రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, ఫిబ్రవరి 2014, శనివారం

రివ్యూ..

మ్యూజికల్ ఎటాక్!


హార్ట్ ఎటాక్

నితిన్, అదా శర్మ, కేశా కంభటి, బ్రహ్మానందం, అలీ, ప్రకాష్ రాజ్, విక్రంజిత్ విర్క్ , అజయ్ తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్   సాహిత్యం:  భాస్కర భట్ల  కెమెరా : అమోల్ రాథోడ్  ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్,
బ్యానర్ : పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
నిర్మాత-రచయిత- దర్శకుడు : పూరీ జగన్నాథ్
విడుదల : 31 జనవరి 2014  సెన్సార్ :  ‘A’ 
***
ఓ రోమాంటిక్ కామెడీ ప్రతి పాటా ఉర్రూతలూగించే బాణీలతో మ్యూజికల్ గా అలరించడం ఇన్నాళ్ళకి జరిగింది! ప్రేమకథా చిత్రాల్లో ఒకటీ అరా తప్ప  అలరించే పాటలు కరువై పోయిన ఈ కాలంలో ‘హార్ట్ ఎటాక్’ దాని రోమాంటిక్ జెనర్ కి తగ్గ న్యాయం చేస్తూ చార్ట్ బస్టర్ మ్యూజిక్ తో ప్రేక్షక లోకానికి దగ్గరవడం, ఈ యేటి తొలిమాసాంతంలో ఒక రికార్డు అంశమే.

రెండో ఇన్నింగ్స్ ని  విజయవంతంగా ప్రారభంచిన హీరో నితిన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టినట్టే. అవే రోమాంటిక్ కామెడీల కోవలో కాన్వాస్ మారిపోయి, క్యారక్టర్స్ మారిపోతూ ఉన్నతమైన నిర్మాణ విలువలతో, అతడి సినిమాలు మూడూ వరుసగా వచ్చి విజయాలు సాధించడం అతన్నో టాప్ స్టార్ స్థాయికి చేర్చేశాయి.

ఈ మధ్య పెద్ద స్టార్స్ తో హిట్లు లేక అలమటిస్తున్న అగ్రదర్శకుడు పూరీ జగన్నాథ్ అప్ కమింగ్ స్టార్ నితిన్ తో జతకట్టడం తనకి మంచి ఊరట నిచ్చినట్టే. ఎదిగివస్తున్న నితిన్ ని మళ్ళీ వెనుకబాట పట్టించే 'క్రియేటివిటీ' తో కాక, కాస్త నేర్పుగా ‘హార్ట్ ఎటాక్’ ఇచ్చి న్యాయం చేశాడు.

‘హార్ట్ ఎటాక్’ ఖండాంతరాలకి విస్తరించిన తెలుగు సినిమా మార్కెట్ డిమాండ్లకి తగ్గట్టు ఆ స్థాయిలో దృశ్యాత్మక ఔన్నత్యాన్ని చాటుకుంటూ రెక్కలు విప్పార్చుకుని వాలిపోయింది. విషయపరంగా కొత్త అంశాల్నిఆవిష్కరించక పోయినా, ప్రేక్షకులు డిఫెండ్ అయ్యే ఎలాటి అపభ్రంశాలకీ పాల్పడకుండా సాఫీగా నడిచిపోయే వినోదాత్మక మసాలా దినుసుల దొంతరగా దిగుమతైంది.

అశ్లీలం, ద్వంద్వార్ధాలూ ఉట్టిపడితే తప్ప అది ప్రేమకథా చిత్రం అన్పించుకోదనే దృఢాభిప్రాయానికొ చ్చేసిన కొంతమంది ప్రస్తుత ట్రెండ్ దర్శకులకి ‘హార్ట్ ఎటాక్’ బ్రెయిన్ వాష్ చేయాలి తప్పక. 

ఓ పాటలోంచే దర్శకుడు ఈ పాటల ప్రేమకథా చిత్రాన్ని పుట్టించా నంటున్న ఈ సినిమాలో అసలేముందో చూద్దాం

దేశదిమ్మరి అతడు- దేశవాళీ ఆమె!
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయి, ఆ బాధతో దేశాలు పట్టి తిరుగుతున్న వరుణ్ (నితిన్ ) కి స్పెయిన్ లో హయాతి (అదా శర్మ) అనే అందగత్తె కన్పించగానే అలజడిరేగి ఆమె వెంట పడతాడు. అతడి ఫిలాసఫీ ఒక్కటే : ఈ రోజుని అనుభవించు- రేపటి సంగతి తర్వాత -అనేది. అందుకు తగ్గట్టే మొబైల్ బెడ్, మొబైల్ కిచెన్ వెంటపెట్టుకుని, పేవ్ మెంట్ల మీద వండుకుతిని పడుకుంటుంటాడు. ‘బంజారా’ లాంటి బతుకీడుస్తూ, సంపాదన కూడా అప్పటి అవసరాన్ని బట్టి ‘కూలి’ చేసుకుని గడిస్తూ వుంటాడు. గోవాకి చెందిన హయాతి స్పెయిన్ లో ఫ్రెండ్ ప్రియ ( కేశా కంభటి) దగ్గరికొచ్చి వుంటుంది. ప్రియకో కృష్ణ భక్తుడైన తండ్రి (బ్రహ్మానందం) ఉంటాడు. ఇతడికి తెలీకుండా ఆమె ఒక నల్ల జాతీయుణ్ణి ప్రేమిస్తూంటుంది. హయాతి  వెంట పడుతున్న వరుణ్ ఫిలాసఫీని ఇంకా పొడిగిస్తే, అతడికి ప్రేమలమీద, పెళ్ళిళ్ళ మీదా నమ్మకం లేదు- ఉన్నదల్లా ఓ కిస్ తో సరిపెట్టుకుని వెళ్ళిపోవడమే. దీని ప్రకారమే ఓ గంట సేపు సుదీర్ఘమైన ముద్దు ఆమె చేత పెట్టించు కోవాలని పట్టుదల. దీంతో ఆమె అతణ్ణి అసహ్యించుకోవడం మొదలెడుతుంది. సభ్యతా సంస్కారాలతో కాస్త దేశావాళీగా వుండే అమ్మాయీమే.

ఈ ఆటలో ఎత్తుకు పై ఎత్తులేసుకుంటూ వుంటే, తండ్రి ససేమిరా అంటున్నప్రియ పెళ్లి సమస్య తన షరతు మీద వరుణ్ తీర్చడంతో, ఇక హయాతికి  ముద్దివ్వక తప్పని పరిస్థితేర్పడుతుంది. అయితే ఇందుకామే ఓ షరతు పెడుతుంది...ఈ షరతుకి అతను ఒప్పుకున్నాడా లేదా, ఒప్పుకుంటే జరిగేదేమిటనేది మిగతా కథ.

ఇందులో ఇంకో వైపు గోవాలో ఉంటూ స్పెయిన్ లో డ్రగ్ దందా చేసుకునే మకరంద్ కామాటీ (విక్రం జిత్ విర్క్) అనే గ్యాంగ్ లీడర్ ఉంటాడు. ఇతడి ఇంకో బిజినెస్ అమ్మాయిల్ని అపహరించి అమ్ముకోవడం. స్పెయిన్ లో ఇతడి ముఠా కి ‘కూలిపని’ చేసి పెట్టిన వరుణ్ కి తను చేసిన అసలు పనేమిటో (డ్రగ్స్ రవాణా) తెలిసివచ్చి చిత్తుగా తంతాడు. ఇలా ఈ శత్రుత్వం ఒకటి తర్వాతి పరిణామాల్లో గోవాలో అతణ్ణి వెన్నాడుతుంది.

హయాతిని వెతుక్కుంటూ గోవా వచ్చే వరుణ్ కి సహాయపడే మొబైల్ ఫుడ్ సెంటర్ తమిళ యజమాని పాత్రలో అలీ, చివర కూతురు కిడ్నాపైన కేసులో వచ్చే ధనికుడి పాత్రలో ప్రకాష్ రాజ్, గ్యాంగ్ లీడర్ అనుచరుడి పాత్రలో ఎజాజ్ ఖాన్ ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.


అభినయాలు- అభ్యంతరాలు 
ట్రావెలర్ గా చెప్పుకునే దేశ దిమ్మరి పాత్రలో నితిన్ పూరీ మార్కు అతికి పోకుండా నటనని నియంత్రించుకుంటూ-సిసలైన లవర్ బాయ్ గా కన్పిస్తాడు. అతి తక్కువ చోట్లలో మాస్ డైలాగులు వల్లెవేసి రక్షిస్తాడు. అజయ్ దేహంలోకి బులెట్ పేల్చి నప్పుడు పలికే  ‘దూరిందా లేదా?’ లాంటి సింపుల్ డైలాగులే పవర్ఫుల్ గా పేలాయి. హీరోయిన్ తో వెకిలి తనాలకి పోకుండా చిలిపి నటనలోనూ నితిన్ ఓకే.

అయితే హీరోయిన్ అదా శర్మే మరీ శోకరసం ఊరే సాత్వికురాలి రూపురేఖలతో యూత్ అప్పీల్ కి దూరంగా కన్పిస్తుంది. ద్వితీయార్ధంలో పాత్ర కూడా విషాదమయం కావడంతో, ఆమె అమ్ములపొదిలో సమ్మోహనాస్త్రాలు వుండే అవకాశాలు పూర్తిగా అడుగంటి పోయాయి. ఆ మాటకొస్తే ద్వితీయార్ధంలో నితిన్ కీ ఇదే అవస్థ!  (ఇలా ఎందుకు జరిగిందో తర్వాత  స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం)

ప్రథమార్ధంలో బ్రహ్మానందం, ద్వితీయార్ధంలో అలీ నవ్వించే బాధ్యత మీదేసుకున్నారు. కానీ బ్రహ్మానందానికి రాసిన సిట్యుయేషనల్ కామెడీ ఎపిసోడ్లు అలీకి రాయకపోవడంతో, బ్రహ్మానందం బ్రహ్మాండంగా పేలి, అలీ ఉత్తి వదరుబోతు క్యారెక్టర్ గా మిగిలిపోవాల్సి వచ్చింది.

ఇక విలన్లు షరామామూలు పూరీ బ్రాండ్ దుష్ట నాయకులే. చివర్లో మూడు సీన్లలో కన్పించే ప్రకాష్ రాజ్ అతిధి పాత్రలో తనదైన బ్రాండ్ నటనతో కాస్సేపు హడావిడీ.


సాంకేతికాల సరితూకం 
ఈ సినిమాకి తెరమీద కన్పించే నటీనటులు మాత్రమే కాదు, చాలా అరుదైన విన్యాసాలు చేస్తూ రక్తికట్టించే తెరవెనుక సాంకేతికులూ వున్నారు. పూరీ జగన్నాథ్, అమోల్ రాథోడ్ (కెమెరా), అనూప్ రూబెన్స్ (సంగీతం), భాస్కరభట్ల (సాహిత్యం), ఎస్ ఆర్ శేఖర్ ( ఎడిటింగ్) ప్రభృతులంతా కళ్ళకి, చెవులకి, మెదడుకి, మనసుకీ కావలసినంత క్రేజీ పనులు చేసిపెట్టారు. పూరీ దర్శకత్వం ఎలాటి కాలుష్యకారక పోకడల్లేకుండా నీట్ గా వుంటే, అమోల్ రాథోడ్ ఛాయాగ్రహణం హైక్లాస్ విజువల్ బ్యూటీని ఆవిష్కరించింది. అవుట్ డోర్స్ ఎక్కువ వుండడం వల్ల స్పెయిన్, రోమానియా, గోవా ప్రాంతాల సౌందర్యాలన్నీ ఏ అంతర్జాతీయ స్థాయికీ తీసిపోకుండా వెండితెరని వెలిగించేశాయి. ఇంకా రాబోయే పూరీ సినిమాల్లో కూడా ఇదే స్థాయి ఛాయాగ్రహణాన్ని ఆశించవచ్చునేమో!

అనూప్ రూబెన్స్ ప్రతీ పాటకీ క్యాచీ ట్యూన్స్ కట్టి థియేటర్లో హుషారు తెగ పుట్టిస్తే, భాస్కరభట్ల ‘ఈ లైఫుకి సీక్వెల్ లేదు మామా’ లాంటి  వెర్రెత్తించే భావుకతతో కొత్త పుంతలు తొక్కాడు.  ఇక రాజ్ కపూర్ తీసిన ‘సత్యం శివం సుందరం’ లోంచి- యశోమతి మయ్యాసే బోలే నందలాలా- రాధా క్యోఁ గోరీ, మై క్యోఁ కాలా’ (యశోదతో కృష్ణుడు అన్నాడట-రాధేమో తెల్లగా వుంటే, నేనెందుకు నల్లగా వున్నానని!)పాట బిట్ -  నల్లజాతీయుడి మీద సందర్భ వశాత్తూ కుదరడం ఒక కొత్త  ప్రయోగంగా నిలబడుతుంది. ఎస్ ఆర్ శేఖర్ ఎడిటింగ్ లో వాడిన టెక్నిక్కులు సినిమాని ట్రెండీగా మార్చేశాయి.

ముద్దు సన్నివేశాన్ని కూడా ‘దుప్పటి’ కప్పేసి మరుగుపర్చిన ఈ కాలక్షేప రోమాన్స్ ని కుటుంబాలు కూడా నిరభ్యంతరంగా చూడొచ్చు- అయితే ‘దుప్పటి’ కప్పి సాధించిందేమిటో గానీ- అది రోమాన్స్ కి అత్యంత అవసరమైన ఎమోషనల్ బాండింగ్ ని హాం ఫట్ చేసేసింది!


స్క్రీన్ ప్లే సంగతులు!
సినిమా కథని ఓ పాట విని అందులోంచి తయారు చేసుకున్నానని దర్శకుడి ఉవాచ. అది ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన ‘రాక్ స్టార్’ (2011) లో,  ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో ఇర్షాద్ కమ్లీ రాసిన ‘ఔర్ హో’ పాట. ఈ పాటలో పల్లవి, ప్రారంభ చరణం ఇలా వుంటాయి :
మేరీ బేబసీ కా బయాన్ హై
బస్ చల్ రహానా ఇస్ ఘడీ
రస్ హస్రత్ కా నిఛోడ్ దూఁ
కస్ బాహోమే  ఆ తోడ్ దూఁ
చాహూఁ క్యా జానూఁ నా
ఛీన్ లూఁ    ఛోడ్ దూఁ
ఇస్ లమ్హే  క్యా కర్ జావూఁ
ఇస్ లమ్హే క్యాకర్ దూఁ  జో ముఝే  చైన్ మిలే  ఆరాం మిలే
ఔర్ హో ! ఔర్ హో!
(ఈ సమయంలో నా నిస్సహాయ గొంతుక నా వశంలో లేదు. నా కోరికల రసాన్ని పిండెయ్యనా...రా, నా బాహువుల్లో బిగించి నిన్ను విరిచేస్తా. నాకేం కావాలో నాకు తెలీదు, నిన్ను కాజెయ్యనా వదిలెయ్యనా?ఈ క్షణాన ఏం చెయ్యను? ఏం చేస్తే సుఖ శాంతులు లభిస్తాయి---ఇంకా ఇంకా కావాలి !)

ఇందులోంచి మొదట నితిన్ పాత్ర పుట్టి వుండొచ్చు, అందులోంచీ కథ! పాత్రలేకుండా కథని ఊహించలేం గనుక! నితిన్ తో పాటు అదాశర్మ పాత్రనీ, కథనీ ఏ రస ప్రధానంగా చూపాలన్న దానిమీద దృష్టి పెట్టకపోవడంవల్ల- ప్రేక్షకులనుంచి ఫస్టాఫ్ అంత హుషారుగా సెకండాఫ్ లేదనే అసంతృప్తి వ్యక్తమౌతోంది. దర్శకుడు రోమాంటిక్ కామెడీ తీయాలనుకున్నాడా లేకపోతే  ఎమోషనల్ లవ్వా? మొదటిదే అయితే అదా శర్మ పాత్ర అలా ప్యాసివ్ గా వుండకూడదు. రెండో దయితే అలాటి అదా శర్మ పాత్ర లాగే నితిన్ పాత్ర ఇంటర్వెల్ మలుపు తర్వాత మారడానికి చూపిన కారణం బలంగా వుండాలి. అంటే ఫస్టాఫ్ నితిన్ పాత్రతో రోమాంటిక్ కామెడీగా నడిపి, సెకండాఫ్ ని ఎమోషనల్ గా మార్చాలన్న మాట!

అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్టే, మొదటి సగం రోమాంటిక్ కామెడీ- రెండో సగం ఎమోషనల్ ప్రేమకథా అనే  రెండు విభిన్న జెనర్స్ ని కలిపి ఒక సినిమాగా తీస్తే రసభంగమే అవుతుంది. వినోదాత్మకంగా వున్న మొదటి భాగానికి సెటిలై ఎంజాయ్ చేస్తూ వున్న ప్రేక్షకులు, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించిన రెండో సగం సీరియస్ నెస్ కి అంత సులువుగా అడ్జెస్ట్ కాలేరు.ఇదే మొన్న ‘లవ్ యూ బంగారం’ విషయంలోనూ జరిగింది. బూతో నీతో ఒక ప్రేమ కథంటూ మొదలెట్టాక,  దాన్ని అకస్మాత్తుగా క్లైమాక్స్ లో క్రైం ఎలిమెంట్ తో మలుపుతిప్పడంతో మొత్తం అభాసయ్యింది. ఈ మధ్యే విడుదలైన ‘క్షత్రియ’ లోనూ సైకాలజీ- హారర్- సైన్స్ ఫిక్షన్ -సస్పెన్స్ థ్రిల్లర్ మొదలైన జెనర్స్ అన్నిటినీ  కలిపేసి తీసి భంగపడ్డారు .  ఈ సినిమా దర్శకుడు ఉదయ చంద్ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కథ చెప్పినప్పుడు- అదేదో సైకలాజికల్ సబ్జెక్ట్ లా అన్పించింది. అది కూడా డ్రైగా తోచడంతో, ఇందులో ఎంటర్ టైన్మెంట్ ఏదని అడిగితే సరైన జవాబు చెప్పలేదు. తీరా సినిమా చూస్తే అది జెనర్స్ కాక్ టైల్ గా బయటపడింది!



ఇలా చేస్తే ఇంతే!
హాలీవుడ్ లో గత నవంబర్ లో విడుదలైన ‘అమెరికన్ హసిల్’ లో కూడా క్రైం కథని బ్లాక్ కామెడీ జెనర్ తో కలిపి తీశారు. ఇవి రెండూ కూడా విజాతి ధృవాలే. ఈ రెంటినీ కలిపి కూడా ఎలా నిర్వహించాలో తెలీక రచయితలు కోహెన్ బ్రదర్స్ చతికిల బడ్డట్టు- ఈ స్క్రిప్టు విశ్లేషణ చేసిన స్క్రీన్ ప్లే ట్యూటర్ జాన్ ట్రూబీ పేర్కొన్నాడు. ఆస్కార్ కి వెళ్ళే ఈ సినిమా మంచి సినిమా కావొచ్చుగానీ, గొప్ప సినిమా మాత్రం కాబోదని అభిప్రాయ పడుతూ, ‘ The verdict for American Hustle? The comedy is often quite funny, but the serious drama doesn’t work ’-అని తేల్చాడు.

పూర్వం తెలుగు సినిమాల స్క్రీన్ ప్లేల విషయంలో మన ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళుగా వుండే వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సినిమా చూసొచ్చి- ‘ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ స్టోరీ రా!’ అంటూ కామెంట్లు విసిరేవాళ్ళు. అంటే ఫస్టాఫ్ అంతా కామెడీ కామెడీగా నడిపేసి, ఇంటర్వెల్లో పాయింటు కొచ్చి, అప్పుడుగానీ సెకండాఫ్ లో కథలోకి వెళ్ళేవాళ్ళు కాదు దర్శకులు. ప్రేక్షకులు ఫస్టాఫంతా కామెడీ ఎంజాయ్ చేసి, ఇక సెకండాఫ్ లో ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా ఆ కథలోకి వెళ్లేందుకు సర్వ సన్నద్ధులై పోయేవాళ్ళు అలవాటు కొద్దీ - ఇంకే మారామూ చెయ్యకుండా!

ఈ తరహా నిర్మాణాన్ని ఫస్టాఫ్- సెకండాఫ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనొచ్చు. ఇది సాంప్రదాయ మూడంకాల నిర్మాణం తో విభేదిస్తుంది. తర్వాత్తర్వాత తెలుగు సినిమాలు ఈ సంప్రదాయ మూడంకాల (త్రీ యాక్ట్) నిర్మాణం లోకే వచ్చేసి  కలవడంతో, కథలు శాస్త్రీయంగా ఫస్టాఫ్ లోనే ( ఫస్ట్ యాక్ట్ లో ) 30 -45 నిమిషాల వ్యవధిలో ప్రారంభించేసే కల్చర్ మొదలయ్యింది. అంటే పాత తరం ఫస్టాఫ్ కామెడీ- సెకండాఫ్ స్టోరీ పధ్ధతి లేదన్నమాట. ఈ ప్రకారమే ప్రస్తుత ‘ హార్ట్ ఎటాక్ ‘ లోనూ  ఫస్ట్ యాక్ట్ లో ముప్ఫయ్యోవ నిమిషంలో  స్టోరీ ప్రారంభ మైపోయింది - అదా శర్మకి నితిన్ ముద్దుని ప్రపోజ్ చేసే దృశ్యంతో.

తర్వాత ఇంతే ఫన్నీగా కథ నడుస్తూ 45వ నిమిషంలో ముద్దు డిమాండ్ మరో మెట్టెక్కింది. అంతే ఫన్నీగా నడిచి 75వ నిమిషంలో ఇంటర్వెల్లో ముద్దు పెట్టించుకునే కోరిక నెరవేరి పోవడంతో- నితిన్ ఇరకాటంలో పడే పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితే ఇక్కడ్నిచీ సెకండాఫ్ ని విషాదమయం చేసేసింది!


ఇది రోమాంటిక్ కామెడీ కుండాల్సిన టర్నింగ్ పాయింట్ కాదు. ఈ పాయింటు కూడా కామెడీగానే వుండాలి. హీరోయిన్ శోకమూర్తి కాకూడదు. ప్యాసివ్ గా అలాటి నిర్ణయం తీసుకోకూడదు. రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్లలో ఎవరూ ప్యాసివ్ గా వుండరు. ఇద్దరూ యాక్టివ్ క్యారెక్టర్లుగానే వుంటూ, టర్నింగ్ పాయింట్ లో నువ్వా నేనా? అన్నట్టు పోటీ పడతారు. ఆ తర్వాతంతా అదే హాస్య ధోరణిని కొనసాగిస్తూ- సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ ముగింపు దగ్గర మాత్రమే ( అంటే 75 శాతం కథ నడిచి పోయాక మాత్రమే ) ఏడ్పులూ విషాదాలతో సీరియస్ టర్న్ తీసుకుంటారు. ఇదీ రొమాంటిక్ కామెడీ లక్షణం. దీన్ని చిత్రపటంలో చూస్తే ఇలా వుంటుంది...


ఇందులో 1) ఎవేర్నెస్ పాయింటు దగ్గర- ప్రధాన పాత్ర తనకేం కావాలో నిర్ణయించుకుంటుంది, 2) ఫెమిలియారిటీ దగ్గర- ఇంకాస్త కథని పైకి లేపుతూ తను కోరుకున్న దాన్ని పొందేందుకు వలసిన సమాచారం, తగిన వ్యూహం సమకూర్చుకుంటుంది, 3) కన్సిడరేషన్ బిందువు దగ్గర- కథలో ఇంకాస్త వేడి పుట్టిస్తూ, కోరుకుంటున్నది సాధించు కునేందుకు ప్రత్యాన్మాయాల్ని మరింత జల్లెడ పడుతుంది, 4) ట్రయల్ దగ్గర-కథలో టెన్షన్ బాగా పెంచేస్తూ, పొందాలనుకున్న దాన్ని రుచి చూసేస్తుంది. 5) పర్చేజ్  పాయింటు దగ్గర కొచ్చేసి - ప్రధాన పాత్ర తను టేస్టు చూసిన దాన్ని సొంతం చేసుకోవడానికి కమిటైపోయి ఇక ఎంతదూరమైనా పోతుంది!

ఇంతే! ఇంతకంటే బ్రహ్మ రహస్యమేదీ లేదు. పోనీ ఈ సినిమాలో పైన చెప్పుకున్న పాత తీరు ప్రకారమే -ఫస్టాఫ్ కామెడీగానే నడిపాంగా, సెకండాఫ్ సీరియస్ చేస్తూ కథలోకి వెళ్తే అభ్యంతర మేంటి అనడగొచ్చు. కథ ఫస్టాఫ్ లో అరగంటలోనే మొదలయ్యిందని చెప్పుకున్నామని గమనించాలి- కాబట్టి ఇక్కడ్నించే ప్రేక్షకులు నిర్ధారించిన ఆ కామెడీ రస పోషణనే  ఆస్వాదిస్తూ పోతారు, మధ్యలో ఇంకెలాటి సీరియస్ ఝలక్కులకీ లొంగరు. కనుక రోమాంటిక్ కామెడీ కాకుండా ఎమోషనల్ లవ్ స్టోరీ నే తీయాలనుకుని వుంటే, ఫస్టాఫంతా కథే  లేకుండా పాత  పద్ధతిలో కామెడీ కామెడీ గా నడిపేసి- అప్పుడు ఇంటర్వెల్లో ముద్దు ప్రపోజల్ పెట్టాలి. అక్కడ్నించీ హీరోయిన్ ని హర్ట్ చేసి సినిమాలో చూపించినట్టు సెకండాఫ్ ని కావలసినంత సీరియస్ చేయొచ్చు.

అయితే ఫక్తు ఫటాఫట్ ఎంటర్ టెయిన్ మెంట్ తప్ప,  ఇంకెలాటి సీరియెస్ నెస్ నీ ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు సినిమాలకి మిగిలున్న యువ ప్రేక్షకులు ఒప్పుకోరుగాక  ఒప్పుకోరన్నది పదేపదే రుజువవుతున్న నిజమే! 

రోమాంటిక్ కామెడీనా, ఎమోషనల్ లవ్వా అన్న సందిగ్థతే డివైడ్ టాక్ రావడానికి కారణ మయ్యింది. ఇది చాలనట్టు విలన్ తో యాక్షన్ కథాకమామిషూ జొప్పించారు. రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్లే ఒకళ్ళకొకళ్ళు ప్రత్యర్ధులుగా వుంటారు. వేరే విలన్స్ వుండరు. వుంటే ఆ లవ్ కే ట్రయాంగిల్ ని ఏర్పరుస్తూ కామిక్ విలనీ పండిస్తారు (‘కందిరీగ’ లో సోనూసూద్ లా).

ఇక ఈ కథకి ప్రధానమైన ప్లాట్ డివైస్ గా ప్రయోగించిన ‘ముద్దు’ అనే అంశంతో కూడా సెటప్స్ అండ్ పే అఫ్స్ ప్రక్రియ సరిగ్గా సాగలేదు. ముప్ఫయ్యోవ నిమిషంలో ముద్దు అనే ప్లాట్ డివైస్ ని సెటప్ చేసి, ఇది ఎప్పుడెప్పుడు నిజమౌతుందా చూడాలని ప్రేక్షకుల్లో రేపిన ఉత్కంఠని, తీరా ఇంటర్వెల్లో పే ఆఫ్ కొచ్చేసరికి- ఆ ముద్దు సీను మీద దుప్పటి కప్పేసి- ఆ పే ఆఫ్ ని నీరు గార్చేసి ప్రేక్షకులకి తీవ్ర అసంతృప్తికి లోను జేయడమేగాక, ఆ యిద్దరిమధ్యా ఎమోషనల్ బాండ్ కూడా వ్యక్తం గాకుండా చేశారు. ఇలా పే ఆఫ్ కాని సెటప్స్ ని ఏర్పాటే చేయకూడదు. ఏమంటే సెన్సార్ సమస్యలు రాకుండా జాగ్రత్త అన్నారు. మరెందుకు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. ఆల్రెడీ లిప్ లాక్ సీన్లున్న రెండు మూడు సినిమాలు వచ్చేశాయి కూడా కదా!

పాత్రోచితానుచితాలు 
 బ్లాక్ బస్టర్ మూవీ లక్షణాల్లో ప్రధానమైనది వాటిలో ప్రధానపాత్ర అనాధగా, ఆవారాగా, దేశదిమ్మరిగా వుండడమని  జాన్ ట్రూబీ అభిప్రాయ పడతాడు. ఇది తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు నితిన్ పాత్ర తీరు తెన్నులు ఈ కోవలోనే వుంటాయి. ఈ పాత్రని దేశదిమ్మరి అనకుండా కాస్త మర్యాదిస్తూ ట్రావెలర్ అన్నారు. మరి హిప్పీ అనికూడా అనుకున్నట్టు నితిన్ అభిప్రాయపడ్డాడు. కానీ ఎప్పుడో డెబ్భయిల నాటి హిప్పీ సంస్కృతి ఏనాడో కనుమరుగయ్యింది. ఇది హిప్పీ పాత్రే అనుకుంటే ఇంకో చిక్కుల్లో పడతారు. హిప్పీలు హరే రామా హరే కృష్ణ కల్ట్ ఫిగర్స్. మరి నితిన్ పాత్రని కూడా అలాటి కృష్ణ భక్తుడైన బ్రహ్మానందం నిర్వహించే ‘ఇస్కాన్’ కార్యకలాపాల్లో కలిపి చూపించాల్సి వుంటుంది!

సెకండాఫ్ లో అదా శర్మ పాత్ర వైపు నుంచి బోల్డు ఎమోషనూ సానుభూతీ వర్కౌటై ఉండొచ్చు. కానీ అదంతా బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకమని ఇందాకే చెప్పుకున్నాం. అయితే ఆమెకున్న డెప్త్  నితిన్ క్యారక్టర్లో లోపించడానికి కారణం-  ముద్దిచ్చిన అదా శర్మ  మీద తర్వాత పశ్చాత్తాపంతో మనసు కలగడానికి దోహదం చేసినట్టు చూపించిన ఘట్టం- రోమానియాలో వేరే అమ్మాయి ముద్దు అడిగినప్పటి ఘట్టం- పూర్తిగా తేలిపోవడమే.

ఎందుకు తేలిపోయిందంటే, రెండు వస్తువుల్ని పరస్పరం పోల్చాల్సి వచ్చినప్పుడు ఒకదాన్ని దాచిపెడితే పోలిక ఎలా తెలుస్తుంది? అదా శర్మతో నితిన్ లాంగ్ కిస్ సీను మీద అంత దుప్పటి కప్పేసి చూపిస్తే ప్రేక్షకులకి అది ప్రత్యక్షానుభవం లోకెలా వస్తుంది? అది ప్రత్యక్షాను భవమైతేనే కదా,  పరాయి అమ్మాయితో ముద్దు సీనులో ప్రియురాలు గుర్తొచ్చి నితిన్ పడ్డ బాధంతా  ప్రేక్షకులు ఫీలయ్యేది? 

ఇంటర్వెల్లో మాయదారి ఈ ముద్దు ఘట్టమే కొంపముంచింది. దీంతో ప్రేమకోసం తపించే నితిన్ పాత్ర చాలా కృతకంగా, మరో దొంగాటకం ఆడుతున్న వాడిలా ఆకట్టుకోలేకపోయింది.

ఇంతేకాదు, సెకండాఫ్ లో నితిన్ కోరుకున్నదల్లా జరిగిపోతుంటాయి. అలీ, ప్రకాష్ రాజ్ పాత్రలు ఇలా ఎంటరై అర్జంటుగా గట్టె క్కించేవే. దీంతో యాక్టివ్ పాత్ర తనే కథ నడుపుతున్నట్టుగా కాక- అంతా విధి కొదిలేసినట్టు -కథే పూనుకుని నడిపిస్తున్న ప్యాసివ్ పాత్రలా తయారయ్యింది!

ఇదంతా కాకుండా,  నిజంగా పూరీ ఓ రోమాంటిక్ థ్రిల్లర్ గా తీసివుంటే, అదొక ‘ ఇష్క్’ లాగానో , లేకపోతే ‘స్వామి రారా’ లాగానో ఈ గొడవంతా లేకుండా వచ్చుండే దేమో!

-సికిందర్ 















24, జనవరి 2014, శుక్రవారం

రివ్యూ ..
ఇదో పరాకాష్ఠ !

లవ్ యూ బంగారమ్
తారాగణం : రాహుల్ హరిదాస్, శ్రావ్య, రాజీవ్ తదితరులు
సంగీతం : మహిత్ నారాయణ్    నేపధ్య సంగీతం : జె బి
కెమెరా :  అరుణ్ సూరపనేని    ఎడిటింగ్ : ఎస్ బి ఉద్ధవ్
బ్యానర్ ; క్రియేటివ్ కమర్షియల్స్- మారుతీ  టాకీస్
నిర్మాతలు : వల్లభ, మారుతి      సమర్పణ : కే ఎస్ రామారావు
రచన- దర్శకత్వం : గోవి ( గోవింద రెడ్డి)
విడుదల : జనవరి 24, 2014
***
ప్రేమ కథలు కిరాతకంగా తీస్తేనే ఈ తరం దర్శకుడనే పేరొస్తుందని ఒకానొక  ‘ఈ రోజుల్లో’ సందర్భంతో కొత్త దర్శకులు కొందరికి నమ్మకం ఏర్పడి నట్టుంది. అలాటి కొత్త దర్శకుడు ‘గోవి’ అనగా గోవిందరెడ్డి, సినిమా ప్రారంభంలో తను దర్శకుడైనందుకు  కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ,  కుటుంబాలు ఇబ్బంది పడే సినిమా తీసి ‘ గ్రో అప్’ అని సినిమాలో ఒక భోళా పాత్రకి క్లాసు పీకించిన చందంగానే సదరు కుటుంబాలకే జ్ఞాన బోధ చేసే దాకాపోయాడు. సుప్రసిద్ధ  క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ఈ యజ్ఞంలో పాలుపంచుకునేందుకు ఎలాటి మొహమాటమూ పడకుండా - ఈ తరహా సినిమాలకి ఇప్పటి ట్రెండ్ లో బ్రాండ్ నేమ్ గా వెలుగొందుతున్న దర్శకుడు మారుతి తో జతకట్టి సక్సెస్ కళ్ళ జూడా లనుకుంది. అధినేత కే ఎస్ రామారావే చెప్పినట్టు, తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డబ్బులొచ్చే సినిమాలు మారుతీ తీస్తున్నాడు కాబట్టి ఈ జాయింట్ వెంచర్ ఇలా తెరకెక్కిం దన్నమాట!

‘ఈ రోజుల్లో’ తర్వాత ఈ సమీక్షకుడితో మారుతి ఒక విషయం చెప్పాడు- తను నానా ప్రయోగాలూ చేసి 5-డీలో  ‘ఈ రోజుల్లో’ తీసినట్టు  ఇంకెవరైనా 5-డీతో ప్రయత్నాలు చేస్తే చేతులు కాల్చుకుంటారని! అంతేగానీ అసలు అదేపనిగా  ‘ఈ రోజుల్లో’ లాంటి అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీస్తే అట్టర్ ఫ్లాపై పోతారని చెప్పలేదు. చెప్పాల్సిన పనిలేదు-చేసి చూపిస్తున్నాడు గనుక. ప్రస్తుత సినిమాతో  పరాకాష్టకి చేరిన తన ఈ బ్రాండు ‘క్రియేటివిటీ’ తో తన గమ్యం ఏమిటో తనకే తెలుస్తుందిక!

సరైన సినిమాల్లేక త్రిశంకు స్వర్గం లో కొట్టు మిట్టాడుతున్న ‘హేపీ డేస్’ ఫేం హీరో రాహుల్ హరిదాస్ ఈ సినిమాతో నటనలో కాస్త మెరుగయ్యాడు తప్పితే,  ఈ సినిమా తన కెరీర్ లో చెప్పుకో దగ్గదేం కాదు- గత సినిమా ‘ప్రేమ ఒక మైకం’ లాగే. శేఖర్ కమ్ముల అతడికి సృష్టించిన గుర్తుండిపోయిన ‘టైసన్’ లాంటి పాత్రని సృష్టించడంలో ఇతర దర్శకులు విఫలమైనట్టే ‘గోవి’కూడా చేతులెత్తేశాడు.

ఈ తరం ప్రేక్షకులకి యువజంట పెళ్లి కథ చెప్పాలనుకున్నారు. అభద్రతా భావంతో అనుమానాలు పెంచుకు తిరిగే హీరోని, ఆత్మవిశ్వాసం ఉరకలేసే  హీరోయిన్ తో కలిపి ఆ వైవాహిక జీవితం అనుమానాలతో ఏ మలుపులు తిరుగుతుందో చూపాలనుకున్నారు. విషయం కొత్తదేమీ కాదు, చాలాసార్లు చాలా సినిమాల్లో వచ్చేసిన ఈ పాత విషయాన్నే కొత్తగా ఏమైనా చెప్పారేమో ఈ క్రింద చూద్దాం.

ప్రేమో కామమో...
వైజాగ్ లో ఆకాష్ ( రాహుల్) ఓ సెల్ ఫోన్ల కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్. మీనాక్షి (   ) ఓ రాజకీయనాయకుడి కూతురు. ఫ్రెండ్స్ తో జల్సాగా తిరగడమే ఆమె పని. ఆకాష్ తండ్రి కూడా రాజకీయ నాయకుడే. సంపాదన లేని ఆ తండ్రి కొడుకు జీతమంతా లాగేసుకుని రాజకీయాలకి- తన తండ్రి విగ్రహ ప్రతిష్టాపన పన్లకీ తగలేస్తూంటాడు. ఓ సంఘటనలో ఆకాష్, మీనాక్షీలు కలుస్తారు. ఈ కలయిక కాస్తా ప్రేమకి  దారితీస్తే, రాజకీయ ప్రత్యర్ధులైన తండ్రులవల్ల పెళ్లి కుదరక పారిపోయి పెళ్లి చేసుకుంటారు. అంతలో రాహుల్ కి మేనేజర్ గా ప్రమోషన్ వచ్చి హైదరా బాద్ కి బదిలీ అవుతాడు.

ఇక్కడ ఓ ఏడాది ఇద్దరి కాపురం సజావుగా సాగిపోతుంది. అప్పుడు ఒంటరిగా ఇంట్లో బోరు భరించలేక మనాక్షి ఉద్యోగం చేస్తానని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరుతుంది. అలా జాబ్ కి వెళ్తున్న  ఆమెకి  బాల్య స్నేహితుడు మదన్ (రాజీవ్) తారసపడతాడు. ఇతడి గురించి ముందే చెప్పి ఉంచింది రాహుల్ కి.  ఇప్పుడామె ఆ మదన్ ని కలుస్తూ ఉండడంతో,  రాహుల్ కి అనుమాన బీజాలు నాటుకుని ఆమె కదలికల్ని కనిపెడుతూంటాడు. లోలోన కుమిలి పోతూంటాడు. తన సంగతి తెలిసిపోయిందని ఆమెకి తెలిసినా ప్రవర్తన మార్చుకోదు. ఇంతలో ఈ ముగ్గురి మధ్యకి అసలు గేమ్ ఆడుతున్న ఓ దుష్టుడు బట్టబయలవుతాడు...

ఇదీ విషయం. ఈ విషయాన్ని వీలైనంత అశ్లీలాన్ని జోడించి చెప్పారు. విషయం కాదు ప్రధానం, యువప్రేక్షకులకి కామోద్దీపన కల్గించడమే ముఖ్యమన్నట్టుగా సాగించారు. ఇందుకు హీరోయిన్ శ్రావ్య శాయశక్తులా సహకారం అందించింది. హీరో హీరోయిన్ల శృంగార చేష్టలకి పెళ్లి అనే లైసెన్సు ఇచ్చేయడంతో హద్దు లేకుండా పోయింది. అక్షేపణీయం కాని యూత్ అప్పీల్ ని రాజెయ్యడానికి ఇది చాలా తెలివిన ప్లానింగ్. పెళ్ళికాని యువజంట తో ఇలాటి చిత్రీకరణలు తీవ్ర విమర్శల పాలవుతాయి కాబట్టి  -పెళ్లి జరిపించేసి ఆ ముసుగులో యదేచ్ఛగా పడకగది దృశ్యాలకి తెరతీసినట్టుంది. మున్ముందు మారుతికి, మారుతి గ్రూప్ దర్శకులకీ ఇలాటి కొత్త కొత్త టెక్నిక్ లు ఎన్నితడతాయో వేచి చూడాల్సిందే!




contd..







22, జనవరి 2014, బుధవారం

స్క్రీన్ ప్లే సంగతులు - 1

స్క్రీన్ ప్లే ప్రయాణంలో మజిలీలు అక్కర్లేదా?

ఆరోజుల్లో కే ఏ అబ్బాస్ స్క్రిప్టు రాసుకొస్తే షోమాన్ రాజ్ కపూర్ శుభ్రంగా తలంటు పోసుకునిగానీ ఆ స్క్రిప్టుని ముట్టుకునే వాడు కాదట. దాన్నో పవిత్రగ్రంధంలా కళ్ళకద్దుకుని, నెత్తిన పెట్టుకుని పూజ గదిలోకి వెళ్ళే వాడట. ఆ స్క్రిప్టుకి పూజాదికాలు అవీ పూర్తిచేసి తెచ్చుకుని, అప్పుడు మాత్రమే దాని ముందు భక్తి భావంతో  మోకరిల్లి, ఏకబిగిన ఉచ్చ స్వరంతో చదివేసేవాడట!

అలాటి పవిత్ర గ్రంధం ఇప్పుడు స్క్రిప్టు కాదు. ఓ నిర్మాత తయారైన స్క్రిప్టు పట్టుకుని బోల్డు భక్తి శ్రద్ధలతో వెళ్లి తిరుపతి వెంకన్నని దర్శించుకున్నాడు. తిరిగొచ్చి కలం పట్టుకుని తన టాలెంటు ప్రదర్శనతో దాన్ని చెండాడేడు. అది దేవుడి కాపీ అన్న స్పృహే లేకుండా పోయింది. దాన్ని నానా కంగాళీ చేసి ఫెయిర్ చేయడానికి ఇచ్చాడు. దేవుడి దగ్గర మొక్కించిన కాపీని చెత్తబుట్ట దాఖలు చేశాడు. మనకెందుకులే అని ఈ రచయిత దాన్ని ఫెయిర్ చేసిచ్చాడు. ఆ దెయ్యం కాపీతో సినిమా తీశాడు నిర్మాత. సహజంగానే ఆ దేవుడి దయవల్ల దానికి దరిద్రం చుట్టుకుంది!

ఈ తరహా ధోరణికి కారణం స్క్రిప్టు కంటే కెమెరా ఉన్నతమైనదని భావించడమే. ప్రాక్టికల్ గా తెర మీద కదిలే బొమ్మల్ని సృష్టించే కెమెరాని మించిన సృజనాత్మక ఉపకరణం ఏదీ లేదనుకోవడమే. కెమెరాకి వుండే అన్ని భౌతిక సూత్రాల్లాంటివే  స్క్రిప్టుకీ ఉంటాయని అంగీకరించక పోవడంవల్లే స్క్రిప్టంటే చిన్నచూపు - దాంతో చిల్లరమల్లర ఫలితాలూ.

స్క్రిప్టులో  అంతర్భాగమైన స్క్రీన్ ప్లే అనే క్రియేటివ్ టూల్ కి కెమెరాకి ఉన్నట్టే  పాటించాల్సిన రూల్సూ  వున్నాయి. ఈ రూల్సు లోతుల్లోకి వెళ్తే అదొక అనంతమైన శాస్త్ర మౌతుంది. ఇది గుర్తించకుండా సినిమా అంటే  కేవలం  కెమెరా రూల్సేనని నమ్మడం వల్ల  ఏమీ ప్రయోజనం వుండదు. సినిమా ఆఫీసు తీస్తున్నప్పుడు అన్ని వాస్తు సూత్రాలూ పట్టించుకుని, తీరా స్క్రిప్టు కి  కూడా వుండే అలాటి ‘వాస్తు’ విలువల్నే తెలుసుకోకపోతే – అలాటి సినిమాతీసి కాశీకి ప్రయాణం కట్టడమే.

స్క్రీన్ ప్లే కీ ‘వాస్తు’ వుంటుంది. ‘వాస్తు’ దోషాలుంటాయి. సరిదిద్దుకుంటే సత్ఫలితాలుంటాయి. ప్రజాస్వామ్యమనే మహాసౌధానికి మూల స్తంభాలు నాల్గున్నట్టే, స్క్రీన్ ప్లే కీ ఐదు మూల స్తంభాలుంటాయి. అవి ప్లాట్ పాయింట్స్  -1, 2  లు, మిడ్ పాయింట్, పించ్ పాయింట్స్ -1, 2 లు. ప్రజాస్వామ్య మూల స్తంభాలలో ఏ ఒక్కటి చాప చుట్టేసినా ప్రమాదమన్నట్టుగానే, స్క్రీన్ ప్లే సౌధం లో ఈ ఐదింటిలో ఏ ఒక్క మూల స్తంభం లోపించినా, లేదా బలహీన పడ్డా అది కుప్ప కూలడమే అవుతుంది.  ఐదు స్తంభాల స్క్రీన్ ప్లే అనే సౌధంలో విడుదు ల్లాంటి మూడు అంకాలుంటాయి.  వీటిలో ఏ ఒక్కటి వెళ్లి మరోదాన్ని (విడిదిని) దురాక్రమించినా మొత్తం ఆ ‘వాస్తు’ చెడిపోతుంది.

వేలసంవత్సరాలుగా వున్న ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించే నవీన వాదులూ వున్నారు. వీరిని ఫస్టాఫ్- సెకండాఫ్ వాదులందాం. వీరు స్క్రీన్ ప్లే కి ఒక నిర్మాణం చెప్పేసి అందులోనే కథ చెప్పలనడం అన్యాయమంటారు. ..


To be concluded..







21, జనవరి 2014, మంగళవారం



ఇంటర్వ్యూ:

కళా దర్శకత్వం

తెలుగులో ట్రెండ్ ని మార్చింది నేనే!

కె. అశోక్ కుమార్ 

సినిమా కళాదర్శకత్వం పుట్టిల్లు కూడా నాటకరంగమే. తొలి ఆర్ట్ డైరెక్టర్ శిల్పి. 1910 లో ‘పుండలీక్’ అనే నాటకాన్ని నాటకం నడుస్తూండగా యథాతధంగా చిత్రీకరించాడు ఆర్.జి. టోర్నీ అనే ఔత్సాహికుడు. అదే మనదేశంలో మొట్టమొదటి చలనచిత్ర మయ్యింది. తర్వాత 1913 లో స్వయంగా కథ రాసుకుని ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మించాడు దాదా సాహెబ్ ఫాల్కే. అప్పట్లో రంగ స్థల నాటకాలుగా పౌరాణికాలే వుండడం చేత తెలుగులో కూడా అవే సినిమాలుగా 1937 వరకూ రాజ్యమేలాయి. సినిమా కళాదర్శకత్వం అందుకే ఆ పౌరాణిక సెట్టింగులతో  వర్ధిల్లింది. 1938లో ‘మాలపిల్ల’ వచ్చిందగ్గర్నుంచీ కళాదర్శకత్వం పంథా మార్చుకుంది. నిత్యజీవితంలో జనం నివసించే ఇళ్ళు, వీధులూ కళా దర్శకత్వపు పరిధిలో కొచ్చాయి. ఆతర్వాత కలర్ సినిమాల్లో వెలుగు జిలుగుల భవంతులూ, ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ దాసోహులైన ప్రేక్షకులకోసం ఫాంటసీ  ప్రపంచాలూ కళా దర్శకత్వపు చేతికి చిక్కాయి.


అయితే సినిమా కళాదర్శకత్వం సినిమా స్టూడియోలోనే మొదలైందంటారు  ప్రసిద్ధ ఆర్ట్ డైరెక్టర్ కె. అశోక్ కుమార్ (నాటక రంగాన్ని తమ  పూర్వశ్రమంగా అంగీకరించాలంటే మనసొప్పదు చాలామంది సినిమావాళ్ళకి). ఆ రోజుల్లో కెమెరా సహా ఎక్విప్ మెంట్ అంతా  బయటికి మోయలేనంత మోత బరువు కాబట్టి, స్టూడియోల్లోనే సెట్స్ వేసి చిత్రీకరించే వాళ్ళనీ, అలా ఆ సెట్స్ కోసం కళాదర్శకత్వం  స్టూడియోల్లోనే పుట్టిందనీ అంటారాయన.


మహేష్ బాబు హిట్ ‘ఒక్కడు’లో చార్మినార్- ఓల్డ్ సిటీ సెట్ గుర్తుందా? అది అశోక్ కుమార్ అపూర్వ సృష్టే. ‘పౌర్ణమి’లో ఆలయం, ‘అరుంధతి’లో రాజకోట నిర్మాత కూడా ఆయనే. ‘వరుడు’ లో అట్టహాసంగా కట్టిన కళ్యాణ మండపం చూ  శారా? దీని సృష్టికర్త కూడా ఈయనే. అయితే చార్మినార్- ఓల్డ్ సిటీ నాటికి 70 శా తం  కళాదర్శకత్వం, 30 శాతం కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీ)గా వుంటే, కళ్యాణ మండపం నాటికి వాటి శాతాలు తారుమారయ్యా యంటారు అశోక్ కుమార్. అంటే  సీజీ వచ్చేసి కళా దర్శకత్వాన్ని మింగేస్తోందా? అదేమోగానీ సీజీ వల్ల  వీడియో పైరసీ మాత్రం తగ్గుతుందని కొత్త వ్యాపారసూత్రం. ఎందుకంటే అలాంటి  అద్భుతాల్ని వెండితెర మీద చూడ్డానికి ప్రేక్షకులు తప్పనిసరిగా ధియేటర్లకే వస్తారు కాబట్టి.

ఐతే ఒక కట్టడం పూర్తిగా కళా దర్శకుడి పనితనంగానే సినిమా విమర్శకులు సైతం పొరబడుతున్నారు కదా అంటే, సామాన్య ప్రేక్షకుల సీజీ పరిజ్ఞానం ఇప్పుడు కాదు, ఏనాడో పెరిగిందని సమాధానమిచ్చారాయన. అయితే ఈ సీజీ కూడా సాగిపోయే దశే అనీ, పదేళ్ళ క్రితం ఓసారి ఇలాగే వచ్చి వెళ్లి పోయిందనీ చెప్పుకొచ్చారు. పదేళ్ళ క్రితం ‘అంజి’, ‘సహస వీరుడు –సాగర కన్య’ వంటి ఫెయిల్యూర్ సేజీ లకి తనే ఆర్ట్ డైరెక్టర్ మరి!

హాలీవుడ్ కథలు, దృశ్యాలు మన సినిమాల్లోకి దిగుమతి అయినట్టు కళాదర్శకత్వం కోసం హాలీవుడ్ వైపు తను చూడ్డం లేదని స్పష్టం చేశారాయన. వాళ్ళ శైలి మనకు సరిపడదన్నారు. మరెక్కడ్నుంచీ ఇన్స్ పైరవుతా రంటే,  లైబ్రరీ చూపించారు. కలర్ స్కీమ్స్, డిజైన్స్, ఆర్కిటెక్చర్, కామిక్స్ మొదలైన విభాగాలకి చెందిన వందలాది పుస్తకాలు అక్కడ పేర్చివున్నాయి. ఆ పుస్తకాల్లో ఏ అంశం ఎక్కడుందో తన మస్తిష్కంలో ముద్రించుకు పోయిందన్నారు.

1986 లో మద్రాస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో విజువల్ కమ్యునికేషన్స్ లో పట్టభద్రుడైన ఈయన స్వరాష్ట్రం కేరళ. ప్రఖ్యాత  దర్శకుడు భరతన్ ఈయన పిన తండ్రే. 1989 లో ‘ప్రతాప్ పోతన్  ‘డైసీ’ కి కళా దర్శకత్వమిచ్చి ప్రోత్సహిస్తే, కమలహాసన్ తను నటిస్తున్న ‘ఇంద్రుడు-చంద్రుడు’ లో రెండు పాటలకి సిఫార్సు చేశారు. అది మొదలు డి. రామానాయుడు క్యాంపులో సినిమాలు చేస్తూ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. తెలుగులోనే అగ్ర దర్శకుల, అగ్ర హీరోల సినిమాలు 120 వరకూ పని చేశారు.

‘తెలుగులో కళా దర్శకత్వపు ట్రెండ్ ని మార్చింది నేనే ‘ అంటూ సగర్వంగా చప్పారు. ఏమిటా ట్రెండ్? అంటే ..కొత్త కలర్ స్కీమ్స్, హాఫ్ ఫ్లోర్ సెట్స్ వగైరా. కళా దర్శకత్వానికి కాణాచి అయిన తోట తరణి స్టైల్ కి ముగ్ధుడై, విరివిగా కలర్స్ వాడింది తానేనని చెప్పారు. తెలుగు సినిమాల్లో ఈ ట్రెండ్ ఇప్పటికీ ఇలాగే కొనసాగుతోందని చెప్పారు.
సరే, మంచి కళా దర్శకుడి లక్షణాలేమిటి? ఇంజనీరింగ్, టెక్నికల్, ఆర్కిటెక్చర్ స్కిల్స్ తో బాటు, ఒక మైన్యూట్ ఐడియా తడితే,  దాన్ని బ్రహ్మాండంగా విస్తరించే నైపుణ్యం కలిగివుండడం మంచి కళా దర్శకుడి లక్షణ మన్నారుఅశోక్ కుమార్.

అశోక్ కుమార్ నాయర్ కరలత్ ది అద్భుత కళా ప్రపంచం. సంస్కృతుల్ని ఔపోశన పట్టిన దివ్యానుభూతుల లోకం ఆయనది. కాకపోతే  ఒక్కటే లోటు. తెలుగు గ్రామీణ వాతావరణాన్ని తెలుసుకునే అవకాశం లభించలేదు. అలాటి సినిమాలకి పనిచేస్తే ఆ లోటు కూడా తీర వచ్చేమో. ఆయన దృష్టిలో కథని, పాత్రల్నీ తెలుసుకోకపోతే కళాదర్శకత్వం లేదు. అలాగే దర్శకుడికి కుడి పక్క కెమెరా మాన్, ఎడం పక్క కళా దర్శకుడూ లేకపోతే మంచి సినిమాకూడా లేదు.

ఇప్పుడాయన తనపక్కన తనే నిలబడుతున్నారు. దర్శకుడుగా మారుతున్నారు. ఈ క్రమంలో కొన్ని పెద్ద సినిమాలకు కళా దర్శకత్వాన్ని వదులుకున్నారు కూడా. ఇది అభిమానులకి బాధాకరమే కావొచ్చు. దర్శకుడుగా నిరూపించుకుని ఆ బాధని మరిపించాల్సిన బాధ్యతంతా  ఆయన పైనే వుంది!

-సికిందర్
 (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)




13, జనవరి 2014, సోమవారం

రీసైక్లింగ్ మసాలా !
రివ్యూ
 ‘ఎవడు’
తారాగణం : రాం చరణ్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, శృతీ హాసన్, అమీ జాక్సన్, జయసుధ,కోట శ్రీనివాసరావు, సాయికుమార్, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,
సుబ్బరాజు, అజయ్ తదితరులు 

కథ : వక్కంతం వంశీ, వంశీ పైడిపల్లి,  మాటలు : అబ్బూరి రవి
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్   గీతాలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోసు, కృష్ణ చైతన్య, శ్రీమణి
చాయాగ్రహణం : రాం ప్రసాద్   నృత్యాలు :       కళ : ఆనంద్ సాయి  కూర్పు : మార్తాండ్ కే వెంకటేష్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్     నిర్మాత : దిల్ రాజు
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిడివి : 166 నిమిషాలు, సెన్సార్ : A   విడుదల : జనవరి 12 , 2014

***
గత ఆర్నెల్లుగా అనేక సార్లు వాయిదా పడుతూ రామ్ చరణ్ అభిమానుల్ని తీవ్ర అసహనానికి గురిచేస్తున్న  తాజా కానుక ‘ఎవడు’ ఎట్టకేలకు సంక్రాంతికి దిగివచ్చింది. రంగంలో వున్న మహేష్ బాబు ‘1- నేనొక్కడినే’ ని బలంగా ఢీ కొట్టింది. ఈ పందెం కోళ్ళల్లో మొదటిది ఆపాటికే డీలాపడివున్న పరిస్థితిని సొమ్ముచేసుకుంటూ బాక్సా ఫీసు ని కొల్లగొట్టుకుంది. అలాగని పూర్తిగా గెలిచానన్న సంతోషం కూడా లేదు. సంక్రాంతి కోడి పందాలంతటి థ్రిల్లింగ్ గా  ఈ రెండు కోళ్ళ మధ్య నువ్వా నేనా ? అన్నట్టు పోటీ లేకపోవడంతో- ఈయేటి సంక్రాంతి హీరో బ్యాడ్జీ దాని గ్లామర్ ని కోల్పోవాల్సి వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీసు ముఖం పట్టేందుకు ఏంతో  ఓపికపట్టి ఉన్న నిర్మాత దిల్ రాజు కి దీని సక్సెస్ చాలా అవసరం. గత నిర్మాణం ‘రామయ్యా వస్తావయ్యా’ తో అయిన అనుభవం దృష్ట్యా ‘ఎవడు’ ప్రతిష్ట నిలబెట్టాలి. అయితే సుదీర్ఘకాలం నిర్మాణంలో వున్న కారణంగా కొన్ని నష్టనివారణా చర్యలు తీసుకోవడానికి వీలు పడి ఉండక పోవచ్చు. ఫలితంగా ఇది ఒకవర్గం ప్రేక్షక కటాక్షానికే లోబడాల్సి వచ్చింది- పండక్కి కుటుంబాలు వినోదించే మసాలాదినుసులకన్నా,  పక్కా మాస్ ఎలిమెంట్స్ శృతిమించి పోవడంవల్ల!

హీరో రామ్ చరణ్ తన తండ్రిలాగే ఆయన నిర్దేశకత్వంలో మూస ఫార్ములా బరి ఏమాత్రం దాటకుండా,  సేఫ్ గేమ్ ఆడేందుకు కృతనిశ్చయు డయ్యాడని అతడి ట్రాకుని బట్టి తెలిసిపోతోంది. ఏ ముహూర్తాన అయితే 2010 లో ‘ఆరెంజ్’ అనే జెనెక్స్ అర్బన్ క్లాస్ ప్రేమకథ దారుణ పరాజయం పాలయ్యిందో-ఇక అప్పట్నుంచీ చిరంజీవి మార్గదర్శకత్వంలో ఆయనకి కలిసివచ్చిన బాటలో వరుసగా ‘రచ్చ’, ‘నాయక్’, ఇప్పుడు  ‘ఎవడు’ అనే మాస్ లక్ష్యిత మూస ఫార్ములా కథల వైపు మొగ్గడం ప్రారంభించాడు. మధ్యలో ‘జంజీర్’ – ‘తూఫాన్’ హిందీ /తెలుగు రీమేకుల ప్రయోగం మరో దెబ్బ తీసింది. ఒకేతరహా సినిమాలతో మాస్ మహారాజా రవితేజకి  తలపట్టుకునే పరిస్థితి వచ్చిందన్నది కన్పిస్తున్న చరిత్ర. రామ్ చరణ్ కి ఇలాంటి ఇబ్బంది ఎదురవకూడదని ప్రార్ధిద్దాం.

మూస ధోరణిలో ‘ఎవడు’ కొన్ని ఆంగ్ల-తెలుగు సినిమాల రీసైక్లింగ్ తిరగమోత. విద్యాధికుడైన దర్శకుడు వంశీ పైడిపల్లి నుంచి ఇలాటి వంటకం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. హీరోని బట్టి దర్శకుడు కూడా మారాల్సిందే. కాకతాళీయమే కావొచ్చు, ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ విడుదలైన సినిమాలు   ‘క్షత్రియ’,  ‘1-నేనొక్కడినే’, ’ఎవడు’- మూడూ కొత్త కథల్నే ప్రయత్నిచాయి. మొదటి రెండూ సైకాలజికల్ థ్రిల్లర్స్ గానూ, చివరిది ముఖమార్పిడి యాక్షన్ మూవీగానూ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే కథా నిర్వహణలో కొత్తదనాన్ని ప్రదర్శించలేకపోయాయి. ‘ఎవడు’ కథని నడిపించడానికి మరీ ఇంత పాత మూస అవసరమా అన్పించేట్టుంది-మాస్ కి హృదయస్పందనలే  వుండ వన్నట్టు ఇంత సుత్తిమోత అవసరమా?

ఫేసులూ – కౌంటర్ ఫేసులూ
వైజాగ్ లో సత్య( అల్లు అర్జున్), దీప్తి (కాజల్ అగర్వాల్) ప్రేమించుకుంటారు. లోకల్ డాన్ వీరూభాయ్ (రాహుల్ దేవ్) దీప్తిని వశపర్చుకోవాలని చూస్తూంటాడు. సత్య కీ, వీరూకీ ఈ కారణంగా ఘర్షణలు పెరిగి, దీప్తీ తో పారిపోయి హైదరాబాద్ లో పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు సత్య. వీరూ మనుషులు ఆ బస్సుని అటకాయించి ఇద్దర్నీ చంపేసి బస్సుని తగులబెట్టేస్తారు. సగం ముఖం కాలిపోయి కొనప్రాణంతో వున్న సత్యని హైదరాబాద్ లో డాక్టర్ శైలజ  (జయసుధ) చికిత్స చేస్తుంది. పదిరోజుల తర్వాత కోలుకున్న సత్య ముఖం చూసుకుంటే అది తన ముఖం కాదు. సర్జరీలో ఏకంగా ఫేస్ ట్రాన్స్ ప్లాంటేషనే జరిగిపోయింది...మారిపోయిన ముఖంతో (రామ్ చరణ్ ముఖం) ఇదే అదును అనుకుని సత్య వైజాగ్ పారిపోయి వీరూ మనుషుల్ని చంపడం మొదలెడతాడు. ఈ క్రమంలో వీరూ కన్ను పడిన మరో అమ్మాయి శృతి (అమీ జాక్సన్ ) ని కాపాడి ఆమెద్వారానే గ్యాంగ్ ని ట్రాప్ చేసి చంపుతుంటాడు. చివరికి వీరూని చంపేసి పగ తీర్చుకోవడం పూర్తయ్యేసరికి – ఇంకో ముఠా అనుచరుడు- సత్యని చూసి చరణ్ (రామ్ చరణ్) అనుకుని- ఇంకా బతికే ఉన్నాడని  గగ్గోలు లేపుతాడు. ఇక సత్య మీద ఈ  ముఠా దాడులు మొదలెడుతుంది.

చిక్కుల్లో పడతాడు సత్యా. చచ్చిపోయిన చరణ్ ఫేసు తన కెందుకొచ్చింది? ఈ అనుమానంతో డాక్టర్ శైలజ  ని కలిస్తే- ఆమె తన కొడుకు చరణ్ కథ చెప్పుకొస్తుంది. అందరి బాగు కోరే కొడుకు దుష్ట రాజకీయనాయకుడు ధర్మా (సాయికుమార్) కుట్రలకి  ఎలా బలైపోయాడో తెలుసుకున్న సత్య – చరణ్ గా ఎంటరై ధర్మాని బోల్డు తికమక పెట్టేస్తూ ఆడుకోవడం మొదలెడతాడు...

ఓకే ఫేసుతో సత్యగా, చరణ్ గా నటించిన రామ్ చరణ్ అభిమానుల మెప్పు తప్పకుండా పొందుతాడు. ఈ ద్విపాత్రాభినయాలు ఇంకో విధంగా వుండి వుంటే నటనల్లో  ఇంకా చాలా వైవిధ్యం వచ్చేది. అదెలాగో తర్వాత చూద్దాం. ప్రారంభంలో అతిధి పాత్రలో వచ్చే అల్లు అర్జున్ ది  ‘లో- ప్రొఫైల్ ‘ మెయింటైన్ చేసే క్యారక్టర్ కావడంతో సినిమా ప్రారంభ దృశ్యాలు అంత ప్రభావశీలంగా ఏమీ లేవు.  అతడి ప్రేయసిగా కాజల్ బాగా లావెక్కి కన్పిస్తుంది. శృతి పాత్రలో బ్రిటిష్ నటి అమీ జాక్సన్ తెలుగులోకి ఎంటరవుతూ పాత్ర సరిగ్గా లేక కృతకంగా నటించి వెళ్ళిపోయింది. ‘1947- ఏ లవ్ స్టోరీ (తమిళ మాతృక ‘మదరాస పట్టినం’- 2010 విడుదల) లో కడు హృద్యంగా అభినయించిన ఆమె ఇలా తేలిపోవడం ఒక విషాదం. 

చరణ్ పాత్ర ప్రేయసిగా శృతీ హాసన్ దీ కురచ పాత్రే. విలన్ గా  నటించిన సాయికుమార్ పెడబొబ్బలు పెట్టడంతోనే సరిపోయింది. డాక్టర్ గా జయసుధ నటన హుందాతనం ఉట్టిపడేలా వుంది. వెన్నెల కిషోర్ ది పాత్రే కాకపోయాక, బ్రహ్మానందం నవ్వించడానికి అంతంత మాత్రమే  స్క్రీన్ టైం దక్కింది.

సినిమాలో కామెడీ మిస్సయి ఒకటే సీరియస్ గా అదేదో ప్రపంచం కొట్టుకు పోతున్న చందంగా పాత్ర చిత్రణ లున్నాయి. దీనికి తోడూ దేవీశ్రీ ప్రసాద్ పాటల పారవశ్యం మాటేమో గానీ, నేపధ్య సంగీతం మాత్రం చాలా నాటుగా, డీటీఎస్ మిక్సింగ్ మరీ ఘోరంగా చెవులుపగిలే మోతతో నరకం చూపిస్తాయి. మాస్ కి ఈ క్రియేటివిటీ తోనే ఆకట్టుకోవచ్చను కున్నారేమో తెలీదు - ‘సి’ గ్రేడ్ సినిమా వ్యవహారంలా వుంది. ఛాయాగ్రహణం, ఫైట్స్ షరామామూలే. పండక్కి పెద్దలకుమాత్రమే ‘A’ సర్టిఫికేట్ తో వచ్చిన ఈ హింసాత్మక మసాలా మాస్ కోసమే అనడం కూడా వాళ్ళని అవమానించడమే అవుతుందేమో!

స్క్రీన్ ప్లే సంగతులు 
దర్శకుడు వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ కలిసి రాసిన కథకి వంశీ పైడిపల్లి  స్క్రీన్ ప్లే రాసినట్టు టైటిల్స్ లో పడుతుంది. ప్రారంభంలో ఇరవై  నిమిషాలూ అల్లు అర్జున్ పాత్ర ప్రమాదానికి గురికావడం, సర్జరీ చేసి రామ్ చరణ్ ముఖం గా మార్చడమూ జరుగుతాయి. అక్కడ్నించీ వైజాగ్ వచ్చి హత్యలు చేయడం మొదలెడతాడు రామ్ చరణ్. ముఖ మార్పిడి అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రారభమైన సినిమా- ఇక్కడ్నించే స్క్రీన్ ప్లే పట్టు తప్పిపోయి ఆసక్తిని కోల్పోతుంది. ప్రసిద్ధ స్క్రీన్ ప్లే ట్యూటర్ జాన్ ట్రూబీ చెప్పే పొరపాట్లలో మొదటిది ఇదే- స్టోరీ ఐడియా ఒరిజినల్ ది  కాకపోవడం, ఆ ఐడియాని తమ వంతుగా డెవలప్ చేసుకోవడానికి రాంగ్ జెనర్ ని ఎంపిక చేసుకోవడం, లేదా ముందే నిర్ణయించుకున్న ఫలానా ఫలానా సినిమాల్లోని కథనాలని ఆ అయిడియాలోకి జోప్పించడమూ చేస్తారు తప్ప,  అరువుదెచ్చుకున్నఆ  స్టోరీ ఐడియాకి తగిన తమదైన ఒరిజినల్ కథనాన్ని సృష్టించే పాపానే పోరు.

హిట్ సినిమా స్క్రిప్ట్ అంటే  హై కాన్సెప్ట్ నేపధ్యంతో భారీ బిల్డప్ ఇవ్వడమే అనుకుంటారు. మరి ఆ బిల్డప్ కి తగ్గ కథనాన్ని జోడించడం ఓ రెండు మూడు సీన్లవరకే చేసి చేతులేత్తేస్తారని కూడా అంటాడు ట్రూబీ.

సరిగ్గా ఇదే జరిగింది. మొదట్లోనే వైజాగ్ వచ్చి హత్యలు చేయడం మొదలెట్టగానే టెన్షన్ గ్రాఫ్ ఒక్కసారి పడిపోయింది. కారణం  ఎన్నుకున్న హై కాన్సెప్ట్ ఐడియా తిరుగు ముఖం పట్టడం. అతను అంతలోనే వెనక్కి వైజాగ్ కి రావడమే కథని వెనక్కి తిప్పేసింది. కొత్త ముఖంతో  హైదరాబాద్ లో కొత్త శత్రువులతో అప్పుడే  కొత్త కథ మొదలై పోయి వుంటే,  టైం అండ్  టెన్షన్ గ్రాఫ్ అమాంతం పైకి లేచి కథ ముందుకు పరుగులెత్తేది! 

తనకు సంబంధం లేని ఆ కొత్త శత్రుత్వం కూడా పేలవమైన పాతచింతకాయ - కాలంచెల్లిన  రాజకీయ గూండాయిజం తో కాకుండా, ముఖమార్పిడి అంతటి సంచలన ఎత్తుగడకి మించిన స్థాయిలో ఉన్నప్పుడే హై కాన్సెప్ట్ కి న్యాయం చేసినట్టు. 

ఇలా లేకపోవడం వల్ల ఫస్టాఫ్ లో అల్లు అర్జున్ పాత్ర వైజాగ్ లో గూండాయిజం తో తలపడినట్టే, సెకండాఫ్ లోనూ  రామ్ చరణ్  కథకి ఫ్లాష్ బ్యాక్ లో సృజనాత్మకత లోపించి, అలాటి గూండాయిజం తోనే కథ నడిఛి- రిపీటీషన్ బారినపడి  ఆ సెకండాఫ్ కూడా  మరీ డల్ అయిపో యింది. 


సినిమాలో టెన్షన్ ఫ్యాక్టర్ లేదా థ్రిల్ మిస్సవడానికి ప్రథమార్ధంలో, ద్వితీయార్ధంలో ఓకే తరహా కాలం చెల్లిన కథలు కొనసాగడం ఒక కారణమైతే,  ఈ కథలు కూడా స్ట్రక్చర్ లో లేకపోవడం అసలు కారణం. ప్రథమార్ధంలో సత్య, చరణ్ లా  వైజాగ్ కి తిరిగివచ్చి ప్రతీకారం తీర్చుకున్నాక,  ధర్మా గ్యాంగ్ మనిషి అతన్ని చూసి గుర్తుపట్టడం అనే మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ -1 ) దాదాపు గంట సేపటికి వస్తుంది. ఆ తర్వాత పదిహేను నిమిషాల్లోనే ఇంటర్వెల్ పడిపోతుంది. ఒకసారి సారి ఈ క్రింది పటాన్ని గమనిస్తే... మలుపు యాక్ట్ -1 విభాగంలో, ప్లాట్ పాయింట్ -1 (రెండవ ఎరుపు రేఖ) దగ్గర రావాల్సింది. ఇది ముందుకు జరిగిపోయి, పించ్ పాయింట్ -1 (మూడో ఎరుపు రేఖ ) దగ్గర వచ్చింది. అంటే యాక్ట్ -2 విభాగంలోకి అతిక్రమించి వచ్చింది. తర్వాత పదిహేను నిమిషాల్లో యాక్ట్ -2 మిడ్ పాయింట్ (నలుపు రేఖ) దగ్గర విశ్రాంతి పడింది.
పించ్ పాయింట్ -1 అనేది ఇంటర్వెల్ కి దారితీసే ఉత్ప్రేరక ఘటనగా రావాలే తప్ప మరోలా కాదు. కానీ ఇక్కడ ప్లాట్ పాయింట్ -1 గా వచ్చింది. పించ్ పాయింట్-1 అసల్లే కుండా పోయింది! ఇలా అంకాలు భంగపడి, వాటి బిజినెస్ సాంతం మూతపడి- స్క్రీన్ ప్లేకి అర్ధమే  లేకుండా పోయింది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో లేనప్పుడు ఏదీ ఆసక్తికరంగా వుండే అవకాశం ఏమాత్రం లేదు.

ప్రేక్షకులనుంచి ఇంకో కామెంట్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ లో ఓ సినిమా, సెకండాఫ్ లో మరో  సినిమా చూపించారని! ఇది రసభంగం కల్గించే ఏకసూత్రత లోపించిన రచనా సంవిధానం. ఫస్టాఫ్ లో వీరూ గ్యాంగ్ మీద పగదీర్చుకుని, ఆ కథ ముగించేసి,  సెకండాఫ్ లో వేరేగా ధర్మా గ్యాంగ్ తో మరో కథ మొదలు పెట్టినట్టు అన్పించడమే ప్రేక్షకుల కి
ఆ  ఫీలింగ్ కలగడానికి కారణం.  ప్రధాన కథలో ప్రారంభ కథ కలగలిసి పోక పోవడం వల్లే ఇలా జరిగింది. ఏ సినిమాకైనా  ఓకే ఒక్క ప్రధాన కథ కథ వుంటుంది. ఇంకేవైనా కథలుంటే అవి ఉప కథలే అవుతాయి. ఈ సినిమాలో వీరూ మీద పగదీర్చుకోవడం, ధర్మా గ్యాంగ్ ని మట్టు  బెట్టడం –ఈ రెండిట్లో ఏది ప్రధాన, ఏది ఉప కథ ఆవుతాయంటే- ధర్మా గ్యాంగ్ తో జరిగేదే ప్రధాన కథ! వీరూ  ముఠాతో జరగాల్సిందంతా  ఉప కథే!

అలాంటప్పుడు ధర్మా గ్యాంగ్ తో జరిగే ప్రధాన కథతో వీరూ గ్యాంగ్ తో కథ అంతర్వాహినిలా వుండాలి. వేరే ముగించేసిన ఎపిసోడ్ లా వుండకూడదు. అంటే, చరణ్ లా సత్య వైజాగ్ లో  వీరూ గ్యాంగ్ ని అంతమొందించడానికి వస్తే, కథ అడ్డం తిరిగి, ధర్మా గ్యాంగ్ కంట పడి అసలు కథ ( ప్రధాన కథ ) మొదలైపోతే- అప్పుడు చరణ్ పాత్రకి పెండింగ్ లో పడ్డ వీరూ మీద ప్రతీకార లక్ష్యంతో కూడిన ఎమోషనల్ యాక్షన్ ఒకవైపు, మరోవైపు తనని చూసి పొరబడ్డ ధర్మా గ్యాంగ్ తో ఫిజికల్ యాక్షన్ అనే ద్వందాలేర్పడి, అది సజీవ పాత్రగా రాణించేది. చివరంటా ఎక్కడా బోరు కొట్టకుండా- రెండు సినిమాలు చూపిస్తున్నారన్న ఫీలింగ్ ఏర్పడకుండా- ఏకకాలంలో ఈ ద్విముఖ కార్యాచరణతో, క్యారక్టర్ అనుక్షణం సంఘటనలు సృష్టిస్తూ- తద్వారా వేడిపుట్టిస్తూ వుండేది. ఆఫ్టరాల్ పంతొమ్మిదో శతాబ్దపు ప్రసిద్ధ నవలా రచయిత జేమ్స్ విలియమ్స్ ఏమన్నాడు? –‘What is character but the determination of incident ? And what is incident but the illumination of character?- అని కాదూ?


క్యారక్టర్ బయోగ్రఫీ బలాదూర్!
రామ్ చరణ్ పాత్ర యాక్టివ్ పాత్రే, పాసివ్ కాదు. కాకపొతే దానికి  ఇన్నర్ (ఎమోషనల్) స్ట్రగుల్, ఔటర్ (ఫిజికల్ ) స్ట్రగుల్స్ తో కూడిన డైమన్షన్స్ పైన చెప్పుకున్న కారణాల వల్ల ఏర్పడలేదు. పూర్వం మహేష్ బాబు నటించిన ‘బాబీ’ అనే సినిమాలోనూ ఈ డైమన్షన్స్ కన్పించవు. బ్యాక్ డ్రాప్ లో బద్ధ శత్రువులైన హీరో హీరోయిన్ల తండ్రుల ఆగడాలతో నగరం అట్టుడికిపోతున్నా- ఈ బ్యాక్ డ్రాప్ తో సంపర్కం లేకుండా హీరో పాత్ర హీరౌయిన్ తో ప్రేమాయణం సాగించడంతో నే సరిపెట్టుకుంటుంది. మొత్తం కథా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో అంతా హీరో కి తెలిసి వుండడ మన్నది  కథనంలో పాటించాల్సిన ప్రాథమిక  సూత్రమే. ఇదిలోపిస్తే పాత్ర ఒట్టి  కటౌట్ లా మిగిలిపోయే ప్రమాదముంది.

అల్లు అర్జున్ ముఖానికి రామ్ చరణ్ ముఖాన్ని అతికించినంత మాత్రాన  శరీరాకృతి, గొంతు, కళ్ళూ వగైరా రామ్ చరణ్ వి వచ్చేస్తాయా?ఇలాటి మాస్ కమర్షియల్ కథలకి కాసేపు లాజిక్ ని పక్కన బెట్టి, సినిమాటిక్ లిబర్టీ( సృజనాత్మక స్వేచ్చ)అనే లైసెన్సు తీసుకుని వాస్తవ దూర కల్పనలకి దర్శకుడు పాల్పడే హక్కు ఎప్పుడూ వుంటుంది. దీన్నే స్క్రీన్ ప్లే పరిభాషలో ‘suspension of disbelief’  అంటారు. అంటే మన అపనమ్మకాల్ని కాసేపు సస్పెండ్ చేసుకుని సినిమాని బేషరతుగా ఎంజాయ్ చేయడమన్నమాట. అలాగనీ ఈ లైసెన్సుని దుర్వినియోగం చేసి ప్రేక్షకుల ఔదార్యంతో అతిగా ప్రవర్తించే అధికారం దర్శకుడికి వుండదు. ‘ఫేస్ ఆఫ్’ అనే హాలీవుడ్ సినిమాలో ముఖ మార్పిడి అదొక గూఢచార సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా గుట్టుగా జరిగే వ్యవహారం. లాజిక్ కి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలూ తలెత్తవు. ‘ఎవడు’ సినిమాలోలా ప్రైవేట్ డాక్టర్ పేషంట్ అనుమతిలేకుండా ఇష్టానుసారం ముఖాన్ని మార్చేస్తే చట్టపరమైన, సామాజిక పరమైన, వ్యక్తిగతమైన సమస్యలెన్నో వస్తాయి. కాబట్టి అరిస్టాటిల్ మహాశయుడు చెప్పినట్టు - ముందు సన్నివేశానికి పునాది నమ్మశక్యంగా ఏర్పాటు చేస్తే , ఆపైన దాన్నాధారంగా ఎలాంటి అసంబద్ధ కామెడీతో నైనా ఒప్పించవచ్చన్నది ‘ఎవడు’ వంటి సీరియస్ కథాంశానికి  కూడా వర్తిస్తుంది.

ఇక్కడ ఒక గొప్ప ఆశయం కోసం మరణించిన పాత్ర ఫ్లాష్ బ్యాక్ లోని చరణ్ పాత్రే తప్ప, చావుతప్పిన సత్య కాదు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం కాడ్నించీ రొటీన్ గా చిత్రించి సరిపెట్టేశారు. మిత్రుడ్ని చంపినందుకు విలన్ని ఢీకొన్నాడు తప్పితే, అసలు మొదట్నించీ  ఆ పాత్ర అంతరంగం, వ్యక్తిత్వం, ప్రపంచం పట్ల, వ్యవస్థ పట్ల దాని దృక్పథం ఏమిటో నిండుతనంతో, సజీవపాత్రలా చూపడంలో విఫలమయ్యారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే, నడుస్తున్న కథకంటే విభిన్నమైన విషయమేదో ప్రేక్షకులు ఫీలవ్వాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తుండి పోవాలి. అలాటిదేమీ ఇక్కడ జరక్క- ఫ్లాస్ష్ బ్యాక్ ఓపెన్ కాగానే- సినిమా ఫస్టాఫ్ లో ఫస్ట్ యాక్ట్ బిజినెస్స నే (సన్నివేశాల్నే) మళ్ళీ చూపిస్తున్నట్టు  తయారయ్యింది.

ఇదిలా  వుంటే, గమ్మత్తుగా కొన్ని పాత్రలు అర్ధాంతరంగా అంతర్ధానమై పోతాయి. రెండో హీరోయిన్ అమీ జాక్సన్, పోలీసు అధికారి పాత్ర  పోషించిన మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ వగైరా పాత్రల్ని కొనసాగించలేక మాయం చేశారు కాబోలు!

సమగ్రమైన కథా కథనాలతో భారీ బడ్జెట్ సినిమాలు కూడా తీయలేకపోవడం దేనికి నిదర్శన మనాలో ఎవరికి  వాళ్ళే నిర్ణయించుకోవాలిక!

-సికిందర్