కరుడుగట్టిన విలనీ ఎక్స్ ప్రెషన్స్ తెలుగు తెరకి ఇక హిందీ దుష్టనాయక అవసరాన్ని వేలెట్టి ప్రశ్నిస్తున్నట్టున్నాయి.

హీరోయిన్లిద్దర్లో సోనల్ చౌహాన్ అందాల ఆరబోతకి, రాధికా ఆప్టే సెంటిమెంట్ల పంటకీ ఉపయోగపడ్డారు. ఇతర తారాగణమంతా  ప్యాడింగ్ అవసరాలు తీరిస్తే, బ్రహ్మానందం కాసేపు వెర్బల్ కామెడీ చేసి తప్పుకున్నాడు.

సాంకేతికాలు సోసో...
అత్యధిక బడ్జెట్ కేటాయించి ఎంత కనువిందు చేసినా వీనులవిందు చేయలేకపోవడం ఒక లోటు. దేవీశ్రీప్రసాద్ సంగీతంలో పాటలు ఒక్కటీ క్యాచీగా లేవు. థియేటర్ లోంచి  బయటికొస్తే గుర్తుండవు. కానీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం మాత్రం చెవులు పగిలే స్థాయిలో సమకూర్చాడు. ఈ హోరులో డీ టీ ఎస్ అనే శబ్దగ్రాహక కళ కకావికలమై పోయింది. ఇక అగ్రస్థాయి ఛాయాగ్రాహకుడు రాంప్రసాద్ కేమేరాపనితనం ఎంత ఉన్నతంగా వుందో, దాంతో పోటీపడుతూ ఏఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం అంత ద్విగుణీ కృతమైంది. పోతే, యాక్షన్ కోరియోగ్రఫీలో రాం-లక్ష్మణ్, కణల్ కన్నన్ లు లాజిక్ ని తీసి అవతలపెట్టి గాలిలో చేసిన విన్యాసాలు ఇలాటి బిగ్ స్టార్ కమర్షియల్స్ కే నప్పుతాయని ఇంకోసారి రుజువుచేశాయి. కోటగిరి కూర్పు దర్శకుడు ఉద్దేశించిన కథన వేగాన్ని అందుకున్నట్టే వుంది.

ఎం. రత్నం రాసిన సంభాషణలు ఫ్యాన్స్ కి మంచి హుషారు. దర్శకుడుగా బోయపాటి శీను కమర్షియల్ గా బాలకృష్ణ ని ఆకాశాని కెత్తేస్తూ ప్రెజెంట్ చేయడంలో మరోసారి  సక్సెస్సయ్యాడు.

స్క్రీన్ ప్లే సంగతులు
గతంలో ఫ్యాక్షన్ సినిమాలు వెల్లువెత్తిన కాలంలో వేషం కట్టిన ‘ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్’ అనే ఓకే తరహా మూస స్క్రీన్ ప్లే తనాన్నే ‘లెజెండ్’ లో కూడా  చూడొచ్చు. నడుస్తున్న ప్రస్తుత కథ ఆగిపోయి, గతం తాలూకు ఫ్లాష్ బ్యాక్ కథ సుదీర్ఘంగా  క్లైమాక్స్ వరకూ సాగడం వల్ల – ఇంటర్వెల్ దగ్గర ఆగిపోయిన ప్రధాన కథ- అంటే  ప్రస్తుత కథ తాలూకు టెన్షన్ గ్రాఫ్ కూడా పతనమై చప్పబడిపోతుంది సినిమా. అంతేగాక ఇప్పుడు రెండో పాత్ర కథ కూడా మొదట్నించీ చూడాల్సి వస్తుంది. ఇలా మొదటిపాత్ర కథ ఫస్టాఫ్ లో, రెండో పాత్ర కథ సెకండాఫ్ లోనూ చూడ్డంతోనే సరిపోయి- క్లైమాక్స్ లో పిసరంత అసలు కథ చూస్తాం. అదీ తెలిసిపోయే కథగానే వుంటుంది. ఏమంటే దుష్టసంహారం గావించడమే హీరోకి మిగిలివుండే పిసరంత అసలు కథ.

ఎలాటి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కీ, రొటీన్ మూస కథకీ అతీతంగా వ్యక్తిపూజ ఇమేజులతో  అలరారే స్టార్స్  మాత్రమే తమ భుజాలమీద ఇలాటి లోపభూయిష్ట రచనతో కూడిన సినిమాల్ని ఒన్ మాన్ షోగా లాక్కురాగలరు. కాకపోతే ఆ పాత్ర చిత్రణ ‘దమ్ము’ లో ఎన్టీఆర్ లా వుండకూడదు. వుంటే  అట్టర్ ఫ్లాపవుతుంది.  ‘దమ్ము’లో ఎన్టీఆర్ ది పసలేని పాసివ్ పాత్ర. విలన్ మత్రమే యాక్టివ్ క్యారక్టర్. హీరో ఎంతసేపూ రియాక్టివ్ గా తిరగబడుతూ అయ్యోపాపం అన్పించుకునే స్థితిలో దయనీయంగా ఉంటాడు. పైగా యుద్ధం కూడా చేయనంటాడు.

‘లెజెండ్’ లో హీరో ఒక లక్ష్యం కోసం నిత్యం రగిలిపోయే యాక్టివ్ పాత్రకావడం వల్ల –స్టార్ ఇమేజి కూడా తోడయ్యి బలహీన స్క్రీన్ ప్లే గండాన్ని దాటేసింది. అయితే దర్శకుడు ఎటుతిరిగీ పాసివ్ పాత్రల పట్ల మమకారం చంపుకోనట్టుంది. ‘దమ్ము’లో హీరో పాసివ్ గానూ, విలన్ ని యాక్టివ్ గానూ చూపించినట్టు- ‘లెజెండ్’ లో దీన్ని తిరగేసి విలన్ ని పాసివ్ చేసి, హీరోని యాక్టివ్ చేశాడు. దీంతో విలన్ గా వేసిన జగపతిబాబు పాత్ర రియాక్టివ్ గా పెడబొబ్బలు పెడుతూ చతికిలబడే బలహీనుడిగా మారిపోయింది. బలమైన విలన్ లేకపోవడంతో ఏకపక్షంగా హీరో గొడవే ఎంతసేపూ చూడాల్సిన మొనాటనీకి దారితీసిందీ సినిమా!

మానవాతీత  శక్తుల మెగా ఇమేజుడికి ఎదురెవరూ ఉండరని ఉద్దేశమేమో!

లాజిక్ కూడా బలాదూరవుతుంది. అన్నేళ్ళూ హీరో అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరమేమిటి? ఎప్పుడో విలన్ కథ ముగించేసి వుండొచ్చు కదా? తన పగ కోసం కర్నూలు విలన్ వైజాగ్ వచ్చి పాగా వేస్తే , వైజాగ్ ని ఏలే వంశంలోని హీరో సీనులోంచి మాయమవడమేమిటి? ఇలాటి లాజిక్ ని పూర్వపక్షంజేసే అంశాలెన్నో అడుగడుగునా కన్పిస్తాయి.

-సికిందర్